ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 9 వ భాగం

( గత వారం తరువాయి)

9

ఒక స్వరం కావాలిప్పుడు..ఒక గొంతు కావాలిప్పుడు. ఒక అంతర్ఘర్షణతో నిత్యం కుతకుత ఉడికిపోయే మనిషి తన అంతఃచేతనలో నుండి, తన ప్రజ్వలిత అంతర్లోకాల్లోనుండి భువి నుండి దివికి ఒక నభోపర్యంత కాంతిస్తంభమై ప్రకాశించగల వ్యక్తిత్వంతో భాసిల్లే ఒక ఆత్మధ్వని కావాలిప్పుడు.
కాలానికి ఒక ధర్మం ఉంది..ఒకే ఒక ధర్మం…దేన్నయినా సరే వృద్ధిపరచడం, క్షయింపజేయడం..యివి భౌతికంగా బయటికి కనిపించేవి.. చెట్టు చిగురించడం..మళ్ళీ ఆకులు రాలడం..కాలం గడుస్తున్నకొద్దీ ఏదైనా ఉదయించడం..ఒక నియమితకాలం గడవగానే అస్తమించడం..ఐతే అభౌతికంగా, అదృశ్యంగా నిరంతరం కాలం ప్రకృతి ధర్మాలకనుగుణంగా సకల చరాచర స్పష్టినంతా నియంత్రిస్తూ పోతూండడం..ఈ అతి ప్రధానమైన క్రియ అసలే కంటికి కనబడకుండా పూర్తి  ఒక అజ్ఞాత జీవచర్యగా కొనసాగుతూండడం..లేకుంటే..సరిగ్గా..కోడిగ్రుడ్డును పొదిగిన ఇరవై ఒకటవ రోజునే ఎందుకు కోడిపిల్ల  జీవాన్ని పోసుకుని కళ్ళుతెరుస్తుంది..ఇరవైయవ రోజో, ఇరవై రెండవ రోజో ఎందుకు ఈ జననం సంభవం కాదు. కాలం..కాలం.. విలువైన, శక్తివంతమైన, ఎవరికీ ఎప్పుడూ బోధపడని అతి విచిత్రమైన ఒక మితి..డైమెన్షన్‌..సర్వ సృష్టినీ శాసించే శక్తి.
రెండు కార్లు పోతున్నాయి..ఒక దానివెంట ఒకటి. ముందు రామం కారు. వెనుక క్యాథీ ఆడి కారు..బయట కుండపోతగా వర్షం. జర్మన్‌టౌన్‌ సెంటర్‌ బార్నెస్‌ అండ్‌ నోబుల్‌ నుండి ఓవల్‌నెస్ట్‌ సర్కిల్‌లో ఉన్న రామం ఇంటికి డ్రైవ్‌.. ఎదురుగా ఎర్రగా సిగ్నల్‌..
”ఆగుము..వేచి చూడుము..పొమ్ము”
‘దారి తెలుసుకుని..దారి స్పృహ కలిగి..నియమిత వేగంతో..ఆగి..చూచి..వేచి..సాగి..పొమ్ము..’
కావడి కొయ్యేనోయ్‌..కుండలు మన్నేనోయ్‌..కనుగొంటే సత్యమింతేనోయి,’
అసలీ కనుగొనడమేమిటి..జీవితాన్ని కనుగొనడం, దారిని కనుగొనడం, చీకటిని కనుగొనడం, వెలుగును కనుగొనడం.. చివరికి ఎవరివారు తనను తాను కనుగొనడం.. కనుగొనలేకపోవడం..కనుగొనలేక దుఃఖించడం.,
బుద్దుడు, అశోకుడు..సోక్రటీస్‌, ప్లేటో..పైథాగరస్‌..గెలీలియో..కోపర్నికస్‌..మహాత్మాగాంధీ..అందరూ ఎన్నోసార్లు.. ఎన్నో సందర్భాల్లో అరచి అరచి నినదించి అనేకానేక పరమసత్యాలను చెప్పినా..ఎవరూ వినకుండా..ఎవరిదారిన వాళ్ళు విముఖులై పారలౌకిక ప్రపంచం నిషాలో నిద్రిస్తున్నపుడు..మేల్కొలిపి..మేల్కొలిపి..అలసి.,
దుఃఖించడం..నిస్సహాయంగా, నిరామయంగా, అనివార్యమై దుఃఖించడం ఏమిటిది.. ?
మళ్ళీ మేనేజ్‌మెంట్‌ గురు స్టీపెన్‌ కోవె జ్ఞాపకమొచ్చాడు క్యాథీకి..అద్భుతమైన పుస్తకం ‘ఎనిమిదవ అలవాటు’ – ది ఎయిత్‌ హాబిట్‌..ఏమంటాడంటే..తనను తాను తెలుసుకోమంటాడు మనిషిని. ఐతే కోవె చెప్పిన కొత్త విషయాలేవీ కావివి.. అన్ని యిదివరకు తెలిసినవే..అన్నీ ఇదివరకు చెప్పబడ్డవే. అన్నీ జ్ఞానులైన మహానుభావులు ఇదివరకే గ్రంథస్థంచేసి ఒక ఆధ్యాత్మిక సంపదగా మనకందించి ఉంచినవే.
ఐతే.. పాతవాటినే..మళ్ళీ జ్ఞాపకంచేసి, మళ్ళీ తవ్వితీసి..మళ్ళీ వ్యాఖ్యానించి..మళ్ళీ మెరుగుపరిచి…రిటోల్డ్‌.. రీసర్చ్‌.. రీ కామెంట్‌..రి…రి….రీ పెయిర్‌.,
మనుషులందరూ దుఃఖిస్తున్నారు.. ఔనా, దుఃఖమునకు మూలం కోరిక..’ అనికదా బుద్ధుడు చెప్పింది..
ఇప్పుడు..ఎవరినడిగినా.,
‘నేను సంతోషంగాలేను..నాకు ఉద్యోగం లేదు.’
‘నాకు చాలినంత డబ్బులేదు’
‘నాకు అధికారం లేదు’
‘నేను చేస్తున్న వృత్తి నేను చేయదగిందికాదు. కాని విధిలేక చేస్తున్నాను.. షిట్‌’
‘నేను ఎంతో ప్రతిభావంతున్ని-కాని నన్నెవరూ గుర్తించట్లేదు’
‘అబ్బా నేను అలసిపోయాను-నా జీవితమంతా ధ్వంసమైపోయింది. ఇప్పుడెలా’
‘నాకవకాశాలు లేవు.. ఉంటే నా ప్రతాపం చూపించేవాణ్ణి’
‘నా భార్య నా మాట వినదు-నా ఇల్లొక నరకం’
‘నా పిల్లలు దరిద్రులు-ఎంతో కష్టపడి పెంచితే విశ్వాసఘాతకులై మిగిలారు’
‘అన్నీ ఒట్టి కలలే..అవి సాకారమయ్యే అవకాశాలే లేవు’
‘ఈ అవినీతికర భారతదేశంలో హాయిగా అందరూ చేతికందినంత మేరకు దోచుకుంటూ, తప్పించుకు తిరుగుతూ రాజాలా బ్రతుకుతున్నారు.. నేనేమిటి ఈ దరిద్రం’
అన్నీ ఇవే.. ఎక్కడ విన్నా యివే గొంతులు..యిటువంటివే అందరి అసంతృప్తి స్వరాలు.. యివే ఆరోపణలు.. యివే ఆత్మఘోషలు.
వీటన్నిటికీ మూలం..నొప్పి..పెయిన్‌..వేదన..అసంతృప్తత..ఫలితం అశాంతి..దుఃఖం
ఈ దుఃఖాన్ని అధిగమించి మనిషికి శాశ్వతమైన స్వాంతనను చేకూర్చగల శాంతికావాలి..ఎక్కడుందది..ఎలా దొరుకుతుందది.
అన్వేషణ..ఎడతెగని అన్వేషణ..నిరంతరాన్వేషణ.
కోవె అంటాడు ‘ఇప్పుడొక గొంతుకావాలి..మనిషి తనను..తన ఆత్మికమైన అంతరంగాన్ని, హృదయాన్ని తెలుసుకుని తననుతాను వ్యక్తీకరించుకోగలిగే ఒక స్వరం కావాలి..ది ఎయిత్‌ హాబిట్‌..తనను తాను నిరంతరం స్పృహలో ఉంచుకుంటూ, సచేతనంగా పదునుపెట్టుకుంటూ కొనసాగుతూనే..ఆత్మను ఒక స్వరంగా వ్యక్తీకరించుకోగల అద్భుతమైన అలవాటును మనిషి నేర్చుకోవాలి..ఒక తన స్వరాన్నే కాదు ఎదుటి మనిషి హృదయాన్ని కూడా స్వరంగా వినగల సహనంతో కూడిన సంస్కారంకావాలి.’
ఆకుపచ్చలైటు వెలుగుతూండగా..కార్లు దూసుకుపోతూ..క్యామ్‌ ఫ్రీ..రాయల్‌ క్రౌన్‌..మైల్‌స్టోన్‌ డ్రైవ్‌..
ఎదురుగా బ్రూక్‌ ఫీల్డ్‌..ఓవల్‌ నెస్ట్‌ సర్కిల్‌.,
పెద్ద.. విశాలమైన..అట్టహాసాలేవీ లేని ఒక ఇంటిముందు..గ్యారేజ్‌ ఎదుట రెండు కార్లు ఆగి.,
‘నిరాడంబరత అనేది మనిషి తనను తాను పరిత్యాగించుకోవడానికి మొదటి సాధనం క్యాథీ’ అని ఎన్నోసార్లు రామం చెప్పిన వాక్యం జ్ఞాపకమొచ్చిందామెకు.
క్రమక్రమంగా దేన్నైయితే మనిషి మక్కువపడి మోహంతో, ఒక అలవాటును స్వంతంచేసుకున్నాడో దాన్ని ఉద్దేశ్యపూర్వకంగా వదులుకోవడమే పరిత్యాగమైతే..దేన్నయినా పరిత్యాగించడం అంత సుళువైన విషయమేమి కాదు. సుఖాలు, ఆడంబరాలు, అలంకారాలు, ధన, కామ, జిహ్వసంబంధ సర్వకామనలన్నీ మనిషిపై రాక్షస సమూహంలా దాడిచేసి ఆవహించిన తర్వాత లొంగి వివశమైపోవడంతప్ప ఒక్కోదాన్ని త్యజించి బయటపడడం దుర్లభం.
రామం. దేనికీ ఆధీనుడైపోయినట్టుగానీ, వశుడై లొంగిపోయినట్టుగానీ, బానిసైపోయినట్టుగానీ ఏనాడూ కనిపించలేదు సరికదా.. అన్నింటికీ అతీతుడై స్థిరపడినట్టే అనిపిస్తుందెప్పటికప్పుడు.
కారు దిగి.. తలుపులు తెరిచి..లైట్లు వేసి..క్యాథీకోసం స్వింగు డోర్‌ను ఇంకా తెరిచి పట్టుకున్నాడు.
క్యాథీ ప్రక్కనున్న ఎగ్జిక్యూటివ్‌ బ్రీఫ్‌ను చటుక్కున తీసుకుని..క్షణకాలంలో ఒత్తుగా కురుస్తున్న వర్షపు చినుకుల్లోనుండి లోపలికొచ్చేసింది.
రామంది విశాలమైన యిల్లు..ఎంతో యిష్టపడి..తను చేసే ప్రతిపనికి ఉత్తేజాన్నందించే వాతావరణాన్ని సమకూర్చేటట్టుగాపెద్ద హాల్‌లోని ప్రతి వస్తువునూ అమర్చుకున్నాడు.
అంటాడు..”మనకు తెలియకుండానే మనం పనిచేస్తున్న ప్రాంత వాతావరణయొక్క ప్రభావం మన మీద చాలా గణనీయంగా ఉంటుంది క్యాథీ. మంచి సాధకుడెప్పుడూ తన పరిసరాల్ని తను చేయబోయే పనికి అనుగుణంగా రూపొందించుకోవాలి.” అని.
ఏదో చిత్రమైన మోహకమైన పరిమళం అనుభవంలోకొచ్చింది. అన్నింటికంటే శక్తివంతమైన నిశ్శబ్దం.. సన్నని వానచినుకుల చప్పుడు.. పల్చని లేత వెలుగు.. హాయిగా ఉంది.. అంతా.
తెగిపోయిన ఒక ఎగ్జిక్యూటివ్‌కు ఉండవలసిన ఎనిమిదవ అలవాటు ‘మనిషికి ఉండవలసిన స్వంతగొంతు’ గురించి మళ్ళీ జ్ఞాపకమొచ్చిందామెకు. నిజానికి ప్రతి మనిషియొక్క వేలిముద్ర, ప్రతి జీవియొక్క నాడీస్పందన తాలూకు తరంగం భిన్నభిన్నంగా ఉన్నట్లే ప్రతి మనిషి యొక్క స్వరం కూడా భిన్నంగా ఉంటుందనీ, ఏ ఇద్దరి స్వరాలూ ఒకేరకంగా ఉండవనీ, స్వరం ఎవరిదైనా వాని అనివార్యతతోకూడిన అవసరం, ప్రతిభ, కాంక్షాతీవ్రత మరియు ఆత్మలయొక్క సమీకృత సంకేతంగా వెలువడ్తుందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. స్వరం, స్వభావం, తీవ్రత, ప్రభావం సందర్భాన్నిబట్టి మారుతాయి కాని మూల లక్షణం మారదు. దాని మాడ్యులేషన్‌ మారదు.
చాలా ఉద్విగ్నంగా ఉంది క్యాథీకి.
రామం ఎదురుగా ఉన్న సింగిల్‌సీటర్‌ సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్న మరుక్షణమే చేతికిందున్న స్విచ్‌ను ఆన్‌ చేయడంవల్ల హాల్లో ఒకేసారి రెండుమూడు లైట్లు వెలిగాయి. వాతావరణం కూడా చిక్కని, తెల్లని పాలనురుగువంటి కాంతితోనిండి  జీవవంతమైంది.
సరిగ్గా అతనికి ఎదురుగా ఉన్న మరో విలువైన సింగిల్‌ సీటర్‌ సోఫాపై క్యాథీ కూర్చుని మోకాళ్ళపై తన బ్రీఫ్‌ను పెట్టుకుని తెరిచింది.
ఎంతో ప్రధానమైతే తప్పితే రామం ఎవరినీ యింటికి ఆహ్వానించడు. తనకు తెలిసి ఒకసారి లయన్‌బ్రిడ్జ్‌ సిఇఓ పీటర్స్‌ రాండ్‌, కాగ్నిజెంట్‌ విపి విలియం చుఫ్‌ను ఒక్కోసారి విడివిడిగా పిలిచాడు. అతి విలువైన వ్యక్తులు అతి ఖరీదైన కార్లలో తెగిన చుక్కల్లా అప్పుడప్పుడు రామం ఇంటికి వస్తూండడం, ఆ కాలనీ వాసులను ఆశ్చర్యపర్చడం క్యాథీకి తెలుసు.
