తమవి కాకుండా పోయిన శరీరాలు,మనసులు చెప్పిన కథ ఇది!

ప్రఖ్యాత తమిళ రచయిత్రి సల్మా వ్రాసిన ఒక అద్భుతమైన నవల చదివానీ మధ్య.

ఆ నవల చదివిన అనుభవం ఎవరితోనూ పంచుకోకుండా వుండడం అసాధ్యమనిపించింది. కుటుంబాలలో స్త్రీల ఆశ నిరాశలు అనుభవాలు ఆనందాలు దుఃఖాలు కళ్ళముందు పరిచే అచ్చమైన  స్త్రీల నవల ఇది . సల్మా ఎక్కువగా కవిత్వమే వ్రాసింది. స్త్రీల లైంగికత్వం గురించీ వారి శరీరాల గురించీ నిస్సంకోచంగా వ్రాసింది.ఆమెవి అశ్లీల రచనలన్న ఆరోపణలనీ బెదిరింపుల్నీధైర్యంగా ఎదుర్కుంది  .  “అర్థరాత్రి కథలు” అని అర్థం వచ్చే ఈ తమిళ నవల ను “అవర్ పాస్ట్ మిడ్ నైట్” పేరుతో లక్ష్మీ హామ్ స్ట్రామ్ ఇంగ్లిష్  లోకి అనువదించగా జుబాన్  సంస్థ ప్రచురించింది. 478 పేజీల పెద్ద నవల ..

salma-hindu

“స్త్రీల అసమానత్వం చర్చనీయంగా వున్న ఈ పరిస్థితిలో, స్త్రీ శరీరంలో జీవిస్తూ స్త్రీవాదిగా ఆలోచించకుండా ఎట్లా?” అంటుంది మీనా అలెక్జాండర్ అనే స్త్రీవాద కవి. అట్లాగే సల్మా కూడా పనిగట్టుకుని స్త్రీవాద కవిత్వమూ నవలా వ్రాయకపోయినా ఆమె రచనల్లో తప్పనిసరిగా స్త్రీవాదమే వుంటుంది.

ఒక తమిళ గ్రామంలో కొన్ని ముస్లిమ్ కుటుంబాలలోని స్త్రీల కథ ఇది..ఇందులోని అయిదారు కుటుంబాలకూ దగ్గర బంధుత్వం వుంది.స్త్రీల మధ్య స్నేహం వుంది.ఒకరి జీవితాలనుగురించి వారి వ్యక్తిగత వివరాల గురించీ తెలుసుకోవాలన్న కుతూహలం మరొకరికి వుంది .ఒకరిపట్ల ఒకరికి ప్రేమ వుంది ,అసూయ వుంది. సానుభూతికూడా వుంది.

ఏడో తరగతి చదివే రబియా పాత్రతో ఈ నవల  ప్రారంభం అవుతుంది.ప్రపంచంపట్ల ప్రేమతో రెక్కలు విప్పుకుంటున్న ఊహలతో,సున్నిత మనస్కురాలైన చిన్నారి రబియా!!  .ఆమె స్నేహితురాలు.మదీనా!.ఇద్దరిమద్యా రహస్యాలు లేవు .ఒకరికోసం ఒకరు అన్నట్లుంటారు.అహమ్మద్ కూడా వాళ్ళ జట్టే. ఒకరోజు స్నేహితులతో కలిసి సినిమా చూసొచ్చి తల్లి చేతిలో బాగా దెబ్బలు తింటుంది రబియా. తల్లి జోహ్రా రబియాను మంచి ఆడపిల్లగా తీర్చిదిద్దే క్రమంలో వుంటుంది. రబియా తండ్రి కరీం, పెత్తండ్రి ఖాదర్ లది ఉమ్మడి కుటుంబం .అన్నతమ్ములు తోడికోడళ్ళు ఒకరంటే ఒకరు ప్రేమగా వుంటారు.రబియా పెద్దమ్మ రహీమా సంప్రదాయాలపట్ల కాస్త సడలింపు చూపించి తన కూతుర్ని పట్నంలోతన తండ్రి దగ్గర వుంచి హైస్కూల్ చదువు పూర్తి చేయిస్తుంది గ్రామంలో అది సాధ్యం కాదు.ఎందుకంటే ఈడొచ్చిన ఆడపిల్లలు ఇల్లుదాటరాదు.పరాయి పురుషుల కళ్ళపడరాదు.స్నానం చేసేటప్పుడు కూడా తమశరీరాలను తాము నగ్నంగా చూసుకోరాదు.సెక్స్ గురించి మాట్లాడరాదుఇటువంటి ఆంక్షలన్నీ ఆ గ్రామంలో వున్నాయి.

