ఒక ప్రశ్నలోంచి పుట్టిన కథ !

10253980_10154027889035385_5076761124300498188_n

(కథ 2013 ఆవిష్కరణ సందర్భంగా – అందులో ఎంపికైన కొన్ని కథల నేపథ్యాలు వరసగా ప్రచురించాలని ఆలోచన. ఈ వారం అనిల్ ఎస్. రాయల్ కథ “రీబూట్” నేపథ్యాన్ని అందిస్తున్నాం)

కథ ఎలా పుడుతుంది? ఒక్కో కథకుడికీ ఒక్కో విధంగా.

నావరకూ అది ఓ ప్రశ్నలోంచి పుడుతుంది

‘ఇలా జరిగితే ఎలా ఉంటుంది?’ అనే ప్రశ్నలోంచి. 1898లో హెచ్.జి.వెల్స్ War of the Worlds రాశాడు. సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో అదో మైలురాయి. అంగారకవాసులు భూగ్రహమ్మీద దాడి చేసి దొరికినవారిని దొరికినట్లు చంపుకుతినటం ఆ నవల ఇతివృత్తం. మొదట్లో చెలరేగిపోయిన మార్స్ దళాలు, అనుకోనిరీతిలో భూమ్మీది బాక్టీరియా ధాటికి కుదేలవటం, దెబ్బకి తోకముడిచి తమగ్రహానికి పారిపోవటంతో ఆ నవల ముగుస్తుంది.

ఆ నవల చదివినప్పట్నుండీ నన్నో ప్రశ్న తొలిచేది. ‘అలా పారిపోయిన మార్షియన్స్ రోగనిరోధకశక్తి పెంపొందించుకుని తిరిగి మన మీద దాడి చేస్తే? వాళ్లని కాచుకోటానికి ఉన్న ఒక్క ఆయుధమూ నిర్వీర్యమైపోతే మనుషుల పరిస్థితేంటి?’.

నేను కథలు రాయటం ప్రారంభించిన తొలినాళ్లనుండి ఈ అంశంతో ఓ కథ రాయాలన్న ఆలోచనుండేది. అంటే, War of the Worldsకి సీక్వెల్ రాసే ఆలోచన అన్నమాట.

‘నాగరికథ’, ‘మరో ప్రపంచం’, ‘కల్కి’ తర్వాతో రెండున్నరేళ్లు విరామం తీసుకున్నాక, మళ్లీ కథ రాసే మూడొచ్చింది; సీక్వెల్ ఆలోచనకి దుమ్ము దులిపే వీలు కుదిరింది. అలా ఈ కథ మొదలయింది. దీనికి ముందు నేను రాసిన మూడిట్లో రెండు కథలు టైమ్‌ట్రావెల్ నేపధ్యంలో రాసినవే. అదే నేపధ్యంలో మరోటీ రాసేసి ‘ఇదిగిదిగో నా టైమ్‌ట్రావెల్ త్రయం’ అనాలనే దుగ్థ ఒకటి ఈ రెండున్నరేళ్లుగా తొలుస్తూనే ఉంది.

అందుకే, War of the Worldsకి కొనసాగింపు రాయటానికి సిద్ధమైనప్పుడు దానికి అనుకోకుండానే టైమ్‌ట్రావెల్ నేపధ్యమై కూర్చుంది. నా కథల్లో జరిగిన/జరుగుతున్న చరిత్ర, ఎప్పుడో జరిగిపోయిన/జరగని పురాణాల ప్రస్తావన లీలా మాత్రంగా చొప్పించటం నాకలవాటు – వాటిక్కాస్త సైన్స్ పూతపూసి. ‘రీబూట్’ దానికి మినహాయింపు కాదు. ‘మానవుల మధ్య కలహాలు ముదిరిపోయి ఒకరినొకరు సంహరించుకునే పనిలో మునిగితేలుతుంటే విసిగిపోయిన దేవుడు ప్రళయం ద్వారా మానవజాతిని మళ్లీ మూలాల్లోకి పంపటం’ అనేదో ప్రపంచవ్యాప్త నమ్మకం.

