మా మాధ్యమిక పాఠశాల – ఈశ్వర పుస్తక భాండాగారం రోజులు …

తాళపత్రాలు చూస్తున్న నాతో చిరంజీవినీ కుమారి గారు

chitten raju

 

 

 

 

 

కాకినాడ గాంధీ నగరానికి ఎల్విన్ పేటకీ సరిహద్దులో ఉన్న అప్పటి “ఆనంద పురం ఎలిమెంటరీ స్కూలు లో ఐదో క్లాసు పూర్తి చెయ్యగానే నన్ను రామారావుపేట లో ఉన్న మ్యునిసిపల్ మిడిల్ స్కూల్ లో చేర్పించారు మా నాన్న గారు. అప్పటికే మా సుబ్బన్నయ్య..అంటే నా పై వాడు పి.ఆర్. కాలేజియేట్ హైస్కూల్ లోనూ, మా అక్క మెక్లారిన్ హై స్కూల్ పక్కనే ఉన్న గర్ల్స్ హై స్కూల్ లోను చదువుకునే వారు. వాళ్లిద్దరూ రోజు బస్సులో స్కూల్ కి వెళ్ళే వారు. బహుశా ఆ అవస్త చూడ లేక అరగంటలో నడిచి వెళ్లి పోయే ఈ రామారావు పేట మిడిల్ స్కూల్లో నన్ను వేశారేమో నాకు తెలియదు కానీ మా ఇంట్లోంచి ఆ స్కూల్ కి  వెళ్ళిన వారిలో నేనే మొదటి వాడిని. నా తరువాత మా తమ్ముడు ఆంజీ (హనుమంత రావు), మా ముగ్గురు చెల్లెళ్ళూ (భాను, పూర్ణ, ఉష) అ స్కూల్లోనే , ఆ తరువాత గాంధీ నగరం మ్యునిసిపల్ హైస్కూల్ లోనూ చదువుకున్నారు. అంటే సుమారు ఇరవై ఏళ్ళు మా ఇంట్లోంచి ఎవరో ఒకరు ఈ రెండు పాఠశాలలలోనూ చదువుకున్నారు. నాకు తెలిసీ ఇది ఒక రికార్డే!

మా చిన్నప్పుడుఈ ఎల్కేజీ, పీకేజీ అంటూ “కేజీ” గోల, కేజీల కొద్దీ పుస్తకాల మోతా ఉండేది ఉండేది కాదు. ఐదో ఏట అక్షరాభ్యాసం అవగానే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ప్రాధమికపాఠశాల అంటే ఎలిమెంటరీ స్కూల్, ఆ తరువాత పదో ఏట ఒకటో ఫార్మ్ లో ప్రవేశించి మూడో ఫార్మ్ దాకా మాధ్యమిక పాఠశాల అంటే మిడిల్ స్కూల్, ఆ తరువాత మూడేళ్ళు ఉన్నతపాఠశాల అంటే హై స్కూల్…నాలుగో ఫార్మ్ , ఐదో ఫార్మ్ & ఎస్.ఎస్.ఎల్.సి..అనగా సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ తో స్కూల్ చదువు పూర్తి అయేది.