”క్యాథీ.. ఈ వర్షంకురుస్తున్న రాత్రి నీకూ, నాకూ..మనిద్దరి భవిష్యత్తుకూ ఎంతో ప్రధానమైంది. చారిత్రాత్మకమైంది. నీకు ఇప్పటికే నేనిచ్చిన ఎజెండా ప్రకారం మనం చర్చించబోయే అంశాలు ఎంతో విలువైనవి. కీలకమైనవీ.. ఒక దేశానికి చెందిన కోట్ల ప్రజల జీవితాలను సమూలంగా ప్రభావితం చేసేవి. ఇప్పుడు నువ్వు జీవానివి.. ప్రాణానివి.. చేతనవు.. నడిపే మార్గదర్శివి..నేను శ్రోతను. శరీరాన్ని..ఆయుధాన్ని..కర్తను..నీవు పూర్ణ స్ఫూర్తివి..ఊఁ..కానీ..”అన్నాడు.
ఆ క్షణం రామం ముఖం అప్పుడే ఉదయిస్తున్న శిశుసూర్యునిలా ఉంది.
సరిగ్గా అప్పుడు ఎనమిది గంటల పన్నెండు నిముషాలైంది. ఒకగంట తమ సమాగమం. క్యాథీ ఒక ప్లాస్టిక్‌ ఫైల్‌ను బయటికితీసి మోకాళ్ళపై పెట్టుకుని..తెరిచి…కొన్ని కాగితాలను చదివేందుకు అనువుగా సర్దుకుని అంది…
అప్పుడు తెల్లని కాంతితో ఎదురుగా నిర్మలహృదయంవల్ల వెలిగిపోతున్న క్యాథీ ముఖాన్ని ఓ లిప్తకాలం చూచి.. రామం గంభీరంగా కనురెప్పలను మూసుకున్నాడు. ఆ క్షణం అతనిలో ఏదో వెలుగు పొటమరించి..మొలకై…విప్పారి.. విస్తరించి.,
యోగ సూత్రాలను ప్రవచించిన పతంజలి ఏమన్నాడంటే..’ఒక అసాధారణమై సాధించవలసిన లక్ష్యం గొప్ప బాధ్యతగా మనను ఉత్తేజపరుస్తున్నప్పుడు మనిషియొక్క సర్వచింతనలూ శకలాలు శకలాలుగా విడిపోయి హద్దులనధిగమించి మగ్నమైన మనసు సమస్తావధులను అతిక్రమిస్తుంది. అప్పుడు ఆత్మ బహుముఖమైన అన్ని దిశల్లో విస్తరించి ఒక కొత్త మహోన్నతమైన అద్భుతప్రపంచాన్ని కనుగొనేలా మనిషిని ఉద్యుక్తుణ్ణిచేస్తుంది. అని..ఇప్పుడు మనకు ఈ ప్రాణతుల్యమైన ప్రవచనమే మార్గదర్శి రామం’ అంది ఒక అశరీర వ్యవస్థ మాట్లాడ్తున్నట్టుగా.
రామం సమాధిలో ఉన్న వ్యక్తిలా ”అవును” అన్నాడు.
”ఇంకో ప్రధానమైన విషయాన్ని చెబుతాను రామం..మనలో కొద్దిమంది మాత్రమే గొప్ప పనులు చేయగలరు. కాని మనందరం గొప్పవికాని ఎన్నో మామూలు పనులను తప్పకుండా చేయగలం..గొప్ప ప్రేమతో..అంది మదర్‌ తెరేసా. ఇది మన భవిష్యత్‌ కార్యకలాపాలకు ప్రాతిపదిక..”
‘అవును..”
”నువ్వు అమెరికాకు టిసిఎస్‌ ఉద్యోగిగా వచ్చి ఈ నేలపై అడుగుపెట్టింది జూన్‌ ఇరవై ఆరు పందొమ్మిదివందల తొంభైఏడు. మొదట మేరీల్యాండ్‌ ఆఫీస్‌లో రిపోర్ట్‌చేసి కార్యకలాపాలను ప్రారంభించావు. నువ్వు అతిగోపనీయమైన కొన్ని నాసా ప్రొడక్ట్స్‌ను, అప్పుడే ఎస్‌ఎపీతో అద్భుతాలు ప్రదర్శిస్తూ వాల్‌మార్ట్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణను పర్యవేక్షిస్తూండేవాడివి. నాన్న..నేను అమెరికా వ్యాపారవ్యవస్థను శాసించే వాల్‌మార్ట్‌, కాట్స్‌కో, టార్గెట్‌, హోమ్‌ డిపోవంటి సంస్థలకు కొన్ని ఉత్పత్తులను సరఫరా చేసేవాళ్ళం..ఆ క్రమంలో మొట్టమొదటిసారిగా నాన్న జేమ్స్‌కోవె, నేను మీ రాక్‌విల్లే ఆఫీస్‌కువచ్చాం. అది అగస్ట్‌ ఇరవైరెండు..ఉదయం పదకొండుగంటల ఇరవై ఒక్క నిమిషం. ఆ క్షణమే నేను నిన్ను చూశాను. పలకరించాను. పరిచయం చేసుకున్నాను. భారతీయ ముహూర్తశాస్త్రం మీద విశ్వాసం గల వ్యక్తిగా ఆ మహత్తర క్షణాల్ని నాకు ప్రసాదించినందుకు కాలానికి నా ధన్యవాదాలు..”
”ఊఁ …”రామం మౌనంగా వింటున్నాడు కళ్ళుమూసుకునే.
”ఒక ఏడాది కాలంలో మనం పదకొండుసార్లు కలుసుకున్నాం. కలుసుకున్న ప్రతిసారీ మన మధ్య ఒక మౌన సంభాషణ జరిగేది. నాకైతే గత ఎన్నో జన్మల నుంచి మన మధ్య ఓ అపూర్వమైన, ఈ సైన్స్‌కు అందని అదృశ్య అజ్ఞాత బంధముందని అనిపించేది. మొట్టమొదటిసారి ఎంతో ధైర్యంచేసి, భయంభయంగా నిన్ను ఓ రోజు రాత్రి ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు డిన్నర్‌కు ఆహ్వానించాను. అది జూలై ఎనిమిదవ తేది. నేను తెలుగు నేర్చుకునేందుకు కొన్ని పుస్తకాలు కావాలని అడిగాను. నువ్వు నవ్వి తెలుగు నేర్చుకోవడం అంత అవసరమా అని అన్నావు..నేను ఔనన్నాను. ఆశ్చర్యంగా మూడురోజుల్లో ఇరవై ఎనిమిది తెలుగు పుస్తకాలను భారతదేశంనుండి తెప్పించి ఇచ్చావు. తద్వారా నా పట్ల నీకున్న శ్రద్ధ అర్థమైంది.”
వింటున్న రామం పెదవులపై చిరునవ్వు వెలిగి మాయమైంది.
”ఆగస్ట్‌ పన్నెండవతేది, తొంభై ఎనిమిదిన అనూహ్యంగా డాడీ హార్ట్‌ ఎటాక్‌తో కన్ను మూసారు. అది ఒక పెద్ద షాక్‌ నా జీవితంలో. అకస్మాత్తుగా ఈ ప్రపంచంలో ఒంటరినైపోయాను. నా ఇరవై ఎనిమిదేళ్ళ జీవితంలో ఒక తండ్రిగానే తెలిసిన వ్యక్తి ఓ స్నేహితునిగా, సహచరునిగా, శ్రేయోభిలాషిగా, ఆత్మీయునిగా అనేక రూపాల్లో ఎంత బలంగా నాలోనాన్న ముద్రించుకుపోయాడో అప్పుడు ఏర్పడ్డ శూన్యం తెలిపింది. యిక నేను శూన్యం గురించీ, శూన్యానికి ముందు శూన్యం, తర్వాతి శూన్యం గురించీ ఆలోచించడం మొదలుపెట్టాను. సున్నా ఒంటరిగా ఉన్నంతసేపు దాని విలువ సున్నాయే కాని దానికి అటో ఇటో ఒక ఒక్కటి చేరితే అది తప్పకుండా ఒక సంఖ్యయి కొత్త విలువను పొందుతుంది. అందుకే నా సంఖ్య ఒక అంకెగా చేరి నాకు విలువను సంపాదింపజేయగల వ్యక్తిగురించి అన్వేషించడం ప్రారంభించాను.”
”……”
”ఎందుకో భగవంతడు నిన్ను స్ఫురింపజేశాడు.. ఐ బిలీవ్‌ ఇన్‌ గాడ్‌. అనేక సిద్ధాంతాలు, వాదనలు ఘర్షణలతో వాదులాడుకునే అనేక ప్రపంచదేశాలు.. ఇండియాతో సహా ఎక్కడా భగవంతుడున్నాడని బహిరంగంగా.. రాజ్యాంగబద్దంగా ప్రకటించలేని వర్తమానంలో.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో, సైనిక మరియు యుద్ధ పాటవాల్లో అగ్రదేశమైన అమెరికా  మాత్రం రాజ్యాంగబద్ధంగా కరెన్సీపైనా, ప్రమాణ పత్రాల్లో సహా..ఇన్‌ గాడ్‌ వియ్‌ ట్రస్ట్‌’ అంటుంది. ఇది ఒకరకంగా మనిషి ఒట్టి నిమిత్తమాత్రుడనే పరమసత్యాన్ని అంగీకరించడమే..సరే..ఐతే, ఆ భగవంతుడే మనమధ్య ఓ వారధిగా ప్రవేశించి సంధానం చేశాడని నేను నమ్ముతాను మనస్పూర్తిగా..మూడు పెద్ద ఫ్యాక్టరీలు, విస్తృతమైన వ్యాపార సామ్రాజ్యం, దాదాపు పది బిలియన్‌ డాలర్ల అసెట్‌ వాల్యూ ఉన్న నేపథ్యం నాదప్పటికి. వాటి నిర్వహణ, రక్షణ, భవిష్యత్తు..ఇవన్నీ నన్ను ఎంతో కలవరపెట్టేవి. కొద్దికాలం..’కిం కర్తవ్యం’ అనే ఆత్మశోధనతో గడిపాను. పిచ్చిగా, నిరామయంగా..నిర్వ్యాపారంగా..దేశమంతా తిరిగాను. ఈ విశాల దేశంలో నాకు తెలిసిన ప్రశాంతతను కలిగించే ఎన్నో ప్రదేశాల్లో శాంతికోసం వెదికాను. ఫిలడల్ఫియా, న్యూయార్క్‌, టెక్సాస్‌, ఫ్లోరిడా.. కొలరాడో..ఒరెగాన్‌, ఫిట్స్‌బర్గ్‌.. ఇంగ్లాండ్‌, భారతదేశం, సింగపూర్‌..ఎన్నో ప్రాంతాలను సందర్శించాను. ఐతే.. మనిషి ఎప్పుడూ తన బయటఉన్న ప్రపంచంలో అన్వేషిస్తాడు తప్ప..తనలోనే నిక్షిప్తమైఉన్న అంతరిక ప్రపంచాన్ని గుర్తించడు.. ఈ క్రమంలో ఎన్నెన్నో ప్రసిద్ధ పుస్తకాలను అధ్యయనం చేశాను. ఉహు.. బయట ఏమీ లేదని అర్థమైంది. ఏదైనా ఉందంటే అది జీవిలోపలేఉందనీ, అంతిమంగా మనిషి తనకోసం కాకుండా తనులేని ఇతర ప్రపంచాన్ని ప్రేమించగలిగినప్పుడే బోధపడ్తుందనీ తెలిసింది. అందుకే…ఇఫ్‌ యు రిమెంబర్‌, మూడు నెలలు నీకు కనిపించకుండా అప్పుడు నేనుమరుగైపోయాను..అప్పుడు నీతో పాటు రాక్‌విల్లేకు దగ్గర్లోనే ఉన్న ఇన్‌ఫోసిస్‌లో పనిచేసే హెచ్బార్‌ మేనేజర్‌ లీల నీతో సన్నిహితంగా ఉండేది. లీల తెలివికి, చొరవకు, చొచ్చుకుపోయే తత్వానికీ నేను ఎంతో అశ్చర్యపోయేదాన్ని. తమ క్లెయింట్స్‌తో ఆమె ఇంటరాక్టయ్యే పద్ధతికూడా ఎంతో విలక్షణంగా, ప్రత్యేకంగా ఉండేది. సడెన్‌గా..ఒక ప్రత్యేకమైన సందర్భంలో వాల్‌మార్ట్‌ డీలింగులో ఏర్పడ్డ స్టాగ్నేషన్‌ వల్ల నీవద్దకు టిసిఎస్‌కు వచ్చాను. కాని నువ్వు లేవు. ఉద్యోగానికి రాజీనామా చేశావని చెప్పారు..ఇదంతా మననం చేసుకోవడం ఇప్పుడెందుకంటే..స్పష్టమైన భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటే స్పష్టంగా ఒకసారి గతంలోకి తొంగి చూచుకొమ్మని శాస్త్రం చెబుతోంది.”
”……..” రామం నిగ్రహంగా వింటున్నాడు కళ్ళుమూసుకునే.
”పోలీస్‌లా నా మనుషులతో నీ గురించి పూర్తి వాకబు చేయించి డెట్రాయిట్‌లో నిన్ను కలిశాను మళ్ళీ. అప్పుడు ఉద్యోగి స్థితినుండి ఒక ఎంటర్‌ప్రున్యూర్‌్‌గా ఎదుగుతున్నావు నువ్వు. రిస్క్‌ తీసుకోకుండా ఒక డిపెండెంట్‌గా పనిచేసి జీతం తీసుకుని ఆనందంగా వెళ్ళిపోయేవాడు ఉద్యోగి. ఒక నిర్దుష్ట లక్ష్యాన్ని చేరే క్రమంలో రిస్క్‌ను, చాలెంజ్‌స్‌ను స్వీకరిస్తూ అవరోధాలను ఎదుర్కుంటూ ముందుకు సాగేవాడు ఔత్సాహికుడు.. నీలో అప్పటికి పరిణతి చెందుతున్న ఎంటర్‌ప్రున్యుర్‌ కనిపించాడు నాకు. జ్ఞాపకముందా..ఆ రోజు మనం డెట్రాయిట్‌ మారియట్‌్‌ హోటల్‌లో కలిశాం.”
”ఊఁ …”
బయట వర్షం ఉధృతి పెరిగినట్లు కురుస్తున్న చినుకుల పెరిగే ధ్వని చెప్తోంది.

