జాపరయ్య ఒనుం

japarayya onum pic

నాకు అప్పుడు పదేండ్లుంటయ్ …మా సొంతూరు కలసపాడు లోని చర్చి కాంపౌండ్ లో ఉంటిమి…అప్పట్లో చర్చి కాంపౌండు లో పది ఇండ్లు ఉన్నెయి. స్కూలు హెడ్ మాస్టర్ కిష్టపర్ సార్ కుటుంబం …ఇంగా ఇద్దరు ముగ్గురు టీచర్ల ఇండ్లు …కుశిని పని చేసే వాళ్ళ ఇండ్లు ఒకటి ఉన్నెది. మాఇండ్లు  చర్చికి దగ్గరగా ఉన్నెది. అదే కాంపౌండులో మిషన్ హాస్పిటల్ లో పని చేసే డాక్టర్ పెద్దీటి దేవభూషణం సార్ వాళ్ళ ఇండ్లు …పాస్టర్ ఇండ్లు పక్క పక్కనే ఉన్నెయి. మా చర్చికాంపౌండు పక్కనే సగిలేరు పార్తది. ఇది పరమట పక్కఉంటది. తూర్పు పక్క పంట పొలాలు మాడి వనాలు ఉన్నెయి. కలసపాడు ఊరిలో నుండి చర్చికాంపౌండు కు వచ్చే దావలో ఎడం పక్క రెండు మాడి తోటలు వరసగా ఉన్నెయి. ఇంగో పక్క దాన్ని ఆనుకుని ఇంగోక మాడి ఒనుం ఉండేది. ఇది ఇప్పటికీ ఉంది. గాని ఆ రెండు వనాలు ఇప్పుడు లేవు.
మా శిన్నతనాన మాడికాయల సీజన్ వచ్చే పొద్దన లేచ్చానే మాడి తోటల కాడికి పోతాంటిమి..రాత్రిపూట రాలిన మామిడి కాయలు ఏరుకోవడానికి. మిషన్ కాంపౌండుకు ఆనుకుని ఉన్న ఒనుం పేరు జాపరయ్య ఒనుం. ఆ ఒనుంలో ఒకప్పుడు శీని శెట్లు…సపోటా శెట్లు ఇంగా ఏంటేంటియో ఉన్నెయంట.. నాక మతికి వచ్చారక మాత్రం టెంకాయ శెట్లు…మాడి శెట్లు  ఉన్నెయి. ఒక వరస మాడిశెట్లు ఎనిమిది ఉన్నెయి. వాటిని వేరే ఊర్లలో ఎట్ట పిలుచ్చరో తెలియదు గాని నాకు తెలిసి ఒక్కో చెట్టుకు ఒక్కో పేరు ఉంది.
మొగదాల ఉన్నె శెట్టు పేరు కొబ్బెర కాయ. ఆ శెట్టుపచ్చి కాయలు తింటే కొబ్బెర ఉన్నెట్టు ఉంటది అందుకని ఆ పేరు పెట్టింటరు అనుకుంటి.

 

దాని ఆనుకుని ఉన్నె శెట్టు పేరు దబ్బకాయ..దాని ఆనుకుని ఒక పెద్ద శెట్టు …ఉన్నెది. దాని పరవాత ఓ నాలుగైదు శెట్లు తరవాత ఒకపెద్ద మేడి శెట్టు ..దాని తరువాత వాటిలో ఒకటి పచ్చడి కాయ అని ఇంగో దానికి ఇంగోపేరు …అయితే ఆ గేరిలో శివరాకరి శెట్టు పేరు పసుపు గాయ శెట్టు.. ఆ శెట్టు కాయలు పసుపు వాసన వచ్చాంటయి..అది మాగితే మధురంగా ఉంటాన్నెది. అంద మధురం మళ్ళీ జీవితంలో ఏ మాడి పండులో గూడా సూడలేదు. దానికి ఒక్కరవ్వ దూరంగా అంటే మాడి ఒనుం మధ్యలో ఒక పక్క మహారాజులాగా బేనీసా శెట్టు ఉన్నెది. దాని ముందు ఒక పాడు పడ్డ దిగుడు బావి ఉండేది.దాంట్లో పెద్ద పెద్ద జర్రిపోతులు నీళ్ల పాములు, తాంబేళ్ళు ,, గోందురు కప్పలు ఉండేటివి. మిషను కాంపౌండును అనుకని ఉండే వరసలో రెండు మాడి శెట్లు ఉండేవి. ఒకటేమో పచ్చడి కాయ…కట్టవ నానుకుని ఒకపెద్ద శెట్టు ఉండేది. ఆ శెట్టు కాయలు మాగితే అందులో పీసు ఉండేది కాదు ఉత్త కండ ఉండేది. ఒనుమంతటికీ ఒక సపోటా శెట్టు ఉండేది. దానికి జాపరయ్య కాపలా ఉండేవాడు.
జాపరయ్య గురించి చెప్పాలంటే ఆ మనిషి ఆరుడుగులుంటాడు. తూకమైన మనిషి.