1954-55 లో నేను రామారావు పేట లో శివాలయం రోడ్డు మీద ఉన్న ఈ మాధ్యమికపాఠశాల లో ఫస్ట్ ఫార్మ్ లో చేరాను. అప్పుడు ఆ స్కూల్లో మూడోఫార్మ్ దాకానే ఉండేది. నేను మూడో ఫారం లోకి వచ్చాక నాలుగో ఫార్మ్ పెట్టారు. ఒక్కొక్క ఫార్మ్ కీ “ఎ” సెక్షన్ అనీ “బీ” సెక్షన్ …విద్యార్థుల సంఖ్య ఇంకా ఎక్కువ గా ఉంటే “సీ” క్లాస్ అనీ సుమారు నలభై మంది ఉండే రెండు, మూడు సెక్షన్స్ ఉండేవి. ఎందుకో తెలియదు కానీ కాస్త తెలివైన వాళ్ళని “ఏ” క్లాస్ లో వేసే వారు. నేను ఎప్పుడూ “ఏ” క్లాస్ లోనే ఉండే వాడిని. అంచేత తెలివైన వాడిని అనే అనుకోవాలి. అదేం విచిత్రమో అందులో కూడా నేను మొదటి వాడిగానే ఉండే వాడిని. ఎందుకంటే ఎప్పుడు ఏ పరీక్ష పెట్టినా అందరి కంటే ఎక్కువ మార్కులు నాకే వచ్చేవి. అలా అని నేను ఎప్పుడూ “రుబ్బుడు” గాడిని..అంటే పుస్తకాల పురుగుని కాదు. ఎప్పుడూ గట్టిగా కష్టపడి చదివిన జ్జాపకం లేదు కానీ మేష్టారు చెప్పిన పాఠం శ్రద్ధగా వినడం, జ్జాపకం పెట్టుకోవడం మటుకు బాగా జ్జాపకం. ఇప్పటికీ నాకు ఎవరైనా”ప్రెవేటు” చెప్తుంటే వినడం ఇష్టం. ఎవరైనా దొరికితే “ప్రెవేటు” చెప్పడం అంతకన్నా ఇష్టం.

నా మూడవ ఫార్మ్ లో

అప్పుడు మా స్కూల్లో రెండు సిమెంటు బిల్డింగులు, వెనకాల ఒక పెద్ద పాక ఉండేవి. ఆ పాకలో ఒకటో ఫార్మ్, రెండో ఫార్మ్ తరగతులు, ఒక సిమెంట్ బిల్డింగులో మూడో ఫార్మ్, ఆ తరువాత నాలుగో ఫార్మ్ క్లాస్ రూములు ఉండేవి. రెండో సిమెంట్ బిల్డింగులో ప్రధానోపాధ్యుడి గారి ఆఫీసు, సైన్స్ లాబ్, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ గది ఉండేవి. అప్పుడూ, ఆ తరువాత హైస్కూల్ కి వెళ్ళాకా కూడా ఆరేళ్ళ పాటూ మా హెడ్మాస్టర్ గారు ఒక్కరే.

ఆయన పేరు వి.ఎస్.ఆర్.కే.వి.వి.వి.యస్. సత్యనారాయణ గారు. ఆయన ఏదో మాట వరసకి ఇంగ్లీష్ లిటరేచర్ చెప్పేవారు కానీ హెడ్మాస్టారు పనులే ఎక్కువగా చేసే వారు. మాధ్యమిక తరగతులలో “పాక’లో పాఠాలు చెప్పిన వారిలో బాగా జ్జాపకం ఉన్న వారు తాతబ్బాయి గారు, జి. సత్యనారాయణ గారు. ఇందులో తాతబ్బాయి గారు చాలా తమాషాగా, కారు నలుపు మనిషి అయినా ఆయన తెల్లటి పంచె, లాల్చీలతో, కుర్చీలో కాళ్ళు రెండూ మడత పెట్టుకుని కూచుని ఒక దాని తరువాత ఒకటి గా నాలుగైదు సబ్జెక్టులు చెప్పే వారు. పొద్దుట ఎనిమిది గంటల నుంచి పన్నెండు దాకా నాలుగు పీరియడ్స్ అవగానే మేము గబా, గబా మధ్యాహ్నం భోజనానికి ఇంటికి పరిగెట్టే వాళ్ళం.

