పాటను తూటాగా మలిచిన సుద్దాల

kaifiyath

sangisetti- bharath bhushan photoఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ సమరంలోనూ, తర్వాతి ప్రజా పోరాటాల్లోనూ, నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ ‘దూమ్‌ ధామ్‌’ చేసి ప్రజల గొంతులో నిలిచిపోయిన ఆయుధం పాట. మౌఖిక సంప్రదాయంలో మాట, ముచ్చట, ఉపన్యాసం ఏవీ చేయలేని పని పాట చేసింది. ఈ పాటతో ఉద్యమాలను పదునెక్కించడమే గాకుండా పోరాట స్ఫూర్తిని ప్రజల హృదయాల్లో నింపింది సుద్దాల హనుమంతు. ఆనాటి ఉద్యమంలో పాటను రాసి, బాణిలు కూర్చి, పాడిన వారిలో సుద్దాల హనుమంతు అగ్రగణ్యులు. ఆయనతో పాటు తిరునగరి రామాంజనేయులు, రాజారాం, యాదగిరి లాంటి ఎందరో వాగ్గేయకారులు తమ పాటలను కైగట్టిండ్రు. బండి యాదగిరి అయితే పాట పాడుతూ పాడుతూనే ‘రాజ్యం’ తుపాకి తూటాలకు అమరుడయ్యిండు. నేటి తరం పాటకవులు/గాయకవులు/గాయకులు-కవులకు దక్కిన ఖ్యాతి గౌరవం వారికి దక్కలేదు. తెలంగాణలో పాటను ప్రజల వద్దకు, ప్రజల్ని ఉద్యమాల దారి వైపు మళ్లించి తన జీవిత కాలంలో ఎలాంటి గౌరవానికి నోచుకోకుండా అంతర్ధానమైన మనీషి సుద్దాల హనుమంతు.

ఆర్యసమాజమిచ్చిన ‘చైతన్యం’తో ఆంధ్రమహాసభ ఉద్యమాల్లో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒకవైపు ఆయుధం ఎక్కుపెట్టి, మరోవైపు  కలాన్ని కదంతొక్కించి, గళాన్ని వినిపించిన యోధుడు సుద్దాల హనుమంతు. గజ్జెగట్టి జానపద కళా రూపాలను జనజాగృతికి వినియోగించాడు. బుర్రకథల ద్వారా జనాన్ని ఉర్రూత లూగించాడు. పాటను తూటాగా చేసి దోపిడి వ్యవస్థపై పేల్చిన ప్రజాకవి. ప్రజల పదాలనే పాటలుగా మలిచి వారి బాణిలోనే వాటికి శాశ్వతత్వాన్ని చేకూర్చిన ప్రజ్ఞాశాలి. ప్రజాకళల్లోనే పోరాట సాహిత్యాన్ని ప్రచారం చేసి ఉద్యమానికి ఊపిరి పోసిండు. కళను ప్రజలకు అంకితమిచ్చి తాను నిశ్శబ్దంగా, నిషీధిలోకి జారుకుండు. వందల సంఖ్యలో వెలువరించిన గేయాలు, పాటలు తన జీవిత కాలంలో పుస్తకంగా అచ్చుకు నోచుకోలేదు. తెలంగాణ సాయుధ పోరాట సమరంలో కళా రంగంలో ముందుండి ప్రజలను పోరాట పథం వైపు నడిపించిన మార్గదర్శి. మాభూమి సినిమా ద్వారా ‘పల్లెటూరి పిల్లగాడా, పసుల గాచె మొనగాడ’ పాటతో ఎనుకటి తెలంగాణను సాక్షాత్కరించిండు.

