ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? -16 వ భాగం

( గత వారం తరువాయి )

16

ముందురోజు రాత్రి హైద్రాబాద్‌లో ‘జింఖానా గ్రౌండ్స్‌’లో జరిగిన ‘జనసేన’ అవగాహన బహిరంగ సభ ఎంతో విలక్షణంగా, విజయవంతంగా జరగడం రామంకు, గోపీనాథ్‌కు, క్యాథీకి, శివకూ.. ప్రధానంగా సలహాదారులుగా ఉండి వెన్నుతట్టిన ‘అగ్ని’ ఛానల్‌ అధినేత మూర్తిగారికి, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు, రాజీవ్‌శర్మ , జగన్నాథంలకు, మానవ హక్కుల సంఘం రాములు సార్‌కు, వేదికపై మాట్లాడిన యితర బాధ్యులకు .. ఎంతో ఆత్మతృప్తినీ, ఉత్తేజాన్నీ కలిగిస్తోంది. రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో, మౌనంగా పరిస్థితిని గమనిస్తూ కూర్చున్న పరిశీలకుల్లో, భవిష్యత్తును అంచనావేస్తున్న వ్యూహకర్తల్లో ఒకరకమైన ఉత్సుకతను రేకెత్తించింది. భారత స్వాతంత్య్ర పోరాటం కొనసాగుతున్నపుడు గాంధీ ఉన్నట్టుండి ‘అహింస’ సిద్ధాంతంతో ప్రతిఘటనను, సహాయ నిరాకరణను ప్రకటించిన రోజు తలలుపండిన రాజకీయ పోరాట యోధులు అందరూ పెదవివిరిచి, ఒకింత దాన్ని ఒక పనికిరాని వెకిలిచేష్టగా వ్యాఖ్యానించి, అబ్బే.. గీ గిచ్చుడు చర్యతో ఏనుగు మాటవింటుందా, అంకుశం పోటుపడాలిగాని.. పద్దతిలో వెటకారం చేసి గేలిచేశారు. కాని తర్వాత్తర్వాత.. ఊహించని నిప్పురవ్వ మహారాజ్యాన్ని భస్మీపటలం చేసి రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తుంటే విస్తుపోయి తమ తప్పుడు అంచనాలకు సిగ్గుపడి తలలువంచుకున్నారు.
నిన్న జరిగింది అదే.. దాదాపు నెలరోజుల క్రితం ఒక ఊహకందని, ఊహిస్తే నమ్మశక్యంగాని, అహింసాయుతమైన ‘ప్రక్షాళన’ కార్యక్రమాన్నీ, జనాన్ని ప్రశ్నించే పదునైన ఆయుధంగా మార్చి అవినీతి రాక్షసిపైకి ప్రయోగించే ఒక మహత్తర సాధనంయొక్క స్వభావాన్ని రామం తన ఆలోచనగా ప్రకటించినపుడు చాలామంది దాన్ని ఒట్టి అపరిపక్వ ఆలోచనగా కొట్టేశారు. అదసలు సాధ్యమయ్యేదేనా ఇది. అని కొందరు పరిహసించారు కూడా. చీమ ఏనుగును కుట్టి ఏం సాధిస్తుంది.. అని పెదవి విరిచారు. సాయుధులైన నక్సలైట్లు, అనేక ప్రజాసంఘాలు, సామాజిక ఉద్యమకారులు గత నలభై, యాభై ఏళ్ళుగా ప్రతిఘటిస్తూ ఈ ఘనీభవించిన అవినీతి పర్వతాన్ని ఒక ఇంచ్‌కూడా కదిపి పెళ్ళగించలేంది.. ఈ ప్రజాచైతన్య, ప్రక్షాళన వంటి సున్నిత కార్యక్రమాలతో ఏం జరుగుతుందిలే అని హేళన కూడా చేశారు కొందరు.
కాని మనిషి దుఃఖించాలంటే ఒంటిని గాయపరిచి హింసిస్తే లాభంలేదు. వాని హృదయం చలించి కరిగినప్పుడు మాత్రమే కన్నీటి చుక్క పొటమరిస్తుంది. అది ఎంతో గూఢమైన, సత్యమైన పరమ రహస్యం. ఆ రహస్యం నిన్న లక్షలమందిని ఏకకంఠంతో కదిలించే మహాశక్తిగా మార్చి చూపి ఊర్కే ప్రేక్షకుల్లా గమనిస్తున్న మేధావుల్ని దిగ్భాంత్రుల్ని చేసింది.
