ప్రభాతమైనా…. ప్రదోషమైనా…. ప్రశాంతమే!

నేటి ఆధునిక జీవితం మనుషుల్ని ఎన్ని ఒత్తిడులకు గురి చేస్తోందో అందరికి తెలిసిందే. పగలూ, రాత్రి, ఆఫీసూ.. ఇల్లూ… తేడా లేకుండా యంత్రాల వలె పనిచేస్తూ ఉరుకులు పరుగుల మీద ఉంటున్నారు జనం. డైలీ టార్గెట్లు… వీక్లీ టార్గెట్లు… మంత్లీ టార్గెట్లు… ఇలా పనిచేసే సమయమంతా టార్గెట్లని వెంటాడుతూ ప్రశాంతత కోల్పోతున్నారు. విశ్రాంతి కరువై శారీరకంగానూ, మానసికంగాను అలసిపోతున్నారు. మరి ఈ వలయం నుంచి బయటపడడం ఎలా? పూర్తిగా బయటపడలేకపోయినా, కాస్త విరామం తీసుకుని, కొత్త ఉత్తేజం పుంజుకుని మళ్ళీ పరుగుపందెంలో పాల్గొంటే ఉత్సాహంగా ఉంటుంది.

మరి కొత్త ఉత్తేజం పొందడం ఎలా? కొందరికి పుస్తకాలు, కొందరికి సినిమాలు, కొందరికి ఆటలు, కొందరికి యాత్రలు… ఉత్సాహాన్నిస్తాయి.

యాత్రలలో మళ్ళీ పలురకాలు.. వినోద యాత్రలు.. విజ్ఞాన యాత్రలు.. ఆధ్యాత్మిక యాత్రలు….

ఆధ్యాత్మిక యాత్రలంటే ఎక్కడో దూరంగా ఉన్న కేదారనాథ్, బదరీనాథ్ యాత్రలే కానవసరం లేదు. మనకి దగ్గరలో ఉన్న ఆలయాలని దర్శించడం కూడా ఆధ్యాత్మిక యాత్రే అవుతుంది. “ఈ వయసులో గుళ్ళూ, గోపురాలు ఏంటి బాస్” అని కొందరు, “ఆఁ, గుళ్ళలో మాత్రం ప్రశాంతత ఎక్కడుంది? భక్తులను తరిమే సిబ్బంది, బిచ్చగాళ్ళు… వ్యాపారులూ… అంతా కమర్షియల్ కదా…” అని మరి కొందరు అంటారు. నిజమే. అన్ని ఆలయాలలోను ప్రశాంతత దొరుకుతుందని కచ్చితంగా చెప్పలేం కాని.. సంవత్సర కాలంలో కొద్ది రోజులు తప్ప మిగతా కాలమంతా అత్యంత ప్రశాంతంగా ఉండే గుడి ఒకటుంది. అదే కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయం.

ఈ ఆలయం గురించి వెళ్ళేవరకూ కూడా నాకు పెద్దగా ఏమీ తెలియదు. కాని అక్కడికి వెళ్ళి ఆ ప్రశాంతతని అనుభూతి చెందాకా, ఆ అనుభవాన్ని అందరితో పంచుకోవాలనుకున్నాను. అందుకే ఈ వ్యాసం.

∗ ∗ ∗

KSSinDoubleDeccarTrainది 15 ఆగస్టు 2014 నాడు నేనూ, మా బాబాయి కొల్లూరి గణేశ్ కలిసి ఉదయం 5 గంటల 45 నిముషాలకి మల్కాజ్‌గిరి స్టేషన్‍లో కాచీగుడా – గుంటూరు డబుల్ డెక్కర్ ట్రైన్ ఎక్కాం. రైలు ఓ పది నిముషాలు ఆలస్యంగా వచ్చింది. 5.45 కే బండి అని తెల్లారకట్టే లేచాను. 4.45కి తాగిన టీ తప్ప కడుపులో ఏం లేదు. రైల్లో ఇంకో కప్పు టీ తాగచ్చులే అనుకున్నాం కానీ, కాటరింగ్ వాళ్ళెవరు రాలేదు. నల్గొండ స్టేషన్‌లో కేటరింగ్ వాళ్ళొచ్చినా, టిఫిన్లే తెచ్చారు… టీ లేదు. చేసేదేముందని కాసేపు కునుకు తీసాం. మిర్యాలగుడా, నడికుడి స్టేషన్లు ఎప్పుడు దాటిపోయాయో గమనించలేదు. ఇంకో పది నిముషాల్లో పిడుగురాళ్ళ వస్తుందనగా మెలకువ వచ్చింది. పిడుగురాళ్ళలో 9.10కి దిగాం. సూపర్‌ఫాస్ట్ ట్రైన్ అన్నారు కానీ 205 km దూరానికి సుమారు మూడు గంటల సమయం తీసుకుంది.

