నిత్య నూతనం అన్నమయ్య పాట !

కాలంతో పాటు పాత బడేవి ఉంటాయి. కాని కాలంతో పాటు నడచి వస్తూ ఎప్పుడూ సరికొత్తగా కనిపిస్తూ ఆనందాన్ని కలిగించేవి కొన్ని ఉంటాయి. సూర్యుడు ఎంత పాత వాడో ఎప్పుడూ అంత సరికొత్త వాడు కూడా. నేను ఇటీవలే ఒక మంచి పాట విన్నాను. అందులోని భావ సౌకుమార్యం, కొత్తదనం చూస్తే ఇది ఆరువందల ఏండ్ల నాడు కట్టిన పాటా, కాని ఇంత సరికొత్తగా ఉందే అని ఆనందం ఆశ్చర్యం కలిగాయి. అది అద్భుతమైన భావనా శక్తిని దాచుకున్న పాట అనిపించింది. పరమానందం కలిగింది అదీ గొప్ప గాయనీమణుల నోట వింటుంటే. ముందు పాటను ఇక్కడ చూపి దాన్ని గురించి రాస్తా.

పొద్దిక నెన్నడు వొడచునే పోయిన చెలి రాడాయెను

నిద్దుర కంటికి దోఁపదు నిమిషంబొక ఏడు                   || పొద్దిక ||

 

కన్నుల నవ్వెడి నవ్వులు, గబ్బితనంబుల మాటలు

నున్నని ఒయ్యారంబులు, నొచ్చిన చూపులును

విన్నఁదనంబుల మఱపులు, వేడుక మీరిన వలపులు

సన్నపు చెమటలు దలచిన, ఝల్లనె నా మనసు                     || పొద్దిక ||

 

ఆగిన రెప్పల నీరును, అగ్గలమగు పన్నీటను

దోగియు దోగని భావము, దోచిన పయ్యెదయు

కాగిన దేహపు సెగలును, కప్పిన పువ్వుల సొలపులు

వేగిన చెలి తాపమునకు, వెన్నెల మండెడిని                || పొద్దిక ||

 

దేవశిఖామణి తిరుమల, దేవునిఁ దలచిన బాయక

భావించిన ఈ కామిని భావము లోపలను

ఆ విభుడే తానుండిక ఆతడె తానెరుగగవలె

ఈ వెలదికి గల విరహంబేమని చెప్పుదము.               || పొద్దిక ||

 

పైన పాట నిర్మాణాన్ని చూస్తేనే ఇది అన్నమయ్య పాట అని తెలిసిపోతుంది. పైన చెప్పిన పాటలో ప్రత్యేకతని గురించి ఇందులోని నేటికీ కనిపించే కొత్తదనాన్ని గురించి చెప్పే ముందు. అన్నమయ్యపాటను గురించి నాలుగు మాటలే చెప్పాలి.

annamayya-telugu-movie1

అన్నమయ్య పాటలో రెండు పాదాల పల్లవి ఉంటుంది. మూడు చరణాలు ఉంటాయి ప్రతి చరణంలో నాలుగు పాదాలుంటాయి వాటిలో యతి మైత్రి ఉంటుంది, కాని ఎక్కడ అనే నియమం లేకుండా ఏదో ఒకచోట తప్పని సరిగా ఉంటుంది. అంతే కాదు పాదాలు నాలుగింటిలో ప్రాసనియమం ఉంటుంది. ఎంచుకున్న ఈ పాట నిర్మాణం పాడడానికి చాలా బాగా ఒదిగి పోతుంది. లయ సాధ్యం అవుతుంది. అయితే మూడు చరణాలకంటే ఎక్కువ ఉన్నవి లేదా తక్కువ ఉన్నవి ఎక్కడో ఒకటి కనిపిస్తాయి. కాని సాధారణంగా అన్నమయ్య పాటలు అత్యధికంగా ఒక పల్లవి మూడు చరణాలు పెన చెప్పిన పద్ధతిలో ఉంటాయి.