హడావుడిగా తిండి తినేసి మళ్ళీ ఒంటి గంట కల్లా క్లాసుకి చేరగానే ఆయన అప్పటికే సుష్టుగా భోజనం చేసి కుర్చీలో కునుకు తీస్తూ ఉండే వారు. అంచేత మధ్యాహ్నం క్లాసులన్నీ మందకొడి గానే జరిగేవి. ఆయన మాట్లాడేది తక్కువ. నాచేత, మిగిలిన తెలివైన కుర్రాళ్ళ చేత చదివించేసి, లెక్కలు చేయించేసి, తన కునుకు కంటిన్యూ చేసే పద్ధతి ఎక్కువ గా ఉండేది. ఎటొచ్చీ ఆయన చేతిలో ఒక బెత్తం, పక్కనే డ్రాయర్ బయటి లాగి పెట్టి ఉంచిన ఒక బల్ల ఉండేవి. ఆ నిద్రలో కూడా మా కుర్రాళ్ళలో ఎవరైనావెర్రి వేషాలు వేసినట్టు గమనించారా…ఇక అంతే సంగతులు. బెత్తం తో కొట్టడం చిన్న శిక్ష కానీ, కుర్రాళ్ళ చేతి వేళ్ళని కొసన లో పెట్టి ఠకీమని ఆ డ్రాయర్ మూసేస్తే ఆ బాధ నరక యాతనే! అందరమూ నెల మీదే కూచునే వాళ్ళం కాబట్టు బెంచీ ఎక్కే సదుపాయమూ, గోడ కుర్చీ వేసే ఏర్పాట్లూ ఉండేవి కాదు.

 

నా విషయానికి వస్తే ఆ క్లాసుకి నేనే మానిటర్ ని. అందుచేత ఎవడైనా అల్లరి చేస్తే ఆ వివరాలు తాతబ్బాయి గారికి మెలకువ రాగానే చెప్పవలసిన బాధ్యత నాదే. ఆ అల్లరి తీవ్రతని బట్టి ఆయన బెత్తమా, చేతివేళ్ళు చితికిపోవడమా అని నిర్ణయించే వారు. నేను “రాము మంచి బాలుడు” కాబట్టి ఆ రెండిటికీ ఎప్పుడూ నోచుకోక పోయినా, క్లాస్ మానిటర్ గా నా రిపోర్టింగ్ సరిగ్గా లేదు అని ఎవరైనా రిపోర్ట్ చేస్తే ఆ శిక్షలు నాకు పడే అవకాశం ఉండేది.

దేవుడి దయ వలన ఆ అవకాశాన్ని నేను ఎప్పుడూ ఉపయోగించుకో లేదు. ఇక సత్యనారాయణ గారు చరిత్ర పాఠాలు ఎంతో ఆసక్తికరంగా చెప్పే వారు. ఇప్పుడూ టక్ చేసుకుని దర్జాగా ఉండే వారు. ఒకటో ఫార్మ్ నుంచి మూడో ఫార్మ్ దాకా మాకు తెలుగు పాఠాలు ఎవరు నేర్పారో నాకు ఇప్పుడు ఖచ్చితంగా గుర్తు లేకపోవడం చాలా సిగ్గుగా ఉంది. బహుశా వేదుల సత్యనారాయణ గారే అయిఉండాలి. తెలుగులో నాకు ఇప్పటికీ పాండిత్యం అబ్బ లేదు కానీ మార్కులు బాగానే వచ్చేవి.

ఇక అన్ని క్లాసులూ బాహాటంగా ఉంటే ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ క్లాసు మరొక ఎత్తు. దానికి చుట్టూ స్టీలు తడికలతో ఎవరూ దొంగతనం చెయ్యకుండా తాళం వేసే వీలు ఉండేది. ఆ క్లాస్ రూము లో డ్రాయింగ్ సామానులు ..అంటే కుంచెలూ, రంగు డబ్బాలూ, కుట్టు యంత్రాలు, బొమ్మలు చేసే రబ్బరు మొదలైనవి ఉండేవి. అన్నింటి కన్నా ముఖ్యంగా గాంధీ గారి రాట్నాలతో దూది నుంచి దారం వడికి, దాంతో మా చెడ్డీలు మేమే కుట్టుకోవడం నేర్పించే వారు. ఆ విద్య నాకు అబ్బ లేదు. ఎప్పుడు దారం తీసినా అది చిక్కు పడిపోయి నా మొహం లా ఉండేది. చెడ్డీ కాదు సరికదా, జేబు రుమాలు కూడా కుట్టుకోడానికి పనికొచ్చేది కాదు   అన్ని క్లాసులకీ కలిపి ఇవన్నీ నేర్పే ఒకే ఒక్క బక్క చిక్కిన మేష్టారు ఉండే వారు. ఆయన పేరు గుర్తు లేదు కానీ అందరూ ఆయన్ని “తకిలీ” మేష్టారు అనే పిలిచే వారు.