ఒక బిందువువంటి శుద్ధ ఆలోచన ఊహగా ఆరంభమై, భావంగా ఎదిగి, ఆలోచనగా పాదుకుని, ఆచరణగా విస్తరించి విస్తరించి, నియమాలుగా, సూత్రాలుగా,సిద్ధాంతాలుగా పరివర్తిన్నవేళ, ప్రయోగం ఫలించి అద్భుతమైన ప్రభావాలను ప్రసరించిన వేళ.. బిందువే ఒక సింధువును సృష్టిస్తూ తవనెంట లాక్కెళ్తున్నవేళ..,
”యిన్ని లక్షలమంది జనం తామంతట తాము.. ఎవరికి వారు. రాష్ట్రం నలుమూలల నుండి.. తమ స్వంత ఖర్చులతో.. స్వచ్ఛందంగా నాటి సభకు తరలి రావడం. ఎర్రటి ఎండలో గంటలకొద్దీ ఓపిగ్గా కూర్చొని.. ఎక్కడా జనాన్ని రెచ్చగొట్టేలా కాకుండా ఆలోచింపజేసే వక్తల ప్రసంగాలను విని ఆకలింపు చేసుకుని మమేకం కావడం. యిదంతా నన్ను పులకింపజేస్తోంది రామం. నిజంగా ఒక చిన్న అతి సున్నితమైన ఆలోచనను బ్రహ్మస్త్రంగా మలచి ప్రయోగించి చూపావయ్యా.. యామ్‌ ఎక్ట్స్రీమ్లీ హాపీ.. ఇప్పుడు మన ‘జనసేన’ బాధ్యులందరికి కోటి ఏనుగుల బలమొచ్చింది.. యిక పడగెత్తిన ఈ జనమహాసముద్ర తరంగ తురంగ ఉధృతిని నిలువరించడం ఎవరితరమూ కాదు.. యిప్పటికే బయట అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ప్రశ్నించేవాడూ, అడిగేవాడూ, నిలదీసేవాడూ లేనంతకాలమే ఎవని ఆటలైనా సాగేది. యిక ఈ దుష్టచదరంగం ఆటకు చెక్‌ పడ్డది..డాక్టర్‌ గోపీనాథ్‌ మాటలు గలగలా గోదావరీ ప్రవాహంలా సాగుతున్నాయి. ఆయన ఒక హర్షాతిరేక తాదాత్మ్యతలో మునిగిపోయాడు.
జనపథంలోని జనసేన ప్రధాన కార్యాలయం ప్రధాన సభామందిరంలో ఒక వలయసభ ఏర్పాటు చేయబడిందారోజు.. దానికి ఒక అధ్యకక్షుడు, ఒక అతిథి, ఒక వక్త.. అలా ఏవిధమైన సాధారణ సాంప్రదాయాలూ లేవు. మనుషులు.. మనసులు కలవడం, అభిప్రాయాలను, ప్రతిపాదనలను, అంతరంగాలను చర్చించుకోవడం, పంచుకోవడం.. ప్రజాస్వామ్యయుతంగానే కాని నిబద్ధతతో కూడిన క్రమశిక్షణతో ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకోవడం.. యిదీ అక్కడ ఇన్నాళ్ళుగా జరుగుతూ వస్తున్నది.. ఆ రోజూ జరుగవలసిఉన్నది కూడా.
ఆ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నేపథ్యంలో ఒక్క బోసినవ్వులు చిందిస్తున్న గాంధీ పటం మాత్రమే ఉంది. పటం క్రింద ఆనాటి సమావేశ లక్ష్యం ”ప్రక్షాళన సభ”అని బేనర్‌ ఉంది. రౌండ్‌ టేబుల్‌ మధ్య టేబుల్‌తో సమాన ఎత్తులో ఉన్న అందమైన చెక్కబల్లపై రెపరెపలాడ్తూ భారత జాతీయపతాక  హుందాగా ఎగుర్తోంది.
