ఇంత ఆలస్యంగా ఇపుడెందుకు అనేది ముందుగా మాట్లాడుకోవాలి. మిధునం తెరపై చేసిన హడావుడి కంటే తెరవెనుక చేస్తున్న హడావుడి ఎక్కువ. అదిప్పటికీ తెగట్లేదు. ఇంకా తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచి లోపం గురించి బాధపడుతున్నవారూ, ఇంతటి సంస్కారవంతమైన సినిమాను ఆదరించలేని మన దౌర్భాగ్యం గురించి వగచుతున్న వారూ ఇంటర్నెట్లో కనిపిస్తూనే ఉన్నారు. కాస్తో కూస్తో ఆరోగ్యంగా ఆలోచిస్తారని భావించేవారు కూడా ఈ శోకగీతంలో తమవంతుగా గొంతు కలుపుతున్నారు. మిధునం గురించి ఎవరో ఏదో విమర్శనాత్మకంగా మాట్లాడారని తెలిసి ఇంత మంచి సినిమాను మెచ్చుకోవడానికి సంస్కారం ఉండాలి అని ఒక్కవాక్యంలో తిట్టిపోశారు ఒక కవిమిత్రుడు. ఆ మధ్య పాలపిట్ట అనే మ్యాగజైన్లో ఇంకొక వ్యాఖ్య చేసి ఉన్నారు. ఇంత గొప్ప సినిమాను విమర్శించడానికి అసలు ఎవరికైనా నోరెలా వస్తుంది అన్నది సారాంశం. అభిరుచి కలిగిన మరికొందరు సాహితీ మిత్రుల ధోరణి కూడా అలాగే ఉంది. ఒక సినిమా గురించి ఇన్ని తప్పుడు అభిప్రాయాలు అచ్చోసి వదిలేస్తా ఉంటే చూస్తూ ఊరుకోవడం సామాజికుల పని కాదు. బెటర్ లేట్ దెన్ నెవర్.
మిధునం గురించి తరచుగా వినపడే మాటలేమిటి? అది సంస్కారవంతమైన సినిమా. మానవసంబంధాలను ఉన్నతీకరించిన సినిమా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని అపురూపంగా చిత్రించిన సినిమా. నగరజీవనంలో మృగ్యమైపోతున్న సున్నితమైన అంశాలను ఎత్తిపట్టిన సినిమా. ఎక్కడికి పరిగెడుతున్నామో ఎందుకు పరిగెడుతున్నామో తెలీని మ్యాడ్ రష్లోంచి బయటకు వచ్చి మనలోపలికి మనం తరచి చూసుకునేలా చేసిన సినిమా. కొంచెం అటూ ఇటూగా ఇలాంటివే. సంస్కారం అనే పదం వినిపించినంతగా సెన్సిబిల్ సినిమా అని వినపడదు. సెన్సిబిల్ అనేది సాధారణంగా విలువలకు సంబంధించిన పదంగా వాడుతున్నాం. అస్తిత్వ్ సెన్సిబిల్ సినిమా, షిప్ ఆఫ్ థీసెస్ సెన్సిబిల్ సినిమా అంటాం. కానీ సంస్కారం కథ వేరు. ఎలాగైనా వాడుకోదగిన ఎలాస్టిసిటీ ఉన్న పదం. సంస్కారం, సంప్రదాయం, ధర్మం స్టేటస్ కోయిస్టులకు ఇష్టమైన పదాలు. అవి వ్యవస్థీకృత విలువలకు సాంస్కృతికపరమైన ఔన్నత్యాన్ని కట్టబెట్టే పదాలు. అందరూ కావాలని అదే అర్థంతో వాడతారని కాదు. కానీ వాడుకలో స్థిరపడిన రూఢి అర్థమైతే అదే.
ఇంతకూ ఏమిటీ సినిమా? శ్రీరమణ గారి మిధునం కథకు తెరనుకరణ. ఒక పల్లెటూరులో విశాలమైన పెరడు, చేద బావి, లతలు, తీగలు, చెట్లు చేమలు, గొడ్డూ గోదాతో పెనవేసుకున్న ఆలుమగల అనుబంధం. సంప్రదాయంగా వస్తున్న ప్రచారానికి అనుగుణంగా కనిపించే స్టీరియోటైప్ తిండిపోతు అప్పదాసు, బుచ్చిలక్ష్మి దంపతుల కథ. సోమయాజి, సోమిదేవమ్మలకు ఆధునిక రూపమన్నమాట. ముగ్గులు వేయడాలు, ఇల్లు అలకడాలు, నోములు, పూజలు, ఆలుమగల మధ్య అలకలు, చిలిపి సరదాలు, అప్పలస్వామి తిండియావకు సంబంధించిన రుచులూ, సంప్రదాయ జీవనవిధానానికి సంబంధించిన అభిరుచులూ అన్నీ కలగలిపి కట్టిన ఇంగువ మూట ఈ సినిమా. ఇద్దరే పాత్రలు. లంకంత కొంప. అందులో చెప్పన్నారు తీగలు, చెట్లు. అన్నీ నేరుగా కోసుకుని తినేయడమే. అప్పదాసు తన పనులన్నీ చేసుకోవడమేకాదు, ఇతరులు చేసే పనులను కూడా నశ్యం పీల్చినంత వీజీగా చేసేస్తూ ఉంటాడు. దూది ఏకుతాడు. కుండలు చేస్తాడు. బంగారం పని చేస్తాడు. చెప్పులూ కుడతాడు. సినిమాలో విశ్వనాధ్ ఎక్కువగానే కనిపిస్తారు. బాపు అపుడపుడు కనిపిస్తారు. సంప్రదాయ జీవనవిధానాన్ని ఆకాశానికెత్తుతూనే ఆధునికతతో భాగంగా వచ్చిన పర్యావరణ స్పృహను, ప్రైవసీ భావనను కలిపి కొట్టడం తెలివైన ఎత్తుగడ.
60దాటిన అమ్మానాన్నల ప్రేమ కథ అని ఒకట్యాగ్ లైన్ ప్రచారం చేశారు. ఈ అమ్మ “కాలుమోపితే ఎండిపోయిన కందిచేను పూత పెట్టే లచ్చుమమ్మ” కాదు. “ఎద్దోలె ఎనుకాకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసే లచ్చుమమ్మ” కాదు. ఎకరాలకెకరాల చెట్లను, గొడ్డుగోదలను చిరునవ్వు తొణక్కుండా పోషించే సూపర్మామ్ బుచ్చిలక్ష్మి. ఆ నాన్న కూడా “శిలువ మోస్తున్న ఏసుక్రీస్తులా నాగలి భుజాన వేసుకున్న” రైతో మరొకరో కాదు. శిష్ట జీవనం సాగిస్తూనే సహస్రవృత్తుల సమస్త చిహ్నాలను తనలోనే ప్రదర్శించే సూపర్మాన్ అప్పదాసు. శ్రమైక జీవన సౌందర్యం అని శ్రీశ్రీ అన్నాడు కదాని శ్రమను మరీ ఇంత అందంగా చూపిద్దామంటే ఎలాగండీ భరణి గారూ! శారీరక శ్రమ మరీ అంత గ్లామరస్గా ఏమీ ఉండదండి! అది కష్టజీవులకందరికీ తెలుసండీ. శ్రమను గౌరవించడమంటే దాన్ని గ్లామరైజ్ చేసిచూపడం కాదండీ! ఆధునిక పరిశ్రమ వృత్తులు అనే బానిసత్వంలో మగ్గిపోయిన మనుషులకు కొత్త వెలుగు చూపించింది. శ్రమచేసే కులాలకు వెసులుబాటునిచ్చింది. “వేల సంవత్సరాలుగా చలనం లేకుండా పడి ఉన్న” భారతీయ సామాజక వ్యవస్థలో ఆధునిక పరిశ్రమ కుదుపు తెచ్చింది. రైళ్ల ప్రవేశంతో ఏమేం జరుగుతాయని విశ్వనాధ సత్యనారాయణ బెంగటిల్లాడో అవన్నీ ఇపుడు జరుగుతున్నాయి. చెప్పుల గూటాల నుంచి, మగ్గం గుంతల నుంచి కొలిమి మంటలనుంచి బయటపడడం వల్లే ఇవాళ అలాంటి కులాల పిల్లలు చాలా మంది అంతకుముందెన్నడూ చూడని రీతిలో డాక్టర్లు, లాయర్లు, కంప్యూటర్ ఇంజనీర్లు అయి సామాజిక సంపదలో తమవంతు వాటా అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంతకు ముందు తమను చిన్నచూపు చూసినవారి సరసన కూర్చోగలుగుతున్నారు. మళ్లీ ఇపుడు వృత్తులను ఆరాధించే పద్ధతిలో వాటి చిహ్నాలను చూపిస్తే అబ్బో, మమ్మల్ని గౌరవించాడు అని ఎగబడి చూడాలా! ఏమియా ఇది! ఏమి మాయయా ఇది!
అప్పదాసు స్వర్గానికి సెంటీమీటర్ దూరంలో అని వర్ణించే రుచులు తెలుగునాట కేవలం ఐదు శాతం లోపువారి రుచులు. ఆ వ్రతాలు, నోములు, వగైరా కూడా మైనార్టీ వ్యవహారమే. అయినా సరే, ఇది తెలుగువారు సగర్వంగా ఎగరేసిన పతాకం, తెలుగుదనానికి అచ్చమైన చిరునామా, తెలుగోడి సత్తా లాంటి మాటలు బోలెడన్ని వినిపించాయి. వినిపిస్తూనే ఉన్నాయి. కేవలం ఐదు శాతం లోపు ఉన్నవారిలోని సంప్రదాయవాదుల ఆచార వ్యవహారాలు, వారి గోములు, అలకలు, చిలిపితనాలు మొత్తం తెలుగుదనానికి పర్యాయపదంగా చాటగలిగిన ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? ఆ ప్రచారాన్ని నోరుమూసుకుని చూసే దశకు మనం ఎందుకు చేరుకున్నాం? ఒక కులం చిహ్నాలు కనిపించినంత మాత్రాన దాన్ని వ్యతిరేకించాలా, అందరికీ వర్తించే కొన్ని అనుభూతులుంటాయి కదా అనే ప్రశ్నలు తలెత్తొచ్చు. అంతవరకే ఉంటే సమస్య లేదు. సినిమాను సినిమాగా చూసి మంచిచెడ్డల గురించి మాట్లాడొచ్చు. కానీ ఇది తెలుగు సంస్కృతి,సంస్కారం అనడంలోనే అసలు సంగతి దాగిఉంది. కొలకలూరి ఇనాక్ కథనో, నాగప్పగారి సుందర్రాజు కథనో, వేముల ఎల్లయ్య కక్కనో ఇలాగే సినిమా తీసి ఇది తెలుగు సంస్కృతి అంటే ఇలాగే ఆమోదించి ఉండేవారా? గ్రామీణజీవితాన్ని నిజాయితీగా చిత్రించిన నామిని, బండినారాయణస్వామి కథలను సినిమాలుగా తీస్తే ఇలాగే తెలుగు సంస్కృతి అని నెత్తిన పెట్టుకునే వారా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోకపోవడంలోనే బానిసత్వం ఉంది. సమాజంలో ఆధిపత్యంలో ఉన్నవారి సంస్కృతే మొత్తం సమాజపు సంస్కృతిగా ప్రచారంలో ఉంటుంది. ఇతరులది ఇతరంగానే ఉంటుంది. పట్టణీకరణతో ఆధిపత్య ప్రదర్శనకు అవకాశం లేకుండా పోయిన కులాలు ఏదో రూపంలో తిరిగి తలెగరేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాయి. తెలుగు సమాజంలో ఆర్థిక రాజకీయ ఆధిపత్యం కోల్పోయి చాలాకాలమే అయినా సంస్కృతి విషయంలో పట్టు నిలుపుకోవడానికి బ్రాహ్మణవాదులు పెనుగులాడుతూ ఉన్నారు. ఇదే సమయంలో కొంతమంది ఇతర అగ్రవర్ణ లిబరల్స్లో కూడా నగరీకరణ మీద విసుగు కనిపిస్తోంది. నగరజీవితపు పరుగుపందెంపై నిరసనా, పల్లెజీవితంతో పాటు కోల్పోయిన ఆనందాలపై వలపోత ఇతరత్రా సమూహాలకు పాకుతున్నది. ముఖ్యంగా పట్టణీకరణవల్ల ప్రయోజనాలు పొందడంలో ముందున్న సమూహాల్లో. ఆయా కుటుంబాల్లో రెండో అర్బన్తరం కూడా వచ్చేసి ఉంటుంది. ఇతరత్రా ఆధిపత్యాన్ని సవాల్ చేయలేనపుడు ఈ రకంగా ఆమోదనీయమైన మార్గంలో ముందుకు రావాలని ఆ సమూహం ప్రయత్నిస్తోంది. భాష పేరుతో సంస్కృతి పేరుతో ముందుకొస్తున్న బృందాలను, వారి భాషను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇరవై యేళ్ల క్రితం హైదరాబాద్ శంకర్మఠ్, విద్యానగర్ లకు చెందిన వృద్ధులు సాయంత్రాల్లో ఆర్ట్స్ కాలేజీ రైల్వేస్టేషన్ బెంచీలమీద సాయంత్రం కూర్చుని అమెరికాలోని సంతానం గురించి బెంగగా గోముగా చిరుకోపంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. ఇపుడు అలాంటి వృద్ధులు అన్ని ప్రాంతాల్లో అన్ని కులాల్లో పెరిగిపోయారు.
