“ అప్పుడు చుట్టుపక్కల అంతా ఆత్మీయులే!” –మరిప్పుడో ?”

వంగూరి “జీవిత” కాలమ్ –  8

Fountain(1)

నాకు తెలిసీ భారత దేశంలో ఉన్న అన్ని నగరాలలోను ఒక గాంధీ నగరం ఉండి తీరుతుంది.  ఇక అన్ని గ్రామాలలోను, నగరాలలోను ఆయన విగ్రహం కనీసం ఒక్కటైనా కూడా ఉండి తీరుతుంది. ఆ మహానుభావుణ్ణి ఎంత మర్చిపోయామో గుర్తు చేసుకోడానికే ఇప్పుడు ఈ విగ్రహాలు ఉపయోగపడుతున్నాయి. ఈ రోజుల్లో ఎవరిదైనా సరే విగ్రహం పెట్టించడం నాయకత్వ లక్షణం గా పరిగణించబడుతోంది కదా! ఇది ఖచ్చితంగా నా అప్రస్తుత ప్రసంగమే కానీ  ఆఖరికి మా హ్యూస్టన్ లో కూడా కొందరు గాంధీ గారి విగ్రహం పెట్టించి “స్వయం ప్రకటిత సంఘ నాయకులు” గా పేరు తెచ్చుకున్నారు.

కానీ మా కాకినాడలో మా ఇంటికి వంద గజాలు అటూ, ఇటూ కూడా ఉన్న గాంధీ గారి విగ్రహాలు ప్రతిష్టాపించడానికి ఒక చారిత్రక నేపధ్యం ఉంది. కాకినాడలో 1923 లో 38వ కాంగ్రెస్ మహా సభలు ముగిశాక సుమారు మూడు ఎకరాల ఆ ప్రధాన వేదిక ప్రాంగణాన్ని అత్యంత సుందరమైన పార్కుగా తీర్చి దిద్దారు. ఆ మహా సభలలో మహాత్మా గాంధీ పాల్గొన్న కారణంగా అక్కడికి వంద గజాల దూరంలో కాకినాడలో ఉన్న ఏకైక “ఐదు రోడ్ల కూడలి” లో గాంధీ గారి విగ్రహం పెట్టారు. మా పేట పేరు కూడా గాంధీ నగరం గా మార్చారు. చుట్టుపక్కల పేటలు రామారావు పేట, సూర్యారావు పేట, ఎల్విన్ పేట మొదలైనవి.  ఇవన్నీ కళా, సాంస్కృతిక రంగాలకి పట్టుగొమ్మలు. అసలు కాకినాడ అంటేనే భాష, సాహిత్యం, సంగీతం, కళ, నృత్యం, విద్యాలయాలు, ఒకే వీధిలో అన్ని సినిమా హాళ్లు వగైరాలతో ఒక తెలుగు సాంస్కృతిక నగరం అనే ఇప్పటికీ పేరు.  మా చిన్నప్పుడు మా పేటలో నివసిస్తున్న సాధారణులైనా అత్యంత అసాధారణ సహృదయులు చాలా మంది నాకు యింకా బాగా జ్జాపకం ఉన్నా,  ఎంతో గొప్పవారైన హేమా హేమీల గురించి ఏదో యాదాలాపంగానే తప్ప ఎక్కువగా తెలియదు.  అంతటి మహానుభావులకి సన్నిహితంగా ఉన్నా, ఆ అమూల్యమైన అవకాశాలని అప్పుడు గుర్తించ లేక పోవడం ఇప్పుడు తలచుకుంటే సిగ్గేస్త్తుంది.

