అక్షరాలు కలిసిన వేళ…!

custom_gallery
images not found

డాలస్ అంటే ప్రవాసాంధ్ర రాజధాని. వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒక సభో, సమావేశమో…మొత్తానికి తెలుగు సందడి! అలాంటి డాలస్ లో తానా జరుగుతుందంటే ఇంక ఆ సందడీ అది రేకెత్తించే ఉత్సాహమూ అమితం. పదివేల మందిని ఒక చోట చేర్చిన మెయిన్ హాల్ కార్యక్రమాలూ, పాడుతా తీయగా, జేసుదాస్ కచేరీ లాంటివి అరుదయిన అవకాశాలూ, చిరంజీవి, మోహన్ బాబు, బ్రహ్మానందంల కబుర్లూ…తనికెళ్ళ భరణి సినిమా ‘మిధునం’ యూనిట్ కి జరిగిన సత్కారాలూ, ధిమ్ తానా నాట్య సందోహాలూ…ఇవన్నీ మరచిపోలేని అనుభవాలే! ఈ సందడితో పోలిస్తే సాహిత్య సమావేశాల సందడి తక్కువే.

          కానీ, ఈ సారి డాలస్ సాహిత్య మిత్రులు – మద్దూరి విజయచంద్రహాస్, చంద్ర  కన్నెగంటి, మందపాటి సత్యం, వంగూరి చిట్టెన్ రాజు, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, వురిమిండి నరసింహ రెడ్డి,  సుద్దాల శ్రీనివాస్, జాస్తి  చైతన్య, సింగిరెడ్డి శారద, కాజ సురేశ్, నసీమ్ షేక్, పులిగండ్ల విశ్వనాథం, రాయవరం భాస్కర్   ల  – సారధ్యంలో జరిగిన సాహిత్య సభలు ప్రయోజనకరంగా అనిపించాయి.

          సినిమా పాటని సాహిత్యం గా అంగీకరించలేని స్థితి ఇంకా వుంది.  ఈ సంప్రదాయిక ఆలోచనని బద్దలు కొడుతూ సినిమా పాటల్లోని సాహిత్య విలువల్ని చర్చకి తీసుకు వచ్చే తొలి సభ ఆసక్తికరంగా జరిగింది. పాటల గురువు రామాచారి, గాయని శారదా ఆకునూరి పాటలు పాడగా-  అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, వడ్డేపల్లి కృష్ణ, జొన్నవిత్తుల తమ పాటల నేపధ్యాల్ని వివరించారు.

          మధ్యాన్నం మందపాటి సత్యం అధ్యక్షతన వచనరచనా వైదుష్యంపై చర్చ జరిగింది. ప్రసిద్ధ కథకుడు శ్రీరమణ, వ్యాసకర్త అక్కిరాజు రమాపతి రావు, కథాసాహితి ఎడిటర్ వాసిరెడ్డి నవీన్, రచయిత్రులు వాసా ప్రభావతీ, సూర్యదేవర రామమోహన్ రావు పాల్గొన్నారు. ఇటీవలి వచన సాహిత్య ప్రక్రియల భిన్నత్వాన్ని వక్తలు సింహావలోకనం చేశారు. కోసూరి ఉమాభారతి కథా సంపుటి ‘విదేశీ కోడలు’ని ‘సారంగ’ ఎడిటర్, రచయిత్రి కల్పనా రెంటాల ఆవిష్కరించారు. 2012 కథల సంకలనం  “కథా వార్షిక” ని వాసిరెడ్డి నవీన్ ఆవిష్కరించారు.

          రెండో రోజు “భాష-మనం- సమాజం” సభకి మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షత వహించారు. సభని చంద్రహాస్ నిర్వహించారు. గొల్లపూడి మారుతీ రావు, రేజీన గుండ్లపల్లి, గంజి సత్యనారాయణ, అఫ్సర్, కల్పనా రెంటాల ఈ సభలో వివిధ అంశాల గురించి మాట్లాడారు. ఆ తరవాత జరిగిన పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, గరికిపాటి నరసింహారావుల అవధానం జరిగింది. సాయంత్రం తనికెళ్ళ భరణి “శభాష రా…శంకరా” నుంచి కవితలు చదివి వినిపించారు.

ఎప్పటి నించో కలవాలని అనుకుంటున్న రచయితల్నీ, సాహిత్య మిత్రులనీ కలిశామన్న తృప్తితో ఈ సభలు ముగిశాయి.

ఫోటోలు : కృష్ణ కీర్తి

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)