చరిత్ర మిగిల్చిన మల్లబంధుల జ్ఞాపకాలు !

Prasenajit_of_Kosala_Pays_a_visit_to_buddha

కోసలను ప్రసేనజిత్తు పాలిస్తున్నాడు. పసనేది అనే దేశినామానికి ప్రసేనజిత్తు సంస్కృతీకరణ. కోసలను పాలించిన పూర్వరాజులందరూ ఇక్ష్వాకు వంశీకులు.  కనుక తనను కూడా ఇక్ష్వాకు వంశీకునిగా పసనేది చెప్పుకునేవాడు. కానీ నిజానికి అతడు ఆదివాసుల్లోనూ ఓ కింది తెగకు చెందినవాడు. దానిని ‘మాతంగ’కులంగా చెబుతారు. అదే ఇప్పుడు ‘మాంగ్’ అని పిలిచే ఓ ‘అస్పృశ్య’కులం. అతని భార్యపేరు మల్లిక. ఆమె ఒక తోటమాలి కూతురు.

తనను పసనేది ఇక్ష్వాకు వంశీకునిగా చెప్పుకున్నా బ్రాహ్మణులు అతనికి ఆ గుర్తింపును ఇవ్వలేదు. అతనిని వ్రాత్య క్షత్రియుడనీ, క్షత్రబంధుడని మాత్రమే అన్నారు. ఇవి నిమ్నలేదా న్యూనార్థకాలు. అధికారస్థానంలో, లేదా సైనికవృత్తిలో ఉన్నప్పటికీ వైదిక ఆచారాల పరిధిలోకి రానివారినీ, వాటిని పాటించనివారినీ వ్రాత్య క్షత్రియులనీ, క్షత్రబంధులనీ అనేవారు. ఇటువంటివారు అధికారం చేజిక్కుంచుకున్నప్పుడు సాంప్రదాయిక క్షత్రియుడన్న గుర్తింపుకు, బ్రాహ్మణుల గుర్తింపుకు పాకులాడేవారు. యజ్ఞయాగాలు చేసేవారు. బ్రాహ్మణులకు గ్రామాలు దానం చేసేవారు. క్షత్రియులుగా తమకంటే ఎక్కువ గుర్తింపు ఉన్న తెగతో వివాహసంబంధం పెట్టుకోవాలని అనుకునేవారు.

పసనేది కూడా అలాగే అనుకుంటున్నాడు…

అదే కాలంలో మగధను బింబిసారుడు పాలిస్తున్నాడు. అతను కూడా పసనేది లానే నిమ్నకులస్తుడు. పురాణాలు అతనిని శిశునాగవంశీకుడన్నాయి. నాగ శబ్దం వైదిక పదం కావడానికి అవకాశం లేదు. అది ఆదివాసీ తెగ సంబంధాన్ని సూచిస్తుంది. లేదా బింబిసారుడు నాగజాతి ఆచారాలను పాటించేవాడని సూచిస్తుంది. మగధ రాజధాని రాజ్ గిర్ లో బుద్ధుడి కాలానికి ముందునుంచీ నాగజాతీయుల ఆరాధనకు, ఆచారాలకు అంకితమైన గుడి ఒకటి ఉండేది. శిశునాగవంశీకులను బ్రాహ్మణులు క్షత్రబంధులుగానే గుర్తించారు. బింబిసారునికి ప్రత్యేకంగా ‘సేనీయ’ అనే బిరుదు కూడా ఉంది. ఏ తెగతోనూ సంబంధం లేని శాశ్వత సైన్యాన్ని కల్పించుకున్న తొలిరాజు అతడేనని ఆ బిరుదు సూచిస్తుంది.

పసనేది, బింబిసారుడు మంచి మిత్రులు. పసనేది సోదరిని బింబిసారుడికి ఇవ్వడం ద్వారా వారి మధ్య బంధుత్వం కూడా ఏర్పడింది. పసనేది పుట్టింటి అరణంగా కాశీ ప్రాంతంలోని ఒక గ్రామాన్ని సోదరికి ఇచ్చాడు.