మా ఇల్లు సరిగ్గా పార్కుకీ, గాంధీ బొమ్మకీ మధ్యలో ఉంటుంది. మా చిన్నప్పుడు ఆ పార్కుకి సరిగ్గా మధ్యలో బంగారం చేపలు ఆనందంగా, హడావుడిగా ఈదుతూ ఉండే  ఒక అద్భుతమైన వాటర్ ఫౌంటెన్ (దీనికి తెలుగు మాట నాకు గుర్తుకు రావడం లేదు…నీళ్ళు చిమ్మే యంత్రం?????), దానికి అనుబంధంగా పార్కు నాలుగు మూలలా చిన్న ఫౌంటెన్లూ ఉండేవి. రామారావు పేటలో ఉండి, మా చుట్టు పక్కల కొన్ని వేల ఇళ్ళకి నీటి సదుపాయం చేసే “కుళాయి చెరువు” నుంచి సాయంత్రం ఆరు గంటల సమయం సూచిస్తూ ఫేక్టరీ సైరన్ మోగేది.  వెనువెంటనే వందలాది ఆ పార్కుకి చేరుకునే వారు. ఎందుకంటే, ఆ వాటర్ ఫౌంటెన్ మధ్యలో 50 అడుగుల “ఏక స్తంభం”  మీద నాలుగు స్పీకర్లతో ప్రతీ రోజూ మ్యునిసిపాలిటీ వారు నిర్ణీత సమయాలలో రేడియో కార్యక్రమాలు ప్రసారం చేసే వారు. ఆ రోజుల్లో చాలా తక్కువ మంది ఇళ్ళల్లోనే రేడియోలు ఉండేవి. ట్రాన్సిస్టర్ రేడియోలు 1960 ప్రాంతాలలో వచ్చినా, టీవీ అనే మాటే డిక్షనరీ లో లేదు.   ఆ రేడియో ప్రసారాలలో ముఖ్యంగా సాయంత్రం ఏడు గంటలకి “ఆకాశ వాణి, వార్తలు చదువుతున్నది పన్యాల రంగనాథ రావ్ “ అనే ఖంగు మనే గొంతు వినడానికి జనం తండోపతండాలుగా వచ్చే వారు. గంభీరమైన ఆ గొంతు, చదివే విధానం తల్చుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆఫ్ కోర్స్ , ఈ రోజుల్లోనూ టీవీలో వార్తలు చూస్తుంటే ఇతర కారణాలకి ఒళ్ళు “గిగుర్పొడుస్తుంది”…అంటే చికాకుతో ఒళ్ళు  “గోకేసుకునే” భావన కలుగుతుంది.  అయ్యో అని జాలి కూడా వేస్తుంది ! ఉదాహరణకి ఇటీవల మాలతీ చందూర్ గారు పోయినప్పుడు వార్తలు “చదువుతున్న” ఒక ఏంకరమ్మాయి “మాలతీ చందూర్ గారి ‘ప్రమాద వనం’  చాలా పాప్యులర్ అని ప్రవచించింది. “ప్రమదా వనం” కి వచ్చిన ప్రమాదం అది!

నమ్మండి, నమ్మక పొండి. 1957 లో రష్యా వాళ్ళు మొట్టమొదటి స్పుట్నిక్ ఉపగ్ర్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన వార్త రేడియోలో పన్యాల రంగనాథ రావ్ గారు చదవగా విని కొంత అర్ధం అయీ, కొంత అర్ధం అవకా గంగవెర్రులెత్తిపోయి ఈ స్పుట్నిక్ ఎక్కడ కనపడుతుందా, ఎంత జోరుగా ఆకాశంలో ఇటునుంచి ఘుం ఘుం అను దూసుకు పోతుందా అని ఆ రాత్రి అంతా మా డాబా మీద కళ్ళలో వత్తులు పెట్టుకుని ఎదురు చూశాను. ఆ రోజుల్లో ఆకాశంలో రాత్రి పూట అరుదుగా వెలుగుతూ, ఆరిపోతూ కనపడే విమానం లైటు చూసి, అదే రష్యా వారి స్పుట్నిక్ అనుకుని ఎగిరి గంతులు వేసాను. కేవలం రేడియో వార్తలు విని తలక్రిందులు అయిపోయిన ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పగలను.