గత ఇరవైరోజుల క్రితం జనసేన ఎంపికచేసిన నూటా ఎనిమిది మంది ఋషులవంటి స్వార్థరహిత..రామం ఎన్నో ఏళ్ళుగా తన నిఘా విభాగాన్ని ఉపయోగించి, అధ్యయనాలు జరిపించి గుర్తించినవారే చాలామంది.. వ్యక్తులతో కూడిన ‘మార్గదర్శక సభ’  ఆరోజు సమావేశమైంది. అతి ప్రధానమైన ఆదేశిక సూత్రాలను రూపొందించి ఆచరణ విధానాలతోసహా ‘జనసేన’ మూల కార్యకర్తలకందించడం, అమలులో ముందుండి జనసేనకు నాయకత్వం వహించడం, కావలసివచ్చినపుడు ఏ అధికారినైనా, శత్రువునైనా, ఏ ప్రత్యర్థినైనా నిలువరించి ఎదుర్కోవడం.. సంస్థలో ప్రాణసమానమైన క్రమశిక్షణను స్వయంగా పాటిస్తూ, తమ విభాగంచే పాటింపజేయడం..యివీ మార్గదర్శక సభ సభ్యులు చేసేపని.
క్రమశిక్షణ.. సంయమనం.. సహనం. యివి ‘జనసేన’ యొక్క ప్రధానమైన ప్రాణసూత్రాలు.

ekkadi-April10
ఎవరికీ స్వార్థంలేకపోవడం, అధికార కాంక్షలకు కారణభూతమైన ఏ పదవులూ సంస్థలో లేకపోవడం, క్రమంగా మనిషిని ‘లౌల్యా’నికి అతీతంగా తయారు చేయగల ఉద్యమసంస్కారం ప్రతి కార్యకర్తలోనూ నిండి ఉండడం.. యివి అంకితభావం వల్ల అందరికీ సంక్రమించిన సులక్షణాలు.
సరిగ్గా నూటా ఎనిమిదిమంది ఉన్న ఆ ‘మార్గదర్శక సభను ప్రారంభిస్తూ, రామం లేచి నిలబడి.,
”మిత్రులారా.. ఈ నెలరోజుల తర్వాత మనం యిప్పుడు ఒక అతిముఖ్యమైన కీలకథకు చేరుకున్నాం. ఈ మాసం కాలంలో మనం ముందే అనుకున్నట్టు మన జనసేన సంస్థను ప్రజల్లో భవిష్యత్తులో అందరికీ ప్రాణసమానమైన అవసరంగా ప్రతిష్టించి వాళ్ళ హృదయాల్లో స్థాపించగలిగాం.. యిది సాధారణమైన విజయంకాదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నూటా అరవై కార్యాలయాలతో దాదాపు నాల్గు లక్షలపైచిలుకు సభ్యులు సైనిక సమానులైన కార్యకర్తలుగా ఉన్నారు. మనకు యిప్పుడు ‘జనసేన’ ఒక అజేయమైన సంస్థగా నిలబడ్డది. ఆకాశమంత ఎత్తులో. యిక మిత్రులారా.. మనం కార్యాచరణలోకి దూకబోతున్నాం. ప్రజలు అహింసా పద్ధతులను పాటిస్తూనే శాంతియుతంగా ఉద్యమిస్తూ సంఘటితంగా ఎన్నెన్ని అద్భుతాలు చేసి చూపించగలరో ప్రత్యక్షంగా రేపటినుండి మనం ఋజువు చేయబోతున్నాం. ‘ప్రక్షాళన’ యొక్క రూపురేఖలు మన కార్యాచరణ ఎలా ఉంటుందో పెద్దలు ‘అగ్ని’ వార్తా చానల్‌ అధినేత మూర్తిగారు మనందరికి వివరిస్తారు. మూర్తిగారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను.” అని రామం ప్రశాంతంగా కూర్చున్నాడు కుర్చీపై,
ఆదేశికసూత్రాలలో, ప్రాథమిక జనసేన కార్యకర్తల శిబిరంలో నాయకులెప్పుడూ అతి తక్కువగా, సూటిగా, క్లుప్తంగా మాట్లాడాలని ఒక ప్రధాన అంశంగా శిక్షణ యివ్వబడింది. దాన్ని ప్రతిఒక్కరూ పాటిస్తారు.