తెలంగాణలో ఆంధ్రమహాసభకన్నా ముందు ప్రజల్లో చైతన్య జ్యోతులు వెలిగించింది ఆర్యసమాజం. కాళోజి, పి.వి.నరసింహారావు, కేశవరావు కోరట్కర్‌, వినాయకరావు విద్యాలంకార్‌ మొదలైన వారంతా మొదట ఆర్యసమాజీయులే. ఈ ఆర్యసమాజ ప్రభావం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా బాగానే ఉండిరది. హైదరాబాద్‌లో నిజాం నవాబుల ఆస్థాన వైద్యుడిగా పనిచేసిన హకీమ్‌ నారాయణదాసు తెలంగాణలో పద్మశాలీయులు ఆయుర్వేద వైద్యాన్ని వృత్తిగా స్వీకరించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈయన ప్రోత్సాహంతోనే తెలంగాణలోని దాదాపు ప్రతి గ్రామంలో పద్మశాలీయులు 1956కి ముందు ఆయుర్వేద వైద్యులుగా ఉండేవారు. అలాగే నల్లగొండ జిల్లా రామన్నపేట తాలూకా పాలడుగు గ్రామానికి చెందిన హనుమంతు తండ్రి కూడా ఆయుర్వేద వైద్యుడిగా పనిచేసేవారు. హనుమంతు తర్వాతి కాలంలో భువనగిరికి దగ్గరలోని సుద్దాల గ్రామంలో స్థిరపడ్డాడు. చిన్ననాటి నుంచే హరికథలు, పాటలు, నాటకాలంటే ఆయనకు చాలా ఇష్టం. హరికథలు చెప్పే అంజనదాసు శిష్యుడై, ఆయన బృందంలో చేరిండు. మరోవైపు ప్రాణాయామం, యోగాభ్యాసాలు కూడా అలవాటు చేసుకుండు. అలాగే భువనగిరిలో ఉండే ఉత్పల వెంకటరావు అచలబోధ ఒక వైపు, ఆర్యసమాజ బోధనలు మరోవైపు చేస్తూ ఉండేవాడు. ఉత్పల శిష్యుడిగా మారిన హనుమంతు ఆర్యసమాజ ప్రభావానికి లోనయి దయానంద సరస్వతి జీవిత చరిత్ర, సత్యార్థ ప్రకాశ మొదలైన గ్రంథాలు చదువుకున్నాడు. ఆర్యసమాజ్వారు నిజాం ప్రభుత్వ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం బాగా నచ్చింది. దాంతో తాను చిన్నప్పటి నుంచీ చూస్తూ వస్తున్న దుర్మార్గాలపై తిరగబడేందుకు గుండె ధైర్యాన్నిచ్చింది. తన చిన్నతనంలో ఊర్లో భూస్వాములు, ప్రభుత్వాధికారులు వెనుకబడిన వర్గాలు, మాల, మాదిగల చేత నిర్బంధ వెట్టిని చేయించడం కండ్లార చూసిన వాడు కావడంతో వారి పట్ల సానుభూతితో, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, దళితులకు అండగా నిలిచాడు. విధవా వివాహాలను కూడా జరిపించిండు. ఆర్యసమాజం ప్రభావంతో తాను స్వయంగా ఒక దళిత యువతిని పెండ్లి చేసుకుండు. రెండేండ్లు దళితులకు చదువు చెబుతూ వరంగల్లులో గడిపిండు. అయితే హనుమంతు సామాజిక, రాజకీయ రంగాల్లో ఉండి కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేక పోవడం, సమాజం నుంచి సూటి పోటీ మాటలు భరించలేక ఆమె దూరమయింది. కొన్ని రోజులు హైదరాబాద్లోని బుద్వేల్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో అటెండర్ఉద్యోగం చేసిండు.

untitled

కాని స్వతంత్ర భావాలు గల హనుమంతుకు ఆ ఉద్యోగం నచ్చక దానికి రాజినామా ఇచ్చిండు. ఆధ్యాత్మికం మీద హనుమంతుకు ఎక్కువ మక్కువుండేది. మిత్రుడు ఆంజనేయులుతో కలిసి మన్నెంకొండలో కొన్ని రోజులు తపస్సు చేసిండు. భజనలు, కీర్తనల ద్వారా భక్తి రసాన్ని పంచిండు.