కేవలం వార్తలే కాకుండా ప్రయాగ నరసింహ శాస్త్రి గారి బుర్ర కథలు, “ఏమండోయ్ బావ గారూ” అనే రాజకీయ విశ్లేషణ కార్యక్రమం, సీత-అనసూయ జానపద గేయాలు ఒకటేమిటి అనేక జీవిత కాలాలకి సరిపడా అద్భుతమైన రేడియో కార్యక్రమాలు వినే అదృష్టం నాకు కలిగింది.  నా  బాగా చిన్నప్పుడు..అంటే ఆటస్థలం కావాల్సిన క్రికెట్, ఫుట్ బాల్  వగైరాలు ఆడుకునే వయస్సుకి ఎదగని వయస్సులో ఆ పార్కులో ఆడుకోవడమే మా జీవిత ధ్యేయం. అక్కడ సిమెంటు జారుడు బల్ల మీద పోటీ లు పడి జారి, నెలకి అర డజను చెడ్డీలకి చిరుగులు పెట్టుకుని మా ఇంట్లో తిట్లు తినే వాడిని.  ఇప్పుడు ఎక్కడా చెడ్డీ చించుకుని ఆనందించే ఆటలే లేవు!  ఇటీవల నేను కాకినాడ వెళ్ళినప్పుడు ఎవరూ చూడకుండా మా పార్కుకి వెళ్లి, అదే జారుడు బల్ల మీద చెడ్డీ చిరక్కుండా ఒక్క సారే పై నుంచి కిందకి జారి, ఆనందించి వచ్చేశాను. ఆ రోజు అక్కడ నేనొక్కణ్ణే కుర్రాణ్ణి. మిగిలిన పిల్లలు బహుశా ఇళ్ళలో కంప్యూటర్లలో తుపాకీ ఆటలు ఆడుకుంటున్నారు.

సుమారు పదిహేనేళ్ళ క్రితం ఆ వాటర్  ఫౌంటెన్, రేడియో స్తంభం తీసి పారేసి యాభై అడుగుల గాంధీ గారి విగ్రహం పెట్టారు. ఇందుతో ఆనాటి ఫౌంటెనూ, ఈ నాటి గాంధీ గారి విగ్రహం ఫోటో జతపరుస్తున్నాను. ఆ పార్కులో ఇప్పటికీ ఉన్న కొన్ని వందల మొక్కలూ చెట్లలోకీ నాకు బాగా నచ్చేదీ, ప్రపంచంలో ఇంకెక్కడా నేను చూడనిదీ బాడ్మింటన్ బంతి చెట్టు. ఇది పార్క్ లో ఒక మూల (ఇప్పుటికీ స్టేట్ బేంక్ కి ఎదురుగుండా ఉంటుంది) వంద అడుగుల ఎత్తున ఉండి అచ్చు పసుపు రంగులో ఉండే బాడ్మింటన్ బంతి సైజు లో పువ్వులు పూస్తుంది. అవి ముట్టుకుంటే ఆ బంతి లాగే చాలా సున్నితంగా పట్టు తివాసీ నిమిరినట్టుగా ఉంటుంది.

