రంగం పెట్టి

sindhu-2_336x190_scaled_cropp

మన్నెం సింధు మాధురి

 

  వర్తమాన తెలుగు కథా సాహిత్యం లో విశిష్ట స్వరం మన్నెం సింధు మాధురి . ఒక కొత్త కెరటం లా  కథన రంగం లోకి దూసుకు వచ్చిన సింధు మాధురి గుంటూరు జిల్లా లో పుట్టి, బళ్ళారి దగ్గర ఉళెనూరు క్యాంప్ లో పెరిగారు. ఉళేనూరు క్యాంప్ జ్నాపకాలను కథలుగా ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో 25 వారాల పాటు సీరియల్ గా అందించారు.  సింధుమాధురి కథల్లోని స్త్రీపాత్రలు అందరికీ తెలిసిన స్త్రీల జీవితాలు కావు. ఊహాజనిత పాత్రలు అసలు కావు. ఆమె కథలన్నీ స్వానుభవ కథనాలు. ఆ కథనాల్లోని వ్యక్తులు విభిన్న వర్గాలకు చెందిన స్త్రీలు. వివిధ రకాల జీవిత పోరాటాల్లో నలిగిపోయినా మొక్కవోని ధైర్యం తో నిజంగా జీవితాన్ని జీవించిన స్త్రీలు.  కథల  వస్తు,రూపాల చుట్టూ ఉన్న పరిమితుల సంకెళ్ళను  అలవోకగా ఛేదించిన రచయిత్రి సింధుమాధురి.

***

‘‘యావండీ లచ్చీశ్రీమ్మగారూ బాగుండారా? ఏంటి కబురు చేశారంట,’’ అనే మాట ఇనపడింది. అతను మా ఊరి వడ్రంగి వాసుదేవరావు.
‘‘ఏవీ లేదు. కాళీగా ఉంటే మా రంగం  పెట్టికీ, మైలగుడ్డల పెట్టికీ పాలిష్ పెడతావని పిలిచాను,” అంది అమ్మమ్మ.

“మొన్న పట్నం నించి పెద్ద కొట్టాళ్ళు (షో రూమ్) వచ్చారండీ. ఎక్కడన్నారంగంపెట్టి ఉంటే ఎతికి పెట్టమన్నాడు. ఐదేలిప్పిత్తాను.’’

‘‘ఏదో పనివంతుడివి తింటే పదో పరకో తింటావు గందా అని నిన్ను పిలిత్తే మా కొంపలో వాళ్లలాగా నువ్వు కూడా నా సామానం మీదే కన్నేశా. పదినిమిషాల్లో మా స్థలం ఖాళీ చెయ్యక పొయ్యావో నిన్ను సావిడూడిసే పొలికట్టెతో కొడతా,’’ అని తిట్లు మొదలుపెట్టింది. దడిసిపోయిన వాసుదేవరావు కథ ఎదురు తిరగటంతో బతుకుజీవుడా అని ఎట్టాగో బయటపడ్డాడు.

ఇంత లోకి మా అమ్మమ్మకి నేను దొరికిపోయా.

‘‘ఏవే ఎక్కడ ఆడతన్నా. ఊరిమీద బలి తిరుగుతున్నావా. బెజగాడెల్లే పెరిగావు. పనిపాటల్లేవు. ముసల్ది చేసుకోలేక సత్తందని యావన్నా ఉందా. నీకు ఇవరం ఎప్పుడు వచ్చుద్దే,’’ అని అమ్మమ్మ పురాణం ఇప్పింది.

నన్నేదో అనటం ఇని, ‘‘ఏంజెయ్యాలక్కయ్యా,’’ అంటా పక్కింట్లో ఉండే మా కవలమ్మమ్మ వచ్చింది.

‘‘ఏంజెయ్యాలా ఆ ఎలిసిమీద సామానం పారేసి ఎన్నాళ్ల యింది. పోయినేడు కుదరక తోవలా. ఆటి గురించి పట్టిచ్చుకునేది ఎవరు? ఒక్కళ్లన్నా నా మాట ఇంటేనా. అట్టా వదిలేసి రెండేళ్లు అయ్యింది. ఎలికలు, బొద్దింకలు, సాలీళ్లు ఎన్ని గూళ్లు, గుడ్లు పెట్టినయ్యో. తోవటానికి పనిమనిషి నాగమ్మని రమ్మన్నా. ఈ పిల్లలు ఒకళ్లు  పైకెక్కి ఒంపుతా, రెండో వాళ్లందిత్తంటే, నాగమ్మ తోవుతుంటే నేను కడగొచ్చొనుకుంటన్నా. మళ్లీ ఆటిని తుడిసి ఎండలోబెట్టి, కిలువు పట్టకుండా, ఉప్పురవకుండా, నేతిగుడ్డతో తుడవాలి. ఎలిసి దులపాలి. మళ్లీ కొత్తగుడ్డలు పరిసి సామానం పరవాలి. నా సావు కొత్తంది, ఒక్కదాన్నే సేసుకోలేక.’’

‘‘నేను సెయ్యేత్తాలే అక్కయ్యా,’’ అంటా పనికి మమ్మల్ని పురమాయించారు.

ముందుగా రంగంపెట్టి మైలపెట్టి తుడుత్తున్నారు. నేను రంగంపెట్టి ఈపు అరసున్నాలాగా ఉంటే కాసేపు దానిమీద పడుకున్నా. మా ఇంటో భోషాణం పెట్టి, కుండలపెట్టి, మైలగుడ్డల పెట్టి, రాట్నం పెట్టి, గాజుల పెట్టి, బల్లపద్దుల పెట్టి, ఏకులపెట్టి, బొట్టుపెట్టి, ఆఖరిది పెట్టెలకే రారాజు రంగం పెట్టి (రంగూన్‌ పెట్టి). మళ్లీ దీంటో రకాలు. పూలపెట్టి, నగిషీలపెట్టి, బద్దీలపెట్టి. మా పక్కింటో కవలమ్మమ్మ వాళ్లది పూలపెట్టి. బద్దీలపెట్టిలో నాలుగొరసలు. వరసకి నాలుగు నించీ ఎనిమిది సొరుగులు. ఒకొరస మొత్తం తీత్తేగానీ రొండో వరస రాదు. రక రకాల అరలు. అమ్మమ్మ మెడలో చంద్రహారం పెట్టికి ఏసినట్టుగా పైన దండ అతుక్కుని ఉంటది. మూలలన ఇత్తడి బద్దీలు మేం రంగూన్‌ జమిందారులం అన్నట్టు నిక్కు సూపిత్తా ఉంటయ్యి. దస్తావేజులు, పాత పుస్తకాలు, సావుపుటకల కాయితాలు, ఈలునామాలు, అప్పునోట్లు. అన్నిటికీ అదే బ్యాంకీ. ఆఖరి అర తియ్యాలంటే అంతా తెలిసినాళ్లకి అరగంటయినా పట్టుద్ది. నా పదేళ్లు వయసప్పుడు మా పక్కింటో ఉండే మా అమ్మమ్మ చెల్లెలు వరసయ్యే కవలమ్మమ్మ రంగంపెట్టి తెరుత్తుంటే చూశా. అప్పటినంచీ నాకా పెట్టంటే చానా ఇష్టం. పాత విఠలాచార్య సినిమాలో మాంత్రికుడి కొంపలాగా ఉండేది.rangampette

