ఆత్మలో కవిత్వం వున్నవాళ్ళు రాసిన కథలు ఇవి!

మళయాళ కథా ప్రస్థానం – 1

Secular Theatre in Kerala

నేడు కథ  అంటే ,ఏ సాహితీవేత్త కాని విమర్శకుడు కాని ఉద్దేశించేది ఒక శతాబ్ధానికి అటో ఇటో పుట్టిన కథ  , లేకపోతే కథానిక అనే సాహిత్య ప్రక్రియగురించే. కాని అతిపురాతన కాలంనుంచే  కథలు ఉన్నాయి.బి. సి 320 నుంచి  సమాజంలో కథ లు  చలామణి లో ఉన్నాయి  అనేదానికి రుజువులు కనబడుతున్నాయి . బి.సి. 320 కి చెందిన ‘’ఇద్దరు సోదరులు’’ అనే కథ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు మనకు లభ్యమైన కథ ల్లో అతి పురాతనమైనదని చెప్పాలి .బి. సి. ఆరో శతాబ్దంలో గ్రీకు రాష్ట్రంలో ప్రాచుర్యంలో వుండేవని నమ్మే ఈసోపు కథ లు ,బుద్ధుని పూర్వ జన్మల గురించని నమ్మే జాతక కథలు  [563—483 బి. సి .] ఏ. డి. 300 –500 కి మధ్య కాలంలో రచింపబడినవి అని అనుకుంటున్నపంచతంత్ర కథలు మొదలైనవాటిని  ఆధునిక కథ లుగా పరిగణించలేం .  కాని కధావిర్భావానికి అప్పుడే బీజం పడిందని చెప్పాలి. మనిషి మాట్లాడటం ప్రారంభించాక తన అనుభవాలను ఇతరులకు తెలియపరిచాలని అనుకున్న నిమిషమే కథావిర్భావ  ముహూర్తం. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి తాలూకు జీవితానుభవాలనూ ఆలోచనలనూ ఇతరులకు చెప్పాలనే తపన నుంచే కథ పుట్టుకొస్తుంది. ఎదురుగా  ఉన్నవాడికి మౌక్తికంగా చెప్పవచ్చు –కాని లేనివాడికి అక్షర బద్దం చేసి చెప్పాలి . అందువల్ల కథ అనేది రచయిత తన జీవితానుభవాలగురించి  తన ఎదుట లేని పాఠకుడి తో జరిపే సంభాషణ కథ అని  కూడా భావించవచ్చు—కాని ఏకపక్షీయమైన సంభాషణ.

ప్రాంతీయ భారతీయ భాషల్లో నేడు మనం కథ అని కాని కధానిక అని కాని వ్యవహరించే సాహిత్య ప్రక్రియ ప్రారంభమైనది 19 వ శతాబ్దపు చివరి దశలో కాని,  ఇరవయో శతాబ్దపు ప్రారంభం లో  కాని మాత్రమే అనేది వివాదరహితమైన వాస్తవం. దక్షిణాది భాషల విషయంలో కూడా ఇది నిజమే. మలయాళ భాషలో సాహిత్య విమర్శకి సాహిత్య పత్రికకి పునాది వేసిన.సి. పి. అచ్యుత  మీనోన్ [1863 –1933] సారధ్యంలో వెలుబడిన విద్యావినోదిని అనే మాస పత్రికలో1891 లో  వెలుబడిన ‘’వాసనా వికృతి’’ అనే కధ మలయాళ భాషలో వెలువడిన తొలి కథ. ఈ కథ వ్రాసినవారు వెంగయిల్ కుంజీరామన్ నాయర్.[1869 –1914]. ఈ కథ వారసత్వం అనే పేరుతో  తెలుగులో  అనువదింపబడింది . కధాకేరళం అనే సంకలనంలో ఈ కధ లభ్యం [అనువాదకుడు –ఎల్. ఆర్. స్వామి]. ఇది ఒక దొంగ కథ. వారసత్వంగా దొంగతనం చేయటం అలవరిచుకున్న ఒకడు , రాజ్యంలో పోలీసు వ్యవస్ద ఏర్పడటంవల్ల ఊరిలో ఉండలేక మదిరాసుకి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు తను దొంగలించిన నగల పెట్టె తన ప్రేయసికి ఇచ్చి వెళ్తాడు. అందులోని ఒక ఉంగరం  ఆమె అతని  తొడుగుతుంది. మదరాసులో  దొంగతనాలు చేయకుండా మంచిగా బ్రతగాలని అనుకుంటాడు . కాని అందగత్తే అయిన  ఒక వేశ్యను అలా చూస్తూ నిలబడినప్పుడు ఆ ఉంగరం  ఎవరో కొట్టేస్తారు.పోలీసుకి ఫిర్యాదు చేస్తాడు . అందువల్ల పోలీసు అతన్ని పట్టుకుంటారు . ఆరు నెలల శిక్ష అనుభవించిన తరువాత జైల్ బయటికి వచ్చిన అతడు చెప్పుకున్నదే ఈ కథ .