ఇది సుమారు ఆరు వందల ఏండ్ల నాడు కట్టిన పాట.  ఇక్కడ నేను రాసిన పాట అని అనలేదు. కారణం అన్నమయ్య కూర్చుని పాటలు రాయలేదు. ఆయన పాటకట్టి పాడుకుంటూ పోయాడు. తర్వాత వాటిని ఆయన కుమారులు శిష్యులు రాసారు. అంతే కాదు వాటిని రాగిరేకుల మీద చెక్కించారు. ఈ కీర్తి ఎక్కువ ఆయన మనవడికి దక్కుతుంది. అన్నమయ్య 32 వేల పాటలు కడితే నేటికి మనకు పద్నాలుగు వేలకు పైగా దొరుకుతున్నాయి. వీటిలో ఏ పాటను పట్టుకున్నా తియ్యదనం జలజలలాడుతుంది.

పై పాటలో ఒక స్త్రీ దూరంగా వెళ్ళిన చెలికాని గురించి బాధపడుతూ విరహాన్ని అనుభవించే ఘట్టాన్ని వర్ణించాడు. ఇందులో పోయిన చెలి రాడాయెను అని అన్నాడు. ఇక్కడ చెలి అనే మాటను చెలికాడు ప్రియుడు భర్త అనే అర్థంలో వాడాడు. చెలి అనగానే స్త్రీ అని అనుకుంటాము. పురుషుని కూడా చెలి అనిడం ఉందని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ స్త్రీ తన భర్త దూరంగా వెళ్ళి ఉన్నాడు అతనినే తలుస్తూ ఉంది ఈమె. ఆమె ఈ స్థితిలో ఉన్న బాధని లోతైన భావాన్ని వర్ణిస్తున్నాడు కవి.

రాత్రి సమయంలో ఉన్న ఆమెస్థితిని చెబుతూ  పొద్దిక (పొద్దు ఇక) ఎన్నడు వొ (పొ)డచునో పోయిన చెలి రాడాయెను. ఈ పొద్దు ఎప్పుడు పొడుస్తుందో రాత్రి ఎలా ఎప్పటికి గడుస్తుందో పోయిన చెలికాడు రాలేదు అన్నాడు పల్లవి లో, తర్వాత ఏ మంటాడో చూడండి. నిద్దుర కంటికి తోపదు నిమిషంబొక ఏడు. నిద్ర రావడం లేదు నిముషమే ఒక ఏడాదిగా గడుస్తూ ఉంది.

మొదటిపాదంలో  కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు. నవ్వులు ఆమె నోటి తో కాకుండా కన్నులతో నవ్వుతూ ఉంది అనడం అన్నమయ్య కాలంనాటికి ప్రచలితంగా కావ్య ప్రబంధ వర్ణనలలో ఎక్కడా కనిపించదు. పాటలో సరికొత్తగా కన్నులతో నవ్వడం అని చెప్పాడు. ఇది ఈనాటికీ కొత్తగా కనిపిస్తూ ఉంది. గబ్బితనంబుల మాటలు అంటే పైకి గంభీరంగా పలికే పలుకులు అని ఇక్కడి భావం. గబ్బితనం అంటే కపటపు మాటలు అనే అర్థం కూడా ఉంది వీరోచితమైన మాటలు అని కూడా ఉంది. కాని ఇక్కడ లోపలి బాధను వ్యక్తం చేయకుండా పైకి గంభీరంగా చెప్పే మాటలు అనే భావం. నున్నని ఒయ్యారంబలు నొచ్చిన చూపులను అనే పాదంలో రెండూ కొత్త భావనలే ఒయ్యారం అంటే అందం దాని హొయలు.  నున్ననిది అని చెప్పడం అంతే కాదు రెండిండిని తెలుగు పదాలను వాడడం తర్వాత చూపులు గురించి చెబుతూ నొచ్చిన చూపులు అని అనడం బాధను అంటే విరహాన్ని వ్యక్తం చేసే కళ్ళను గురించి చెప్పడం ఆనాటికి సాహిత్యంలో చాలా కొత్త భావన. తర్వాత విన్నతనంబుల మఱపులు వేడుక మీరిన వలపులు అనే పాదం గురించి స్పష్టం. దీని తర్వాతి చరణంలోని నాలుగో పాదం చూడండి సన్నపు చెమటలు దలచిన ఝల్లనె నామనసు. అన్నాడు. సన్నపు చెమటలు. అవి ధారగా కారుతున్న చెమటలు కావు. సన్నగా ఆ విరహస్థితిని చూపే చెమటలు వాటిని తలచుకుంటే మనసు ఝల్లుమందట.

