యుద్ధ భూమిలో శాంతి కోసం ఓ కల!

sathyavati“యుద్ధం పురుషులది. యుద్ధ నిర్ణయాలు స్త్రీలకి వదిలిపెడితే వాళ్ళు పరస్పరం చర్చించుకుని ఆ సమస్యను ఎప్పుడో పరిష్కరించి వుండేవాళ్ళు. అసలు యుద్ధ పర్యవసానాలను భరించేది స్త్రీలే! భర్తల, సోదరుల, ప్రేమికుల, బిడ్డల, మరణ శోకాన్ని భరించేది ఇరువైపులా కూడా స్త్రీలే. అయినా స్త్రీలు యుద్ధాలకి పరష్కారాలు చూపించడం ఎక్కడా వినలేదు.ఆత్మీయుల మరణ శోకపు కంటితడి తుడుచుకునే విరామంకూడా లేకుండానే వాళ్ళు కుటుంబాలకి ఆహారం సమకూర్చాలి. పురుషుల వీరోచిత కార్యాలతో దీన్ని పోల్చడం లేదు నేను. కుటుంబాన్ని చూసుకోడం ఒక గొప్ప విషయంగా స్త్రీలెప్పుడూ భావించలేదు.

తుపాకి పట్టుకుని ఉద్యమంలో పనిచెయ్యని స్త్రీల సేవలు తక్కువవేమీ కావు. తమ దుస్తుల మడతల్లో చీటీలు దాచుకుని చెక్ పోస్టుల మధ్యనుంచీ ధైర్యంగా వెళ్ళి అజ్ఞాతంలో వున్న ఉద్యమకారులకి సందేశాలు చేరవేశారు భోజనాలు అందించారు. పురుషులు ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు, ఒంటరిగా వ్యవసాయం చేసి పంటపండించారు ఇంట్లో పురుషులు చేసే పనులన్నీ చేశారు. ఆ చీకటి దినాలలో కుటుంబం గడవడానికి స్త్రీలు పడ్డ కష్టాన్ని ఎవరూ ఎక్కువ కాలం జ్ఞాపకం వుంచుకోరు. ఎందుకంటే యుద్ధం పురుషులకు సంబంధించినది స్త్రీలది కాదు.”

“యుద్ధంకోసం ఎంత ఉత్సాహంతో పనిచేశారో అంతే ఉత్సాహంతో శాంతికోసం పనిచేస్తే ఎంత బాగుండేది? యుద్ధం స్వల్పకాలంలో ముగియాలి. ఎక్కువకాలం కొనసాగితే అది మనలో శక్తిని చంపేస్తుంది. ఈ యుద్ధం గ్రామాల మధ్య జరిగే యుద్ధం లాంటిది కాదు. ఇదొక పెను యుద్ధం. మనకన్న అతి పెద్దదైన భారత దేశం మనతో వంద సంవత్సరాలైనా యుద్ధం చెయ్యగలదు. మనకి కావలసింది శాంతి. ప్రజల జీవితానికి భద్రత.”

ఈస్టరీన్ కైర్ ఇరలు (Easterine Kire Iralu) వ్రాసిన “బిట్టర్ వర్మ్ వుడ్” అనే నవలలో తుపాకి పట్టుకుని స్వయంగా నాగా విముక్తి ఉద్యమంలో పాల్గొని, తరువాత ఉద్యమపు కలల నుంచీ బయట పడిన ఒక స్త్రీ అనేమాటలు ఇవి. ఇటీవల హిందూ లిట్ ఫర్ లైఫ్ పోటీలో షార్ట్ లిస్ట్ లో వచ్చిన అయిదు నవలల్లో ఒకటి. ఒక శక్తిమంతమైన నాగా సాహిత్యకారిణి సంయమనంతో వ్రాసిన నవల ఇది.

09TH_EASTERNINE_KI_1359464e

1937 లో జన్మించి 2007 లో హత్యకు గురైన మోసె జీవిత కథగా సాగే ఈ నవలలో నాగా విముక్తి ఉద్యమ చరిత్ర కూడా సమానాంతరంగా సాగుతుంది.