హైస్కూల్ చదువు పూర్తి చేసుకుని వచ్చిన వహీదాకు వివాహం తలపెట్టాడు తండ్రి.ఆమె ఇంకా చిన్నపిల్ల అప్పుడే పెళ్ళి వద్దని తల్లి చెప్పినా వినడు.వహీదాకు తనకు కాబోయే భర్త గురించి కొన్ని కోరికలున్నాయి.అతను సినిమాల్లో హీరోలా తన మీద ప్రేమ చూపించాలని తనను అభిమానించాలని అట్లా చిన్న చిన్న కోరికలున్నాయి. ఎప్పుడూ సినిమాపాటలు కూనిరాగాలు తీస్తూ వుంటుంది. వహీదా  హైస్కూల్ల్లో చదివినా మంచి కట్టడిలో పెరిగింది మతాచారాలు సంప్రదాయాలు శుచీ శుభ్రాలు అన్నీ తల్లి ఆమెకు తెలియచెప్పింది . రబియా తండ్రి కరీంకి భార్య జోహ్రా అంటే లెక్కలేదు. భోజనం చేసేటప్పుడు కూడా అతను ఏం లోపం వచ్చినా గట్టిగా అరుస్తాడు ఆమెను గడగడలాడిస్తాడు. అతనికి  వాళ్ల ఎస్టేట్ లో పనిచేసే మరుయాయి అనే ఆవిడతో సంబంధంవుంది.ఆ విషయం ఇంట్లోవాళ్ళకే కాక వూరందరికీ కూడా తెలుసు.మగవాళ్లకి అట్లా సంబంధాలుండడం సహజం అనుకుంటారు. మరుయాయి ఇంట్లోనూ తోటలోనూ కష్టపడి పనిచేస్తూ కరీం నే తన భర్తగా భావిస్తూ విశ్వాసంగా వుంటుంది.తను హిందూ అయినా బొట్టు పెట్టుకోదు.ముస్లిమ్ లా వుంటుంది. ఆమెకు సంతానం కలగకుండా ఆపరేషన్ చేయిస్తాడు కరీం. కరీంభార్య జోహ్రా ఆమెను పనిమనిషిగా సహిస్తూ వుంటుంది. కరీం అన్న ఖాదర్ కి భార్య రహీమా అంటే అభిమానం .ఆమె మాటకు విలువ ఇస్తాడు.కానీ కూతురు పెళ్ళి విషయంలో మాత్రం ఏకపక్షనిర్ణయం తీసుకుంటాడు. తన తల్లికిచ్చిన మాట ప్రకారం తన సోదరి కొడుకు సికందర్ తో వివాహం ఖాయం చేస్తాడు.అతడు వహీదా కన్న పదిహేనేళ్ళు పెడ్దవాడు. ఖాదర్ కరీం సోదరులకు పచారీ కొట్టు వుంది.భూములూ తోటలూ వున్నాయి. కారుకూడావుంది.

వీళ్ళుకాక వీళ్ళ బంధువుల కుటుంబాలు మరి మూడు వున్నాయి ఆ వూళ్ళో. రబియా స్నేహితురాలు మదీనా కుటుంబం.మదీనా తండ్రి సింగపూర్ లో  వ్యాపారం చేస్తూ చనిపోయాడు. ఆమె తల్లి  సైనా, ,అక్క ఫరీదాకాక మరొ ఇద్దరు మానసిక వైకల్యంతోపుట్టిన అక్కలు వుంటారు అన్న సులేమాన్ సింగపూర్ లో వుంటాడు.వదిన ముంతాజ్ ఇక్కడే వుంటుంది.

మరోకుటుంబం సారా ది.ఆవిడ  భర్త కూడా సింగపూర్ లో వుంటాడు. వృద్ధుడైనా,జబ్బు చేసినా స్వదేశానికి రమ్మంటే తిరిగిరాడు.ఆమె కూతురు షరీఫా భర్త పెళ్లయిన కొత్తలోనే దుబాయ్ లో ప్రమాదంలో చనిపోయాడు,అప్పుడు గర్భవతిగా వున్న షరీఫా భర్త తమ్ముడిని పెళ్ళి చేసుకోడానికి నిరాకరిస్తుంది.కూతుర్ని చూసుకుంటూ బ్రతుకుతానంటుంది.ఆమెకొక అక్క వుంటుంది.ఆమెకు శారీరక పెరుగుదల లేదు,పెద్దమనిషి కాలేదు.మరో తమ్ముడు కూడా వుంటాడు చిన్నవాడు.

మరొక కుటుంబం నఫీజాది.ఆమెకు ఇద్దరు మగపిల్లలు.అందులో అహమ్మద్ అనే పిల్లవాడు రబియాకు స్నేహితుడు.అతనంటే రబియాకు ప్రేమ .పెద్దైనాక అతన్ని పెళ్ళిచేసుకోవాలనుకుంటుంది. నఫీజాకూ ఆమె భర్తకూ వయస్సులో చాలా తేడావుంది. తమ సమవయస్కుడైనా అజీజ్ తో ఆమెకు స్నేహం వుంది.అది చాలామందికి తెలుసు.

ఈ కుటుంబాలలో మగవాళ్ళు డబ్బు సంపాదనకోసం విదేశాలు వెళ్ళారు.కుటుంబాలు మాత్రం ఇక్కడే వున్నాయి.వివాహం చేసుకున్న యువకులు కూడా ఒంటరిగానే దుబాయ్ సింగపూర్ సిలోన్ వెడతారు .ఏడాదికో రెండేళ్ళకో ఇంటికి వస్తారు. అప్పుడు భార్యలు గర్భం దాల్చి వంశాన్ని వృద్ధిచెయ్యాలని ఆ కుటుంభాలు ఆశిస్తాయి.అంతవరకూ వాళ్ళ భార్యలు అత్తింట్లో వుంటారు. అత్త మామల అదుపాజ్ఞలలో వుంటారు.