వాళ్లు పిల్లలను అడగాల్సిన అవసరం లేకుండా ఖర్చు చేసుకునే స్వ్చేఛ్చ ఉండాలనుకుంటారు. పట్నవాసపు ఉద్యోగ జీవితాలు, నెలవారీ పెన్షన్లు, అద్దెలు మధ్యతరగతి వృద్ధులకు అలాంటి అవకాశాన్ని కల్పించాయి. అలాగే ఆధునికతతో పాటు వచ్చిన ప్రైవసీ అనే భావన పల్లెటూరి వృద్ధులకు లేని ఒక అదనపు సౌకర్యాన్ని వారికి కల్పించింది. అదే సమయంలో పల్లెటూరి మాదిరి(ఇది కూడా భ్రమే) కొడుకు కోడళ్లపై కొంతైనా పెద్దరికం చెలాయిద్దామని ఉంటుంది. మనమడు, మనుమరాలు కంప్యూటర్లతోనో ఫ్రెండ్స్ తోనో కాకుండా తమ ఒడిలో కబుర్లు చెప్పుకుంటూ, కొడుకు కోడళ్లు అన్ని విషయాల్లో సలహాలడుగుతూ ఉంటే బాగుండునని కూడా ఉంటుంది. వృద్ధులనే కాదు, పల్లె, పట్టణ జీవితం రెండూ తెలిసిన తరంలో చాలామందికి రెంటిలోని సానుకూలమైన అంశాలను అందుకోవాలని ఉంటుంది. రెండు జీవన విధానాలకు మధ్య వైరుధ్యం ఉన్నదని తెలిసినప్పటికీ ఒకదాన్ని వదులుకోవడానికి మనసు అంగీకరించదు. ఆచరణలోనేమో ఆర్థికాభివృద్ధికి అవసరమైన వలసబాటలో పయనిస్తారు. గ్రామీణ జీవనంలో కోల్పోయిన ‘ఆనందాల’ కోసం గొణుగుతూ ఉంటారు. ఎన్ఆర్ఐల్లో ఈ వలపోత మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆకలి తీరిన మనిషి ఆనక తనదైన సొంత అస్తిత్వం కోసం ఆరాటపడతాడు. అక్కడ సొంత అస్తిత్వాన్ని విజువల్గా చూపించుకోవడానికి భరతనాట్యాలు, బతుకమ్మలు ఆడుతుంటారు. పర్వాలేదు. మనకు తెలుగు భాషా సంస్కృతుల రక్షణ గురించి ఉపన్యాసాలు ఇవ్వనంత వరకూ అది అర్థం చేసుకోదగిన ఆరాటమే.. పల్లెటూరి జీవన విధానం పట్ల ఉన్న గ్లామర్ను, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ప్రైవసీ అనే కాన్సెప్ట్ని కలిపి వడ్డించింది ఈ సినిమా. రెండూ అతకని విషయాలు. అందుకే ఈ సినిమా శిల్పారామంలో ప్రదర్శించే పల్లెలూరి ఇల్లులాగా ఉంది తప్పితే సహజంగా లేదు. పట్టణీకరణ ఆరంభదశలో అంటే 60, 70ల కాలంలో తెలుగుసినిమా “రెక్కలు వచ్చి పిల్లలు వెళ్లారు, రెక్కలు అలిసి మీరున్నారు, పండుటాకులమై మిగిలేము” అని పాడుకుంది. పట్నపు కోడలనగానే మిడ్డీనో గౌనో వేసి నోట్లో సిగరెట్ పెట్టి నానా యాగీ చేసింది. నాటి పల్లె నేటి పట్నమయ్యింది. నాటి పట్నం ఇపుడు అమెరికా అయ్యింది. కాకపోతే పల్లె పట్టణాన్నిఆడిపోసుకున్నంత ఈజీగా ఆడిపోసుకోవడం కష్టం. సంపదను చాలామందే అనుభవిస్తున్నారు. దగ్గరి బంధువో, స్నేహితుడో ఎవరో ఒకరు అమెరికాలో లేని మధ్యతరగతి ఇల్లు ఒక్కటి కూడా కానరాని స్థితి. అందువల్ల ఆ భాష వదిలేసి దాని బదులు ఉమ్మడి మిత్రుడు గ్రామం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ప్రాక్టికల్గా మనం వెళ్లకపోయినా అలా అనుకుంటూ ఉండొచ్చు. అదొక అందమైన కలగా చూసుకుంటూ ఉండొచ్చు. ఈ దశకు చాలామందే చేరుకున్నారు. ఈ పరిణామమే ఈ సినిమాకు ప్రేరణ.
ఇందులో సోమయాజుల వారు భార్య చీర ఉతకడం, ఆ సందర్భంగా ఏమిటండీ ఇది అని ఆమె కంగారుపడిపోతే ఆయనగారు రోమాంటిక్ డైలాగులు కొట్టడం లాంటి లిబరల్ షో చేశారు. కానీ సోమయాజివారు తూగుటుయ్యాలలో పవ్వలిస్తుంటే సోమిదేవమ్మ గడపమీద కొంగుపర్చుకుని తలవాల్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఎవరెక్కడుండాలో అక్కడే ఉండాలమ్మా! సరదాగా ఒక పూట రోల్ ఛేంజ్ చేసుకుంటాం కానీ పూర్తిస్థాయిలో మార్చుతామంటే ఊరుకోము! అంతేనా భరణిగారూ! “వంటావార్పూ, పిండిరుబ్బడం, బట్టలుతకడం, ముగ్గువేయడం లాంటివన్నీ చేస్తా ఉంటే జబ్బులెందుకొస్తాయి” అని సోమయాజి ఉరఫ్ అప్పదాసు ఉరఫ్ భరణి గారు ఒక ఉపన్యాసమిస్తారు. ఈ పనులన్నీ ఎవరు చేసేవి? ఈ ఉపదేశం ఎవరికిస్తున్నట్టు? ఒకసారి కాళ్లు పట్టిచ్చి, మరోసారి జడవేసి నాలుగు రొమాంటిక్ డైలాగులు చిలకరించినంత మాత్రాన సారం మారుతుందా! ఏ సంప్రదాయ జీవనవిధానమైనా స్ర్తీలను అణచివుంచేదే. ఆడవాళ్లను ఆడిపోసుకోవడమొక్కటే కాదు. ఇందులో మూఢనమ్మకపు ప్రచారమూ దాగి ఉంది. మనం కెమికల్స్ కూడు తిని అనారోగ్యంగా తయారయ్యామని, గ్రామాల్లో రోగాలు రొస్టులు లేకుండా ఇంతకంటే ఆరోగ్యంగా జీవిస్తారని మేధావులకునేవారు కూడా నమ్మేస్తూ ఉంటారు. ఇది కూడా పల్లెజీవితం తెలీని గ్లామర్ వ్యవహారమే. పల్లెల్లో కనీసం రోగం పేరుకూడా తెలీకుండా రాలిపోతూ ఉంటారు. అది కేన్సర్ అని గుండెపోటు అని తెలీకుండా హఠాత్తుగా పోతే కాటికి మోసుకుపోతా ఉంటారు. చివరికి మలేరియాతో కూడా చచ్చిపోవడమే. అక్కడ అరవై దాటితే కృష్ణా రామా అని మూలన కూర్చోవాల్సిన వయసుకు చేరుకున్నట్టే. వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఈ వయసు కొంచెం అటూ ఇటూగా ఉంటుంది. పెరిగిన ఆరోగ్యస్పృహతో మెరుగైన వైద్యసౌకర్యాలతో హెల్త్ చెకింగులతో, ఇన్సూరెన్స్లతో మనం వారికంటే మెరుగైన పరిస్థితుల్లో ఉన్నాం. 70ల్లో కూడా టింగురంగా అంటూ టీషర్ట్, నిక్కరూ వేసుకుని తిరుగుతూ పల్లెలు మనకంటే ఆరోగ్యంగా ఉండేవని ఆడిపోసుకోవడం లేదా చొంగకార్చడం ‘అత్యాధునిక’ మాయ.
ఇదంతా రాజకీయమండీ, సినిమా గురించి మాట్లాడతారనుకుంటే ఇవన్నీ చెబితే ఎలాగండీ అనబోదురేమో! ఏది రాజకీయం కాదండీ! మేమొక సినిమా తీశాం, మంచి సినిమా తీశాం, అందమైన సినిమా తీశాం అని చెప్పుకోవచ్చు. ఎవరిది వారికి ఇంపుగానే ఉంటుంది కాబట్టి చెప్పుకోవడం వరకూ తప్పులేదు. చాలామంది చెపుతూనే ఉంటారు. కానీ తెలుగు, సంస్కృతి, సంప్రదాయం వగైరా మాటలేటండీ! అది రాజకీయం కాదా అండీ! అందులో సున్నితమైన అనుభూతులున్నాయి కదా వాటిమాటేమిటి, ఆ వరకు తీసుకుని సినిమాను ప్రశంసించవచ్చుకదా అందురేమో! ఆ అనుభూతులను చూపించడంలో నిజాయితీ కావాలి. ఈ సినిమాలో ఏ మాత్రం అలసట లేకుండా ఇద్దరు వృద్ధులు ఆ లంకంత కొంపను అన్ని చెట్లను మెయిన్టెయిన్ చేస్తా ఉంటారు. చెప్పనలవి కానన్ని వంటలు చేసుకుంటా ఉంటారు. ఆవులను గేదెలను పోషిస్తా ఉంటారు. మూడో మనిషి కనిపించడు. సాధ్యమా ఇది?మామూలు మసాలా సినిమాలో ఒక హీరో వందమందిని కొట్టేయడానికి దీనికి తేడా ఏమైనా ఉందా! అంతేనా! ఆ ముసలాళ్లిద్దరూ ఉష్ర్టపక్షుల్లా మరో మనిషి అంటూ సొంటూ లేకుండా జీవిస్తా ఉంటారు. ఇది ఏమి సామాజికత స్వామీ! ప్రైవసీ పేరుతో సాటి మనుషులకు దూరంగా బతికేయడం గొప్ప సంస్కృతా! వృద్ధులకు ఇతరుల మాదిరే ప్రైవసీ కచ్చితంగా అవసరం. కానీ ఇలానా! అసలు మనిషి అనేవాడు(రు) ఇంత అన్సోషల్గా జీవించగలడా(రా)! చేదబావిని చూపించి నీళ్లు తోడుకోవడం అనేది ఆరోగ్యానికి అవసరమైన శ్రమ అని డైలాగ్ కొట్టించితిరి కదా, మరి గ్యాస్ స్టవ్ ఎందుకు వాడితిరి? అక్కడ కూడా నిప్పుల కుంపటి పెట్టి ఊదుతూ ఉంటే ఊపిరితిత్తులకు ఎక్సర్సైజ్ అని చెప్పించకపోయారా! అక్కడ కంఫర్ట్ కావాల్సివచ్చింది. అంటే దర్శకుడు చూపించదల్చుకున్న సింబాలిజమ్ మేరకు సంప్రదాయాన్ని, ఆధునికతను, సౌకర్యాలను టైలరింగ్ చేసుకున్నారని అర్థమవుతుంది. చేదబావి, బాదం చెట్టు లాంటివి శిష్ట సంప్రదాయ జీవులు తమను తాము ఐడెంటిఫై చేసుకునే సింబల్స్. వాటిని డిస్ట్రబ్ చేయడం డైరక్టర్కు ఇష్టం లేదు. పైకి అభిరుచిప్రధానమైనదిగా కనిపించినప్పటికీ సారాంశంలో ఈ సినిమా అందించేంది వేరు. ఇది పర్ణశాలలో విహరిస్తున్న జింకకాదు. మాయారూపంలోని మారీచుడు.