   ***

732px-Ancient_india

ఇప్పుడు మల్ల తెగ దగ్గరికి వెడదాం. ఆ తెగలో అందరికంటే యుద్ధవిద్యలలో ఆరితేరిన యువకుడు ఒకడు ఉన్నాడు. అతని పేరు మల్లబంధుల. అతని ప్రేయసి పేరు కూడా మల్లికే. ఆమెకు కూడా యుద్ధవిద్యలలో శిక్షణ ఉంది. మల్లబంధుల ఎంతటి వీరుడో అంతటి సున్నితహృదయుడు. అతను తన తెగ స్వాతంత్ర్య పరిరక్షణకు అంకితమైన వ్యక్తి కూడా. తెగ పరిధిలో జీవించే మల్లబంధులకీ, తెగ పరిధిని దాటిపోయిన పసనేదికీ మధ్య స్నేహం ఉంది. వారిద్దరూ ఒకచోటే యుద్ధవిద్యలు అభ్యసించారు.

అలా ఉండగా, మల్ల తెగ నాయకుడు తను నాయకత్వం నుంచి తప్పుకుని ఒక యువకుడికి నాయకత్వం అప్పగించాలనుకున్నాడు. అతని దృష్టిలో మల్లబంధుల ఉన్నాడు. తెగను సమావేశపరిచాడు. తన మనసులో మాట బయటపెట్టాడు. అయితే, అధిక సంఖ్యాకుల ఆమోదం ఉంటేనే మల్లబంధుల నాయకుడు అవుతాడని కూడా అన్నాడు. అప్పటికప్పుడు ఎన్నికకు ఏర్పాటు జరిగింది. అధికసంఖ్యాకులు మల్లబంధులవైపు మొగ్గు చూపారు.

అయితే, కొంతమంది మాత్రం ఒక అభ్యంతరం లేవదీశారు. మల్లబంధుల నిస్సందేహంగా వీరుడు, నాయకత్వానికి అర్హుడే; కానీ అతని శక్తిని పరీక్షించకుండా నాయకత్వం అప్పగించడం సమంజసం కాదన్నారు. తెగ నాయకుడు ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడు ఒక పరీక్షను నిర్ణయించారు. ఏడు కొయ్యదుంగలను వరసగా పాతతారు. ఆ ఏడింటినీ మల్లబంధుల ఒక్క వేటుతో నరకాలి!

పరీక్షను మరుసటి వారానికి వాయిదా వేసి తెగ నాయకుడు సమావేశం చాలించాడు.

మరుసటి వారం మళ్ళీ సమావేశమయ్యారు. ఏడు కొయ్యదుంగలు వరసగా పాతబడి ఉన్నాయి. అంతా ఉత్కంఠతో ఊపిరి బిగపెట్టుకుని  మల్లబంధులనే చూస్తున్నారు. వారిలో అతని ప్రేయసి మల్లిక కూడా ఉంది. చాలామంది చూపుల్లో మల్లబంధుల పట్ల అభిమానం, ఆరాధన ఉట్టిపడుతున్నాయి. కొంతమంది చూపుల్లో ఈర్ష్య, తృణీకారభావమూ వ్యక్తమవుతున్నాయి. తెగనాయకుడు పరీక్షా ప్రారంభాన్ని సంకేతించాడు. మల్లబంధుల లేచి నిలబడ్డాడు. అతని చేతిలో మెరుస్తున్న కరవాలం. ఏడు కొయ్యదుంగలను సమీపించాడు. మెరుపు వేగంతో అతని కరవాలం అయిదు దుంగల్ని అడ్డంగా నరికింది. విచిత్రం, రెండు దుంగలు అలాగే ఉండిపోయాయి. మల్లబంధులను నిలువునా వెక్కిరించాయి. సిగ్గు, అవమానాలతో అతని తల వాలిపోయింది. ముచ్చెమటలు పట్టాయి. స్థాణువులా నిలబడిపోయాడు.

జనం లోంచి మోసం, మోసం అన్న కేకలు వినిపించాయి. తెగ నాయకుడు కూడా మోసం జరిగిన సంగతిని గ్రహించాడు. కొద్ది సేపు సభ నిశ్శబ్దంగా, గంభీరంగా ఉండిపోయింది.

అవును, మోసం జరిగింది. మల్లబంధుల కూడా ఆ సంగతి గ్రహించాడు. ఒక దుంగ దగ్గర, బహుశా ఆరో దుంగ దగ్గర తన ఖద్గానికి ఏదో కఠినంగా తగిలింది. ఖణేలుమన్న శబ్దం కూడా వినిపించింది. ఆ శబ్దం జనంలో కూడా చాలామందికి వినిపించే ఉంటుంది. ఎవరో ఆరో దుంగలో ఓ ఇనప కడ్డీని చొప్పించారు! ఎవరు వారు…?