ఈ కుటుంబాల మధ్య చుట్టరికం వుంది. ఒకరింట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న కుతూహలం ఇంకొకకరికి వుంది.జోహ్రా రహీమాలకు తప్ప మిగతా స్త్రీలందరికీ  ఊసుపోక కబుర్లెక్కువ.ఇందులో ఎవరి బాధలు వారికున్నాయి.అయినా ఇతరుల  వ్యక్తిగత విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ.  అందులో నఫీజా ,ముంతాజ్ లకు మరీ ఎక్కువ. వాళ్ళిద్దరూ అన్ని విషయాల గురించి సంకోచమనేది లేకుండా మాట్లాడతారు.బార్యా భర్తల అంతరంగిక విషయాలను గురించి కూడా బాహాటంగా చర్చిస్తారు.

hourpastmidnight

తన ఆడబడుచు సబియా సంగతి రహీమాకు తెలుసు.కూతురు అక్కడ సుఖపడదని కూడా తెలుసు.కానీ భర్త ఆమె ను సంప్రదించకుండానే నిఖా నిర్ణయించేశాడు.. రహీమా ముందు బాధ పడినా సర్దుకుంటుంది. సింగపూర్ లో సికందర్ కి ఆడవాళ్లతో సంబంధాలున్నాయని కూడా కొందరు చెప్పారు. “అయినా మగవాడన్నాక ఇన్నేళ్ళు పెళ్ళికాకుండా వుంటే సంబంధాలుండడం ఒక వింతా ఏం?” అంటాడు కరీం. ఒక పక్క రంజాన్ పండగ సన్నాహాలు మరొక పక్క వహీదా పెళ్ళి సన్నాహాలు జరుగుతూ వుంటాయి. వహీదాకి సికిందర్ మేనత్త కొడుకే అయినప్పటికీ అతనినెప్పుడూ ఆమె చూడలేదు ,మాట్లాడలేదు. ఎటువంటి మనస్తత్వమో తెలియదు. పెళ్ళి అట్టహాసంగా జరిగిపోయింది. సబియా.నోరు మంచిది కాదు.కొడుకు పెళ్ళికి తమ్ముళ్ళు ఎంత ముట్టచెప్పినా అసంతృప్తే .ఇంకా ఇంకా లాంఛనాలు తేలేదని కోడల్ని దెప్పుతూ వుంటుంది.వహీదా మామ సయ్యద్ కొడుకు పెళ్లికోసం సిలోన్ నించీ వచ్చాడు.అక్కడ జరుగుతున్న హింసాత్మక సంఘటనల గురించి రేడియోలో విని మళ్ళీ వెళ్ళడమా మానడమా అని ఆలోచిస్తున్నాడు.

వహీదా అత్త సబియా వుండే వూళ్ళోనే జోహ్రా తల్లి అమీనా వుంటుంది. జోహ్రా చెల్లెలు ఫిర్ దౌస్ పెళ్ళయిన వెంటనే భర్తని వదిలేసి వచ్చింది. ఆ పిన్ని అంటే రబియాకు చాలా ఇష్టం కానీ ఆమె సంగతి ఇంట్లో ఎత్తవద్దంటుంది జోహ్రా.ఫిర్ దౌస్ కి వయసులో పెద్దవాడైన ,డబ్బున్న  ఒక అనాకారితో   పెళ్ళి కుదిర్చినది కరీం. ఎందుకంటే మామ చనిపోయాక అత్త అమీనా దగ్గర కట్నకానుకలు భారీగా ఇచ్చే టంత డబ్బులేదు. ఆ కుటుంబానికి మగదిక్కు తనాన్ని భుజాన వేసుకుని తన మీద భారం పడకుండా ఆ సంబంధం కుదిర్చాడు. భర్త ఎట్లా వున్నా సర్దుకుని కాపురం చేసుకోవలసిన ధర్మం స్త్రీలది అని అతనే కాదు మొత్తం సమాజం అంతా అంటుంది.ఆఖరికి అక్క జోహ్రా తల్లి అమీనా కూడా!!..కానీ ఫీర్దౌస్ అతన్ని మొదటి సారి చూసిన క్షణాన్నే అసహ్యించుకుంటుంది .అతనితో కాపురం తన వల్ల కాదని పుట్టింటికి తిరిగి వచ్చింది.అదొక మచ్చ ఆ కుటుంబానికి.ఎప్పుడైతే అత్తవారింటినుంచీ వచ్చిందో ఇంక ఆమె గుమ్మం దాటకూడదు.అలంకరించుకోకూడదు. ఆ పిల్ల ఏతప్పూ చెయ్యకుండా చూడాల్సిన గురుతరభాధ్యత తల్లి మీద వుంటుంది. అయితే ఆ సమాజంలో స్త్రీలకు మళ్ళీ పెళ్ళి చేసుకునే హక్కు వున్నది కనుక ఏదోఒక సంబంధం తెచ్చి పెళ్ళిచేసి భారం తీర్చుకోవాలని చూస్తూవుంటుంది అమీనా.రెండో పెళ్ళివాళ్లని పిల్లలున్న వాళ్లని ఫిర్దౌస్ తిరస్కరిస్తూ వుంటుంది.ఆమె అందగత్తె.వయస్సు తెచ్చే కోరికలున్నాయి.కానీ సమాజందృష్టిలో కుటుంబానికి మచ్చ తెచ్చింది. చెల్లెలికి ఇలాంటి స్థితి రావడానికి తన భర్తే కారణం అని తెలిసీ ఏమీ అనలేని అశక్తురాలు జోహ్రా. అమీనా వుంటున్న ఇల్లు పెద్దది.ఆ ఇల్లు ఆమె భర్త ఇస్మాయిల్ మనసు పడి కట్టుకున్నది.ఊళ్ళో ఎవరిల్లూ లేనంత అందంగా కట్టుకున్నది.ఇప్పుడతను చనిపోయాక రెండో కూతురు తిరిగి వచ్చాక అమీనా ఇంట్లో ఒక భాగం శివ అనే టీచర్ కి అద్దెకిచ్చింది.అతను ఫిర్ దౌస్ కి రోజూ కనపడుతూ వుంటాడు. ఆమె అతని మీద మనసు పడుతుంది. ఇద్దరూ దగ్గరౌతారు. అది తప్పని ఫిర్ దౌస్ కి తెలుసు.కానీ ఆమె ఆ అనుభవాన్ని ప్రేమించింది.ఆనందించింది. అమీనా ఇల్లు సబియా ఇంటికి ఎదురే ..