రెండో కథ ‘’చెడుఅదృష్టం ‘’కూడా ఇతడు వ్రాసినదే. తిండికి కూడా లేని ఒక యువకుడు ధన వంతుడుగా మారిన జీవిత యాత్రని చిత్రీకరిస్తోంది ఈ కథ. మాతృసామ్య వ్యవస్ధలో వున్న అలనాటి ఉమ్మిడి కుటుంబాల సజీవ చిత్రీకరణ ఈ కథ. ‘’సెంట్రల్ జైల్ తప్ప గొడవలు లేని ఉమ్మిడి కుటుంబాలు వేరే ఎక్కడా  లేవు ‘’మొదలైన అలనాటి సామాజిక జీవనానికి అద్దం పట్టేఎన్నో మాటలు కథ ప్రారంభంనుంచి కనబడుతాయి.ఈ రెండు కథ లూ చాలా చిన్నవే. సుమారు అయిదు పేజీలు వుండవచ్చు. నాటకీయమైన ఎత్తుగడతో కూడిన కథ లు ఇవి. రెండు కథలూ బ్రతుకులోని చీకటి కోణాలను చూపిస్తున్నాయి. మొదటి కథ లో కథానాయకుడు స్వయంగా తన కథ చెబుతునాడు –రెండో కథ లో రచయిత కథ చెపుతాడు . రెండో కథ లో రచయిత ప్రత్యక్షంగా సమాజాన్ని విమర్శిస్తూన్నాడు. రెండు కథ ల్లోనూ సామాజిక నేపధ్యం ప్రస్ఫుటంగా కనబడుతుంది .పాఠకుకులను కూర్చోపెట్టి చదివించేవే ఈ రెండు కథలూ.

A house hotel boat on the backwaters in Kerala

మలయాళ కథ సాహిత్యంలోని ఈ తొలి దశ 1925 వరకు సాగింది. ఈ దశలో  కథ రచన  చేసినవాళ్ళలో ముఖ్యలు ఏడుగురు. మొదటి కథ బయిటికి వచ్చాక రెండు కథలు వ్రాసారు ఒడువిల్ కుంజీకృష్ణ మీనోన్ [1869—1916] .చాలా నిడివిగల కథ లు వ్రాసాడు ఇతడు –సంభాషణల నిడివి కూడా ఎక్కువే ఉంటాయి . వర్ణనలు కూడా ఎక్కువే ఇతని కధల్లో.కాని ఒక కథ లో నాయిక మనో సంఘర్షణను అత్యద్భుతంగా వర్ణించాడు అతడు. ఇతని మొదటి కధ 1902 లో అచ్చైంది. మదిరాసు మైసూర్ పట్నాల నేపధ్యంలో కధలు వ్రాసాడు ఇతడు.

అంబాడి నారాయణ పొడువాల్ [1871—1936] వ్రాసిన రెండు కధల్లో జీవితావగాహన ,హాస్యం ,వ్యంగధోరణి మొదలగు అంశాలు కనబడుతాయి. వర్ణనలతో కూడిన ఇతని కధల్లో తుది మలుపు గోచరిస్తుంది.

సి. ఎస్. గోపాల పణిక్కర్ [1872—1930]హాస్య రసాత్మకమైన కధలు వ్రాసారు. మూర్కొత్తు కుమారన్[1874—1941] వ్రాసిన రెండు కధలూ చిన్నవే . ఆధునిక మలయాళ కధల స్వభావం ప్రస్ఫుటంగా కనబడేది కే. సుకుమారన్[1876—1956] అనే రచయిత రచనలలోనే. ఇరవై ముప్పై పేజీల కధలు అతనివి.అయినా ఆసక్తిగా చదివించేవి అవి. దానికి కారణం కధలో కనబడే తుది మలుపే. పరోక్షం గా సామాజిక స్దితిగతులను విమర్శించాయి ఈ కధలు. ‘’పరాయివాడి బిడ్డ ‘’అనే కధ అయితే నేటి అంకురం సినిమాలంటిదే . ఈ కధలో రెల్వే స్టేషనుకి వెళ్ళిన ఒక యువకుడికి ఒక యువతి ఒక చిన్న పిల్లని ఇచ్చి కాస్త చూసుకో అని చెప్పి మాయమవటం అతడు ఆ పిల్లను ఇంటికి తీసుకురావటం భార్య అతన్ని అనుమానించటం అలా అలా సాగుతుంది కధ.మానవ స్వభావాన్నిఅతి వాస్తవికంగా చిత్రీకరించటమే కాక స్త్రీ హృదయానికి అద్దం పడుతుంది ఈ కధ. నేడూ ఇలాంటివి జరగవచ్చు అనిపిస్తుంది మనకు ఈ రోజు కూడా ,ఆ కధలు చదువుతే . కిట్టుణ్ణి నాయర్ 1882—1959] రసిక రంజిని అనే మాసపత్రిక కోసం వ్రాసిన ‘’అప్పున్ని మూప్పీల్ నాయర్ అనే కధ అలనాటి ఉమ్మిడి కుటుంబాల్లో నెలకొన్న పగ కక్ష తీర్చుకోవటం మొదలగు అంశాలను అతి తక్కువ నిడివిలో చిత్రీకరించిన కధ. తొలి నాటికధా రచయితల్లో ప్రస్తావించవలసిన మరో పేరు ఎం. ఆర్. కే. సి. [1881 –1939 ]

తొలి దశలో వచ్చిన కధల్లో ఎక్కువ కధలు విద్యావినోదిని అనే పత్రికలోనే వెలుబడ్డాయి. సామాజిక దృక్పదం కలిగిన కధలతో పాటు హాస్య వ్యంగ్య రచనలు కూడా కనబడుతాయి. తొలి నాటి కధలను ఆధునిక మలయాళ కధలతో కలిపే శృంఖలాలుగా నిలిచిన వారు ఇ. వి. కృష్ణ పిళ్ళ [1894 –1938],వి. టి. భట్టతిరిపాడ్ [1896—1982]భవత్రాధాన్ నంబూతిరిపాడ్[1902 –1944]. ఇ. వి. కృష్ణ పిళ్ళ గారి కధలు కేళీ సౌదమ్ అనే పేరుతో నాల్గు సంపుటాలుగా ప్రచురిపబడ్డాయి. కధ చెబుతూనే అప్పుడప్పుడు పాఠకులతో  స్వయంగా సంభాషించే శైలి ఇతనిది. అంతే కాక శైలి ప్రౌడ గంభీరం కూడా. వర్ణనలప్పుడు అలంకారాలతో కూడిన సాహిత్య భాష వాడినప్పట్టికి సంభాషణ లో వాడుక భాషే వాడాడు ఇతడు. మానసిక సంఘర్షణలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తాడు ఇతడు.