” రిటైర్మెంట్ తర్వాత ఊర్లో ఒక రిసార్టు లాంటిది కట్టుకుని అక్కడికి వెళ్లిపోవాలని చాలామందికి ఉంటుంది. వెళ్లరు. కానీ అలాంటి కల అయితే ఉంటుంది. వెళ్లినా వెళ్లకపోయినా ఈ సినిమా ద్వారా అలాంటి వారికి ఆ అనుభూతిని క్రియేట్ చేసి పెట్టాం” అని భరణి ఒక ఇంటర్య్వూలో చెప్పారు. కరెక్ట్గా చెప్పారు. ఇది వారి సినిమానే. ఆచరణతో సంబంధం లేని సంపన్న కోరికలు కాబట్టే ఇది హాలీవుడ్ ఏలియన్స్ సినిమాల మాదిరి ఉంటుంది. కాకపోతే అందులో అన్నీ అంతరిక్షపు హైటెక్ సామాగ్రి, ఇందులో ముగ్గులూ దప్పళాలున్నూ!
జి ఎస్ రామ్మోహన్
రామ్మోహన్ గారు
చాల బాగా చెప్పారండి. తెలుగు సంస్కృతి మాట అటుంచి ఈ సినిమా direction మఱియు ఎడిటింగ్ కూడా అంత గొప్పగా లేవు. సినిమా నిడివి ఇంకా తగ్గించవచ్చు.
కొలకలూరి inak గారి కదా ఎవేరైన సినిమాగా తీస్తే చూడాలని వుంది.
anm
రాముడివో లేక మొహనుడివో వెరసి రామ్ మోహనుడివో కాని ఇది రాసి సమ్మోహనుడి వయ్యావు సోదరా.
బాగా గుర్తు చేసావు … నాగప్పగారి సుందర రాజు గారి నడిమింటి బోడెక్కను తెరకెక్కించే తెరదాతలున్నారా?
ఉంటే వాళ్ళ చరణధూళి తలకు రుద్దుకుంటా ..
– తహిరో
మంచి వ్యాసం. ఫేస్ బుక్ లో నేను ఈ సినిమానో, కథనో గుర్తులేదు కానీ వ్యతిరేకిస్తే జనాలు తెగ బాధపడ్డారు.
Some valid questions. Nice Essay.
అయ్యా,
చక్కగా వ్రాసారు. మీరు సెన్సార్ ఆఫీసర్ అయ్యివుంటే ఆ నిర్మాత బ్రతుకు మింసారం అవును. మీ విమర్శ ప్రకారం సినిమా తీసిన వ్యక్తి పరిస్తితి, ఈకలు పీకిన పక్షి స్తితి. మీ రంధ్రాన్వేషణ పరమార్థం బోధ పడలెదు. మీరు సినిమా ఎలా తీయ్యాలో అని చెప్తున్నరా? అగ్రకులాల మీద విమర్శా చేస్తున్నారా? వెనకబడిన కులాలని గుర్తించలేదు అంటున్నారా ? తెలుగుతనం ఇది కాదు అని అంటున్నారా ? తనికెళ్ళ భరణి మీద నిప్పులు చెరుగుతున్నారా?
సరదాగా ఒక్కటి వుదహరించుకుందాం అండి . దాసు గారు అంత తిండి తినలేడు అని మీరెలా నిక్కచ్చిగా చెప్పగలరు? తిని పని చేసిన తరగని అయుష్హు మనదని మీ బోంట్లకు తెలియంది కాదు. ఇందులో మీకు కనపడిన రంధ్రమేమిటో తెలీడం లెదు. ఇలా మీరన్న ప్రతి రంధ్రాన్ని పూడ్చుకుంటూ రావచ్చు. మొత్తం చదివాక నాకు వచ్చిన సందేహం, మీరు ఏమి చెప్పదలిచి ఈ రాతల వాత వేసారు అని?
-కనక
ఈ వ్యాసంలో నిజాలు ఉన్నాయి. కానీ ఆబ్జెక్టివిటీ లేదు. నిజమే, మిథునం చిత్రించినది జనాభాలో అయిదు శాతం మంది జీవితంలోని ఒక సైడే. కానీ, రచయిత ప్రస్తావించిన కొంతమంది రచయితలకు తమ జీవితాన్ని లేదా తమకు తెలిసిన జీవితాన్ని అభిమానించి అనుభవించి చిత్రించుకునే అవకాశం, హక్కు ఎలా ఉన్నాయో; అయిదు శాతం మందికీ అలాగే ఉన్నాయి. ఒకరి హక్కును ఇంకొకరు కాదంటేనే సమస్య. అది ఏవైపునుంచి జరిగినా తప్పుపట్టవలసిందే.
అయ్యా చిత్రం పేరు మిథునం, మిధునం కాదు.
మీ పేరు పొట్టలో చుక్క భలే ఉందే! ఎవరు పెట్టారో !!
సంస్కృతీ అంటే ఏమిటి? యుద్ధాల నుంచి వివాహాల వరకూ మనం జీవించే విధానం. మనం చేసే తప్పులు, మనం చేసే ఒప్పులు, మన చెడు, మన మంచి, మన గొప్ప, మన దిబ్బ ఇవన్నీ ఆ పేద్ద వృత్తంలోకి వస్తాయి. అలాంటప్పుడు మైనారిటీనో మేజారిటీనో ఒక వర్గం అనుభవించే జీవితాన్ని చూపించడం సంస్కృతిలో భాగామెందుకు కాదు? అది తెలుగు సంస్కృతే. అలానే నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, కొలకులూరి ఇనాక్, మహమ్మద్ ఖదీర్ బాబు వగైరాల కథలు కూడా సినిమాలుగా తీస్తే అవీ తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేవే. సంస్కృతీ అంటే మనకున్న సంకుచిత భావం వల్ల మనం స్వాగతించలేక పోవచ్చు.
నాకు తెలిసి ఇది సంస్కృతీ అన్న భావన పరిధి.
ఈ కథలో మొదటి సగం ఇలాంటి సినిమాని/కథని నేటి సమాజం ఎందుకు ఇష్టపడుతోంది అనే విశ్లేషణ. అసలు ఇలాంటి భావాలను బ్రాహ్మణులు సమాజంపై ఎందుకు పోస్తున్నారు. ఆ తలంటి సమాజం ఎందుకు పోయించుకుంటోన్ది తరహా విశ్లేషణ. అసలు ఆ విశ్లేషణతో ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కాలేదు. సరదాగా విశ్లేషించి చూస్తె విజయవంతమైన ప్రతి సృజన వెనుక ఇలాంటివి ఉంటాయి. ఆయనే చెప్పిన నామిని తదితరుల రచనలకు ఇలాంటి సామాజికమైన బాక్ గ్రౌండ్ తయారై ఉంది. కనుకనే ఆ పేర్లు మనం చెప్పుకోగలిగే మాదిరి విజయం సాధించాయి. దాని వెనుక కూడా నేడు ఉన్నతస్థాయిలో ఉన్న నాటి రైతు సమాజం దేన్నో గ్లామరైజ్ చేస్తోన్న పరిస్థితులు ఉన్నాయి. ఐతే ఆ సృజనకు ఆ కారణాలు తప్పవుతాయా?
ఇక రెండో సగం అంతా ఈ కథ ఎందుకు అసహజమో చెప్తోంది. సరే పైన అంత విశ్లేషణ ఇచ్చాకా ఈ పార్ట్ ఎందుకో నాకు అర్థం కాలేదు. ఈ సినిమా నిజంగా సహజంగా ఉన్నా ఈ వ్యాసకర్తకు పైన తానే చెప్పిన కారణాల వల్ల అంగీకారం కాదు కదా. మరి అసహజం అని చెప్పడం ఎందుకు? ఈ సృజన మూలాలే ఆయనకు చేదుగా ఉన్నప్పుడు సహజంగా ఉంటే ఏం? అసహజంగా ఉంటే ఏం? శిల్పారామంలో ఉన్న గుడిసెలా ఉందన్నారు. అసలా గుడిసె ఉండడమే ఇష్టం లేని వారికి అసలు సిసలైన గుడిసె మాత్రం నచ్చుతుందా?
వేయేల బ్రాహ్మణులు సంస్కృతీ బాహ్యులు, వారి పేరు చెప్పి చెడే తప్ప మంచి తీయరాదని ఉంటే సరిపోయేదేమో.
రచయిత ఒకే గుక్కలో అనేక విషయాలు చర్చించే సరికి కొంత విస్తారం పెరిగింది. కానీ ఒకవర్గం ఒకకులం అని కాదు……ముందే ఆయన చెప్పారు ఇదే సంస్కృతి, ఇదే సంస్కారం అన్న ధోరణిలో మాట్లాడడమేమిటని …..అదీ పాయింటు…..
మీ అభిప్రాయాయలో కొన్నిటితో ఏకీభవిస్తాను. కానీ ఒక 40 పేజీల కథని 3 గంటల సినిమాగా లాగి తీయడం వల్ల అనవసరమైన చీర ఉతకడాలూ, భార్య తల దువ్వడాలూ లాంటి సన్నివేశాలని చొప్పించి చక్కని కథని కాస్తా మరీ కంగాళీ చేసేరు.
మిత్రమా … రామ్మోహన్ ! … కథ వొచ్చినపుడు, తదనంతర కాలంలో ఈ సినిమా విడుదల అయినపుడు మిత్రుల నడుమ జరిగిన చర్చకు ఇలా ఇప్పటికైనా ఒక రూపం ఇవ్వడం, అదీ మీ లాంటి వారు ఇవ్వడం బాగుంది …
గత కొన్ని సంచికల (సారంగ) క్రితం, నారాయణ స్వామి గారు జరిపిన సంభాషణ లో శ్రీ రమణ గారు ‘మిథునం’ గురించి చెప్పిన మాటలు, కొంత సందర్భోచితంగా ఉంటుందని యిక్కడ యిస్తున్నాను-
“బ్రాహ్మడి కథ, బ్రాహ్మినిక్ కల్చర్ అంటే, మరి నేను ఎరిగిన వాతావరణం అది. ఏ రచయిత అయినా వాళ్ళకి గాఢంగా తెలిసిన విషయాన్ని రాయాలి తప్ప, తెలిసీ తెలియని విషయాన్ని రాయబూనుకుంటే అది హాస్యాస్పదమే అవుతుంది. నాకు గాఢంగా లోతుగా అనుభవమైనదే నేనా కథలో రాశాను. ఇక తాత్త్విక చింతన అంటే .. మన సాంప్రదాయంలో దాంపత్యాన్ని గురించిన ఒక కామెంటరీ. మన దాంపత్యమనే కాదు, చాలా కాలం జంటగా ఉన్న ఏ దంపతులైనా .. వయసులో ఉన్నప్పుడు ఒక ఆకర్షణ, మోహం, అటుపైన సంసార బాధ్యతలు. ఆ బాధ్యతలన్నీ తీరిపోయాక ఒక స్నేహం, ఒక ఆప్యాయత, ఒక కంపేనియన్షిప్ మిగులుతాయి. ప్రధానంగా చెప్పాలనుకున్నది ఇది.