10
”అప్పటికి లీల అమెరికాలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకు వెళ్ళిపోయింది…ఆమె గురించి నువ్వు నాకు అప్పుడు చెప్పిన రెండు వాక్యాలు బాగా గుర్తున్నాయి. ఆమె…’ఈ అమెరికా ఉద్యోగం..ఈ చిన్నచిన్న లావాదేవీలు నాకు తృప్తి నివ్వడం లేదు రామం..తిమింగలం  మహాసముద్రంలో ఉండాలిగాని చెరువులోకాదు అని అన్నట్లు నువ్వు నాకు చెప్పావు. ఐతే తిమింగలానికి చెరువనేది ఒకటుంటుందనే విషయమే తెలియదనే విషయం ఆమెకు తెలియదని తెలిసి ఆమెపై నాకు జాలి కల్గింది. మనిషి తనను తాను అతిగా అంచనా వేసుకోవడం పతనానికి మొదటి థ.. సరే.. ఆ రాత్రి నిజానికి మనం.. కాదు నేను నిన్ను నీవేమిటో తెలుసుకున్నాను. నువ్వు నా ఊహకందని ఒక కొత్త నీ  మనోప్రపంచం గురించీ,  నీ  మూలాలు ఎక్కడైతే..ఆంధ్రదేశంలో ఉన్నాయో అక్కడి ప్రజల గురించిన తపనా..అక్కడి పతనమౌతున్న మానవతా నైతిక విలువల గురించీ, అరాచకంగా ప్రబలుతున్న విచ్చలవిడితనం గురించే, హింసాత్మక ఉద్యమాల గురించీ, జనంలో వెర్రి తలలు వేస్తూ విజృంభిస్తున్న దోపిడిగురించీ చర్చించావు. ఒక మానవ సమాజంలో తేవలసిన సామాజిక పెనుమార్పులను నీ వ్యూహాత్మక కార్యాచరణతో ఎలా సాధించాలనుకుంటున్నావో కూడా చెప్పావు.. అక్కడ పడింది బీజం..”
”ఊఁ..”
”సరే..అదలా పెడ్తే..ఒక రోజు మనం పిట్స్‌బర్గ్‌లో కావాలని ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని, గుళ్ళో ప్రత్యేక పూజలు జరిపించి..ఒక లగ్జరీ రిక్రియేషన్‌ వెహికిల్‌ను తీసుకుని రెండు రోజులు అవగాహన యాత్ర చేశాం..పిచ్చి పిచ్చిగా, స్వేచ్ఛగా అమెరికా అంతా తిరుగుతూ..నిజమైన నిన్ను నేను..అసలైన నన్ను నువ్వు స్పష్టంగా తెలుసుకున్నాం..జ్ఞాపకముందా ఆరోజు పెన్సెల్వేనియాలో వన్‌ ఫిప్టీ నైన్‌ ఎగ్జిట్‌ వద్ద ఉన్న రెస్ట్‌ ప్లాజా పార్కింగు ఏరియాలో..ఆ రాత్రి.. ఇదేవిధంగా ఒక భోరుమని వర్షం కురుస్తున్న రాత్రి..ఆర్‌విలో..బెడ్‌పై నువ్వు పడుకున్నావు..నేను ఎదురుగా కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని.. సమాధిలో ఉన్న మనిషిలా ధ్యానముద్రలో..అప్పుడు మన మధ్య ఒక గాఢ గంభీర నిశ్శబ్దం మాత్రమే ఉంది.. మనిషి అప్పుడప్పుడు ఏదో ఒక అంతర్‌కల్లోలంలో మునిగిఉన్నపుడు..శరీరం ఒట్టి నిమిత్తమై చుట్టూ ప్రపంచం ఒక హేతువుగా మిగిలి అంతా మిథ్యాగత వస్తువుగా గోచరిస్తుంది..ఆ స్థితిలో..నువ్వు అంతర్లోకాల్లోనుండి..మహాభాగవతంలోనుండి ఒక పద్యాన్ని స్వగతంలోలా చదివావు..అది ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు భగవంతుడెక్కడున్నాడని గుచ్చిగుచ్చి ప్రశ్నించినపుడు.. తండ్రిని పిచ్చివాడా..భగవంతుడు ఇక్కడ..ఇక్కడ..అని ఎక్కడ చూపించగలను..ఎక్కడ వెదికితే అక్కడ..ఎక్కడ దర్శించగలిగితే అక్కడే ఉన్నాడు..అని చెప్పిన అద్భుతమైన పద్యం..”కలడు అంభోధి, కలండు గాలి, కలడు ఆకాశంబునన్‌, కుంభినిన్‌ గలడు, అగ్నిన్‌ దిశలన్‌..”చదివావు. పోతన రాసిన ఆ ధారాపాతమూ, ఆపాత మధురమూ ఐన ఆ పద్యాన్ని ధ్యాన ముద్రలో ఉండి విన్న నేను..నువ్వు ఆ పద్యాన్ని చదవడం పూర్తి చేయగానే..ఒక పారవశ్యమాధుర్యంలో సమాధియై ఆ పద్యాన్ని ఉన్నదున్నట్టుగా మొదటి అక్షరంనుండి చివరదాకా గడగడా రాగయుక్తంగా చదివి వినిపించాను.
నువ్వు ఆశ్చర్యంతో కొయ్యబారిపోయావు..అసలేం జరిగిందో నీకర్థం కాలేదు..పోతన అసాధారణమైన, ప్రాణప్రదమైన పదాల కూర్పుతో రాసిన, పలకడానికే కష్టమైన ఆ పద్యాన్ని..అసలు తెలుగు భాషే రాని నేను ఒట్టిగా ఒక్కసారే విని ఉన్నదున్నట్లుగా పునరుత్పత్తి చేయడం నిన్ను అప్రతిభుణ్ణి చేసింది. అప్పుడు మొదటిసారిగా నాలో ఉన్న అసమాన జ్ఞాపక శక్తిగురించి తెలిసింది నీకు. నా మెదడు ఒక టేప్‌రికార్డర్‌ వంటిది..ఒకసారి దానికి ‘రికార్డ్‌’ కమాండ్‌ ఇస్తే అర్థం చేసుకోవడంతో నిమిత్తం లేకుండా మెదడులో అంతా ముద్రించబడ్తుంది. ఒక మిగిలింది రివైండ్‌ అండ్‌ ప్లే..మళ్ళీ చదువు క్యాథీ అని అడిగావు నువ్వు ఆ షాక్‌లోనుండి కోలుకుంటూ..నేను మారు మాట్లాడకుండా ఆ పద్యాన్ని మళ్ళీ మొదట్నుండి చివరిదాకా చదివి వినిపించాను. ఉక్కిరిబిక్కిరైన నువ్వు చటుక్కున నీ బెడ్‌పైనుండి లేచివచ్చి నన్ను గట్టిగా ఆలింగనం చేసుకుని పెదవులపై గట్టిగా ముద్దుపెట్టుకున్నావు. అది మన మధ్య మొదటి..పవిత్రమైన చుంబనం.” ఆగి..మాట తడబడి..గద్గదమైపోయి.. చలించిపోతూ,
అప్పటిదాకా కళ్ళుమూసుకుని వింటున్న రామం..ఆమె చెబ్తున్న దృశ్యాన్ని మననం చేసుకుని..ఆనాటి జ్ఞాపకంలో తడిచి.,
మధ్య ఒక మాటలులేని మౌనం పెల్లుబికింది.
”తెలుగు బాషపట్ల ఎందుకో నాకు వ్యామోహం కలిగింది. నాన్న పోయిన తర్వాత ఆ దుఃఖాన్ని మరిచిపోయేందుకో, నన్ను నేను సంభాళించుకునేందుకో, లేక నన్ను నేను మరిచిపోయేందుకోగాని నేను చేసిన అతి ప్రయోజనకరమైన పని తెలుగును సమగ్రంగా నేర్చుకోవడం, తెలుగు వారసత్వ సాహిత్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోవడం. ఆముక్తమాల్యద వంటి మహాకావ్యాన్ని స్వయంగా చదివి అర్థంచేసుకునే స్థితిని సాధించడం మామూలు విషయంకాదు. మనిషికి భగవంతుడు ప్రసాధించిన ప్రజ్ఞ ఒక వరమైతే దాన్ని ఎప్పటికప్పుడు పదునుపెట్టుకుంటూ నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవడం అదృష్టం. నేను అదృష్టవంతురాలిని. అందుకే ఎప్పుడూ సానుకూలధోరణే నన్ను నడిపిస్తూంటుంది. తెలుగు సాహిత్యంలో నన్ను వహ్వాయిది ఎంత అద్భుతం అని అనిపించిన వచనం మహాభాగవతంలో నరసింహావతార అవిర్భావ సందర్భంలో.. విష్ణుమూర్తి స్తంభాన్ని చీల్చుకుని వెలువడే మహాభీకర సందర్భాన్ని వర్ణించిన రెండున్నర పేజీల ఎవరైనా ఏకబిగిన చదువలేని వచనధార ఉంది.. అది ఒక అద్భుతం. దేశంలో ఏ ఒకటోరెండో శాతం అక్షరాస్యత ఉన్న కాలంలో పామరజనం కేవలం మౌఖికంగా విని అర్థంచేసుకుని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ధారణచేయగల అతిసాధారణ అలతి అలతి పదాలతో జీవితసత్యాలను సజీవ ఉపమానాలతో ఆటవెలదులుగా తెలుగుజాతికీ, ప్రపంచానికీ అందించిన ఏకైక తెలుగు మహాకవి యోగి వేమన. యిందరు మహానుభావులను కన్న పవిత్రనేలపై రామం అనబడే ఈ వ్యక్తి కూడా జన్మించడం ఎంత అదృష్టమో అని పరవశించిపోతాన్నేను.. రామం నువ్వు నా దృష్టిలో కారణజన్ముడవు..నువ్వు మాత్రమే నిర్వర్తించవలసిన కొన్ని ఘనకార్యాలు నీకోసం వేచి ఎదురుచూస్తున్నాయి. యిక సమయం ఆసన్నమైంది. ఒక సువర్ణ ఆధ్యాయానికి తెరలేవబోతోంది..ఒక కొత్త చరిత్రకు అంకురార్పణ జరుగబోతోంది..అందుకు ముహూర్తం నిర్ణయించాను రామం. అందుకు సర్వరంగాలనూ సన్నద్ధం చేశాను. సకల శక్తులనూ సమీకరించి ఉంచాను..యిక నువ్వు శంఖాన్ని పూరించడమే తరువాయి..”
రామంకు ఆ ముహూర్తం సంగతీ..కార్యక్రమ రూపకల్పన సంగతీ..అన్నీ తెలుసు. కాని..అన్నాడు..”ఎప్పుడు క్యాథీ” అని.
”ఈ రోజు ఆగస్ట్‌ పది..మనం యుఎస్‌ఎలో ఉన్న మన అన్ని లావాదేవీలనూ జీరో చేయడమో, కొన్నింటిని మనం మళ్ళీ యిక్కడికి ఫిజికల్‌గా తిరిగివచ్చి నిర్వహించవలసిన అవసరం లేకుండా రీషేప్‌ చేయడమో చేశాను. వాటి వివరాలు చెప్పనా.”
”ఊఁ..”
”నువ్విక్కడికి వచ్చి భవిష్యత్తులో ఆంధ్రదేశంలో నువ్వు నిర్వర్తించవలసిన భావికార్యక్రమాల నిర్వహణ దృష్ట్యా కొన్ని నిధులు అవసరమనే వాస్తవిక సత్యాన్ని గ్రహించి పదేళ్ళ కాలంలో మెరుగైన ఫలితాలనివ్వగల కొన్ని కంపెనీలను స్థాపించావు. అవి ఆర్‌వి కన్‌స్ట్రక్షన్స్‌, న్యూ ల్యాండ్‌స్కేపింగు పీపుల్‌, రామం రియల్‌ రిఆల్టర్స్‌, ఎబిసి లాగిస్టిక్స్‌, సిన్సియర్‌ కన్‌సల్టెంట్స్‌, రామం సిస్టమ్స్‌. ఇవి కాక ఎనిమిది రాష్ట్రాల్లో ఎనిమిది ఇండియన్‌ స్టోర్స్‌ అటాచ్డ్‌విత్‌ ఇండియన్‌ రెస్టారెంట్స్‌.. చెయిన్‌. వీటి విలువ ఎస్టాబ్లిష్‌మెంట్‌ టైంలో ఇరవై మిలియన్‌ డాలర్లు. దీంతో నువ్వు నీ స్నేహితులద్వారా నీకున్న మేనేజ్‌మెంట్‌ స్కిల్సన్నీ ఉపయోగించి పెట్టుబడి పెట్టిన క్యాపిటల్‌ మూడు బిలియన్‌ డాలర్స్‌. మిగతావన్నీ వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు.మనకు ఎక్కువగా సహకరించి డబ్బును సమకూర్చిన బ్యాంక్స్‌ బ్యాంకాఫ్‌ అమెరికా, సిటిగ్రూప్‌, మోర్గాన్‌ స్టేన్లే, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, సన్‌ట్రస్ట్‌, క్యాపిటల్‌ వన్‌ ఫిన్‌.. వీటితో చాలా బ్యాంకులకు నాన్నకు చెందిన హోల్డింగ్సును మొదట సెక్యూరిటీగా చూపాం. తర్వాత బెస్ట్‌ పర్‌ఫార్మింగు కంపెనీస్‌ క్రింద మన సంస్థలకన్నింటికీ ఈ పైనాన్సియల్‌ ఇన్‌స్టిట్యూషన్లలో పరపతి పెరిగింది.
మన ప్రణాళిక పకడ్బందీగా ఉంది కాబట్టి డెడ్‌లైన్‌ను దృష్టిలో పెట్టుకుని కార్యకలాపాలనను నిర్వహిస్తూ వచ్చాం. మొన్నటి మార్చి ఫైనాన్షియల్‌ ఇయర్‌ నాటికి మన సంస్థల పర్‌ఫార్మెన్స్‌ను ఖచ్చితంగా మదింపుచేశాను. యిప్పుడు మన నెట్‌ అసెట్‌ వ్యాల్యూ ఇరవైరెండు బిలియన్‌ డాలర్స్‌. నా తరపున ఉన్న హోల్డింగ్సు విలువ ఎనిమిది బిలియన్‌ డాలర్స్‌. మనం చెల్లించవలసిన లయబిలిటీస్‌ మొత్తం ఆరు బిలియన్‌ డాలర్స్‌. మన ఆర్థికస్థితిగతులు ఎంతో ఆరోగ్యంగానే ఉన్నట్టు లెక్క”.
రామం తదేకంగా క్యాథీవైపు చూస్తున్నాడు.
ఒక పెద్ద ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తన బోర్డాఫ్‌ డైరెక్టర్స్‌ మీటింగును జరుపుతున్నప్పుడు జరిగే ప్రధాన తతంగాన్నంతా క్యాథీ ఒక్కతే ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తోందీ..అనుకున్నాడు..ఈ ఒక్క మనిషి పదిమంది సమర్థులైన మేనేజర్లతో సమానం అనికూడా అనుకున్నాడు. కాగా విశ్వసనీయత సంగతో..ఆమెను నమ్మడమంటే తనను తాను, తన నీడనుతాను, తన ఆత్మనుతాను విశ్వసించినట్టే.
ఒకసారి క్యాథీతో తను చర్చించిన చిత్రమైన విషయం జ్ఞాపకమొచ్చింది రామంకు.
”క్యాథీ..ఒక మనిషి ఒక జీవితకాలంలో రెండు మూడు జీవితాలను జీవించడం, ఒక మనిషి యాభై ఏండ్లకాలంలో వందేళ్ళకాలం జీవించడం, మనిషి ఎన్నేండ్లయినా జీవిస్తూకూడా మరణిస్తూనే ఉండడం తెలుసా నీకు”. అన్నాడొకసారి తామిద్దరూ ఒక కంపెనీతో ప్రధాన వ్యాపార విషయాలను చర్చించడానికి, ఒక అగ్రిమెంట్‌ను సంతకం చేయడానికి డల్లెస్‌ వెళ్తున్నపుడు కార్లో.
”చెప్పు” అంది ఆసక్తిగా.