జాపరయ్య వాళ్ళన్న పోలీసు. ఆయన కర్నూలు లో ఉండేవాడు.

ఆయన  వాడిన పాత కాకి నిక్కర్లు జాపరయ్యకు పంపితే అవి ఏసుకునే వాడు. జాపరయ్యను నిక్కర్లో తప్ప సలవ గుడ్డల్లో ఎప్పుడూ సూడలేదు.

ఆ మిషన్ కాంపౌండులో చదివిన వాళ్ళకు వాళ్ళ టీచర్లు ఎంత గుర్తో జాపరయ్య కూడా అంతే… ఆడ చదివిన వాళ్ళందరూ దాదాపుగా జాపరయ్య మామిడి కాయల  దగ్గర కాతా పెట్టిన వాళ్లే . మాడి కాయలు మాగక ముందు బేనిశా,,, కొబ్బరి కాయలు రాలి పడినోటియి అమ్మేవాడు.. పండ్లయినంక వాటిని కూడా అమ్మేవాడు. అయితే ఆయన కాడ శానా  మంది అప్పు పెట్టేవాళ్ళు … వాళ్ల చదువు అయిపోయి పొయ్యేప్పుడు కొందరు అప్పు తీర్చి పొయ్యే వాళ్ళు. కొందరు ఇవ్వకుండా పోయే వాళ్ళు ..అట్ట పోయినోళ్ళు పదేండ్ల తరువాత తిరిగి వచ్చినా కూడా ఆయన వాళ్ళ పద్దు పుస్తకంలో రాసి పెట్టుకుని అడిగే వాడు. ఎప్పుటికి అప్పుడు పద్దు బుక్కు మార్చి బడి పిల్లోళ్ళతో రాయించుకునే వాడు.అట్ట కనపడినప్పుడు  కొందరు ఇచ్చే వాళ్లు కొందరు ఎగ్గొట్టే టోళ్లు . అయినా ఆయన అడిగినోళ్ళకు కాదనకుండా మాడికాయలు ఇచ్చేవాడు.
ఆయన తెల్లారతానే ఒనుం కాడికి వచ్చేవాడు. రాత్రి శీకటి పన్నెంక తిరిగి ఇంటికి పొయ్యేవాడు. ఉదయం వచ్చా వచ్చా సద్దిబువ్వ తెచ్చుకుని పైటాల కల్లా ఒనుం కాడనే తినేటోడు. మద్ధానం అయ్యార్కల్లా జాపరయ్య ఇంటికాడ నుండి ఓ బేసిన్ కు ఎర్రగుడ్డ కప్పి రాగి సంగటి వచ్చేది.మాడికాయల సీజన్ అయితే రోజూ మాడికాయ కారెమే వచ్చేది. లేకుంటే ఏదన్నా పప్పు…ఇంగేదన్నా కూర వచ్చేది. దాన్ని ఆయన ఒనుం లో ఏడబడితే ఆడ నేల మీదనే కూచ్చోని గబ  గబా తినేటోడు. ఆదోవన పల్లెలకు పొయ్యేటోళ్ళు ఎవురన్నా కాసేపుఆయన కాడ గొంతు కూకోని ఎవ్వారం జేసి పోయేటోల్లు.
ఎవురన్నా కోతి నాయళ్ళు చెట్ల మీద రాళ్ళు ఏచ్చే జాపరయ్య కు కోపం వచ్చేది.