మూర్తిగారు చేతిలో కొన్ని కాగితాలతో గంభీరంగా లేచి నిలబడి తన ముందున్న మైక్‌ను సవరించుకుని.,
ఆ హాల్‌లో సౌకర్యాలన్నీ అత్యాధునికంగా ఉన్నాయి. రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరుగుతున్న స్థలానికి ఎదుట ఒక పెద్ద ప్రొజెక్షన్‌ స్క్రీన్‌ ఉంది. ప్రక్కనే యల్‌సిడి స్క్రీన్‌ ఉంది. ఇటు ప్రక్క మాట్లాడ్తున్న వక్త యొక్క ఫీలింగ్సు, హావభావలు స్పష్టంగా కనబడ్డానికి అతని లేజర్‌ ఇమేజ్‌ను చూపించే మరో తెర ఉంది. సభలో పాల్గొంటున్న ప్రతి సభ్యుని ముందు ఒక్కొక్క ఇండివిడ్యువల్‌ మైక్‌ ఉంది. హాల్‌ మొత్తం సెంట్రల్లీ ఏర్‌ కండీషన్డ్‌. కమ్యూనికేసన్‌ సౌకర్యాలు, డాటా సేకరణ, విశ్లేషణ, రాష్ట్రంలోని వందల కార్యాలయాలతో ఏ వ్యక్తితోనైనా సంధానించబడ్డానికి అత్యాధునిక ఏర్పాట్లు.. అన్నీ ఏ ప్రభుత్వ లేదా అంతర్జాతీయ స్థాయి మల్టీనేషనల్‌ కంపెనీల కంటే కూడా ఆధునాతనంగా ఉండాలనీ క్యాథీ మొదట భావించి తను స్వయంగా పర్యవేక్షించి ఆ భవనాన్ని నిర్మింపజేసింది.
ఎదురుగా లేజర్‌ తెరపై మూర్తిగారి పొట్రేట్‌.
ఎల్‌సిడి స్క్రీన్‌పై ఒక విండో ఓపెనై.. జనసేన.. డాటా బ్యాంక్‌.. అని లోగోతో సహా ఒక స్క్రీన్‌ డిస్పే ్ల ఐ..,
అందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.
”మిత్రులారా.. ఒక చిన్న కథ చెబ్తా చాలా క్లుప్తంగా. ఒక తెలివైన భార్య, బ్రతుకనేర్చిన భర్త తాము నలభై ఏండ్ల వయస్సున్నపుడు కొన్ని బ్యాంకులను ట్రాప్‌ చేసి బ్యాంక్‌ అధికారులకు విపరీతంగా లంచాలిచ్చి నాల్గు కోట్ల రూపాయలను అప్పుచేసి అత్యాధునికమైన సర్వసౌకర్యాలున్న భవనాన్ని, కార్లనూ. అన్నీ సమకూర్చుకుని హాయిగా బ్రతకడం మొదలెట్టారు. నాల్గుకోట్ల రిపేమెంట్‌ టైం ముప్పయ్యయిదేళ్ళు, గ్రేస్‌ పీరియడ్‌ మరో పదేళ్ళు.. వడ్డీరేటు.. ఎంతోకొంత.. వాళ్ళకు తెలుసు ఈ నలభై ఐదు ఏండ్లకాలంలో తాము తప్పకుండా చచ్చిపోతామని. లంచాలు తీసుకుని అప్పిచ్చిన బ్యాంక్‌ అధికారులకూ తెలుసు నలభై ఐదేండ్ల తర్వాత తాము ఉద్యోగాల్లో ఉండమని.. నలభై ఏండ్ల తర్వాత.. ఈ పెళ్ళాం మొగులూ హాయిగా బ్రతికి హాయిగా చచ్చిపోయారు. బ్యాంక్‌ అధికారులు ఉద్యోగ విరమణ చేసి హాయిగా వాళ్ళూ చచ్చిపోయారు. చెల్లించవలసిన అప్పుల క్రింద నలభై ఏండ్ల తర్వాత వాళ్ళ పిల్లలిద్దరు అన్ని ఆస్తులనూ అమ్మినా అప్పులే తీరక, వడ్డీలు కట్టలేక.. ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు పిచ్చోడైపోయాడు.