నాగా తెగల జీవితం వాళ్ల ఆచారవ్యవహారాలు, వాళ్ల శాంతియుత జీవనం, తెగల మధ్య సమానత్వం పరస్పర ప్రేమాభిమానాలు వర్ణిస్తూ మొదలై ఆ జీవితాల్లోకి వచ్చిపడిన మార్పుల మీదుగా సాగుతూ కళ్ళఎదుట జరుగుతున్న దౌర్జన్యాలను చూసి భరించలేక ఎంతోమంది యువకులు ఉద్యమంలో చేరడం ఉద్యమం నుంచీ బయటికి రావడం, తరువాత ఉద్యమంలో చీలికలు, ఒకర్నకరు చంపుకోడం అదొక కల్లోల భూమిగా మారి సామాన్య ప్రజలకి ఇంటా బయటా భద్రతలేకుండా పోయిన కాలం దాపరించి మోసే. అతని వంటి అనేక మంది హత్యకు గురవడం స్థూలంగా కథ.

1832 లో ఈశాన్యప్రదేశాలను ఆక్రమించిన బ్రిటన్ ని, భారతదేశాన్ని విముక్తి చేసినట్టే, తమనూ విముక్తం చెయ్యమనీ తమకుభారతదేశంలో చేరే ఉద్దేశం లేదనీ నాగా ప్రజలు కోరుతూనే వున్నారు.కానీ బ్రిటన్ తను ఆక్రమించిన భూభాగం మొత్తంఇండియాకు ధారా దత్తం చేసింది. తామెప్పుడూ భారతదేశంలో ఒక భాగం కారు కనుక తమది వేర్పాటు ఉద్యమం కాదని అంటారు వాళ్ళు.నాగా ప్రజలు నివసించే భూభాగాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించి భారత ఆక్రమణ నించీ తమకి విముక్తి కలిగించాలనేదే వాళ్ల ఉద్యమం.

కానీ స్వతంత్రం సాధించిన ఇండియా నాగా ల్యాండ్ ను అస్సాం లో ఒక భాగం చేసింది. అయితే భారత దేశ స్వాతంత్రానికి ఒకరోజు ముందే వాళ్ళు అనధికారికంగా నాగా స్వతంత్ర దినం జరుపుకున్నారు బ్రిటన్ ఆక్రమణకు ముందు నాగా తెగలలో కుల వ్యవస్థ, కులాల ఎక్కువ తక్కువలూ లేవు.తెగలన్నీ సమానమే. ఎవరితెగ ఆచారాలు వాళ్ళు పాటించుకునేవారు నాగా తెగలన్నీ దాదాపు తొమ్మిది పది దాకా వున్నాయి. తరువాత మిషనరీ లొచ్చి చాలమందికి క్రైస్తవం ఇచ్చారు ఇంగ్లీష్ నేర్పారు. క్రైస్తవం తీసుకున్నా పాత ఆచారాలను వదిలిపెట్టలేదు చాలామంది.

అట్లా క్రైస్తవం తీసుకున్నవారిలో మోసే కుటుంబంకూడా ఒకటి. మోసె తల్లి విలా (vilau) పొలంలో పనిచేసుకుంటూ వుండగా నొప్పులొచ్చి( 1937 లో) అక్కడే బిడ్దను ప్రసవిస్తుంది. అక్కడి చాలా మంది స్త్రీలకి అది మామూలే. ఆమె అత్తగారు ఖ్రియెన్యో ( khrienuo) ఆమె పక్క ఇంట్లో వుంటూ. విలా ని కూతుర్లా చూసుకుంటుంది ఒకే వంటిల్లుంటే స్నేహ బంధాలు నిలవవంటుంది ఆవిడ. విలా భర్త లూ ( Luo-o) బిడ్దను చూసి మురిసిపోతాడు. కానీ తరువాత కొద్దిరోజులకే అడవిలో ఒక చెట్టుకొట్టుకురావడానికి వెళ్ళి దానికిందపడి మరణిస్తాడు. అత్తాకోడళ్ళిద్దరూ పొలంలో పనిచేసుకుంటూ మోసె ని ముద్దుగా పెంచుకుంటూ వుంటారు.