ఈ కథ ఎన్నో భారతీయ భాషల్లోకీ కొన్ని పాశ్చాత్య భాషల్లోకీ అనువదించబడింది. అలా ఢిల్లో జరిగిన ఒక సదస్సులో ఒక జర్మనీ ఆయనతో సంభాషిస్తుంటే ఆయనన్నాడూ – ఆ దంపతుల చేష్టలు, రహస్యాలు అన్నీ రాశారు కదా, వారి సెక్స్ లైఫుని గురించి కూడా రాయవలసిందీ అని. అంటే నేనన్నానూ – మా సాంప్రదాయంలో అదసలు మర్యాద కాదు. అదలా ఉండగా ఇక్కడా కథలో అసలు విషయం వారిద్దరి మధ్యనా మిగిలింది ఆ స్నేహం అని చెప్పడమే. ఆ స్నేహానికి పునాది వారు గడిపిన యాభై అరవయ్యేళ్ళ జీవితం. అంతేకానీ వేరే కోరికలేమీ లేవు”
రామ్మోహన్ గారూ చక్కటి వ్యాసం రాశారు…మిథునం సినిమా చూస్తున్నప్పుడు మొదట్లో కాసేపు ఆ పచ్చదనం..పల్లెటూరి వాతావరణం…వారిద్దరి అన్యోన్యతా అబ్బురపరచాయి…కానీ లోలోపల ఏదో తెలీని వెలితి మొదలయింది…ఆ వయసులోని వాళ్లు సహజంగా తమతోటి వారితో ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడతారు…కానీ ఈ సినిమాలో అలాంటి ముచ్చటే కనబడదు. ఇక తాళింపుల గోల బాబోయ్…అనిపిస్తుంది. మీరన్న ఒక్కోపాయింటూ కరెక్టే…అవన్నీ కాకపోయినా కొన్ని విషయాలు నేను స్నేహితుల దగ్గర ప్రస్తావిస్తే…ఎంతమంచి సినిమా అండీ అదీ మీరెందుకు అలా మాట్లాడతారు…అని కొట్టిపడేశారు…మీకేంటండీ ఏవీ నచ్చవు అంటూ ఓ అలవాటైన మాట కూడా అనేశారు…నిజంగా ఆ వయసు వచ్చిన తరువాత అంత హుషారుగా ఉండే జంట ఉంటుందా…సరదాలు…ఏడిపించుకోవడం వరకూ ఓకే కానీ…ఇంటెడు పనీ ఆవిడొక్కత్తే కిక్కురుమనకుండా చేసుకోవడం..ఇల్లు, పెరడు, వ్యవసాయం, పాడీ..పై పెచ్చు మిగతా పార్ట్ టైం జాబులు ఆయన చేసుకోవడం..ఇదంతా సినిమాటిక్ గ్లామరే…నాకైతే భరణిగారు తమ తాతలో ముత్తాతలనో ఇన్స్ పిరేషన్ తీసుకుని దానికి కాస్త మసాలా జోడించి నమ:శ్శివాయా…అంటూ మన మీద వదిలినట్టు అనిపించింది.ఇక బుచ్చిలక్ష్మి అప్పదాసును ఏడిపించే సంబంధం తప్పిపోవడం…అబ్బో చిరాగ్గా అనిపించింది. అది అబద్దం అని తెలియగానే అప్పదాసు తృప్తిగా కన్నుమూయడం విచిత్రంగా అనిపించింది..మొత్తంగా సినిమానిండా మీరన్నట్టు విశ్వనాథ్,అక్కడక్కడ బాపూ కనిపించారు..వారిద్దరి పేర్లు ఊటంకించడం వెనుక మర్మం నాకు అందింది. భలే చెప్పారు…
బాగుంది వ్యాసం. ఫ్యూడల్ కంపును కొంతైనా కడిగారు(మాటలతో). మరీ ఈ మద్య బాగా ఇదొక ఫ్యాషన్ గా అయిపోయింది. అలా వెనక్కెళ్ళిపోయి గ్రామాల్లో ఉన్న ఫ్యూడల్ ఆచారాలు, ఆచరణలు చాలా గొప్పవని చెప్పటం, చూపించటం, మరీ అమెరికాలోనూ, పెద్ద పెద్ద పట్టణాలలోనూ ఉన్నవాళ్లకు (తీరికెక్కువై?) ఒక వ్యసనం లాగా పట్టుకుంది. నిజానికి గ్రామాలలో ఉన్నవాళ్లకు ఈ పురుగుల మందులూ అవీ చల్లి, ఎండనక వాననక పొలం పనులు చేయటంతో తక్కువ వయసులోనే ఏ కాన్సరు వ్యాధులో, ఇతర వ్యాధులో పట్టుకొని బాధపడటమో, చనిపోవటమో ఎక్కువగా ఉందని మాకు తెలిసిన కారంచేడులో ఉన్న డాక్టరు గారు చెప్తూ ఉంటారు. మీరు రాసింది చదివితే ఆమె చెప్పిన ఆ బాధితుల కధలు ఒక్క సారి కళ్ల ముందర కదిలాయి.
మీ విశ్లేషణాత్మక వ్యాసం బాగుంది. పైన వారెవరో పెట్టిన వ్యాఖ్య… అసలు మీరేం చెప్దామని ఇంత శ్రమ తీసికున్నారో అర్ధం అవలేదు. శ్రీరమణగారు శ్రీ నారాయణస్వామి గారితో ఇంటర్వ్యూలో చెప్పినట్టు “బ్రాహ్మడి కథ, బ్రాహ్మినిక్ కల్చర్ అంటే, మరి నేను ఎరిగిన వాతావరణం అది. ఏ రచయిత అయినా వాళ్ళకి గాఢంగా తెలిసిన విషయాన్ని రాయాలి తప్ప, తెలిసీ తెలియని విషయాన్ని రాయబూనుకుంటే అది హాస్యాస్పదమే అవుతుంది. నాకు గాఢంగా లోతుగా అనుభవమైనదే నేనా కథలో రాశాను.” అని ఎటువంటి హిపోక్రసీ లేకుండగా చెప్పేరు. ఆ విషయం మీకు నచ్చలేదా? ఇంకో విషయం మూలకథలో ఉన్నట్టుగా చిత్రించి ఉంటే ఇన్ని వివాదాలు వచ్చేవి కావేమో. మూలకథ “మిథునం”తెలుగు చదవడం వచ్చినవారందరికీ నచ్చింది. దానిలోని అసలు స్పిరిట్ అర్ధం చేసికోబట్టే వివిధ భాషల్లోకీ అనువదించారు. అక్కడ కులప్రసక్తి అడ్డురాలేదు.
బైదవే మిథునం సినిమా నాకూ నచ్చలేదు.కానీ మీరు వ్రాసినవేవీ కారణాలు అని ఒప్పుకోలేను. మలయాళం లో తీసిన సినిమా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. మూలకథ చదివినప్పటి స్పందన సినిమా చూసినప్పుడు మాత్రం కలుగలేదు.
వాస్తవాన్ని చెప్పారు ….మిధునం సినిమాలో చూపించినంత గొప్పగా పల్లె జీవితాలు ఉంటే, మనుషులే లేకుండా పల్లెలు ఎందుకు వట్టి పోతాయి ..ఇక్కడ (పల్లెల్లో ) కష్టం ఉంది ..కన్నీరు ఉంది , ఆకలి ఉంది రోగం వస్తే హాస్పటల్ కి వెళ్ళే లోపే ఏ గుంతలోనో గుండె జారి గల్లంతు అవుతుంది …ఎందుకంటే పల్లె రోడ్డ్లు అంత సౌకర్యంగా ఉంటాయి మరి …బ్రతుకంతా పక్కింటోడంత సంపాదన లేదని మొగుడిని దుయ్యబట్టే ఆడవాళ్ళు అన్నీ ఉన్న ఫలంగా గంప గుత్తగా మర్చిపోయి చివరి దశలో మొగుడితో ఉండేది స్నేహంగా కాదు అవసరానికి, అలవాటుపడి మాత్రమే…..అలాగే పెళ్ళాం మీద నమ్మకం లేక హచ్ డాగ్ లా బ్రతుకంతా కాపలా కాసిన భర్తం గారు చివరి దశలో కాలో చెయ్యో సరిగా ఆడక తప్పనిసరి పరిస్థితుల్లో అలా అలవాటు పడిపోవటానికి అలవాటు పడతాడు ….నిజానికి అంత గొప్ప దాపంత్యం మిధునం సినిమాలో మాత్రమె ఉంటుంది …..బయట ఒకవేళ అలా ఉన్నాం అని ఎవరైనా చెప్తే ఒక నవ్వు నవ్వేయడమే ….:)
డిసెంబర్ 22 వ తేదిన ఈ సినిమా వచ్చింది,2012 లొ.చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు, ఇంత అతి నటన ఉంటుందా అని. ఇక మొగుడు పెళ్ళామ్ కలిసి ఉండడం అన్నది కొద్ది మంది దృష్టిలో కుక్క లాగా అనుకుంటే, పైన ఉన్న దేముడు కూడా వారిని కాపడలేడు.కులానికి చెందిన చేష్టలు ఉన్నాయి అన్నారు,ఎవరి కులానికి చెందిన సంప్రదాయాలను చూపించడం లొ తప్పు లేదు.ఇక అ ముసలి జంట మధ్య ఉన్నది స్నేహం, ఇంకోటి ఉండదు అ వయసులొ.చివరి దశలో కాలో చెయ్యో విరిగిపోతే ఉడిగం చేయడానికి పనికి వస్తుంది, అటువంటి పరిస్థితులొ అలవాటు పడుతారు.నిజమే ఎవరు కాదనరు,అటువంటి లైఫ్ చాలా చోట్లా ఉన్నారు.నాకు తెలిసిన ఒక పెద్దావిడ తన భర్తను “పండు” అని పిలుస్తుంది, అందులో ఏటువంటి వెధవ లక్షణాలు కనపడదు.బహుశా మీ పల్లెలో ఉండకపోవచ్చు, ఇక్కడ హైదరాబాద్ లొ ఉన్నారు అటువంటి ప్రేమికులు కానీ భార్య భర్తలు. బ్రాహణ వ్యక్తులను కాస్త ఎక్కువ గా చూపిస్తే దానికి రకరకాలుగా కామెంట్స్,అదే బ్రాహణ వ్యక్తులను వీధిలో కుక్క కన్న హీనంగా చూపించారు కొన్ని మూవీస్.ఒక సంవత్సరం కాలం గడచిపోయింది ఈ మూవీ వచ్చి,రామ్ మోహన్ గారికి దాదాపుగా చాలా కాలం పట్టింది రివ్యూ రాయడానికి. చాలా సంతోషం.
ఈ వ్యాసాన్ని, మిథునం సినిమా పై విమర్శగా కాకుండా, మిథునం సినిమా నచ్చిందంటూ, “రాజకీయ” కారణాలిచ్చిన వారిపై చేసిన, మరో “రాజకీయ” విమర్శ అనచ్చు.
ఒక కథని కథగా గానీ, సినిమాని సినిమాగా గానీ, చూడకుండా, దానికి, లేనిపోని కులపో లేక మరో అస్తిత్వ రంగో అద్ది, పొగిడినా, తెగిడినా, వచ్చే ఫలితం ఇదే. ఆ కథా రచయిత మొత్తుకుంటూనే ఉన్నారు…”అయ్యల్లారా… నేనేమి మెసేజులు, SMSలు, నా కథ ద్వారా ఇవ్వట్లేదు. నాకు పరిచయం ఉన్న నేపథ్యాన్ని వాడుకొని, ఒక వృద్ధ జంట సంసారం నడిపే విధానంపై, నాకు తోచిన కథ చెప్పాను” అని. ఆ కథ చదవటానికి చాలా బాగుంటుంది. ఆ ముగింపు కూడా హృదయానికి హత్తుకు పోతుంది. ఎవరికిష్టం వచ్చిన అర్థాలు వాళ్ళు లాక్కున్నారు :(
ఏమిటో ఈ దుగ్ధభరిత వ్యాఖ్యానాలు !! శ్రీ రమణ గారు ఆయనకి తెలిసిన నేపథ్యంలో రాసారు, ఇంగువ మూటలు వంటి వెకిలి వ్యాఖ్యలు దేనికి నిదర్శనం ??
ఏదో పుటలు నింపడానికో, పబ్బం గడుపుకోటానికో అన్నట్టు ఉంది :(
ఈ సినిమా చూశాక నేను రాసిన సమీక్ష ఇది.
తనికెళ్ల భరణి “మిథునం” చూశాను.
నేను శ్రీరమణ ‘మిథునం’ కథాసంకలనం చదివే సమయానికి మిథునం కథ ఒక విశిష్టమైన గొప్పదనాన్ని సంతరించుకుంది. బాపు గారు మిథునం కథనచ్చి తన స్వయం చేతి దస్తూరితో ఈ కథను రాయడం ఈ కథను తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప కథగా నిలిచిపోయేకథగా సాహితీవేత్తలు విమర్శకులు డిసైడ్ చేసేశారు. కానీ అంతా చేస్తే, నేను మొత్తం చదివేసరికీ నాకు బాగా నచ్చిన కథ “బంగారు మురుగు”. మిథునం సగం అర్థం కాలేదు, మిగతాసగం ఒక ముసలి బాపనయ్య తిండిగోలలాగా అనిపించింది.
కొంతకాలానికి ఆ కథ సాహిత్య అకాడమీవాళ్ళు ఇంగ్లీషులో అనువదించడం, ఎమ్.టి.వాసుదేవ్ నాయర్ అనే ఒక ప్రసిద్ధ మళయాళ దర్శకుడు సినిమాగా తియ్యడం జరిగాయి. ఆ సినిమాకి 48వ జాతీయ చలనచిత్రోత్సవం 2001 లో “పర్యావరణ రక్షణ” పై ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చేసింది. అప్పుడు నేనేమైనా మిస్ అయ్యానేమో అని మళ్ళీ చదివాను. అందరూ అచ్చతెలుగు కథ అంటున్న ఈ కథనాకైతే ఎక్కలేదు. బహుశా కథలో ఉన్న తీవ్రమైన బ్రాహ్మణ ఛాయలు, చిత్రమైన వంటకాల వర్ణనలు నా సంస్కృతికాకపోవడం వలన అర్థం కాలేదేమో అని సర్థిచెప్పుకున్నాను. మళయాళం సినిమాని చూసిన కొందరు తెలుగువాళ్ళు కూడా “అబ్బే తెలుగు కథలో ఉన్న చమక్కులు మళయాలంలో మిస్ అయ్యాయి” అనే చెప్పుకొచ్చారు. http://navatarangam.com/2009/08/oru-cheru-punchuri/
ఇప్పుడు తెలుగులో చూస్తుంటే కథచదివినదానికన్నా సినిమాగా అర్థమయ్యింది ఎక్కువ అనిపించింది. అప్పదాసు తిండిగోల వెనకున్న ఫిలాసఫీ, అనుబంధాల వెనకున్న అటాచ్ద్ డిటాచ్మెంట్, బుచ్చి మీదుండే అనంతమైన ప్రేమ, వాలుతున్నవయసులో భార్యభర్తల మధ్య ఉండాల్సిన బంధం ఇలా చాలా విషయాల్ని తనికెళ్ళ భరణి హృద్యగా తెరమీదికి తీసుకొచ్చారు.