మిత్రులారా.. అర్థమైందనుకుంటూ ఇపుడు నేను చెప్పింది.. ఎలా పసిగట్టారో గాని మన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ నాయకులు బంగారు బాతువంటి ప్రపంచ బ్యాంక్‌ సంగతిని పసిగట్టారు. దాన్నుండి గత ఇరవై ఏండ్లలో ఎన్ని లక్షలకోట్లను తీసుకుని తిని మనకు ఎంత అప్పును వారసత్వంగా మిగిల్చిబెట్టారో ఇప్పుడు నేను చెబితే జనం గుండె పగిలి చచ్చిపోతారు. మంత్రులందర్ని ముఖాలపై ఉమ్మేస్తారు. ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారులను చెప్పులతో కొడ్తారు.”
తెరపై వివరాలు కనబడ్డం మొదలైంది.
1999- ఎపిఇర్‌పి ప్రపంచబ్యాంక్‌ నుండి రూ. 1298.56 కోట్లు, మళ్ళీ రూ. 364 కోట్లు కర్నూల్‌ కడప ప్లాన్‌ కింద రూ. 555 కోట్లు, తుంగభద్ర రూ. 45 కోట్లు, తెలుగు గంగ రూ. 450 కోట్లు, ఖమ్మం.. వరంగల్‌ మరియు కోస్తా జిల్లాలకు రూ. 123.8 కోట్లు, యస్‌ఆర్‌బిసి క్రింద 939.85 కోట్లు, జూరాల, సోమశిల, సాగర్‌ ప్రాధాన్యతల పనికి రూ. 1095 కోట్లు.. చిత్రావతి నది రూ 78 కోట్లు, గన్నవరం రు. 34.8 కోట్లు, నిర్వాసితుల ఆరక్షణ క్రింద రూ. 136.18 కోట్లు, రు782 కోట్లు …యిలా చదివి చదివి మన నోరుపోతుంది. నా దగ్గర ప్రపంచ బ్యాక్‌, ఇంటర్నేషనల్‌  మానిటరీ ఫండ్‌, జపాన్‌ వంటి దేశాలనుండి తెచ్చిన అప్పుల జాబితా వివరాలు ముప్పైరెండు పేజీల నిండా ఉన్నాయి. వీటిని చూస్తే కంపరమెత్తుతోంది.
ఐతే…. మిత్రులారా… పెద్ద పెద్ద పరిశ్రమలు, దేశాలు అప్పుచేయకుండా ఎలా నిధులు సంపాదిస్తాయి. ఎలా సంక్షేమ పథకాలను చేపడ్డాయి  …అనే ప్రశ్నకు ఆర్థికశాస్త్రం ఏమంటోందంటే.భారీ ఋణాలనెప్పుడు ‘ఉత్పాదక రంగం’ కోసం చేయమంటోంది. ఉదాహరణకు.. ఒక ఉక్కు కార్మాగార నిర్మాణం కోసం వేయికోట్ల అప్పుచేస్తే.. అది ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత లాభాలతో అప్పు చెల్లించవచ్చు. కాని అనుత్పాదక రంగం కోసం అప్పు చేస్తే అవి శిరోభారమై వ్యవస్థను తినేస్తాయి.
ఐతే ఈ ఇర్రిగేషన్‌ ప్రాజెక్టుల క్రింద, రోడ్లు, ఆరోగ్యాభివృద్ధి, మురుగు కాల్వల అభివృద్ధి- మరమ్మత్తులు, వంతెనలు, విద్య.. ఆధునీకరణ.. ఇటువంటి అవ్యవస్థ రంగాల కోసం ఈ ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు అప్పుతెచ్చి మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, ఐఎఎస్సాఫీసర్లు, ఇంజినీర్లు, మున్సిపల్‌స్థాయి నాయకులు.. అందరూ బినామీ పేర్లమీద కాంట్రాక్టర్లయి, సప్లయర్లయి, డెవలపర్సయి, కన్‌స్ట్రక్టర్లయి.. అంతా పంచుకు తినడమే.. పోనీ ఆ చేసిన కొద్దిపాటి పనుల్నైనా నాణ్యంగా, ప్రామాణికంగా చేస్తారా అంటే అదీలేదు. అంతా నాసిరకం. సిమెంట్‌ లేదు, ఇసుక లేదు. స్టీల్‌ లేదు.. అంతా దుమ్ము, దుబ్బ, రోత.. లోతుకుపోయి చూస్తే తెలుసుకుని గుండెలు పగిలి చస్తాం మనం.