నేను మూడో ఫార్మ్ దాకా నేల మీదే కూచుని చదువుకున్నాను. క్లాస్ మేట్స్ పేర్లు గుర్తు లేవు కానీ లక్ష్మీ నారాయణ అని ఒక కుర్ర్రాడు, అతని చెల్లెలూ కూడా మా సెక్షన్ లోనే ఉండే వారు. విశేషం ఏమిటంటే అతనికి ఎప్పుడూ నా కంటే నాలుగైదు మార్కులు తక్కువే వచ్చేవి. ఎలాగైనా నన్ను మించిపోవాలని, మా ఇంటికి కంబైండ్ స్టడీస్ కి వచ్చే వాడు. కానీ మనం అసలు అంతగా చదివితేగా?

ఇది కాక మా స్కూల్ లో ఎ.సి.సి అనే విభాగం ఉండేది. అంటే అసోసియేటేడ్ కెడేట్ కోర్ అనమాట. ఇది హైస్కూల్ లో ఉండే ఎన్.సి.సి (నేషనల్ కేడేట్ కోర్) కి అనుబంధ సంస్థ. అందులో నేను కొంచెం హుషారుగా పాల్గొనే వాడిని. అది నిర్బంధమో కాదో నాకు గుర్తు లేదు కానీ నమ్మండి, నమ్మక పొండి, నాకు అలా ఆర్మీ వాళ్ళ లాగా, పెద్ద పోలీసు వాళ్ళ లాగా యునిఫారం వేసుకుని తిరగడం సరదాగా ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో కాకినాడలో ఉన్న ఒకే ఒక్క కాన్వెంట్ స్కూల్లో తప్ప స్కూల్ యునిఫార్మ్స్ ఉండేవి కాదు. ఎవరికీ తోచిన చొక్క్కాలు, చెడ్డీలూ వాళ్ళు వేసేసుకోవడమే! మేము వేసుకునే బట్టలని బట్టి మా సోషల్ స్టేటస్ ..అప్పుడప్పుడు కులం తో సహా తెలిసిపోయేది.

సరిగ్గా అదే కారణానికి నేను కొన్నాళ్ళు ఆర్. ఎస్.ఎస్. లోకూడా చేరాను. ఎ.సి.సి. లో తుపాకీ పట్టుకోవడం నేర్పిస్తే వీళ్ళు కుస్తీలు, పెద్ద తాళ్ళతో పీట ముడి వెయ్యడాలు మొదలైన డిఫెన్స్ విద్యలు నేర్పే వారు. నాకు ఆ రెండూ రాలేదు. మా రోజుల్లోనే రైట్ టర్న్, మార్చ్ లాంటి ఇంగ్లీషు పదాలు పోయి బాయే ముడ్, పీచ్చే ముడ్, ఆగే బడ్ లాంటి హిందీ మాటలు వచ్చి వాటి మీద మా క్లాసు రౌడీలు చెప్పకూడని జోకులు వేసుకునే వారు. నేను బ్రాహ్మల అబ్బాయిని కాబట్టి నన్ను చూడగానే ఠపీమని నోరు నొక్కేసుకునే వారు . బహుశా ఈ రోజుల్లో దానికి ఆపోజిట్ ఏమో !