రంగంపెట్టి మా ఇంటికి చేరటం కూడా సిత్రవే. కవలమ్మమ్మ వాళ్లాయనా, మా తాతా పడవల మీద బియ్యం ఏసుకుని రంగం ఎల్లి వత్తావత్తా, మాకు బద్దీలపెట్టి, ఆళ్లకి పూలపెట్టి తెచ్చారు. నష్టం వచ్చి యాపారం మానేసినా ఈ చెక్క సామానం గుర్తుగా ఉండిపోయినయ్యి.

ఇంకోటి మైలగుడ్డల పెట్టి. దాన్ని సుండు సీతమ్మగారని మా అమ్మమ్మ స్నేహితురాలు ఆళ్ల పిల్లలతో పాటు రాజమండ్రి నించీ మాకూ ఒకటి తెచ్చింది. ఇడిసిన గుడ్డలు అందులో ఏత్తే మా రాంకోటి తాత కింద చిన్న తలుపు తీసుకుని గుడ్డలు మూట కట్టుకుని ఎల్లేవాడు. దానికి గాజు అద్దాలు. ఎనక పాత హిందీ సినిమా తారల చిత్రాలు. ఎప్పుడయినా అల్లరి ఎక్కువ చేత్తే అమ్మతో దెబ్బలు పడతయ్యి అనుకున్నప్పుడు గౌనులో ఏరు సెనక్కాయలు పోసుకుని తింటా అమ్మ కోపం తగ్గినాక బయటికి వచ్చేదాన్ని. ఈ రొండూ లేకపోతే మా ఇంటికి అందవే లేదు. మరనాటి పొద్దిన్నే సామానం తోమే పని మొదలుపెట్టారు. అసిగాడు (అన్న) ఎలిసిమీద నించి అందిత్తంటే, నచ్చితే చేతికిత్తన్నా లేకపోతే ఇసిరి ఇసిరి కొడతన్నా, ఆడుకోటానికి ఈలవటల్లేదనే కచ్చతో.

‘‘అట్టా ఇసిరితే, సొట్టలు పడితే అయ్యి ఎందుకూ పనికి రావు. మళ్లీ కొనుక్కొలేము. వస్తువ అవరదు. నిదానంగా ఇవ్వాలి,’’ అంది కవలమ్మమ్మ.

‘‘దానికేంటి కష్టం జేత్తేగా నెప్పి తెలిసేది. ఒంకిటికెల్లి ఉడకేసుకోటానికి కూడా సట్టీ అవుర్సుకున్నప్పుడు కదా మన బాద అర్థవయ్యేది.’’

‘‘అంతేలే అక్కయ్యా, పిల్లాజెల్లా లేకపోతే కుక్కా నక్కా పిల్లీ దూడా దుక్కీ మీద బెమలు పెంచుకుంటాం. అయ్యీ లేకపోతే బీరువాలు, మంచాలు, కంచాలు, చిప్పలే బందాలు. పొద్దిన లెగిత్తే అయ్యే పలకరిత్తయ్యి. ఆటిమీదే మమకారాలు. ఏదో పక్కింటో నువ్వుండబట్టి ఇంటో లేళ్లల్లే ఈ పిల్లలు ఎగురుతా, గంతులేత్తన్నారు. ఏదో ఈళ్లేగా నాకు పిల్లాజెల్లా. మొగుడు ఏ దేశాల మీద తిరిగినా లోటు తెలవటల్లా. ఏది తెచ్చిపెట్టమన్నా తుర్రున పరుగెత్తుతారు. అంతగా అయితే దానికి పెళ్లయిన తరువాత నే నెలతాలే ఎనకమాల. ఒంటికాయి సొంఠికమ్మునేగా.’’

‘‘దీన్ని నమ్ముకుంటా, గొంతులో నీళ్లు కూడా పొయ్యదు. నాకూ కూతురుంది. సుకపడతన్నానా. చాకిరీ తప్పిందా. బిడ్డలుండా లేకపోయినా ఒకటే బతుకు. ఉండాళ్లేవయినా మమ్ముల్ని ఎండి ఉయ్యాలేసి ఊపుతున్నారా, నిన్నూపట్లేదని బాదపడతానికి. అందరిదీ ఒకటే రాత. ఈ బిడ్డలకన్నా మట్టిగెడ్డలు నయ్యం. చాకిరీ జేత్తే ఫలితం సూపిత్తయ్యి.

ఇప్పుటాళ్లు మీద మనవే నయం. తిట్టుకున్నా, తిమ్ముకున్నా పెద్దాళ్లు మంచాన పడితే శాకిరీ జేసి కూడేశాం. ఇప్పుడన్నీ మొక్కుబడి తంతులు. ముందు ముందు అయ్యి కూడా సూడములే. మాట్టాడితే నా కూతురు సామానం కేజీల లెక్కన మారకం కాటా ఏపిత్తానంటది. ఏనాటినించీ ఏర్పాటు జేసుకున్నాం. ఎన్ని గుర్తులు. అయినా మన బాదలు మడుసుల కన్నా సామానులకే ఎక్కువ తెలుసు,’’ అంది.

