“ డార్క్ హోల్డ్స్ నో టెర్రర్ “ – చాలా అప్రయత్నంగా మరే పుస్తకమూ లేదు కదా ఏదో ఒకటి అన్న ధోరణిలో చదవడం మొదలు పెట్టాను.
మొదటి రెండు పేజీలు చదివేసరికే నన్నిలా గాలం వేసి లాగేసింది ఆమె రచనా సంవిధానం.
ఆ ఆసక్తి తోనే వెళ్లి బెంగుళూర్ లో జయనగర్ లో ఆవిడను ఒకసారి చూసి వచ్చి చాలా కాలమే అయింది.
అద్దం లాటి ఇల్లే కాదు అద్దంలాటి ఆలోచన వ్యక్తీకరణ ఆవిడ సొంతం.
రచన వృత్తిలా ఉదయం నుండి సాయంకాలం వరకు ఫోన్ కాల్ కూడా తీసుకోకుండా రాస్తారని విని ఆశ్చర్యపోయాను. ఒక నవల కోసం దాదాపు 1500 పేజీలు రాసి ఎడిట్ చేసుకుని ౩౦౦ పేజీల్లోకి కుదిస్తారని విన్నాక తెలిసి వచ్చింది ఆవిడ రచనలో చిక్కదనం రహస్యం.
చదువుకున్న మధ్య తరగతి మహిళల సంఘర్షణ , నగర జీవనం, అస్తిత్వ పోరాటం ఆమె ఆయుధాలు.
ఈ దశాబ్దం లోనూ చదువుకుని వివిధ రంగాలలో రాణిస్తున్న మారని మధ్య తరగతి స్త్రీ మనస్తత్వం చిత్రణ ఒక విధంగా రచయిత్రిని స్త్రీ వాద రచయిత్రిగా చిత్రీకరిస్తాయి. కాని ఎంత అభ్యుదయం సాధించినా ఇంకా భారతదేశ సమాజం అణువణువునా విస్తరి౦చిపోయిన పురుషాధిక్యత స్త్రీ నుండి ఏవిధమైన విధేయత ఆశిస్తొ౦ది, ఎలా చిన్నచూపు చూస్తోంది ఈ శతాబ్దంలోనూ మిగిలిపోయిన ఆనవాళ్ళు ఆమె నవలలు.
సాంప్రదాయకంగా సౌమ్యత ,విధేయత పుణికి పుచ్చుకుని ఇంట్లోని మగవారి అదుపాజ్ఞలలో ఉండాలనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ.వేష భాషల్లో మార్పు వచ్చినా ఆలోచనా విధానంలో ప్రవర్తనలో ఇంకా అనుకున్నంత అభ్యుదయం రాలేదేమో నన్న వాస్తవం ఆవిడ నవలల్లో తొంగి చూస్తూ వుంటుంది.
అలాటి నవలలోకి రచయిత్రికి అతి ప్రియమయిన నవల ఇప్పుడు ఒకసారి చూద్దామా !
“ డార్క్ హోల్డ్స్ నో టేర్రర్స్” లో కధానాయిక సారు ఒక అసాధారణ మధ్యతరగతి మహిళ, సంతృప్తి నివ్వని వివాహం.చిన్నతనంలో ఎదురైన గొప్ప అవమానం, నిర్లక్ష్యం, పెళ్లి అయినా పెద్దగా మారని స్థితి.తల్లిదండ్రులకున్న
పక్షపాతం కొడుకు కావాలన్న బలీయమైన కోరిక, ఆడపిల్లకు మగ బిడ్డకు మధ్య చూపే వివక్ష ,పెళ్లి తరువాత భర్త కన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రావడం వల్ల సామాజిక జనాల ప్రవర్తన వల్ల శాడిస్ట్ గా మారిన భర్త , అతని ఆత్మా న్యూనత , ఆ అసహాయత , విసుగు అదంతా మను ఆమె పైన రాక్షసంగా పైశాచికంగా దాంపత్య జీవనంలో స్పష్టం గా చూపడంలో వైవిధ్యం స్పష్టత కనబరిచారు.
తల్లీ బిడ్డల మధ్య అదీ కూతురికీ తల్లికీ మధ్య సఖ్యత లేకపోవడం ముఖ్య మైన విషయం గా, తల్లి ప్రవర్తన వల్ల సారూ కూడా తల్లిపట్ల ఆమెకు సంబంధి౦చిన విషయాలైన ఆచార వ్యవహారాల పట్ల విముఖత పెంచుకోడం, ఎదుగుతున్న సమయం లో సారూ అనుభవాలు స్త్రీ త్వాన్ని ఏవగి౦చుకునేలా చేస్తాయి.
నవలంతా తల్లితో ఆమెకు గల విముఖత చుట్టూనే అల్లబడి౦ది.తల్లికి అయిష్టమనే ఆమె మెడిసిన్ చదవడం , కాని కులంలో పెళ్లి చేసుకోడం జరుగుతాయి.
కధానాయిక ముఖ్య పాత్రగా మిగతా మగ పాత్రలు నాయిక చుట్టూ పరిభ్రమిస్తాయి. భర్తలో పురుషాధిక్య భావన అహంకారం కనబడితే , తండ్రిలో వాత్సల్యం ప్రేమ విశాలమైన భావాలు పెంపొందుతాయి. మిత్రులు మాత్రం సానుభూతి పరులు. మొత్తానికి మగ పాత్రలన్నీ నాయిక వ్యక్తిత్వాన్ని ,ఉనికిని స్పష్టంగా చూపడానికి సహకరిస్తాయి.
పురుషాధిక్య సమాజంలో , ముఖ్యంగా సంప్రదాయబద్ధమైన పరిసరాల్లోఉక్కిరిబిక్కిరయిపోయే భారతస్త్రీ జీవనాన్ని ఆమె దౌర్భాగ్యాన్నీ సచిత్రంగా చిత్రీకరించారు రచయిత్రి.ఆమె స్త్రీ పాత్రలు వారి వారి భయాలు, ఆశలు, ఆశయాలు, నిస్పృహల్లో ఊయలూగుతారు. వారికి వారి బలాలూ తెలుసు బలహీనతలూ తలుసు.
అయినా పురుషాధిక్య ప్రపంచంలో తృణీకరణ కు గురవుతారు.
మధ్యతరగతి స్త్రీ జీవనాన్ని సున్నితంగా వాస్తవంగా ఆవిష్కరించిన నవలలు ఆమెవి.