”ఒకతను ఉద్యోగరీత్యా ఒక ఉపాధ్యాయుడు..ఉపాధ్యాయునిగా అద్భుతంగా పాఠాలు చెప్పడం, ఉద్యోగానికి న్యాయం చేయడం..దాన్ని అలాగే నియమితకాలం వరకు కొనసాగించడం ఒక జీవితాన్ని జీవించడం. ఐతే ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఒక రచయితగా, ఒక పెయింటర్‌గా లేదా ఇంకేదోరంగంలో నిపుణునిగా తనను తాను మలచుకుని రాణించడం..అంటే మనిషి ఏకకాలంలో ఒకటికంటే ఎక్కువ జీవితాలను జీవించడం. కాగా మనిషి తన జీవితకాలంలో యిరవై ఐదేండ్లవరకు చదువు, తర్వాత ముప్పయి ఏండ్లు ఉద్యోగం చేస్తూ కొంత డబ్బు సంపాదించి కొన్ని బాధ్యతలు నిర్వర్తించి, కొన్ని విజయాలు సాధించి..మొత్తం సమగ్రతను ఎనభైఏండ్లలో పూర్తిచేయగలిగినట్టయితే..అవే పనులను దాదాపు నలభై ఏండ్లలో సాధ్యంచేసినట్టయితే అది ఏభై ఏండ్లలో వందేండ్ల జీవితాన్ని జీవించడం వంటిది. ఒకడు అరవై ఏండ్లకు మంత్రికాగలిగితే మరొకడు ముప్పయ్యేండ్లకే మంత్రి ఐనట్టు..ఒకడు పుట్టి ఏ రంగంలోనూ రాణించక, దేన్నీ సాధించలేక ఒక ప్రాణమున్న వ్యర్థ పదార్థంగా మిగిలిపోవడం అంటే జీవిస్తూకూడా మరణిస్తూండడం..ఐతే మనం ఏ రకంగా జీవిద్దాం అనేదాన్ని మనిషి ఎవరికివారు ముందే నిర్వచించుకొని ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతే బాగుండేది. కాని యిప్పటికీ అరవై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలోని ముప్పావుకన్న ఎక్కువ జనాభా. జీవిస్తున్నామంటే..బస్‌ అంతే.. అలా జీవిస్తున్నాం..అని ఉబుసుపోకకోసమే జీవిస్తున్నారు. చాలామంది దురదృష్టవశాత్తు సాధ్యమైనంత ఎక్కువ డబ్బును సంపాదిస్తే అంత బాగా జీవిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ముఖ్యంగా చదువుకున్న మూర్ఖులు. ఈ భావనే భారతదేశాన్ని కకావికలు చేసి అస్థిరపరుస్తూ ఎదగకుండా చేస్తోంది..”
”ఔను…ఈ విషయాన్ని నేను గ్రహించాను రామం” అంది క్యాథీ.
క్యాథీ ఏ విషయాన్నైనా సూక్ష్మస్థాయిలో అర్థంచేసుకుని తొందరగా ప్రతిస్పందించడంలో ఎంతో చురుకైంది. అదొక అసాధారణ ప్రతిభ.
”మనం సెప్టెంబర్‌ ఐదవతేదీన భారతదేశంలో ఉండేట్టుగా..అంటే మూడవతేదీ రాత్రి పది గంటల యాభై నిముషాల కతార్‌ ఏర్‌వేస్‌ ప్లయిట్‌ క్యుఆర్‌ టుఫిఫ్టీలో హైద్రాబాద్‌ బయలుదేరబోతున్నాం. మన భావి నిరాడంబర కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఈ పర్యటనతో యిక ముందు ఎకానమీ తరగతుల్లోనే మన ప్రయాణం. ఆ రోజు మన ఇద్దరితోపాటు యిక్కడమనం తయారుచేసిన పదిమంది యువతీయువకుల బృందంకూడా యిక అమెరికాలో తమ కార్యకలాపాలను మూసేసి మన భావి రాజకీయ కార్యకర్తలుగా మనవెంట ఉంటారు. వీళ్ళందరూ గత మూడేళ్ళుగా మనతో భవిష్యత్తుగురించి లోతుగా చర్చిస్తూ, మన ఆలోచనలతో, మన లక్ష్యాలతో పూర్తిగా ఏకీభవించే వాళ్ళు. ఏడ్గురు యువకులు. ముగ్గురు యువతులు. యువకుల గ్రూప్‌కు శివ నాయకత్వం వహిస్తారు. కౌస్తుభ యువతులకు నాయకత్వం వహిస్తుంది. వీళ్ళు మన ప్రధానాంగాలు. యిప్పటికే ఈ మధ్య నువ్వు అనేక సార్లు హైద్రాబాద్‌ వెళ్ళి గోపీనాథ్‌ గారితో చర్చించావుగదా. కాగా ఆయనకూడా రెండుసార్లు యిక్కడికి స్టేట్స్‌ వచ్చి మనతో విపులంగా మనం చేపట్టవలసిన పంథా గురించి ఆలోచనలను పంచుకున్నారు. చాలాలోతుగా విశ్లేషించి మన భావి కార్యక్రమాలకు డాక్టర్‌ గోపీనాథ్‌ గారిని మన సిద్ధాంతకర్తగా, గురువుగా స్థిరీకరించాం. మనం స్థాపించబోయే సంస్థపేరు ‘జనసేన’. ఇది ఒక సామాజిక సంస్థ. రాజకీయ పార్టీకాదు. యిప్పటికే దీన్ని మనం హైద్రాబాద్‌లో రిజిష్టర్‌ చేశాం. నంబర్‌ 2305 అబ్లిక్‌ టు జీరో జీరోనైన్‌. గోపీనాథ్‌గారు దాదాపు ఆరు పేజీలుగల జనసేన మానిఫెస్టోను రాసి మనకు సబ్‌మిట్‌ చేస్తే మనం దాన్ని అంగీకరించి ప్రచురించి మన సభ్యులందరికీ పంపిణీ చేశాం. తర్వాత దానికి విపులమైన వివరణాత్మక పాఠాలను మరో పుస్తకంగా ప్రచురించాం. అది నూటా నలభైపేజీలు ఉంది. అది ‘జనసేన లక్ష్యాలు-కార్యాచరణ’ అనే పేరుతో మన మిత్రులందరికీ అందింది.”
రామంకు తను అనేక సందర్భాలలో క్యాథీతో చర్చించిన భవిష్యత్‌ కార్యాచరణ పథకాలను, సంస్కరణ తాలూకు చింతనను, తేవలసిన నిశ్శబ్ద విప్లవం తాలూకు పెనుమార్పుల మూలాలను చర్చించడం..ఆమె వాటిని ఒక క్రమంలో కూర్చడం..ఒక రూపురేఖనిచ్చి డాక్టర్‌ గోపీనాథ్‌ ద్వారా దానికి సిద్ధాంత స్వరూపాలను కల్పించడం..ఇదంతా ఒక పవిత్రమైన గురుతర బాధ్యతగా జ్ఞాపకమొచ్చి.,
”చెప్పు క్యాథీ..నువ్వు అసలైన మన కార్యరంగం గురించి చెబుతూంటే..నాకు నాలోకి నేను చూచుకుంటున్న అనుభూతి కలుగుతోంది. కాగా కార్యోత్సాహంకూడా ఉరకలేస్తోంది. నువ్వన్నట్టు ఇక మన శక్తివంతమైన ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. ప్రాతఃసమయం ఆసన్నమౌతున్నప్పుడు సూర్యోదయాన్ని ఎవడాపగలడు..ప్లీజ్‌ కంటిన్యూ..మనం ఇంత విపులంగా మనల్నిమనం సమీక్షించుకోవడం మున్ముందు సాధ్యంకాకపోవచ్చుకూడా..ఈ సన్నివేశం యిప్పుడెంతో ప్రధానమైంది..”
క్యాథీ సాలోచనగా రామం ముఖంలోకి చూచింది. అతను యోగముద్రలో ఉన్న ఋషిలా నిర్మలంగా ఉన్నాడు.
ఆమెకు ఎందుకో పుచ్చలపల్లి సుందరయ్య జ్ఞాపకమొచ్చాడు. ఒక బనారస్‌ హిందూ యూనివర్సీటీ స్థాపించిన మదన్‌మోహన్‌ మాలవీయ జ్ఞాపకమొచ్చాడు.
”మన కార్యక్షేత్రం వరంగల్లు. మనం ఏది చేసినా ప్రజలు మనను మొదట స్కాన్‌ చేస్తారు. త్యాగాల గురించీ సిద్ధాంతాల గురించీ, ఆదర్శాల గురించీ నీతులు చెప్పే నాయకులు తమ నిజజీవితంలో ఎంతవరకు వాటిని పాటిస్తున్నారు, ఆచరిస్తున్నారు..అని ప్రశ్నించుకుంటారు. ప్రశ్నిస్తారుకూడా. అందుకని.. మనం వరంగల్లు నగరంలో..కాశిబుగ్గ నుండి మొగిలిచెర్ల పోయే రోడ్డుకు అనుకుని రెండు ఎకరాల స్థలంలో..బాలసంత గూడేనికి  యివతల..ఒక ఆశ్రమంవంటి కుటీరాన్ని నిర్మిస్తున్నాను. అందుకోసం భూసేకరణ, నిర్మాణం కూడా ప్రారంభమైంది..నీతో పాటు ప్రక్కనున్న చిన్న కుటీరంలోనీ అనుచరిగా.. సహచరిగా కాదు..”చటుక్కున ఆగింది క్యాథీ.,
”ఊ.. ఈ రెండూ వేర్వేరు కదా..కాని నా దృష్టిలో..మనిద్దరికి సంబంధించి ఈ రెండూ ఒక్కటే.. క్యాథీ.. శరీరం ఆత్మ వేర్వేరుగా మనలేవు. ఆ రెండూ తమ సంయుక్తతను విడిచిపెట్టడాన్నే మరణం అంటారు.” అన్నాడు రామం.
బయట వర్షం ఇంకా ఉధృతంగా కురుస్తూనే ఉంది.
”పక్క కుటీరంలో అహర్నిశలు శరీరంవెంట ఆత్మలా, వస్తువు వెంట నీడలా నేను నివాసముంటాను”
”ఊఁ..”
”భారతదేశంలో..ప్రధానంగా ఆంధ్రదేశంలో గత యాభై సంవత్సరాల రాజకీయ నేపథ్యాన్ని అనేక రాత్రులకు రాత్రులు మేల్కొని సమగ్రంగా అధ్యయనం చేశాను రామం. బ్రిటిష్‌ పరిపాలనలో ఉన్న కోస్తా జిల్లాలకు అధికారిగా వచ్చిన సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి నది సంస్పర్శతో ఎంత పులకించి అపర భగీరథునిగా నాల్గు జిల్లాలకు శాశ్వత సాగునీటి వసతిని ప్రసాదించి ఒక దేవునిగా మిగిలిపోయాడు, చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ ఒక బ్రిటిష్‌ అధికారిగా తెలుగు భాషపట్ల నావలెనే మోహావేశంతో కడపకేంద్రంగా తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు..తెలంగాణా జిల్లాలు నిజాం దుర్మార్గ దురహంకార పాలన క్రిందఅమానుషంగా ఎలా దోచుకోబడ్డాయి..తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం..తదనంతర కమ్యూనిస్ట్‌ ఉద్యమ విఫలం..చీలికలు..రజాకార్లు..తర్వాత భూస్వాములే కాంగ్రెస్‌ నాయకులుగా రూపాంతరంచెంది..దాశరధి రంగాచార్య చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలలో చెప్పినట్టు ప్యూడల్‌ వ్యవస్థ ఎలా ప్రజాస్వామిక ముసుగులోకి మారిందీ..ఇవన్నీ సవివరంగా అధ్యయనం చేశాను రామం. కాలం ఉరుముకుంటూ, గర్జించుకుంటూ ఆంధ్రదేశాన్ని ఒక కుదుపు కుదిపి విడిచిపెట్టింది భారత స్వాతంత్య్ర ప్రకటన నాటికి.. ఐతే అసలు నిజమైన విషాదమంతా ఆగస్ట్‌, 15-1947 తర్వాతనే ప్రారంభమైంది. ఒక విషయం చెబుతే నువ్వు ఆశ్చర్యపోతావ్‌ రామం. 1955లో జవహర్‌లాల్‌ నెహ్రూచే శంకుస్థాపన చేయబడ్డ అతిపెద్ద మాసనరీ డామ్‌ ఐన నాగార్జునసాగర్‌ అప్పటి ప్లానింగు కమీషన్‌ చేత 80 కోట్ల రూపాయల ప్రాజెక్టుగా ప్రారంభించబడి చివరికి 1967లో ఇందిరాగాంధీచే ప్రారంభించబడ్డప్పుడు 91 కోట్ల రూపాయల నిధులతో పూర్తిచేయబడింది. అదే ప్రాజెక్టును యిప్పుడైతే నలభై వేల కోట్ల రూపాయలతో యిప్పటి దుర్మార్గులైన ఇంజినీర్లు నిర్మిస్తారు.. అందులో కనీసం పదిహేను వేల కోట్ల రూపాయలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపిటీసిలు, కార్పొరేటర్లు, చీఫ్‌ ఇంజినీర్లు, ఇఇలు, డియిలు, ఎయిలు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు.. ఇలా అందరూ వాటాలు వేసుకుని పంచుకు తింటారు. ప్రాజెక్ట్‌ పదిసంవత్సరాలు కాకుండానే తప్పకుండా కొట్టుకుపోతుంది. ఏమిటీ మార్పు. ఈ నిర్లజ్జతనానికి ప్రతీకలైన ఈ ప్రభుత్వాల, ప్రజల నీతిహీనత ఏ శాస్త్రానికీ అంతుబట్టడంలేదు. ఐతే ప్రజల ప్రవర్తన విషయంగా ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త అరిస్టాటిల్‌ ఏమన్నాడంటే..”
”…..” రామం వింటున్నాడు..ఓ పాఠాన్ని ఆసక్తిగా వింటున్న విద్యార్థిలా.
”ప్రజలెప్పుడూ అవకాశవాదులు. ఒక చిన్న పిల్లవాన్ని ఏ కాపలాలేని మిఠాయి దుకాన్లో కూర్చోబెడితే అవకాశముంది కాబట్టి జిహ్వాచాపల్యంతో దొంగతనంగా మిఠాయి తింటాడు. ఏదైనా నిఘా ఉంటే దొంగతనానికి శిక్ష తప్పనిసరిగా ఉంటుందంటే అదే పిల్లవాడు మిఠాయి స్వాహా చేయడు సరికదా తనూ ఓ కాపలాదారుడుగా వ్యవహరిస్తాడు. ఈ అతి సున్నితమైన తేడాను ప్రజాపరిపాలనతో సంబంధమున్న ప్రతివ్యక్తీ ప్రాథమికంగా గమనించాలని చెప్పాడాయన.. అందుకే యధా రాజా తధా ప్రజా నానుడి పుట్టింది. యిప్పుడు ఈ సామెతను యథా ప్రజా తథా రాజాగా మార్చి విచ్చలవిడి దౌర్జన్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ దౌర్జన్యం యిక భరించలేని గరిష్ఠస్తాయికి చేరింది. దీన్ని ధ్వంసం చేయాలి. లేకుంటే యిక వ్యవస్థ ఎవరూ బాగుచేయలేని అథమాథమ స్థితికి చేరుకుంటుంది.”
”…..” రామం కళ్ళు ఆమెను నిశితంగా అధ్యయిస్తున్నాయి. ఆమె అప్పుడు మహాభారత రణక్షేత్రంలో అర్జునునికి తత్వబోధను చేస్తున్న కృష్ణుని ముఖంలా ఉంది పరిపూర్ణంగా.
”యిక్కడ పరిపాలనకు సంబంధించిన ఒక ప్రధాన విషయాన్ని మనం కూలంకశంగా పరిశీలించాలి రామం. దేశం ఏదైనా.. ప్రజలు..ఆమాటకొస్తే మనుషులు ఏ పరిస్థితుల్లో తప్పకుండా చెప్పినమాట వింటారు..అంటే జవాబు..దేశభక్తి.. దేశంపట్ల ప్రేమ..మనిషికి మనిషి పట్ల గౌరవం..మానవత్వం..మానవతా విలువలు..గాడిద గుడ్డు..ఇలా కోటి సమాధానాలొస్తాయి – కాని సత్యమేమిటంటే..భయం. నేను ఈ చేయకూడని పనిచేస్తే ఎవరో తప్పకుండా తనను శిక్షించి కష్టమో, నష్టమో కలుగజేస్తాడని గ్యారంటీ ఉన్నప్పుడు మాత్రమే మనిషి తప్పకుండా ఎదుటి మనిషి చెప్పినమాట వింటాడు. అంతిమంగా మనిషిని ఋజుమార్గంలో పెట్టేదీ, సరియైన మార్గంలో నడిపించేదీ ‘భయం’ ఒక్కటే. ఏదో ఒక భయం లేనిది మనిషి చెప్పినమాట వినడు. ఒకసారి ‘భయం’ పేరుతో మనిషిని సరియైన దారిలో పెట్టగలిగితే, తర్వాత కౌన్సిలింగు చేసి, బుజ్జగించి, బుద్దిచెప్పి, నిజమైన నీతి వాక్యాలను, విలువలను బోధపరిచి యిక వ్యక్తిని ఉత్తమునిగా, ఉన్నతునిగా మార్చవచ్చు. యిది ఒక సంక్లిష్టమైన సందిగ్థ స్థితి.. పాలకులకు తెలియాల్సిన పరిపాలనా రహస్యం.