సాయంత్రం దాకా అందరం కలసి సత్తా, పడతా సామాన్లు కడగటం సరిపోయింది. అమ్మమ్మకి, కవలమ్మమ్మకీ ఓపికలు అయిపోయినయ్యి. ఇక రేపు తుడిసి సర్దొచ్చులే అని ఇల్లంతా సిందరవందరగా పరిసినట్టు ఒదిలేశారు. మైలుగుడ్డల పెట్టి, రంగం పెట్టి, దబ్బకాయలో నాలుగు, ఎఱ్ఱమట్టి, సబ్బుపొడి, కొబ్బరిపీసు, తోవటానికి ముగ్గురు  మడుసులు, దొంగలెవరన్నా ఎత్తుకుపోతారనే బయం. కొంపకి కాపలాగా ఎల్లకాలం ఓ మడిసి. తీరా సర్దినాక డమడమా, బడబడా, ఆటిట్టో ఎలికలు తిరగడం,’’ అని ఇసుక్కుంది.

‘‘ఇయ్యాల అయ్యి అడ్డవయినయ్యని అమ్ముతానంట న్నావు. రేపు ముసలాళ్లు మయినాక మేవడ్డమని మమ్ముల్నెవరికి అమ్ముతా?’’

‘‘అమ్మా ఇక నువ్వాపు. రోజుకొకసారన్నా వాడనయ్యి ఇంటో అనవసరం. అయినా నేను చెపితే నువ్వింటా. ఎముకలు అరిగే దాకా తోవుకో.’’

‘‘నేను సచ్చేదాకా నా సామానం అమ్మమాక. నీకు ఒద్దకపోతే నేను నా మనవరాలికి ఇత్తా. ఆనాడే దానికి ఒద్దకపోతే తెగ నమ్ముద్ది.’’

అక్కడే ఉండి ఈళ్ల మాటలింటన్న నేను, ‘‘నాకు మాత్రం కవలమ్మమ్మది రంగంపెట్టి, మైలగుడ్డల పెట్టీ కావాలి. రంగం పెట్టిలో ఉండి ఎండి కాటిక్కాయి, వక్కపొడి డబ్బా, ఎండి పెన్ను, పన్నీరుబుడ్డీ నాకే ఇత్తానందిగా.’’

‘‘తీసుకుని నెత్తిన పెట్టుకు ఊరేగు. నీకొచ్చేవాడు పల్లెటూళ్లో ఉంటాడనేంటి? ఏ పట్నంవాడో అయితే అగ్గిపెట్టి కొంపలో ఖాళీలేక ఇసిరి రోడ్డుకేత్తాడు. ఈ పెట్టెలు రొండూ పెట్టాలంటే పెద్ద చావిడి (హాలు) కావాలి.’’

‘‘కొంపాగోడూ లేనాణ్ణి ఎతికి తెత్తావా ఏంటి దానికి. మేం ఇద్దరం ఎల్లి సర్ది వత్తాం. అవసరం అయితే సచ్చేదాకా దాని దగ్గిరే ఉండి బూజులు దులిపి కడిగి పెడతాంలే,’’ అంది కవలమ్మమ్మ.

‘‘ఇప్పుడు మాటలూ ఓపికలూ అప్పుడు ఎవరికీ ఉండవు. అయినా దాని సంగతి మీరెట్టా చెబుతారు. ఇక అది కూడా ఏ ఆనందం లేకుండా మీకు మల్లేనే కుండలూ, డబ్బాలు, సట్టిలూ, సిప్పలూ కడుక్కుంటదా. చదువూ, ఉజ్జోగాలు, దేశాల మీద తిరుగుతా, అన్నీ హోటళ్లలో కొనుక్కుని తినే రోజులొత్తయ్యి. అయినా మీకు మడుసుల మీద కన్నా కుండ, సిప్ప, డిప్పా, సట్టీ, సిబ్బిరేకు, తప్పాళాలల మీదే మోజు. అయ్యే కూడు పెడతయ్యి.’’

‘‘మాకు తెలిసింది ఇదే. మీ బాబులాగా, నీలాగా మమ్మల్ని మా బాబు సదివివ్వలా. ఈటి గురించి తప్ప మాకింకేమి తెలుత్తయ్యి. ఏ ఊళ్లన్నా ఏలటం రావద్దూ. అయినా నాకు సామానం అంటే ఇష్టం. మల్లీ మాట్టాడావో, అన్నీ పట్టుకుపోయి ఏరే కొంపలో అద్దెకుంటా,’’ అని ఒక్కిసురిసిరింది.

ఎందుకొచ్చిన గొడవ అని అమ్మ కూడా వాదిచ్చలా.

రాత్తిరయ్యింది. సామానం వాకిలంతా పరిసి చిక్కురు బిక్కురుగా ఉండయ్యి. అమ్మమ్మలిద్దరికీ సర్దటానికి ఓపికలు అయిపోయినయ్యి. టేకుచెక్క చినుకులు పడితే పాడవుద్దని కవలమ్మమ్మ వరండాలో మైలపెట్టిని జరిపిచ్చారు.

అన్నాలు, కూరలు వండటం అయినాక అందరం ఇక్కడే తిన్నాము. కవలమ్మమ్మ ఆళ్లాయనా మా తాతా కలిసే యాపారాలు చేసేవారు. లాసొచ్చి మా తాత మానేసినా, ఆ తాత మాత్రం యాపారం ఏరుతో అక్కడే ఉండి సంవత్సరానికి రెండుసార్లు వచ్చి నెలేసి రోజుల లెక్కన ఉండి ఎలతాడు. కానీ చాలామంది అమ్మమ్మకి పిల్లలు లేరని రంగంలో ఎవరినో చేసుకుని పిల్లల్ని కన్నాడని ఆళ్లు పెంపకం కోసం, దానికోసం అక్కడే ఉంటన్నాడని ఎనకగా గుసగుసలాడుకుంటారు. ఎదురుగ్గా అంటే మా అమ్మా, అమ్మమ్మా రాచ్చసుల్లా పడతారని బయ్యం. ఆళ్ల ప్రేమలూ బందాలే ఏరు.