పాపం.. మహానుభావులు.. కె. కన్నబీరన్‌, కె. బాలగోపాల్‌ 14 డిసెంబర్‌ 2003న ప్రపంచ బ్యాంక్‌కు సవివరంగా ఒక లేఖ రాశారు.. యిక్కడి అవినీతికర పరిస్థితులను సవివరంగా వివరిస్తూ అయ్యా మహాప్రభో మీరిచ్చే దీర్ఘకాలిక కోటానుకోట్ల అప్పులను మా వాళ్లు పంచుకుని, నంజుకుని తింటున్నారు. మీరు మీస్థాయిలో తగుమోతాదులో లంచాలనుతీసుకుని యిస్తున్న లక్షల కోట్ల ఋణాలను ఇకనైనా ఉదారంగా మా నెత్తిన రుద్దడం ఆపేయమనీ, మమ్మల్ని ఇంకా ఋణాల ఊబిలో ముంచవద్దనీ వేడుకున్నారు. నోబుల్‌ బహుమతి గ్రహీత. అమర్త్యసేన్‌ కూడా భారతదేశంలో అనేక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రపంచబ్యాంక్‌ నుండి పైరవీ చేసి తెచ్చుకుంటున్న అప్పు నిధులను స్వాహా చేస్తున్నాయి గానీ సక్రమంగా ఉపయోగించడం లేదనీ.. అందువల్ల యిక అప్పులీయడం దయచేసి బంద్‌ చేయండనీ అభ్యర్థించాడు. కాని ప్రపంచబ్యాంక్‌ వాడింటాడా.. కమీషన్లు తీసుకుని అప్పివ్వడం వానికిష్టం.. అప్పుచేసి పంచుకుతినడం యిక్కడ వీనికిష్టం.. అదీ తంతు.
ఐతే.. యిప్పుడు సరిగ్గా ఈ దౌర్భాగ్య దయనీయ స్థితిపైన మనం మన ప్రజాచైతన్య బాంబు పేల్చి మన మొదటి యుద్దాన్ని ప్రకటించబోతున్నాం.
మిత్రులారా జాగ్రత్తగా వినండి.. యిప్పుడు నేను చెప్పబోయేది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా.. కోట్లాది రూపాయల ప్రాజెక్ట్‌లుగా.. పద్దెనిమిది ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌లు, ఇరవై ఆరు మేజర్‌ నేషనల్‌ రోడ్లనిర్మాణ పనులు, పద్దెనిమిది వంతెనల నిర్మాణాలు, ఇరవై ఎనిమది వివిధ మైనింగు ఆపరేషన్స్‌, పద్దెనిమిది మున్సిపాలిటీలలో ప్రపంచ బ్యాంక్‌ నిధులతో మురికివాడల అభివృద్ధి పనులు, ఎనిమిది గిరిజన ప్రాంతాల అభివృద్ధి పథకాలు, ఆరు పేద వృత్తిదారులకు ఉపకరణాల పంపిణీ పథకాలు.. ఇలా మొత్తం నూటా ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువకు తక్కువలేని పనులు అతి రోతగా, నాసిరకంగా, పంచుకుని మనం మనం తిందాం తరహాలో జరుగుతున్నాయి. వాటి పూర్తి వివరాలు యివిగో యివి.
ఎదుట ఎసిడీ స్క్రీన్‌పై ఒక్కో విండో ఒక ప్రాజెక్ట్‌ వివరాలు స్లైడ్‌షో వలె అంకెలతో సహా చూపిస్తోంది.