నంబూద్రి కుటుంబాల్లోని స్త్రీల దురవస్థలే వి. టి. భట్టతిరి పాడే, కీ భవత్రాధాన్ నంబుద్రి కీ  కధా వస్తువులు. అంత: పురంలో మగ్గిపోయే  నంబూద్రి స్త్రీల విషాదాన్ని కళాత్మకంగా చిన్న చిన్న  మాటలతో చిత్రీకరించారు వి. టి. స్వభావికత ఉట్టిపడే సంభాషణ రచన భవత్రాధాన్ నంబూద్రి ప్రత్యేకత. . అతని కధల్లో కధ చెప్పేది రచయితే. సంభాషణలు ద్వారా , కధా పాత్రల ఆలోచనలు ద్వారా పాత్రల మనసు బహిర్గతం  చేస్తాడు అతడు.

పలుగురు ప్రముఖ కధా రచయితలు రచన చేసిన 1925 నుంచి 1960 వరకు మలయాళ కధల రెండో దశగా పెరుకోవచ్చు. జాతీయంగానూ అంతర్జాతీయంగానూ పేరు ప్రఖ్యాతులు గడించిన రచయితులు  రచన చేసారు ఈ కాలంలో. కారుర్ నీలకండ పిళ్ళ [1898—1975], పి. కేశవ దేవ్[1904—1983], లలితాంబిక అంతర్జనం [1909—1987 ],వైకం మహమ్మద్ బషీర్[1910—1994], పోంకున్నాం వర్కి[1910—2004], తకళి  శివశంకర పిళ్ళ,[1912—1999 ], ఎస్. కె. పొట్టేకాడ్[1913 –1982], పి. సి. కుట్టికృష్ణన్[ఊరూబ్ –1915 –1979]పులిమాన పరమేశ్వరన్ పిళ్ళ[1916—1947],నాగవళ్లి ఆర్. ఎస్. కురుప్ [1917—2003], ముట్టత్తు వర్కి[1917 –1989],వెట్టూర్ రామన్ నాయర్,కే.సరస్వతి అమ్మ[1919—1975], టి. కె. సి.వడుతల[1921—1988] మొదలైనవారు ఈ కాలంలో రచన చేసినవాళ్ళల్లో ప్రఖ్యాతులు. ఎన్. పి. చెల్లప్పన్ నాయర్ [1903—1972], ఈ. ఎం. కోవూర్ [1906—1983] ఎం. ఎన్,గోవింధన్ నాయర్[1910—1997] చెరుకాడ్[ 1914—1976] ,ఎం.గోవింధన్[1919 –1989]. ఐ.కె.కె. ఎం. మొదలగు కధా రచయితలు కూడా ఈ కాలంలో రచన చేసినవాళ్ళే.

ఈ కాలంలో ,అంటే 1925 నుంచి 1960 వరకు వున్న కాలంలో కేరళలో సజీవమైన ఒక సాంస్కృతిక వాతావరణం ఉంటేది. 1927లో సమస్త కేరళ సాహిత్య పరిషత్తు రూపు దిద్దుకుంది. పరిషత్తు వార్షిక సమావేశాలు సాహిత్య సంస్కృతిక రంగాల్లో ఒక కదలిక సృష్టించింది. 1937 మూడు ముఖ్య సంఘటనలకు సాక్షిగా నిలిచింది. అవి తిరువితాంకూరు మహా రాజు వారి [మొదటిలో నేటి కేరళ ,తిరువితాంకూరు ,కొచ్చి మలబార్ అని మూడు ప్రాంతాలుగా ఉండేవి ]క్షేత్ర ప్రవేశ ప్రకటన, తిరువితాంకూరు విశ్వ విద్యాలయ  స్థాపన ,సజీవ సాహిత్య సమితి స్థాపన మొదలైనవి ఆ మూడు. 7 సంవత్సరాలు తరువాత 1944లో ఆ సాహితి సంస్ద అభ్యుదయ సాహిత్య సమితిగా మారింది. రచయితుల మొదటి సహాయ సహకార సంఘం 1945లో స్థాపించబడింది. 1946లో కేరళ సంస్కృతిక చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిన గ్రంధాలయ సంస్ధ ఏర్పాటైంది .