పిడుగురాళ్ళ స్టేషన్ నుంచి బయటకొచ్చి నర్సరావుపేట వెళ్ళేందుకు బస్ స్టాండ్‌కి షేర్ ఆటోలో వెళ్ళాం. పిడుగురాళ్ళ నుంచి నర్సరావుపేటకి గంటంపావు పట్టింది ఆర్డినరీ బస్‌లో. మా బాబాయి కోటప్పకొండ గుడికి తరచూ వెడతాడు కాబట్టి, నర్సరావుపేటలో కొంతమంది మిత్రులయ్యారు. ఒక ఆటో డ్రైవర్‍తో కూడా టచ్‌లో ఉంటాడు. నర్సరావుపేటలో దిగగానే ఓ మిత్రుడిని కలిసాం. పలకరింపులయ్యాక, టీ తాగి, ఆటోలో కోటప్పకొండకి బయల్దేరాం. నర్సరావుపేట బస్‌స్టాండు నుంచి కోటప్పకొండ ఆలయానికి సుమారు 16కిమీ దూరం ఉంటుంది. ఘాట్ రోడ్ మీదుగా ఆలయానికి చేరాము. ఆఖరి అభిషేకానికి సమయం అవుతుండడంతో, కాళ్ళూ చేతులు కడుక్కుని, మా లగేజ్ అంతా ఆలయ సిబ్బంది వద్ద ఉంచి దర్శనానికి వెళ్ళాం. శ్రావణ శుక్రవారం, సెలవు రోజు కావడంతో కాస్త రద్దీగానే ఉంది గుడి. అభిషేకమూ, అర్చన చూసుకుని బయటకు వచ్చాం. ఆలయ సిబ్బందిలో మా బాబయికి తెల్సినవాళ్ళు ఉండడంతో, మాకు భోజనం ఏర్పాటు చేసారు. వారితో పాటే వారి గదిలోనే అన్నం తిని, ఆలయంకి దిగువన ఉన్న దేవాలయం వారి గది ఒకటి అద్దెకు తీసుకుని, కాసేపు విశ్రాంతి తీసుకున్నాం.

 

∗ ∗ ∗

TempleView

ఆలయ సిబ్బంది నుంచి ఓ బ్రోచర్ సంపాదించి, అక్కడున్న ఓ స్టాల్‌లో డా. పోలేపెద్ది వేంకట హనుమచ్ఛాస్తి రచించిన “కోటప్పకొండ చరిత్ర – క్షేత్ర వైభవం” పుస్తకం కొనుక్కుని అలయ చరిత్ర, స్థల పురాణం తెలుసుకున్నాను. కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయం ప్రాచీనమైనది. చారిత్రాక శాసనాల ప్రకారం క్రీ.శ. ఒకటవ శతాబ్దం నాటికే ఈ దేవాలయం ఉన్నట్లు చెబుతారు. వివిధ మహారాజుల ఏలుబడిలో గత పదిహేడు వందల సంవత్సరాలుగా పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతోంది. నరసరావుపేట మండలంలోని ఎల్లమంద, కొండకావూరు అనే గ్రామాల మధ్య ఉన్న పర్వతరాజం త్రికూటాచలం. దీన్నే కోటప్పకొండ అని కూడా పిలుస్తారు. సుమారు 1600 అడుగుల ఎత్తు, ఎనిమిది మైళ్ళ చుట్టుకొలత ఈ పర్వతాన్ని ఏవైపు నుంచి చూసినా మూడు కూటాలుగా (శిఖరాలు) కనిపిస్తాయి. సృష్టి, స్థితి, లయలకు రూపాలుగా బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల పేరిట మూడు శిఖరాలున్నాయి.