వహీదా పెళ్ళి చేసుకుని అత్తగారింటికి వచ్చింది. మొదటిరాత్రే అతని స్వభావం అర్థమైంది ఆమెకి. పెళ్ళయే వరకూ సెక్స్ గురించి మాట్లాడనివ్వకుండా . తమశరీరాలను గురించి తెలుసుకోనివ్వకుండా నాలుగు గోడలమధ్య బందీలుగా వున్న ఆడపిల్లలకు, పెళ్ళయిన మొదటి రాత్రే బంధువులంతా చేరి భర్తకి సహకరించమని హితబోధ చేస్తారు. పదిహేను పదహారేళ్లకే పెళ్ళళ్ళవుతాయి.చిన్న పిల్ల అనికూడా చూడకుండా సికందర్ జరిపిన మోటు శృంగారానికి .పొత్తికడుపులో నొప్పితో లుంగలు చుట్టుకు పోతుంది వహీదా.. మొదట్లో అంతే అని ఆమె మామగారు వెకిలిగా మట్లాడతాడు.అత్త పెడసరం మాటలు, మామగారి ఆకలిచూపులు వెకిలి మాటలు భార్యంటే సెక్స్ అని తప్ప ఇంకే మృదువైన భావమూ లేని సికందర్  వహీదా కి నాలుగురోజుల్లోనే నరకం చూపిస్తారు.అసలు సికందర్  కి కూడా వహీదాని చేసుకోడం ఇష్టంలేదు.చిన్నపిల్ల అని.అతనికి ఎదురింటి ఫిర్ దౌస్ మీద ఇష్టం.కానీ అమీనాదగ్గర డబ్బు లేదని అల్లుడికి కట్నకానుకలు భారీగా ఇవ్వలేదనీ సబియా ఒప్పుకోదు. మళ్ళి ఇప్పుడు ఫిర్దౌస్ భర్తని వదిలి వచ్చాక కూడా ఆమెని పెళ్లిచేసుకుంటానంటాడు.కానీ తల్లి అసలు ఒప్పుకోదు. అతనికి కూడా ఇది బలవంతపు పెళ్ళే!

ఒక రోజు రాత్రి ఎంతకీ నిద్ర పట్టక బాల్కనీలో నిలబడుతుంది వహీదా. ఆ అమ్మాయి చిన్నప్పటినించీ సమాజం చెప్పే  మంచిచెడులను వింటూ పెరిగింది.తప్పొప్పులను గురించీ సమాజం చేసే వ్యాఖ్యానాలు వింటూ పెరిగింది. బాల్కనీలో నిలబడ్డ వహీదాకి అప్పుడే ఎదురింట్లో నుంచీ ఫిర్ దౌస్ శివ ఇంటి వైపు వెడుతూ కనపడుతుంది. కోపంతో మండిపడుతూ మెట్లుదిగి ఎదురింటికి వెళ్ళి ఫిర్ దౌస్ నీ శివనీ “తప్పుచేస్తూండ”గా పట్టుకుని దులిపేస్తుంది,.అపుడే ఫిర్ దౌస్ సహనం కోల్పోయి వహీదా  తల్లి నీ పిన తండ్రినీ గురించీ ఒక మాట అంటుంది. వహీదా వెనక్కి వచ్చేస్తుంది.కానీ ఆమె చేసిన తొందరపాటు పని ఎంతకి దారితీస్తుందో ఊహించలేదు. వహీదాకీ ఫిర్ దౌస్ కీ జరిగిన సంభాషణంతా విన్న అమీనా కూతురు చేసిన పనిని క్షమించదు.ఎలుకలమందు తెచ్చి “మనిద్దర్లో ఎవరో ఒకరం చనిపోవాలి.చెప్పు,నువ్వా ,నేనా?” అంటుంది. జీవన కాంక్ష తో తల్లి పాదాలు పట్టుకుని వేడుకుంటుంది ఫిర్దౌస్ తనకు బ్రతకాలని వుందని. కానీ ఆమే చనిపోక తప్పలేదు.

ఆచారం ప్రకారం అత్తవారింటికి వచ్చిన నలభై రోజుల తరువాత పుట్టింటికి వెళ్ళి ఒడినింపుకు రావాలి.ఆడపిల్లలు పుట్టింటికి బయలు దేరిన వహీదా తన నగలన్నీ సర్దుకుని ఇంక జన్మలో అత్తగారింటికి రావొద్దనుకుంటుంది. సబియా శుభ్రంలేనితనం .మామగారు సయ్యద్ వెకిలి మాటలు ఆకలి చూపులు సికందర్ నిర్లక్ష్యం ఆమెకక్కడ నరకాన్ని చూపించాయి. ఫిర్దౌస్ మరణం అమీనాని అపరాధభావంతో కృంగదీసి ఆరోగ్యం మీద దెబ్బతీసింది,తల్లిని చూసుకోడానికి వచ్చిన జోహ్రాకు ఫిర్దౌస్ మరణానికి కారణాలు ,వహీదా మాటలు అన్నీ తెలిసాయి. గతంలో ఎప్పుడో తన భర్త రహీమాతో చేసిన తప్పు గురించి తెలిసింది.ఆమె రహీమాని ద్వేషించడం ప్రారంభించింది.ఉమ్మడి కుటుంబం వేరుపడాల్సిందే నని పట్టుపట్టింది.అ ఇంటిని విభజిస్తూ గోడ కట్టడం మొదలౌతుంది.