“బిట్టర్ వర్మ్ వుడ్” అనేది ఘాటైన వాసన కల ఆకులున్నఒక మొక్క మనకు దొరికే దవనం, మాచిపత్రి జాతికి చెందినది. దీని పసరు గాయాలను మాన్పుతుంది. అంతేకాదు ఒక రెమ్మ జేబులో పెట్టుకున్నా దుష్ట శక్తులని అడ్దగించే రక్షరేకులా పనిచేస్తుంది. మనం కూడా దుశ్చర్యలకు పాల్పకుండా చేస్తుందని నమ్ముతారు నాగాలు. “ఇపుడదే కావాలి మనకి,” అంటుంది రచయిత్రి. ఈ శీర్షిక ఒక మెటఫర్. ఉత్సుకతతో చదివించే నవల.
మోసే ఆరేళ్ళొచ్చి స్కూల్ కి పోదామనుకునే వేళకి జపాన్ యుద్ధం వల్ల స్కూళ్ళన్నీ మూతపడ్డాయి వాళ్ళ తెగలో అనేకమందిలాగానే బాంబుల భయానికి మోసే కుటుంబం కూడా కోహిమా నుంచీ వెళ్ళిపోయి వేరే వూళ్ళోతలదాల్చుకోవలసి వచ్చింది. అప్పుడే అతను ఆకాశంలో ఒక విమానం మంటలు చిమ్ముతూ కూలిపోవడం చూశాడు. యుద్ధం ముగిసి స్కూళ్ళు తెరిచేసరికి మోసేకి ఏడేళ్ళొచ్చాయి.

ఒక మిషన్ స్కూల్లో చేరిన మోసేకి నీట్యూ ( nietuo) తో స్నేహమైంది, నీట్యూ కన్న మోసే కి గ్రహణ శక్తి ఎక్కువగా వుండేది. అతను స్కూల్లో నేర్చుకున్న ఇంగ్లీష్ తల్లికీ నానమ్మకీ చెబుతూ వుండేవాడు. తల్లికి ఇంటిపనిలో సాయం చేసేవాడు పొలం పనిలోనూ సాయం చేసేవాడు. వేరు వేరు ఇళ్ళల్లో వున్నా ఆ ముగ్గురిదీ ఒక ప్రేమ మయమైన కుటుంబం. అప్పుడు వాళ్ళొక చిన్న ట్రాన్సిస్టర్ రేడియో కొనుక్కున్నారు అది వాళ్ళ చిన్న ఇంటిని ప్రపంచంతో కలిపింది.అందులో రోజూ ఇంగ్లిష్ వార్తలు విని తల్లికీ నానమ్మకీ చెప్పేవాడు మోసె. నానమ్మ కి అవి విని మనమడి చేత చెప్పించుకోడం ఎంతిష్టమో! గబగబ పన్లు చక్కబెట్టుకుని వచ్చి కూర్చునేది.

1947 నాటికి మోసె మూడో తరగతిలోకొచ్చాడు.

ఆసంవత్సరం చాలా విశేషాలు చెప్పింది రేడియో! బ్రిటిష్ వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోయారు దేశ విభజన గురించిన వార్తలే వార్తలు! ఇండియాలో ముస్లిమ్ ల హత్యలు,పాకిస్తాన్ లో హిందువుల హత్యలు!! తమ పొరుగువారిని చంపుకోడం నిజంగా ఎంత పిచ్చితనం అనుకున్నారు ఆ అత్తాకోడళ్ళు. రోడ్డుమీద నడిచిపోయే వాళ్ళు, స్కూల్లో పిల్లలు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే మాటల్లో మోసె కి “నాగా విముక్తి” అనేమాటకుడా ఎక్కువ వినబడింది. నాగా ప్రజలు చాలా మంది ఇండియానుంచీ స్వతంత్రం కోరుకుంటున్నారని. అతని స్నేహితుడు నీట్యూ తండ్రి చెప్పాడు కొంతమంది గాంధీజీ దగ్గరకు వెళ్ళి తమకు స్వతంత్ర నాగా దేశం కావాలని అడిగారనీ దానికి గాంధీజీ మద్దతు ఇస్తానన్నారనీ చెప్పాడు.