తర్వాతి చరణం మరింత బాగుంటుంది. మొదటి పాదంలో ఆగిన రెప్పల నీరును అగ్గలమగు పన్నీటను దోగియు దోగని భావము, దోచిన పయ్యెదయు అని రెండుపాదాలలో ఒక భావాన్ని చెప్పాడు. కన్నీరు రెప్పల వెనుకే ఆగింది కాని చెక్కిలి మీదికి జారలేదు. చాలా అధికమైన పన్నీటిలో చల్లదనం కోసం మునిగినా అంటే దోగినా తన లోపలి విరహం ఆ పన్నీటిలో మునగలేదు అంటే ఆమె భావన  చల్లారలేదు. ఆతర్వాత చూడండి. కాగిన దేహపు సెగలు కప్పిన పువ్వుల సొలపు, దేహం కాగుతుంటే పువ్వులను కప్పారట ఇది ఆనాటి ప్రబంధ ధోరణి వర్ణనే కాని తర్వాత వేగిన చెలి తాపమునకు వెన్నల మండెడిని అన్నాడు. వెన్నెల చల్లదనాన్ని ఇవ్వకుండా వేడి సెగలు పుట్టిస్తున్నాడు అని చెప్పడం ప్రబంధాలలో ఆయన కాలానికి ఉన్నది. కాని వేగిన చెలి తాపానికే వెన్నల మండుతూ ఉంది అని చెప్పడం మరొక తీరు. ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది.

దోచిన పయ్యెద అని చెప్పడం అద్భుతం. ఆమె పయ్యెదను అంటే పైటను దోచుకున్నాడట. ఇక్కడ దోచుకున్నది పైటను కాదు మరేదో అని  ఎంత సున్నితంగా శృంగారాన్ని వర్ణించడో గమనించవచ్చు. ఇప్పటికి ఎంత మంది చేస్తున్నారు ఇలా. అదృష్టవంతులు అనే సినిమాలో చింతచెట్టు చిగురు చూడు అనే పాటలో ఒక సినిమా కవి (ఆత్రేయ) పాలవయసు పొందు కోరి పొంగుతున్నది, నా పైట కూడ వాడి పేరే పలవరిస్తది. అని చరణంలో రాసాడు. వింటే వాహ్ ఎంత అద్భుతంగా చెప్పాడు అని అనిపిస్తుంది. ఇక్కడ అన్నమయ్య పాట కూడా దోచిన పయ్యెద అని అనగానే వాహ్ ఎంత అద్భుతం అని అనిపిస్తుంది.

ఇక చివరి చరణంలో అన్నమయ్య తన ముద్రను వేంకటేశ్వరుని పేరిట ఏదో ఒక తీరులో వేస్తాడు. దాన్ని దేవశిఖామణి తిరుమల దేవుని తలచిన బాయక, భావించిన ఈ కామిని భావము లోపలను ఆవిభుడే తానుండి అతడే తనను  గురించి తెలుసుకోవాలని అని అనడమే కాకుండా ఈ వెలదికి కమ్మిన ఈ మాయను ఏమని చెప్పాలి అని అంటాడు.

