విధి కన్న బలమైనది

The-prince-of-egypt 1

ఒకానొకప్పుడుఈజిప్ట్ లో ఒక రాజుకి లేక లేక కొడుకు పుట్టాడు. రాజకుమారుడి జాతకం చూసిన జ్యో తిష్కులు మొసలి వల్లనో, కుక్క వల్లనో పాము వల్లనో అతనికి ప్రాణగండం ఉంటుందని చెప్పారు . అలా జరగకుండా ముందుగాఏమీ చేయలేమని కూడాతేల్చారు .   రాజూ రాణీ చాలా దిగులుపడిపోయారు. తమ బిడ్డని ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నారు. బాగా ఎత్తైన కొండ మీద కోట కట్టి చుట్టూ సైనికులని కాపలా పెట్టి అందులో రాజకుమారుడిని ఉంచారు. బొమ్మలు, పుస్తకాలు, ఆటవస్తువులు – కావలసినవన్నీ అక్కడే ఏర్పాటు చేశారు. చాలా జాగ్రత్తగా అప్పుడప్పుడూ వెళ్ళి చూసివస్తూ ఉండేవారు.

 

ఒక రోజు రాజకుమారుడు కోట పైకెక్కి ఆడుకుంటూ కింద వెళుతున్న చిన్న కుక్కపిల్లని చూశాడు. అది అతనికి ముద్దొచ్చింది. తెచ్చి ఇవ్వమని అడిగాడు. ఆ చుట్టుపక్కల ఎక్కడా కుక్కలే లేకుండా కట్టుదిట్టం చేసి ఉంచారు , అది ఎలా వచ్చిందో సేవకులకి అర్థం కాలేదు. గాభరా పడుతూ వెళ్ళి రాజుకి విషయం చెప్పారు. రాజకుమారుడి కోరిక ఏదీ అప్పటివరకూ వాళ్ళ అమ్మా నాన్నా కాదనలేదు. ఇప్పుడు కుక్కపిల్ల వద్దని నచ్చజెప్పాలని చూశారు. అతను వినలేదు. చేసేది లేక వాళ్ళు ఒప్పుకున్నారు. తొందర్లోనే రాజకుమారుడికి కుక్కపిల్ల బాగా మచ్చిక అయింది. దానికి మంచి తర్ఫీదు ఇచ్చి అతన్ని రక్షిస్తూ ఉండేలాగా తయారు చేశారు.

రాజకుమారుడికి ఇరవై ఏళ్ళు వచ్చాయి. ఆ నోటా ఆ నోటా తన జాతకం గురించి అతనికి తెలిసింది. అస్తమానం కోట లోనే గడపటం అతనికి విసుగు పుట్టించింది. తండ్రి దగ్గరికి వెళ్ళి ” నేను ప్రపంచం తిరిగి చూడాలనుకుంటున్నాను. నా క్షేమం గురించి ఆదుర్దా పడకండి, నా కుక్కపిల్ల నన్ను కాపాడుతుంది ” అన్నాడు. ఇదివరకులాగే తండ్రి వద్దని చెప్పే ప్రయత్నం చేశాడు. కొడుకు పట్టుదల వదల్లేదు. అయేదేదో అవుతుందని గుండె రాయి చేసుకుని సరేనన్నాడు . ఓడ లో అతన్నీ కుక్కపిల్లనీ నైల్ నది దాటించారు. అక్కడ సిద్ధంగా ఉంచిన మంచి గుర్రాన్ని ఎక్కి రాజకుమారుడు బయలుదేరాడు. బయటి ప్రపంచాన్ని చూడటం అతనికి చాలా సరదాగా సంతోషంగా ఉంది.

అలా  ప్రయాణిస్తూ ఒక గొప్ప రాజ్యం చేరాడు. అక్కడి రాజు అతనికి ఆతిథ్యం ఇచ్చి తన కూతురిని పరిచయం చేశాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ” నాకు నిన్ను పెళ్ళి చేసుకోవాలని ఉంది. కానీ నా విధి ప్రకారం కుక్క కారణంగానో , మొసలి వల్లో పాము వల్లోనాకు ప్రమాదాలు వస్తాయట. బతుకుతానో లేదో తెలియదు ” అని ఆమెకి చెప్పేశాడు.

