“దేవదాసు” ఇంకో ప్రేమ కథ కాదు!

మరునాడు పొద్దుటే ఆ వీరజనులు తమ తమ లోకాలకు వెళ్లడానికి గంగానదిలోకి ప్రవేశించారు. అప్పుడు వ్యాసుడు తను కూడా గంగలో మునిగి, తమ భర్తను అనుసరించి వెళ్లదలచుకున్నవారు గంగలోకి దిగండని వీరుల భార్యలతో అన్నాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, ధర్మరాజుల అనుమతి తీసుకుని వారు గంగలో మునిగారు. మనుష్యదేహం వదిలేసి, దివ్యదేహం ధరించి, దివ్యాలంకారాలతో భర్తను కలుసుకున్నారు. ఈ విశేషాన్ని చూసిన జనం ఆశ్చర్యానందాలు చెందారు.

                                                           -(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆశ్రమవాసపర్వం, ద్వితీయాశ్వాసం)

కురుక్షేత్ర యుద్ధానంతరం ఒకరోజు, చనిపోయిన వీరులను వ్యాసుడు తన మహిమతో భూలోకానికి రప్పించాడు. వారు తమ భార్యలతో, బంధుమిత్రులతో రోజంతా ఆనందంగా గడిపిన తర్వాత తమ లోకాలకు తిరిగి వెళ్లడానికి గంగలో మునిగారు. మీరు కూడా భర్తతో వెళ్లదలచుకుంటే గంగలోకి దిగండని వీరుల భార్యలతో వ్యాసుడు అన్నాడు. వారు అలాగే చేశారు. దీనిని సహగమనం అనాలో, అనకూడదో మీ ఊహకే వదిలేస్తాను. అక్కడినుంచి బయలుదేరి మన కాలానికి వద్దాం.

***

శరత్ సాహిత్యం నేను ఎక్కువగా చదవలేదు. ఏవో కొన్ని నవలలు, అది కూడా చిన్నతనంలో చదివాను. చదవాలనే కోరిక మాత్రం ఉండేది. కానీ వృత్తిపరమైన కారణాల వల్ల తగిన తీరిక దొరకలేదు. క్రమంగా నా అధ్యయన ఆసక్తులు మారడం వల్ల కూడా ఆ వైపు దృష్టి పెట్టలేకపోయాను. రేపటి సంగతి చెప్పలేను.

అయితే, శరత్ నవల ఆధారంగా తీసిన దేవదాసు సినిమా చాలాసార్లు చూశాను. ఇన్నేళ్లలో ఆ సినిమా మీద సమీక్షలూ, స్పందనలూ చాలానే వచ్చి ఉంటాయి. ఆ సినిమా ఎప్పుడు చూసినా ఒక సన్నివేశాన్ని మాత్రం కళ్ళు ఆర్పకుండా చూస్తాను. ఆ తర్వాత కొన్ని రోజులపాటు అదే నా ఆలోచనలను నీడలా వెంటాడుతూ ఉంటుంది. అది నాలో విషాద విభ్రమాలు కలగలసిన ఒక విచిత్రానుభూతిని నింపుతూ ఉంటుంది. నిజానికి ఆ సినిమా దర్శకుడు వేదాంతం రాఘవయ్య, దర్శకుడుగా గొప్ప పేరున్న వ్యక్తి కాదు. కానీ ఆ సన్నివేశాన్ని అత్యద్భుతంగా పండించినందుకు  ఆయనకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. నా ఉద్దేశంలో ఆ సన్నివేశం సినిమా మొత్తానికి ఆయువుపట్టు. శరత్ హృదయమంతా అందులోనే నిక్షిప్తమైనట్టు అనిపిస్తుంది. సినిమా చివరిలో వచ్చే ఈ సన్నివేశమే నా అంచనాలో పతాకసన్నివేశం.