554_Voleti  Parvateesam

ముందుగా నాకు జ్జాపకం ఉన్న కొందరి గురించి చెప్పుకోవాలంటే … మా చిన్నపుడు మా ఇంటికి వీధి వేపు కాక. మిగిలిన మూడు పక్కల ఇళ్ళకీ మాకూ మధ్య గోడలు ఉండేవి కాదు.   ఒక పక్కన వేంకటపార్వతీశ్వర కవులలో ఒకరైన ఓలేటి పార్వతీశం గారి ఇల్లు. ఆయన పెద్ద కొడుకు అచ్యుత రామ చంద్రమూర్తి గారి భార్య భాస్కరం పిన్నీ , మా అమ్మా ఒకే సారి కాపరానికి వచ్చారు. దాన్ని “కీర్తి” వారి ఇల్లు అనే వాళ్ళం. వారి కుటుంబమూ, మేమూ ఎప్పుడూ కలిసే ఉండే వాళ్ళం. మా మామిడి చెట్టు మీద వాళ్ళ పిల్లలూ (లేట్ నారాయణ, పార్వతీశం, లేట్ భాస్కరరావు ఎట్సేటారా), వాళ్ల నూతి దగ్గర జామచెట్టు మీద మేమూ ఎక్కి ఘంటసాల  పుష్ప విలాపం పాడుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటే “వెధవల్లారా, నూతిలో పడి మమ్మల్ని చపకండి రా” అని మా నలుగురు పక్కింటి వాళ్ళూ అరుస్తూ మమ్మల్ని తిడుతూ ఉంటే “వాళ్ల కోరిక ప్రకారం వాళ్ళని చంపకుండా”, “మేము చావకుండా”  మా చిన్నతనం హాయిగా గడిపాం. విశేషం ఏమిటంటే ఆనాటి  ఓలేటి పార్వతీశం అనే గొప్ప కవి గారి గురించి నాకు అప్పుడు తెలియదు కానీ మా ఇంటి ఎదురుగుండా గిడ్డీ గారి సందులో ఉండే ఆయన రెండో కొడుకు శశాంక చాలా మంచి కవి అని ఖచ్చితంగా తెలుసును. ఎప్పుడూ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వేషధారణలో ఉండే ఆయనా, ఆయన భార్యా (కందుకూరి వారి ఆడబడుచు. పన్యాల వారి తరువాత న్యూస్ రీడర్ గా మంచి  పేరు తెచ్చుకున్న కందుకూరి సూర్యనారాయణ గారి సహోదరి. ఆవిడ తమ్ముడు నటరాజ్ నాకు బొంబాయి లో సహాధ్యాయి) చాలా అందమైన జంట. వారి కొడుకే ఈ నాడు హైదరాబాద్ లో దూర్ దర్శన్ లో పెద్ద ఉద్యోగంలో ఉన్న ఓలేటి పార్వతీశం. (ఈయనని రెండేళ్ళ క్రితం మొదటి సారిగా విజయనగరం లో చాసో గారి స్పూర్తి సభలో కలిశాను.) భావ కవిగా ఎంతో పైకి వస్తున్న రోజులలో చిన్న వయసులో హఠాత్తుగా శశాంక పోయిన రోజులు నాకు యింకా బాగా గుర్తు. ఇక పార్కుకి ఒక మూలగా అప్పటి జిల్లా పరిషత్ సెక్రటరీ పుల్లెల రమణయ్య గారు (ఆయన సతీమణి అద్వితీయమైన సంగీత విద్వాంసురాలు.) ఉండేవారు.

Gandhi_Nagar_Park,Kakinada(1)

