ఉప్పరి పిచ్చోడు

chinnakatha

“ఒరేయ్ .. ఉప్పరి పిచ్చోడొస్తున్నాడ్రోయ్..!” దివాకర్‌గాడు అరిచాడు.

ఒక్క దెబ్బన అందరం పారిపోయాం.

తాసిల్దారుగారి అమ్మాయి ‘విజయ’ మాత్రం దొరికిపోయింది.

మేం కొంచెం దూరం పరిగెత్తి వెనక్కి చూస్తే ఏముంది… విజయ నవ్వుతూ వొస్తోంది. దానికి ఏడేళ్లు. అప్పుడు

“నిన్నేం చెయ్యలేదుటే వాడూ?” ఆత్రంగా అడిగాడు గంగాధరం.

“పోండ్రా పిరికిగొడ్డుల్లారా! వాడు నా తల మీద చెయ్యిపెట్టి బే..బే… అని వెళ్లిపోయాడు.” ఎగతాళిగా నవ్వింది విజయ. వాడి పేరు ఎవరికీ తెలీదుగానీ.. ఉప్పరిగూడెంలో ఉంటాడు గనక ఉప్పరి పిచ్చోడనేవాళ్లం.

కూలీనాలీ చేస్తుండేవాడు.

పిల్లలు అల్లరి చేస్తోంటే.. “అదిగో! ఉప్పరి పిచ్చోడొస్తున్నాడు. అల్లరిచేస్తే  ఎత్తుకుపోతాడు.! ” అని భయపెట్టేవాళ్లు.

అందుకే మేము భయపడి పారిపోయింది.

వెన్నెల రాత్రుల్లో నేనూ, రంగడూ, శేషగిరీ, గంగాధరం, శేషగిరి తమ్ముడు కృష్ణమూర్తీ, నాగమణీ, విజయ, అమ్మాజీ అందరం షికార్లు కొట్టేవాళ్లం.

పిండారబోసినట్టుండేది వెన్నెల. మామిడి చెట్ల మీదుగా వీచే గాలి మత్తుగా వుండేది.

అప్పుడప్పుడూ ‘చిట్టిబాబు’గారి తోటలో ‘వేట’కి పోయేవాళ్లం. వేటంటే జంతువుల్ని వేటాడ్డం కాదు. మామిడికాయలు ‘తోటమాలి’ కళ్ళు గప్పి దొంగిలించడానికి.

జేబుల్లో ఉప్పూ, కారం కలిపిన పొట్లాలు రెడీగా ఉండేవి. పాత బ్లేళ్లు కూడా.

‘సరుకు’ దొరకంగానే మామిడికాయని బ్లేడుతో ముక్కలుగా కోసి, ఉప్పూ కారం అద్ది ఆరగించడం ఆ వెన్నెల రాత్రుల్లో అద్భుతంగా ఉండేది. ఆ ఉప్పూ కారం కలిపిన మావిడి ముక్కల్ని ‘కైమా’ అనేవాళ్లం.

ఓసారి కాయలు కోసేసి ‘జోగులు’గారి ‘సా మిల్లు’ ముందున్న రంపంపొట్టు గుట్టలమీద కూర్చుని ‘కైమా’ లాగిస్తుంటే ఉప్పరి పిచ్చోడు వచ్చి నిశ్శబ్దంగా వచ్చి ‘బే..బే’ అని అరిచాడు. పారిపోబోయాం కాని విజయ, “ఆగండ్రా” అని ఆ పిచ్చోడికి నాలుకు మావిడిముక్కలు ఇచ్చింది.

రెండుచేతులూ దోసిలి పట్టి ‘ప్రసాదం’ తీసుకున్నంత భక్తిగా ఆ ముక్కల్ని అందుకున్నాడు.

వెండి వెన్నెల్లో నల్లని ఉప్పరి పిచ్చోడు విచిత్రంగా కనిపించాడు.

“నీ పేరేంటబ్బాయ్?” ఆరిందాలా అడిగింది అమ్మాజీ.