ఇదీ ఆ సన్నివేశం…దేవదాసు తన అంతిమ క్షణాలలో పార్వతి అత్తవారి ఊరు చేరుకుంటాడు. బండివాడు అతనిని పార్వతి ఇంటి అరుగు మీదికి చేరుస్తాడు. ఈ సంగతి తెలిసిన పార్వతి అతణ్ణి కలుసుకోడానికి మేడ మీదినుంచి పరుగు పరుగున కిందికి బయలుదేరుతుంది. అప్పుడు “తలుపులు మూసేయండి” అనే గావుకేక వినిపిస్తుంది. అది ఆమె జమీందారు మొగుడి గొంతు. భళ్ళున తలుపులు మూసుకుంటాయి. అప్రమత్తుడైన పార్వతి సవతి కొడుకు “వద్దు, వద్దమ్మా” అని బతిమాలుతూ ఆమెకు మెట్టు మెట్టునా అడ్డుపడతాడు. వినిపించుకోని పార్వతి మెట్లు దిగే తొందరలో దొర్లిపడి తలకు గాయమై ప్రాణాలు కోల్పోతుంది. అదే సమయంలో, వీధి అరుగుమీద పడున్న దేవదాసు ప్రాణాలు కూడా గాలిలో కలుస్తాయి.

410757

జ్ఞాపకం మీద ఆధారపడి ఈ సన్నివేశం గురించి రాశాను. కొన్ని వివరాలు, వాస్తవాలు తప్పిపోయి ఉండచ్చు. అయితే, పార్వతి దేవదాసును కలసుకోడానికి పరుగు పెట్టడం, భర్త “తలుపులు మూసేయండి” అని గావుకేక పెట్టడం, సవతి కొడుకు బతిమాలుతూ అడ్డుపడడం-ఇవే ఈ సన్నివేశంలో కీలకాలు. ఇద్దరు ప్రేమికులూ ఒకే క్షణంలో కన్నుమూసే ఈ ఘట్టంలో సినిమా అనూహ్యమైన ఉరవడిని, నాటకీయతను తెచ్చుకుని; ఉధృతంగా దూకే జలపాతం మధ్యలోనే స్తంభించిపోయినట్టుగా ఒక్కసారిగా ముగిసిపోతుంది.

ఈ మొత్తం సన్నివేశం ప్రతీకాత్మకం. దీని వెనుక పందొమ్మిదీ, అంతకు ముందు శతాబ్దాలకు చెందిన కరడుగట్టిన బెంగాల్ సాంప్రదాయిక సమాజపు అభివ్యక్తి మొత్తం ఉంది. ముసలి భర్త పార్వతి పట్ల దయ, సౌజన్యం ఉన్నవాడే. కానీ “తలుపులు మూసేయండి” అనే అతని గావుకేకలో నాటి కులీన సమాజపు కర్కశత్వం చెవులు హోరెత్తేలా ప్రతిధ్వనిస్తుంది. “తలుపులు మూసేయండి” అనే ఆ పెనుకేకలో, ఇంటి గౌరవ మర్యాదలనే గుండెలమీది కుంపటిని మౌనంగా, పంటిబిగువున మోయడం తప్ప స్త్రీకి మరో జీవితం లేదన్న చండశాసనం ఉంది.

సవతి కొడుకు కూడా పార్వతి పై భక్తి, మర్యాద, గౌరవం ఉన్నవాడే. కానీ తండ్రి కులీన వ్యవస్థా కాఠిన్యానికి కూడా అతను వారసుడు. కనుక సవతి తల్లిని సగౌరవంగానే కట్టడి చేయక తప్పదు.

ఈనాటికీ దేవదాసు సినిమాపై స్పందనలు, వ్యాసాలు కంటబడినప్పుడల్లా ఈ సన్నివేశ ప్రాముఖ్యం గురించి ఎవరైనా రాసారా అని ఆశగా వెతుకుతూ ఉంటాను. నాకైతే ఒక్కరూ కనిపించలేదు. నా కంటబడనివీ ఉండచ్చని ఒప్పుకుంటున్నాను.