దక్ష యజ్ఞ విధ్వంసం చేసిన తరువాత లయకారుడైన మహాశివుడు శాంతివహించి బాల వటువులా శ్రీ దక్షిణామూర్తి స్వరూపంలో మధ్య శిఖరమైన రుద్రశిఖరంపై ఉన్న మారేడువనంలో ధ్యానమగ్నుడయ్యాడట. ఈ శిఖరం మీదే బ్రహ్మకు, విష్ణువుకు, సకలదేవతలకు, సనకసనందనాది మునులకు, నారదుడికి, ఎందరెందరో సిద్ధులకు, వశిష్టాది ఋషులకు జ్ఞానబోధ చేసాడట. సమస్తదేవతలు సేవించి తరింప, శివుడు దక్షిణామూర్తి రూపంలో చిన్ముద్రధారుడై దర్శనమిచ్చాడని భక్తుల విశ్వాసం. ఇదే పాత కోటప్ప గుడి. ఇక్కడే ప్రాచీన కోటేశ్వర లింగం ఉంది. శ్రీ దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వులు. “ఓం నమః ప్రణవార్థాయ శుద్ధఙ్ఞానైకమూర్తయే | నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ||” అని ఆది శంకరులు ప్రార్థించి తరించారు.

రుద్ర శిఖరానికి ఈశాన్య భాగాన మరో శిఖరం ఉంది. అదే విష్ణు శిఖరం. దక్షయజ్ఞం సందర్భంగా శివుడు లేకుండానే హవిర్భాగం స్వీకరించినందుకు దోష నివారణ కోసం, విష్ణువు ఇంద్రుడు ఇతర దేవతలతోకలసి ఇక్కడ తపస్సు చేసాడట. ఈశ్వరుడు కరుణించి ప్రత్యక్షం కాగా, తాము ఎల్లవేళలా అర్చించుకోడానికి లింగరూపంలో ఆ శిఖరంపై నిలచి దర్శనమీయమని దేవతలు కోరగా, తన త్రిశూలంతో రాతిపై పొడిచి జలం ఉద్భవించజేసి, ‘ఈ జలమందు స్నానమాచరించి నన్ను పూజించిన మీ పాపములు నశించునని’ చెప్పి అక్కడ లింగరూపంలో వెలిసాడట. దేవతలు అక్కడ స్నానమాచరించి, తమ పాపాలను పోగొట్టుకున్నారట. పాప వినాశన క్షేత్రమిది.

రుద్రశిఖరానికి నైరుతి దిశలో బ్రహ్మ శిఖరం ఉంది. రుద్ర, విష్ణు శిఖరాలలో పూజనీయ లింగాలు ఉండి తన శిఖరంలో లింగం లేకపోవడంతో బ్రహ్మ ఈశ్వరుని గురించి తపస్సు చేయగా, శివుడు అక్కడ కూడా లింగ రూపంలో వెలిసాడు. నేడు అర్చనలు అందుకుంటున్న మహిమాన్విత దివ్యరూప శిఖరం బ్రహ్మశిఖరం. లింగరూపధారుడైన నూతన కోటేశ్వరుడు నేటికినీ ఈ శిఖరం మీదే అశేషభక్తుల పూజలందుకుంటున్నాడు. ఈ మూడు శిఖరాలలోనూ జ్యోతిర్మయ లింగాలు ఉన్నాయనీ, మానవులకు అగోచరమగుటచే శిలాలింగములు నేడు విశిష్ట పూజలందుకుంటున్నాయని పండితులు చెబుతారు.

∗ ∗ ∗

 