నేను మిడిల్ స్కూల్ లో ఉండగా ఉన్న ఒకే ఒక్క ఫోటో ఆ ఎ.సి.సి యూనిఫారం లో ఉన్నదే. అది ఇక్కడ జత పరుస్తున్నాను. రూపు రేఖలు మారిపోయిన ఆ స్కూల్ ముందు గుమ్మం ఫోటో కూడా ఒకటి జతపరుస్తున్నాను.

Ramarao peta school 1 ఓకే

మా మిడిల్ స్కూల్ ప్రాంగణం లోనే “ఈశ్వర పుస్తక భాండాగారం” అనే చిన్న అతి విశిష్టమైన బిల్డింగ్ ఉంది. నిజానికి దాని పవిత్రత, చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా దాన్ని “భవనం” అనాలి.  “శ్రీ వేణు గోపాల సంస్కృత ప్రచార సభ” అనే ఆ బిల్డింగ్ 1903 లో కట్టారు. రోజూ సాయంత్రం  అయ్యేటప్పటికల్లా అన్ని పేపర్లూ, పుస్తకాలూ చదవడానికి వచ్చే జనం తో ఆ హాలు నిండి పోయేది.

అక్కడ మా తాత గారి పుస్తకాలతో పాటు కొన్ని వందల అపురూపమైన తెలుగు పుస్తకాలు, తాళపత్ర గ్రంధాలు ఇంకా అందుబాటులో ఉన్నాయి. కానీ చదివే వాళ్ళే కరువై పోయారు. ఆ బిల్డింగ్ వెనకాల ..అంటే మా స్కూల్ గ్రౌండ్స్ వేపు ఒక చిన్న వేదిక ఉండేది. ఇంచుమించు ప్రతీ రోజూ ఆ వేదిక మీద ఏదో ఒక హరి కథో, బుర్ర కథ, పురాణ కాలక్షేపం, సాహిత్య ప్రసంగం మొదలైనవి జరుగుతూ ఉండేవి. పండగల రోజుల్లో రికార్డింగ్ డాన్సులు కేవలం రోడ్ల మధ్యలో వేసిన పందిళ్ళలో జరిగేవి.

నా రోజు వారీ రొటీన్ ఏమిటంటే సాయంత్రం స్కూల్ బెల్లు కొట్టగానే ఇంటికి పరిగెట్టి, క్రికెట్ బేటు, వికెట్లూ వగైరాలు పట్టుకుని పి. ఆర్. కాలేజీ గ్రౌండ్స్ కి వెళ్లి ఆడుకోవడం. ఆట అయి కొంచెం చీకటి పడే సమయానికి “సత్తెయ్య” గాడు అర నిముషం ఆలస్యం చెయ్యకుండా ఠంచనుగా పట్టుకొచ్చే వేరు శనక్కాయలు, ఐస్ క్రీం కడ్డీలు, ఒకటో, రెండో తినెయ్యడం. అక్కడ నుంచి ఈశ్వర పుస్తక భాండాగారం దగ్గర మా స్కూల్ ఇసక గ్రౌండ్స్ లో కూచుని ఈశ్వర పుస్తక భాండాగారం వారు ఏర్పాటు చేసిన పురాణ కాలక్షేపం తన్మయత్వంలో విని, తరించి, అది అయిపోగానే ఆ రోడ్డు మీదే ఉన్న శివాలయానికి వెళ్లి దణ్ణం పెట్టుకుని ఆచారి గారు పెట్టిన సాతాళించిన శనగలు ప్రసాదం తినేసి “ఆటలు, పాటలు, నాటికలూ” చాలించేసి ఇంటికెళ్ళి పోవడం.

మా రోజుల్లో “హోమ్ వర్క్” ఇచ్చేసి ఉపాధ్యాయులు చేతులు దులుపేసుకునే వారు కాదు. వాళ్ళు ఏం చెప్పినా క్లాసులోనే క్షుణ్ణంగా చెప్పే వారు. మేము ఏం నేర్చుకున్నా క్లాస్ లోనే నేర్చుకునే వాళ్ళం. టీవీలు లేవు. రేడియోల పాత్ర పరిమితమైనదే.   అందుకే ఆట, పాటలకీ, పై పుస్తకాలు చదువుకోడానికీ సమయం ఉండేది. పిల్లలం పిల్లలుగానే జీవించే వాళ్ళం. అది మా తరం చేసుకున్న అదృష్టం.