దేవదాసు ఒక మామూలు ప్రేమకథ కాదు. సినిమా వంటశాలలో వండి వార్చే రొటీను ప్రేమకథ అసలే కాదు. దేవదాసు ఒకనాటి సమాజపు విషాదాంత భీభత్స చరిత్ర. అందులోనూ ఆ సమాజాన్ని బ్లాక్ అండ్ వైట్ లో చూపించిన చరిత్ర. నలుపు-తెలుపులు ఆ కథలో విడదీయలేని పాత్రలు. నలుపు-తెలుపుల నేపథ్యంలోనే ఆ సినిమా చూడాలి. ఒక చరిత్రకారుడి చూపుతోనూ చూడాలి. అప్పుడే ఆ సినిమాకు న్యాయం జరుగుతుంది. ఆమధ్య రంగుల్లో అట్టహాసంగా దేవదాసు సినిమాను పునర్నిర్మించినప్పుడు ఆ అఘాయిత్యాన్నీ, అపచారాన్నీ, నీచాభిరుచినీ ఎవరైనా ప్రశ్నించారో లేదో తెలియదు. టీవీలో ఆ సినిమా ప్రసారమవుతున్నప్పుడు ఎప్పుడైనా పొరపాటున కంటబడితే టీవీ కట్టేసి బ్లాక్ అండ్ వైట్ దేవదాసు దర్శనానుభూతిని కాపాడుకోవడం నేను అదృష్టంగా భావిస్తాను.

ఇప్పుడిక అసలు విషయానికి వస్తాను. ఈ వ్యాసపరంపరలో కోశాంబి తదితరులతోపాటు తరచు ప్రస్తావనకు రాబోతున్న పురామానవ చరిత్రకారులలో రాంభట్ల కృష్ణమూర్తి ఒకరు. నిజానికి రాంభట్లవారిని with a bang ప్రవేశపెట్టాలని నేను కొన్ని రోజులుగా ప్రణాళిక వేసుకుంటున్నాను. కానీ నా ప్రణాళిక తలకిందులై ఇప్పుడే ప్రవేశపెట్టాల్సి వస్తోంది. అప్పుడప్పుడు, మనం ఒకటి తలిస్తే మన కలం (ఇప్పుడు కంప్యూటర్ కీబోర్డ్ అనాలి కాబోలు)ఇంకొకటి తలుస్తుంది.

రాంభట్లవారిని తరచు కలసుకుని గంటల తరబడి ఆయన చెప్పే విషయాలు వినే మహదవకాశం నాకు కలిగింది. ఆ వివరాలను వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే, అనేక విశేషాలతోపాటు ఒకనాటి బెంగాల్ కులీన సమాజం గురించీ, శరత్ సాహిత్యం గురించీ, శరత్ సాహిత్యం  తెలుగులోకి తర్జుమా అయిన నేపథ్యం గురించీ ఎన్నో ఆసక్తికర వివరాలు ఆయన చెబుతుండేవారు. నాకు తెలిసినంతవరకు వాటిని ఆయన కాగితం మీద పెట్టినట్టు లేదు.  కాగితం మీద పెట్టే ఆయన సమాచారానికి కొంత మండించే స్వభావం ఉంది. బెంగాల్ కులీన సమాజం గురించి తను చెప్పేవి కూడా అటువంటివేననుకుని వాటిని నోటికే పరిమితం చేసుకున్నారేమో తెలియదు. నా విషయానికి వస్తే, ముందు చూపు లోపించడం వల్ల ఆయన చెప్పిన అనేక విషయాలను నేను కూడా భద్రపరచలేకపోయాను. అందుకు ఇప్పుడు విచారిస్తున్నాను.

నాకు గుర్తున్నంతవరకు ఆయన చెప్పినవి క్రోడీకరిస్తే… నాటి బెంగాల్ సమాజంలో కొన్ని కులీన కుటుంబాలు ఉండేవి. ప్రతి ఆడపిల్ల తండ్రీ కూతురిని కులీనుడికి ఇచ్చి పెళ్లి చేయాలని తహ తహ లాడేవాడు.  ఎక్కడో దూరంగా ఉండే ఆ కులీన వరుడికి అప్పటికే ఎన్నో పెళ్లిళ్లు అయుంటాయి. అయినా అభ్యంతరం లేదు. అతను అప్పటికే కాటికి కాళ్ళు చాచే వయసులో ఉంటాడు. అయినా అభ్యంతరం లేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే, అతడు సాధారణంగా పెళ్లి మంటపానికి వచ్చి స్వయంగా తాళి కట్టడు. అయినా అభ్యంతరం లేదు. ఆడపిల్ల తండ్రి వరుని కలుసుకుని పెళ్ళికి అనుమతి తెచ్చుకుంటాడు. వరుని పరోక్షంలో పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి తర్వాత ఒక్కసారైనా అల్లుడు అత్తింటికి రాకపోతే ఎలా? ముఖ్యంగా శోభనానికైనా రావాలి కదా?! కనుక, అల్లుడు తన ‘ప్రతినిధి’గా ఒక యువకునికి తగినంత ‘కిరాయి’ ఇచ్చి పంపిస్తాడు. ఆ యువకుడు ఒక్క విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో అల్లుడి పాత్ర పోషిస్తూ మూడు రోజులు గడిపి వెళ్ళిపోతాడు.