తనంటే పడనివారు ఉన్నారని మల్లబంధులకు తెలుసు. కానీ వాళ్ళు ఇంతటి అన్యాయానికి ఒడిగడతారని అతడు అనుకోలేదు. ఇది అతనికి సరికొత్త గ్రహింపు. తెగజనంలో అసూయా, ద్వేషాలు బుసకొడుతున్నాయి. అవి తెగ ఐక్యతను విచ్ఛిన్నం చేసే స్థాయికి పెరుగుతున్నాయా? తెగ వినాశనానికే దారి తీయించేలా ఉన్నాయా? మల్లబంధులను ఇప్పుడు బాధిస్తున్నది తన ఓటమి కాదు, తెగజనంలో పెరుగుతున్న ఈర్ష్యాద్వేషాలు!

మల్లబంధుల ఇలా ఆలోచనలలతో సతమతమవుతుండగానే, తెగనాయకుడు లేచి జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మోసం జరిగిందని ప్రకటిస్తున్నాడు. విచారణ జరుపుతామని అంటున్నాడు. మరోసారి పరీక్ష ఏర్పాటు అవుతుందని చెబుతున్నాడు…

మల్లబంధులకు ఈ చివరి మాటలే వినిపించాయి. మరోసారి పరీక్షను ఏర్పాటు చేస్తారని అతనికి తెలుసు. కానీ అతడు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాడు. తెగ విచ్ఛిత్తికి దారి తీసే ఈర్ష్యాద్వేషాలకు తను లక్ష్యం కాకూడదు. తను అడ్డు తొలగితేనైనా తెగ ఐక్యత నిలబడవచ్చు. ఇప్పుడు తను చేయవలసింది అదే!

ఆరోజు రాత్రి మల్లబంధుల, మల్లిక ఏకాంతస్థలంలో కలసుకున్నారు. మల్లబంధుల తన ఆలోచన చెప్పాడు. తెగను విడిచి పెట్టి రేపు ఉదయమే నా ప్రయాణం అన్నాడు. నువ్వు నాతో వచ్చేదీ లేనిదీ నువ్వే ఆలోచించుకో అన్నాడు. నా చివరి ఊపిరివరకూ నీతోనే అని మల్లిక చెప్పింది.

మరునాటి ఉదయమే మల్లబంధుల, మల్లిక గమ్యం తెలియని ప్రవాస జీవితానికి సిద్ధమై తెగ కేంద్రాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయారు. వీరుడైన మల్లబంధుల జ్ఞాపకాలే తెగవారికి మిగిలాయి.

    ***

పసనేదికి రాజ్యముంది. రాజ్యభోగాలు అనుభవించడానికి తగిన వయసు ఉంది. కానీ లేనిది ఒకటే…అది, సుక్షత్రియుడన్న గుర్తింపు. తను నిమ్నకులస్థుడన్న చింత అతని హృదయాన్ని ముల్లులా బాధిస్తోంది. తనను ఉద్దేశించి బ్రాహ్మణులు వ్రాత్య క్షత్రియుడనీ, క్షత్రబంధుడనీ అనడం అతని చెవులకు శూలంలా తగులుతోంది. వారి మెప్పుకోసం ఏం చేసినా ఆ మరక పోవడం లేదు.

తన పుట్టుకను ఇప్పుడు దిద్దుకోలేడు. కనీసం ఓ క్షత్రియకన్యను పెళ్ళాడితేనైనా తన హోదా పెరుగుతుందా? తన వారసుడికైనా తగిన గుర్తింపు దొరుకుతుందా?….

అతని ఆలోచనలు శాక్య తెగవైపు మళ్ళాయి. శాక్యులను కూడా వ్రాత్యక్షత్రియులనే అన్నారు. కాకపోతే తమ కంటే వారి స్థాయి చాలా ఎక్కువ. వారు కూడా తమను ఇక్ష్వాకు వంశీకులుగానే చెప్పుకుంటారు. అయితే, వారిప్పుడు తన అధికారం కింద ఉన్నారు. వారి జీవన్మరణాలు పూర్తిగా తన చేతుల్లోనే ఉన్నాయి. శాక్య గౌతముడు తన ఈడువాడే. అతని వల్ల శాక్య తెగ ప్రసిద్ధినే కాదు, విశేషమైన గౌరవ మర్యాదలనూ పొందుతోంది. శాక్య ప్రముఖుడైన మహానామశాక్యుడికి యుక్తవయసు వచ్చిన ఆడపిల్ల ఉందని తను విన్నాడు. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని అడిగితే?!