ఇద్దరే పాత్రలతో రెండుగంటల నిడివి ప్రేక్షకుడిని కూర్చోపెట్టడం అంటే సాహసమే అనుకోవాలి. ఆ సాహసాన్ని విజయవంతంగా చేశాడు దర్శకుడు. బాలు నటన అక్కడక్కడా అతిగా అనిపించినా చివరకొచ్చేసరికీ అది పాత్రనైజమేమో అనిపించి సర్థుకుపోవచ్చు. లక్ష్మి నటన చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. సినిమాలో మెచ్చుకోదగ్గ విషయాలు గోలలేని వీణాపాణి సంగీతం, కళ్ళకి ఇంపైన సినెమాటోగ్రఫీ.
అక్కడక్కడా సినిమా కొంచెం రిపిటీటివ్ గానూ, మరికొన్ని చోట్ల రేడియోనాటకాన్ని తలిపించేలా చాలా వర్బల్ గానూ ఉన్నప్పటికీ చాలా మంచి ప్రయత్నంగా ఖచ్చితంగా నిలిచిపోయే సినిమా ఇది. లేటువయసులో తోడు ప్రాధాన్యత, దాంపత్యంలోని ఆనందపు లోటుపాట్లు, ప్రేమానురాగాల ప్రాముఖ్యతని విప్పిచెప్పే ఈ సినిమా పిల్లలు చూస్తే పెద్దోళ్ళకు చూపించి వాళ్ళ కళ్ళలోని ఆనందం చూడాలనుకుంటారు. పెద్దోళ్ళు చూస్తే పిల్లలకు చూపించి కనీసం కొంతైనా తెలుసుకోమ్మని సలహా ఇస్తారు. కాబట్టి రెండు విధాలా ఆడియన్స్ ని సంపాదించుకునే ఆస్కారం ఉంది. కానీ ప్రస్తుతం నెలకొన్న తెలుగు సినిమా పరిస్థితుల్లో ఆ రెండూ జరగాలంటే మొదట ఎంత ఎక్కువ మందికి వీలైతే అంతమందికి చూపించే ప్రయత్నం జరగాలి. అది ఎన్ని ఫోరమ్స్ లో వీలైతే అన్ని చోట్ల జరగాలి.
సినిమా అయిపోయాక తన స్పందన తెలియజేస్తూ పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి “ఈ సినిమా చూశాక నాకు పెళ్ళికాలేదని ఫీల్ అవుతున్నాను. నిజంగా పెద్దఫూల్ ని ఇంత(సినిమాలో చూపినంత) ఆనందం మిస్ అవుతున్నాను.” అన్నారు. ఆయనకు పెళ్ళికోరిక కలగటం ఏమోగానీ నాకైతే మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్లు, ఇరవైనాలుగ్గంటల టెలివిజన్ ఛానల్లు లేని ఇలాంటి రిటైర్మెంట్ లైఫ్ (విత్ సచ్ వైఫ్) ఉంటే బాగుండేమో అనిపించింది.
ఇది అచ్చతెలుగు సినిమా అనో లేక అమ్మానాన్నల ప్రేమకథ అనే కారణాలతోకాకుండా సాహిత్యం నుంచీ సినిమాలు రావాలి అనే ఒక ఉద్దేశంతో, ఈ సినిమా ఒక సఫలమైన ప్రయోగం అనే నమ్మకంతో, ఈ సినిమా చూశాక కొంత మానవసంబంధాల మీద ప్రేమానురాగాల మీద నమ్మకమొస్తుందనే ధీమాతో ఈ సినిమాని చూడమని రెకమండ్ చేస్తాను. త్వరలో అమెరికాలోకూడా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అక్కడివాళ్ళకి మరింతగా నచ్చే అవకాశం ఎక్కువ ఉందికూడాను. చూడండి.
చివరిగా…. శ్రీరమణ మిథునాన్ని మొదట మళయాళంలో తీసేసినట్టే మరిన్ని గొప్ప కథల్ని, నవలల్ని పరాయివాళ్ళు తీసెయ్యకముందే (త్వరలో బంగారు మురుగు కథకూడా మళయాళంలో రాబోతోందని వినికిడి) మనం తీసి కొంత గౌరవాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో తనికెళ్ళ భరణిగారి సాహసానికి, నిబద్ధతకూ సలాం చేస్తున్నాను.
తెలుగు సినిమాకు మడిగట్టిందని విమర్శిస్తూ మిథునం సినిమానో పూచికపుల్లలా తీసిపారేసిన రచయితగారు, తన తోటి కవిమిత్రులను, సాహితీమిత్రులను అలానే తీసిపారేయటం ఆశ్చర్యంగా ఉంది. ఈయన తెలుగు సాహిత్యానికి మడిగడుతున్నారని అనుకోవాలేమో! మొదటి పేరాలోనే, ఈ సినిమాను విమర్శించినవారిని కొందరు ‘కవిమిత్రులు’ మరి కొందరు ‘సాహితీమిత్రులు’ తిట్టిపోసారని రచయితగారి ఆవేదన. మరి తాను ‘సామాజికులు ‘ కాబట్టి, అచ్చోసి వదిలిన అభిప్రాయాలను తూర్పారగట్టటం తన బాధ్యతగా నెత్తికెత్తుకున్నారు. బాగుంది. బహుశా రచయితగారి ‘కవిమిత్రులు ‘, ‘సాహితీమిత్రులు ‘ ఎవరూ కూడా రచయితగారి అంచనాల ప్రకారం ‘సామాజికులు’ కాదనుకుంటాను. సినిమాని విమర్శించిన వాళ్ళని విమర్శించినందుకు వాళ్ళకి సామాజిక బాధ్యతలేదనే రచయితగారు కూడా తీర్మానించినట్లున్నారు!
సరే, సామాజిక బాధ్యతగా రంగంలో దూకిన రచయితగారికి నచ్చని ఓ ముఖ్యాంశం ఏమిటయ్యా అంటే…. “వ్యవస్థీకృత విలువలకు సాంస్కృతికపరమైన ఔన్నత్యాన్ని కట్టబెట్టే పదాలతో” ఈ సినిమాను ప్రశంసించటం. వ్యవస్థీకృత విలువలు ఏవేమిటో, వాటికి సాంస్కృతిక ఔన్నత్యాన్ని కట్టబెట్టే పదాలు ఏవేమిటో కూడా రచయితగారు విశదపరిస్తే ఇంకా బాగుండేదికదా! సరే, రచయితగారి మాటల్లోనే సాంస్కృతిక ఔన్నత్యాన్ని కట్టబెట్టే పదాలేవిటో కూడా చూద్దాం.
“మిధునం గురించి తరచుగా వినపడే మాటలేమిటి? అది సంస్కారవంతమైన సినిమా. మానవసంబంధాలను ఉన్నతీకరించిన సినిమా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని అపురూపంగా చిత్రించిన సినిమా. నగరజీవనంలో మృగ్యమైపోతున్న సున్నితమైన అంశాలను ఎత్తిపట్టిన సినిమా. ఎక్కడికి పరిగెడుతున్నామో ఎందుకు పరిగెడుతున్నామో తెలీని మ్యాడ్ రష్లోంచి బయటకు వచ్చి మనలోపలికి మనం తరచి చూసుకునేలా చేసిన సినిమా. కొంచెం అటూ ఇటూగా ఇలాంటివే. సంస్కారం అనే పదం వినిపించినంతగా సెన్సిబిల్ సినిమా అని వినపడదు.”
కాబట్టి ప్రశంసకులు అక్కడ ‘సంస్కారం’ బదులు ‘సెన్సిబుల్’ అనో, ‘ఇన్సెన్సిబుల్’ అనో, ‘రేషనల్’ అనో, ‘ఇర్రేషనల్’అనో, మరో ఆంగ్లపదమో పడేసుంటే రచయితగారికి ఈ వ్యాసం వ్రాసే అవసరం బహుశా ఉండేది కాదేమో!
రచయితగారికి అభ్యంతరమనిపించిన మరో విషయం ఈ సినిమాలో చూపించిన శ్రమైక సౌందర్యం. రచయితగారి మాటల్లో :
“శ్రమైక జీవన సౌందర్యం అని శ్రీశ్రీ అన్నాడు కదాని శ్రమను మరీ ఇంత అందంగా చూపిద్దామంటే ఎలాగండీ భరణి గారూ! శారీరక శ్రమ మరీ అంత గ్లామరస్గా ఏమీ ఉండదండి! అది కష్టజీవులకందరికీ తెలుసండీ. శ్రమను గౌరవించడమంటే దాన్ని గ్లామరైజ్ చేసిచూపడం కాదండీ!”
ఇది సమంజసమే… కానీ నాకో సందేహం. జనచైతన్యం కలిగించాలంటే, సినిమాలలో దర్శకులు ఎటువంటి సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా, ఉన్నదున్నట్లే సినిమాలు తీయాలంటే అసలు సినిమాల అవసరం ఏముంది? సమాజాన్నే చూసుకోవచ్చు కదా! లేదా జనలాని చైతన్యపరిచే డాక్యుమెంటరీలే తీసుకోవచ్చు కదా!
రచయితగారి మరో అభ్యంతరం.
“చెప్పుల గూటాల నుంచి, మగ్గం గుంతల నుంచి కొలిమి మంటలనుంచి బయటపడడం వల్లే ఇవాళ అలాంటి కులాల పిల్లలు చాలా మంది అంతకుముందెన్నడూ చూడని రీతిలో డాక్టర్లు, లాయర్లు, కంప్యూటర్ ఇంజనీర్లు అయి సామాజిక సంపదలో తమవంతు వాటా అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంతకు ముందు తమను చిన్నచూపు చూసినవారి సరసన కూర్చోగలుగుతున్నారు. మళ్లీ ఇపుడు వృత్తులను ఆరాధించే పద్ధతిలో వాటి చిహ్నాలను చూపిస్తే అబ్బో, మమ్మల్ని గౌరవించాడు అని ఎగబడి చూడాలా! ఏమియా ఇది! ఏమి మాయయా ఇది!”
ఇక్కడ దర్శకుడు ఆయా కులాలవారిని ఆయా కులవృత్తులే చేసుకోమని చెబుతున్నాడని రచయితగారికి ఎందుకు అనిపించింది? రచయితగారి ద్వంద్వ ప్రమాణాలు గమనించండి. శ్రమైక సౌందర్యం పేరిట దర్శకుడు ఆయా కులాలవారిని కులవృత్తులు చేసుకోమంటున్నాడని అపార్ధాలు చెబుతూ, “సంప్రదాయంగా వస్తున్న ప్రచారానికి అనుగుణంగా కనిపించే స్టీరియోటైపు అప్పదాసు” అని రచయిత ఓ పాత్రను పరిహాసం చేయటంలో అర్ధమేమిటి? ఇందులోని మాయామర్మాలేమిటి సార్?
రచయితగారి మరో అభిప్రాయం :
“అప్పదాసు స్వర్గానికి సెంటీమీటర్ దూరంలో అని వర్ణించే రుచులు తెలుగునాట కేవలం ఐదు శాతం లోపువారి రుచులు. ఆ వ్రతాలు, నోములు, వగైరా కూడా మైనార్టీ వ్యవహారమే. అయినా సరే, ఇది తెలుగువారు సగర్వంగా ఎగరేసిన పతాకం, తెలుగుదనానికి అచ్చమైన చిరునామా, తెలుగోడి సత్తా లాంటి మాటలు బోలెడన్ని వినిపించాయి. వినిపిస్తూనే ఉన్నాయి. కేవలం ఐదు శాతం లోపు ఉన్నవారిలోని సంప్రదాయవాదుల ఆచార వ్యవహారాలు, వారి గోములు, అలకలు, చిలిపితనాలు మొత్తం తెలుగుదనానికి పర్యాయపదంగా చాటగలిగిన ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది?”