మదీనా అన్న సులేమాన్ సింగపూర్ నుంచీ వచ్చాడు.చెల్లెలు ఫరీదాకు పెళ్ళి చెయ్యాలి. భార్య ముంతాజ్ ను గర్భవతిని చెయ్యాలి అని రెండు ముఖ్యమైన పనులు పెట్ట్టుకుని వచ్చాడు. మదీనా ఇల్లు రబియా ఇంటికి ఎదురే .వాళ్ళ వాకిట్లో కారు ఆగినపుడల్లా డ్రయివర్ ముత్తు ను చూసి నవ్వుతూ వుంటుంది ఫరీదా. ఆ సంగతి ఆమె వదిన ముంతాజ్ కి తెలుసు.సులేమాన్ స్వభావం ఎరిగిన ముంతాజ్ అతనికి చెప్పదు.తప్పొప్పుల విషయంలో మతాచారాల విషయంలో చాలా కఠినంగా వుంటాడు సులేమాన్. కరీం ఇంట్లో పని చేసే ఫాతిమా ఒక హిందువుతో వెళ్ళిపోయిందని మసీదులో పెద్ద చర్చ లేవదీసి ఫాతిమా తల్లిని వెలివేయిస్తాడు. ఆ వూళ్ళో ముస్లిమ్ స్తీలెవరూ సినిమాకి వెళ్ళకూడదని ఆంక్ష పెట్టిస్తాడు. ఇంకా పెద్ద మనిషి కాకపోయిన మదీనాని బయట తిరగనివ్వడు. కరీం డ్రయివర్ ముత్తును ఉద్యోగంలోనుంచీ తీయించేస్తాడు..అతని స్నేహితుడు అరవై ఏళ్ళ అబ్దుల్ల స్వదేశానికొచ్చినప్పుడల్లా ఒక చిన్న పిల్లని పెళ్ళి చేసుకోడాన్ని ఊరంతా తప్పు పడితే అతను మాత్రం షారియత్ ప్రకారం మగవాళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని సమర్థిస్తాడు. ఒక “కాఫిర్” తో వెళ్ళిపోయిన ఫాతిమా లారీ కిందపడి చనిపోయిందని వార్త తెలిసి అందరికీ చాలా సంతోషంగా చెబుతాడు.తగిన శిక్ష పడిందని ఆనందిస్తాడు.తనకి గర్బం రాకపోతే అతను మళ్ళీ పెళ్ళిచేసుకుంటాడని ముంతాజ్ దిగులు పడుతుంది.ఆమె అనుకున్నది నిజంఅవుతుంది. డాక్టర్ ఆమెకు పిల్లలు పుట్టరని చెప్పడంతో ఆమె పట్ల సులేమాన్ ప్రవర్తనలో మార్పు వస్తుంది.ముంతాజ్ ప్రవర్తన కూడా   వింతగా మారుతుంది.ఆమెను ఫిర్దౌస్ దెయ్యమై ఆవహించిందని చెప్పి పుట్టింటికి పంపేస్తారు.సారా కూతురు షరీఫాతో సులేమాన్ కి పెళ్ళి నిశ్చయం చేస్తుంది సైనా. షరీఫాకి పెళ్ళి ఇష్టంలేదు,చనిపోయిన భర్త ని తలుచుకుంటూ కూతుర్ని పెంచుకుంటూ వుండాలని అనుకుంటూంది కానీ తల్లి షరీఫా పెళ్ళికి ఒప్పుకోకపోతే చనిపోతానని బెదిరించి ఒప్పిస్తుంది.ఫాతిమా లారీకింద పడిందని సంతోషంగా చెప్పిన సులేమాన్ ని ఎలా పెళ్ళి చేసుకోవాలి? కానీ తప్పదు.పనిలో పనిగా తన చెల్లెలు ఫరీదా పెళ్ళి అజీజ్ తో నిశ్చయిస్తాడు. బీదవాడైన అజీజ్ ను తనతో వెంట సింగపూర్ తీసుకుపోయి అక్కడ కుదురకునేల చేస్తాడు.ఫరీదాకూ గానీ షరీఫాకు గానీ పెళ్ళయినా ఒకటే! కాకపోయినా ఒకటే .కానీ భర్త వున్న స్త్రీలకుండే గౌరవం వేరు. అజీజ్ వెళ్ళిపోతున్నందుకు నఫీజా బాధపడుతుంది

వహీదా పుట్టింటికి వచ్చినప్పటినుంచీ ఆమెకి నెలసరి వచ్చిందా లేదా అనేదే అక్కడిఆడవాళ్ల చర్చ. వహీదాకి పెళ్ళికాగానే గర్భం వస్తే ఇంక సికందర్ ని నిశ్చింతగా సింగపూర్ పంపేస్తుంది సబియా. ఇంటివాళ్లకీ బయటివాళ్లకీ అందరికీ వహీదా నెలసరి పైనే ఆసక్తి.కానీ వహీదాకి మాత్రం గర్భం రాకూడదని గట్టి కోరిక.తను ఇంక అత్తవారింటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాక సికందర్ గర్భాన్ని ఎందుకు మొయ్యాలి?అనుకుంటుంది.