దీన్ని నా కథకి అనుగుణంగా వాడుకుందామనుకున్నాను. మూడో ప్రపంచ యుద్ధం, దాని తదనంతర పరిస్థితులు, మానవులు భూగృహాల్లో బతకటం, ఇలాంటివి అలా వచ్చి కథలో కలిశాయి. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో మనుషుల బదులు మరసైనికులు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి (అది మరో విధంగా ఇప్పటికే జరుగుతుంది, నిజానికి), ఆ రకంగా కథలోకి రోబాట్స్ కూడా వచ్చి చేరాయి. మరమనిషి ప్రధాన పాత్ర అనగానే ఐజక్ అసిమోవ్ కథలు గుర్తొస్తాయి.

ఆ తరహా సాహిత్యమ్మీద ఆయన వేసిన ముద్ర అంత బలమైనది. ఆ మహారచయిత గురించి తెలుగు పాఠకలోకంలో ఎక్కువమందికి తెలీదు. అందుకే, ఆయన్ని పరిచయం చేసినట్లుంటుందని కథలో అసిమోవ్ ప్రస్తావన తెచ్చాను. ఈ పెద్ద కథని రెండు భాగాలుగా ఏప్రిల్ 6న అసిమోవ్ వర్ధంతి సందర్భంగా ప్రచురించటం జరిగింది.

-అనిల్ .ఎస్.రాయల్

 

 

 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

10253024_10202317416069206_1368318419_oరీబూట్

(a tribute to Isaac Asimov)

***

 

 

క్రీ.. 2372, సెప్టెంబర్ 1. సాయంత్రం నాలుగూ పది.

 

కిటికీలోకి చూస్తున్నాడు విక్రమాదిత్య. బయటకనుచూపుమేరంతా బూడిద వర్ణం. ఒకప్పుడదో మహానగరం. బహుళంతస్తుల భవనాలు, వాటిని కలుపుతూ రహదార్లు. పచ్చదనం పంచుతూ చెట్లు. వాటి కింద సేదదీరుతూ మనుషులు. ఇప్పుడో? శిధిల నగరం. సూర్యుడిని కమ్మేసిన ధూళి మేఘం. పగలూ రాత్రీ ఏకమైన సమయం. కమ్ముకున్న చిమ్మ చీకటి. దాన్ని చీలుస్తూ అప్పుడప్పుడూ లేజర్ మెరుపులుమార్స్ వాసులకీ, మరమనుషులకి మధ్య పోరాటానికి గుర్తుగా. 

 

విక్రమాదిత్య చూపులు బయటున్నా మనసు మాత్రం కొడుకు మీదుంది. ప్రయోగానికింకా రెండుగంటలే ఉంది. అన్నీ సరిగా ఉన్నాయోలేదో ఆఖరుసారి పరీక్షించాలి. వేరే విషయాలు ఆలోచించే సమయం లేదు. కొడుకు మీదనుండి బలవంతంగా మనసు మళ్లిస్తూ కిటికీ అద్దంలో కనిపిస్తున్న తన రూపాన్ని చూసుకున్నాడు. న్యూక్లియర్ ఫిజిక్స్ మరియు రోబోటిక్స్ జంటవిభాగాల అధినేతగా, రక్షణశాఖ కీలక సలహాదారుగా నిరంతరం ఎదుర్కొనే వత్తిడి నలభై ఐదేళ్లకే తెచ్చిపెట్టిన వార్ధక్యం వెక్కిరిస్తూ కనపడింది. ఎర్రబారిన కళ్లు రెండ్రోజులుగా కరువైన నిద్రని గుర్తుచేస్తున్నాయి. తన ముఖంలో గాంభీర్యం తననే భయపెడుతుండగా రిమోట్ అందుకుని ఆఫ్ బటన్ నొక్కాడు. మరుక్షణం కిటికీలోంచి అతని ప్రతిబింబం, దాని వెనకున్న అధివాస్తవిక దృశ్యం మాయమైపోయాయి. అప్పటిదాకా కిటికీలా భ్రమింపజేసిన త్రీడీ టెలివిజన్ తెర వెల్లవేసిన తెల్లగోడలా మారిపోయింది.

బాస్

వెనుకనుండి వినబడ్డ యాంత్రికమైన పిలుపుకి ఉలికిపడి తలతిప్పి చూశాడు. ఐజక్ నిలబడున్నాడక్కడ.

 ***

 

మనిషి పుట్టుక మీద లెక్కకు మిక్కిలి వాదాలు. కోతినుండి మనిషొచ్చాడనే వాళ్లు కొందరు. వేరేదో గ్రహం నుండి వలస వచ్చాడనే వాళ్లింకొందరు. అదనంగా, పురాణాలు ప్రవచించే ఆదిమానవుడి గాథలు. ఆవిర్భావంపై వివాదాలెలా ఉన్నా, మనిషి ఎలా అంతరిస్తాడనే విషయంలో మాత్రం ప్రస్తుతం ఎవరికీ అనుమానాల్లేవు. 