Kadha-Saranga-2-300x268

వాళ్ళను కుత్తేగా… పప్పు చారు పడ్తది అని తిట్టేటోడు.. ఆరెండు మాటలు తురక యాసలో తెలుగులో తిట్టేవాడు…

అయి బో సోగ్గా ఉండేవి. కొందరు ఆయనకు కోపం తెప్పిచ్చి తిడతా ఉంటే తిట్టించుకున్న వాళ్ళతో సహా అందరూ నవ్వుకునే వాళ్ళు . అట్టాటి మనిషి జాపరయ్య.
ఆయన ఒనుం ఇడ్సి యాడికి పోయినట్టు నాకు గుర్తు లేదు. ఊర్లో వాళ్ళ కులమోళ్ళ పెండ్లిండ్లు జరిగినా పెద్దగా పోయేటోడు కాదు. ఏదైనా పెద్ద పండగ ఉంటేనే మజీద్ కు నమాజ్ కు పోయేటోడు. ఆయన అట్ట పోయినపుడు ఆయన భార్య బూమ్మ నెత్తికి గుడ్డ కట్టుకుని ఒనుంకు కాపలా ఉండేది. ఆమె ఒనుం కాడ కూకోని ఉంటే ఆ దావన పోయేటోళ్ళు అందరూ “ఏం బూమ్మా జాపరయ్య యాడికి పోయినాడు” అని అడిగే వాళ్ళు.
బంగళాలో ఏదైనా పండగా పబ్బం వచ్చే భూషణం సారు వాళ్ళు ఆయనకు ఇంట్లో ఒండిన బువ్వ కూరాకు పంపించే వాళ్లు ..జాపరయ్యకు ఏదైనా జరమొచ్చినా.. పుండు లేసినా భూషణమయ్య లెక్క తీసుకోకుండా మందులు ఇచ్చేవాడు. అట్ట ఆయనకే కాదు వారి కుటుంబానికి మొత్తానికి లెక్క తీసుకోకుండా చూసేవాడు. దాంతో జాపరయ్యకు భూషణమయ్య అంటే గౌరవం ఉండేది.భూషణమయ్య డైనిమా ఉన్నె హీరో సైకిల్ మీద ఆసుపత్రికి బయలు దేరి ఒనుంమీద పొయ్యేటప్పుడు జాపరయ్య కూచ్చున్నోడల్లా లేసి సలాం సార్ అనేవాడు. ఆయన అలేకుం సలాం జాపరపయ్యా అనుకుంటా పోయేటోడు.

ఆయనకు తన తోటలో కాసే మాడికాయలు, టెంకాయల ఇచ్చేవాడు. ఒకేల శెట్టుమీద మాడికాయ మాగిఉంటే అది కావాలంటే కోసిచ్చేటోడు. భూషణమయ్య పిల్లోల్లు ఒనుం లోకి పోతే ఏమనేవాడు కాదు. పురుగో పుట్టో ఉంటది బద్రంగా పోండి అని చెప్పేవాడు. మా లాంటి పిల్లనాయాల్లను పోనిచ్చే వాడు కాదు. అందుకని మాకు సందు దొరికినప్పుడల్లా దొంగతనంగా మాడికాయలు తెంచే వాళ్ళం.
మా మిషన్ కాంపౌండ్ లో మిషనరీలు కట్టిన పెద్ద బంగళా ఉండేది. కాంపౌండు నిండా చెట్లు ఉండేవి. ఎండా కాలం సెలవులు వచ్చే సాలు అక్కడ సంసారం ఉండే వాళ్ళ పిల్లోళ్ళమంతా రక రాకాల ఆటలు ఆడుకనే వాళ్ళం. మద్యానం దాకా సగిలేట్లో ఈత కొట్టి మద్యానం నుండి బంగళాలో డీండార్.. కోతికొమ్మచ్చి ఆటలు ఆడుకనే వాళ్ళం..మాకంటే పెద్దోళ్లు బంగళా వరండాలో కూకోని అచ్చన గాయలు …బారకట్టా ఆడుకునే వాళ్లు. అంతా ఒకటే జాతి అయనా అక్కడ డబ్బు ఉన్న వాళ్ళ లేనోళ్ళుతేడాఉండనే ఉండేది. సాయంకాలం వనాల కాడికి పోయే వాళ్ళం భూషణమయ్య పిల్లోళ్ళు మాత్రం ఒనుం లోపలికి పోయేటోళ్ళు మేము ఒనుం కట్టవంబడి బయట తిరిగి కంపలో రాలి పడిన కాయలు ఏరకచ్చుకునే వాళ్ళం. అట్ట రాలిన కాయలు మాగేచ్చే బో కమ్మగా ఉండేయి.
ఒక రోజు మద్యాన్నం నుండే ఆకాశం ఎర్రబడతా ఉంది. ఉక్క పోత్సాంది..ఆకు కదలడం లేదు. సగిలేట్లో ఈత కొడతా ఉంటే ఎప్పుడూ సల్లగా ఉండే నీళ్ళు ఆ రోజు ఉడుగ్గా ఉండాయి. ఒక్కో సాటయితే జౌకుల మాదిరి ఉండాయి. నేను ఎప్పుడూ ఏటికి ఆనుకుని ఉండే తుమ్మ శెట్టు కిందికి పోయి నీళ్ళలో మునిగే వాడిని .. ఆ రోజు ఎందుకో ఆడికి పోడానికి భయమేసింది. ఆడికి అందరూ పోలేరు. నేను సోమయ్యగాడు ఒకరిద్దరు తప్ప ఎందుకటే ఆడ నీళ్ళలో కంప ఉంటది. అది యాడుంటదో ఆడికి ఎట్ట బోవాల్నో మాకు తెలుసు. సోమయ్య గాడు ఒక్కడే పోయినాడు గాని శానా శేపు ఉండలేక బయటికి వచ్చినాడు. ఆ రోజు ఏట్లోనుండి బెరీన ఎనిక్కి తిరుక్కుంటిమి.