టీస్టాల్ నడుపుకునేవాడికి ప్రధాని అయ్యే అర్హత లేదంటూ మోడీ మీద ఎవరో అగ్రవర్ణ రాజకీయనాయకుడు చేసిన కామెంటులానే ఉన్నాయి పైన ఉటంకించిన వ్యాఖ్యలు. మైనారిటీల హక్కులు కాలరాస్తున్నారని ఎగిరిపడే సామాజికులు ఈ రచయిత నిరంకుశధోరణి బహుశా కనిపెట్టగలరు. మారుతున్న సామాజిక సమీకరణాల్లో అయిదు శాతం మాత్రమే ఉన్న జనాభాకు ఎటువంటి హక్కులు ఇవ్వకూడదని తీర్మానించే ఇటువంటి వ్యాఖ్యలు చాలా ప్రమాదకరం. ఇక్కడ సినిమా మీద కన్నా, ఒక కులం మీద రచయిత చూపిస్తున్న దౌష్ట్యమే కనిపిస్తున్నది.
తనని తానో సామాజికుడనే స్వోత్కర్షలు, మైనారిటీ కులాలవారి హక్కులు కాలరాయాలనేవిధంగా ఉన్న రచయిత దాష్టీకం… ఇంతకు మించి ఈ రచన చదవటానికే జుగుప్సగాను, చిరాకుగాను ఉంది. A hopeless effort, indeed.
చాల బాగా చెప్పారు.
రామ్మోహన్ గారు!
అద్బుత విశ్లేషనండి! అదరగొట్టేసారు. నేనైతే సినిమా చూల్లేదుకానండి. ఇటీవలి వస్తున్న సినిమాల అచ్చం మీరు చెప్పినట్లె ఉంటున్నాయండి. మన ఐటీ వర్గమంతా వాట్నే ఎగబడి చూసున్నారు. ఆ మధ్య మహేష్ బాబు గారి సనిమా పేరు (గుర్తులేదు) అలనాటి రామచంద్రుడి అన్నింతా సాటీ.. .. మళ్లి ఆ రమాయణ కాలానికి పోవాలని మన వాల్లు ఉవ్విల్లూరుతున్నారండీ! అదే తెలుగు సంస్కౄతి అని పడి చస్తున్నారండీ.
అయితే దీ ని వెనుక నున్న రాజకీయ కారణాలను మీరు అట్టే చెప్పలేదు. అవి చెప్పివుంటే ఇంకా బగుండేదండీ!
పునురుద్దరనలోపునరుద్దరణ వాధం లో బాగంగానే ఇవి వస్తున్న సంగతి మర్చిపోకూడదు.
అయితే దీని వెనుక నున్న రాజకీయ కారణాలను చెప్పలేదు.పునురుద్దరనలోపునరుద్దరణ వాధం లో బాగంగానే ఇవి వస్తున్న సంగతి మర్చిపోకూడదు.
ఇందులో కుడా ఏమున్నాయో రాజకీయ కారణలు? తనికెళ్ల భరణి రాజకీయాలలో ప్రవేశానికి ఈ సినేమాతీసాడా? బ్రాహ్మణులెవరైనా రాజకీయ కొత్త పార్టి పెట్ట బోయేముందు ప్రజలముందుకు వదలిన సినేమానా ఇది? కమ్యునిస్ట్ సానుభూతి పరులకు వ్యాసాలు రాసే పని తప్పించి, చేయదగ్గ పని ఏముంది సార్. ప్రజల నాడి పట్టుకోవటంలో విఫలం చెందారు, బెంగాల్ లో అధికారం కోల్పోయారు. దేశ రాజకీయాలలో వారికి కాలం చెల్లింది. ఇక మిగిలింది కొత్త కొత్త పదాలను కాయిన్ చేసి ( “పునురుద్దరనలోపునరుద్దరణ” ) సాహిత్యం లో గుప్పించే పనే.
ఆమధ్య రామోహన్ రావు గారు త్రిపుర ముఖ్యమంత్రి నిజాయితిని వేనోళ్ల ప్రశంసిస్తూ వ్యాసం రాశారు. పట్టుమని సం|| కూడా కాలేదు, ఒక త్రిపుర కమ్యునిస్ట్ డబ్బులు పరుపుగా పరచి వీడీయోతీయించుకొని టి వి లో దొరికాడు. పైగా అతను నేను నా పార్టిలో వారి లాగా హిపో క్రెట్ ను కాను అంట్టు ఇతర పార్టి సభ్యులు ఎంత నిజాయితి పరులో చెప్తూ, వాళ్ల పరువును వాళ్ళె బజారులో పెట్టుకొన్నరు. ఇంత గొప్ప ఘన చరిత్ర కలిగిన వారు, బ్రాహ్మణులు తెలుగు సమాజంలో ఆర్థిక రాజకీయ ఆధిపత్యం కోల్పోయారంట్టుకితాబులిస్తూనే, మళ్లి దీని వెనుక నున్న రాజకీయ కారణాలను చెప్పలేదు అనటం, మీలాంటి పడక కుర్చి కమ్యునిస్ట్ మేధావులకే చెల్లు.
కిరణ్ గారు,
కమ్యునిష్టు అని చేప్పుకునే వారికి కాలం చెల్లిందేమొ గాని కమ్యునిజానికి చెల్లలేదు. చెల్లదు కూడా! ఆధిపత్య వాధాలు ఉన్నంత వరకు.
” ఒక త్రిపుర కమ్యునిస్ట్ డబ్బులు పరుపుగా పరచి వీడీయోతీయించుకొని టి వి లో దొరికాడు. పైగా అతను నేను నా పార్టిలో వారి లాగా హిపో క్రెట్ ను కాను అంట్టు ఇతర పార్టి సభ్యులు ఎంత నిజాయితి పరులో చెప్తూ, వాళ్ల పరువును వాళ్ళె బజారులో పెట్టుకొన్నరు.”
వాడు ఏ ఆదిపత్య వర్గం నుండో వచ్చి ఉండవచ్చు. ఆ ముసుగేసుకుంటే వాడు కమ్యునిష్టా? ఈచర్చ వాల్ల మధ్యే జరుగుతుంటుంది. మల్లి ఇక్కడెందుకుగానీ! మాతాతలు నేతులు తాగి మూతులు తుడుసుకున్నారు అనేది ఆ మధ్య ఉన్న ఒక సామెతా. దాన్ని ప్రయోగించాలని మళ్లి ఒక వర్గం పుట్టుకొస్తుంది తెలియటం లేదా? ఈ భావజాలం వెనుక రాజకీయ కారణాలు లేవుంటే పూర్తిగా అమాయకులైనా అయ్యుండాలి లేదా తెలిసీ అమాయకత్వం నటిస్తునైనా ఉండాలి. ఇక్కడ బ్రామ్హానులు అనేది ముఖ్యం కాదు. శ్రీ శ్రీ , రావి శాస్త్రి, కొడవటిగంటి కుటుంబ రావు గార్లు వీరమ్త బ్రాహ్మణులూ కాదా? వాల్లనేవరైనా ప్యుడలిస్టులు అంటారా? పూడలు సామాజికతను మల్లి తెచ్చి పెడుతున్నారనేదే సమస్య. నేను సామన్య పాఠకుడిని. మేధ్హవులనే వారు వేరే వుంటారు వాళ్ళని అనండి ‘పడక్కుర్చీ మేధావి’ అని.
* కమ్యునిష్టు అని చేప్పుకునే వారికి కాలం చెల్లిందేమొ గాని కమ్యునిజానికి చెల్లలేదు. చెల్లదు కూడా!*
ఈ రోజుల్లో కమ్యునిస్ట్ అని చెపితే ఎవ్వరు పట్టించుకోరు, ఆ మాట వినడం ఆమడదూరం వేళతారనే గదా, రచయితలు సామజికుల మని చెప్పుకొంట్టూ కొత్త అవతారం ఎత్తింది. కమ్యునిష్టు లేకపోతే కమ్యునిజం ఉంట్టుందా?
కంపెని మూత పడిన నేను ఇంకా ఆ కంపెని ఉద్యోగినే, కంపెని బిల్డింగ్, లోపల సామగ్రి అంతా ఇంకా అక్కడే ఉంది, కనుక కంపెనికి కాలం చెల్లలేదు అన్నట్లు ఉంది మీవాదం. సరె అది మీ ఇష్టం.
*మాతాతలు నేతులు తాగి మూతులు తుడుసుకున్నారు *
బ్రాహ్మణులు నేతులు తాగి మూతులు తుడుచుకొన్నారు, గతం లో చాలా భోగాలు అనుభవించారు అనే విధంగా కంచా అయ్యలయ్య లాంటి దళిత వాదులు కనలి, రగిలి, పగిలి చేసే ఆరోపణలు. వాస్తవం వేరు. ఓపిక ఉంటే రాణి శివ శంకర శర్మ రాసిన లాస్ట్ బ్రాహ్మిన్ పుస్తకం చదవండి. వాళ్లేమి ఇతర కులాల నెత్తిన వారి సంస్కృతి గతంలో రుద్ద లేదు అని అర్థమౌతుంది. ఇప్పుడు ఫ్యుడల్ సంస్కృతి పునరుద్దరిస్తారనుకోవటం మీ బ్రమ.
* ఈ భావజాలం వెనుక రాజకీయ కారణాలు లేవుంటే పూర్తిగా అమాయకులైనా *
ఆంధ్రాను వదిలి వేసి దశాబ్దాలైంది. ఈ భావజాలం వెనుక రాజకీయ కారణాలు నాకైతే కనపడటం లేదు.నేను పూర్తి అమాయకుడినే ఒప్పుకొంటాను. మీకు తెలిస్తే చెప్పండి, తెలుసుకొంటాను.
రామ్మోహన్ –
మీరు తెలుగుసంస్కృతి ప్రాపగాండాని చాలా తక్కువ అంచనా వేసినట్లున్నారు.
అది సరే…”చేస్తాను చెల్లికి మళ్ళీ పెళ్ళి” అని కవిత్వాన్ని ఒక సినిమాలో అభాసుపాలు చెసిన భరణి గారు ఇటువంటి సినిమా తీయడం కూడా ప్రాపగాండానే. కవులకు ఇచ్చే యాభైవేల బహుమతి ప్రధానం కన్నా జనసామాన్యంలో కవిత్వానికి చేసిన తీరని ద్రోహం అది. సినిమా వాళ్ళు సాహిత్యంలోకి వస్తే ఇటువంటి హానే జరుగుతుంది.
విజయ్ గారి వ్యాఖ్య హాస్యరసస్ఫోరకంగా ఉంది. ఏదో ఓ చెత్త కవితని పట్టుకొని మరేదో సినిమాలో భరణి గారు అపహాస్యం చేసారట. సినిమావాళ్ళు సాహిత్యంలోకి వస్తే ఇటువంటి హానే జరుగుతుందట! సరే సార్… సాహిత్యంవాళ్ళు సినిమాలలోకెళ్తే ఎం ఉద్ధరించగలరని మీ అభిప్రాయం? శ్రీశ్రీ, ఆరుద్ర తదితరులు ఎం ఉద్ధరించారో, పోనీ, సాహిత్యంలోనే ఉండిపోయిన కవులు ఉండి ఉద్ధరిస్తున్నదేమిటో వివరిస్తారని ఆశిస్తున్నాను.
అయ్యా హనుమంతు గారూ
మన సినిమా వాళ్ళ వలన మన సినిమాకి, మన కళాకారులకి, మన రచయితలకి ముఖ్యంగా మీ తెలుగు సంస్కృతికి చాలా ఉపకారమే జరిగింది. అదంతా చెప్పాలంటే ఇంకొక పెద్ద వ్యాసం కాదు కాదు పెద్ద పుస్తకమే అవుతుంది. మనమలా గెంతకుండా చెల్లుబాటులో ఉన్న తెలుగు సంస్కృతి గురించే మాట్లాడుకుంటె మంచిది.
సరే విజయ్ సార్. చెల్లుబాటులో ఉన్న తెలుగు సంస్కృతి గురించే మాట్లాడండి. సినిమా వాళ్లు సాహిత్యం అంతో మొదలెట్టింది మీరే కదా. గో ఎహెడ్.
సరే.. రామ్మోహన్ రాసిన వ్యాసంలో తెలుగు సంస్కృతిలో ఉన్న రాంగ్ రిప్రెజంటెషన్ గురించి ఎవరూ పట్టించుకోవడంలేదనే నా గొడవ. ఇవాళ ఇంకా తెలుగు సంస్కృతి అంటే రాములవారి నామాలు, కోనసీమ కొబ్బరిబోండాం, గుమ్మానికి కట్టిన మామిడాకులు, పసుపు కుంకుమ ఇవేనా.. మనం ఇంకా ఈ పల్లెటూరి డ్రమటైజేషన్ లోంచి ఇంకా బయటపడక పోవడం విషాదం. ఇవాళ తెలంగాణ ప్రజలు ఈసడించుకునేది మీరు ప్రచారం చేసుకునే ఈ సోకాల్డ్ తెలుగుసంస్కృతినే.