ఇద్దరూ ఇరవై ఏళ్ల నించీ పక్కపక్క ఇళ్లల్లో కాపరాలు. మొగుళ్లు తెచ్చినా తేకపోయినా సంసారాలు లాక్కురాటం అలవాటయిపోయింది. గోంగూరా పండుమిరపకాయలు పచ్చట్టో గోలగూర ఆకులాకులుగా కనపడేటట్టు పచ్చడి పట్టటం దగ్గిర నించీ రాట్నం మీద ఏకులు ఒడకటం, అత్తామావల సంవచ్చరీ కాలకి బట్టలు పెట్టి ఎవరికి దానం ఇవ్వాలి, ఏ గేదె పాలకి కోవా ఎక్కువ కట్టుద్ది, ఈ సంవత్సరం మొత్తానికీ ఎంత ముదర లేతరంగు కుంకాలు నూరుకోవాలి, రాళ్లు ఎన్నేయ్యాలి, నిమ్మరసం ఎక్కువయితే కుంకం ఏ రంగుకి తిరుగుద్ది, కొబ్బరినూనె, పచ్చ కర్పూరం పాళ్లు కుంకంలో ఎంత కలిపితే మొకాన రాలకుండా అతుక్కుంటుంది, పూర్ణాల పూత పిండి బరకబరకగానే ఎందు కుండాలి లాంటి జాతీయ సమస్యలన్నీ ఇరవై ఏళ్లుగా మాట్లాడు కుంటన్నారు. అయితే చివరికి ఇద్దరి నిర్ణయం ఒకటే.

ముందు మా అశిగాడు (అన్నయ్య) తరువాత నేనూ తరువాత మా తమ్ముడు ఎవరో ఒకళ్లం కవలమ్మమ్మ పక్క మీదే నిదర. మొగుడికి దూరంగా సంవచ్చరాలు గడిపింది కానీ పక్కలో మాత్రం పసిపిల్లలు లేకుండా ఎప్పుడూ లేదు. మేం పక్కలు తడిపేసినా ఆనందమే. ఒక్కోసారి మేం ముగ్గురం తన దగ్గిరే పొడుకుంటావని ఏడిసి కొట్టుకుని అమ్మ చేతుల్లో ఈపులు ఇమానం మొతలు మోగిచ్చుకున్న రోజులెన్నో.

ఇవ్వాళ కూడా అన్నాలు తినటం అయినాక అమ్మమ్మ మంచం ఎక్కి పడుకున్నా. అసిగాడికి, తమ్ముడికీ ఏరే మంచం ఏసింది. అందరం పగ్నలంతా అటూ ఇటూ తిరుగుతా పని చేత్తా ఉండామేమో తొందరగా నిద్దరలోకి జారుకున్నాం. అద్దరాత్తిరి కాడ ఎవరియ్యో మాటలు ఇనపడతన్నయ్యి. ఎవరా అని చూశా. ఎంతాశ్చర్యం. ఆళ్లు మైలపెట్టి మా రంగం పెట్టీ. ఏం మాట్టాడ తన్నయ్యో అని దగ్గిరగా ఇంటానికి నిలబడ్డా.

‘‘రంగప్పా ఏంటి రోజులిట్టా కూలతన్నయ్యి. మడుసుల ఎక్కలో మనం చిల్లికానీ ఇలవ చెయ్యటల్లేదు. ఎంత భోగంగా బతికావు? అసలు నీ పుటకెక్కడ, ఆ దర్జా ఏంటి? ఎక్కడ రంగం? ఎక్కడ కథ. రంగం నించీ నిన్ను తెత్తన్నారని ఉత్తరం వచ్చిన కాడ్నించి నీ రాకకోసం ఊరంతా ఎంత ఎదురుచూశారు. నువ్వు ఓడ మీద విలాసంగా దిగావు. నిన్ను ఆరుగురు  మడుసులు మోసి లాగుడు  పడవలోకి నిదానంగా కూచ్చోబెట్టారు. ఆ పడవ పెద్ద కాలవలో పడి సాయంత్రానికి ఊరు జేరింది. కాలువ గట్టున ఊరు ఊరంతా నిలబడ్డారు. జాగ్రత్తగా తాళ్లు ఉయ్యాలతో గోనెపట్టల మీద దించి జనం స్వాగతంతో ఆశ్చర్యంగా సూత్తంటే సున్నం కొట్టిన తెల్లటి ఇంట్లో అడుగెట్టావా. మీది దేవదారు వంశమేమో మాంచి వయస్సులో ఉండప్పుడు తయారయ్యావేమో అబ్బా ఎంత సోకు. నీపై నున్న ఇత్తడి బద్దీల నగ్నల ముందు ఎంత హారాలయినా దిగదుడుపే. రోజుకొకింటాళ్లొచ్చి నీలో డబ్బు దాసుకునేవాళ్లు. నాలుగొరసల్లో ఎన్ని సొరుగులు.

నల్లమందుకి ఒక అర. దాన్ని సూసి మొకం చిట్టగిచ్చినా, పెద్ద పాపాయి కూతురు కన్నప్పుడు, సరిగ్గా సూడక వాపునెప్పులొస్తే, నాటుసిక్కుడు గింజంత ఏత్తే మళ్లీ మూడురోజులు నెప్పులని మూలగలేదు. అట్టాగే కాసుల సొరుగు. రంగం నించీ వచ్చిన పత్తీ, చెక్కరంగుదే అయినా తోటలో దూరిపి ఉంచితే ఆ సొరుగులో ఊరందరిదీ శాదెడు బంగారం దాశారు. ఇనప్పెట్లెలూ, బాంకీ తాళాలూ ఒట్టి సేతుల్తో పగలకొట్టే స్టూవర్టుపురం దొంగ ‘మాణక్కానికి’ తెల్లవార్లూ తిప్పినా అరదారి కనపడలా. పట్టుసీరలు, తనఖా కాయితాలు, డిక్రీలు ఎన్నెన్ని దాశారు. సెరిత్రలో ఈళ్లు కొన్న గన్నాయ్‌, బొన్నాయ్‌ బీరువాల తాళాలు పగలకొట్టి దొంగతనాలు సూశాంగానీ ఒకనాడన్నా రంగం పెట్టి దోపిడీ జరిగిందని రోడ్డుకిగానీ, పేపరుకిగానీ ఎక్కి ఎరుగుండామా,’’ అని దిగాలుగా అంటుంది మైలపెట్టి.

నీ బతుకు మాత్రం అవటానికి ఇడిసిన గుడ్డలపెట్టయినా పెళ్లీ, బట్ట, పెద్దమడిసి అయినబట్ట, పురిటిగుడ్డలూ, శోభనం గుడ్డలూ, పురుళ్లు, పున్యాలు, సావులు ఎన్నిటిని కాసి కాపాడా. నువ్వే లేకపోతే గబ్బెత్తిపోయేది ఇల్లు. అనే లోపల డమ్‌మని దూకింది, సూరుకి యాలాడగట్టిన సొరకాయబుఱ్ఱ.

‘‘ఏంటి మాట్టాడతన్నారు రంగం వదినా?’’