భారతీయ రాజకీయాలను కూడా కుదిపి వేసే రోజులు అవి. 1920నుంచే రాజకీయ తలంలో గాంధీజీ సాన్నిధ్యం ప్రస్ఫుటంగా కనబడటం మొదలైంది. గాంధీజి సాన్నిధ్యం భారతీయ రాజకీయానికి కొత్త చూపు రూపు ఇచ్చింది. రౌలెట్ అక్టుని వ్యతిరేకించమని గాంధీజీ ఇచ్చిన పిలుపుని మన్నించి లక్షల కొద్ది జనం నిరసనగా రోడ్డెక్కారు  1919లో. అహింస ,సత్యాగ్రహం నిరాహార దీక్ష, సహాయ నిరాకరణ మొదలైన ఆశయాలు ప్రజల ఆలోచనల్లోకి పాకాయి. ఈ ఆలోచనల ప్రతిధ్వనులు తిరువితాంకూర్ ,కొచ్చి మలబార్[ అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సి లో ఒక భాగం ]ప్రాంతాల్లో కూడా వినబడ్డాయి. ఈ కాలంలో జాతీయం గానూ అంతర్జాతీయంగానూ నెలకొన్న వాతావరణం,  జరిగిన సంఘటనలు,  ప్రపంచ మహాయుద్ధం ,స్వాతంత్ర సమరం తద్ఫలితంగా ఏర్పడిన దేశ విభజన వగైరాలు రచయితలను ప్రభావితం చేసాయి. అంతే కాదు స్వాతంత్రానంతర కాలంలో సాయుధ విప్లవం ,ఆ తరువాత పొరపాటు గ్రహించి ప్రజాసామ్య మార్గం అవలంబించి కమ్మునిస్టు పార్టి అధికారం కైవసం చేసుకోవటం [1957 ,ఏప్రిల్ 5] .ఆ తరువాత ఒక అపూర్వ ప్రజా పోరాటం వల్ల [విమోచన సమరం]ప్రభుత్వాన్ని తొలగించడటం ఆ తరువాత ఎన్నికలో కమ్మునిస్టు పార్టి గెలవకపోవటం మొదలైన సంఘటనలు సామాజిక జీవితంలో కల్లోలాలు  సృష్టించాయి. ఈ సామాజిక సంఘటనల కుదుపు కొంత వరకు జీర్ణించుకున్న వారే ఆ కాలంలో రచన చేసిన కారూర్ ,కేశవ దేవ్ ,బషీర్ వర్కి, తకళి, మొదలైన రచయితలు.

కధా స్వభావాన్ని బట్టి పరిగణిస్తే ,కారుర్ లలితాంబిక ,బషీర్ ,ఊరూబ్ మొదలైనవారిని ఒక చోట కట్టవచ్చు. కేశవ దేవ్ వర్కి, తకళి –ముగ్గురూ ఒకే గూటికి చెందినవారు. పొట్టేక్కాడ్,స్వరస్వతి అమ్మ,వెట్టూర్ రామన్ నాయర్, నాగవల్లి,ముట్టత్తు వర్కి, టి. కె. సి. వడుతల  మొదలగువరు మరో రో కోవకి చెందినవారని చెబుతునారు సాహిత్య చరిత్రకారులు.

మలయాళ కధా సాహిత్యంలో ఎలా చూసిన అగ్రగణ్యుడు కారుర్. ప్రభుత్వ అధ్యాపకుడుగా  బ్రతుకు గడిపిన అతడు ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించలేదు . కాని సమకాలీన సమాజం తాలూకు గుండె సవ్వడి నిజాయితితో చిత్రీకరించాడు తన కధల్లో. అతనికి ఆంగ్ల పరిజ్ఞానం లేకపోవటం వల్ల ఆంగ్ల ప్రభావం అతని కధల్లో అసలు కనబడదు.ఇంచు మించి 500 కధలు రాశాడు ఇతడు. అతని మొదటి కధ 1932 లో అఛైన భర్తృవాత్సల్యం. ఇరవై సంపుటాలు వెలువరించారు  –ఇతని కధల్లోని పాత్రలు సగటు మనుషులే. మామూలు మనుషుల రోజువారీ జీవితంలోని చిన్న చిన్న సంఘటనలే కధలకు ఇతివృతం. అపూర్వమైన రచనాశిల్పమూ తొణికిసలాడే మానవీయత ఇతని కధల ప్రత్యేకతలు. అధ్యాపకుల జీవితం గురించి అతడు వ్రాసిన కధలు చాలా ప్రసిద్ధం. ఈ కధలు కొంత’’ ఐరనీ ’ కొంత అతిశయోక్తి మిళితం చేసి వ్రాసారు,కారూర్. తన కధలకు నాటకీయ ప్రారంభం ఇస్తాడు ఈ రచయిత. మధ్యాహ్న భోజనం అనే కధ దీనికి ఉదాహరణ [ఈ కధ తెలుగులో లభ్యం –కధా కేరళం సంకలనం అనువాదకుడు –ఎల్. ఆర్. స్వామి ] ఇరవై ఎనిమిది గంటలు ఏమి తినక ,తినడానికి లేక ,పని చేసి అలసిపోయిన అధ్యాపకుడు ఒకవిద్యార్ధి [అతడు రెండు మూడు గంటలక్రితం ఏదైనా తినివుండవచ్చు] తెచ్చుకున్న అన్నం పొట్లం విప్పి తింటాడు. అలనాటి బడిపంతుల హృదయ విదారక స్దితినికాక ,అలనాటి దుర్భిక్షం గురించి కూడా పాఠకులకు  తెలియచేస్తుంది ఈ కధ. అలనాటి ఆకలి వత్సరాలను  చిత్రీకరించే కధలు ఎన్నో వ్రాసారు కారూర్. అతడే ఎప్పుడూ కధ చెబుతాడు. సంభాషణలు అతని కధలకు ప్రాణం. సంఘటనలుద్వారా  కధా పాత్రల  ప్రత్యేకతల గురించి తెలియపరిస్తాడు. రచయితే మన పక్కన కూర్చుని మనకు కధ చెపుతున్నడనే అనుభూతి కలుగుతుంది అతని కధలు చదువుతువుంటే.