ఆర్యసమాజమిచ్చిన చైతన్యంతోనే 1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభ సమావేశాల్లో క్రియాశీల కార్యకర్తగా వ్యవహరించిండు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, వట్టికోట ఆళ్వారుస్వామి, పెండెం వాసుదేవ్‌ లాంటి పెద్దల ఉపన్యాసాలతో ప్రభావితుడై తోటి ప్రజల బాగోగుల కోసం ఆయుధం చేతపట్టిండు. ఉద్యమారంభ దశలో కార్యకర్తగా సుద్దాల చుట్టుపక్కల గ్రామాల్లో సంఘాలు స్థాపించి, సభలు సమావేశాలు నిర్వహించేవారు. ఒక చేత్తో ఎర్రజెండా మరో చేత్తో కాంగ్రెస్‌ జండాలు ఊరూరా ఎగరేసేవారు. క్రమంగా ఆంధ్రమహాసభ ఆధిపత్యం మొత్తం కమ్యూనిస్టుల అధీనంలోకి వెళ్లడంతో సుద్దాల కూడా కమ్యూనిస్టుగా మారాడు. ఈ దశలో కమ్యూనిస్టు పార్టీ కూడా ఆయనకు కళారంగాన్నే అప్పగించింది. అప్పటి నుంచి  ప్రజలకు సుపరిచితమైన ప్రక్రియల్లో ప్రదర్శనలు ప్రారంభించాడు. విచిత్ర వేషాలు, ‘గొల్లసుద్దులు’, ‘లత్కోరుసాబ్‌’, ‘బుడబుక్కలు’, ‘ఫకీరు వేషం’, ‘సాధువు’ మొదలైన కళా రూపాల ద్వారా పీడిత వర్గాల బాధల్ని, భావాల్ని వ్యక్తీకరించాడు. ప్రజారంజకమైన బాణీల్లో పాటలు కైగట్టి జనాన్ని ఉర్రూతలూగించాడు. సమస్యల్ని అన్ని కోణాల్నుంచి పరిశీలించి ప్రజల హృదయాలకు అత్తుకునేలా, విన్న వారు గుత్పందుకునేలా ఆయన పాటలుండేవి. ఎవరో రాసిన పాటలకన్నా స్థానిక  అవసరాన్ని బట్టి అందుకు అనుగుణంగా మనమే పాటలు రాసి దాన్ని ప్రజలకు హత్తుకునే ప్రక్రియల్లో ప్రదర్శించడం మేళని తలచి ఆచరణలో పెట్టిన ప్రజాకవి, కళాకారుడు సుద్దాల. వివిధ కళా రూపాల్లో ఎంతో మందికి శిక్షణనిచ్చాడు. వారిని సాంస్కృతిక దళాలుగా ఏర్పాటు చేసిండు. ‘బండెన్క బండి కట్టి’ పాట రచయిత యాదగిరి కూడా హనుమంతు బృందంలోని వాడే. సుద్దాల గ్రామసంఘం కార్యదర్శిగా పనిచేస్తూ గంగుల శాయిరెడ్డి, గవ్వా సోదరులు, దాశరథిల గేయాల్ని పాడుకునేవాడు. ఈ దశలో భూమికొలతల్లో భూస్వాములు చేస్తున్న మోసాన్ని గ్రహించి క్షేత్రగణితాన్ని నేర్చుకొని ఊళ్లలో భూమికొలిచే పనులు తానే చేపట్టే వాడు. దీంతో అప్పటి వరకు అన్యాయానికి గురైన పేద వర్గాలకు హనుమంతు న్యాయదేవతలా కనిపించాడు.