మదీనా పెద్దమనిషి అయింది.ఆపిల్ల రబియా అంత అమాయకురాలు కాదు. లోకంపోకడ తెలుసు.తల్లి ఆమెను స్కూల్ మాన్పించినా బాధ పడదు. అదంతా సహజం అనుకుంటుంది. మదీనా తో పాటే రబియానుకూడా స్కూల్ మాన్పిస్తుంది జోహ్రా.ఇంకా పెద్దది కాకపోయినా! .ఆమెతోపాటు స్కూల్ కు జతగా నడిచి వెళ్ళే ముస్లిమ్ పిల్లలు లేరనీ ఒంటరిగా పంపననీ చెప్పేస్తుంది. రబియా స్నేహితుడు అహమ్మద్ మేనమామ దగ్గరుండి చదువుకోడానికి వేరే వూరు వెళ్ళిపోతాడు. అక్క వహీదా దగ్గరకు కూడా ఎక్కువ పోనివ్వదు తల్లి రబియాని. ఒంటరిగా గదిలో ముడుచుకుని పడుకుంటుంది రబియా.. అన్నతమ్ముల ఇళ్ళ మధ్య గోడ పూర్తవుతుంది.  వహీదా నెల తప్పానని తెలుసుకుని కుప్పకూలిపోతుంది.తనింక అత్తవారింటికి పోక తప్పదు.ఆమెభవిష్యత్తు తేలిపోయింది.

రంజాన్ నెలలోఅరిసెల పిండి కొట్టుకోడం, గోరింటాకు పెట్టుకోడం, ఉపవాసాలుండడం, వహీదా పెళ్ళికి నగలూ బట్టలూ కొనడం వంటి వేడుకలతో మొదలైన ఈ నవల ముగిసేసరికి పాఠకుల మనసు నిండా విషాదం ముసురుకుంటుంది.

ఇందులో నలుగురు యువతులు; .తనను ఎంతో ప్రేమించిన భర్తతో కొద్దిరోజులే కలిసి వున్న షరీఫా భర్త దుబాయ లో ప్రమాదంలో మరణించడంతో. అతని గుర్తుగా వున్న కూతురికోసం మళ్ళీ  పెళ్ళి వద్దనుకుంటే తల్లి ఆమెను బెదిరించి బలవంతంగా ఇష్టంలేని వ్యక్తితో పెళ్ళికి వొప్పిస్తుంది .భర్త విదేశాలలో వుంటే ఒంటరిగా సంసారం ఈదుకొస్తోంది ఆ తల్లి. ఆమెకు శారీరక పెరుగుదల లేని మరొక కూతురు.చిన్నవాడైన కొడుకు.  ఒకవేళ విదేశంలోనే భర్త మరణిస్తే ఇంటిని ఆదుకునే మగదిక్కు కావాలి..సులేమాన్ ఎవరో కాదు తన అన్నకొడుకే! అందుకే షరీఫాను బలవంత పెట్టి సులేమాన్ తో పెళ్ళికి ఒప్పిస్తుంది.మొన్నటివరకూ తమతో కలిసి మెలిసి వుండిన ముంతాజ్ కి అది ద్రోహం అయినా కూడా.

మరొక యువతి ఫరీదా.మదీనా అక్క…సులేమాన్ చెల్లెలు. వయస్సొచ్చిన పిల్ల తల్లి గుండెలమీద కుంపటే కాక. అన్. ఆమెకి సరయిన సంబంధాలు రావడం లేదు .అందుకే  ఆర్థికంగా తక్కువ స్థాయిలో వున్న అజీజ్ తో పెళ్ళి కుదిర్చేసి తనతో సింగపూర్ తీసుకెళ్లడానికి నిర్ణయించాడు. పెళ్ళి ఒకమొక్కుబడి. ఒక భద్రత తరువాత మళ్ళీ ఎప్పుడో అతనొచ్చేదాకా ఒంటరి జీవితమే, ఫరీదాకైనా, షరీఫాకైనా ,వహీదాకైనా.. !

సులేమాన్ భార్య ముంతాజ్.పిల్లలు పుట్టని నేరానికి,దయ్యం పట్టిందదన్న ఆరోపణమీద  పుట్టింటికి తరిమివేయబడింది.పుట్టింట్లో మళ్ళీ ఆమెకు నాలుగుగోడలే..మళ్ళీ పెళ్ళి చేసుకుంటే తప్ప!

వహీదా ధనవంతుడైన తండ్రికి .చదువూ తెలివీ అందం పొందికా అన్నీ వున్న ఒక్కగానొక్క కూతురు.అయినా ఆమె జీవితంపై ఆమెకెలాంటి హక్కూ లేదు. ఆమె శరీరంపైనా ఆమె ఆకాంక్షలపైన ..హక్కులేదు.

కరీం ఇంట్లో పనిచేసే ఫాతిమా! పెళ్లయిన కొద్దిరోజులే ఆమె భర్త ఆమె దగ్గర వున్నాడు.తరువాత మాయమైపోయాడు.ఎక్కడో ఎవరితోనో వుంటున్నాడని ఫాతిమాకు తెలిసింది.ఆమె అతనికోసం వెళ్లలేదు .కొడుకుని పెంచుకుంటూ తల్లి దగ్గరే వుండిపోయింది. ఒకరోజు కొడుకుని కూడా వదిలేసి తను కావాలునుకున్న వాడితో వెళ్ళిపోయింది.ఆమె చేసిన పనిని సమాజమంతా గర్హించింది.  ఆమె చేసిన పని వల్ల ఊళ్ళో స్త్రీలెవరూ సినిమాకు పోగూడదని శాసించింది మసీదు. ఆమె తల్లిని వెలిపెట్టింది.ఆ తల్లి మంచం పట్టింది ఫాతిమా.కొడుకుని రహీమా చేరదీసింది.ఫాతిమా లారీ ప్రమాదంలో చనిపోయినప్పుడు ఒక కాఫిర్ తో వెళ్ళిపోయినందుకు తగిన శాస్తి అయిందని సులేమాన్ లాంటివాళ్ళు సంతోషించారు.కానీ ఊరి స్త్రీలే ఆమె కోసం ప్రార్థించారు .