లలితాంబికా అంతర్జనం

లలితాంబిక అంతర్జనం :

సాహిత్య రంగంలో కవయిత్రిగా అడుగు పెట్టారు లలితాంబిక అంతర్జనం[1919—1987] .చెప్పదలచుకున్నది మొత్తం కవిత్వంలో చెప్పలేక పోవటం వల్లనే ఆమె కధలు వ్రాయటం ప్రారంభించారు.బాధలు భరించే ఆత్మల పట్ల తనకున్న సానుభూతియే తను రచన చేయడానికి  కారణం అని ఆమె ఒక సందర్భంలో ప్రస్తావించారు. నంబూద్రి సమాజంలోని దురాచారాలను తేట తెల్లం చేసారు ఆమె. ముఖ్యంగా నంబూద్రి యువతుల దురవస్థను చక్కగా చిత్రీకరించి సమాజానికి అవగాహన కల్పించారు. 1966 లో ఆమె ఇలా వ్రాసారు’’ఒక మారుమూల పల్లెలో కర్షక కుటుంబంలో పుట్టి పొలాల మధ్య జీడి మామిడి తోటల మధ్య ఎదిగిన నాకు కాళీ ,నీలి ,అలగన్ [దళిత వర్గానికి చెందినవారి పేరులు ] మొదలగువారు ఫాషన్ కోసం స్వీకరించిన పాత్రలు కావు. ఆ పల్లె ప్రకృతి తో పాటు నా ప్రకృతిలో ఒక భాగమై మారిన మంచి స్నేహితులు. అంతర్జనాల బ్రతుకుకన్నానేను  ముందు తెలుసుకున్నది వాళ్ళ బ్రతుకు గురించే ‘’. ఈమె వ్రాసిన మొదటి కధ [ముసుగులో]నంబుద్రి సమాజంలో నెలకొన్న బహు బార్యత్వం గురించి ,ఆ సమాజంలోని ఆడపిల్లలను ,అతి చిన్న వయసులోనే నాల్గో పెళ్ళిగానూ అయిదో పెళ్ళిగానూ ముసలివాళ్ళకిచ్చి చేయటం ,భర్త ఇంటిలో సవతులతో వంట ఇంటిలోనే మొగ్గే వాళ్ళ జీవితం వగైరాలు చిత్రీకరించారు. 1938లో ఈమె వ్రాసిన మనోవిశ్లేషణాత్మక కధ చాలా ప్రసిద్ధం. కధ పేరు ‘’ప్రతీకార దేవత’. ఈ కధ కేరళ లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇందులోని నాయిక నువ్వూ  ఒక లంజయేగా అనే మాట భరించలేక వెలయాలుగా మారుతుంది. కాని ఆమె మాటలు గమనార్హం ‘’జనం చూడనీ –మగాళ్ళే కాదు స్త్రీలు కూడా దిగ జారవచ్చని –న్యాయంగా ఆలోచిస్తే నంబూద్రి సమాజంలో వెలి వేయవలసినది మగాళ్లను కదా ‘’[ఒకొక్కరూ నాల్గైదు వివాహాలు చేసుకోవటమే కాక కొందరిని ఉంచుకునేవారు కూడా ]castme out if you will

ఈ కధ వ్రాసినప్పుడు రచయిత్రి వయసు ముప్పైకన్నా తక్కువే.

మాతృత్వపు మధిరిమ గురించి బాలల నినిష్కల్మషం  గురించి కూడా కధలు వ్రాసి వున్నారు ఈమె. రాజకీయ పరిణామాలు వల్ల భూసవరణ చట్టం వల్ల నిరుపేదలుగా మారిన  ఎందరో నంబుద్రి జమీందార్ల బ్రతుకులు కూడా ఈమె కు  కధా వస్తువే.  ‘ఒక మాటలో చెప్పాలంటే ఆమె బ్రతికిన నాటి సమాజపు [ముఖ్యంగా నంబుద్రి సమాజం ] గుండె సవ్వడి ఈమె కధల్లో వినబడుతుంది  .

Vaikom_Muhammad_Basheer

వైకోమ్ మహమ్మద్ బషీర్

వైకం మహమ్మద్ బషీర్ : మలయాళ సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం బషీర్ ది  . ఇతని కధలు ,నవలలు చాలా ఎక్కువగానే వివిధ భాషల్లోకి అనువాదం చేయబడింది కనుక ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యాభిమానులకు బషీర్ అపరిచితుడు కాదు. ఇతని కధలకు నిడివి ఎక్కువ. నవలైనా , నవలికలైనా  ,కధ లైనా  ఇంచు మించు ఒకే పరిమాణంలోనే ఉంటాయి. భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంచరించి జీవితం తాలూకు చీకటి కోణాలు స్వయంగా చూసి అనుభవించినవాడు బషీర్. కాని ఆశ్చర్యం ఏమిటంటే అతను వ్రాసిన కధలన్నీ తనకీ తన కుటుంబానికీ పరిచయమున్నవారిదే. అతని కధల్లో కనబడే  హాస్యం  అప్పుడప్పుడు సరిహద్దు దాటి పరిహసించటం వరకు చేరుతుంది. కాని ఆ హాస్యం  అతను తన మీద కూడా ప్రయోగించు కొంటూ  వుంటాడు. మానవీయత అతని ఏ కధలోనైనా  తేట తెల్లమవుతుంది. సునాయసంగానూ స్వాభావికంగానూ ప్రవహించే సుమధుర భాష అతని రచనల ఆస్తి. బషీర్ గారి ఏ ఒక కధ వివరించాలన్నా ,వ్యాసం నిడివి  దాటిపోతుంది కనుక ,బషీర్ రచనలన్ని [ఇంచుమించు ] తెలుగులో లభ్యంకనుక ఆ పని చేయటం లేదు. ముస్లిం జీవితవిధానాలు ఇతని కధల్లో ఎక్కువగా ప్రస్ఫుటమవుతాయి.