మహానామ శాక్యుడు తన ప్రతిపాదనను కాదనే సాహసం చేయలేడని అతనికి తెలుసు. ఆలోచించిన కొద్దీ ఇదే ఉత్తమమని అతనికి తోస్తూవచ్చింది. ఓ రోజున మహానామశాక్యుడికి కబురు పంపించాడు.

పసనేది ప్రతిపాదన విన్న మహానామశాక్యునికి తలకొట్టేసినట్లయింది. నోట మాట రాలేదు. ఒప్పుకుంటే అవమానం. ఒప్పుకోకపోతే ప్రాణ గండం. తనొక్కడికే కాదు, మొత్తం తెగకు! అతని మౌనాన్నే అంగీకారంగా తీసుకుని వచ్చినవాళ్లు వెళ్ళిపోయారు. పసనేది కోరికను కాదనే ధైర్యం శాక్యులకు లేదని వారికి తెలుసు.

మహానామశాక్యుడు ఈ సంగతి మిగిలిన తెగపెద్దలకు చెప్పాడు. వాళ్ళు కూడా నిశ్చేష్టులయ్యారు. పసనేదికి పోయే కాలం వచ్చింది, శాక్యుల ఆడబడుచును తనకిమ్మని అడుగుతాడా అని ఆవేశపడ్డారు. అయితే, అంతలోనే వెనక్కి తగ్గారు. ఆవేశపడినందువల్ల ప్రయోజనం లేదని వారికి తెలుసు. పసనేది తలచుకుంటే, చీమల బారును నలిపేసినట్టు శాక్య తెగను నలిపేయగలడు. కనుక అతని ఆదేశానికి తలవంచుతూనే పరువు నిలుపుకునే ఉపాయం చూడాలి! ఆ ఉపాయం ఏమిటి?!

అప్పటికే మహానాముడికి ఒక ఆలోచన తట్టింది. అతనికి క్షత్రియ భార్యవల్ల కలిగిన కూతురే కాక, ఆదివాసీ తెగకు చెందిన నాగముండ అనే దాసికి పుట్టిన కూతురు కూడా ఉంది. ఆమె కూడా మంచి అందగత్తె. పేరు, వాసభ ఖత్తియ. ఆమెనే క్షత్రియకన్యగా చెప్పి పసనేదికి ఇచ్చి పెళ్లిచేస్తే?! పసనేదికి ఈ సంగతి తెలియడం అసంభవం. ఈ రహస్యం తెగలోనే ఉండిపోవాలి. ఇది ఏ ఒకరిద్దరికోసమో కాదు, మొత్తం తెగ క్షేమం కోసం. మహానాముడు తన ఆలోచనను తెగ పెద్దల చెవిన వేశాడు. వారికి కూడా ఇదే మెరుగైన ఉపాయం అనిపించింది. ఆమోదముద్రవేశారు.

పసనేది, వాసభ ఖత్తియల పెళ్లి జరిగిపోయింది.

***

పసనేది రాజ్యాన్ని మరింత బలోపేతం చేసుకుని విస్తరించుకునే ప్రయత్నంలో పడ్డాడు. మిత్రుడు మల్లబంధుల తెగను విడిచిపెట్టి ఎక్కడో ప్రవాసజీవితం గడుపుతున్నట్టు అతనికి తెలిసింది. మల్లబంధుల మహావీరుడని అతనికి తెలుసు. అదీగాక తమ ఇద్దరి మధ్యా రాజకీయాలకు అతీతమైన స్నేహమూ, పరస్పర అభిమానమూ ఉన్నాయి. అతను ఇలా వ్యర్థజీవితం గడపవలసివచ్చినందుకు పసనేది నిజంగానే బాధపడ్డాడు. అతనిని తనవద్దకు రప్పించుకుని ఒక ఉన్నత స్థానంలో ఉంచాలని అతనికి అనిపించింది. తను విస్తరణ ప్రయత్నంలో ఉన్నాడు కనుక అందులో స్వార్థం కూడా ఉంటే ఉండచ్చు. కానీ, అతనిపట్ల స్నేహస్పందన కూడా అంతే ఉంది.