‘‘ఏదో కట్టం, సుకం లే? సూరులో ఎట్టుండా?’’

‘‘ఉప్… ఏం జెప్పను. కనీసం మిమ్మల్ని ఇళ్లల్లోనో, సంత మేడల్లోనో ఉంచుతున్నారు. మా పని మరీ గోరం. ఇదివరకి పాదుబెడితే ఇంటి కప్పంతా అల్లుకుని, సల్లగా లేత కాయలతో కడుపులు నింపుతా ఉండేదాన్ని. సొరకాయ దప్పళం అంటే నా స్నేహితురాలు ముద్దపప్పుతో కలిపి తినని వాళ్లుండారా. ముదిరినాక నన్ను లోపల శుభ్రంజేసి రకరకాల ఇత్తులునింపి యాలకడితే ఒచ్చే పంటకి గింజ పొట్లిపోకుండా, పుచ్చకుండా, బూజు పట్టకుండా పొట్టలో దాచుకునేదాన్ని. ఏంటో మమ్ముల్ని పెంటపోగుల్లో ఏసి, ప్యాస్టిక్‌ పొట్టల్లో ఇత్తనాలు దూరుతున్నారు. ఈ ప్యాస్టిక్‌ జిమ్మదియ్య,’’ అని మెటికలు ఇరుత్తుండగా ఎవరియ్యో నీడలు కదిలినట్టయ్యింది.

రంగంపెట్టి కళ్లు నులుపుకుని సూత్తే దిగులుగా మూడు కోతులు వచ్చి, ‘‘బావుండావా రంగప్పా,’’ అన్నయ్యి.

‘‘ఏం బాగులే దినదినగండం నూరేళ్ళాయుష్షు. మీరెవరు? అయినా కోతిమూక మీకేం తక్కువ? దేశం అంతా ఎగరొచ్చు.’’

‘‘ఏం ఎగురుతాం? అడివి అంతా నరికేసి వరిపొలాలు, చేపల సెరువులు సేత్తే. మెందు కొట్టిన పచ్చిగడ్డి తిని కడుపులు ఉబ్బి చానామంది మావాళ్లు సచ్చిపోయారు. ఇక మా విషయం` నా పేరు విజారు, ఇది ఐజారు, ఇది కిజారు. మాది జపాను దేశంలో నిక్కారు నగరంలోని బౌద్ద ఆలయంలో ఒక గోడ. అక్కడ మమ్మల్ని ఇతారిస్కో అనే ఆయన ఎడమ చేత్తో రాశాడు. మాది ఇతారి వంశీకుల పడికట్టు. ఇతారి అంటే ఎడమచేత్తో రాసేవాటం ఉండాళ్లం అని అర్థం. గాంధీతాత మనసుని గెలుచుకుని ఇక్కడ మనుషుల్లో ఇళ్లలో కలిసిపోయాం. ఆయన గురించి మాట్టాడినప్పుడల్లా ఆయనతో సమాన గౌరవం అందుకుంటా, చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్టాడకు అని పేర్లు మార్చుకున్నాం. మేం పుట్టి పెరిగిన ఊరినే మరిసిపోయాం. ఇప్పుడు ఇక్కడాళ్లకి గాంధీ సినిమాల్లో గుర్తున్నాడు. మా గురించి ఇక చెప్పేవాళ్లెవరు. గాంధీ తాతతోనే మా ఇలువంతా పోయి ఒట్టి కోతిమూకలా మిగిలాం,’’ అని జలజలా కన్నీళ్లు రాల్చినయ్యి.

టకటకమని పళ్లు నూరతన్న శబ్దం ఎక్కడిదా అనుకుంటే చీకిపోయిన గోనెసంచిలో పురికొసతో కట్టిన మూటలోనించి బయటపడటానికి తన్నుకుంటోంది. ఏదో ఏంటో అని సంచి మూతి ఉప్పదీత్తే కీళ్లు, కాళ్లు సరిచేసుకుంటా బయటపడిరది చిలకల అచ్చు.

‘‘అయ్యో ఇదేంటి ఎల్లువకి కొట్టుకొచ్చిన పిల్లలా నీలుక్కుంది. ఒల్లంతా సెదలు కొరుక్కు తినట్టుందే?’’

టకటకా అరిగిపోయిన దవళ్లని కదిలిత్తా మొదలుబెట్టింది. ‘‘ఏం జెయ్యను. తెల్లటి పంచదార పాకంపట్టి నిమ్మరసం పిండి పక్కనబెట్టి, మమ్మల్ని నీళ్లలో ముంచి మాలో పాకం నింపితే నిమిషాల్లో మా నించీ అడివిలోకి పారిపోయే జంతువులు, ఆకాశంలో పిట్టలు, నీళ్లలో చరాలు ఎన్ని తయారయ్యేయి. పిల్లలు ఎంత సంబరంగా జేబుల్లో పెట్టుకుని చేతులు నాక్కుంటా కాకెంగిలితో పంచుకునేవాళ్లు. పెళ్లిలో పెద్దపెద్ద ముంత మావిడి కాయలంత చిలకలు పోసి ఎదురు బుట్టలో పెట్టి ఇయ్యపురాలికిత్తే మురిసిపోయి, కోపాలన్నీ మరిసిపోయేవాళ్లు. మమ్మల్ని సూత్తే నవ్వని పెదాలు, అపురూపంగా అరచేతిలో ఉంచుకోనాళ్లేరీ,’’ అంటంటే దాని వంటి చెదపురుగుల్ని అందరూ పడి దులిపారు. ఇంకా కొన్ని అట్టాగే ఉండగా,
‘‘ఓ అరుణపతాకమా, చేసుకోమ్మా రెడ్‌ సెల్యూట్‌. నీలో ఉన్న సుత్తి, శ్రమజీవుల నవీనశక్తి నీలో కలుసున్నది కొడవలి,’’ అంటూ పాట పాడతన్న కొడవలీ, సుత్తి, ప్రవాహంలా వీళ్లని అనుసరిత్తన్న దబ్బనం, అట్టకాడ, గొడ్డలి, పొలుగ్ను, గ్నునపం, ఆరి, తవ్వంగాల, దోకుడుపార, మొత్తాన్ని చూసి గొడ్డలి ఊగిపోతా ఉపన్యాసం అందుకుంది.