ఒక రోజు రేడియో గాంధీ హత్య వార్త చెప్పింది. గాంధీ ఎవరు ఏమిటీ అని ఆముగ్గురూ మాట్లాడుకున్నారు.తను స్కూల్లో విన్నవీ పాఠాల్లో తెలుకున్నవీ చెప్పాడు మోసే ఆడవాళ్ళిద్దరికీ. గాంధీ దేశానికి ప్రధాన మంత్రి కాదు ప్రధాన మంత్రి వేరే వున్నాడు ఆయన పేరు నెహ్రూ ఆ ఇద్దరిపేర్లూ ఎప్పుడూ కలిసి వినిపించినా వాళ్ళూ అన్నతమ్ములు కారు. ఒక రోజు చర్చికి వెళ్ళినప్పుడు తెలిసింది,నాగాలకు స్వతంత్రం కావాలని వారిని ఇండియాలో విలీనం చెయ్యొద్దని వ్రాసినందుకు ఫిజో అనే ఆయన్ని ఇండియా ప్రభుత్వం అరస్ట్ చేసిందని. అప్పుడు నానమ్మ అంది “అవును నాగాలు ఇండియాలో ఎందుకు చేరాలి? వాళ్ళెప్పుడూ ఇండియాలో భాగం కారు” అని. “మనం జీసస్ ని ప్రార్థించాలి ఆయన్ని త్వరగా విడుదల చేయించమని. పాపం ఆయన పిల్లలు ఆయన కోసం ఎంత తపిస్తున్నారో కదా?” అంది.

1950 నాటికి మోసే ఆరో తరగతిలోకి వచ్చాడు. ఒకరోజు వాళ్ళు సాయంత్రం చలిమంట దగ్గర కూచున్నప్పుడు విలా చెప్పింది “నేనివాళ పొలం నుంచీ త్వరగా వచ్చాను. రోడ్డు మీద చాలా సైనిక వాహనాలు వున్నాయి.చాలా సేపు అవి అక్కడే ఆగి వున్నాయి మాకు చాలా భయం వేసింది వాళ్ళు మమ్మల్నే చూస్తున్నారు.”

“అవును జపాన్ యుద్ధం అప్పుడు ఒకామెని సైనికులు ఎత్తుకెళ్ళారు.తిరిగొచ్చాక చాలా కాలం ఆమె ఏడుస్తూనే వుండేది,” అన్నది నానమ్మ. స్కూల్లో కూడా పిల్లల్ని బయట తిరగవద్దని చెప్పారు. ఇప్పుడు జపాన్ యుధ్ధమప్పుడు ఎంతమంది సిపాయిలున్నారో అంతమందికన్న ఎక్కువ వున్నారు. మోహరించిన భారత సైన్యం అది.

అప్పుడు డిసెంబర్ లో ప్లెబిసైట్ జరిగింది. అందరూ వెళ్ళి మాకు స్వతంత్రం కావాలనే అర్జీ మీద వేలుముద్రలు వేసొచ్చారు. కానీ ఇండియా ప్రభుత్వం దాన్ని లెక్కపెట్టలేదు ఒకరోజు కోహిమాలో ప్రొటెస్ట్ మార్చ్ జరిగింది. వాళ్లమీద పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. గుంపు చెల్లాచెదరైనా ఒకతను గుండుతగిలి చనిపోయాడు పట్నంలో కర్ఫ్యూ విధించారు.