గ్రామం నుంచి సాంస్కృతిక ప్రదర్శనలిచ్చేందుకు వివిధ ప్రదేశాలు తిరగాల్సి రావడం, ఒక్కోసారి ప్రదర్శనకు కాపలగా సాయుధ దళం పనిచేసేది. దళాలు కూడా చేయలేని పనిని తన కలం, గళం ద్వారా సుద్దాల చేసేవాడు. ఈ దశలో హనుమంతుకు ‘ఎర్రబోళ్లు’ అడవిలో సాయుధ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి గన్నూ, పెన్నూ రెండింటి ద్వారా ప్రజా యుద్ధంలో నిలిచిండు. 1948లో హైదరాబాద్‌పై పోలీసు యాక్షన్‌ తర్వాత అనారోగ్య కారణాల వల్ల బొంబాయిలో కొద్దికాలం గడిపిండు. తిరిగి 1952 ఎన్నికల ముందు తెలంగాణకు చేరుకున్న హనుమంతు తమ నియోజకవర్గానికే చెందిన నాయకుడు రావి నారాయణరెడ్డి, సుంకం అచ్చాలు  గెలుపు కోసం ఊరూరా సభలు, సమావేశాలు నిర్వహించి తన పాటల ద్వారా ఎన్నికల ప్రచారం చేసిండు. రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజార్టీతో పార్లమెంటుకు ఎన్నికయిన విషయం తెలిసిందే. 1952 తర్వాత కేవలం ఎన్నికల పాటలకే పరిమితమై మునుపటి లాగా గొప్ప సాహిత్యాన్ని సృజించ లేక పోయాడు. దేశంలో అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కూడు, గూడు దక్కాలని, అలాంటి వ్యవస్థ కోసం ప్రజాకవులు, ఉద్యమకారులు కదం తొక్కాలని ఆయన అభిప్రాయ పడేవారు.

హనుమంతు పాటల్లో యతిప్రాసలు అచేతనంగా పడేవి. పల్లెటూరి పిల్లగాడ, రణభేరి మ్రోగింది తెలుగోడ, వేయ్‌ వేయ్‌ దెబ్బ, ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, కన్నులో భగా భగా కడ్పుల్లో ధడా ధడా, భళిరె తెలంగాణ వహరె తెలంగాణ ఇలా ఎన్నో పాటలు ఆయనకు పేరు తెచ్చాయి. హనుమంతు రాసిన 22 పాటల పుస్తకం సాహితీ సర్కిల్‌ వారు ప్రచురించిండ్రు. వాటినిప్పుడు క్యాసెట్‌ రూపంలో తీసుకొచ్చినట్లయితే అందరికీ అందుబాటులోకి ఆయన పాటలు రావడమే గాకుండా, 1945-50ల నాటి పోరాటాన్ని కూడా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. తెలంగాణ కళారూపాలకు జీవంపోసి సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారులు వేసిన హనుమంతు, 1982 అక్టోబర్‌ 10న క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ ‘సుద్దాల’ గ్రామంలో తుది శ్వాస విడిచాడు. అప్పుడాయన వయసు సుమారు 74 ఏండ్లు.

‘‘……… సుద్దాల హనుమంతుగారికి నాటి అరసంలో గాని, ప్రజానాట్యమండలిలో గాని కవిగా అంత గుర్తింపు రాకపోయినా తన కలాన్ని, గళాన్ని నడిపించాడు. పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా తన చుట్టూ ఉన్న ప్రజల అవసరాల కోసం మాత్రమే సాహిత్యాన్ని సృష్టించాడు’’. అని సుద్దాల హనుమంతు రచనలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు తాను సంకలనం చేసిన ‘సుద్దాల హనుమంతు పాటలు’ పుస్తకంలో పేర్కొన్నాడు. ‘‘ప్రజలు కవిగా గుర్తించినా పార్టీ గుర్తించలేదని’ సుద్దాల ఒక ఇంటర్వ్యూలో వాపోయిండు. ఈ మాటలు నూటికి నూరు పాళ్లు నిజం. తన పాటలు, గానం ద్వారా తెలంగాణ రైతాంగ ఉద్యమానికి ఊపిరులూదిన సుద్దాలను ఆ తర్వాత ‘విశాలాంధ్ర వాదులు’ విస్మరించారు. అభ్యుదయ రచయితల సంఘం వారికి ఆయన బ్రతికున్నప్పుడు జీవిత చరిత్ర రాయడానికి గానీ, ఆయన రచనలు సేకరించి ప్రచురించాలనే సోయి గానీ లేదు. సుద్దాల తెలంగాణ వాడయినందుకు మాత్రమే వారు ఆయన రచనలపై శ్రద్ధపెట్టలేదని నేటి తరం తెలంగాణ వాదులు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికీ ఆయన లేఖలు, అసంపూర్ణ రచనలు, అముద్రిత రచనలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికైనా ఆయన రచనలన్నీ సంకలనంగా తీసుకు రావాల్సిన అవసరముంది. వివిధ విశ్వవిద్యాలయాల వారు ఆయనపై పరిశోధనకు ఉత్సాహం చూపిస్తున్నా అవి ఒకడుగు ముందుకి రెండడుగులు వెనక్కి అన్న చందంగా ఉన్నాయి. అలా కాకుండా ఆయన సమగ్ర రచనలు-జీవితంపై సమర్ధులైన వారు పరిశోధన చేయాల్సిన అవసరముంది. అలాగే తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన పేరిట ఒక పీఠాన్ని ఏర్పాటు చేయించేందుకు తెలం‘గానా’భిమానులు, సుద్దాల ఆత్మీయులు అందరూ వత్తిడి తీసుకురావాలి.