ఇక మా ఇంటి వెనకాల మా బంధువులైన తాళ్లూరి సుబ్బారావు గారు , అతని బామ్మ గారు, మా నారాయణ తాతయ్య గారు (మా బామ్మ గారి తమ్ముడు), మరొక పక్క రాచకొండ వారు, గిడ్డీ గారి సందులో టేకుమళ్ళ దుర్గా ప్రసాదరావు గారు (షావుకారు జానకి, కృష్ణకుమారికి పిన తండ్రి వరస అని గుర్తు), అప్పలాచార్య గారు, ఎదురు గుండా ఇంట్లో విఠాల సుబ్రమణ్యం గారు, పక్కనే చీమలకొండ వారు ఉండే వారు. ఆ రోజుల్లో మా వీధి కల్లా పెద్ద జోకు విఠాల సుబ్రమణ్యం గారు రాత్రి భోజనం అయ్యాక తేన్చే  తేనుపు తాలూకు శబ్దానికి అక్కడికి వంద గజాల దూరంలో పార్కులో మధ్యలో ఉన్న వాటర్ ఫౌంటెన్ లో బంగారం చేపలు ఉలిక్కిపడి ఈదడం మానేసి బయటకి గెంతేస్తాయిట! ఇక కాస్త దూరం వెడితే, పార్కుకి ఒక పక్క సినీ నటి జమున భర్త రమణారావు కుటుంబం ఉండే వారు. జమున తమ్ముడు గిరిధర్ , అతని పిల్లలు మాకు ఆత్మీయులే.  పార్కుకి వెనకాల వేపు నేను చదువుకున్న ప్రాధమిక పాఠశాల అనే “దుంపల బడి”, పురపాలకోన్నత పాఠశాల, అటుపక్క ఒంటి మామిడి జంక్షన్ దగ్గర ఈ నాటి వైఎస్సార్ పార్టీ నాయకుడు , సినీ నటుడు విజయ చందర్ కుటుంబం ఉండేది. అతను ఎప్పుడూ మా ఇంటికి వచ్చి, మా చెల్లెళ్ళని పార్కుకి తీసుకెళ్ళే వాడు, ఆడించడానికీ, రేడియో వినడానికీ. ఇక  ఆ ప్రాంతాలలోనే  అలనాటి స్వాతంత్య సమరయోధులు, పార్లమెంట్ మెంబర్ మరియు గవర్నర్ గా చేసిన మొసలికంటి తిరుమల రావు గారు ఉండేవారు. ఆ వీధిలో శంకరం గారు, టీకాల ఇన్ స్పెక్టర్ గారు (ఏడిద వారు), కరణం వారూ, దిగుమర్తి గోపాల స్వామి గారూ మొదలైన వారు ఉండే వారు. ఇందులో శంకరం గారు “సకల విద్యా పారంగతులు” ..అనగా ఆయనే మా హోమియోపతీ వైద్యులు, ఇన్సూరెన్స్ ఏజెంటు, మా వార్డు కి మ్యునిసిపాల్ కౌన్సిలరు, జైలు కెళ్ళిన గాంధేయ వాది….నిరంతరం తెల్ల ఖద్దరు వస్త్రదారి. ఇక సుప్రసిద్ద రాజకీయ నాయకులూ, మా కుటుంబానికి బాగా సన్నిహితులూ, కపిలేశ్వరపురం జమీందారులు, అయిన స్వర్గీయులు ఎస్.పి.బీ.కె. సత్యనారాయణ రావు గారు (కేంద్ర మంత్రి), ఎస్. పి. బి. కె. పట్టాభి రామారావు గారు (రాష్ట్ర మంత్రి) వారి నివాసం సరిగ్గా మా ఇంటికి ఎదురుగానే.  అందులో పట్టాభి రామారావు గారి ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్నికలకి మా చిన్నన్నయ్య ఎలెక్షన్ ఏజెంట్ గా వ్యవహరించి నప్పుడు ఆయన నెగ్గగానే, మా అన్నయ్యని హెలికాప్టర్ లో  తిరుపతి తీసుకెళ్ళి ఎంతో గౌరవం చేశారు. మా నాన్న గారికి ఎంతో సన్నిహితులైన సత్యనారాయణ రావు గారు నా పెళ్లి విందుకి వచ్చి నన్నూ, మా ఆవిడనీ ఆశీర్వదించారు.  ఆ ఇద్దరు జమీందారులూ, మా నాన్న గారూ, మా చిన్నన్నయ్యా కూడా స్వర్గస్తులే అయినా కులాలకతీతంగా ఉన్న ఉన్న ఆ అనుబంధాల గురించి నాకు ఉన్న కొన్ని జ్జాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. అలాగే అప్పటి ఎమ్మెల్యే ఎం.వీ. శాస్త్రి గారి కుటుంబం మాకు ఎంతో ఆప్తులు. వీళ్ళలో నేను చెప్పనిది కాకినాడలో మొట్టమొదటి సినిమా హాళ్ళు (పేలస్ టాకీస్, క్రౌన్ టాకీస్) కట్టిన గొలగాబత్తుల రాఘవుల గారి రెండో కొడుకు, మాకు అత్యంత సన్నిహితుడూ అయిన స్వామి నాయుడి గురించి. అతని గురించి ఎప్ప్పుడో చెప్పితీరతాను.  అసలు మా చిన్నప్పడు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే..ఇప్పుడు అక్కడ కాకినాడ లోనూ, ఇక్కడ హ్యూస్టన్ లోనూ మా నైబర్స్ ఎవరో నాకు చూచాయగానే  తెలుసును. ఇప్పుడు ఇక్కడా కూడా అన్ని ఇళ్ళలోనూ ఎప్పుడూ తలుపులు మూసుకునే ఉంటాయి. అంతా గూఢుపుఠాణీయే. ఎక్కడి దొంగలు అక్కడే గుప్ చిప్!