ఇప్పుడు ఈ సబ్జెక్టులో తెలంగాణాను ఎందుకు ఇరికిస్తున్నారో అర్ధం కావటంలేదు. ఇకపైగా, మీ సమ్స్కృతి అంటూ నన్నేదో దెప్పిపొడుస్తున్నట్లు ఉంది మీ వ్యవహారం. ఇంతకి రామ్మోహన్ గారిని vimarSiMchaanani నన్నో బాపనుడని భావిస్తున్నారా? అసలు విషయానికి సంబంధంలేకుండా మాట్లేది మీరు. ఇకపైగా, గెంతులు వేస్తున్నానని నా పేరును ఎద్దేవా చేస్తున్నది మీరు. కొద్దిగా ఆలోచించి వాదించండి సార్
Vijay Sir
I can be online for only an hour or so. I will gladly respond if you let me know what exactly is telugu sanskruti and what exactly is the right representation and how badly it was represented in midhunam.
Eagerly waiting for your response. If I don’t respond today, please do not misunderstand that I have escaped. I will respond to you once I am back online.
my dear sir,
i too dont have much time to explain and to define telugu culture as it is totally another aspect from the present context. in present days there is no single culture. hence, let us say cultures. the present & future generations should re-define their cultures according to the times they face. thats it.
bye
ఇందుకే విజయ్ సార్ మీ వాదన పేలవంగా ఉన్నా హాస్యరసస్ఫోరకంగా ఉంది అని నేను చెప్పింది.
మీ మొదటి కామెంతులోనేమో “తెలుగు సంస్కృతి ప్రాపగాండని తక్కువగా అంచనా వేయొద్దు” అని రామమోహన్ గారికి చెప్పారు. ఆ తర్వాతి కామెంటులోనేమో “…….. ముఖ్యంగా మీ సంస్కృతికి చాలా ఉపకారమే జరిగింది” అంటూ “….. చెల్లుబాటులో ఉన్న తెలుగు సంస్కృఇతి గురించి మాట్లాడుకుంటే మంచిది” అని సలహా ఇచ్చారు. దాని గురించి వివరణ అడిగితేనేమో “….ఇవాళ తెలంగాణా ప్రజలు ఈసడించుకునేది మీరు ప్రచారం చేసుకునే ఈ సోకాల్డ్ తెలుగు సంస్కృతినే” అని సెలవిచ్చారు. చివరికి, ఆ తెలుగు సంస్కృఇతి ఏమిటో చెప్పమంటే, “…..యాజ్ ఇటీజ్ అనదర్ ఆస్పెక్ట్ ఫ్రం ద ప్రెజెంట్ కాంటెక్స్ట్” అంటున్నారు. అసలు ఇక్కడి విషయానికి సంబంధంలేని వ్యాఖ్యలన్నీ చేసింది మీరు. వీలైతే, నా విమర్శలో లోపం చెప్పండి. ఒప్పుకుంటాను. అంతే కానీ, కప్పగంతులు మీరు వేస్తూ, నేను కుప్పిగంతులు వేస్తున్నానని అనటం వాదన అనిపించుకోదు.
కొలకలూరి ఇనాక్ కథనో, నాగప్పగారి సుందర్రాజు కథనో, వేముల ఎల్లయ్య కక్కనో ఇలాగే సినిమా తీసి ఇది తెలుగు సంస్కృతి అంటే ఇలాగే ఆమోదించి ఉండేవారా?
ఆమోదించి ఉండేవారా లేదా అనేది ఊహాజనిత ప్రశ్న. ప్రశ్నించే బదులు సినేమా తీసి ఇది కూడా మన తెలుగు సంస్కృతి అని జనాలకి చూపవచ్చు కదా! సినేమాతీయటానికి కోట్ల డబ్బులు లేకపోతే షార్ట్ సినేమా గా తీయవచ్చుకదా! ఈ రోజుల్లో ఎన్నో షార్ట్ సినేమాలు యుట్యుబ్ లో అప్లోడ్ చేస్తున్నారు.
పీడిత వర్గం అనో లేక dalitha వర్గం అనో ఒక టోపీ తగిలించికుంటే, ఎలాంటి అబద్ధాలు అయినా దూషణలు అయినా చెల్లుబాటు అవుతాయి అన్న ఒక్క ధైర్యం ఈ సమాజానికి చుట్టుకొని మనకి ఈ దుర్భాగ్యం కలిగింది. ఇలాంటి వ్యాసాలు అయిన, చాల వరకు దళిత కవిత్వం అయినా విషయ విశ్లేషణ కన్నా వ్యక్తి, varga దూషణ మీద దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. తెలంగాణా వాదానికి ఇదే సమస్య. ఈ పర దూషణ ప్రవాహం లో kottuku పోతున్న ఈ సో కాల్డ్ మేధావులు వాళ్ళ వాళ్ళ vargaalaki melu kannaa keedu ఎక్కువ చేస్తునారు అని నా vyaktigatha abhiprayam.
ఇంతకు ఈ వ్యాసం ద్వారం మీరు ఏ చెప్పదలుచుకున్నారు. తెలుగుదనమే మాయమైపోతున్న నేటి కాలంలో ఇటువంటి సినిమా తీసిన దర్శక నిర్మాతల ప్రయాత్నాన్ని మెచ్చుకోకుండా..కోడి గుడ్డుపై ఈకలు పీకినట్టు అర్థంపర్ధం లేని లాజిక్కులు లాగుతూ ఓ మంచి సినిమా ఫీల్ ను తీయకండి. మనం ఓ ప్రయత్నం చేయకపోయినా పరావాలేదు..అది చేసినవారిపై రాళ్లు వెయ్యకుండా ఉంటూ అదే పదివేలు..ఇకపై మీరు ఇటువంటి అసందర్బం వ్యాసాలు రాయకుంటా ఉంటే అదే మీరు తెలుగు ప్రజలకు, తెలుగు భాషకు చేసే మేలు…
శ్రమైక జీవనాలపై వచ్చిన షావుకారు”, “తోడి కోడళ్ళు” వంటి ఆ కాలపు సినిమాలను ఈ రచయిత చూసినట్టుగా లేరు! ఆ చిత్రాల్లో చూపబడ్డవి మైనార్టీ శ్రమజీవులా?
పరుచూరి బ్రదర్సు సినిమాల్లో కాఫీకో, బూందీకో కక్కుర్తి పడి, కథానాయకులైన నాయుడోళ్ళు, రెడ్డిగార్లచే చెప్పుదెబ్బలు తినే బాపనోళ్ళ పాత్ర చిత్రీకరణల్నీ ఈ రచయిత గారు చూసినట్టుగా లేరు!
ఒక్క మిథునాన్ని పట్టుకొని కదలి, కనలి, రగిలి, పగిలి ఈ రచన చేసి బోలెడు సూత్రీకరణలు, సిద్ధాంతాలను ప్రవచించారు. వారికి ఇది గొప్ప రచనే కావొచ్చునేమో గానీ ఇది విమర్శ కాదు. విశ్లేషణ కాదు. పొగడ్త కాదు. తెగడ్త కాదు. అసలు ఇందులో చదివి తెలుసుకోదగ్గ నూతనావిష్కరణ లేవీ లేవు.
నాలుగు ఛీత్కారాలు, అరడజను హుంకరింపులు, డజను ఆంగ్ల పదాలు, కొద్దిగా కులవాదం, కొద్దికొద్దిగా “అత్యాధునికత”ను చేర్చి వ్రాసేయడం ఈనాటి కొత్త రకపు రచయితల ధోరణి. ఈ రచన కూడా అదే బాటన సాగింది.
నిజమే రఘు గారు మీరు వ్రాసింది.
నేనూ చదివాను రామ్మోహన్ గారి వ్యాసం మిధునం సినిమా పై.
ఒక అక్కసు, చాలావరకు గందరగోళం ప్రధాన అంశాలు గా ఉన్నాయి మినహా చెప్పదలచుకున్నది ఏమిటో తెలియలేదు!!
బాగుంది ఇలా ధైర్యం గా రాయగలగాలి అప్పుడే మనం స్పష్ట సమాజం వైపు వెళ్తాం . ఏమే ఒసే అని వేల సార్లు పిలిచిన మొగుడిని ఒక్క సారయిన ఒరే అని పిలవలేక పోయిన అమ్మ మీద నాకేం భక్తీ లేదు. ముండ ముండ అని స్పష్టం గా అని పించిన దర్శకుడిని మహిళా లోకం ఆదరించడం పెట్టుబడి దారీ విషాదం. కోకు ఎప్పుడో దీన్ని విమర్సించారు . పూర్తీ తిరోగమన సినిమా ఇది . ప్రతి క్షణం చిరాకు పుట్టించిన చెత్త. చక్కగా రాసారు .
ఈ చర్చలో పాల్గొనే వారు కూడా చాలా తమాషా గా మాట్లాడుతున్నరు. కొందరు వారిని వారు పురోగమన వాదులమని భావించుకొంట్టున్నట్లు ఉంది. చనిపోయి దశాబ్దాలు అవుతున్నా ఇంకా కొకు,శ్రీ శ్రీ, రావి శాస్త్రి అంట్టు, వారినే తలచుకొంట్టు, వారి నామజపం చేసుకొంట్టున్నట్లు ఉన్నారు. గతంలో జీవించే ఇటువంటి వారు తిరోగాములు కారా? ఈ వ్యాసరచయితనే తీసుకొంటే , ఇతను అంత గొప్ప పురోగామి అయితే, మహేష్ భట్ సినేమాలలో ఆధునిక మహిళల స్వేచ్చని చూపిస్తాడు గదా, ఆ సినేమాల పైన వ్యాసాలు రాయోచ్చుకదా! ఈ వ్యాసం లో పురోగామిగా భావించుకొనే ఒక తిరోగామి రచయిత, ఇంకొకరిని తిరోగామి భావజాలంతో తీసిన సినేమా అని ఆడిపోసుకోవటం మించి ఎమీలేదు. దానికి కారణం చాలా మంది పైన చెప్పిందే.
వారి మోకాటెత్తుకు కూడా ఈసమాజం పెరగ లేదు. ఈ పెట్టు బడి దారి సమాజం పోతుంది గాని వారి పేరు మాత్రం మాసి పోదు. వాళ్లు ఎప్పుడూ మరణించారు!
వారి మోకాటెత్తుకు కూడా ఈసమాజం పెరగ లేదు. ఈ పెట్టు బడి దారి సమాజం పోతుంది గాని వారి పేరు మాత్రం మాసి పోదు. వాళ్లు ఎప్పుడూ మరణించారు!
“అవును మిథునం బ్రాహ్మల సినిమా” అంటే సరిపోయేదానికి ఇన్నేసి వాదనలు ఎందుకు? నిజానికి ఈ సినిమాని “అచ్చ తెలుగు సినిమా” అని ప్రమోట్ చెయ్యడం తో మొదలయ్యింది తంటా. ఆ స్లోగన్ లో ఎక్కడో ఆదిపత్యభావజాలపు వాసనవచ్చి కొంచం కాన్షియస్గా చూడాల్సి వచ్చింది. ఇలాంటి విశ్లేషణ చెయ్యాల్సి వస్తుంది. దళిత కథల్లాగే బ్రాహ్మణ కథలు ఉండటము వాటిని చెప్పడము కూడా అవసరమే ఆ అవసరాన్ని ఎవరూ కాదనరు. కానీ “ఇదే తెలుగు సంస్కృతీ” అంటే మాత్రం తంటా తప్పదు.
“అచ్చ తెలుగు సినిమా”
మన రాష్ట్రంలో ఇదే తెలుగు సంస్కృతి అని గోదావరి జిల్లాలు,కృష్ణా, గుంటూరు జిల్లాల వారికి మొదటి నుంచి ఒక ఆధిపత్య భావం ఉందనిపిస్తుంది. ఈ జిల్లాల నుంచి కవులు, రచయితలు సంఖ్యాపరంగా చాలా మంది ఉండటం వలన,తెలుగు సాహిత్యం లో కూడా వారి ఆధిపత్య భావజాలం కనిపిస్తుంది. సంసృతి పరంగా చూస్తే టివిలలో ఉగాది పండగ రోజు ప్రోగ్రాం చూడండి కోనసీమ ప్రాంత మామిడి చేట్లు,పచ్చని పొలాలుగోదావరి తీరం చూపుతూంటారు. బహుశా వారి ఉద్దేశం కోనసీమ అందాలే తెలుగు ఇంటి అందాలు అని అయిఉండవచ్చు. ఇక వారి సమస్యలే రాష్ట్రం లో అన్ని ప్రాంతాల తెలుగువారి సమస్యలు గా చెలామణీ అవుతూంటాయి. ఉదా|| స్రీ సాహిత్యం, స్రీ ల సమస్యలు, హక్కులు గురించి రాసే రచయితలలో ఎంత మంది రాయలసీమ వారు ఉన్నారు? కాని ఆ సాహిత్యం తరచి చూస్తే ఆంధ్రాప్రాంతపు ఆర్ధికంగా,సామాజికంగా అభివృద్దిచెందిన వర్గాల వారి సమస్యలే ఎక్కువగా కనిపిస్తూంటాయి.
