ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 13 వ భాగం

15

( గత వారం తరువాయి)

13

పంచాయితీరాజ్‌ మంత్రి వీరాంజనేయులకు ముచ్చెమటుల పట్టి నిప్పుల ప్రవాహంవంటి జ్ఞాపకం తెగిపోయింది.
పచ్చని అడవి నడుమ.. విశాలమైన చదునైన గడ్డిమైదానం.. చుట్టూ గుట్టలు.. దూరాన నీలివర్ణంలో కనిపిస్తున్న చెరువు.. అంతా ప్రశాంతమైన ప్రకృతి.
ఆ రోజు ప్రక్కఊరు మహదేవ్‌పూర్‌లో గిరిజన సంత., ముగిసి.. సాయంకాలం.. చుట్టూ పదూళ్ళ ప్రజలు ఎక్కడివాళ్లక్కడికి ఇండ్లకు చేరపోయే ప్రయాణంలో.. మధ్య కావాలని.. ఆ ప్రాంతంలో ‘పంతులుగారు దేవుడు’ అని పేరున్న రామన్న పిలుపు మేరకు అందరూ ఆ ఆకుపచ్చని గడ్డిమైదానంలో సమావేశమై,
వందలమంది గిరిజనులు.. పెద్ద, చిన్న, ముసలి, ముతక.. ఒంటిపైన సగం బట్టలు.. సగం బరిబాత.. దాదాపు అందరి చేతుల్లో ఓ కంక కర్ర.
అందరిచూపుల్లోనూ సెలయేటి నీటిలోని నిర్మలత్వం.. స్వచ్ఛత
జనం మధ్య.. ఎత్తుగా వేదిక.
”జనసేన.. ధన్యవాద సభ..” అని వెనుక పెద్ద పెద్ద అక్షరాలు.
గిరిజనబాంధవుడు పంచాయితీరాజ్‌.. మంత్రి శ్రీ వీరాంజనేయులు గార్కి, గిరిజన అభివృద్ధికి నిరంతరం శ్రమించే భగవత్‌ స్వరూపులు చీఫ్‌ ఇంజినీర్‌ బొలుగొడ్డు గురువయ్య గార్కి, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రమణగార్కి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ముత్యాలు గార్కి, డివిజినల్‌ ఇంజినీర్‌ మహమ్మద్‌ ఇస్మాయిల్‌ గార్కి, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ జాన్సన్‌గార్కి.. న్యవాద మరియు అబినందన సభ. అధ్యకక్షులు మానవహక్కుల కమీషన్‌ చైర్మన్‌ జి. విశ్వనాథరావు గారు ప్రారంభకులు డాక్టర్‌ కె. గోపీనాథ్‌ గారు. నిర్వహణ.. భద్రాచలం గోదావరీ పరీవాహ ప్రాంత గిరిజన మూలవాసీ సంఘం మరియు జనసేన.
”అరె నీయమ్మ.. ఈ సభ వద్దుపో అని మొత్తుకున్నగదరా గుర్వయ్యా.. నాకెందుకో యిదంత చూస్తూంటే అదెందో ఉందని అప్పుడే అన్పించింది. యిప్పుడుసూడు ఈ ప్లాట్‌ఫాంమీద ఎవరెవరున్నరో, ఏం జర్గబోతోందో.. ఇగ తప్పించుకపోలేం.. ఉంటే ఇరుక్కపోయేటట్టున్నం.. నీయమ్మ. భూమిపుండుల చిక్కినంగాదుర..” మంత్రి వీరాంజనేయులు చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య చెవిలో గుసగుసగా అంటూండగానే.. ఎవరో గిరిజన ఉపాధ్యాయుడు ”యిప్పుడు మూడవ తరగతి చదువుతున్న నీలమ్మ మంత్రిగారికి అడవి మొగలిపూల గుచ్ఛం అందిస్తుంది” అని మైక్‌లో ప్రకటించాడు. వెంటనే ఓ నల్లని పాముపిల్లలా తళతళలాడ్తున్న ప్రాథమిక పాఠశాల అడవిపిల్ల మెరుపులా వేదికమీదికొచ్చి మంత్రిగారికి పెద్ద మొగలిపూల గుత్తినందించింది.
చుట్టూ మధురమైన సువాసన గుప్పుమని.,