“బే..బే” అన్నాడు ఉప్పరి పిచ్చోడు.

“వాడు మూగవాడు. మాటల్రావు!”అన్నాడు శేషగిరి.

మనిషి ఆరడుగుల ఎత్తు. ఒక్క తువ్వాలు నడుం చుట్టూ కట్టుకున్నాడు. అంతే. మాకు పదేళ్ళుండేటప్పుడు వాడికి పాతికేళ్ళు ఉండేవేమో.

వాడంటే భయం పోయింది గనక మేమందరం కబుర్లు చెప్పుకుంటూ, రంపంపొట్టు గుట్ట మీద ఆటలాడుతూ చాలా సేపు గడిపాం. వాడూ కూర్చుని మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఆనందంగా ఉన్నాడని మాత్రం తెలిసింది. ఎందుకంటే మేం నవ్వుతున్నప్పుడల్లా వాడూ నవ్వాడు.

అప్పట్నించీ, మేం ఎక్కడ కనిపించినా ‘బే..బే’ అని నవ్వేవాడు.

దేవుడు వాడ్ని మూగవాడ్ని చేశాడు గానీ, వాడికెన్ని విద్యలో తెలుసా?

తాటి చెట్లెక్కి ముంజలు కోసేవాడు. కొడవలితో కాయని చెక్కి ‘నీళ్లు’పోకుండా ముంజలు ఆ కొడవలి అంచుతో తియ్యడం వాడి ప్రత్యేకత.

ఎండబెట్టిన కొబ్బరి పీచుతో ‘తాళ్లు’ నేసేవాడు. నాగిరెడ్డి గూడెం ఫారెస్టుకు పోయి ‘కంప’నరుక్కొచ్చేవాడు.

బ్రహ్మాండంగా ఆ కంపతో ‘దళ్ళు’ కట్టేవాడు.

గోడలు ‘మెత్తి’ నున్నగా పేడ పూసి.. ఎండాక రంగులు దిద్దేవాడు. ఇహ పాత పాకల కప్పు ఊడదీసి కొత్త తాటాకు కప్పడంలో వాడు ఎక్స్‌పర్టు.

‘రాజుగారి’ హోటల్లో పప్పు రుబ్బేవాడు. మేవందరం ‘తమ్మిలేరు’ పిక్నిక్ కి పోతే మాతో కూడా వచ్చి, తిరిగొచ్చేటప్పుడు మేం కోసిన ‘వాక్కాయలూ, అడివి కరేపాకు’ గోతాంలో నింపి ఇళ్లదాకా మోసుకొచ్చేవాడు.

వర్షాకాలం ‘యోగి లింగేశ్వర స్వామి’ గుడి పక్కనున్న చెరువు నిండి, నీళ్ళు ‘కళింగ’  దాటి రోడ్డు మీద ఇంతెత్తుకు ప్రవహిస్తుంటే జాగ్రతగా మమ్మల్ని ‘రోడ్డు’ దాటించేవాడు.

ఓ రోజు ‘దివాయ్‌’ గాడు మావిడి చెట్టెక్కి దిగటానికి భయపడితే వాడే చెట్టెక్కి ‘దివాయ్’ని భుజాలకెత్తుకుని కిందకి దింపాడు.

ఓ సారి నిప్పంటుకుని ‘ఇళ్లు’ తగలబడుతుంటే కడివెడు నీళ్లు మీద పోసుకుని మంటల్లోకి దూకి చాలా’మంది’నీ, ‘సొత్తు’నీ బయటికి చేర్చాడు.

ఏ యింటికెళ్లినా వాడికి తింటానికి ఏదో ఒకటి పెట్టేవాళ్లు. వాడూ తిన్నదానికి ప్రతిఫలంగా ఏదో ఒక పని చేసేవాడు. గడ్డి చెక్కడమో, అరుగులు మెత్తడమో, వాకిలంతా ఊడ్చి శుభ్రం చెయ్యడమో, ఏదో ఒకటి..