‘’ అయితే ఆ కుక్క ఎందుకు నీతో ? వదిలేయరాదా ? ” అని ఆమె అడిగింది.

” ఇంకా నయం ” అన్నాడు అతను.

ఆమె ” సరేలే . ఏమీ పర్వాలేదు. మనం విధిని ఎదిరిద్దాం. నిజమైన ప్రేమ దేన్నయినా గెలుస్తుంది ” అని ధైర్యం చెప్పింది. ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

కొన్నాళ్ళ తర్వాత తండ్రికి జబ్బుగా ఉందని రాజకుమారుడికి వార్త అందింది. భార్యతో కలిసి ప్రయాణమయాడు. మధ్యలో ఒక నది ఒడ్డున బస చేశారు. ఒక రాత్రి వేళ రాజకుమారి లేచి చూస్తే వాళ్ళ గుడారం లో ఒక మూల చాలా పెద్ద పాము కనిపించింది. వెంటనే భర్త ప్రమాదాల గురించి గుర్తొచ్చింది. మెల్లిగా వెళ్ళి పెద్ద గిన్నె నిండా పాలు తీసుకొచ్చి పెట్టింది. అవన్నీ తాగేసి పాము మత్తుగా పడుకున్నప్పుడు సేవకులని పిలిచి దాన్ని దూరంగా పారేయించింది. జ్యోతిష్కు లను అడిగితే రాజకుమారుడికి పాము వల్ల రాగల  గండం తప్పిందని అన్నారు .

The-prince-of-egypt 2

వీళ్ళు వెనక్కి వెళ్ళిన కాసేపటికే రాజు మరణించాడు. రాజకుమారుడికి పట్టాభిషేకం చేశారు. ఒక రోజు కుక్క తో కలిసి అతను అడవిలో వేటకి వెళ్ళాడు. కాలికేదో తగిలి తట్టుకుని కిందపడ్డాడు. చూస్తే అదొక మొసలి. చిత్రంగా ఎక్కడినుంచో మాటలు వినిపించాయి- ” ఈ మొసలి నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వెక్కడున్నా పట్టుకోగలదు. ఇసక లో పెద్ద గొయ్యి తవ్వి నీళ్ళు నింపి ఒక రోజంతా అందులో దాక్కుంటే మటుకే నీకు క్షేమం. రేపటివరకే గడువు ” .

అప్పటికెందుకో ఏమీ చేయకుండా మొసలి వెళ్ళిపోయింది.