TrekkingPathవిశ్రాంతి అనంతరం, సాయంత్రం నాలుగున్నరకి స్నానం చేసి, రుద్రశిఖరంపై ఉన్న పాత కోటప్ప లింగాన్ని దర్శించాలని బయల్దేరాం. ప్రస్తుతం ఉన్న గుడి నుంచి పైకి సుమారు ఒకటిన్నర – రెండు కిలోమీటర్ల దూరంలో పాత కోటప్పగుడి ఉంది. ప్రస్తుతం ఇక్కడ పూజలేం జరగడం లేదు. రోజూ పొద్దున్న సాయంత్రం ఓ సాధువు కొండెక్కి, అర్చన, దీపారాధన చేసి వస్తాడట. ఓపిక ఉత్సాహం ఉన్నవాళ్ళు ఆ కొండెక్కి అక్కడి లింగానికి స్వయంగా పూజలు చేసుకోవచ్చు. పూజాసామాగ్రి తీసుకుని కొండెక్కుదామని బయల్దేరి, కొంత దూరం ఎక్కామో లేదో పెద్దగా వాన! ముందుకు వెళ్ళాలో వద్దో తేల్చుకోలేకపోయాం. చీకటి పడేలోగా కొండ దిగి వచ్చేయాలని మా ఉద్దేశం. ఈ వానకి జడిసి, వెనక్కి వచ్చేద్దామా అని అనుకున్నాం. కాని ఉదృతి ఆగి, తుంపరగా మారడంతో ముందుకే సాగాం. “పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు” అనే వేమన పద్యాన్ని గుర్తు చేసుకుని ఎక్కడం కొనసాగించాం. కొండపైకి ఎక్కుతున్న కొద్దీ నాకు అలసట, ఆయాసం వచ్చాయి. గత మూడేళ్ళుగా శబరిమలకి కూడా వెళ్ళకపోవడంతో, నాకు ఈ కొండ ఎక్కడం కష్టమనిపించింది. మా బాబయి సులువుగానే ఎక్కేస్తున్నాడు, నేనేమో పది అడుగులు వేయడం ఆగిపోవడం! పనివేళలు పట్టించుకోకుండా, ఏం తింటున్నామో చూసుకోకుండా, సరైన నిద్ర లేకుండా ఉంటుండడంతో బరువు పెరిగిపోయి శరీరం స్థూలకాయమవుతూ ప్రమాద ఘంటికలు మ్రోగిస్తోంది. అప్పుడే స్ఫురించింది శరీరానికి కనీస వ్యాయామం ఎంత అవసరమో. ఆ క్షణంలో ఆ కొండ (ప్రకృతి) మౌనంగా బోధించేది అదేనని అర్థమైంది.

కొండలెక్కడం గురించి ఎప్పుడో చదివిన కొన్ని వాక్యాలు గుర్తొచ్చాయి. “At bottom, mountains, like all wildernesses, challenge our complacent conviction – so easy to lapse into – that the world has been made for humans by humans. Most of us exist for most of the time in worlds which are humanly arranged, themed and controlled. One forgets that there are environments which do not respond to the flick of a switch or the twist of a dial, and which have their own rhythms and orders of existence. Mountains correct this amnesia. By speaking of greater forces than we can possibly invoke, and by confronting us with greater spans of time than we can possibly envisage, mountains refute our excessive trust in the man-made. They pose profound questions about our durability and the importance of our schemes. They induce, I suppose, a modesty in us.” – అని “Mountains of the Mind: Adventures in Reaching the Summit” అనే పుస్తకంలో అంటాడు రచయిత Robert Macfarlane.

PataKotappaGudi

DarkCloudమొత్తానికి తడుస్తూనే, రాళ్లూ రప్పలను దాటుకుంటూ శిఖరాగ్రానికి చేరాము. అనుకున్నట్లే అక్కడ ఎవరూ లేరు. నేను, మా బాబాయి తప్ప మరో మనిషి లేడు. వర్షంతో తడిసిన బట్టలను అక్కడ చెట్ల మీద ఆరేసుకుని, నా బ్యాగ్ లో పట్టుకెళ్ళిన పంచలు ధరించి అక్కడి లింగానికి పూజ చేసుకున్నాం. ఆ శిఖరం నుంచి చూస్తే చుట్టూ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది. అత్యంత ప్రశాంతంగా ఉన్న ఆ చోటు వదిలి రా బుద్ధి కాలేదు. కానీ చీకటి పడేలోగా క్రిందకి దిగాలి కాబట్టి, దిగసాగం. దిగేడప్పుడు అంత కష్టమనిపించలేదు. మళ్ళీ జోరున వాన. ఓ చెట్టు చాటున ఆగాం. జీవితంలో ఏదైనా సాధించడమనేది శిఖరాగ్రాన్ని చేరడం లాంటిదని, అక్కడికి చేరాక, ఇంక సాధించడానికి ఏమీ ఉండదని, మళ్ళీ క్రిందకి దిగి రావల్సిందేనని అనిపించింది. ఎక్కేడప్పుడు ఎంత జాగ్రత్తగా ఎక్కామో, దిగేడప్పుడు అంతే జాగ్రత్తగా దిగాము. ఏమరుపాటుగా ఉంటే కాలు జారి పడడం ఖాయం. విజయం తరువాత గర్వం తలకెక్కితే పతనం తప్పదని ప్రకృతి ఈ రకంగా చెబుతోందని అనిపించింది. గదికొచ్చి, తడిసిన బట్టలు ఆరేసుకుని, పొడి బట్టలు ధరించి భోజనం చేసి విశ్రమించాం.