వేగుల వల్ల ఎట్టకేలకు మల్లబంధుల ఉనికి కనిపెట్టాడు. అతనిని కలసుకోడానికి స్వయంగా తనే వెళ్ళాడు. పసనేది తనకు బాల్యం నుంచీ మిత్రుడు. తమవి భిన్న సామాజిక నేపథ్యాలే అయినా వాటికి అతీతమైన నిర్మల స్నేహభావన  పసనేదిపై మల్లబంధులకూ సమానంగా ఉంది. అయితే, పసనేది ప్రతిపాదనపై అతడు ఎంతో ఆలోచించుకోవలసివచ్చింది. ఇద్దరూ రెండురోజులపాటు చర్చించుకున్నారు. పసనేది తెగల స్వతంత్ర జీవనాన్ని కాలరాయకూడదు, తమ మల్ల తెగ జోలికి రాకూడదు…ఇవీ మల్లబంధుల పెట్టిన షరతులు. తెగలపై కత్తి కట్టే ఆలోచన అప్పటికి పసనేదికి లేదు. మరీ ప్రమాదకరంగా ఉన్న ఆటవికులు, ఆయుధోపజీవుల అడ్డు తొలగించుకోవడమే అతని తక్షణ లక్ష్యం.

ప్రేయసి మల్లికను వెంటబెట్టుకుని పసనేది వెంట మల్లబంధుల కోసల రాజధాని శ్రావస్తి చేరుకున్నాడు. పసనేది అతనిని సేనానిగా నియమించాడు.

    ***

పసనేది రాజ్యాన్ని బలోపేతం చేసుకుని, విస్తరించుకునే పరిమిత ప్రయత్నాలకు మల్లబంధుల సాయపడ్డాడు. ఇప్పుడు అతని మేనల్లుడు పదేళ్ళవాడు దీర్ఘచరాయణుడు కూడా అతని దగ్గర ఉంటున్నాడు. అతనిది పాదరసం లాంటి బుద్ధి. మేనల్లుడి మేధాశక్తికి మల్లబంధులే విస్తుపోతున్నాడు. యుద్ధవిద్యలతోపాటు ఇతరవిద్యలనూ ఆ అబ్బాయి నేర్చుకునే ఏర్పాటు చేశాడు. దీర్ఘచరాయణుడు పసనేది దృష్టిలో కూడా పడ్డాడు.

అలా ఉండగా అక్కడ వాసభ ఖత్తియ, ఇక్కడ మల్లికా కూడా గర్భవతులు అయ్యారు.

గర్భవతికి ఏవో ఇష్టాలు ఉంటాయనీ, వాటిని తీర్చాలనీ అంటారు కనుక నీకు ఏం కావాలో కోరుకో అని మల్లికతో మల్లబంధుల అన్నాడు. మల్లిక ఒక విచిత్రమైన కోరిక కోరింది.

సుదూరంగా ఒక పుష్కరిణి ఉంది. ఉత్తమ క్షత్రియులు తప్ప ఇంకెవరూ అందులో స్నానం చేయడానికి వీలులేదు. దానికి ఎల్లవేళలా విచ్చుకత్తుల కాపలా ఉంటుంది. ఆ పుష్కరిణిలో తను స్నానం చేయాలి! ఇదీ మల్లిక కోరిక.

అదెంత, అని మల్లబంధుల ఆమెను తీసుకుని రథంలో బయలుదేరాడు. అది పది రోజుల ప్రయాణదూరం. పుష్కరిణి ఇంకా దూరంగా ఉండగానే ఆ మార్గంలో కాపలా ఉన్న సైనికులు మల్లబంధులను అడ్డగించారు. పెద్ద యుద్ధం జరిగింది. మల్లబంధుల అవలీలగా వారిని జయించి ముందుకు సాగాడు. మల్లిక పుష్కరిణిలో స్నానం చేసింది.

కొన్ని రోజుల తేడాలో వాసభ ఖత్తియ, మల్లిక కొడుకుల్ని ప్రసవించారు. అయితే, మల్లిక ప్రసవసమయంలో కన్ను మూసింది.

మల్లిక మరణం మల్లబంధునిలో మహాశూన్యాన్ని నింపింది. వారి మధ్య ఉన్నది హృదయసంబంధం ఒక్కటే కాదు, తెగకు దూరమైన ఆ ఇద్దరూ ఒకరి ఒంటరితనాన్ని ఇంకొకరు భర్తీ చేసుకున్నారు. ఒకరి  జీవితానికి ఒకరు  ఆశాదీపమయ్యారు.

మల్లిక తను ఆరిపోతూ  మల్లబంధుల ఆశాదీపాన్ని కూడా ఆర్పేసింది…

      ***

మిగతా కథ తర్వాత…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)