ఇసక గోతిలో నీళ్ళు నింపటం ఎలా ? పీల్చేసుకుంటుంది కదా. రాజకుమారి ఆలోచించింది. దూరంగా ఉన్న ఎడారిలో నాలుగే ఆకులున్న మొక్క ఒకటి ఉందనీ అది నీళ్ళు ఇసకలో ఇంకిపోకుండా ఉంచగలదనీ ఆమె వినిఉంది. వెంటనే అక్కడికి తన తెల్లటి గాడిదను ఎక్కి బయలుదేరింది. ప్రయాణం చాలా శ్రమగా ఉండింది. ఇసక తుఫాను లు, వేడి, దాహం.ఆమె   గాడిదను జాగ్రత్తగా చూసుకుంటూ దానితో ప్రేమగా మాట్లాడుతూ చివరికి ఒక కొండ దగ్గరికి చేరింది. దాని నీడన చల్లగా ఉంది. నాలుగాకుల మొక్క కొండ శిఖరం మీద పెరుగుతోంది. కాని కొండ చుట్టూ లోతైన , వెడల్పైన అగడ్త , దాని నిండా నీళ్ళు. తనతో తెచ్చుకున్న తాడు ని ముడి వేసి రాజకుమారి బలంగా కొండ మీదికి విసిరింది. అదృష్టవశాత్తూ అది ఉచ్చుగా ఒక చెట్టుకొమ్మకి తగులుకుంది. దాని ఆధారంతో ఆమె పైకి పాకటం మొదలుపెట్టింది. అది అంత సులువైన పనేమీ కాదు. అయినా పట్టువదలకుండా నిబ్బరంగా చివరికంటా వెళ్ళి మొక్కని సంపాదించింది. హుటాహుటిన ఆమె తిరిగి వచ్చేసరికి రాజకుమారుడు ఇసకలో తవ్వించిన పెద్ద గోతిలో నిలుచుని ఉన్నాడు. కొద్ది దూరం లోనే మొసలి పళ్ళు బయట పెట్టి చూస్తూ ఉంది. ” నీళ్ళు నింపండి ” అని కేక పెట్టింది ఆమె. ఆ గోతిలోకి మొక్కని విసిరీంది. నీళ్ళు ఇంకిపోలేదు, నిలిచి ఉన్నాయి. ఆ రోజంతా అతనికి ధైర్యం చెబుతూ, ఆహారం ఇస్తూ రాజకుమారి భర్త పక్కనే ఉంది. ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి. మొసలి చూసి చూసి కోపంగా నిరాశగా నదిలోకి వెళ్ళిపోయింది. జ్యోతిష్కులు ఈ గండం కూడా గడిచిందని చెప్పారు. రాజకుమారుడికి భార్యను పొగిడేందుకు ఎన్ని మాటలూ సరిపోలేదు. ఆమె దొరకటం తన పుణ్యమని అనుకున్నాడు.

prince of egypt 3

ఇంకొన్ని రోజులు గడిచాక కుక్కతో ఇద్దరూ ఆ నది ఒడ్డునే షికారుకి వెళ్ళారు. అడవి బాతునొకదాన్ని వెంటాడుతూ కుక్క అతని కాళ్ళ మధ్యలోంచి పరుగెత్తబోయింది. కాలు జారి   అతను కుక్కతో సహా అక్కడి ఊబిలోకి పడిపోయాడు. వేగంగా కూరుకుపోతున్నాడు. రాజకుమారి చప్పున అక్కడికి వచ్చి తన మీద వేసుకున్న బట్టను అందించింది. అతనూ కుక్కా బయటపడ్డారు.

ఇలా కుక్క వల్ల రాగల మూడో గండమూ గడిచింది.

అతను అన్నాడు ” నా విధి కన్న నీ ప్రేమ గొప్పది ” అని.

ఆమె ఆనందంగా అవునంది.

ఇద్దరూ చాలా కాలం పాటు సుఖంగా ఉన్నారు.

  • ఈజిప్షియన్ జానపద కథ

[   ఈ కథను కొంత మార్చి ‘ మూడుగండాలు ‘ పేరుతో 1971 లో కొడవటిగంటి కుటుంబ రావు గారు చందమామలో భేతాళకథగా వేశారు. వడ్డాది పాపయ్య గారు బొమ్మలు గీసిన కొద్ది కథలలో (ఆయన ముఖచిత్రాలు, ప్రత్యేక రచనలకు బొమ్మలు వేసేవారు ) ఇది ఒకటి. చందమామ లో ( కొన్నిసార్లు చెప్పి, కొన్నిసార్లు చెప్పకుండా ) ప్రపంచ జానపద సాహిత్యం లోని చాలా కథలు కొత్త రూపం తో వచ్చాయి. వాటిని తిరగరాసినదీ లోట్లు దిద్దినదీ కుటుంబరావు గారే. ఇంటర్ నెట్, గ్లోబలైజేషన్ లేని రోజులలో మద్రాస్ నగరం లోని ఏ లైబ్రరీలలో ఆ కథలన్నీ దొరికాయో ! ఏ మెప్పు కోసమూ ఎదురు చూడకుండా ఆ మహానుభావుడు బాల సాహిత్యానికి ఎంత చేశారు !!! ]

–మైథిలీ అబ్బరాజు

 

Download PDF

8 Comments

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)