∗ ∗ ∗

కొండ ఎక్కడానికి నానా అవస్థలు పడ్డ నన్ను చూసి మా బాబాయి ఓ కథ చెప్పాడు. ఓ మహిళ కొన్ని సంవత్సరాల పాటు రోజూ ఈ కొండెక్కి ఆ లింగాన్ని పూజించేదని చెప్పాడు. ఆ కథేంటంటే… కొండకావురు గ్రామంలో సునందుడు, కుందరి అనే యాదవ దంపతులకు ఆనందవల్లి అనే కూతురు ఉందేది. పుట్టుకతోనే శివభక్తిని అలవడిన ఆమెకి వయసుతో పాటు ఆ భక్తి పెరిగింది. రోజూ రుద్రశిఖరమెక్కి అక్కడ జంగమరూపంలో ఉన్న శివునికి త్రికరణ శుద్ధిగా పూజచేసి, పాప వినాశన క్షేత్రం నుంచి తీసుకువెళ్ళిన జలంతో అక్కడి లింగానికి అభిషేకం చేసి, తాను తీసుకువెళ్ళిన ఆవుపాలను నైవేద్యంగా పెట్టేది. ఎండనకా, వాననకా ఎంతో శ్రమల కోర్చి కొండ ఎక్కి స్వామిని అర్చించి దిగి వచ్చేది. ఆమె వివాహం ప్రస్తావన లేకుండా నిరంతరం శివుని ధ్యానంలోనే ఉండిపోయేది. ఏళ్ళు గడుస్తున్నా ఆమె భక్తి పెరుగుతోందే తప్ప, తరగడం లేదు. భౌతిక ప్రపంచ విషయాలను పట్టించుకోకుండా, స్వామి తలంపులలోనే గడుపుతూ, ఆధ్యాత్మికానందం పొందుతూండేదట. ఆమెని పరీక్షించాలని స్వామి ఆమెకు మాయాగర్భాన్ని కల్పిస్తాడట. నెలలు నిండినా కూడా కొండ ఎక్కడం ఆపక, నిత్యం కొండెక్కి పూజలు కావించి మళ్ళీ దిగేదట. ఆమె బాధ చూడలేని స్వామి వారు, ఓ రోజు “అమ్మా, నువ్వు ఇలా రోజూ రావద్దు. నేనే నీతో పాటు వస్తాను… నువ్వు కిందకి దిగుతూ ఉండు. నీ వెనుకే నేను వస్తాను. ఎలాంటి చప్పుడైనా వెనుదిరిగి చూడకు. ముందుకు సాగుతునే ఉండు…” అని అన్నారట. ఆమె తలూపి దిగడం ప్రారంభించిదట. ప్రస్తుత ఆలయం ఉన్న చోటుకి రాగానే భయంకరమైన శబ్దమై, భయపడి ఆమె తల తిప్పి వెనక్కి చూసిందట. అంతే స్వామి అదృశ్యుడై అక్కడే లింగంగా వెలిసాడట. ఆ క్షణంలోనే ఆమె ప్రసవం అవడం, మగబిడ్డ పుట్టడం జరుగుతుంది. స్వామి వారు అదృశ్యమైనందుకు చింతించిన ఆమె అక్కడే ప్రాయోపవేశం చేయాలని తలచగా, ఆ నవజాత శిశువు మాయమై శివుడు దర్శనమిస్తాడు. ఆమెకి ముక్తిని ప్రసాదించాడు. నూతన కోటేశ్వరస్వామి వారి ఆలయానికి దిగువనే ఆనందవల్లికి గుడి ఉంది. దీనిని గొల్లభామ గుడి అంటారు. ఈమె గురించి మరో విశేషం ఉంది. శివుడికి అభిషేకం నిమిత్తం సేకరించిన జలాన్ని ఓ బిందెలో ఉంచి, పూల కోసం వెళ్ళినప్పుడు ఓ కాకి వచ్చి ఆ బిందెలోని నీటిని నేలపాలు చేసిందట. కోపించిన గొల్లభామ “ఇక్కడ కాకులుండ కూడదు గాక!” అని శాపమిచ్చిందట. అందుకే కోటప్పకొండ క్షేత్రంలో ఇప్పటికీ కాకులు కనబడవు.