పెళ్ళిళ్లు కుదర్చడంలో బంధుత్వాలు ఆస్తిపాస్తులు,కుటుంబ పరువు మర్యాదలు. లెక్కలోకి వస్తాయి.కానీ ఈడూ జోడూ ఆడపిల్ల మనసూ శరీరం లెక్కలోకి రావు మూగ జీవుల  నిశ్శబ్ద రోదన లోలోపల అణగారిపోతూనే వుంటుంది.  పదమూడేళ్ళకే నాలుగుగోడల మధ్య బందీ అయిన రబియా జీవితం ఎట్లా వుండబోతుందో? ఆ పిల్లనలా ఇంటికి పరిమితం చేసి బుద్ధిమంతురాలైన ఆడపిల్లగా తయారుచేయడానికి జోహ్రా కారణాలు జోహ్రాకున్నాయి. జోహ్రాపిన్ని మైమూన్ పెళ్ళి అయిన కొద్దిరోజులకే భర్తని విడిచిపెట్టి వచ్చింది. ఆమెకు మళ్ళీ పెళ్ళి చెయ్యాలనుకుంటూ వుండగానే ఆమె గర్బవతి అని తెలిసింది.తల్లీ అక్కా కలిసి ఒక నాటుమంత్రసానిచేత గర్భంతీయించగా ,మైమూన్ చనిపోయింది.భర్తని విడిచిపెట్టి వచ్చి కుటుంబానికి మచ్చతెచ్చినజోహ్రా చెల్లెలు ఫిర్దౌస్  బలవంతంగా చనిపోయింది.జనాలు తమ కుటుంబం గురించి చెప్పుకుంటున్నారు.మరి రబియా ఎలా తయారవుతుందో అని జోహ్రాభయం .అందుకని అంతులేని కట్టడి ఆ పిల్లకి.

ముక్కుపచ్చలారని పిల్లలకి పెద్దమనుషులు అయీ కాగానే వయో బేధాలు అందచందాలు మనస్తత్వాలు ఏమీ చూడకుందా పెళ్ళిళ్ళు కుదురుస్తారు. మొగుడు ఎలాటివాడైనా తట్టుకుని బ్రతకమని శాసిస్తారు. భర్తని వదిలి వచ్చిన స్త్రీ కానీ ,వితంతువైన స్త్రీ కానీ ఎన్నో ఆంక్షలకు లోబడి బ్రతుకు సాగించాలి.గుమ్మందాటి బయటకు రాకూడదు.అలంకరించుకోకూడదు.వాళ్లమీద నిత్యమూ కాపలాయే. .మతాచారాలూ ఆ పేరుమీద పురుషుల అదుపాజ్ఞలూ భరిస్తూ బ్రతుకుతున్న  స్త్రీలు కూడా మళ్ళీ తాము ఆ అవధులు మీరకుండా బ్రతుకున్నామా లేదా అని వార్ని వాళ్ళు సరిచూసుకుంటూ కాపలా కాచుకుంటూ వుంటారు. స్త్రీల జీవన పరమావధి వివాహం. ఆ వివాహ నిర్ణయంలో వాళ్ల ప్రమేయం ఏమీ లేదు.వాళ్ల శరీరాల మీద కోరికలమీద వాళ్లకి అధికారం లేదు .ఇది ఏ ఒక్క సమాజపు స్త్రీల కథ మాత్రమే కాదు,అన్ని సమాజాలలోనూ జరుగుతూన్న కథే కొంత ప్రత్యక్షంగా,కొంత కనిపించకుండా.

ఈ నవలలో ఆ సమాజంలో పండగలు ఆచారాలు చావులూ పెళ్ళీళ్ళు అన్నీ ఎంతో విశదంగా వర్ణించింది సల్మా.తానొక ప్రేక్షకురాలిగా వుంటుందేకానీ వ్యాఖ్యానాలు చెయ్యదు .

ఈ రోజు సల్మా ఒక ప్రఖ్యాత రచయిత్రి కావడం,  అంతర్జాతీయ కీర్తి పొందడం, విదేశాల్లో సెమినార్లకి హాజరవడం, ఆమెపై ఒక బ్రిటిష్ డాక్యుమెంటరీ నిర్మాత సినిమా తియ్యడం ఇవన్నీ చాలా సులభంగా జరిగిన విషయాలేమీ కావు.