ఇక అవకాశాలు ఉన్నా, అదృష్టానికి నోచుకోక నేను ఎప్పుడూ చూడని దేవులపల్లి కృష్ణశాస్త్రి, నటి సూర్యాకాంతం, పాలగుమ్మి పద్మరాజు, దుర్గాబాయమ్మ గారు, నేను చూసిన వారూ,  పెద్దయ్యాక బాగా పరిచయం ఉన్నవారిలో కొందరైన ఈమని శంకర శాస్త్రి , చిట్టి బాబు, పాలగుమ్మి విశ్వనాథం, బులుసు వేంకటేశ్వర్లు సోదరులు, హాస్య నటుడు నల్ల రామ్మూర్తి, ఎస్. వి. రంగారావు, మొదలైన లబ్ధ ప్రతిష్టులు మా ప్రాంతాలలోనే ఉండే వారు.  అన్నట్టు నటి సూర్యాకాంతానికీ, మా కుటుంబానికీ ఉన్న పెద్ద కనెక్షన్ ఆడారివాడిలా నడిచే తమ్మయ్య లింగం అనే టైలర్. తాను ఎప్పుడు తమ్మయ్య లింగం చేత గౌను కుట్టించుకున్నా  “సరిగ్గా కుట్టాడా, చూసి చెప్పండి” అని రింగు, రింగులుగా తిరుగుతూ సూర్యాకాంతం మా ఇంటికి వచ్చి మా అమ్మని సలహా అడిగేదిట!

ఇక బులుసు సోదరులు సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో పండితులు. కానీ వారి వేషదారణని బట్టి  వారిద్దరినీ “దలైలామా- పంచెన్ లామా” అనీ, “పెద్ద బులుసూ-చిన్న బులుసూ” అని కుర్రాళ్ళు పిలిచేవారు.  అందులో పెద్ద  బులుసు గారు రామారావు పేటలో మా సెకండరీ స్కూల్ కి, ఈశ్వర పుస్తక భాండాగారానికీ ఎదురుగుండానూ మేడలో ఉండే వారు. తన “వ్యాస పీఠం” మీద ఆయన నేల మీద కూచుని చదువుకుంటూనో, వ్రాసుకుంటూనో ఉండే ఆయన్ని ప్రతీ రోజూ చూసే వాడిని కానీ తొలికేంద్ర సాహిత్య గ్రహీతలలో ఒకరు అయిన ఆయన గురించి నా చిన్నప్పుడు నాకు తెలిస్తే ప్రతీ రోజూ ఆయనకీ శిరస్సు వంచి పాదాభివందనం చేసే వాణ్ణి.  ఇక ఆ వీధిలో మరొక నాలుగు అడుగులు వేస్తే , వీణ చిట్టి బాబు-ఈమని-పాలగుమ్మి వారి ఇళ్ళు. రోజూ అలాగే వెళ్ళినా ఒక్క రోజు కూడా అక్కడ ఆగి  నమస్కారం పెట్టుకునే “బుద్ది” నాకు ఆ చిన్నతనంలో లేదు.  అయితే నేను “పెద్దయ్యాక” వీణ చిట్టి బాబు గారు ఇండియాలోనూ,  అమెరికా వచ్చినప్పుడూ బాగా పరిచయం అయ్యారు.