1952 లో ఇండియాలో సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. నాగాల్యాండ్ లోనూ వచ్చాయి,కానీ అక్కడంతా ఎన్నికలు బహిష్కరించారు. పోలీసులు చాలామందిని తీసుకుపోయి బలవంతంగా బ్యాలెట్ పేపర్లమీద వేలిముద్రలు వేయించారు అట్లా మోసే తల్లీ నానమ్మ కూడా వేసొచ్చారు. ఇండియా కి ఎవరు ప్రధాన మంత్రి అయితే మనకేమిటి? మనం ఎందుకు వోట్లు వెయ్యాలి? వాళ్ళు చేస్తున్నది చాలా తప్పు అన్నది నానమ్మ. సైన్యం ధాన్యపు కుప్పల్ని తగలబెడుతోదనీ విచక్షణారహితంగా కాల్పులకి తెగబడి అమాయక పౌరులను పొట్టన పెట్టకుంటోందనీ మోసే వింటున్నాడు. కానీ ఈ వార్తలేవీ వాళ్ళు వినే రేడీయోలో రావు. చాలామంది యువకులు అజ్ఞాతంలోకి వెళ్ళి నాగా విముక్తి ఉద్యమంలో చేరిపోతున్నారు. పెళ్ళయిన వాళ్లు మాత్రమే ఊళ్ళల్లో మిగిలివుంటున్నారు తమ మీద జరుగతున్న దౌర్జన్యానికి నాగాప్రజలు కోపోద్రిక్తులౌతున్నారు. చాలా చోట్ల సైనకుల చేతిలో స్తీలు అత్యాచారాలకు గురౌతున్నారు. ఎవరికీ ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. అప్పుడే ఒక సైనికుడు పేల్చిన తూటా పొలంనుంచీ వస్తున్న నానమ్మను బలితీసుకుంది.

ఆమె మరణం మోసే ను బాగా కదిలించింది. 1959 నాటికి మోసేకి 19 ఏళ్ళొచ్చాయి.

అతని తల్లి విలా కి అత్తగారి మరణం తరువాత ఏళ్ళకిమించిన వృద్ధాప్యం వచ్చినట్లయింది. స్కూల్ ఫైనల్ అవకుండానే మోసే చదువు మానేశాడు. సైనికుల ఆగడాలు చూస్తున్నకొద్దీ ఆగ్రహావేశాలు అదుపులోకి రావడం లేదతనికి. ఒకరోజూ అతనూ అతని స్నేహితుడు నీట్యూ అజ్ఞాత నాగా సైనికుల్లోచేరిపోయి అడవులకు వెళ్ళిపోయారు. తల్లి తన కొడుక్కి హృదయపూర్వకంగా అనుమతి ఇచ్చింది. ఏడు సంవత్సరాల కాలం అతను అడవులలోనే వుండిపోయాడు గెరిల్లా శిక్షణ తీసుకున్నాడు అక్కడ అతనికి తనతో పాటు గెరిల్లా శిక్షణ పొందుతున్న నీల్హౌనో (nielhounuo) పరిచయమౌతుంది. ఆమె చాలా ధైర్యవంతురాలు. అంతా ఆమెని రైఫిల్ గర్ల్ అంటారు.

మోసె ప్రాణానికి తెగించి ఒకరోజు కోహిమా వచ్చి రహస్యంగా నాగా పతాకం ఎగరేసి పోతాడు. ప్రభుత్వ సైన్యాలకూ ఉద్యమకారులకూ మధ్య కాల్పులూ ఎదురుకాల్పులూ మొదలౌతాయి. వీరిద్దరిమధ్య సామాన్య పౌరులు ప్రాణాలు పోగొట్టుకూంటూ వుంటారు. ఆపరిస్థితుల్లో అప్పటివరకూ అస్సాంలో ఒక భాగంగా వున్న నాగా ప్రాంతం 1963 లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తుంది. ఈ పరిణామం ఉద్యమకారులలో క్రోధాగ్ని రగిలిస్తుంది కొందరు కోహిమాకు వెళ్ళి రాష్ట్రావతరణ ఆపాలంటారు. కొందరు అప్పటికే చాలా ప్రాణ నష్టం జరిగంది కనుక అట్లా చెయ్యడం మంచిది కాదంటారు. తీవ్రమైన చర్చలు జరగుతాయి. సీనియర్ నాయకులు హింస తగ్గించమంటారు. చివరికి వీరిమాట నెగ్గింది. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసే చర్యలు ప్రారంభించింది.