“నా కప్పుడు పన్నెండేళ్ళు.తొమ్మిదో క్లాసు చదువుతున్నాను.ఆరోజు శనివారం మాకు స్కూల్ లేదు.మేం నలుగురు స్నేహితురాళ్లం లైబ్రరీలో కూచుని చదువుకుంటున్నాం.దగ్గర్లోనే వున్న ఒక సినిమాహాల్లో మాటినీ ఆడుతోండి.ఇంట్లో అడిగితే సినిమాకి పంపించడం జరిగేపని కాదు.పైగా మా గ్రామంలో ఎప్పుడో కానీ మాటనీలు వెయ్యరు .రాత్రిపూట సినిమాకి వెళ్లడం అసంభవం. చీకటిపడ్డాక ఆడపిల్లలు బయటికి పోకూడదు.మేం ఇంట్లో చెప్పకుండా సినిమాకి పోవాలనుకున్నాం…మేంలైబ్రరీలో వున్నాం అని ఇంట్లో అనుకుంటారు అని బయల్దేరాం అసలు ఆ హాల్లో ఆడే సినిమా ఏమిటో కూడా మాకుతెలియదు.ఆత్రంకొద్దీ వెళ్ళి హాల్లో కూచున్నాక అది శృంగార భరితమైన మలయాళీ సినిమా అని తేలింది.బయటికి వచ్చేద్దామా అంటే తలుపులు మూసేసారు.కొన్ని దృశ్యాలు వచ్చినప్పుడల్లా మేం చేతుల్లో మొహం దాచుకుని ఎట్లాగో బయటపడ్డాం.ఇంటికి వెళ్ళేసరికి అదే హాల్లో సినిమాకి వచ్చిన మా అన్న మా అమ్మకి చెప్పేశాడు. ఆవిడ నన్ను బాగా కొట్టి స్కూల్ మాన్పించేసింది.అప్పటినించీ  పెళ్ళయేవరకూ తొమ్మిదేళ్ళు నాలుగుగోడల మధ్య బందీ అయిపోయాను.జీవితంలో అతి ముఖ్యమైన ఆ వయసులో ఒంటరిగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా స్నేహితులు లేకుండా గడపడం ఎంత దుర్భరమో కదా?” ఇది సల్మా స్వీయానుభవం.

ఆ తరువాత చాలా ఏళ్ళు ఇటు పుట్టింట్లో అటు భర్త ఇంట్లో ఆమె నాలుగుగోడలమధ్య బందీ . స్త్రీలకి తెలివి తేటలుండకూడదు.వాళ్ళు ప్రశ్నించరాదు.కానీ వీటన్నిటినీ సల్మా ప్రశ్నించింది.అమ్మ ఇంట్లో బంధిస్తే స్కూల్ మాన్పిస్తే ఆమె ఊర్కే కూర్చోలేదు. బాగా పుస్తకాలు చదివింది.కవితలు వ్రాసి రహస్యంగా పత్రికలకు పంపించింది. తనలోని కోపాన్నీ ఆవేశాన్నీ బహిర్గతం చెయ్యడానికి ఒక వాహిక దొరికింది. ఆమె చదువుకోవాలనుకున్నది, బుర్ఖా వేసుకోవద్దనుకున్నది .తన అసలు పేరు రుఖయ్యా.సల్మా కలం పేరు.రజతి అనే పేరుతో కూడా వ్రాసింది.తను వ్రాస్తున్నట్లు తెలియకూడదు, నిశితమైన పదునైన ఆమె కవితలు పత్రికలలో వచ్చాయి.వివాహమయ్యాక ఆమె రచనల్ని భర్త ఏమాత్రమూ ప్రోత్సహించలేదు.అయితే సల్మా తల్లే సల్మా రచనల్ని పత్రికలకి పంపేది.రహస్యంగా పుస్తకావిష్కరణకూడా ఏర్పాటు చేసింది, తరువాత ఆమె తమ ఊరి పంచాయతీ బోర్డు అధ్యక్షురాలైంది స్త్రీలకు రిజర్వ్ అయిన ఆ వూరి పంచాయితీకి ఈమెను నిలబెట్టింది ఆమె భర్తే .2006 లో డిఎంకె తరఫున శాసనసభకు పోటీ చేసి ఓడిపోయింది.తరువాతి సంవత్సరం తమిళనాడు సోషల్ వెల్ఫేర్ బోర్డ్ కి అధ్యక్షురాలైంది.

ఈ నవలలో చిన్నారి రబియా కూడా సల్మాలా పోరాడి గెలవాలని కోరుకున్నాను.

                 sathyavati   -పి.సత్యవతి

 

 

Download PDF

2 Comments

  • రచయిత్రి “సల్మా ” గురించి అప్పుడప్పుడూ పత్రికలలొ చూస్తూనే ఉన్నాను . సత్యవతి గారు .. ఈ నవలా పరిచయం చదివిన తర్వాత నిట్టూర్పు విడువడం తప్ప ఏం చేయలేం ..అనుకుంటే .. చాలా పొరబాటు చేస్తున్నట్లే!
    నా పరిచయస్తులలో చాలా ముస్లిం కుటుంబాలు ఉన్నాయి . ఆ కుటుంబాలలోని స్త్రీల అనుభవాలు దాదాపు ఈ నవల లో ఉన్న విషయాలే! చదువుకోవడం ద్వారా ,ప్రశ్నించడం ద్వారా , దైర్యంగా పరిస్థితులని ఎదుర్కోవడం ద్వారా స్త్రీలకి సొంత గొనుక లభిస్తుంది . చాలా మంది మార్పు దిశగా పయనం మొదలెట్టారు. అది కొనసాగాలి.

    ఈ నవలలో చిన్నారి రబియా కూడా సల్మాలా పోరాడి గెలవాలని కోరుకున్నాను… నా కోరిక కూడా అదే ! ఈ విలువైన పరిచయానికి ధన్యవాదములు . . .

  • Thirupalu says:

    ‘ తమవి కాకుండ పోయిన శరీరాలు ‘ పేరుతో స్త్రీ పరాదీనత్వాన్ని చాలా దయనీయంగా వర్ణించిన అర్ధరాత్రి కధలు ( నడురాత్రి కధైగల్‌) పరిచయం చాలా బావుంది ! మీ శైలీ ఎవరికైనా కన్నీళ్లు తెప్పించగలదు! అందుకు ఈ పరిచయం మినహయింపుకాదు. జీవిత సత్యాలను (కేవలం పై పై న కాకుండా) చాలా లోతుగా ఆవిష్కరించిన నవలా పరిచయం. బావుంది! అంటే కేవలం ఎగతాళి చేసినట్లుగా వుంటుంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)