మనిషిలో పాదుకొల్పాల్సిన భయానికి మారుపేరు ‘బ్లాక్‌మెయిలింగు’ పరిపాలనలో, రాజకీయాల్లో, అధికారిక వ్యవహారాల్లో, కార్పొరేట్‌ కల్చర్‌లో ‘బ్లాక్‌మెయిలింగు’ అనేది అతిశక్తివంతమైన ఒక టూల్‌. వెనుకటి భారత రాజకీయాల్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఒక తిరుగులేని నియంతను తలపింపే పటిష్టమైన పాలనను కొనసాగిస్తున్న కాలంలో ఒక ప్రచారం బలంగా వినిపించేది. అమె గురించిన పాలనాపరమైన పుస్తకాలను చదివినా ఈ విషయం తెలుస్తుంది..ఏమిటంటే ఎవరైనా తనకు ఎదురుతిరిగినప్పుడు, తోక జాడించినపుడు, నక్‌రాలు చేసినప్పుడు ఒంటరిగా తన చాంబర్‌లోకి పిలిపించుకుని వాని చరిత్రభూగోళాన్ని విప్పే ఫైల్స్‌ను ముందుంచేదని. యికవాడు కిక్కురుమనకుండా నోరు మూసుకుని ‘కింనాస్తి’ అయ్యేవాడని.. యిది ఒక అతిప్రధానమైన అంశం. కాబట్టి ఒక ఉద్యమాన్నిగానీ, పరిపాలననుగానీ కొనసాగిస్తున్న ప్రతి సమర్థవంతుడైననాయకుడు తన ప్రధాన శత్రువు యొక్క , తన ఆంతరంగికుల యొక్క, అతి సన్నిహిత మిత్రులయొక్క ఆంతరంగిక ప్రవర్తనల రికార్డును ఎప్పటికప్పుడు తయారుచేసుకుని పెట్టుకోవాలి. ఎప్పుడుకూడా ఎదురుతిరిగేవాడెవడయ్యా అంటే మన రహస్యాలను ఎక్కువగా తెలుసుకోగలిగే మన దగ్గరి మిత్రులే. వాళ్ళే ద్రోహులుగా, కోవర్టులుగా మారుతారు. పురాణాల్లో యింటిదొంగ విభీషణుడు కోవర్ట్‌గా మారాడు, మహాభారత యుద్ధంలో శల్యుడు ఇన్‌ఫార్మర్‌గా మారాడు. శకుడు మిత్రుని రూపంలో ఉన్న శత్రువుగా ప్రవర్తించాడు. వీళ్ళ గురించి తగు జాగ్రత వహించకపోతే అసలు లక్ష్యాలు దెబ్బతిని అంతా మిస్‌ఫైర్‌ ఔతుంది. ఐతే ఈ మనుషులను సరిగ్గా గుర్తించే వ్యవహారాన్ని అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిమాత్రమే నిర్వహించాలి. అందుకే దీన్ని.. పరిశీలన.. నివేదన.. చర్య.. అనే ప్రధానమైన భాగాలుగా గల ఇంటెలిజెన్స్‌ బాధ్యతను నీకు ప్రథమ వలయ రక్షకులుగా ఉండే నేనూ, శివ తీసుకుంటాం. అత్యంత గోపనీయంగా ఈ మాడ్యూల్‌ ఉంటుంది. డైరెక్ట్‌ రిపోర్టింగు టు యు ఓన్లీ”…ఒక క్షణం ఆగి.,
”క్యాథీ మన జనసేన సంస్థ నిర్మాణ వివరాల్లోకి పోయేముందు..ఒకసారి స్థూలంగా ఈ అరవై సంవత్సరాల భారత రాజకీయ వ్యవస్థ యొక్క రూపురేఖలను మననం చేద్దాం..నువ్వన్నట్టు ఒక కీలకమైన గతం యొక్క చరిత్రను పునశ్చరణ చేసుకుంటే భవిష్యత్‌ ప్రణాళిక స్పష్టంగా మన కళ్ళముందు రూపుకడ్తుంది. ఐతే..ఏ కాలంలోనైనా ఎప్పుడూ దేశక్షేమం గురించి తీవ్రంగా స్పందిస్తూ ఆలోచించిన ఒక మేధోవర్గం ఉంటూనే వచ్చింది. వాళ్ళకు అధికారవ్యామోహం లేదు. స్పృహమాత్రమే ఉంది. ప్రగతికాంక్ష మాత్రమే ఉంది..” ఆగాడు రామం..ఎక్కడోతనను తాను కోల్పోతూ.
”భారత స్వాతంత్య్రం ప్రకటించబడ్డ కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే సంఘ స్వార్థపరశక్తులు విషకోరలతో విజృంభించడాన్ని శుద్ధ జాతీయవాదులందరూ గమనించారు. అప్పుడు ఓ వేయి పేజీల గ్రంథం చెప్పగల సారాంశాన్ని మహాకవి శ్రీశ్రీ ఒక్క పాటతో ప్రజానీకానికి నిద్రమత్తు విదివిస్తూ గర్జించాడు. అంటాడు.
‘స్వాతంత్రంవచ్చెననీ సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయీ
సాధించినదానికి సంతృప్తిని పొందీ
అదే విజయమనుకుంటే పొరపాటోయీ’ అని  కర్తవ్యబోధను చేస్తూనే అప్పటికే విజృంభించిన రుగ్మతలను ఏకరువుపెట్టి ఒక హెచ్చరికను చేశాడు..చూడు
”ఆకాశం అందుకునే ధరలొకవైపు
అంతులేని నిరుద్యోగమింకొక వైపు
అవినీతి, బంధుప్రీతి, చీకటిబజారు
అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు” అని వాపోయాడు. ఈ స్థితి ఈ అరవై ఏళ్ళలో ఏకొంచెమైనా మెరుగుపడలేదు సరికాదా యింకా యింకా కుళ్ళిపోయి, క్షీణించి శుభ్రంచేయలేనంత మురుగుగా నరనరాన వ్యాపించింది. అప్పుడే జాతీయ, రాష్ట్రస్థాయిలో దేశానికి భంగం కలిగించే పాలసీలనూ, విధానాలనూ ఎండగడ్తూ కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి 1978లో ‘ఇండియా మార్టిగేజ్డ్‌’ పుస్తకాన్ని వెలువరించి ఒక షాక్‌ ట్రీట్‌మెంటిచ్చాడు. ఏం జరిగింది..ఒంటరిగా ఒకే ఒక యోధుని ప్రతిఘటన.. పుస్తక నిషేదం. ఎన్నో సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి ఈ దుర్మార్గ సూడో ప్రజాస్వామిక వ్యవస్థలో ఇమడలేక మార్సిస్ట్‌-లెనినిస్ట్‌ కానూసన్యాల్‌ విభాగం పేరుతో పోరాటం చేసీచేసీ..యిక్కడ ఓ విషయం జాగ్రత్తగా గమనించాలి రామం.. పాలకుల దమనకాండకు, అణచివేతకు, విచ్చలవిడి దోపిడీకి వ్యతిరేకంగా గత నలభై ఏండ్లకు పైగా తెలుగు నేలపై జరుగుతున్న తీవ్రవాద ఉద్యమాలన్నీకూడా ఎందుకు విఫలమైపోయాయంటే..వాటిలో మెజారిటీ సందర్భాల్లో సామాన్య ప్రజల భాగస్వామ్యం లేకపోవడమే. నక్సల్‌బరీలో ఓ భూపోరాట శక్తిగా..చిన్న మొక్కగా పొటమరించి నక్సలైట్‌ ఉద్యమంగా విస్తరించి, ఎదిగి శ్రీకాకుళ సాయుధ పోరాటంగా వెంపటాపు సత్యం, పంచాది నిర్మల, అధిభట్ల కైలాసం..వంటి అమరవీరుల నేతృత్వంలో అంటుకున్న అగ్నిలా ఉత్తర తెలంగా జిల్లాల గుండెల్లోకి విప్లవాగ్నియై విజృంభించినా..మొదట్లో మెడికల్‌, ఇంజనీరింగు విద్యార్థుల సామూహిక ప్రవేశంతో విద్యుత్తులా అడవుల్లోకి ప్రవహించినా..పీపుల్స్‌వార్‌గా మారి..అటు తర్వాత మావోయిస్ట్‌లుగా పేరుమార్చుకుని అనేక అంతర్గత కుమ్ములాటతో వర్గపోరాటంపేరుతో శత్రునిర్మూలనను చేపట్టి చివరికి పార్టీలోని వ్యక్తిగత కక్షలసాధింపు యంత్రాంగంగా పరిణమించి, అర్థంపర్థంలేని హింసలతో, హింసాత్మక చర్యలతో.. నిజంగా ద్రోహులుగాహిరంగంగా ముద్రపడ్డ ఏ ఒక్క రాజకీయ నాయకున్నీ, ఏ ఒక్క లంచగొండి ప్రభుత్వ అధికారినీ చంపకుండా చివరికి మావోయిస్ట్‌ ఉద్యమమంటే పోలీసులకూ, అడవుల్లో ఉండే ఎవరికో నడుమ జరిగే పాశవిక పరస్పర నిర్మూలనచర్యగా సామాన్యజనం అర్థంచేసుకునే స్థితికి చేరింది. ఐనా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబడిన ఏ సిద్దాంతమైనా ఓ నలభై ఐదేండ్ల సుదీర్ఘకాలంలో తనముద్రను ప్రజల్లో వేయలేకపోయిందీ, జనాదరణను పొందలేకపోయిందీ, ప్రజల ఆమోదాన్ని పొందలేకపోయిందీ అంటే అది ఒక విఫలంకిందే లెక్క. ప్రతి ప్రయోగానికీ కొంత కాల అవధి ఉంటుంది… యిప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో గిరిజనులు ఆదివాసీలు అరణ్యవనరుల దోపిడీకి ప్రతిఘటన పేరుతో అర్ధవంతమైన ఉద్యమాలు మధ్య భారతంలో జరుగుతున్నా..అవి ప్రధానంగా ప్రజాబాహుళ్యంలో నైతికపరమైన పరివర్తననూ, విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతి, లంచగొండితనం నిర్మూలన దిశగా ఆలోచిస్తూ పనిచేయడం లేదు. అవి దారి తప్పాయి. అందుకే విద్యావంతులూ, అభ్యుదయవాదులెవ్వరూ ఈ ఉద్యమాలపట్ల ఆసక్తి చూపడంలేదు. కాడర్‌ రిక్రూట్‌మెంట్స్‌ బాగా తగ్గిపోయాయి. గత నెల నేను చత్తీస్‌గడ్‌, ఒరిస్సా లోతట్టు ప్రాంతాల అనేక గ్రామాల్లో పర్యటించినపుడు కొన్ని వందలమంది ఆదివాసీ పౌరులతో మాట్లాడాను. వాళ్ళు నిజానికి ఒకవైపు ప్రభుత్వ అనధికార ఏజన్సీ సాల్వజుడుం, పోలీసులు, సిఆర్‌పిఎఫ్‌ దళాలు మారోవైపు అజ్ఞాత మావోయిస్ట్‌ దళాలమధ్య మింగలేక చావలేక నలిగిపోతున్నారు. వాళ్ళిప్పుడు అందరూ తమను విడిచిపెట్టి వెళ్ళి యిదివరకటిలా తమదారిన తమను ప్రశాంతంగా అడవిలో బ్రతకనిస్తే చాలు మహాప్రభో అన్న దుఃఖంనిండిన విసుగుదలతో ఉన్నారు. వాళ్ళకు ఈ దిక్కుమాలిన దోపిడీ రాజకీయాలపట్ల, రక్తపాతంపట్ల, పరస్పర హింసపట్ల, తనవాళ్ళను తామే నిర్మూలించుకోవడం పట్ల ఏమాత్రం ఆసక్తిలేదు. ఈ ‘హిట్‌ అండ్‌ మిస్‌’ సిద్ధాంతానికి కాలం చెల్లింది. యిప్పుడు ‘స్టే అండ్‌ హిట్‌’ సూత్రం కావాలి. ప్రజల్లోకివెళ్ళి ప్రజలతో కలిసి జీవిస్తూ ప్రజలతో మమేకమై, ప్రజలను విద్యావంతులను కాకుండా నైతికవంతులను చేసే ఒక వినూత్న నిశ్శబ్ధ విప్లవ పంథా యిప్పుడు కావాలి. ఈ ప్రభుత్వాలు అవినీతి, అధికారం, డబ్బు, లంచగొండితనం, మద్యం, మీడియా, వ్యామోహల సరఫరా అనే అదృశ్య ఉచ్చును ప్రజలపై విసిరి వాళ్ళను నిద్రబుచ్చి, బందీలను చేసి దుర్మార్గమైన పాలనను కొనసాగిస్తున్నాయి. దీనిని పునాదితో సహా పెకిలించి సమూలంగా నిర్మూలించాలి.. అలా చేయడం అసాధ్యంకాదు. ఈ స్థితి కుళ్ళి కుళ్ళి, ఆ దుర్వాసన చుట్టు ప్రక్కకు వ్యాపించి యిక భరించలేని స్థాయికి క్షీణించిపోయింది. పీతికంపులో ఎవరైనా ఎంతకాలం ఉండగల్గుతారు. నిజమైన ప్రజలు విసిగి విసిగి, అలసి అలసి ఏదో ఒక నిజాయితీగా సంస్కరించ సంకల్పించే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. స్వతంత్రం అరాచకత్వంగా, స్వేచ్ఛ విశృంఖలత్వంగా మారి గుండాయిజం, నేరం, మాఫియా చట్టసభల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, శాసనకర్తలుగా మారి రాక్షస హాహాకారాలు చేస్తున్న వర్తమానం ఎంత చెడిపోయిందో..ఈ రోజు దినపత్రికలోని ఈ న్యూస్‌ ఐటం చదివితే తెలుస్తుంది.
‘ఇక కిక్కేకిక్కు…మద్యం ఆదాయం ఏడువేల కోట్లు. ఈ సంవత్సరం తాజా మద్యం టెండర్ల ద్వారా నలభై ఎనిమిది కోట్లు ప్రభుత్వానికి లభించాయి. దీనికి లైసెన్స్‌ ఫీజుమొత్తాన్ని కలిపితే మద్యం టెండర్లపై లభించిన ఆదాయం మొత్తం రూ|| 7 వేల కోట్లకు చేరుకుంది. రాష్ట్రం మొత్తం మీద 650  మద్యం దుకాణాలకు 48,602 టెండర్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లా దాచేపల్లి, నడికుడి గ్రామం రూ|| 5,21,11,111 షాపు ధర పలికింది కాగా ఈ సంవత్సరం
యిదివరకు మద్యం వ్యాపారంలో ఉన్న వ్యక్తులకు గాక కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చిన 60 శాతం మందికి కొత్త షాపులు దక్కాయి. కోస్తా జిల్లాలలో మద్యం వ్యాపారంలోకి మంత్రులు, శాసనసభ్యులు కూడా రంగప్రవేశం చేసి షాపులు దక్కించుకున్నారు.. ఐతే కొసమెరుపేమిటంటే.. మొన్నెన్నడూ కనీవిని ఎరుగని విధంగా వేలం పాటలో వందమంది మహిళలకు మద్యం షాపులు దక్కడం.
క్రిందనే ఇంకో న్యూస్‌ ఐటం ఉంది.
‘ఆదాయంకోసం ప్రభుత్వం వ్యభిచార గృహాలనుకూడా నడుపుతుందా’ అని హెడ్డింగు.
‘రాత్రి ఏడుగంటలు దాటిందంటే మహిళలు రోడ్లమీద నడచి క్షేమంగా ఇంటికి చేరలేకపోతున్నారు. రోడ్‌కు యిరువైపులా బహిరంగంగా నిస్సిగ్గుగా తాగుతూ దారినపోతున్న ఆడవాళ్ళపై నానా కారుకూతలు కూస్తున్నారు. దుర్‌వ్యాఖ్యలతో బూతులు మాట్లాడ్తున్నారు. ప్రభుత్వమే స్వయంగా కాలేజీల ప్రక్కన, దేవాలయాల పక్కన బార్లకు, బ్రాందీషాపులకు పర్మిషన్‌ యిచ్చి విద్యార్థులనుకూడా తాగుబోతులుగా, అసాంఘికశక్తులుగా మారుస్తోంది. మహిళలను, యువతరానికి రక్షణ కల్పించి భాద్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవలసిన ప్రభుత్వమే పూర్తిగా అనైతికంగామారి వెనుకటి పురాణకాలం నాటి రాక్షస పాలనను తలపిస్తోంది’ అని అల్వాల్‌ ప్రాంతంలోని పలుమహిళలు వాపోయారు. ఒకరైతే ఆగ్రహవేశాలతో ఊగిపోతూ ఈ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించింది..ఆదాయమే ప్రధానమైతే ప్రభుత్వమే వ్యభిచార గృహాలనూ, జూదగృహాలనుకూడా నడపొచ్చుగదా అని వ్యాఖ్యానించారు’.