రెండు మూడు రోజులయితే శనక్కాయ కట్టె పీకుతారనంగా కయ్యలకు నీళ్ళు కడతారు. అట్ట కట్టిన శేను ఒకటి గుడి ఆనుకుని ఉంటే ఆ శేలేకి కాపలా ఉండే వాళ్ళకు కనపడకుండా కంపలో కంత ఒకటి జేచ్చిమి. దాని గుండా పొయి పెరక్కజ్జామనుకుంటే…ఆ శేనుగలోళ్లు ఆన్నే ఉండారు. దాంతో ఉసూరుమంటా బంగళా లోకి వచ్చిమి. ఆడ అచ్చనగాయలు బారకట్టా ఆడే వాళ్ళ కాడ కూకోని వాళ్ళు ఆడుకుంటా మాట్లాడుకుంటా ఉంటే సూచ్చాంటిమి.
ఎండ పలపలా కాచ్చాంది. ఒకటే ఉక్కపోత.. ఆట ఆడే వాళ్ళలో గడ్డమీద దేవరాజన్న తువ్వాలతో మెడమీద ఉన్నె శెమట తుడ్సుకుంటా..”అబ్బ ఏందిరా నాయనా ఇంత మిడ్సరంగా ఎండ కాచ్చాంది. ఊపిరి ఆడ్డంలేదు”అన్నాడు. బంగళానిండా శెట్లుఉన్నా గూడా ఆకు అల్లాడ్డంలేదు. ఉగ్గ దీసుకున్నెట్టు ఉండాయి. మేము పిల్ల నాయాళ్ళం కాబట్టి మాకు ఏమి అనిపియ్య లేదు. గేటు కాడుండే శింత శెట్టు కాడికి పోతిమి.ఆడాడ శింత బోట్లు ఉండాయి. ఈ శెట్టు కాపు లేటు అయినట్టు ఉంది శిగురు కాచ్చాన్నా ఆడాడా శింత బోట్లు ఉండాయి.

అవి కింద పడ్నాయేమో అని ఎతుకుతాంటిమి. ఇంతలో ఉన్నెట్టు ఉండి శింత శెట్టు మెల్లగా ఊగడం తిరుక్కున్నెది. ఆ ఊగడం కాసేపటికి ఎక్కువయినాది. ఆ ఊగడం ఎట్టుందంటే దెయ్యం పట్టినోళ్ళు ఊగినట్టు శింత శెట్టు ఊగడం దిరుక్కున్నెది. అట్ట గాలి లేచ్చాంటే భూషణమయ్య పిల్లోళ్ళు ఒనుంతట్టి పరిగెట్టిరి మంచి మాగిన కాయలు గాలికి పడతాయని…వాళ్ళు ఒనుం కాడికి శేరుకునారకల్లా గాలి ఇంగొక్కరవ్వ ఎక్కువయింది. మాన్లన్నీ ఎట్టుండయంటే ఎప్పుడన్నా మా నాయనకు కొపమొచ్చి మా యమ్మను కొడితే ఆ దెబ్బలకు మా యమ్మకు కోపమొచ్చి మా నాయన్ను ఏమి అనలేక కోపంతో ఎట్ట ఊగుతదో అట్ట ఊగుతాండయి.
నేను సోమయ్యగాడు శింతశెట్టు తొర్రలో ఒదుక్కోని కూకుంటిమి. ఇంతలో గోలీ కాయలంత సైజులో వడగండ్ల వాన పడ్డం దిరుక్కున్నెది. మేము శెట్టు తొర్రలో దాక్కున్న దాన మా మీద ఏమి పడ్డంలేదు.మేము తొర్రలో కూచ్చోని బితుకు బితుకు మంటా సూచ్చాంటిమి. శింతశెట్టు కొమ్మలు నేలకు తగిలేట్టు ఊగుతాండయి. ఇంతలో ఆకాశంలో మెరపులు మెరుచ్చాండయి రెండు పెద్ద బండరాళ్ళు రాసుకున్నెట్టు ఉరుము తాఉంది.