వీరందరిలో ఇప్పటికీ తలచుకుంటే నాకు “భయం” వేసేది మహా నటుడు ఎస్వీ రంగారావే. ఆయన్ని చూసింది కూడా అరగంటే! ఆయన మా ఇంటి దగ్గరే ఉండే కోకా నరసింహా రావు గారు అనే ఎముకల డాక్టర్ గారికి బంధువు. ఒక సారి రంగారావు గారు వారింటికి వచ్చినప్పుడు కాకినాడ దగ్గర చింతపల్లి అడవులలో వేటకి వెళ్లి, ఒక పెద్ద పులిని చంపి, పెద్ద లారీలో దాన్ని తీసుకొచ్చి మా గాంధీ బొమ్మ దగ్గర ప్రదర్సనకి పెట్టి ఆర్భాటం చేసారు. అది చూడడానికి నేను వెళ్లినప్పుడు రంగారావు గారు పెద్ద తుపాకీతో ఆ పులి తలదగ్గర నుంచుని ఫోటో తీయించుకుంటున్నారు. చుట్టూ ముగిన జనం మోకాళ్ళ మధ్య లోంచి ముందుకు వెళ్లి ఆయన్నీ, తుపాకీనీ, చచ్చిపడున్న ఆ పది అడుగుల పెద్ద పులినీ చూసి  హడిలి చచ్చిపోయాను. ఇప్పటికీ ఆ సీను తలచుకుంటే ..వావ్! ఇదంతా “పాతాళ భైరవి” సినిమా తరువాత అని వేరే చెప్పక్కర లేదు.

_2008_Bulusu_Sambamurty

ఆఖరి అంశంగా … నాకు పదమూడు ఏళ్ల వయస్సులో .. ఒక రోజు కాకినాడ నగరం అంతా “విషాదం” లో ములిగి పోయింది. ఆ రోజు “మహర్షి” బులుసు సాంబమూర్తి గారు కేవలం 72 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో, ఏకాకిగా, దరిద్ర నారాయణుడిగా “జీవించ” లేక మరణించారు. ఆ రోజు “ఎవరో పెద్దాయన పోయారు” అని మా స్కూల్ కి శలవు ఇవ్వగానే క్రికెట్ ఆడుకోడానికి వెళ్ళిపోయిన “చిన్నతనానికి” ఇప్పటికీ నాకు ఇప్పటికీ సిగ్గేస్తుంది. ఎందుకంటే టంగుటూరి ప్రకాశం గారి తో సమాన స్థాయిలో క్రిమినల్ లాయర్ గా ఆ రోజుల్లోనే లక్షాధికారి అయిన సాంబమూర్తి గారు అన్నీ త్యాగం చేసి , గాంధీ గారి కంటే ముందే కొల్లాయి కట్టిన దేశభక్తులు.  1923 లో కాకినాడ లో కాంగ్రెస్ సభలు జరగడానికి ప్రధాన కారకులు, నిర్వాహకులు ఆయనే. నేను చిన్నప్పుడు విన్న విషయం ఏమిటంటే ఆయన ఆ కాంగ్రెస్ సభలో ప్రసంగం మొదలు పెట్టగానే ఎవరో ఒక చిన్న చీటీ ఆయన చేతిలో పెట్టారుట. అది చదివి, మడిచి జేబులో పెట్టుకుని సాంబమూర్తి గారు తన ప్రసంగం పూర్తి చేసి సభాస్థలాన్ని విడిచి మర్నాడు తిరిగి వచ్చారుట. “మీ కొడుకు అరగంట క్రితం మరణించాడు. మీరు వెంటనే ఇంటికి వెళ్ళాలి” అన్నదే ఆ చీటీలో ఉన్న వాక్యం. ఒక కర్మయోగిగా “మహర్షి” అనే పేరుతో సాంబమూర్తి గారు అప్పటినుంచీ లబ్ధప్రతిష్టులయ్యారు.  ఆ తరువాత  ఆయన 1926 లో దేశం లో తొలి సారిగా “మనకి డొమినియన్ స్టేటస్ కాదు. “పూర్ణ స్వరాజ్యం” కావాలి అని ప్రతిపాదించిన మహానుభావుడు కూడా ఆయనే. మద్రాసులోని సాంబమూర్తి గారి గృహంలోనే మరొక మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం అవతరణకి ప్రాణత్యాగం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం, స్వరాష్ట్రం కోసం ఆ ఇద్దరూ చేసిన త్యాగాలు ఈ నాడు “దౌర్భాగ్యుల” సంక్షేమం కోసమేనేమో అని నాకు అనిపిస్తోంది.