అందులో భాగంగా ఉద్యమాన్ని వదిలి జన జీవనంలో కలిసే వారికి కొంత డబ్బో భూమో ఇస్తానని ప్రకటించింది. ఎక్కువమంది ఉద్యమ కారులు ఇందుకు ఇష్టపడలేదు. చాలా కొద్దిమంది మాత్రమే బయటికొచ్చారు. ప్రభుత్వ సైనికులకీ ఉద్యమ కారులకీ మధ్య కాల్పులు ఉధృతమైన సమయంలో ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించింది. అప్పుడే మోసే తల్లి విలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోదని తెలసి అతను తన స్నేహితుడు నీట్యూ తో కలిసి ఇంటికి వస్తాడు. “నేను రమ్మనలేదు కదా,” అంటుంది తల్లి. ఆమె క్యాన్సర్ చివరి దశలో వుంది. మోసే తల్లిదగ్గరే వుండిపోతాడు. తనకి అజ్ఞాత జీవితంలో పరిచయమైన నీల్హౌనో కూడా బయటికి వచ్చేసింది ఆమెను పెళ్ళిచేసుకుంటాడు. అతనికి ప్రభుత్వం ఉద్యోగమేదో ఇస్తానంటే ఇష్టం లేక కిరాణా దుకాణం పెట్టుకుంటాడు. అతని ఉద్యమ జీవితం ముగిసింది. అతనికొక కూతురూ అతని స్నేహితుడు నీట్యూకి కొడుకూ జన్మిస్తారు.

ఇంక అక్కడనంచీ రాష్ట్రంలో జరిగే సంఘటనలన్నీ ఆ స్నేహితుల సంభాషణల ద్వారా చర్చల ద్వారా మనకి అర్థం అవుతాయి. మోసే కూతురుకి గానీ నీట్యూ కొడుక్కిగానీ ఉద్యమం మీద ఆసక్తిలేదు. అతను చదువుకుని స్కూల్లో టీచరౌతాడు ఆమె స్వంతంగా నేత పని ప్రారంభిస్తుంది వాళ్ళిద్దరూ పెళ్లిచేసుకుంటారు. మోసే మనమడు నీబో(niebou) డిల్లో శ్రీరామ్ కాలేజీలో చదువుకోడానికి వెడతాడు. అక్కద ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపట్ల, విద్యార్థినుల పట్ల తోటి విద్యార్థులూ పౌరసమాజం చూపుతన్న వివక్ష వారిపై జరిగే దాడులూ దేశంలోని వివిథ ప్రాంతాలలో వారిపై చూపుతున్న జాతివివక్ష గమనిస్తాడు. అవడానికి తామందరూ భారత పౌరులే మరి!