నానాదేశాలూ తిరిగి, ఇరవై ఒకటో ఏట మా చింతలపూడి వెళ్లి ఫ్రెండ్స్‌తో కబుర్లాడుకుంటూ ‘ఉప్పరి పిచ్చోడి’ గురించి వాకబు చేస్తే వాళ్లన్నారు ‘మర్దిమత్తెన నాగేశ్వర్రావుని పాము కరిస్తే వాడ్ని ఆస్పత్రికి తీసుకుపోయి తిరిగొస్తుండగా ఎద్దు పొడిచి చచ్చిపోయాడు” అని..

“అదేంట్రా?” అని నేను నివ్వెరపోతుంటే…

“పాపం. వాడు మూగే కాదు చెవుడు కూడా ఉంది. అందుకే వెనకాల్నించి జనాలు అరుస్తున్నా పక్కకి తప్పుకోలేకపోయాడు!” అన్నాడు కొనకళ్ల కృష్ణమూర్తి.

“మరి మనం చెప్పేవి వాడికి అర్ధమయ్యేవిగా?” అడిగా.

“పెదాల కదలికని బట్టి అర్ధం చేసుకునేవాడు. అంతేగానీ వాడికి పుట్టుచెముడు !”

“ఒరే..! సమయానికి నన్ను ఆస్పత్రికి చేర్చి నన్ను బతికించాడు కాని వాడు పోయాడ్రా! ఉప్పరాళ్ళే పాపం దహనం చేశారు. అస్పత్రి దగ్గర మా నాన్న నన్ను తీసుకొచ్చినందుకు డబ్బివ్వబోతే ‘బే…బే’ అంటూ వారించాడు. ఒక్క పైసా తీసుకోలా!.” కథ మధ్యలో వచ్చిన మద్ది మంచ్తెనోడు నాతో అన్నాడు. వాడి కళ్లల్లో నీళ్లు.

“వాడు మనందర్నీ స్నేహితులమనుకున్నాడ్రా.  అందుకే మనకి ఎన్ని పనులు చేసిపెట్టినా ఒక్క పైసా పుచ్చుకునేవాడు కాదు…!” విచారంగా అన్నాడు మా హిందీ  మాస్టారి కొడుకు రంగారావు.

అవును స్నేహానికి ‘ఇవ్వటమే’ తెలుసు. చివరికి ప్రాణాన్నైనా..

 

***

 

ఇది జరిగిన చాలా ఏళ్లకి ‘ప్రాణస్నేహితులు’ సినిమాలో ‘స్నేహానికన్న మిన్న’ పాట వ్రాసినప్పుడు గుర్తొచ్చింది మా అప్పరి పిచ్చోడే!

ఇప్పటికీ వూరు వెళితే ‘బే.. బే’ అని అరిచే వాడి గొంతు లీలగా మనసులో మెదుల్తుంది.

వెన్నెల రాత్రుల్లో ఆరుబయట పక్కలేసుకుని ఆకాశంలోని కోటానుకోట్ల నక్షత్రాలు చూస్తుంటే అనిపిస్తుంది.. వాడూ ఆ నక్షత్రాల మధ్య ఎక్కడో వుంటాడు.

bhuvanachandra (5)–భువన చంద్ర

Download PDF

5 Comments

  • లలిత says:

    హుమ్మ్!
    నాకూ ఇలాంటి మనిషి తెలుసు . నా చినప్పటినుంచీ చూస్తున్నాను . వాడి జీవితంలో ఏదో గొప్ప రహస్యం వుందనీ ఇప్పటికయినా అది బయటపడితే బావుణ్ణనీ అనిపిస్తుంటుంది నాకు . సీతారాంపురం పిచ్చోడంటారు వాడిని .

  • bhuvanachandra says:

    అమ్మయ్యా ఒక్కరైనా చదివారుకదా ….థాంక్స్ లలిత గారూ …..వాడిది కధకాదు ”నిజం” అందుకే ……….

  • Dr.Ismail says:

    బ్యూటిఫుల్.

  • Saikiran says:

    చాల హృద్యంగా ఉంది భువనచంద్ర గారు.

Leave a Reply to లలిత Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)