ఒక్కోసారి కథ మరోలా కూడా పరిణమిస్తుంది. ఆ అమ్మాయి కిరాయి అల్లుడినే భర్తగా భావించి అతనిపై మనసు పడుతుంది. ఆ యువకుడి నుంచి  అనుకూల స్పందన వస్తే ఇద్దరూ కూడబలుక్కుని వెళ్లిపోతారు. అయితే, ఎక్కడికి వెళ్ళినా సమాజం వేటకుక్క లా తరుముతూనే ఉంటుంది కనుక వారు బతికి బట్ట కట్టడం కష్టం. దాంతో ఇద్దరూ మతం మారిపోతారు.

దీనికితోడు, ఒక ముస్లిం మతస్తుని చేయి పొరపాటున తగిలినా చాలు, ఆ స్త్రీని నాటి సమాజం వెలి వేసేది. దాంతో ఆమె మతం మారి మనుగడను కాపాడుకోవడం అనివార్యం అయ్యేది. బెంగాల్ లో ముస్లిం జనాభా పెరగడానికి ఇటువంటివన్నీ దోహదం అయ్యాయని రాంభట్ల అనేవారు. దరిమిలా నాటి ఆంగ్లేయ పాలకులు బెంగాల్ విభజన ఆలోచన చేయడం, తూర్పు బెంగాల్ ఏర్పడడం, ఆ తర్వాత అదే బంగ్లాదేశ్ గా అవతరించడం చరిత్ర. మతవిశ్వాసం, లేదా ఛాందసం చరిత్రను తిప్పిన మలుపుకు ఇదొక ఉదాహరణ.

ఒళ్ళు జలదరింపజేసే మరిన్ని దారుణాలు రాంభట్ల వారి కథనంలో దొర్లుతూ ఉండేవి. బెంగాల్ సమాజంలో  వితంతువుల సంఖ్య విపరీతంగా ఉండేది. వారి పోషణ తలకు మించిన భారమయ్యేది. యాత్ర పేరుతో వారిని కాశీకి తీసుకెళ్ళేవారు. పడవ ఎక్కించి గంగ నడిమధ్యకు తీసుకెళ్లి నీళ్ళలోకి తోసేసేవారు! గంగమ్మ తల్లి అలా వితంతువులను తన ఒళ్లోకి తీసుకుని శాశ్వతంగా నిద్రపుచ్చే ప్రక్రియ మహాభారతకాలం నాటికే ఉందనుకుంటే, అది ఇటీవలి వరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉందనుకోవాలి.  కాశీ, బృందావనాలు నేటికీ ఎందరో వితంతువులకు అంతిమగమ్యాలు కావడం తెలిసినదే.