కాసేపటికి శిమ్మ శీకటి అయింది ఆకాశం కిందపడ్తదా అన్నెంత గా ఉంది పరిస్థితి. ఆకాశం నుండి ఓ మేఘంజారి కింద పడిందేమో అన్నెట్టు వాన అట్ట కురిసింది. శింత శెట్టు కింద నిండి వాన నీళ్ళు పోతాండయి. శెట్ల కింద ఉన్నె శింత శిదుగు కొట్టుకోని పోతాంది. గర గర మంటూ ఒక్కసారిగా భూమి మీద ఆకాశం ఊడి పడినట్టు పెద్ద శబ్దం జేచ్చా ఒక్క పిడుగు పడింది. అంత సేపటి వరకు ఇదల గొట్టిన వాన ఎవురో ఆపినట్టు ఆగి పోయింది. అట్ట ఆగుతానే నేను సోమయ్య గాడు శింత శెట్టు తొర్రలో నుండి బయటకు దూకితిమి..ఎండిన శింతాకు…యాపాకు…రెండూ తడిచ్చే వచ్చే వాసన వచ్చాంది. అప్పటి దాంకా పొగలు కక్కుతా ఉన్నె నేల మీద ఒక్క సారి వాన పడ్డంతో నేల లోపల బొక్కల్లో దాక్కోని ఉన్న సీమలు ..పురుగులు బయటకు వచ్చి నేల మీద పాకుతాండయి. నేలంతా తడి తడిగా ఉంది.
అప్పుడే నీళ్ళు పోసుకున్న దయ్యం మాదిరి ఉన్నె శెట్ల మీద ఆకుల మీద పడి నిలబడి పోయిన వాన శినుకులు ఒక్కొక్కటి నేల మీద పడతా ఉండాయి. నేను సోమయ్య తడిసి సన్నగా నీళ్ళు పారతా ఉన్నె నేల మీద మునిగాళ్ళ మీద నడుచ్చా జాపరయ్యా ఒనుం తట్టు దావబడ్తితిమి.

మేము ఉరుకుతా పోయ్యేప్పటికే ఆడ జనం గుమి కూడి ఉండారు . కొందరు ఆదలా బాదలా అట్టిట్ట పరిగెడ్తా ఉండారు. మాకు ఆడేం జరుగుతాందో…… ఎందుకు అందరూ అట్ట ఉరుకుతాండరో ఒక బంగిట అర్ధం కాక పాయ. ఎట్టయితే నేని గుమికూడినా జనం కాడికి పోతిమి? ఎవురు మాట్లాడం లేదు. మమ్మల్ని జూసి కుసిని పని జేసే మనిషి, ఇంటికి పాండి నాయాళ్ళారా ఎప్పుడూ శెట్లంబడే ఉంటారు. అని మమ్మల అదిలిచిన్నాడు.

ఏమైంది మామా అని అడిగితే మేడి శెట్టు ఇరిగింది. దానికింద భూషణమయ్య పెద్ద కొడుకు పడి సచ్చిపోయినాడు అని అన్నాడు. మాకు అర్ధం కాలేదు.
భూషణమయ్య పెద్ద కొడుకు పేరు దాస్ అయినప్పటికీ అందరూ శిట్టిబాబు అని పిలుచ్చాంటారు. మేము గూడా అట్టనే పిలుచ్చాంటిమి.

మా కంటే ఓ ఐదారేండ్లు పెద్దోడు అయినా కూడా బో తులవ. ఎప్పుడూ మాతో పాటు ఈతకు వచ్చాన్నడు. సగిలేట్లో ఈత కొడతా మునిగాట ఆడేవాళ్ళం ఆ ఆటలో ఎవురన్నా మునిగితే ఆ మనిషి గూడా వాళ్ళకంటే లోతులో మునిగి వళ్ళ కాళ్ళు పట్టి లాగి వాళ్ళకు కనపడకుండా పోయేవాడు.