రాత్రి 8 గంటల తర్వాత గుడి ఖాళీ. ఒకరిద్దరు సిబ్బంది తప్ప జనాలే లేరు. గుడి ప్రాంగణంలో ఉన్న ఓ సిమెంట్ దిమ్మ మీద కూర్చుని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తుంటే ఏదో ఆనందం. తృప్తి. నిత్యం రణగొణధ్వనులతో నిండిన నగర జీవితం నుంచి ఒక్కరోజయినా దూరంగా ఉండి ప్రశాంతమైన స్థలంలో ఉండడం వల్ల కలిగిన మానసికానందం అదని గ్రహించడానికి ఎక్కువ సేపు పట్టలేదు. ఈ గుడి కొండ మీద ఊరికి దూరంగా ఉండడం; ఏం కావాలన్నా, కొండ దిగి కనీసం పది కిలోమీటర్లైనా వెళ్ళాల్సిరావడం వల్ల సాయంత్రమయ్యే సరికి ఇక్కడ జనాలు ఉండరు. ప్రధాన రహదారికి, రైలు మార్గానికి దూరంగా ఉండడం వల్ల వాహనాల రాకపోకల శబ్దాలు, రైలు కూతలు వంటివి లేవు. మైకులూ, లౌడ్ స్పీకర్లు లేవు. పొద్దుగుంకాక, పక్షుల కువకువలు, కోతుల కిచకిచలు తప్ప మరేమీ వినపడదు. చాలా సేపు గుడి ప్రాంగణంలోనే కూర్చుని, నిద్రపోకతప్పదు కాబట్టి గదికి వచ్చి – ఆ పూట పొందిన అనుభవాలను నెమరు వేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. – It was a real bliss!

∗ ∗ ∗

 

DakshinamurthyTemple16 ఆగస్టు 2014 శనివారం పొద్దున్నే లేచి స్నానాదులు గావించి, త్రికోటేశ్వర స్వామి వారి ఆలయానికి దిగువన ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళాం. మళ్ళీ మేమిద్దరమే. పూజారి తప్ప మరెవరూ లేరు. మన గుళ్ళలో చాలా అరుదుగా దొరికే భాగ్యం ఇది. ప్రశాంతంగా దైవదర్శనం చేసుకోగలగడం! ఆ మూర్తిని చూస్తుంటేనే ఏదో పరవశం. ఇక్కడ పూజాదులు కానించి, త్రికోటేశ్వర స్వామి వారి అభిషేకానికి వెళ్ళాము. దర్శనమయ్యాక, తీర్థ ప్రసాదాలు స్వీకరించి బసకి వచ్చాం. చిత్తచాంచల్యాన్ని దూరం చేసి మానసిక స్వస్థత కలిగించే ఆలయమిదని ప్రధానార్చకులు చెప్పారు. మేం దిగిన గది ఖాళీ చేసి, అక్కడున్న కాంటిన్‍లో టిఫిన్ తిని బయటకు వచ్చేసరికి మా ఆటో అతను వచ్చేసాడు.

DakshinaMurthyIdolఇక్కడ ప్రధానంగా ఉన్న రెండు ఇబ్బందుల గురించి ప్రస్తావించక తప్పదు. కొండ మీద ఉన్నది ఒకే ఒక కాంటిన్. ఏ వస్తువైనా మాములు ధరకన్నా కనీసం రెండు రెట్లు ఎక్కువకి అమ్ముతున్నారు. గ్లాస్ మినరల్ వాటర్ రెండు రూపాయాలు. టీ కాఫీలు పది రూపాయలు. ప్లేట్ ఇడ్లీ (చిన్న సైజువి మూడు) రేటు వింటే ఠారెత్తిపోయింది… గత్యంతరం లేదు కాబట్టి తినక తప్పలేదు. ఇక రెండో ఇబ్బంది కోతులు. గుంపులు గుంపులుగా ఉంటాయి. భక్తుల సంఖ్య కన్నా వీటి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. చేతిలోని వస్తువులను బలవంతంగా గుంజుకుపోతాయి. త్రికోటేశ్వరస్వామి వారిది బ్రహ్మచారి రూపం కాబట్టి ఇక్కడ పార్వతి దేవి ఉండదు. కాబట్టి కళ్యాణోత్సవాలు ఉండవు. సాధారణంగా ఎప్పుడూ నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుందీ ఆలయం. రోజువారీ భక్తులరాక పరిమితంగా ఉంటూ కేవలం మహాశివరాత్రి సమయంలోనూ, ధనుర్మాసంలో వచ్చే ఆర్ద్రోత్సవానికి మాత్రం భక్తులతో కిటకిటలాడిపోతుంది. పునర్దర్శన భాగ్యం కలిగించమని ప్రార్థిస్తూ, కొండ దిగడం ప్రారంభించాము.