”గుర్వయ్యా.. నాకు భయమైతాందిరా.. గీ అడవి సభల గిన్ని మన తెలుగుల ఉన్న అన్ని టి.వి. చానళ్లెందుకచ్చినై. గిన్ని పత్రికలోళ్ళెందుకచ్చిండ్లు.. గీ మేధావులలెక్క కన్పించే మనుషులు ఎందుకు గీ అడవిజనంల కల్సి ఉన్నరు.. ఏంటిదిదసలు..” మంత్రికి చెమటలు పోస్తున్నాయి.
దొంగ అందరికన్నా ముందు ప్రమాదాన్ని పసిగడ్తాడు.
”ఆగుండ్లి.. మీరనవసరంగా హైరాన పడకుండ్లి..” చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య గుంభనంగా అన్నాడు. గాని.. లోలోలప అతనికీ ఉచ్ఛపడ్తోంది.

పుష్పగుచ్చాలు.. స్వాగతవచనాలు.. ముగిసి.. సభానిర్వహణను సభాద్యకక్షులు, మానవ హక్కుల సంఘం చైర్మన్‌ విశ్వనాథరావుకు అప్పగించగానే.. ఆయన మొట్టమొదలుగా లేచి నిలబడి.. ప్రారంభవాక్యాలు చెప్తూండగా.,
”ఏదో అర్జంట్‌ పనుందని తప్పించుకుపోతే..” అన్నాడు మంత్రి సి.ఇ చెవిలో.
”అస్సలే బాగుండది.. అసలే ఆ అధ్యకక్షుడు హుమన్‌ రైట్స్‌ కమీషనోడు. .. వాసన చూత్తడు..”

”ఊఁ.. ” మంత్రి అసహనంగా.. భయంభయంగా కదుల్తూ.. ”నీ తల్లి ఏం సభరో ఇది.. గింతగనం జనం.. యింకా వత్తాండ్లు” అని గొణుక్కుంటూ, ఒంటినిండా చెమటతో అంగి తడిచిపోయింది. దూరంగా ఎక్కడో తన కార్ల కాన్వాయ్‌..పోలీసులున్నారు.. వెనుక ఒక నల్లయూనిఫాం గన్‌మన్‌ ఉన్నాడు నిలబడి నల్లని రాతివిగ్రహంలా.,
”.. నాకు ఈ గిరిజనులు మధ్య ఈ పూట గడపడం ఎంతో ఆనందంగా ఉంది.. ఒక ప్రత్యేక ధన్యవాద సభకు తప్పకుండా రావాలని ఈ మూలవాసీ నాయకులు నన్ను అడిగితే ఈ అడవి బిడ్డలతో జీవితాన్ని పంచుకుందామని..” అలా ఓ ఐదునిముషాల అధ్యకక్షుని ప్రసంగం సాగి సాగి.. ”ఇప్పుడు అసలు ఈ సభ ఎందుకు.. ఈ ధన్యవాదాలు ఎందుకు.. ఎవరికి.. గిరిజన జీవితాలను ఉద్దరించేందుకు ఈ వేదికపైనున్న ప్రముఖులు ఎలా ఈ వెనుకబడ్డ ఆదివాసీల బ్రతుకులను బాగుచేస్తున్నారు. ఈ విషయాలను మీకు పరిచయం చేసేందుకు భద్రాచలం గోదావరీ పరీవాహ ప్రాంత గిరిజన మూలవాసీ సంఘం అధ్యకక్షులు, వృత్తిరీత్యా ఉపాధ్యాయులు శ్రీ వినోభా తుట్టె గారిని ఆహ్వానిస్తున్నాను..” అని హెచ్‌ఆర్‌సి చైర్మన్‌ విశ్వనాథరావు ప్రకటించి కూర్చున్నారు. వెంటనే విపరీతమైన ఆనందాతిరేకాలతో చప్పట్లు.. ఒక సముద్రం పొంగినట్టు.
మైక్‌ముందుకు వినోబా తుట్టె.. మెల్లగా గంభీరంగా నడుచుకూంటూ వస్తూండగా .. ఇంకా ఇంకా ఆగని.. ఎడతెగని చప్పట్లు.
”వీనికెంత ఫాలోయింగుందిరా గుర్వయ్యా..” అన్నాడు మంత్రి అప్రయత్నంగానే.
”అధ్యక్షులు, పెద్దలు మానవ హక్కుల కమీషన్‌ చైర్మన్‌ శ్రీ విశ్వనాథరావుగారు. పంచాయితీరాజ్‌ మంత్రివర్యులు శ్రీ వీరాంజనేయులుగారు. ప్రియాతిప్రియమైన ప్రజలారా.. ఈ రోజు ఎంతో సుదినం.. ఎందుకంటే అతికీలకమైన కొన్ని విషయాలు ఈ రోజు బయటికి ప్రపంచానికి తెలియజేయబడి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక ప్రధాన మలుపుకు కారణభూతం కాబోతున్న సభ యిది. మిత్రులారా మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పబోతున్న విషయాలను విని అర్థం చేసుకుని కళ్ళు విప్పాలె యికనైనా.. ఈ దేశం దాదాపు మొత్తం అవినీతి రాజ్యం, లంచగొండి రాజ్యంగా మారిపోయింది. కోట్లకు కోట్ల ప్రజాధనాన్ని నిస్సిగ్గుగా ఎవనికి అందిందివాడు తింటూంటే దాన్ని కట్టడిచేసే నాథుడేలేడు..” వినోబా ప్రసంగం అగ్గి అంటుకున్న అడవిలా మొదలైంది. వేదిక ముందు మీడియా కెమెరాలు ఒళ్లు విరిచాయి. అంతా డాక్యుమెంటవుతోంది.