లాగించకున్నోళ్ళు ఓ యమ్మా ఏదో దెయ్యం నీళ్ళలో నా కాళ్ళు పట్టుకోని గుంజినాది అని ఆయాస పడతా గడ్డకు చేరేవాళ్ళు శిట్టిబాబన్న మాత్రం ఏమి ఎరగనట్టు ఏమైందిరా అని అడిగే వాడు. .. కాసేపయినంక నేనే గుంజింది అని శెప్పి అందరినీ బాగా నవ్వించేవాడు. అంతే గాని ఎవురితో కొట్లాడంగా నేను సూడలేదు.
నేను ఇసయం ఇనంగానే ఉరుకుతా మా ఇంటికి పోయినాను. మా యమ్మ గాలివానకు శెదిరిపోయిన మా ఇంటి పైకప్పు బోదను సరిజేచ్చా ఉంది. నేను ఉరుకుతా పొయి గస పెడతా ఉంటే….. ఏంది నాయనా అన్నట్టు జూసింది మాయమ్మ. యమా….అంటూ ఆయాస పడతా… శిట్టిబాబన్న… జాపరయ్య తోటలో శెట్టిరిగి పడి సచ్చిపోయినాడు అని శెప్తి. అది ఇనడం… ఇనడం మా యమ్మ నా శెంపకేసి శెల్లుమని ఒక్కటి పీక్కింది. ఎంత కోతిపని చేసినా ఎప్పుడన్నా ఊరికే అట్ట గొట్టే మాయమ్మా తొట్టతొలిగ నాశెంప కేసి కోపంగా పీకింది.
నేను దెబ్బనుండి తెరుకుండార్కల్ల జాపరయ్య తోటకాన్నుండి జనం బాబు ఇంటిముందుండే గిలకరాయి నుండి శిట్టిబాబన్ను ఎత్తుకొని ఇంటికాడికి తీసకపోతాండరు. అదిజూసి మాయమ్మ పరుగులందించుకున్నెది.
నేను గూడా మాయమ్మ ఎంటంబడిపరిగెత్తి భూషణమయ్య భార్య ఏమైంది ఏమైంది అనుకుంటా ఎదురొచ్చె  ఇంతలో ఎవురో మంచమేసిరి ఇంగెవరో దప్పటి కప్పిరి. గబ గబా అందరూ అన్నీశేయ్యబట్టిరి ఆసుపత్రి కాన్నుండి ఇంటికి వచ్చిన భూషణమయ్య కొడుకు శవాన్ని జూసి గుండెల బాదికోని ఏడ్సినారు . అందరూ ఏడుచ్చాండారు మాయమ్మ గూడా ఏడుచ్చానే ఉంది.
మా ఊరోల్లే గాకూండా సుట్టుపక్కల పల్లెలోలు గూడా తిర్నాలకు వచ్చినట్టే  వచ్చిరి.
ఎట్ట జరిగిందబ్బా అని అందరూ మాట్లాడుకుంటాండిరి.
మామూలుగా అయితే ఎంతగాలి వచ్చినా మేడిశెట్టు పడదు. అట్టాటి శెట్టు అదీ గూడా శెట్ల మద్య శెట్టు ఎగిరి పన్నెది అంటా.. ఈ సావు మాములుదిగాదు.
ఈ మద్య భషణమయ్య వాళ్ళ శేనికాడ బాయి తవ్వంచినారంట… ఆ బాయి బలిగోరితే ఇయ్యలేదంట.. కనీసం మేకనో పోట్టేలినో ఇయ్యలేదంట అందుకని ఆయన పల్లొన్ని బలి తీసకున్నాది అని తేల్చిరి.
ఇంగా కొందరు ఇంగొక రకంగా చెప్పుకునిరి కాలం గిర్రునా తిరిగిపోయ కొన్నీ ఏండ్ల తరువాత నేను మా ఊరికి పోతి అక్కడ ఒనుం  లేదు.అయితే జాపరయ్యాకి గుర్తుగా ఓ టెంకాయ శెట్టు మసలిదై ఊగుతా కనిపిచ్చింది.
అదే ఈ కతను నడిపిచ్చింది.

-బత్తుల ప్రసాద్

prasad

Download PDF

1 Comment

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)