ఆ ఉపన్యాసం అయిపూ అంతూ లేకుండా సాగుతాంది. ఇంతలో సుట్టూ, జిడ్డూ కవురు కంపు వంటితో, సంగం ఎలికలు తిని కొరికి వదిలేసిన ఆవునెయ్యి ఒత్తులు యాలాడతంటే వచ్చినయ్యి నాలుగు దీపారాధన కుందులు. ఆటితో పాటుగా ఒళ్లంతా ఎలికగొద్దెలు, పగిలిన బల్లిగుడ్డు పెంకులతో పొత్రం దొల్లినట్టు డొల్లుకుంటా నడుత్తా వచ్చింది లావాటి గుండిగ.
ఇదేంటి జనంలో భక్తి ఇపరీతంగా పెరిగి పూజలూ, పునస్కారాలూ ఎక్కువయినయ్యి కదా. మీరేటి శనికి దానవిత్తే ఏళ్ల తరబడి వాడని నువ్వుల నూనిలా సవురు కారతన్నారు. మీ ఎనకాల పానకం పోసే గుండిగకేమొచ్చింది.

‘‘ఒక్కొక్క కుందిలోకీ కేజీ నూని పొయ్యాలి. ఈళ్ల దగ్గిర అంత డబ్బులా, రోజూ తోవే ఓపికలూ లేవు. పున్యం లేకోతే పింగాయె. రోజుకో వాదం, ధ్యానం అని, యోగ అని, మనస్సని, ఆత్మ అనీ ఇక్కడెవరూ మమ్ముల్ని లెక్క చెయ్యట్లా.

అదేంటంటే తింటానికి కూడులేదగానీ పూజలెందుకు అని తిడతన్నారు. మాకు అమెరికా పోవాలని ఉంది. ఈ ఇంటి సుట్టాలు అమెరికాలో వుండారు. మాలాంటి నాలుగు కుందుల్ని, నాలుగేపులా పెట్టి మజ్జలో గుండిగ పెట్టి పయినగాజు పలకేసి అన్నాల బల్ల చేశారంట. ఆళ్లని సూట్టానికి మనాళ్లే కాదు, ఇంగ్లీసాళ్లు కూడా వత్తన్నారని అనుకుంటన్నారు. ఆళ్లు అక్కడ మెరుత్తున్నారంట. అట్టా ఆ దేశం అన్నా పోయి ఒకెలుగు ఎలగాలని ఉంది. సొంతూళ్లో ఇలవా సలవా లేదు. ఏడాదికోసారి రుద్ది కడగటానికే ఏడిసి సత్తన్నారు. ఎవరు పడితే ఆళ్లే ముట్టుకుంటన్నారు. ఆచారాలకయితే ఎప్పుడో ఉద్ద్యాపన చెప్పేశారు. ఎన్ని తరాలు సూత్తన్నాము. ఈళ్లు మన ముందు పుడతన్నారు, సత్తన్నారు. ఇంకెన్ని తరాలు సూత్తాయో. నిలేసుకుని ఉండా పట్టిచ్చుకోటల్లా. లెక్కలేనట్టుగా ఇదిలిచ్చి పోతన్నారు. కనీసం ఆదేశవన్నా పోతే ఈ చింతలన్నీ మరిసి ఆళ్లకి కొత్తగా కనపడొచ్చు.

‘‘ఏంటల్లా అమెరికా, పీనిగ మొకాలు అంటన్నారు,’’ అంటా కడుపుతో ఉండే ఆడదిలా, ఉప్పు ఉరిసి పాతకంపు కొడతా వచ్చింది సింతకాయ పచ్చడి జాడీ.

‘‘అబ్బో నువ్వా మాకన్నా పురాతనం. సీకుడు ఆలోశనలు, మాకే సీద్రం అయినా వచ్చిందిగా ఏం సెప్పుద్దో,’’ అన్నట్టు చూశారు.

‘‘నా పచ్చడీ నేనూ రొండూ మోటే. జరం వత్తే పత్తెం భోజనం, నాలో తెలుగాళ్ల ఆవకాయ, గోంగూర, మాగాయి, నార దబ్బకాయి ఎన్ని దాసుకున్నాను. మీరు నన్ను పాత సింతకాయ బావాలన్నాగానీ ఆనాడే ‘ప్యారీ’ అనే పేరుతో గీరపోయా. మేం చిన్నాపెద్దా కలిపి ఒక ఐదారన్నా పతి ఇంటో తిరిగేవాళ్లం.’’

అంతలో అందరికీ అమ్మో, అమ్మో అని అని ఒంటి మీద వాతలు తేలుతున్నాయి. ఎవరో గాలిలో ఎగిరెగిరి కొడతన్నారు. ఆ దెబ్బలు సర్రన కొండరాయిని కోసినట్టుగా సురుకు అంటు తున్నయ్యి. దొరక పుచ్చుకుంటే అది వాళా కఱ్ఱ. ‘‘ఒంగోలెద్దుగానీ, మైసూరెద్దుగానీ బండి కడితే చట్‌చట్‌లాడతా చేతిలో రంగు కుచ్చులతో మెరిసేదాన్ని. కింద నాకో మూరెడు పొడుగువారు కట్టేవాళ్లు. వాళా కఱ్ఱా, చెర్నాకోలు, వారుకోలు అని ఎన్ని పేర్లు. నాకు తోడు మా అమ్మకి సవితి కొడుకుండేవాడు. ఆడి పేరు ముల్లుకఱ్ఱ. తుప్పట్టిన ముల్లుతో ఉండాడు. మమ్మల్ని సూత్తే ఎంత పశువయినా, ఆబోతయినా మేకలా మారాల్సిందే,’’ అని గప్పాలు కొడతంది. ఎనక్కి తిరిగితే, గలగల సిన్న గెంటల మోత ఊగతా ఊగతా, సంపంగి నూనోసనతో, నాలుగ కాళ్లతో కింద రాతి జోళ్లుతో ఊగతా వచ్చింది పందిరిమంచం. అందరూ కూసోండని నడుం వాల్చింది. అయ్యో నడుం ఇరుగితే అవటిదానివవుతావు అన్నారందరూ.
బుస్సున కోపంతో ‘‘ఇరగటమా, ఈ ఇంటికి మూడు తరాల ముందు పెద్దావిడితో పాటుగా కాపరం జేత్తన్నా. రాయగడ తెలువడ్రంగుల సేతిలో తయారయ్యా. అబ్బో ఈ మంచంమ్మీదే ఆ పెద్దాళ్ల మొదటి రాత్తిరి. గదిలో అన్నీ సర్ది మంచం పయిన సలవగుడ్డ పరిసి, సన్నజాజులు సల్లి అప్పుడు అమ్మాయిగా వుండ ఈమెని లోపలికి పంపారు. తలుపు సందుల్లోనించీ కిటికీల్లోనించీ వరసయినాళ్లు తొంగి సూట్టం సూసిన పెళ్లికొడుకు శోభనం వద్దు, అన్నీ మా ఇంటికొచ్చినాకే, ఇదేవన్నా అందరూ సూసే ఆటా, ఇద్దరి పరవశం, ఆళ్లకే సొంతమయిన గ్యాపకం,’’ అని అలిగి ఆళ్లూరి దారి పట్టాడు.

