రండి బాబూ రండి!
[మోసం లేదు, మాయా లేదు!
ద్రోహం లేదు, దగా లేదు!
రండి బాబూ రండి!
రండీ, కొనండీ, చదవండీ, ఆనందించండీ, ఆలోచించండీ, ఆశీర్వదించండి….
ఆంధ్రుల అభిమాన యువ రచయిత అరిపిరాల సత్యప్రసాద్ రాసిన “ఊహాచిత్రం”
కథాసంకలనం! నేడే మీ కాపీ రిజర్వ్ చేసుకోండి ! ఆలసించిన ఆశాభంగం-
త్వరపడితే తపోభంగం!]
* * *
అఫ్సర్ గారినుంచి వినతి లాంటి ఆజ్ఞ రావడంతో మొహమాటానికి పోయానుగాని, పుస్తకాన్ని సమీక్షించడం అంటే తల మాసినవాడు తలకి పోసుకోవడం లాంటిదని కాసేపటికి యిట్టే తెలిసిపోయింది!
ఈ మాట ఎందుకంటే అరిపిరాల సత్యప్రసాద్ రాసిన “ఊహాచిత్రం” పుస్తకం లోని 18 కథలు వెంట వెంటనే చదివేసి వాటి సమాచారాన్ని అరల్లో భద్రపరచే మెకానిజం, మెమరీ పవరూ నాకుందని నేననుకోను. అయితే కొన్నిసార్లు సన్యాసికైనా విన్యాసాలు తప్పవుకదా!:-)
కథలు రాయడం అనే ప్రక్రియని సత్యప్రసాద్ ఒక యోగవిద్యలాగానో, యుద్దవిద్యలాగానో భావించి తగినంత స్వయంశిక్షణతో రాశాడనేది అర్ధమయ్యాక తనమీద గౌరవం మరింత పెరిగింది. తెలుగు సినిమాల్లో పేదరికం కమ్ముకున్న హీరో రకరకాల వృత్తులు చేసినట్టుగా, తనకథలకి భిన్నమైన సబ్జెక్టులు యెన్నుకుని తననితను బాగా కష్టపెట్టుకున్నాడు రచయిత.
ఈ సంకలనం లోని కథల్లో మొదటి కథ “స్వప్నశేషం”, చివరికథ “భూదేవతమ్మ” నాకు బాగా నచ్చాయి. స్వప్నశేషం కథలో ఒక చోట అన్నట్టు, “ఫైన్ ఆర్ట్స్ మర్చిపోయి ఎకనామిక్స్ మాత్రమే బోధించే జీవితపు విశ్వవిద్యాలయంలో భావుకత్వం ఇక భ్రమ”– అన్నప్రకారం ప్రతి తల్లీ, తండ్రీ, స్కూలు కలిసి భావి తరాలను యంత్రాలుగా మార్చే దశలో మనమందరం జీవిస్తున్నాం. ఈ పరిస్తితులను వివరిస్తున్నట్టు పచ్చి రియాలిటీతో సాగే “ఓపన్ టైప్” అనే కథను రాశాడు రచయిత. దీనికి పుర్తి భిన్నంగా, యిదే రచయిత రాశాడంటే నమ్మలేని విధంగా “చినుకులా రాలి” అనే కథని కూడా రాశాడు. ప్రతి కధా దేనికదే ప్రత్యేకంగా అనిపించే 18 కథల్లో 3 కథలు పట్టించుకోదగినవి కాదనేది నా అభిప్రాయమైనా, మిగతా కథలన్నీ మటుకు మనకొక టూర్ ప్రోగ్రాం చేసొచ్చిన అనుభుతిని కలిగిస్తాయి.
ఈ సంకలనంలో భిన్న నేపథ్యాలున్న కథలవల్ల రచయితకొక తాత్వికత లేనట్లుగా పైకి కనిపిస్తుంది గానీ, అంతర్లీనంగా అలోచిస్తే ‘భౌతిక ప్రపంచం వేగంగా మారిపోతున్న వర్తమాన సమాజంలో మనుషుల మధ్య పెరుగుతున్న *దూరం* దాదాపు అన్ని కథల్లోనూ కనిపిస్తుంది. వీలైననంతవరకు ఈ దూరాన్ని దగ్గర చేసే ప్రయత్నంలోనే రచయిత ఈ కథలు రాశాడని చెప్పవచ్చు.
ఇందులోని కథల్లో రచయిత మార్క్సిజం, బుద్దిజం, అంబేద్కరిజం ఇంకా వివిధ అస్తిత్వవాదాలు వంటి సిద్దాంతాల జోలికి పోకపోవడం ఒక రిలీఫ్. వివిధ సిద్దాంతాలే వైరుధ్యాలతో సంఘర్షిస్తున్న వేళ – మానవ విలువలే తన దృక్పధంగా ఈ కథల ద్వారా రచయిత తనదైన స్పృహని ప్రకటించుకోవడం కూడా ఆహ్వానించ దగ్గ పరిణామం.
అయితే రచయిత చాలా కథల ముగింపు విషయంలో తగినంత శ్రద్ద తీసుకోలేదని మాత్రం నాకు అనిపించింది. ఇది రచనపై అశ్రద్ద అనేకన్నా మన అవగాహనపై అశ్రద్ద అనవచ్చేమో. పదిమందికి చేసే కూరలో ఒక ఇల్లాలు ఉప్పు అవసరానికన్నా తక్కువే వేసి గిన్నె దించుతుంది. ఈ తగ్గించి వేయడంలోని జాగ్రత్త గమనిస్తే, తదుపరి కథలు మనల్ని రచయితకి మరింత దగ్గర చేస్తాయి.
–దగ్గుమాటి పద్మాకర్
నొప్పింపక తా నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ
పై పైన సమీక్షించినట్లున్నారు.నిరాశ పరిచింది .’ఊహ చిత్రం ” తప్పక చదవాల్సిందే ! .