”సమాచార చట్టం – 2005 ప్రకారం.. మూడు సంవత్సరాల క్రితం ప్రపంచబ్యాంకునుండి తీసుకున్న వందలకోట్ల అప్పును గిరిజన, ఆదివాసీ తెగల అభివృద్ధి గురించి ప్రభుత్వం అనేక పథకాలను ప్రకటించి వినియోగించమని నిధులను విడుదలచేసింది. ఆ వందలకోట్ల రూపాయల నిధులను మంత్రులు, శాసనసభ్యులు, ప్రాజెక్ట్‌ డైరెక్టర్లు, ఇంజినీర్లు.. ఎలా విచ్చలవిడిగా భోంచేసి హాంఫట్‌ చేశారో.. మీరే స్వయంగా చూడండి..”
అప్పుడే చీకటిపడ్తున్న సాయంసంధ్యా సమయంలో.. వేదిక ప్రక్కనే ఉన్న తెరపై ఒక ఎల్‌సిడిలోనుండి ప్రొజెక్షన్‌ మొదలైంది.
”మన బర్లగూడెంనుండి తత్తరిపల్లెదాకా.. అంటే దాదాపు నాల్గున్నర కిలోమీటర్ల పొడవు డాంబర్‌ రోడ్‌ను పదిహేడు లక్షల రూపాయలు పెట్టి ఈ మంత్రిగారు, ఈ చీఫ్‌ ఇంజినీర్‌, ఈ ఇ.ఇ, డి.ఇ. ఎ.ఇ సార్లు మనకోసం వేశారట.. అది మొన్న వచ్చిన వరదల్లో కొట్టుకుపోయిందట. మీలో ఎందరు ఆ రోడ్డుమీద నడిచిండ్రో.. ఎన్నాళ్లు  ఆ రోడ్డు అక్కడ ఉందో.. దాన్ని ఎవరైనా మీరు చూచిండ్రో.. కాస్త చూచి, ముచ్చట్లు విని చెప్పుండ్రి..”
మస్త్‌ తాగి.. గెస్ట్‌హౌజ్‌లో మాట్లాడ్తున్న మంత్రి వీరాంజనేయులు.. ప్రక్కన చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య, ఎస్‌.ఇ రమణ.. అందరూ.. వాళ్లు మాట్లాడ్తున్న మాటలు.. మైకుల్లో అందరూ వినేట్టు.. అడవి దద్దరిల్లిపోయేట్టు..,
”ఏయ్‌.. నాకిప్పుడు నాల్గు లక్షలు క్యాష్‌ కావాలె.. నీయవ్వ. మీ ఎస్టిమేషన్‌ ఎంతనో. ఆ రోడ్డు ఎక్కడ్నో .. కాంట్రాక్టరెవ్వడో.. అదంత నాకు తెల్వది.. టర్మ్స్‌ ఇన్‌ క్యాష్‌.. క్యాష్‌.. యిచ్చి నాతోని ఎక్కడెక్కడ కావాల్నో అక్కడ అన్ని సంతకాలు తీస్కోండి.. గంతే..” మంత్రిగారి గొంతు. బొమ్మ.. స్పష్టంగా.,

కాంట్రాక్టర్‌ రామలింగం ఐదు లక్షల రూపాయల వేయి నోట్ల కట్టలు హాండ్‌ బ్యాగులోనుండి తీస్తూ..
అందరూ చూస్తున్నారు.. కిమ్మనకుండ.. ఓ సినిమావలె.. అడవిజనం.. రికార్డు చేస్తున్న మీడియా, పోలీసులు.. ప్రెస్‌ పాత్రికేయులు.,
గాలి స్తంభించిపోయినట్టు నిశ్శబ్దం.