బాగా చదువుకున్నాడు. ఇట్టాంటియ్యి నచ్చవని, ఎదవ ఏసాలెయ్యమాకండని, పెద్దాళ్లందరూ ఆడాళ్లని కేకలేసి, ఆఖరికి ఇద్దరినీ గదిలోకి పంపారు. అమాయకుడనుకున్న పెళ్లికొడుకు నాలుగు రోజుల్లో నూనిదీపం ఎలుగులో నూలుసీరిప్పదీప్పిచ్చి, జుట్టు జారేసి, పెనబాముల్లాగా సుట్టేసుకుంటా, గోడ మీద పడిన ఆళ్ల నీడల బొమ్మలు సూపి ఆళ్లే సిగ్గుపడి సిన్ననవ్వులు నవ్వుకునే వాళ్లు. అట్టా నా సాయంతో ఆరుగ్నురు పిల్లల్ని కన్నారు. పడకగది లోనూ పందిరిమంచంమ్మీదా ఆళ్లు తన్నుకోటం ఏనాడూ సూడలా. ఆ పెద్దావిడి పడకింటోకి, మురికి సీరతో ఎప్పుడూ రాలా. ఇవ్వాళ ముసలాయన కాలం చేశాడు. ఆమేమో ముతక కోకల్లోకి ఏలు ముడిలోకి దిగిపోయింది. నన్నేమో కీళ్లూడదీసి గోడకానిచ్చారు. ఆ రోజుల్లో ఆళ్లిద్దరి మజ్జా నలిగిన మల్లెరేకులు, మరవం ఆకులూ పెట్టెల్లో ఇరుక్కుని సాలీళ్లు గ్నూళ్లు అల్లుకుంటన్నయ్యి. దూరంగా మినుకు మినుకుమంటా అందరి మీదా గుడ్డెలుగు చూపిత్తా పలచగా పరుచుకున్న గాజు దీపంబుడ్డి, పక్కనే గడకఱ్ఱలాగా వత్తన్న సవురు తోడుకునే బొంబాయి (ఒకలాంటి పంపు).

ఈళ్లందరినీ చూత్తా అటూ ఇటూ పరిగెత్తుతున్నా. ఈలోపల కాల్లో ఆకుముల్లో, పల్లేరుగాయి ముల్లో కస్సున దిగింది. ముల్లు లోతుగా దిగి ఇరుక్కుంది. రాటల్లా. ఏమి చెయ్యాలా అని నెప్పిని భరిత్తా కాలును ఒళ్లో పెట్టుకుని కింద కూచ్చున్నా. అప్పుడు గలగలలాడతా వచ్చింది. చూత్తే ముళ్లగుత్తి. దానికి యాలాడతన్న చిమిటికి, నిదానంగా నా కాలుని తీసుకుని తను ముళ్లు ఇరుక్కున్న దగ్గిరకి వచ్చి గుత్తితో ముల్లుని అట్టుకుని ఒక్క లాగు లాగింది. మెత్తని కండలోనించీ అమ్మా అన్న మూలుగుతో పాటు ముల్లు కూడా వచ్చేసింది. ముళ్లుగుత్తి గలగలలాడతా నెమ్మదిగా గుంపులో కలిసింది.

గోల గందరగోళంలో ఒకపక్కన బరబరా పోష్టుకార్డు మీద గోకుతుంది ఇంకుపెన్ను. రాసిరాసి గొంతుకలో నించీ నల్లరక్తం కక్కుతా, అరిగిపోయాను. ఓపిక లేదు. ముందుతరాలకి అందాలని ఈ రాత. అని మళ్లీ కక్కి, క్షమించండి, ఎన్ని జీవితాలకి రాశానో నాకే జీవితం లేకుండా అయ్యింది.

పట్టెమంచం మీద కూచ్చున్న తాబేటికాయ, సొరకాయ బుఱ్ఱ, కత్తి, సుత్తి, కొడవలి, కుండా, గొడ్డలి, చిలకలచ్చు, తెడ్డు కట్టె, గాజుబుడ్డి, బొంబాయి, మరచెంబూ, గ్నునపం, ఆరి, అట్టకాడ, ముళ్లగుత్తి దాని ఆనుకున్న చిమిటికీ కబుర్లు చెప్పుకుంటన్నయ్యి. బఱ్ఱబఱ్ఱమని ఒళ్లు జలతరిచ్చే మోత వత్తంటే చూశారు. గిరగిరా సూర్యుడి చుట్టూ తిరిగే భూమిలాగా తన చుట్టూ తనే తిరుగుతున్న తిరగలి. కారతన్న నూని, ఇసిరేది ఏంటో ననుకుంటే ఇసక.

‘‘పప్పులన్నీ మిల్లులో తయారయ్యి,   మేము  పెరట్టో  కాళ్లు కడుక్కునే రాళ్లలాగా మారాం. నా సత్తా సూపిద్దాం అని ఇసకని ఇసిరి నూని కక్కిత్తన్నా. అందరూ కలిసి తిరగలిని కూడా గుంపులో కలుపుకుని ఏం జెయ్యాలా అని ఆలోసించి, పుత్తకాల మేజాబల్లని సలహా అడిగినయ్యి.

‘‘ఎదురుతిరిగి చితక్కొట్టకపోతే బతుకే లేదు. పతింటిలో నించీ ఇప్పటికే బయటికి తోశారు. మిగిలిన వాళ్లమయినా బతకాలి. మన శత్రువులని దొరికినాళ్లని దొరికినట్టు నాశనం చెయ్యండి. పదండి యుద్ధానికి, ఆఖరి పోరాటానికి, అంతూ అయిపూ తేల్చుకోటానికి,’’ అని బయలుదేరదీసింది.