ఇక్కడ ఏ స్త్రీవిరహాన్ని గురించీ అన్నమయ్య వర్ణించలేదు. ఇక్కడ కవే స్వయంగా ఆ స్త్రీ అన్నమయ్య వేంకటేశ్వరుని పరమ పురుషుడుగా తన నాథుడుగా భావించడం ఆ విరహంలో (భక్తికి చెందిన విరహం)  తనను తాను ఒక స్త్రీగా భావించి వర్ణించడం ఉంది. భగవంతుడే పురుషుడు అని తమను తాము భగవద్విరహంలో ఉన్న స్త్రీ అని చెప్పుకోవడం భక్త కవులు అన్నమయ్యలా చెప్పినవారు ఇంకా ఉన్నారు. ఈయన కూడా ఇంకా వేరే పాటల్లో చెప్పడం ఉంది. కాని ఈపాటలో చేసిన వ్యక్తీకరణలు తెలుగు పదాల సొంపు సరికొత్త సమాసచాలనం గమనిస్తే దీనిలో ఈనాటికీ నిలిచిన కొత్త దనం కనిపిస్తుంది.

ఈ నాటి వచన కవులు భావించేలా అతి నవ్యమైన తాజాగా ఉండే భావనలు ఈ పాటలో ఉన్నాయి. కన్నులతో నవ్వే నవ్వులు, నున్నని ఒయ్యారాలు, విన్నతనంబుల మరపులు, సన్నని చెమటలు, ఆగిన రెప్పల నీరు, దోచిన పయ్యెద అని చెప్పడం అన్నీ కూడా వాహ్ వాహ్ అనే అద్భుతమైనవే కాదు, ఆనాటికి లేనివి తాజావి. తర్వాత ఈనాటికి ఇలాంటివి సరికొత్త సృజనకు ప్రతీకలుగా ప్రతిభావంతంగా కనిపించిడం ఈ పాటలోని విశేషం. ఇటీవల హైదరాబాదులోని ఒక సంగీత కార్యక్రమంలో ప్రియ సోదరీమణలు (ప్రియసిస్టర్స్ అని పిలిచే హరిప్రియ షణ్ముఖ ప్రియలు) ఈ పాటని పాడారు. పాటలోని విరహాన్ని అత్యంత మధురంగా పాడి కొన్ని వందలమందిని మంత్రముగ్ధుల్ని చేశారు. విన్నవారికి ఆ పరవశంలోనుండి బయటికి రావడానికి చాలా సేపు పట్టింది. ఆరువందల ఏండ్లనాడు కట్టిన అచ్చతెలుగు పాటకి మాటకి ఇంత శక్తి ఇంత కొత్త దనం ఉందా అని ఆశ్చర్యపోవడం, దాని ఫలితమే ఈ వ్యాసం.

పులికొండ సుబ్బాచారి

చిత్రరచన: బాపు (తాడేపల్లి  పతంజలి గారి పుస్తకానికి వేసిన బొమ్మ)

Download PDF

2 Comments

  • శ్రీ పులికొండ సుబ్బాచారిగారి ‘నిత్య నూతనం అన్నమయ్య పాట ‘చదివాను. చక్కటి విశ్లేషణ చేసారు. వ్యాస కర్తకు, ప్రచురించిన మీకు అభినందనలు.
    మీరేమనుకోకపోతే ఒక చిన్న సూచన.
    ఈ వ్యాసంలో ప్రచురించిన ఫొటొ నేను రచించిన అన్నమయ్య అన్నమాట పుస్తకానికి బాపుగారు వేసిన బొమ్మ .
    ఫొటొ కింద ఫలానా పుస్తకానికి బాపుగారు వేసిన బొమ్మ అని రాస్తే బాగుంటుందని భావిస్తున్నాను. ధన్యవాదాలు.

  • editor says:

    పతంజలి గారు: నమస్కారం. క్షమించండి. మీరు చెప్పిన ప్రకారం మార్పు చేసాము.

Leave a Reply to editor Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)