ఉరూబ్ [పి.సి. కుట్టి కృష్ణన్]కధను భావగీతానికి దగ్గరగా చేర్చిన రచయిత. మనిషిలో వున్న మంచితనం గురించిన అచంచల విశ్వాసం అతని కధల్లో కనబడుతుంది. ప్రతి మనిషి ఏదో రకంగా సుందరి లేకపోతే సుందరుడు అని నమ్మాడు అతడు. జీవితపు ప్రసాద మధుర భావాల్లో మునిగి తేలేది అతనిమనసు. అందహీనమని వ్యవహరించే వాటిలో కూడా అందం కనిపెట్టే ,దేనిని నిస్సారమని పరిగణించని దృకోణంఅతనిది. నిండు సానుభూతి ఈ దృకోణం కి కారణం. వేసిన వేషాల మీద కోపం తెచ్చుకోవటం అర్ధరహితమని అతని ఉద్దేశ్యం.ఇతని కధల్లో ప్రకృతి కధా నేపధ్యంగా కలిసిపోతువుంటుంది.

సామాజిక పరిణామాలను లక్ష్యంగా భావించి అవసరమైతే ఆ పరిణామాల గురించి కొంత చెప్పవచ్చు అనే అభిప్రాయం కలిగిన రచయితలు ,పి. కేశవ దేవ్,పొంకునం వర్కి,తకళి, మొదలైనవారు. కమ్మునిస్టు పార్టీకి ప్రచురణ కర్తగా ,కేరళలో సాంస్కృతిక ట్రేడ్యూనియునుల వేదికల పై మొదటిసారిగా తన గళం విప్పాడు కేశవదేవ్. కాని సోవియటు యూనియనులో కార్మిక సర్వాధిపత్యం స్టాలిన్ అనే ఒక వ్యక్తి స్వేచ్చాధిపత్యంగా మారటం గమనించి కమ్యునిజానికి  వీడ్కోలు పలికి కమ్మ్యూనిస్టు వ్యతిరేకుల వర్గంలో చేరారు. పొంకున్నం వర్కి వైతే తన వామపక్ష భావ జాలంతోనే కొనసాగాడు. కాని తకళి గురించి ఇవి రెండూ చెప్పలేము. వామపక్ష పద జాలం వైపు మొగ్గున్నవాడే తకళి. కాని వంద శాతం వామ పక్ష పదజాల వాది కాదుఅతడు. వామ పక్షాలను విమర్శించినప్పుడు కూడా వ్యతిరేకుల గుంపులో ఉంటేవాడు కాదు..ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా నిలిచాడు అతడు. కాని ఒకటుంది. ఈ ముగ్గురు రచయితలు సమాజంలోని అట్టడుగు వర్గాల జీవిత సమస్యలు గురించి  వాదించినవాళ్లే –వాళ్ళజీవితాలు మెరుగు పరచటం కోసం నిలబడినవాళ్ళే –ముగ్గురూ మంచి కధా రచయితులే కాక గొప్ప నవలా రచయితలు  కూడా.

పి. కేశవ దేవ్.;[1904—1983]

ఇతడు రచించిన ఎక్కువ కధలకు ఇతివృతం మధ్య తరగతి వాళ్ళ అట్టడుగు వర్గం వాళ్ళ జీవితమే. ఆకలి బాధల గురించి కాని దరిద్రం గురించికానీ బషీర్ కాని తకళి కాని ఇన్ని కధలు వ్రాయలేదు. జమీందారులకు  ,పెట్టుబడుల దారులకు వ్యతిరేకంగా పొర వదలి లేచే అట్టడుగు వర్గ పు పాత్రలు ఇతని కధల్లో కనబడుతాయి. అధికారుల ప్రభుత్వాధికారుల అణిచివేతకి గురై ప్రాణం కోల్పోయిన వారి చిత్రీకరణ కూడా ఉంటుంది. వీళ్ళ వ్యక్తి గత  బంధాల పట్లే రచయిత శ్రద్ధ .ఏ కధ నైనా  ఒకే ఒక ఆశయం కోసం వ్రాసాడు దేవ్ . కుల మతాలకు అతీతంగా ఆలోచించే పాత్రలు ఇతని  కధా పాత్రలు.సంఘటిత శ్రమ శక్తియొక్క ఎదుగుదల ,  రాజకీయ కక్ష సాధింపులు వగైరాలు చిత్రీకరించే కొన్ని కధలు కూడా వ్రాసి వున్నాడు కేశవ దేవ్. కుల మత సంఘటనలకు అతీతంగా వ్రాసిన రెండు కధలు ‘’నాయర్ –ఇళవ గొడవ మరియు ’గుస్తి ‘’చాలా చిన్న నిప్పు రవ్వలు పెద్ద మంటగా మారే విధానాన్ని చిత్రీకరిస్తున్నాయి ఈ కధలు.వ్యక్తి నుంచి ప్రారంభమయే పగ అగ్నిగా మారి సమాజాన్ని ఎలా మింగేస్తుందో చూపిస్తాడు దేవ్ ఈ కధలల్లో. రాజకీయంగా విభేదించేవాళ్ళు సొంత పార్టీ వాళ్ళైనా చంపే హత్యల రాజకీయానికి వ్యతిరేకంగా వ్రాసిన కధ ‘’చంపకు ,తమ్ముడు చంపకు ‘’. అతడు 1965లో [అప్పడు అతని వయసు అరవై ] వ్రాసిన  స్వర్గంలో ఒక సైతాన్ అనే మనోవిశ్లేషణాత్మక కధ కూడా చాలా ప్రసిద్ధం.