(అక్టోబర్‌ 10, సుద్దాల 32వ వర్ధంతి)

 

-సంగిశెట్టి శ్రీనివాస్‌

‘‘……… సుద్దాల హనుమంతుగారికి నాటి అరసంలో గాని, ప్రజానాట్యమండలిలో గాని కవిగా అంత గుర్తింపు రాకపోయినా తన కలాన్ని, గళాన్ని నడిపించాడు. పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా తన చుట్టూ ఉన్న ప్రజల అవసరాల కోసం మాత్రమే సాహిత్యాన్ని సృష్టించాడు’’. అని సుద్దాల హనుమంతు రచనలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్‌ జయధీర్‌

Download PDF

4 Comments

  • Satyanarayana Rapolu says:

    సుద్దాల హనుమంతు కు అక్షర నివాళి!

  • s.haragopal says:

    సుద్దాల హన్మంతు మా పాటల నాయిన. నేను మా నాయినతోపాటు ఆయనను కూడా నాయినా అని పిలిచేవాన్ని. మాది కుటుంబస్నేహం. మేం పుట్టక ముందే తెలంగాణసాయుధపోరాటకాలంలో హన్మంతు మా ఇంట్లో వుండేవారట.పెరిగి పెద్దయినంక ఇంటర్ చదివే కాలంలో(1973 నుండి) మాకు బాగా చనువైపోయాడు. ఒక ఆర్ద్రసందర్భం వొస్తే చాలు ఆయన కళ్ళు వర్షించేవి. పాటలు పాడుతూ, హార్మొని వాయిస్తూ అపుడు కూడా కురిసే మేఘం అయిపోయేవాడు. తెలంగాణాసాయుధపోరాటఘట్టాల్ని ఆయన చెపుతుంటే రోమాంచితంగా వుండేది. మెత్తని మాటలకే మెత్తబడి ఇట్లా కన్నీళ్ళు పెట్టుకునే దయగల నీకు అంత కోపంతో సాయుధునివై ఎట్లా పోరాడినావు నాయినా అంటే మనుషుల పట్ల ప్రేమే, వాళ్ళ బాధలబతుకుల పట్ల సహానుభూతే, దుర్మార్గులైన భూస్వాముల దౌర్జన్యాలు, రజాకార్ల అరాచకాలు నన్ను నిలవనీయలేదురా. తుపాకి పట్లాను. ప్రజలకోసమే పాటలు కట్టాను. జీవితమంతా నమ్మిన సమసమాజం కోసమే తపించాను అన్నారు సుద్దాల హన్మంతు నాయిన.
    సుద్దాల గురించి కైఫీయత్ రాసిన మా సంగిశెట్టికి శణార్థి. ఇవాళ సుద్దాల హన్మంతు గారి వర్థంతి. ఈ రచన ఆయనకు మంచి నివాళి.

  • mamidi amarendar says:

    జోహార్ సుద్దాల హనుమంతు

  • Anna , meeru wrasinatlu kamyunist party lo attadugu vargala krushiki gurthimpu ivvaledu

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)