saratchandra

బెంగాల్ సమాజంలో ఇలా అన్నివిధాలా అన్యాయమైపోయి దిక్కుమాలిన జీవితం గడిపే స్త్రీలో నిబ్బరాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడమే లక్ష్యంగా సాహిత్యసృష్టి చేసినవాడు శరత్. రాంభట్ల ప్రకారం, తెలుగునాట కూడా, మోతాదు తేడాలో అటువంటి పరిస్థితులే ఉండేవి. శరత్ సాహిత్యం తెలుగులోకి తర్జుమా అవడానికి అదీ నేపథ్యం. ఆ కృషికి ప్రధానంగా ఇద్దరు దంపతులు కంకణ కట్టుకున్నారు. వారు: బొందలపాటి శివరామకృష్ణ, శకుంతలాదేవి. “మో”గా మనందరికీ తెలిసిన కవి వేగుంట మోహన ప్రసాద్, నేను విన్నంతవరకు, వీరి అల్లుడు. నా చిన్నప్పుడు విజయవాడలో విజయా టాకీస్ పక్క సందులోంచి సత్యనారాయణపురం వెడుతుంటే వంతెనకు ఇవతల కుడి పక్కన ఒక గేటుకు “దేశి కవితా ప్రచురణలు” అనే బోర్డ్ వేలాడుతూ ఉండేది. అదే బొందలపాటివారి నివాసం అనుకుంటాను.

మోసపోయో, మరో విధంగానో కాలుజారిన ఆడపిల్లలు ఆ రోజుల్లో కాలువలో పడి ఆత్మహత్య చేసుకునేవారు. వారిని కాపాడే కర్తవ్యాన్ని ఆ రోజుల్లో ఒక ప్రముఖ రచయిత కొంతకాలం మీద వేసుకున్నాడు. ఆయన గుడిపాటి వెంకటచలం. విజయవాడలో ఉన్న రోజుల్లో ఆయన మరికొందరితో కలసి రాత్రిళ్ళు కళ్ళు కాగడాలు చేసుకుని కాలువ గట్టున మకాం పెట్టేవాడు. అంతా కలసి ఆడపిల్లల్ని ఆఘాయిత్యం నుంచి ఒడ్డెక్కించేవాళ్లు. చలంగారి వదిన డా. రంగనాయకమ్మగారు వారిని తన దగ్గర ఉంచుకుని వైద్యసేవలు అందించేవారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో విజయవాడ ప్రముఖుని పేరు కూడా రాంభట్ల వారు చెబుతుండేవారు. దురదృష్టవశాత్తూ ఆ పేరు నేను మరచిపోయాను.

 

Download PDF

6 Comments

  • వేణు says:

    దేవదాసు పతాక సన్నివేశ చిత్రీకరణ గురించి మీరు రాసింది చాలా బాగుంది. రాంభట్ల గారు చెప్పిన విశేషాలూ, బెజవాడలో అఘాయిత్యాలకు పాల్పడే స్త్రీలను చలం గారు రక్షించటం … ఇవన్నీ నాకింతవరకూ తెలియనివి.

    మహాభారతం ఆశ్రమవాసపర్వంలోని ఘట్టాన్నీ, బెంగాల్ సమాజంలోని దురాచారాన్నీ పోల్చి చూపిన విశ్లేషణ అద్భుతం!

  • aparna says:

    చాలా బావుంది. ఎన్నో విషయాలు తెలిసాయి.

  • బలహీనమైన జీవ స్పందనలను తమ సాహిత్యంలో వర్ణించదమే రచయితలు సమాజానికి చేసే అన్యాయం. జీవితం పట్ల దేవదాసు, పార్వతుల స్పందనలు చాలా బలహీనంగా ఉంటాయి. అసలు ప్రేమ కన్నా జీవితమే గొప్పదనే సూత్రాన్ని చెప్పకుండా త్యాగాలు చావడాలు బాగోలేదండీ దేవదాసులో. ఇలాంటి క్లాసిక్ ల వలననే ప్రేమ పూర్తిగా వ్యక్తిగతమైన వ్యవహారమనే సంకుచితానికి గురియైనది.

    మీ పరిశీలన వర్ణన బాగున్నాయి గానీ సబ్జెక్ట్ అంత వర్తీ కాదండీ.

    • కల్లూరి భాస్కరం says:

      మీరన్నది ఒక కోణం నుంచి నిజమే సీతారాం రెడ్డిగారూ. అయితే దేవదాసు కథలోని మంచి-చెడులను పరిశీలించడం నా వ్యాసం పరిధిలోకి రాదు. ఆ కథా వస్తువును సామాజిక చరిత్ర కోణం నుంచి చూడడానికే నా వ్యాసం పరిమితం. మీ స్పందనకు ధన్యవాదాలు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)