పోంకున్నాం వర్కి : పెట్టుబడిదార్ల వ్యవస్థ,జమీందారివ్యవస్థ , పౌరోహిత్యపు వ్యవస్థ [క్రిస్టియన్ సమాజంలో ]మొదలగు మూడు వ్యవస్థలను శక్తి వంతంగా ప్రతిగటిస్తూ రచన చేసాడు  పోంకున్నాం వర్కి. ఇతడు అభ్యుదయ రచయితుల మార్గం అనుసరించాడు. యేసు ప్రేమను మార్క్స్ మానవీయతను ఒకటిగా భావించాడు  . స్వభావికంగానే పెత్తందార్లను పౌరోహిత్యాన్ని పెట్టుబడిదార్లను ఘోరంగా విమర్శించాడు. అందువల్ల వాళ్ళందరూ అతనికి వ్యతిరేకులుగా మారారు. ఏం చెప్పాలి అనేది ఎలా చెప్పాలి అనేదానికన్నా ముఖ్యంగా భావించాడు అతడు. అతడు ఒక సారి అన్నాడు’’రోడ్డు మీద జరిగే దోపిడి గురించి వ్రాసినప్పుడు కొన్ని పరుష మాటలు పడివుండవచ్చు. ఎవ్వరినైనా ఆక్షేపించే బదులు బాగు చేయాలనేదే నా కోరిక. ‘’

‘’నా నిరసన ప్రకటించటం కోసమే నేను రచయితగా మారాను నిరసన తెలుపవలసిన విషయాలు ఉన్నాయి,నాకు “ . నిజమే, నిరసన అతని కధలకు ప్రాణం

Thakazhi_1

తగలి శివశంకర పిళ్ళై

తకళి శివశంకర పిళ్ళ : [1912 -1999]

జీవితసమస్యలు గురించి వ్రాసిన కధకుడే తకళి కూడా . కాని నిరసన ప్రదర్శించడంలోనూ సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించడంలోనూ వర్కి వెళ్ళినంత దూరం వెళ్ళడు తకళి . తన ఏ కధలోనైనా ఒక ప్రశ్న అంతర్లీనంగా ఉంటుందని తకళియే చెప్పారు ఒక సారి. మోపోసొ ,చెకోవ్ స్టీఫాన్ స్వైగ్ మొదలగు పాశ్చాత్య రచయితుల ప్రభావం తకళి లో వుందనేది నిజం. కాని ఈ ప్రభావం కధా కదన రీతికి మాత్రమే పరిమితం.అతనికి తనదైన జీవిత దృకోణం ఉంది. మానవ సంబంధాల్లోని దైన్యానికి కారణం దారిద్రమే అని అతని నమ్మకం. వరద అనే కధ చాలా ప్రసిద్ధమైనది [తెలుగులో లభ్యం ] మానవ మనస్తత్వాన్ని విశ్లేషించిన మరో మంచి కధ ‘’మిలిటరివాడు’’ తకళి రచించిన ఎక్కువ కధలకు కుట్టనాడు నేపధ్యం [కుట్టనాడు –వరి సుభిక్షంగా పండే భూమి గల ఒక చిన్న ప్రాంతం.] తగళి పేరు వినగానే ఎవ్వరికైనా వెంటనే గుర్తు వచ్చేది అతని నవలలే.  కాని తకళి గొప్ప కధా రచయిత కూడా .

ఈ కాలంలోనే తమదైన ప్రత్యేక రచనా వ్యక్తిత్వంతో సాహిత్యానికి సేవ చేసిన మరి కొందరు కూడా వున్నారు. వాళ్ళలో ముఖ్యడు ఎస్. కె. పొట్టేకాడ్. [1913—1982]. తకళిలా కాని ,దేవ్ లా కాని నిరసనతో మండిపడి  అరవలేదు ఇతడు . ఇతరులుకు కోపం వచ్చే చోట అతనికి కొంత తమాషా అనిపించేది. భారత దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కూడా పలు చోట్ల సంచారిలా తిరిగిన ఇతడు ప్రకృతి వైవిధ్యాన్ని ,మానవ జీవిత వైవిధ్యాన్ని దర్శించిన రచయిత. అందువల్లనే ఇతని కధలో కనబడెంత వైవిధ్యం గల కధాపాత్రలు ,కధా నేపధ్యం ఇతర కధా రచయితుల రచనల్లో కనబడవు. కధా నిర్మాణంలో దేవ్ కన్నా తకళి కన్నా ఎక్కువ శ్రద్ధ తీసుకొనేవారు .  అద్భుతమైన కొస మెరుపు ఉంటుంది కధల్లో. చాలా నిడివిగల కధలు ఇతనివి .రెండు మూడు దశాబ్దాల్లో నడిచే కధని కూడా కధగా వ్రాసారు ఇతడు . పుళిమాన అనే అతడు వ్రాసిన కధలు కవి వ్రాసిన కధలు. ఒక భావ గీతంలా ఉంటాయి అతని కధలు.  కధా వస్తువు అతి తక్కువే ఉంటుంది ఇతని కధల్లో. అతి చిన్న వయసులో చనిపోయిన ఈ కధా రచయిత [1916—1947]ఆ తరం రచయితుల ముందు ఉంటేవాడు.