ఇక గతం నాస్తి అనుకుని ఎంతో విచారంగానే ప్రస్తుతానికి వస్తే, నేను ఇటీవల (ఫిబ్రవరి 2014) కాకినాడ వెళ్ళినప్పుడు రూపు రేఖలు మారిపోయిన మా స్కూలు, ఈ గ్రంధాలయాల లో కొన్ని గంటలు గడిపి, పెద్ద పోజు పెట్టి మా మాధ్యమిక పాఠశాల దగ్గరా ఈశ్వర పుస్తక భాండాగారం లోనూ ఫోటోలు తీయించుకున్నాను కానీ నా కంప్యూటర్ కి ఏదో వైరస్ మాయ రోగం ఆవహించి నేను తాళ పత్రాలు తిరగేస్తున్న ఒక్క ఫోటో తప్ప మిగిలిన ఫోటోలు అన్నీ గాలిలో కలిసిపోయాయి. అది ఇక్కడ జతపరుస్తున్నాను.

Eswara Pustaka Bhandagaram 2 ఓకే

ఇప్పటి దౌర్భాగ్యం చూడాలంటే అలనాడు మాకు సాంస్కృతిక భిక్ష పెట్టిన మా ఈశ్వర పుస్తక భాండాగారం ఈ నాడు ఎలా ఉందో ఇందుతో జత పరిచిన ఒక ఫోటో చూస్తే తెలుస్తుంది. ఆలనా, పాలనా లేక పోయినా, కార్పొరేషన్ వారు గాలికొదిలేసి, వారి రాజకీయాల గాలి మేడలు కట్టుకుంటున్నా, స్థానిక విద్యావేత్త, సాంస్కృతిక ప్రముఖురాలు అయిన డా. చిరంజీవినీ కుమారి గారి నాయకత్వంలో కొందరు ఆ గ్రంధాలయాన్ని ఇంకా నడిపిస్తూనే ఉన్నారు. కృష్ణ కుమార్ అనే నాట్యాచార్యులు గారు ఆ హాలు లోనే కూచిపూడి నృత్యం నేర్పిస్తూనే ఉన్నారు.

ఈ ఫోటో చూడగానే విధి ఎంత విపరీతమైనదో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నూట పది సంవత్సరాల క్రితం ఈ స్థలం సమాజానికి విరాళంగా ఇచ్చి అక్కడ గ్రంధాలయం, సాంస్కృతిక వేదిక కట్టిన వారు ఈ నాటి కమ్యూనిస్ట్ రాజకీయ ప్రముఖులైన యేచూరి సీతారాం గారి పై తరం వారు. ఈ నాడు అదే కమ్యూనిస్ట్ పార్టీ వారు ఈ బిల్డింగ్ గోడల మీద రంగుల బొగ్గుతో తమ రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారు.

తాళపత్రాలు చూస్తున్న నాతో చిరంజీవినీ కుమారి గారు

తాళపత్రాలు చూస్తున్న నాతో చిరంజీవినీ కుమారి గారు

 

 

నేను తీసుకున్న ఫోటోలు హుష్ కాకీ అయిపోయాయి కాబట్టి ఈ వ్యాసం కోసం అడిగిన వెంటనే ఈ ఫోటోలు తీసి పంపించిన రామారావు పేట నివాసి, ఆత్మీయ మిత్రుడు అయిన యనమండ్ర సూర్యనారాయణ మూర్తికి పత్రికా ముఖంగా నా ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. నలుగురి సహకారంతో  ఆ గ్రంధాలయాన్ని కొంతైనా పునరుధ్ధరించే ప్రయత్నంలో ఉన్నాను. చూద్దాం ఎంత వరకూ చెయ్యగలమో?

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)