ఒక దశలో చదువుమానుకుని వెళ్లిపోదాం అనుకుంటుండగా అతనికి రాకేశ్ అనే సహవిద్యార్థితో పరిచయం అవుతుంది. అతను అరవైల్లో నాగాల్యాండ్ లో పనిచేసిన హిమ్మత్ అనే ఆర్మీ కమాండెంట్ మనుమడు. ఆయన్ని కలుస్తాడునీబో. రిటైరైన హిమ్మత్ కి నాగాల్యాండ్ అంటే ఇష్టం ఆయన ద్వారా ఆర్మీ దృష్టి నుంచీ నాగా ఉద్యమాన్నీ ప్రభుత్వ వైఖరినీ చూస్తాం మనం. చాలాకాలం ఇంటికి దూరంగావుండడం కొత్త ప్రదేశం కొత్త భాష, తమలో ఎవరికి ఏం జరిగినా రెచ్చిపోయి కాల్పుల జరపడం వంటి సైనికుల మానసికావస్థలను గురించి చెప్పి అప్పటి సైనికుల చర్యల గురించి, “నేను ప్రభుత్వ ఆజ్ఞాబద్ధుడను.” అంటాడు. కానీ నాగాఉద్యమాన్ని సమర్థిస్తాడు. అజ్ఞాత సైనికుడైన మోసేని చూడాలనుకుంటాడు. మోసే 2007 లో హత్య కి గురౌతాడు. నాగా ఉద్యమ చరిత్రే కాదు, మొత్తం కుటుంబసభ్యుల మధ్య స్నేహితుల మధ్య భార్యాభర్తల మధ్య అత్తాకోడళ్ల మధ్య పిల్లల తల్లితండ్రుల మధ్య ప్రేమానురాగాలు ఎట్లా వుండాలో చెబుతుందీ నవల. అందరూ ఆలోచనాపరులే. అందరూ మనుషుల్ని ప్రేమించేవారే. చివరికి తన తాత మోసే ని చంపిన వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకోదలుచుకోలేదు నీబో.

ఫాక్షనిష్టులేం చేశారు?

దుకాణాలపెట్టుకునో మరో విధంగానో బ్రతుకుతున్న సీనియర్ ఉద్యమకారులపై దాడులు చేశారు అవమానించారు. కొంతమందిని చంపారు. బాగా చదువుకుని అందమూ ఆస్తీ వుండికూడా ఉద్యమంలో చేరి ఫాక్షన్ల మధ్య ఐక్యతకోసం ప్రయత్నించిన మాయంగర్ అనే యువకుణ్ణి హత్య చేసారు. అటు ప్రభుత్వమూ ఇటు ఫాక్షనిష్టులూ కూడా మోసే వంటి పాత ఉద్యమకారులపై నిఘా పెట్టారు. బలవంతపు వసూళ్ళకి దిగారు. దీనివలన నాగాప్రజలుకూడా ఇన్సర్జెన్సీని సమర్థిస్తున్నారని ఇండియన్ ప్రెస్ లో వార్తలొచ్చాయి. కిల్లీ కొట్టుపెట్టుకుని జీవిస్తున్న బీహారీ యువకుడిని డబ్బు కోసం కాల్చబోతే అడ్డుపడబోయిన మోసేని కాల్చేశారు. జనం మధ్యలో నిర్భీతిగా కాల్పులు జరిపి తుపాకి భుజానికి ఆనించుకుని వెళ్ళిపోయారు.

ఇప్పుడు చీలిపోయిన ఉద్యమ గ్రూపులన్నింటినీ ఒక చోటికి తెచ్చి వాళ్లమధ్య అవగాహన కల్పించే శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హత్యల కొంత తగ్గినట్లే కనిపిస్తున్నాయి. ఈ కన్నీటి కల్లోల ప్రాంతంలో శాంతి ప్రసరించే ఛాయలు కనపడుతున్నాయని ముందుమాటలో అంటుంది ఈస్టరీన్. ఈ నవలలో ప్రధాన పాత్ర అయిన మోసే తన బంధువు దే దేననీ సంఘటనలన్నీ యదార్థాలనీ చెప్పింది. ఇందులో హిమ్మత్ కూడా నాగాల్యాండ్ లో పనిచేసి వెళ్ళిన ఒక కమాండెంట్ కు పేరు మార్పేననీ అన్నది. ఈ పుస్తకం చివర పొందుపరిచిన నికేతు ఇరాలు ప్రసంగంలో ఇట్లా అంటాడు, “సార్వభౌమత్వం కాకుండా మరేదైనా అంగీకరించడానికి నాగాలు సిద్ధంగా వుంటే డిల్లీతో ఒక గౌరవనయమైన అంగీకారయోగ్యమైన అవగాహనకు రావడం కష్టం కాదు.అది ఇరువైపులకు మంచిది….ఇప్పుడు చీలిపోయిన ఉద్యమ గ్రూపులన్నీ ఒక అవగాహనకు వచ్చి డిల్లీతో ఒక ఒప్పందానికి రావడం మంచిది తరవాతేం చెయ్యాలో భవిష్యత్తు తరాలు నిర్ణయించుకుంటాయి. ఇప్పుడు కావాల్సింది శాంతి, అభివృద్ధి.”