మనం ఈ నూటా ఎనిమిది ప్రాజెక్టులకు నూటా ఎనిమిది ‘జనసేన’ కమిటీలను ఆ పనులు జరుగుతున్న స్థలానికి దగ్గర్లో ఉన్న మన కార్యకర్తలతో ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో.. ఆయా ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఎక్స్‌పర్డ్‌ కమిటీ సారథిగా ఉంటాడు. ఉదాహరణకు..వరంగల్లులో ఎన్‌హెచ్‌ సెవెన్‌లో తొంభై రెండు కిలోమీటర్‌ స్టోన్‌నుండి నూటా నలభై రెండు కిలోమీటర్‌ స్టోన్‌ వరకు మొత్తం యాభై కిలోమీటర్లు రోడ్‌ లేయింగు వర్క్‌.. దీనికి.. ఇరవై ఎనిమిదిమంది జనసేన సభ్యులతో కలిపి కమిటీ వేస్తున్నాం. చైర్మన్‌ జి.పురుషోత్తమరావు. రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌. ఆర్‌ అండ్‌ బి. రోడ్డు దాని పుట్టుపూర్వోత్తరాలు పూర్తిగా తెలిసినవాడు. మరొక ఎమ్‌.టెక్‌ స్ట్రక్చర్స్‌ చదివిన యువ విద్యార్థి నాయకుడు ఆర్‌. గోఖలే ఉపసారథి. ప్రముఖ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ మురళీమనోహర్‌ వ్యవహర్త. ధర్మసాగర్‌ ఇండిపెండెంట్‌ ఎం.పి.టి.సి., ఎమ్మే చదివిన యాదరిగి, ఇతరేతర యువకులు మొత్తం ఇరవై ఎనిమిది మంది టీం యిది.
మన దగ్గర ఈ ప్రాజెక్ట్‌, ఫండ్స్‌ వివరాలు.. అవి ఏ నాబార్డ్‌ శాంక్షన్‌ క్రింద విడుదలయ్యాయి, మొత్తం ఎప్పుడు ఎంత విడుదలయ్యాయి.. వాటికి టెండర్లు ఎప్పుడు పిలిచి ఎవరికి కాంట్రాక్ట్‌ అప్పజెప్పారు. ఆ కాంట్రాక్టరెవరు.. అతని వివరాలు.. వర్క్‌ షెడ్యూల్‌, వర్క్‌ స్పెసిఫికేషన్‌.. ఆ పని ఎప్పుడెప్పుడు ఎంతవరకు కావాలి. ఎప్పుడు ఫినిష్‌ కావాలి. ఆ సమాచారమంతా ”రైట్‌ టు ఇన్‌ఫర్మేషన్‌ యాక్ట్‌ – 2005” క్రింద ఆయా సంబంధిత అధికారుల నుండి సర్టిఫైడ్‌ కాపీలను తీసుకుని సిద్ధంగా ఉంచాం. నిజానికి పని ప్రారంభిస్తున్నప్పుడు ఆ స్థలంలో ఆ ప్రాజెక్ట్‌ పూర్తి వివరాలు పొందుపరుస్తూ ఒక ప్రజాప్రకటన ఉంచబడాలి. కాని అదక్కడ లేదు. అన్ని వివరాలతో మనమే కొన్ని బోర్డులు రాయించాం. అవి యివిగో..”
వెంటనే ఎస్‌డిసీ స్క్రీన్‌పై బోర్డులు కనిపించాయి
”మన ‘జనసేన’ కార్యకర్తల చేతుల్లో ఎప్పుడూ కొన్ని ప్లెకార్డులుంటాయి.. పని జర్గుతున్న ప్రతిరోజూ మనవాళ్ళు అక్కడ ఉండి నాణ్యతా ప్రమాణాలను చెక్‌ చేస్తారు. మెటీరియల్‌,మిక్సింగు నిష్పత్తులు, రీఇన్‌పోర్సింగు స్టీల్‌ క్వాలిటీ, క్యూరింగు.. బి.టి. రోడ్డయితే దాని స్పెసిఫికేషన్స్‌.. అన్నీ..”