తర్వాత.. సినిమా నడచి, నడచి.. సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రమణ గొంతు.. ”కాంట్రాక్టర్‌ రామలింగం జూన్‌ మొదటివారంలో బిల్‌ డ్రా చేసుకుంటాడు.. ఫైల్‌ క్లోజ్డ్‌.. డి.డిస్‌.. మళ్ళీ సెప్టెంబర్‌లో.. రోడ్‌ కొట్టుకుపోయిందనే నోట్‌ అప్రూవల్‌తో ఫైల్‌ క్లోజ్డ్‌ ఎల్‌.డిస్‌.. అర్ధమైందా..” క్లిప్పింగు కట్టయింది.

”అర్ధమైందా మిత్రులారా.. వేయని రోడ్‌కు.. పదిహేడు లక్షలు.. రాజీరా నుండి మోత్కుపల్లె దాకా లేని రోడ్డుకు ఇరవై లక్షలు.. అప్పనంగా తిని.. గిరిజనుల సొమ్మును వంతులవారీగా భోంచేసిన వేదికపైనున్న పెద్దలకు మనం ధన్యవాదాలు చెప్పి సన్మానం చేయాలెగదా.. ఏమంటారు.”
”చేయాలె చేయాలె..”
వందలమంది ఒంటిమీద సరిగ్గా బట్టల్లేనివాళ్లు.. డొక్కలెండిపోయినవాళ్ళు. ఆడ, మగ, పిల్లలు.. చేతుల్లో పాత, చీకిపోయిన చెప్పులను చేతుల్లోకి తీసుకుని.. ”సన్మానం చేయాలె..” అని అరుస్తున్నారు.

క్షణాల్లో వాతావరణం బీభత్సంగా మారిపోయింది.
”స్టాప్‌ ద ప్రొజెక్షన్‌..” అని అరిచాడు మంత్రి వీరాంజనేయులు..పిచ్చికుక్కలా మొరుగుతూ
ఐతే ఆ అరుపు చీఫ్‌ ఇంజనీర్‌ గురవయ్యకు తప్పితే ఎవరికీ వినబడలేదు.
జనం ఎగిసిపడ్డ కెరటంలా లేచి వేదికవైపు పరుగెత్తుకొస్తున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఉలిక్కిపడ్డ మంత్రివెంట వచ్చిన ఓ పదిపన్నెండుమంది పోలీసులు గబగబా వేదికముందుకు పరుగెత్తుకొచ్చి., సరిగ్గా.. మంత్రిగారి వెనుక నిలబడ్డ పర్సనల్‌ సెక్యూరిటీ గన్‌మన్‌ అంజయ్య మాత్రం కదలకుండా, గన్‌ను సవరించుకోకుండానే ఊర్కే జర్గుతున్నదాన్ని అలా బొమ్మలా చూస్తూ.. ”మంచిపనైంది ముండాకొడుక్కు.. థూఁ..” అనుకుంటూండగా, నిశ్చింతగా, కదలకుండానే,
”మిత్రులారా.. మీరు సంయమనంతో కూర్చోండి.. యిక్కడ అన్నీ ఋజువులతో ఉన్నాయి.. హింస దేనికీ పరిష్కారం కాదు.. మేము జనసేన తరపున యిచ్చిన కంప్లెయింట్‌ను స్వీకరించి ఆంటీ కరప్షన్‌ బ్యూరోవాళ్లు ఈ మంత్రిగారి, చీఫ్‌ ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌.. వీళ్ళందరి, వీళ్ల బంధువుల ఇండ్లపై సోదాలు ప్రారంభించారు కొద్దిగంటల క్రితమే. వీళ్ళకు సెల్‌ఫోన్‌లు రాకుండా మేము ముందే అన్నీ జామ్‌ చేశాం కాబట్టి వీళ్ళకీ విషయం తెలియదు. యిప్పటికే వీళ్ళందరి కొంపల్లో ఒక్కొక్కని దగ్గర కనీసం పదిహేను కోట్లకంటే ఎక్కువ నగదు.. కిలోలకొద్ది బంగారం, భూముల రిజిష్ట్రేషన్‌ కాగితాలు, ఎఫ్‌డీలు… అన్నీ బయటపడ్డాయి. యింకా బయటపడ్తున్నాయి.. పెద్దలు.. విజ్ఞులు.. మానవ హక్కుల చైర్మన్‌ విశ్వనాథరావుగారి సమక్షంలో సమాచారా చట్టం క్రింద మేం తీసుకొచ్చిన ఈ రెండు రోడ్ల నిర్మాణం తాలూకు సర్టిఫైడ్‌ కాపీలున్నాయి. వీటి ఫైల్‌ కాపీ ఉంది.. రోడ్లు అసలు వేయనేవేయకుండా డబ్బు తిన్నట్టు సంభాషణలు రికార్డయిన సి.డిలున్నాయి. ఇప్పుడు ఈ వందలమందిమి.. ఈ అవినీతిని ప్రతిఘటిస్తూ వందలసంఖ్యలో దరఖాస్తులనిస్తం.. వీటిని సుమోటో కేస్‌గా స్వీకరించి.. ప్రజలకు న్యాయం చేయవలసిందనీ, న్యాయాన్ని రక్షించవలసిందనీ.. లంచగొండితనంతో కుళ్ళిపోతున్న ఈ సమాజాన్ని ప్రక్షాళన చేసే సుదీర్ఘ ఉద్యమ కార్యక్రమంలో మొదటి అడుగుగా జనసేన ప్రారంభించిన ఈ పోరాటయాత్రను ఆశీర్వదించవలసిందనీ విశ్వనాథరావుగార్ని ప్రార్థిస్తున్నాం. జైయ్‌ జనసేన.. జైజై జనసేన..జై జనసేన….”