ఇదే తెలుగు సంస్కృతి కాదు, ఇదే అచ్చ తెలుగు సినిమా కాదు అని చెప్పేదానికి ఒక కులాన్ని హేళన చేస్తూ ఇంతగా రాయాలా? రచయిత చెప్పే విషయంలో తప్పులేదు, చెప్పే పద్ధతిలో ఉంది. ఆ చెప్పే పద్ధతి ఒక కులంవారిలో నొప్పినీ, ఆగ్రహాన్ని కలిగించేదిగా ఉండకుండా, అవును అంతే కదా అని వారిలోనూ ఆలోచన కలిగించేలా ఉండాలి.
స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. స్పందనలు చూశాక కొన్ని విషయాలు అర్థం కాలేదు. నేను సరిగా చెప్పలేకపోయానా, వాళ్లు అర్థం చేసుకోలేకపోయారా అనేది అర్థం కాలేదు. అర్థం చేసుకోదల్చుకోని వారి సంగతి వేరే. వారికేం చెప్పీ లాభం లేదు. అపార్థం చేసుకున్నవారికోసం మూడు మాటలు.
1) నేను శ్రీరమణ గారి జోలికి కాని మిధునం కథ జోలికి గానీ పోలేదు. ఎవరైనా వారికి తెలిసిన విషయాలు, వాతావరణాన్నే కథనం చేస్తారు. కాదని ఎవరన్నారు? తప్పని ఎవరన్నారు? ఏం చిత్రించావు అన్నదానికంటే ఏం కన్వే చేయదల్చుకున్నావు అనేదే ముఖ్యం.
2) ఆ మాటకొస్తే సినిమాను కూడా దానికదిగా విమర్శించడం నాలక్ష్యం కాదు. ఇది సినిమా సమీక్ష కాదు. సినిమాను ప్రచారం చేసిన పద్ధతిమీద నా ఆగ్రహప్రకటన ఇది. అందులో భాగంగానే సినిమాను అందులోని అంశాలను ప్రస్తావించాల్సివచ్చింది. కేవలం పిడికెడు మంది సంస్కృతిని మొత్తం తెలుగు సంస్కృతిగా ప్రచారం చేయడం కోపం తెప్పించింది. అభిరుచి కలిగిన మిత్రులు కూడా దాన్ని ఆమోదించడం బాధ కలిగించింది. ఆ పిడికెడు మంది సంస్కృతి సంస్కృతి కాదనో, అది తక్కువదనో ఎక్కువదనో నేనేమీ అనలేదు. వారి వారి ఆహారపు అలవాట్లు ఇతర ఆచార వ్యవహారాలు కలిగి ఉండే హక్కువారికున్నది. ఆమిష్ కమ్యూనిటీకి అలా జీవించే హక్కు లేదని అనలేం కదా! కాకపోతే అదే ఆదర్శనీయమైన- అనుసరణీయమైన సంస్కృతిగా అందరికీ ఆపాదించే హక్కు అయితే ముమ్మాటికీ లేదు.
3) నాది బ్రాహ్మణ ద్వేషం కాదు. సంప్రదాయ ఆధిపత్యభావన మీద వ్యతిరేకత. పుట్టుకను బట్టి గుణాన్ని నిర్ణయించడానికి నేనేమీ మనుధర్మాన్ని నమ్మే ఆధిపత్యసంప్రదాయవాదిని కాను. వ్యాసంలో బ్రాహ్మణులను ఎక్కడా నిందించలేదు,. ఐదుశాతంలోపు వారిలో అన్నపుడు కూడా అందులోని సంప్రదాయవాదుల గురించి ప్రత్యేకంగా చెప్పాను. సంప్రదాయవాదం, బ్రాహ్మణవాదం పదాలను కులాధిపత్యభావనకు పర్యాయపదాలుగా వాడాననేది వ్యాసం జాగ్రత్తగా చదివితే సులభంగానే అర్థమవుతుంది. కాకపోతే చిన్న కమ్యూనిటీకి చెందినవారిలో కొందరి రుచులు, అభిరుచులను తెలుగు వారి ఔన్నత్యానికి సంస్కృతికి తలమానికాలుగా వీధికెక్కి ప్రచారం చేస్తున్నవారు ఏ సింబల్స్ అయితే వాడుకున్నారో ఆ సింబల్స్ను కూడా విమర్శించాల్సి వస్తుంది. కొన్ని విసుర్లు అనివార్యమవుతాయి. వ్యాసం మొత్తాన్ని దాని స్పిరిట్ను తీసుకున్నపుడు అవి విడిగా కనిపించవు.
బ్రాహ్మణ ద్వేషం కాదంటున్నారు. మరి సినిమాలో దర్శకుడు చూపించిన కులవృత్తుల గురించి ఘాటుగా వ్యాఖ్యానించిన మీరు, అదే దర్శకుడు బ్రాహ్మణులను తిండిపోతులుగా చిత్రీకరించినప్పుడు ఆ విషయాన్ని ఖండించకుండా “సంప్రదాయంగా వస్తున్న ప్రచారానికి అనుగుణంగా కనిపించే స్టీరియోటైపు తిండిపోతు అప్పదాసు” అని అవహేళన ఎందుకు చేసారు?
ఓ సింహనాయుడు అనో, మరో సింహారెడ్డో అని మీసాలు దువ్వి, తోడలు కొట్టి, పీకలు కోస్తాననో, తలకాయలు లేపేస్తాననో, ఓ పది సుమోలు కాల్చిపడేస్తే, అదే సంస్కారవంతమైన సినిమా అనో, అదే పదిమంది పాటించే మన సంస్కౄతి అనో తీర్మానిస్తారా?
నలుగురికి నాలుగు రకాల రుచులు, అభిరుచులు ఉంటాయి. ఈ సినిమా కొందరి అభిరుచికి దగ్గరగా ఉన్నదంటే, ఆ కొందరూ ఆధిపత్యపు సంప్రదాయవాదులని మీరు ఎలా జనరలైజ్ చేస్తారు? వారికి సామాజిక బాధ్యత లేదని తీర్మానిస్తారా?
“కొన్ని విసుర్లు అనివార్యమవుతాయి. వ్యాసం మొత్తాన్ని, దాని స్పిరిట్ ను తీసుకున్నప్పుడు అవి విడిగా కనిపించవు”
-విసుర్లు అనివార్యమైనప్పుడు దానిని విమర్శించడం కూడా అనివార్యమే అవుతుంది కదా? ఒక కులం వారు ఇంకో కులంవారిపై ఇలాగే విసుర్లు వేసి, స్పిరిట్ ను మాత్రమే తీసుకోవాలని అంటే ఒప్పుకుంటారా? మీరు చెప్పేదే సంస్కృతి కాదని చెప్పచ్చు. అది చెప్పడానికి విసుర్లు అనివార్యమేమీ కాదు. విసుర్లే మీ వ్యాసంలోని స్పిరిట్ ను అర్థం చేసుకునే అవకాశం లేకుండా చేశాయి. అది మీకు మీరే చేసుకున్నారు.
మిథునం కథకు దృశ్య రూపం ఇచ్చారు భరణి గారు. అందులో కొంత సొంత పోకడలు ఉన్నా అంతగా పరిగణనలోకి రాకపోవడానికి కారణం, ప్రేక్షకునికి ఆ సినిమాలో అంతకు ముందే వచ్చిన శ్రీరమణ గారి మిథునం కథ మాత్రమే కనిపించింది. కథ చదవని వాళ్లకు కూడా, అందులోని సారాంశం తట్టింది. (నేను కథ కన్నా ముందే సినిమా చూశాను.)
కథలో ఏం కన్వే చేయదల్చుకున్నారన్న దాని కంటే, కథను మీరెలా తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారన్నది ముఖ్యం.
భరణి గారి ప్రయత్నం గురించి చెప్పాలంటే 70 పేజీల కథను 3 గంటల పాటు మనకు పరిచయం చేయాలంటే అందుకు కొంత సొంత పని చేయక తప్పదు. అందునా రెండే పాత్రలతో ఈ 3గంటల పాటు ప్రేక్షకుడిని అలరించాలంటే తప్పదు.
రామాయణంలో పిడకల వేటలా ఈ కథలో కులాన్ని పట్టుకుని, దీన్ని ఒక కులానికే సంబంధించిన కథ అనుకోవడం కథను సరిగా అర్థం చేసుకోకపోవడమే అవుతుంది. ఈ కులం వాళ్ళు మాత్రమే ఇలా ఉండాలని (ఉన్నారని) రచయిత ఎక్కడా చెప్పలేదు. ఈ విశ్లేషణలో సినిమాని అడ్డం పెట్టుకుని కథని విమర్శించినట్టుగా అనిపించింది.
ఎటు చూసినా కాలుష్యంతో నిండిన వాతావరణం, ఏదో మొక్కుబడికి పెంచుతున్న ఆ కాస్త మొక్కలు కూడా రేపో , మాపో చచ్చేవిగా తలలు వేలాడేసుకుని దుమ్మూ ధూళితో నిండి ఉన్నవే తప్ప మచ్చుకైనా పచ్చదనం కనిపించని ఈ నగరవాతావరణంలో బతుకుతున్న మనకు ఆ కాస్త సమయంలోనే పచ్చని పల్లె వాతావరణాన్ని చూపించారు భరణిగారు.
మూడు ముళ్ళతో ఏకమై, కొత్త జీవితాన్ని ఆరంభించిన ఆ జంట, కొత్తగా వచ్చిన బంధాలను భాధ్యతలను, కష్టాలను, కన్నీటినీ, అన్నింటినీ భరించి అలసి సొలసి పోయిన వాళ్ళు, జీవిత చరమాంకంలో తాము ఎవరిపైనా ఆధారపడకుండా రాలిపోవాలని, ఆ జీవించే కొద్ది కాలం తమ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదనీ అనుకోవడం తప్పుకాదే. అయినా వయసు మీద పడిన దంపతులు ఇలానే ఉండాలని హద్దులు లేవే, ఆ హద్దులు లేని జీవితం ఎలా ఉంటుందో తెలిపే కథే మిథునం. చిలిపితనం, అనురాగం, ప్రేమ అన్నీ వయసు మళ్లిన తరువాత వారి మధ్య స్నేహం గా మాత్రమే నిలిచాయని ఎందుకు అనుకోకూడదు.
ఎప్పటికైనా ఏ భాధ్యతలూ లేని జీవితం గడపాలనుకునేవారు ఎంత మంది లేరు. ఎంతోమంది భార్యాభర్తలు కనే కమ్మని కలే మిథునం.
బ్రాహ్మణ ద్వేషం కాదంటున్నారు. మరి సినిమాలో దర్శకుడు చూపించిన కులవృత్తుల గురించి ఘాటుగా వ్యాఖ్యానించిన మీరు, అదే దర్శకుడు బ్రాహ్మణులను తిండిపోతులుగా చిత్రీకరించినప్పుడు ఆ విషయాన్ని ఖండించకుండా “సంప్రదాయంగా వస్తున్న ప్రచారానికి అనుగుణంగా కనిపించే స్టీరియోటైపు తిండిపోతు అప్పదాసు” అని అవహేళన ఎందుకు చేసారు?
ఓ సింహనాయుడు అనో, మరో సింహారెడ్డో అని మీసాలు దువ్వి, తోడలు కొట్టి, పీకలు కోస్తాననో, తలకాయలు లేపేస్తాననో, ఓ పది సుమోలు కాల్చిపడేస్తే, అదే సంస్కారవంతమైన సినిమా అనో, అదే పదిమంది పాటించే మన సంస్కౄతి అనో తీర్మానిస్తారా?
నలుగురికి నాలుగు రకాల రుచులు, అభిరుచులు ఉంటాయి. ఈ సినిమా కొందరి అభిరుచికి దగ్గరగా ఉన్నదంటే, ఆ కొందరూ ఆధిపత్యపు సంప్రదాయవాదులని మీరు ఎలా జనరలైజ్ చేస్తారు? వారికి సామాజిక బాధ్యత లేదని తీర్మానిస్తారా?
ఈ వ్యాసం కనీసం ఒక దశాబ్దం లేటు!! ఇప్పటికయినా వచ్చినందుకు ఎంతో సంతోషం! ఆ కథనూ సినిమానూ మెచ్చుకొనే వాళ్ళూ తెగనాడే వాళ్ళూ తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలనే గాకుండా- తమ వారసత్వ నేపథ్యాల సంస్కృతిని కూడా అసంకల్పితంగానే వెలిబుచ్చుతున్నారు!!