ఇందులో “నీతి” ఏమిటంటే చిన్నప్పుడు తెలియక నా చుట్టుపక్కల ఉన్న “అదృష్టాలని” గుర్తించలేక పొరపాట్లు చేసినా, “ఇప్పటికైనా మించిపోలేదు సుమా, అసలు జీవితం ఇపుడే కదా మొదలయ్యిందీ: అని నాకు నేనే  అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఉంటాను….నా అదృష్టాలని వెతుక్కుంటూ…ఆనందపడుతూ!

…..వంగూరి చిట్టెన్ రాజు, హ్యూస్టన్

Download PDF

7 Comments

  • కాకినాడ గురించి మీ జ్ఞాపకాలు అద్భుతంగా ఉన్నాయి. అందులో శ్రీ పన్యాలరంగనాధరావుగారి గురించైతే మరీనూ.

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      మీ స్పందనకి ధన్యవాదాలు.

      మా తరం వారికి “గొంతు” లో మాధుర్యం వినపడితే ఈ తరం వారికి “అందచందాలలో” వార్తలు “కనపడుతున్నాయేమో?” అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ “తప్పు” లేదు కదా!

  • voleti venkata subbarao ( eliyaas uncle) says:

    పన్యాల రంగనాధ రావు గారిని హైదరాబాద్ , ఆబిడ్స్ – మార్గదర్శి బిల్డింగ్స్ లో -ఈ నాడు సితారా పత్రికా సంపాదకునిగా ఉన్న రోజులలో కలిసిన సందర్భం నా స్మృతి పేటిక లో ( మెమరీ బాక్ష్ ) లో భద్రం గా ఉంది -ఆ సమావేశాన్ని జ్ఞాపకం చేస్తూ – ఆయనకు వ్రాసిన ఉత్తరానికి ఆయన ఇచ్చిన జవాబు ( ఉత్తరం ) కూడా మరో జ్ఞాపకాల ఖజానా లో నేటికీ అతి భద్రం గా ఉంది -రాజు గారు – ఆ పెట్టె ను తీయించారు ఇప్పుడు మీరు నాచేత – ధన్యవాదాలు

  • Nageswara Rao says:

    కాకినాడ గురినిచి చాలా అద్భుతంగా రాశారండీ, ధన్యవాదాలు. నేను కూడా కాకినాడలో ఉందీ అదృష్టానికి నోచుకొన్నాను. ఇంజనీరింగ్ అక్కడే చదివాను. రామారావు పేటలోనే ఉండేవారం (నాగేశ్వర రావు వీధిలో). నిజంగానే ఏంతో గొప్ప పట్టణం, సరస్వతి నిలయం. మీరు వర్ణించిన పార్కులో లెక్కలేనన్ని సాయంత్రాలు గడిపాను.

    క్రౌన్ టాకీస్ స్వామి గారి గురించి ఒక ప్రశ్న – సాయి గారని బాబా భక్తులు ఒకాయన ఉండేవారు, ఆయన మీకు తెలుసా? ఆయన స్వామి నాటుడు గారికి బంధువా?

  • Nageswara Rao says:

    తెలుగు టైపింగ్ లో తప్పులు దొర్లాయి, క్షమించండి.

  • G Lalitha says:

    Thanks for mentioning my grand father Tekumalla Prasada rao garu, Giddivari Sandu. I grew up there & remember every spot you mentioned & my child hood came back to me. Incidentally I studied in municipal high school, Gandhinagar in the same class of your younger brother.

    Sorry I don’t know how to type telugu letters.

  • vani vinjamuri jain says:

    మీ కాకినాడ అనుభవాలు చిర పరిచితం గ వున్నాయి. గాంధీ బొమ్మ దగ్గిర వుండే సింగ్ హోటల్ గురించి మరిచి పోయారెం?
    మా శశాంక మావయ్యని మరో మారు గుర్తు తెప్పించారు చాలా సంతోషం.
    నా చిన్న తనంలో నేను కూడా ఆ స్కూల్కి వెళ్లాను. మా ఇల్లు తిరుమలరావు స్ట్రీట్ లో వుండేది. ఆ పార్కూ ఆ టెన్నిస్ బాల్ చెట్టూ ఆ చేపలూ ఎలా మరిచి పోగలం!!!
    థాంక్స్.

Leave a Reply to Nageswara Rao Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)