”వింటున్నావా రామం..స్త్రీ శక్తి స్వరూపిణీ అనీ, ఆదిశక్తి అనీ భారతదేశంలో భావిస్తారు గదా. అటువంటి పుణ్య భూమిపై ప్రభుత్వాలచేతనే స్త్రీ అవమానించబడి, అగౌరవపరచబడి ప్రవర్తిస్తూంటే..మంత్రులూ, శాసన సభ్యులూ మద్యం వ్యాపారంలో మునిగిపోతే..అసలు ఏం జరుగుతోంది. ఎవరు ఎక్కడ్నుండి ఎక్కడికి పతనమైపోతున్నారు. యింత జరుగుతూంటే ప్రజాసంఘాలు, మేధావులు, ఉద్యమకారులు, నక్సలైట్లు..మహిళాసంఘాలు..ఏంజేస్తున్నాయి. ప్రతిఘటించవలసిన వీరనారి మహిళ కూడా వంద బ్రాండీషాపులను నడుపడానికి సిద్ధపడ్తే…కనీసం సుమోటో కేస్‌గా స్వీకరించన్నా ఏ హైకోర్ట్‌ న్యాయమూర్తయినా ఈ దురాగతాలను ఆపవచ్చుగదా.” అంది క్యాథీ ఆవేశంగా, బాధగా.
”ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే ప్రభుత్వపరమైన అకృత్యాలలో ఇది ఒకటి మాత్రమే క్యాథీ. ఇలాంటి అకృత్యాలు ఇంకెన్నో కోకొల్లలున్నాయి. ఐతే అవి మద్యంవలె నేరుగా ప్రజాసంబంధాన్ని కలిగి ఉన్న వ్యవహారాలు కావు. నైన్త్‌క్లాస్‌, ఊర్మిళ టీచర్‌.. చెబుతుంది, ఆంటీ ఐ లౌయు వంటి బాలల మనసులను విషపూరితంచేసే సినిమాలకు అనుమతి, బ్లూ వెబ్‌సైట్లతో యువతను దోపిడీచేసే ఇంటర్‌నెట్‌ పార్లర్లు, రాత్రి పదకొండున్నర దాటితే మిడ్‌నైట్‌ మాసాలాలతో దాదాపు బూతు ఛానల్స్‌గా మారే అన్నీ టి.వి.ఛానళ్ళు, విచ్చలవిడి క్లబ్బులు, పబ్బులు…యివన్నీ సమాజం శరీరంమీద వెలసిన పుట్టకురుపులే. కేన్సర్‌రోగం బహుముఖీన దిశల్లో ఎంతోవేగంగా విస్తరిస్తోంది. దీనికి అతి త్వరలో భరించలేని నొప్పి కలిగినా సరే ఒక శాశ్వత శస్త్రచికిత్స జరగాలి.” రామం స్థిరంగా, నిశ్చలంగానే అన్నాడు.
ఇద్దరి మధ్య ఒట్టి నిశ్శబ్దం నెలకొంది కాస్సేపు..భాషలేని దుఃఖం ఎప్పుడూ మౌనంగానే పొగిలిపోతుంది.
బయట వర్షం కురుస్తూనే ఉంది.
”చాలా దుఃఖంగా, ఆందోళనగా…వేదనగా ఉంది క్యాథీ..సరే ఒకసారి ఫైనల్‌గా మన ‘జనసేన’ సంస్థాగత నిర్మాణ స్వరూపం, వివిధ అంగాలు, మూల విధానాలు..వీటి గురించి చెప్పు..నన్ను నేను ఒకసారి ట్యూన్‌ చేసుకుంటా చివరగా.. లెట్‌ ద ఫైనల్‌ పిక్చర్‌ ఎమర్జవుట్‌..”అన్నాడు రామం యోగనిద్రలో ఉన్నట్టు.
”యస్‌.. నేనూ అదే అనుకుంటున్నా రామం. మన సంస్థకు శిఖరాయనూనమైనవ్యక్తి సిద్ధాంతకర్త.. ఆయనను మనం ఆచార్య అని పిలుస్తాం. చంద్రగుప్తమౌర్యునికి చాణక్యునివలె, ప్రతాపరుద్రునికి యుగంధర మంత్రివలె, రాయలకు తిమ్మరుసువలె అతనే సంస్థకు అంతిమ మార్గదర్శి. మనకు ఆ స్థానంలో డాక్టర్‌ గోపీనాథ్‌ ఉంటారు. అతను జీవితాంతం ఒక కరుణార్థ్ర హృదయుడైన డాక్టర్‌గా, మెడికల్‌ కాలేజి ప్రొఫెసర్‌గా ఆదర్శ జీవితాన్ని జీవించారు. ఎక్కడా మచ్చలేని చరిత్ర అతనిది. సమాజం గురించీ, మానవ సమాజ వికాసం గురించీ ఎన్నో పుస్తకాలు రాశారు. ఎన్నో ప్రజాసంఘాల్లో చురుకైన పాత్రపోషించారు. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని నాయకత్వం వహించారు. గంభీరమైన వ్యక్తి. ఎంతో దీర్ఘమైన, లోతైన అధ్యయనంచేసి నువ్వే రెండున్నర సంవత్సరాల క్రితం ఆయనను ఎంపిక చేశావు. మొట్టమొదట అతన్ని వరంగల్లులో కలిసి ఒక రోజంతా విపులంగా చర్చించి.. తర్వాత్తర్వాత దాదాపు ఇరవై రెండుసార్లు గోపీనాథ్‌గారు నీకు కలిశారు. సంస్థయొక్క మానిఫెస్టో రాసేందుకు రెండు దఫాలుగా రెండు నెలలు అమెరికా వచ్చి మనతో గడిపారు. చర్చించారు.. ఆలోచనలను కాగితంపై అక్షరబద్ధం చేశారు. ఐతే ప్రధానంగా మనది ఒక రాజకీయ పార్టీ కాదు. ఇది ఎన్నికల్లో పోటీచేయదు. రాజకీయ అధికారంకోసం ప్రాకులాడదు. కాని అతి శక్తివంతమైన ఒక ప్రజావేదికగా అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వచర్యనైనా వాచ్‌ డాగువలె గమనిస్తూ, పరిశీలిస్తూ ఒక ఇన్‌స్పెక్టర్‌వలె ప్రవర్తిస్తుంది. ఈ రకమైన పరిశీలకునిగా మన సంస్థ పనిచేయడానికి మనకున్న అధికారాలేమిటి.. అన్నది ఒక ప్రాథమిక ప్రశ్న…దానికి జవాబేమిటంటే ..భారత రాజ్యాంగం ప్రసాదించిన పౌర హక్కులు. ఈ దేశంలో శాసనబద్ధమైన ఎన్నో హక్కులు, బాధ్యతలు, విధులు, విధానాలూ అన్నీ సక్రమంగానే ఉన్నాయి. తప్పు జరుగుతున్నపుడు ఏ రాజకీయ చర్యనైనా, ఏ నాయకున్నైనా నిలదీసి ప్రశ్నించే అధికారం ప్రతి ఓటర్‌కు, పౌరునికే ఉంది. ఐతే యిప్పుడు ఏ ఓటరూ ఎవర్నీ ప్రశ్నించడం లేదు. ఎందుకంటే వ్యక్తి ఒంటరిగా బలహీనుడు. నిస్సహాయుడు. ప్రశ్నించడానికి భయపడ్తాడు. యిప్పుడు ప్రశ్నించడం మనిషికి నేర్పి వాడి వెనుక ‘జనసేన’ నిలబడి బలమైన గొంతుతో ప్రశ్నింపజేస్తుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిపనికీ అకౌంటబిలిటీ.. అంటే జవాబుదారీతనం క్రింద ఏ పౌరుడడిగినా సరియైన సమాచారాన్నందించాలని ‘సమాచార చట్టం – 2005’ ఘోషిస్తోంది. అసలు మన ప్రజా ఉద్యమానికి ఈ ఒక్క సమాచార చట్టం దన్ను చాలు. ఇటీజ్‌ ఎ పవర్‌పుల్‌ టూల్‌.. విచీజ్‌ నాటెటాల్‌ యూజ్డ్‌ ప్రాపర్లీ బై ఎనీవన్‌, ఎనీటైం, ఎట్‌ ఎనీ ఇన్‌స్టెన్స్‌. ఉదాహరణకు ఒక యంపీ తనకు వచ్చిన రెండుకోట్ల రూపాయల యంపీ ల్యాడ్స్‌ ఫండ్స్‌ సంగతేమిటి, అవి ఎప్పుడు ఏ విధంగా ఏఏ పనులకు ఖర్చుచేయబడ్డాయో చెప్పమని ఒక ఓటరు..ఒక పౌరుడు యంపీని అడిగితే.. అతను తప్పకుండా వివరాలను కాగితంపై లిఖితపూర్వకంగా చెప్పాలి. చెప్పకపోవడం, చెప్పననడం శాసనోల్లంఘన. ఒక కాంట్రాక్టర్‌ ఓ రోడ్డును వేస్తున్నపుడు దాని ఎస్టిమేటెడ్‌ కాస్ట్‌, అలాటెడ్‌ కాస్ట్‌, నిర్మాణం పూర్తిచేయవలసిన కాలం, ప్రమాణాల వివరాలు ఇతరేతర అమలుచేయవలసిన వివరాలన్నీ ఒక బోర్డుపై రాసిపెట్టి ప్రజల సమాచార నిమిత్తం పనిజరుగుతున్నచోట ఉంచాలి. దాన్ని ధైర్యంగా ఏ పౌరుడు ప్రశ్నించినా కాంట్రాక్టర్‌ సమాధానం చెప్పాలి…కాని యిప్పుడెవరూ ఎక్కడా అటువంటి బోర్డు పెట్టడంలేదు.. ఎవరూ అడగడం లేదు. ఎవడూ ప్రశ్నించడం ఏదు..ప్రశ్నింపబడడమూ లేదు.
అన్నీ ఉల్లంఘనలే. విస్మరణలు దబాయింపులు..బలుపు ఎక్కువైన గుండాలు, అధికారులు, మాఫియాలు అన్నీ కలిసి ప్రజాప్రయోజన చట్టాలను పీకపిసికి ఉల్లంఘించి బహిరంగంగా దౌర్జన్యం చేస్తున్నారు..ప్చ్‌…మనకెందుకులే అని ప్రతి పౌరుడూ లోలోపల ఎంత కుతకుతలాడి కుమిలిపోతున్నా ఎదిరించలేక భయంతో ఎక్కడా ధైర్యం చేసి ప్రశ్నించడం లేదు.
మనిషిని ఒక బలమైన, సజీవమైన బాధ్యతాయుతమైన ప్రశ్నగా మార్చడమే మన ఉద్యమం. మన లక్ష్యం. మన గమ్యం.
మనం ముందే ప్రకటిస్తాం..మనకు వ్యక్తిగతమైన ఆస్తులు లేవని..మున్ముందుకూడా ఉండవని. ఇప్పుడు సమకూర్చుకున్న ఆస్తులనే సంస్థను నడపడానికి నిర్మాణాత్మకంగా పనిచేస్తున్న వ్యక్తుల పోషణకోసం, నిర్వహణకు మాత్రమే ఖర్చుచేస్తాం. యిక్కడ ప్రజలకు మనం ‘నిస్వార్థం’గా పనిచేస్తున్నామని చాలా విశ్వసనీయంగా చెప్పడమే మన నిజాయితీతో కూడిన ఉద్దేశ్యం. ఎటువంటి ఆడంబరమూలేని అతిసాధారణ జీవితాన్ని గడిపి చూపడం, దిక్కుమాలిన మండలాధ్యకక్షుని స్థాయిలోకూడా గన్‌మెన్‌ను ఫ్యాషన్‌గా పెట్టుకుని అట్టహాసంగా తిరగడం ఒక ఆనవాయితీఐన వర్తమాన సందర్భంలో మనం ఎప్పుడూ ఏ ప్రత్యేక భద్రతనూ అంగీకరించం. ఐతే రేపు మనకు ఎంతమంది అభిమానులూ, అనుచరులూ ఏర్పడ్డా కొంతమంది శత్రువులుకూడా తప్పకుండా తయారవుతారు కాబట్టి రహస్యంగా డేగకళ్ళతో నిన్నూ, నన్నూ, డాక్టర్‌ గోపీనాథ్‌నూ కనుపాపలకంటే పదిలంగా కాపాడే ఒక రహస్య, మనదే ఐన ప్రత్యేక రక్షక దళం ఒకటుంటుంది. అదెప్పుడూ మనవెంటే మనతోనే కదుల్తూంటుంది అదృశ్యంగా…నిరంతరంగా.
ఐతే..ఒక యంత్రంగానీ, ఒక వ్యవస్థగానీ, ఏదీ వంథాతం దక్షత కలిగి ఆదర్శంకానట్టే ఏ వ్యవస్థగానీ పూర్తిగా సున్నా శాతం దక్షతతో, పూర్తిగా నిరర్థకంకూడా కాదు..ఈ కోణంలో ప్రస్తుతం సమాజంలోని చాలామంది జనం ఈ దుర్మార్గ, నీతిహీన రాజకీయ నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగి తాగుబోతులుగా, సోమరిపోతులుగా, పనిదొంగలుగా  మారుతున్నారో..ఆ మూలాలను విశ్లేషించుకుంటూ అయ్యో ఈ దుస్థితి నుండి ఎలా బయటపడాలి, ఈ వ్యవస్థ మళ్ళీ ఎలా  ఆరోగ్యదాయకమౌతుంది..అని తపిస్తూ, క్షోభపడ్తూ, నిజాయితీగా, బాధ్యతగా ఆలోచిస్తున్న ఒక వర్గంకూడా సమాజంలో ప్రచ్చన్నంగా ఉంది. వాళ్ళలో స్పృహ ఉంది. స్పందన ఉంది. కసిఉంది. ముందు మనం వాళ్ళను గుర్తించి మనలో కలుపుకోవాలి. లేదా మనమే వాళ్ళలో కలిసిపోవాలి.
ఈ క్రమంలో ముందు నువ్వు యుఎస్‌ఎలో ఉన్నప్పుడూ, నీతో సహ విద్యార్థులుగా నీ తత్వం తెలిసిన వాళ్ళలో ఎనిమిదిమంది మెరికల్లాంటి సహచరులను తయారుచేశావు. తర్వాత అనేక సార్లు ఇండియా వెళ్తు, ఆంధ్రదేశం విస్తృతంగా పర్యటిస్తూ ఒక స్పేడ్‌వర్క్‌వలె డాక్టర్‌ గోపీనాథ్‌గారి సంపర్కంతో మేధోసంపన్నులైన దాదాపు ఋషులవంటి నూటా ఎనభైరెండు మంది రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, రచయితలు, కళాకారులనుండి సీనియర్‌ సిటిజన్లను తయారుచేశారు. వీళ్ళందరూ ఒక్కొకరు ఒక జ్ఞాననిధి. జీవితాన్ని ఎంతో లోతుగా చూచినవాళ్ళు. సమాజంపట్ల అవగాహన కలిగిన వాళ్ళు. స్వాతంత్య్ర పూర్వ కాలంలో భారత సమాజంలో నెలకొని ఉన్న ఉన్నత మానవ విలువలు, అప్పటి నైతిక ఉజ్జ్వలత తెలిసిన వాళ్ళు. వీళ్ళందరూ మన డ్రైవింగు ఫోర్స్‌. కాగా యువతలో సరియైన ఆటిట్యూడ్‌, సమాజంపట్ల బాధ్యత ఉండాలి తప్పకుండా అన్న తత్వంగల దాదాపు ఎనిమిది వందలపైచిలుకు యువకులను మనం వివిధ విశ్వవిద్యాలయాలు, కాలేజిలు, కార్పొరేట్‌విద్యాసంస్థలు. వీటినుంచి ఎంపిక చేశాం. యిది మన కోర్‌ గ్రూప్‌. వీళ్ళందరూ బంగారం లోహం వంటివారు. వీళ్ళకు నువ్వు మన సీనియర్‌ సిటిజన్స్‌ ఫోర్స్‌ను జోడించి లోహాన్ని అగ్ని స్పర్శతో, సుత్తిదెబ్బతో ఆభరణంగా మార్చినట్టు ఒక శక్తివంతమైన మానవ సంపదగా మార్చాలి. తర్వాత వీళ్ళందరూ అతి సాధారణ జనాన్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఉద్యమంగా చేపడ్తారు. ఈ కార్యమ్రం ఒక అగ్నిజలవలె అంటుకుని విస్తరిస్తున్న థలో నువ్వు మన కార్యాచరణ ప్రణాళికలో అనుకున్నట్టుగా మీడియా..ప్రభుత్వంలో కూడా మనం ఈలోగా గుర్తించగలిగిన నిజాయితీగల ఆఫీసర్స్‌, అధికారులతో కలిసి యిక ‘ప్రక్షాళన’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. యింతవరకు ప్రభుత్వ యంత్రాంగంలో ఐఎఎస్‌ స్థాయిలో పూర్తిగా పారదర్శకత, నీతి నిజాయితీ కలిగిన అధికారులు ఒక్క ముప్పదిరెండుమంది మాత్రమే ఉన్నారు. ఎస్పీలు పన్నెండుమంది మాత్రమే. ప్రభుత్వ యంత్రాంగంలో కరప్షన్‌ తారాస్థాయికి చేరిఉంది. ప్రతిరోజూ టి.విలో చూస్తున్నట్టు ఏ ఒక్క పట్టుబడ్డ అధికారిపై దాడిచేస్తేనో కోట్లు దొరుకుతున్నాయి. పట్టుబడకుండా, దాడికి గురికాకుండా తప్పించుకు తిరుగుతున్న లంచగొండి మహానుభావులు దేశంనిండా అన్ని ప్రభుత్వ శాఖల్లో కిక్కిరిసి ఉన్నారు. యిక ప్రక్షాళన ప్రారంభంకావాలి.