నినాదాలు ఉప్పెనై ఆకాశం దద్దరిల్లిపోతోంది.. ప్రజావెల్లువ.. ఒక చైతన్య దీప్తి.
విశ్వనాథరావుకు ఎందుకో పరమానందమైంది.. అబ్బా.. ఇన్నాళ్ళకు.. ఎక్కడో ఈ మారుమూల.. ఈ అడవిలోనుండి ఒక ప్రతిఘటన ప్రారంభమైంది.. యిది యింకా యింకా అంటుకున్న అడవిలా విస్తరించి విస్తరించి పట్టణాలను, నగరాలను ఆవహించి విజృంభిస్తే ఎంత బాగుండు.. అని అనుకుంటూండగా..,

”సర్‌.. అదంతా ఒట్టి బూటకం సర్‌..” అంటున్నాడు ప్రక్కన మంత్రి వీరాంజనేయులు.. చీఫ్‌ ఇంజనీర్‌ గుర్నాదం మాత్రం తన నూటా పదికిలోల శరీరం చెమటముద్దయి తడిసిపోతూండగా అవాక్కయి..
”మంత్రిగారూ.. మిగిలిన ఇంజనీర్లందరూ.. మానవ హక్కుల ఉల్లంఘన క్రింద ఘోరమైన అపరాదం చేశారు.. మిమ్మల్ని సుమోటోగా నేను స్వీకరిస్తున్న ఈ కేసును విచారించే వరకు పోలీస్‌ కస్టడీలో ఉండేందుకు ఆదేశిస్తున్నాను…” అని విశ్వనాథరావు వేదికపైనున్న తన కుర్చీలోనుండి లేచి.. వేదికపైకి దూసుకువస్తున్న జనాన్ని అదుపులో ఉంచేందుకు మైక్‌ను స్వయంగా తీసుకూని..
”మిత్రులారా..నేను చెప్పేది వినండి..” అని అరుస్తూంటే,
”పందికొక్కులు లంజకొడ్కులు.. రోడ్లు.. చెర్వులు, కల్వర్టులు, చెక్‌డ్యాంలు.. ఎన్ని తింటర్రా.. ” అని అరుస్తున్నారెవరో.
వాతావరణం బీభత్సంగా ఉంది.
అడవి నుండి కార్చిచ్చు మీడియాద్వారా.. జిల్లా కేంద్రానికి.. హైద్రాబాద్‌కు.. జనసేన కార్యాలయం రామంకు, టి.వి.లను వీక్షిస్తున్న లక్షల జనాల్లోకి.. ప్రాకి ప్రాకి.,
”బ్రేకింగు న్యూస్‌.. అవినీతి ఉచ్చులో మంత్రి వీరాంజనేయులు. ఐదుగురు ఇంజనీర్లు..”
”పకడ్బందీ వ్యూహంతో అవినీతి భాగోతం బట్టబయలు చేసిన జనసేన”
”ఎవరీ జనసేన.. ఏమిటి వాళ్ళ లక్ష్యాలు”
”మంత్రి.. ఇంజినీర్లు మానవహక్కుల కమీషన్‌ అధీనంలోకి”