యుద్ధాలు నిర్ణయించేది సైనికులూ కాదు ప్రజలూ కాదు రాజకీయ నాయకులు, అని అర్థం అయింది వాళ్లకి.

“బిట్టర్ వర్మ్ వుడ్” అనేది ఘాటైన వాసన కల ఆకులున్నఒక మొక్క మనకు దొరికే దవనం, మాచిపత్రి జాతికి చెందినది. దీని పసరు గాయాలను మాన్పుతుంది. అంతేకాదు ఒక రెమ్మ జేబులో పెట్టుకున్నా దుష్ట శక్తులని అడ్దగించే రక్షరేకులా పనిచేస్తుంది. మనం కూడా దుశ్చర్యలకు పాల్పకుండా చేస్తుందని నమ్ముతారు నాగాలు. “ఇపుడదే కావాలి మనకి,” అంటుంది రచయిత్రి. ఈ శీర్షిక ఒక మెటఫర్. ఉత్సుకతతో చదివించే నవల.

Download PDF

6 Comments

  • Rajesh Devabhaktuni says:

    పుస్తకం గురించిన వివరము / సమీక్ష బాగుంది.

    మీ సలహాతో “Purple Hibiscus” చదివాను. దాని ప్రభావం నుండి ఇకా బయటపడక ముందే “యుద్ధం” గురించిన ఇంకొక నవల. అయినా ఇది మన దేశానికి సంభందించినది కాబట్టి తప్పక చదవాలి. :)

  • నాగా ల ఆచారాలు, జీవన విధానం గురించి, సామాజిక ఆర్ధిక పరిస్థితుల గురించి కొంత తెలుసు.ఇప్పుడు ఈ నవలా పరిచయం ద్వారా నాగాలాండ్ ప్రజలు వాళ్ళ అస్థిత్వానికై ఏ విధంగా పోరాడుతున్నారో, యుద్ధం ఎందుకు వస్తుందో అన్నది సూక్ష్మంగా గ్రహించ గల్గాను. తప్పకుండా ఈ నవల చదివి తీరాలి అన్నట్లు మీ పరిచయం చాలా బావుంది

    ధన్యవాదములు

  • నవల చదవాలని ఆసక్తిగా ఉన్నదండి. ఈశాన్య రాష్ట్రాల విషయంలో భారత సైన్యం చాలా దారుణాలు చేసిందని మరో ఋజువు.

  • రమాసుందరి says:

    చరిత్ర తో మిళితమై రాసే రచనలు చిరస్థాయిగా నిలిచి పోతాయి. మీ పరిచయం ఆత్యంతము ఆసక్తికరంగా ఉంది. చదువుతాను.

  • ఆద్యంతము ఆసక్తిగా చదివించారు. ఈశాన్య రాష్ట్రాలలోని అనిశ్చతత, సాధారణ పౌరుల జీవితాలలను అల్లకల్లోలం చేసే రాజకీయ పరిణామాలు మిళితమైన నవల అయ్యుంటుంది. తప్పక చదవాలి అనే ఆసక్తిని కలిగించారు.

  • Rammohan Rao says:

    నాగా ల్యాండు గురించి చాలా విషయాలు తెలియజేసే నవలను చాలా ఆసక్తికరంగా పరిచయంచేసిన మీకు కృతజ్ఞతలు.

Leave a Reply to Rammohan Rao Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)