మెట్ల మార్గంలోనూ, కొండకి దిగువన మరిన్ని ఆలయాలు ఉన్నాయి. భక్తులు ఆరాధించిన విగ్రహాలు ఉన్నాయి. ఘాట్ రోడ్ మీద నుంచి దిగుతూ, రోడ్‌కి అటూ ఇటూ ఉన్న పెద్ద పెద్ద బొమ్మలను ఫోటోలు తీసుకున్నాను. దారిలో పిల్లల కోసం అటవీశాఖ నిర్వహిస్తున్న పార్కు ఉంది.

Ganesha GollabhamaTemple PanchamukhaSivalingam KalindiMadugu Shiva Vishnu Brahmaనరసరావుపేట బస్టాండ్‍కి వచ్చి టీ తాగి గుంటూరు వెళ్ళే నాన్-స్టాప్ బస్ ఎక్కాం. మధ్యాహ్నం ఒకటి నలభై కల్లా గుంటూరు చేరి, రైల్వే స్టేషన్ సమీపంలో ఓ హోటల్‍లో భోజనం చేసి, గుంటూరు – సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కోసం ఎదురు చూడసాగం. గంట ఆలస్యంగా వచ్చిన రైలు గుంటూరు నుంచి బయల్దేరేసరికి మరో అరగంట పట్టింది. మొత్తానికి రాత్రి పదకొండు గంటలకి సికింద్రాబాద్ చేరాము. ఇంటికి చేరే సరికి పదకొండున్నర. ఏదో రెండు ముద్దలు తిని, పక్కమీదకి చేరి.. “కోటి వేల్పుల అండ కోటప్ప కొండ” యాత్రానుభవాలను స్మరించుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.

∗ ∗ ∗

హైదరాబాదు నుంచి పిడుగురాళ్ళకి ఇప్పుడు చక్కని రోడ్ మార్గం కూడా ఉంది. సొంత వాహనం ఉంటే పొద్దున్నే బయల్దేరితే, దర్శానాదులు కావించుకుని రాత్రికి తిరిగి హైదరాబాదు చేరుకోవచ్చు. లేదూ వారాంతాలు ప్రశాంతంగా గడపదలచుకుంటే శనివారం పొద్దున్నే ప్రయాణమైనా, మధ్యాహ్నానికి గుడికి చేరుతాం. అక్కడ గది తీసుకుని శనివారం సాయంత్రం, రాత్రి ప్రశాంతతని అనుభవించి, ఆదివారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణమైనా శరీరం, మనసు రీచార్జి అవుతాయి. మరి ఆలస్యమెందుకు, వెడతారుగా…?

కొల్లూరి సోమ శంకర్

Download PDF

4 Comments

  • మణి వడ్లమాని says:

    ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. తరువాత recharge అవ్వడానికి మీరు రాసిన ఆధ్యాత్మిక యాత్ర యొక్క విశేషాలు చాల బావున్నాయి.చక్కగా వివరించారు. మీతో పాటే చూసిన అనుభూతి కలిగింది. మా యాగంటి యాత్ర గురుకొచ్చింది.

  • Karunakar says:

    ఒక్కటే మాటలో చెప్పెసారండి కోటప్ప కొండ మహత్యం ““కోటి వేల్పుల అండ కోటప్ప కొండ” .. జీవితంలో ఏదైనా సాధించడమనేది శిఖరాగ్రాన్ని చేరడం లాంటిదని, అక్కడికి చేరాక, ఇంక సాధించడానికి ఏమీ ఉండదని, మళ్ళీ క్రిందకి దిగి రావల్సిందేనని .. ఇది జీవిత సత్యమని చెప్పకనే చెప్పారు..థాంక్స్ సోమఛ్

Leave a Reply to Karunakar Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)