టి.వి. ఛానళ్ళన్నీ ఒకదానిపై ఒకటి పోటీపడి త్రోసుకుని త్రోసుకుని ప్రసారాలను చేస్తూనే ఉన్నాయి.
అడవి గర్భంలోనుండి ఒక అగ్నిబీజం మొలకెత్తి,
ఒక పిడికిలి వేల పిడికిళ్ళుగా, వేల వేల పిడుగులుగా విస్తరిస్తున్న క్షణం,
జనం మెదళ్ళల్లో.. ఒక ఆలోచన లక్షల ఉప్పెనలై.,

Download PDF

6 Comments

  • Sai says:

    జనసేన !! what a coincidence? పవన్ కళ్యాణ్ పార్టీ పేరు కూడా ఇదేగా?

    • chandramouli raamaa says:

      సాయిగారూ ,
      రెండేళ్ల క్రితం రాసిన నవల ఇది.అప్పుడు భారత రాజకీయాల్లో కేజ్రీవాల్ లు,ఈ జనసేన లు లేవు/లేరు.
      కుళ్ళిపోతున్న ఈ దేశ రాజకీయ వ్యవస్థను ఎలా ప్రక్షాళన చేయాలా అని నిజాయితీగా ఆలోచించి ఒక పరిష్కారాన్ని చూపే నిర్మాణాత్మక దిశలో సృజించబడ్డ రచన ఇది.
      యువత తప్పనిసరిగా రాజకీయాల్లో పాల్గొని తమ దేశాన్ని తామే బాగుచేసుకోవాల్సిన చారిత్రాత్మక సందర్భం వచ్చిందిప్పుడు.వాళ్ళ బాధ్యతకూడా ఇది.
      ఈ ‘జనసేన’..ఆ ‘జనసేన’ ఔతుందో లేదో చూడాలి.
      థాంక్యూ.
      – మౌళి

  • indira says:

    i bumped into this serial by chance. something i can’t discern at the moment drew me into its fold. could be the art of narration, or the subject it is dealing with… i still need to explore. whatever, it is certainly replete with the happenings around especially intrigue at high places…i wish the writer best…

  • karuna says:

    ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ? రచయిత మౌళి గారు తను ఈ నవల రచన రెండు ఏళ్ళ క్రితం రాసినట్లు గా చెప్పుకున్నారు .చాల చిత్రం గా జన సేన పేరు తో పార్టీ ఆవిర్భావం …రచయిత కోరుకునే సమాజం కల కాకూడదని కోరుకుంటూ ..

  • chandramouli raamaa says:

    కరుణ గారూ,
    ఈ దేశం పట్ల సహజ ప్రేమగల ఎవరైనా ప్రస్తుత కలుషిత ,అవినీతిమయ ,అసమర్థ పాలకులవల్ల అత్యంత అసంతృప్తితో క్షోభపడుతున్నారు.ఈ స్థితినుండి ఈ దేశాన్ని ఉద్దరించి పునర్నిర్మించ వలసిందిమాత్రం నిస్సందేహంగా ‘యువతే’.ఆ యువతను దీక్షాబద్దులను చేయడం ,చైతన్య పర్చడంకోసమే ఈ నవల.నా తపన.
    – మౌళి

  • v.v.l.n.s. prasad says:

    భవిష్యద్దర్శనం , ప్రవృత్తి నిశిత పరిశీలన శ్రీ రామా వారి ప్రత్యేకత అనటంలో కించిత్తు కూడా పొరపాటు లేదు. కాకుంటే, జనసేన లాంటి వారి మానస పుత్రిక కూడా అసంకల్పితంగా , అపాత్రుల చేతికి అప్పాలపండులా చిక్కిందని బాధ కలగటం మాత్రం కాదనలేని నిజం.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)