ఐతే.. యిక్కడ అతి ప్రధానమైన అంశం స్త్రీ, పురుష లింగ భేదం లేకుండా ఏ పౌరుడైనా లంచం తీసుకోవడం ‘తప్పు’ అనే స్పృహ లేకపోవడం. ఒకర్ని చూచి ఒకరు ఎటువంటి భయమూ లేక అవకాశముంటే చాలా తెగబడి దోచుకోవడమే. దానికి ప్రజాప్రతినిధుల అండ నిండుగా, దండిగా ఉంది. ఎందుకంటే వీడికి వాడు వానికి వీడు పరస్పరం అండ. ఒక రెసిడెన్షియల్‌ కాలేజి మహిళా ప్రిన్స్‌పాల్‌ లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్తుంది. ఒక మహిళా ఉద్యోగి నకిలీ పోస్టల్‌ స్టాంపులమ్ముతూ పట్టుబడ్తుంది. సరసాదేవి కోట్లకు కోట్లుస్కాం చేసి పట్టుబడ్తుంది. రోడ్లు భవనాల శాఖ క్వాలిటీ కంట్రోల్‌ చేయవలసిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఇష్టమొచ్చినట్టు నాసిరకం పనులు చేసినా లక్షలకు లక్షల లంచాలు మెక్కి పెండ్లాం పేర తనే బినామీ కాంట్రాక్టులు చేస్తూ, బార్లు నడుపుతూ పట్టుబడ్తాడు, ఎసిబిలో పనిచేసే ఉద్యోగే అవినీతితో లంచంతీసుకుంటూ దొరికిపోతాడు. హైకోర్టు జడ్జీలు కొందరు మ్యామ్యా తిని ఎవనికైనా బెయిల్‌ మంజూరు చేస్తారు..న్యాయరక్షకులుగా ఉండవలసిన కొందరు జడ్జీలను రెడ్‌హ్యాండ్‌గా పట్టుకుని సుప్రీంకోర్టు ఆదేశించిన ఉదంతాలు కోకొల్లలు.. యిన్ని కేసులు ప్రతిదినమూ వెలుగులోకి వస్తూంటే ప్రభుత్వం మొద్దునిదురలో ఉందిగాని..చట్టం తనపని తాను చేసుకుపోతుందనే బుద్దిహీనమైన ఒక మాట చెప్పడం తప్పితే ఎప్పుడూ కఠినమైన క్రమశిక్షణాచర్యలు చేపట్టిన ఉదంతాలు లేనేలేవు. ఈ ఉదాసీనత వల్ల.. ప్రభుత్వంకూడా ఈ లంచగొండితనంలో భాగం కావడంవల్ల వ్యవస్థ అంతా నిర్వీర్యమై, అసమర్థమై, ఒట్టి శవప్రాయమై మిగిలిపోయింది. ఈరకంగా పట్టుబడ్డ వాళ్ళంతా తర్వాతర్వాత గుట్టుచప్పుడు కాకుండా మళ్ళీ విధుల్లోచేరి ఏరియర్స్‌తో సహా జీతాలను పొంది మళ్ళీ మళ్ళీ లంచాలు మెక్కుతున్నారు. అలా మళ్ళీ విధుల్లోచేరి తిరిగి రేచుకుక్కల్లా ఎగబడి దోచుకుతింటున్నవాళ్ళ వివరాలు తెలిస్తే గుండెలవిసిపోతాయి. యంత్రాంగమంతా పూర్తిగా చెదలుపట్టిపోయింది రామం.. ప్రజాధనమంతా ఈ పందికొక్కులపాలై వ్యవస్థ రోగగ్రస్తమైంది. యుద్ధప్రాతిపదికన ఈ అవినీతినీ, లంచగొండితనాన్నీ
రూపుమాపేందుకు ఒక ఉద్యమాన్ని అత్యవసరంగా నిర్మించాలి. ప్రభుత్వాలకు ఫండ్స్‌ ఎక్కడినుండి ఎన్నివచ్చినా దొంగలు దొంగలు పంచుకుని దండుకున్నట్టే మరుక్షణంలో మటుమాయం..ఇలా ఐతే ఎలా అని బుద్ది జీవులందరూ హడలిపోయి అవాక్కయిపోతున్నారు. లక్షలకోట్ల రూపాయలను ప్రపంచబ్యాంక్‌, ఐఎమ్‌ఎఫ్‌ వంటి సంస్థలనుండి అనేకానేక అభివృద్ధి పనులకోసమని అప్పుచేసి వాటాల వారిగా పంచుకోవడమే నిస్సిగుగా అర్థంచేసుకుంటూనే.. దేశాన్నంతా పర్యటిస్తూ ప్రజల స్థితిగతులను అధ్యయనం చేస్తున్న రాహుల్‌గాంధీకూడా ఒక సందర్భంలో ఈ దరిద్రపు లంచగొండితనపు తీవ్రతను గ్రహించి ప్రభుత్వ పథకాలనుండి ఒక రూపాయి విడుదలైతే అది ఐదు పైసలుగా లబ్దిదారులకు చేరుతోందని వాపోయాడు. ఇది ఈనాటి అడ్డూ అదుపూ లేని అవినీతి సామ్రాజ్యపు ముఖచిత్రం. యిక చదువుకున్న పౌరులు చేస్తున్న అకృత్యాలకైతే లెక్కేలేదు. ఎవడైనా టాక్స్‌లు ఎగ్గొట్టేవాడే. ప్రభుత్వరూల్స్‌లో ఉండే లొసుగులను వాడుకుని బొక్కసాన్ని ఖాళీచేసేవాడే. వ్యాపారాల్లో నిస్సిగ్గుగా ప్రభుత్వాన్నీ, ప్రజలనూ దగా చేసేవాడే. దేశంలో వాటర్‌ప్రైస్‌ కూపర్‌వంటి అంతర్జాతీయ ఆడిటర్ల నుండి మొదలుపెడ్తే స్థానిక ఆడిటర్లందరూ ప్రభుత్వ అధికారులకు బ్రోకర్లే తప్ప నిజాయితీగా లెక్కలను అప్పజెప్పేవారేలేరు. ‘ఆరోగ్యశ్రీ’ వంటి పథకాలద్వారా డాక్టర్లందరూ ప్రజాధనాన్ని భోంచేసేవారే.. వీడు వాడని, స్త్రీ పురుషుడని తేడా లేకుండా దేశాన్ని ప్రతివాడూ దోచుకుతినడమే. ఇదొక విరాట్‌స్వరూపమై వికృత విలయతాండవం చేస్తోంది. దీన్ని అర్జంటుగా అరికట్టాలి. ఫస్ట్‌ ప్రయారిటీ మనకిదే.” క్యాథీ చెబుతున్నప్పుడు గొంతులో ఆవేశం, బాధ, దుఃఖం..అన్నీ కలగలిసి ఆదోరకమైన జీర స్పష్టంగావినబడ్తోంది..పాపం, పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయి గిలగిల్లాడుతున్న భారత వ్యవస్థపట్ల వేదన ధ్వనిస్తోందామెలో.
రామం అన్నాడు..”నువ్వన్నట్టు యిది ఒక మహాపర్వతంలా పెరిగి వ్యాపించిన రుగ్మత క్యాథీ.. దీన్ని తెలుసుకుని నిర్మూలించేందుకు ఒక సుళువైన మార్గముంది..యిక్కడ ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజలకు జవాబుదారీ ఐన ప్రభుత్వ ప్రతినిధి.. ప్రజాప్రతినిధి అంటే ప్రజలపక్షాన ప్రభుత్వాన్నీ, ప్రభుత్వాధికారులనూ న్యాయంకోసం, ప్రజావసరాలకోసం ప్రశ్నించి ప్రజోపయోగమైన సంక్షేమ కార్యక్రమాలను చేయించవలసినవాడు. ఈ రెండు వ్యవస్థలూ ఇంటర్‌ డిపెండెంట్‌గా కలిసి ముందుకు సాగాలి న్యాయంగా ఒకరిని ఒకరు చెక్‌ చేసుకుంటూ ప్రజల ప్రగతికోసం పాటుబడాలి. కాని వాస్తవంలో అలాకాకుండా ఈ ఇద్దరూ ఇద్దరు కుమ్మక్కయిన దొంగల్లా కంచే భూమీ ఒకటై చేనును తిన్నట్టు తెగబడ్డారు. ది ఈజీ ఫార్ములా ఈజ్‌.. ఒక వ్యక్తి.. ఒక ప్రభుత్వ అధికారి లేదా ఒక ప్రజా ప్రతినిధి, లేదా ఒక ఆడిటర్‌, డాక్టర్‌, ఐఎఎస్‌, ఐపిఎస్‌ ఉద్యోగి వంటి వ్యక్తి..వీళ్ళ ఒక పదిసంవత్సరాల కాలాన్ని తీసుకుని..మొదట్లో వాళ్ళ ఆస్తిపాస్తులెన్ని..వీళ్ళు ప్రతిసంవత్సరం ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు సబ్‌మిట్‌ చేస్తున్న రిటర్న్‌లో ఎంత ఆదాయం చూపుతున్నారు..ప్రస్తుతం వీళ్ళ దగ్గర అనధికారికంగా పోగుపడ్డ ఆస్తుల విలువెంత..వీటి తేడాఎంత..ఆ తేడాను ప్రభుత్వం ఏక్షణాన్నైనా స్వాధీనం చేసుకోవచ్చు.. అని అనుకుంటే.. యిక ఆలోచించు..ఎన్ని..ఎన్ని లక్షల కోట్ల రూపాయలు బైటికొస్తాయో. ప్రభుత్వం నిజాయితీగా ఉండి జనానికి..ఐచ్ఛికంగా మీరే మీ నల్లడబ్బును డిక్లేర్‌ చేయండి లేకుంటే కఠినాతి కఠినమైన శిక్ష ఉంటుందని ఒకరోజును డెడ్‌లైన్‌గా ప్రకటిస్తే బయటికొచ్చే డబ్బుతో ఈ దేశపు రోడ్లన్నీ నిండిపోతాయి. డబ్బు వెల్లువై పారుతుంది. ఐతే ఇది సాధ్యంకాదు. దీన్నే మనం సాధ్యం చేయాలి. ఏ పొలిటికల్‌ గవర్నమెంట్‌కూడా ఈ రకంగా ప్రవర్తించదు. ఎందుకంటే యిక్కడి రాజకీయవ్యవస్థ ‘ఇంటర్‌ డిపెండెంట్‌’. ముఖ్యమంత్రిని పార్టీ నామినేట్‌ చేస్తుంది. ప్రధానమంత్రిని పార్టీ నియమిస్తుంది. పార్టీ ఎమ్యెల్యేలను, ఎంపీలను తృప్తిపర్చేందుకు దిక్కుమాలిన సహాయాలపేరుతో దోపిడీకి పర్మిషనిస్తుంది. యిక విషప్రవాహం ప్రారంభమై దేశాన్ని ముంచెత్తుతుంది. అందుకే కీలక పదవులకు అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రివంటి స్థానాలకు ప్రజలచే ప్రత్యక్షెన్నిక జరిగితే వెనుకఉండి కీలుబొమ్మను ఆడించే తరహా రాజకీయాలుండవు. స్థిరత్వముంటుంది. దేశగతి అటో ఇటో తేలిపోతుంది”. అని సాలోచనగా ఓ క్షణమాగి..”చూద్దాం..మనమేమి చేయగలమో..” అన్నాడు.
”ఇంకో విషయముంది రామం..అమెరికానుండి మొదలుకొని ఏ యితర దేశాల న్యూస్‌ ఛానల్స్‌నైనా గమనించు.. కొద్ది రాజకీయాలు ఉంటాయి. మిగతా అంతా రిపోర్టింగు ఉంటుంది. ఎడ్యూకేటివ్‌ ప్రసారాలు ఉంటాయి తప్ప.. ఈ తెలుగు ఛానల్స్‌లో ఉన్నట్టు ఇరవై నాల్గుగంటలు రాజకీయాలే ఉండవు. మీడియా కూడా అనవసరంగా పొద్దస్తమానం కుక్కల కొట్లాటను తలపించే చర్చలపేరుతో, వేదికలపేరుతో, ప్రతిస్పందనలపేరుతో, లైవ్‌ టెలికాస్ట్‌పేరుతో రాజకీయాలు..రాజకీయాలు. రాజకీయాలగురించే ఊదరగొట్టీ అదరగొట్టే ప్రజాజీవితాలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రజలను ప్రయోజకులుగా తీర్చిదిద్దే దిశలో శక్తివంతమైన మీడియా ప్రయత్నంచేయడంలేదు సరికదా అనవసరంగా మామూలు జనజీవితాల్లోకి చొరబడి మానసిక అనారోగ్యకారకాలైన ప్రసారాలతో కాలుష్యం స్పష్టిస్తోంది.. ఒకసారి మీడియాతో జనం తరపున మాట్లాడి బ్రహ్మస్త్రాన్ని బ్రహ్మస్తంగానే వాడాలన్న స్పృహను కల్గించవలసిన అవసరముంది. లేకుంటే ప్రజోపయోగమైన న్యూస్‌ ఛానల్‌ ఎలా ఉండాలో చూపించేందుకు ఒక నమూనాగా మనమే ఒక వార్త ఛానల్‌ను ప్రారంభించాలి.. అది అవసరమేమో అనిపిస్తోంది.” అంది క్యాథీ.
”ఔను..”
”ఇక మన ఈనాటి సమావేశం ముగింపుకొచ్చింది రామం..ఈ సందర్భంగా రెండు ముఖ్య విషయాలు..ఒక మేనేజ్‌మెంట్‌ వ్యక్తిగా చెప్పాలి..”అంది క్యాథీ గంభీరంగా..కొద్దిగా ప్రకంపిస్తూ పూర్తిగా వ్యక్తిగతమైన సంస్పందనతో.
”చెప్పు క్యాథీ..”
”ఎందుకు కలిశామో మనం తెలియదు. ఈ భూమిపై ఎక్కడెక్కడో భిన్న ఖండాల్లో జన్మించిన మనం చాలా యాదృచ్ఛికంగా తటస్థపడి ఒకరి హృదయాన్ని ఒకరం అర్థం చేసుకుంటూ ఏకరీతి ఆలోచనా ధోరణివల్ల..బహుశా అనుకుంటూ..మార్క్స్‌ అండ్‌ ఎంగెల్స్‌ వలె..సన్నిహితమై, ఒకరికోసమొకరిమై, ఇద్దరమూ ఒకరేమోకూడా ఐ ప్రేయసీ ప్రియుడు, భార్యాభర్త, స్నేహితులు, ఆత్మీయులు, ఆత్మబంధువులువంటి పదనిర్వచనాలన్నింటికీ అతీతంగా ఎదిగి ఒక అపూర్వబంధంలో ఒదిగి జీవితాన్ని ఓ మహత్తర అనుభవంగా మలచుచున్నాం..ఐతే దీనికి సామాజిక నియమాల అంగీకారం లేదు. ఉండదు. నా దృష్టిలో అవసరంకూడా లేదు. యిది కేవలం నీకూ, నాకూ మాత్రమే సంబంధించిన హృదయానుగత బాంధవ్యం. దాన్ని మనం ఎంత పవిత్రంగాపదిలంగా కాపాడుకుంటాం, పరిరక్షించుకుంటాం అనేది మన వివేకంపై ఆధారపడి ఉంటుంది. నా తరపున సహజమైన స్త్రీ సహనశీలతతో భూమిలా నేను ప్రవర్తిస్తా. నువ్వు విశాల హృదయంతో భూమినికూడా రక్షణకవచంలా అవరించిఉండే ఆకాశంలా నన్ను నీలో దాచుకోవాలి. నిజానికి పంచభూతాత్మకమైన ఈ చరాచర విశ్వంలో స్థూలంగా భూమీ, ఆకాశం వేర్వేరు కావచ్చు.. కాని సూక్ష్మంగా అవన్నీ ఒకటే.. అదే జీవితం..”
”……” శూన్యంగా ఆమెవంక చూస్తున్నాడు రామం.
”……” ఆమెకూడా శూన్యంగానే అతన్ని చూస్తోంది
‘పూర్ణమదః పూర్ణమిదః’.. ఎక్కడ్నో యిద్దరి ఆత్మల్లో ధ్వనిస్తోంది.
కలయిక నిమిత్తం..జీవితం సత్యం.
నడవడం సత్యం..దూరం మిథ్య
ఉదయం జననం..అస్తమయం మరణం
విచ్ఛిత్తి, సమ్మేళనం..స్థిరఅస్థిరాలు..అన్నీ జీవవ్యాపారాలు
విముక్తి అంతిమం.
”క్యాథీ నువ్వు ఆత్మవు..నేను శరీరాన్ని” అన్నాడు రామం.
”నాకు తెలుసు..కాని నీ నోట వినాలని పిచ్చికోరిక”
వర్షం బయట ఇంకా కురుస్తూనే ఉంది. ఫెళాఫెళార్భటులతో ఎక్కడో చటుక్కున పిడుగు పడింది. ఉలిక్కిపడ్డారిద్దరూ.
క్యాథీ బ్రీఫ్‌కేసును సర్దుకుని..లేచి నిలబడి..టైం చూచుకుంది.
పదీ పది.
”సి యు.. సి యు రామం” బయటికి నడిచిందామె.
యిక ఈ గదినుండి వెలుగు నిష్క్రమిస్తోంది..తర్వాతంతా ఒక వెలితి విస్తరిస్తుంది అనుకున్నాడు. కాని బయటికేమీ అనలేదు. నిండుగా, లిప్తంగా నవ్వాడు.
ఆమె చినుకుల్లో గబగబా నడచి వెళ్లి తన ఆడి కార్లో కూర్చుని స్టార్ట్‌ చేసింది.
కారు కదుల్తూండగా..రామం చేయూపాడు. కాని అది ఆమెకు కనిపించలేదు. వర్షం చినుకులు అడ్డొచ్చాయి.
కారు వీధిమలుపు తిరుగుతూండగా..రిక్తమైన హృదయంతో నిట్టూర్చి..ఎందుకో కళ్ళనిండా నిండిన సన్నటి నీటిపొరను స్పృహించకుండానే..ఆమె మనసునిండా పరుచుకున్న రామం స్మరణలో నిమీలితయై ఎక్కడనుండో..అంతరాంతరంగాల్లోకి వినిపిస్తున్నట్టుగా.,
‘రామం నిశాచర వినాశకరం..’
కారు వేగంగా ఫ్రెడరిక్‌ రోడ్‌పై ఇంటర్‌స్టేట్‌ 249పై వెళ్తూ వేగాన్నందుకుంది.