నాగవళ్లి [1917—2003] నవలలూ కధలూ రచించారు. సామాజిక విమర్శ అతని రచనల్లోని అంతరార్థం . మనకు రోజు ఎదురయే జీవిత సంఘటనలకు హాస్యం జోడించి జీవితముయొక్క ఐరనీ   బోధపడే విధంగా వ్రాస్తాడు నాగవళ్లి. అతని ఒక పాత్ర ఇలా అడుగుతుంది ‘’నాకు అర్ధం కావటం లేదు. శాశ్వతమైన దివ్య ప్రేమకి నశ్వరమైన శరీరమూ లౌకికమైన వివాహమూ ఎందుకు ? ’’నిరుపేద కుటుంబాల్లోని [ఏ కులానికి చెందినదైనా ]సంఘటనలను ఆధారం చేసుకొని రచన చేసిన కధకుడు వెట్టూర్. కాని అట్టడుగు వర్గంవారి కధలు హాస్య రసంతో మిళితం చేసి వ్రాసిన రచయిత టి. కే. సి.వడుతల. [1921-1988 ]. పులయ [మాల ]సమాజానికి చెందిన వారి స్వప్నాలు ,స్వప్న భంగాలు,పులకింతలు ,ధర్మ సంకటాలు ఇతని కధల్లో నిండా కనబడుతాయి .  కుట్టనాటి మాలను  ఆవిష్కరించిన తకళి  కాని , మాల సమాజానికి చెందినవారిని రైతు కూలీల నాయకులుగా ఆవిష్కరించిన తోప్పీల్ భాసి కాని [ప్రముఖ నాటక రచయిత –తులాభారం తెలుగులో మనుషులు మారాలి ,రచయిత ] చిత్రీకరించిన దానికన్నావాళ్ళ జీవిత సమస్యలూ సంకీర్ణతలూ చిత్రీకరించ గలిగాడు ఈ రచయిత . క్రైస్తవులుగా మతం మార్చుకున్న మాలల ధర్మ సంకటాలను వివరించి ఇతడు వ్రాసిన కధ చాలా ప్రసిద్ధం .

హాస్య కధలు :

తమ హాస్య కధలతో మలయాళ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కధకుల ఆవిర్భావం కూడా ఇంచుమించి ఈ కాలంలోనే. ఎన్. పి. చెల్లప్పన్ నాయర్ [1903 –  1973],ఎం.న్.గోవిందన్నాయర్[19101997],ఆనందకుట్టన్[1920 –2000]మొదలైనవారు ముఖ్యలు. ఈ రచయితల్లో జీవితపు సంక్లిష్ట కోణాలకు హాస్యం మిళితం చేసి శక్తి వంతంగా రచన చేసిన వారు చెల్లప్పన్ నాయర్. అతి తక్కువ రచనలే చేశాడు ఇతడు. సహృదయుడైన ఒక మాన్యుడు జీవితంలోఇంకివున్న హాస్యం దర్శించి మనకు చెబుతునట్లు ఉంటాయి ఇతని కధలు. ఆనందకుట్టన్ రచించిన కధలు పూర్తి గ్రామ్య భాషలో ఉంటాయి. అతని హాస్యం వెనక సామాజిక విమర్శ దాగివుంటుంది. పి. కె.రాజ రాజ వర్మ 1907 –1987 ]వేళూర్ కృష్ణన్ కుట్టి కూడా [1927—2003]ఈ కోవకి చెందిన రచయితులే. దేవ్ ,తకళి కాలఘట్టానికి ఆధునిక మలయాళ కధకు పునాది వేసిన ఎన్. పి. మహమ్మద్,టి. పద్మనాభన్, మాధవికుట్టి [కమలాదాస్ ]ఎం. టి. మొదలగు కధకులకు మధ్య ఒక లింకు లా వర్తించే గొప్ప కధకులు కోవిలన్ [1923]జి.వివేకానందన్ [1923-1999],పొంజీకర రాఫీ [1924 -1993 ]పారపురత్ [1924-1981]నందనార్ [1926-1974 ]కే. టి. మహమ్మద్ 1929—2008 ]  పట్టత్తు విల కరుణాకరన్ [1926 -1985 ]మొదలైనవారు .

నందనార్ ,కోవిలన్, పారపురత్ ,–ఈ ముగ్గురికి మిలిటరీ కధల రచయితలుగా కూడా గొప్ప కీర్తి లభించింది మిలిటరీ జీవితానికి సంబంధించిన కధలు ఎన్నో రచించి ప్రజలకు జవానుల జెవితం గురించి వాళ్ళ కుటుంబ జీవిత సమస్యల  గురించి మంచి అవగాహన కల్పించారు వీళ్ళు . కధకుడుకన్నా గొప్ప నాటక రచయితగా ప్రసిద్ధుడు కే.టి.మహమ్మద్.

రాజకీయ విషయాలు ఇతివృత్తంగా స్వీకరించి మంచి కధలు రచించిన కధకుడు పట్టత్తు విల కరుణాకరన్. వామ పక్ష భావ జాలాన్నే కాదు అన్ని రాజకీయ భావ జాలాన్ని ప్రశ్నించే ధోరణి అతని కధల్లో కనబడుతుంది . రచనా పరమైన సాహసాలు చేయటంలో ముందు ఉండేవాడు అతడు .

( వచ్చే వారం ఆధునిక మళయాళ కథ )

LR-SWamy-240x300— ఎల్. ఆర్. స్వామి

Download PDF

2 Comments

  • Vimala says:

    స్వామిగారు
    మీరు రాసిన పరిచయం బాగుంది. ఇతర భాషా సాహిత్యం గురించిన పరిచయాలు తెలుగులోకి రావాల్సిన అవసరం చాలా ఉంది . ఇలాంటి ప్రయత్నం ప్రారంబించిన మీకు , సారంగ కి అభినందనలు

    విమల

  • Aruna Pappu says:

    నమస్కారం స్వామిగారూ,
    మలయాళ కథా సాహిత్యాన్ని స్థూలంగా పరిచయం చెయ్యడం బాగుంది. అభినందనలు. వీలైతే అక్కడ ప్రసిద్ధి పొందిన నవలలను నెలకొకటి చొప్పున పరిచయం చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి.
    అభినందనలతో
    అరుణ పప్పు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)