అంతే అన్నీ, అందరూ కలిసి ఫ్రిజ్జులనీ, ఏసీలనీ, ప్లాస్టిక్‌ కుర్చీలనీ, ప్లాస్టిక్‌ బల్లలనీ, బాటిళ్లనీ, టీవీలనీ, గ్రైండర్లనీ, మిక్సీలనీ, వాషింగ్‌ మిషన్‌లనీ నాశనం చెయ్యటంలో పడ్డయ్యి. ముక్కలు ముక్కలవుతున్న ప్లాస్టిక్‌ వస్తువులు, ప్లాస్టిక్‌ వాన కురవటం మొదలుపెట్టింది. అది తుఫానుగా మారి, వరదయ్యి ఇళ్లనీ వాకిళ్లనీ ముంచెత్తింది. మరి అమ్మమ్మా, తాత, కవలమ్మమ్మా ముసలాళ్లంతా ఏరి? కొట్టుకుపోతన్నారు. అయ్యే దాహం… తాగటానికి నీళ్లు లేవు. అంతా ప్లాస్టిక్‌ ద్రవం. గొంతెండి పోతంది… బాబోయ్‌… అమ్మా… నాన్నా… అమ్మమ్మ… దాహం… అని గెట్టిగా అరుత్తున్నా.

ఫట్‌మని ఈపు మీద దెబ్బ పడటం, ‘‘బారెడు పొద్దెక్కినా ఏనిగల్లే కలవరిత్తన్నా. సామానం సర్దాలి. లేసి మొకం కడుగు. పాలు కలిపింది అమ్మమ్మ,’’ అంటంది కవలమ్మమ్మ.
ఒక్కసారి సుట్టూ చూశా. ఇల్లంతా పరిసిన సామానం. ఆటిని సూడాలంటే దడవనుకుగా ఉంది. కాసేపుట్టో అన్నీ ఒకదాంటో ఒకటి, ఒకదానిమీద ఒకటి కుప్పలుగా పడతయ్యి. అమ్మమ్మలనీ, తాతలవంకా చూశా. ఈళ్లని వృద్ధకొంపల్లో బతికుండగానే చల్లటి గదుల్లో కుక్కుతారు. దూరంగా చూశా. రైతులు పీకేసిన పత్తి కంపని మండిలా పేర్సి తొక్కి పైకి లెగవకుండా గాడిద రాళ్లు పెడతన్నారు.

మంచం దిగా. కాళ్లకి ఏదో తగిలింది. సొరకాయబుఱ్ఱ. ఇదిలిచ్చా. ఎన్ని మంచి ఇత్తనాలో, కావలసిన ఇత్తులు తీసుకుని భద్రంగా సూరుకి కట్టాను.

ఇయ్యన్నీ నా పిల్లలిక ఆళ్లమ్మమ్మ, నాయనమ్మలతో కలిపి ఇయ్యాలి. నా బిడ్డలు, కాదు బిడ్డల బిడ్డలు కూడా భద్రం చేసుకోవాలి. అన్నిటినీ, అందరినీ.

మొత్తం సామాన్లన్నీ రంగంపెట్టి సుట్టూ జేరి ‘ఎంకినై పాడాల ఏ జనమకయినా,’ అంటా కాలూ చెయ్యీ ఊపుతా నాట్యం చేసినయ్యి.

 (  కన్నెగంటి చంద్ర సంపాదకత్వం లో వచ్చిన  తానా సావనీరు (2013) లో ప్రచురితమైన కథ ఇది. పునర్ముద్రణకు అంగీకరించిన  రచయితకు ధన్యవాదాలు )

Download PDF

4 Comments

  • చందు తులసి says:

    మన్నెం సింధు మాధురిగారి కథలు దాదాపుగా అన్నీ చదివాను. ఏ కథా ఆకాశంలో నుంచి పుట్టినట్లో. ఊహించి రాసినట్లో అనిపించదు. ప్రతి కథలోనూ ఆమె కూడా ఓ పాత్రధారు. కానీ… కథ ఆమె చుట్టూ కాకుండా విషయం చుట్టూనే తిరగడం సింధు మాధురి పత్ర్యేకత. రంగం కథ ఆమె రాసినవాటిలో మరింత ప్రత్యేకం. ఇందులో వస్తువుల్ని పాత్రలుగా చేసి.. ఆధునిక వస్తువుల పేరుతో వినాశనాన్ని కొనితెచ్చుకుంటున్న విధానాన్ని అద్భుతంగా వివరించారు. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా హాస్యాన్ని, చతురతను జోడిస్తూ చెప్పిన విధానం ఆకట్టుకుంది.

  • ramarao says:

    సింధుమాధురి గారు ఏది రాసిన చాలా బాగుంటుంది కధలో వాడే పదముల శైలి కధకి వన్నె తెస్తాయి ఏ వస్తువునయిన పాత్రగా మలిచి వాటితోటే మాట్లడించడం ఆమెకే సొంతం పల్లెలలో వాడే పదజాలం ఇప్పటివారికి తెలియచేసి మంచి ఇన్‌ఫోర్మా;షన్ ఇచ్చారు రంగం పెట్ట్ గురుంచి వినాడమే గాని దాని గురుంచి ఇప్పటివరకు ఇంత వివరముగా తెలియదు ఏది ఏమైన ఏ కధ రాయాలన్న ఆది మాధురి గారికే సొంతం ఆమె కాలం నుండి ఇంకా మంచి మంచి కధలు రావాలని ఆమె అభిమానిగా నేను కోరుకుంటున్నాను ఆమె మొట్ట మొదటి కధ నుండి ప్రతీ కధ చదువుతున్నాను మాధురి గారు మరిన్ని మంచి కధలు రాయాలని మనసారా కోరుకుంటూ ఆమెకు నా క్రతజ్ఞతలు

  • radha says:

    మాధురీ,
    కథ బావుంది. ప్రస్తుతం మన ఊళ్ళో ఉన్న పెద్ద వాళ్ళు కూడా మర్చిపోయిన వస్తువుల పేర్లు గుర్తుకు తెచ్చావు. నేనైతే కొన్ని అసలు విననే లేదు.
    రాధక్క

  • padmaja says:

    మధురి గారు ఏది కదా కాదు జారిపొఇన జీవితం మల్లి గుర్తుకి తెచ్చారు చాల థాంక్స్.

    ఉ లేనురు క్యాంపు కధలు పుస్తకం ఎప్పుడు వస్తుంది.

Leave a Reply to ramarao Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)