***

(సశేషం)

ramachandramouli–రామా చంద్రమౌళి

Download PDF

3 Comments

  • SUMA says:

    E KKADINUNCHI EKKADIDAKA PERE VERAITYGA VUNDI STORY VISHAYA PARIGNANAM
    KALIGISTOO INTEREST PENCHUTONDI VERY NICE WRITER CHANDRA MOULI GARIKI
    MANY MANY THANKS

    SUMA

    MANIKONDA

  • Dr.Syamala says:

    ”ఒక ఏడాది కాలంలో మనం పదకొండుసార్లు కలుసుకున్నాం. కలుసుకున్న ప్రతిసారీ మన మధ్య ఒక మౌన సంభాషణ జరిగేది. నాకైతే గత ఎన్నో జన్మల నుంచి మన మధ్య ఓ అపూర్వమైన, ఈ సైన్స్‌కు అందని అదృశ్య అజ్ఞాత బంధముందని అనిపించేది. మొట్టమొదటిసారి ఎంతో ధైర్యంచేసి, భయంభయంగా నిన్ను ఓ రోజు రాత్రి ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు డిన్నర్‌కు ఆహ్వానించాను. అది జూలై ఎనిమిదవ తేది. నేను తెలుగు నేర్చుకునేందుకు కొన్ని పుస్తకాలు కావాలని అడిగాను. నువ్వు నవ్వి తెలుగు నేర్చుకోవడం అంత అవసరమా అని అన్నావు..నేను ఔనన్నాను. ఆశ్చర్యంగా మూడురోజుల్లో ఇరవై ఎనిమిది తెలుగు పుస్తకాలను భారతదేశంనుండి తెప్పించి ఇచ్చావు. తద్వారా నా పట్ల నీకున్న శ్రద్ధ అర్థమైంది.”
    ఇది క్యాథీ అనే పాత్ర రామంతో అన్న మాట.ఇద్దరు వ్యక్తుల నడుమ ఎంత సున్నితంగా బంధం బలమై మిగులుతుమ్దో..మౌళి గారు తన పదునైన సంభాషణలతో పలికిస్తారు.గ్రేట్.అభినందనలు.
    ఒక మంచి నవలను అందిస్తున్నందుకు సంపాదకులకు కృతజ్ఞతలు .

    – డా .శ్యామల.కె.హైదరాబాద్.

  • SUPRIYA says:

    EE NAVALALO PATRALA RNANAVA VIVARANA MATALU BAGANACHAYI BAVUNDI

    SUPRIYA
    VIZAG

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)