స్క్రీన్‌పై ప్లెకార్డులు దర్శనమిచ్చాయి. ” ఈ ప్రాజెక్ట్‌ డబ్బు ప్రజలది”.. ”ప్రజల డబ్బు ప్రజలకు చెందాలి.” ”నాణ్యతా ప్రమాణాలు మాకు ప్రాణం”, ‘నిర్మాణంలో అవినీతి సహించం.” ‘జనం డబ్బుకు జనమే కాపలా”, కాపలా కుక్కలం – తప్పు చేస్తే కరుస్తాం” .. ఇవీ
”మిత్రులారా.. అసలు ఈ పనిని మనచేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులైన ఎంపిటిసిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలుచేయాలి రాజ్యాంగం ప్రకారం.. కాని వాళ్ళే కాంట్రాక్టర్లయి దోచుకుంటున్నారు. కాబట్టే ఈ ప్రజల గర్జన, గాండ్రింపు అవసరమౌతున్నది.. మీరు మరో విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి.. మనం చేయబోతున్నది పూర్తిగా చట్టబ్దమైంది. సమాచారచట్టం ప్రకారమే మనం ప్రశ్నిస్తున్నాం. కాకుంటే ఒక బలమైన ప్రజావాణిని భరించలేనంత కటువుగా వినిపిస్తున్నాం.. ఇలా ప్రశ్నిస్తున్నామని.. ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు, సంబంధిత శాఖాధికారులకు ముందే తెలియజేశాం. అందరూ అంగీకారం తెలిపారు. తెలుపక తప్పదు వాళ్ళకు. లేకుంటే రేపు వాళ్ళే ప్రశ్నించబడ్తారు. ఎవ్రీథింగు యాజ్‌పర్‌ కాంస్టిట్యూషనల్‌ ప్రొవిజన్‌.. ఇక దీంతో చూడండి మిత్రులారా.. అధికార పీఠాలు కదుల్తాయి. ఇక నిశ్శబ్ద రక్తపాతరహిత విప్లవం రెక్క విప్పుతుంది.. గెట్‌ రెడీ.. జై జనసేన.. జై జై జనసేన..”
హాలునిండా చైతన్యం ఉప్పొంగి పొంగి వికసించింది.
నిస్వార్థమైన చింతన.. శుద్ధమైన ఆలోచన.. నిండైన అంకితభావం అక్కడి మనుషుల హృదయాల్లో తొణికిసలాడ్తున్నందువల్ల అందరి ముఖాల్లోనూ అతి సహజమైన జీవకాంతి, నిర్మలత్వం వెల్లివిరుస్తోంది. అందరిలోనూ విజయోత్సాహం ఉరకలెత్తుతోంది.
మూర్తిగారు కూర్చోగానే.. శివ లేచి.. ”మిత్రులారా.. వరంగల్లుకు సంబంధించిన ఎనిమిది కమిటీలవాళ్ళు.. బయట ప్రకటనా ఫలకంపై ఉన్న తమ తమ పేర్లను చూచుకుని సేవా విభాగం ఐదు నుండి తమ కమిటీకి సంబంధించిన ఆర్‌టిఐ సర్టిఫైడ్‌ కాగితాలు, ప్లకార్డులు.. అన్నీ తీసుకుని మీ కమిటీ సభ్యులతో విషయాలు చర్చించుకోవాలి. మేము యితర జిల్లాలలో ఉన్న మన మిత్రులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని సూచనలూ చేస్తాం.. ఈ రోజు తేదీ పదిహేను. సరిగ్గా ఇరవైయవ తేదీ ఉదయం పదకొండు గంటలకు మనం అనుకున్న నూటా ఎనిమిది వర్క్‌ స్టేషన్ల దగ్గరికి ప్రశ్నించడానికి, నిలదీయడానికి ఏకకాలంలో అన్ని కమిటీల వాళ్ళం హాజరౌతాం. ఇది భావి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడబోతున్న ఓ మహత్తర ఘట్టం. మనం ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నాం మిత్రులారా.. జై జనసేన…”
అందరూ నిశ్శబ్దంగా.. ఒక సైనిక శిబిరంలోలా నిబద్ధతతో విన్నారు.
వెంటనే… స్క్రీన్‌పై ‘జనసేన’ సమావేశ ముగింపు సంప్రదాయమైన లఘుచిత్రం ప్రత్యక్షమైంది.
ఒక దీపం.. ఆమె చేతిలో.. కదిలి కదిలి మరో దీపాన్ని వెలిగించింది.. ఇంకాస్త కదిలి మరో దీపాన్ని వెలిగించింది.. ఆ మూడు దీపాలూ కదిలి. మరికొన్ని దీపాలు.. మరిన్ని దీపాలు.. వత్తులు అంటుకుని వెలిగి వెలిగి .. ఎన్ని దీపాలో.. అన్నీ దీపాలే.,
అంతా తెల్లని కాంతి.

(సశేషం)

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)