 

మొదట్లో అవసరాల్లోంచి యుద్ధాలు పుట్టేవి. తర్వాత యుద్ధాల కోసం అవసరాలు పుట్టుకొచ్చాయి. క్రమంగా యుద్ధమే అవసరంగా మారింది. అది కల్పించే విస్తారమైన వాణిజ్యావకాశాల కోసం ఇరవై మూడో శతాబ్దం రెండో అర్ధభాగంలో మూడో ప్రపంచ యుద్ధం మొదలయింది. విచ్చలవిడి అణువిస్ఫోటాలకి భూమండలం భస్మీపటలమయింది. ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పైకెగసిన అణుధూళి మేఘాలు సూర్యుడిని కమ్ముకుని ప్రపంచాన్ని అంధకారంలో ముంచేశాయి. సూర్యరశ్మి సోకక చెట్లు, అడవులు నశించిపోయాయి. వాటిమీద ఆధారపడ్డ జీవరాశి అంతరించిపోయింది. ఓజోన్ పొర ఆవిరైపోయింది. రేడియేషన్ వల్ల అపరిమితంగా వేడెక్కిన ఉపరితలం ఆవాసయోగ్యం కాకుండాపోయింది. అణుయుద్ధాన్ని తట్టుకోటానికి ముందస్తు సన్నాహాలు చేసుకున్న దేశాలు మాత్రం కొద్ది శాతం మనుషుల్ని, కొన్ని జాతుల జంతువుల్ని భూగర్భ బంకర్లలోకి తరలించి కాపాడుకున్నాయి. 

 

అప్పట్నుండీ మనుషులు పాతాళంలోనే బతుకుతున్నారు. పైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. నూట ఎనభై ఏళ్ల సుదీర్ఘ సమరంలో ప్రపంచపటం పూర్తిగా మారిపోయింది. పాత దేశాలెన్నో కనుమరుగయ్యాయి. పాతిక దేశాలు, అవి కట్టిన రెండు కూటములు మిగిలాయి. వాటి తరపున మరసైనికులు భూమ్మీద  మొహరించి పోరాడుకుంటుండగా …. ఐదేళ్ల కిందటొచ్చిపడిందో ఊహించని ఉపద్రవం. దానివల్ల యుద్ధమైతే ఆగలేదు. కానీ యుద్ధ లక్షణాలు మారాయి. లక్ష్యమూ మారింది. 

 

అది క్రీ.. 2367. అరుణగ్రహం నుండి మొదటి బెటాలియన్ భూమ్మీద పాదం మోపిన ఏడాది. ఒకరినొకరు సంహరించుకునే పనిలో మునిగి ఆదమరిచిన మానవుల మీద ఆకస్మాత్తుగా విరుచుకుపడ్డాయి మార్స్ సైన్యాలు. అంగారకుడిమీద బుద్ధిజీవుల ఆనవాళ్లే లేవని అపార్చునిటీ మొదలు ఇరవైపైగా రోవర్లు పంపిన సమాచారమంతా తప్పులతడకని అర్ధమయేసరికే ఆలస్యమైపోయింది. వెలుపలి నుండి వచ్చిపడ్డ ప్రమాదాన్ని కాచుకోటానికి తప్పనిసరి పరిస్థితుల్లో తమ గొడవలు పక్కనబెట్టి ఏకమయ్యారు మనుషులు. 

 (మిగతా కథ – కథ 2013- సంకలనంలో చదవండి)

 

Download PDF

2 Comments

  • నిజమండీ… ప్రశ్నలోంచి ప్రశ్నలే కాదు ..కథలూ పుడతాయి!
    మీ కన్నా ముందుగా మీ కథ , ఆ కథాకమానీషు వచ్చేసాయి!
    అయినా, మీరు మా వూరు రాణి లోటే కదా? మరెన్నో కథలతో ఆ లోటును భర్తీ చేస్తారని ఆశిస్తూ.. అభినందనలు.

    • Gorusu says:

      అనిల్ గారు సరిగ్గా ఆవిష్కరణ రోజే ఏడు సముద్రాలు దాటాలని నిర్ణయించు కున్నారు మేడం . అంచేత సింహపురి రాలేరు.

Leave a Reply to Chandra Latha Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)