హేతువాదం లోతుల్లోకి … “ఏది నీతి, ఏది రీతి”?

గత 30 ఏళ్ళుగా రావిపూడి వెంకటాద్రి సంపాదకత్వాన వస్తున్న ‘హేతువాది’ మాసపత్రిక లో నరిసెట్టి ఇన్నయ్య రాసిన వ్యాసాలన్నిటినీ ఇసనాక మురళీధర్ సేకరించి, క్రోడికరించి “ఏది నీతి, ఏది రీతి” అనే పేరుపై e-book గా వెలువరించారు. ఇది ఇంకా పుస్తకంగా రావలసి ఉంది.

ఈ ఇ-పుస్తకంలో 50 వ్యాసాలున్నాయి. కొందరు ప్రముఖ హేతువాద నాయకుల దృక్పథాల గురించిన వ్యాసాలతో పాటు హేతువాద సమస్యలు, ఎదుర్కొంటున్న చిక్కులు, వైజ్ఞానిక దృక్పథంతో సూచిస్తున్న మార్గాంతరాలూ ఇందులో ఉన్నాయి.

జ్యోతిష్యం, సెక్యులరిజం, హోమియోపతి, మెస్మరిజం వంటి సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. కొన్ని సమస్యలు కేవలం భారతదేశానికి చెందినవి. ఉదాహరణకు అయ్యప్ప, రామకృష్ణపరమహంస, వివేకానందుడు, అరవిందాశ్రమం ఇందులో పేర్కొనదగినవి. గాంధీజీ గురించిన వ్యాసం ప్రత్యేక కోణంలో చూపిన తీరు గమనార్హం. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ గురించి శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషణ చేశారు. అమెరికాలో జేమ్స్ రాండీ వలె, ఇండియాలో ప్రేమానంద్ నిర్వహించిన పాత్ర, బాబాల, మాతల మోసాలను వెల్లడించిన తీరు, జ్యోతిష్యాన్ని, దివ్యశక్తులను ఛాలెంజ్ చేసి ఎండగట్టిన తీరు విశిష్టమైనది.

మరణించిన తరువాత ఆత్మ ఉన్నదని, స్వర్గానికి పోతుందని నరకానికి పోకుండా అడ్డుపడే పూజలూ, క్రతువులూ ఉన్నాయని నమ్మించి వ్యాపారం చేసే ధోరణి వైజ్ఞానికంగా ఎంత భ్రమపూరితమైనదో చూపడం కనువిప్పు కలిగిస్తుంది. త్రిపురనేని గోపీచంద్ హేతువాదిగా విజృంభించి, ఆధ్యాత్మిక వాదిగా దిగజారిపోయిన ధోరణి గురించి చదువుతుంటే చాలా ఆసక్తి గా వుంటుంది. భారతదేశంలో సెక్యులరిస్టు ఉద్యమాన్ని ఎంతో కట్టుదిట్టంగా ప్రారంభించి నిలదొక్కుకునేటట్లు చేసిన ఎ.బి.షా పాత్ర గమనార్హం. ర్యాడికల్ హ్యూమనిస్టు నాయకుడిగా మల్లాది రామమూర్తి దేశంలో నిర్వహించిన పాత్ర వెలుగులోకి తెచ్చిన వ్యాసం ముఖ్యమైనది . ఎమ్.ఎన్.రాయ్ సాహిత్యాన్ని పరిష్కరించి ప్రచురించిన శిబ్ నారాయణ్ రే గొప్ప చరిత్రకారులుగా మిగులుతారు. పోస్ట్ మోడరనిజం పేరిట కొందరు ఆధునికులు వేస్తున్న వెర్రితలల ధోరణి ని కూడా ఈ వ్యాసాల్లో నరిసెట్టి ఇన్నయ్య చర్చించారు .

కులం భారతదేశానికి ప్రత్యేకమైనది. అది మతం ద్వారా వచ్చింది. దాన్ని హేతువాదులు ఎలా చూస్తారు అనే విషయం కొత్త ఫక్కీలో నడిచింది. మూఢనమ్మకాలలో మనకు ఏమాత్రం తీసిపోని అమెరికా ఎన్ని వక్ర మార్గాలను అనుసరిస్తున్నదో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో చదువు, విజ్ఞానం, సంస్కారం ఏమయ్యాయని ఆశ్చర్యపోయేవిధంగా అక్కడ మూఢనమ్మకాలు అమలులో ఉన్నాయి. చదువుకున్నవారిలో ఇలాంటి నమ్మకాలుండటానికి మూలకారణాలేంటి? అనేది లోతుగా పరిశీలించిన దానిని బట్టి ఇండియాకూ, అమెరికాకూ పోలికలు కనిపిస్తాయి.

అంబేద్కర్ పేరిట అన్ని రాజకీయపక్షాలూ ఓట్లకోసం, సీట్లకోసం పడుతున్న పాట్లు, వేస్తున్న ఎత్తుగడలు చూపటం ఈ పుస్తకంలో మరొక విశేషం. వెంకటేశ్వర సుప్రభాతంలో తెలుగు ఎందుకు ఉండదు? సంస్కృతంలోనే ఎందుకు అనే విషయాన్ని వెనిగళ్ళ సుబ్బారావు రాసిన అంశం వెలుగులోకి తెచ్చింది.

పిల్లల విషయాల్లో కూలంకషంగా అన్ని కోణాలను పరిశీలించటం ఈ గ్రంథంలో మకుటాయమానం. అలాగే సెక్యులరిజం గురించిన అంశం కూడా చాలా నిశితంగా పరిశీలించటం గమనించవచ్చు. సెక్యులరిజాన్ని గురించి అందరూ భజన చేస్తుండగా అసలు విషయం ఏమిటి? అని చూడటం గమనార్హం. మొత్తం మీద చర్చను పురికొల్పే అంశాలు, వైజ్ఞానిక ధోరణిని పరిశీలించాల్సిన ఆవశ్యకత, గ్రంథం యావత్తూ అంతర్లీనంగా వ్యాపించి వుంటుంది.

భావ స్వాతంత్ర్యం విలువ మాటలలో చెప్పలేనిది. ఈ విలువ ప్రాణం కంటే తక్కువేమి కాదు. ఆస్తికుడిగా ఉండాలా లేక నాస్తికుడిగానా అనేది ఎవరికివారు నిర్ణయించుకోవలసిన విషయం. అయితే కొన్ని మొహమ్మదీయ దేశాలలో ఇలాంటి హక్కు లేదు. అఫ్గనిస్తాన్, ఇరాన్, మాల్దీవులు,మౌరిటానియ, పాకిస్తాన్, సౌది అరేబియ ఇంకా సూడాన్ దేశాలలో నాస్తికత్వం నిషేధింపబడ్డది . ఇక్కడి వ్యక్తుల నమ్మకాలు వారిని మరణదండనకు గురిచేసే ప్రమాదముంది. ఇది ఖచ్చితంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన మానవహక్కుల ఉల్లంఘనే. డా.ఇన్నయ్య పెక్కువిషయాలలో తన అభిప్రాయాలను నిర్భీతిగా వెల్లడించటం ఈ వ్యాసాలలో గోచరమవుతుంది. రచయిత ఇన్నయ్య అమెరికా లోని మేరీలాండ్ లో నివాసముంటున్నారు.

ఈ ఇ-పుస్తకాన్ని ఇక్కడ చదవవచ్చు లేక ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు.

Download PDF

5 Comments

Leave a Reply to prasad Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)