ఏ చట్రాల్లోనూ ఒదగని బహుజనత్వం

pasunuru cover 2
రవి కథలు ఊరూ-వాడ వాతావరణంలోంచి నడిచి.. పట్టణ శివారులోంచి పయనించి మహానగరం లోని మైలను కూడా పట్టి చూపిస్తున్నాయి. ఊర్లలోని అంటరానితనం నగరంలో పది తలలు వేయడాన్ని ఈ కథల్లో చూడొచ్చు. కొత్తదారుల్లో నడిచిన ఈ కథలు రవిని ఆధునిక దళిత కథకుడిగా నిలబెడుతున్నాయి.
రవి కవి హృదయుడు. మంచి కథకుడు. గట్టి విమర్శ కుడు. వాగ్గేయకారుడు. యాక్టివిస్టు. ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఎందుకు రూపుదిద్దుకుంటై?! సామాజిక అవసరం అలా మూవ్‌ చేయిస్తుంది. ఒత్తిడి చేస్తుంది. సొంత సామాజిక వర్గం అణచివేతల అట్టడుగున తొక్కబడి విలవిల్లాడు తుంటే ఒక క్రియేటివ్‌ పర్సన్‌ ఎంతగా తల్లడిల్లిపోతుం టాడు.. ఎంతగా కాలునిలువని స్థితిని అనుభవిస్తుం టాడు! అలాంటి స్థితే మాలాంటివారిని అన్ని ప్రక్రియల్లో రచనలు చేయిస్తుంది. ఒక్కోసారి ఆ రచనలు వాటి సోకాల్డు ప్రామాణికతల్లో ఒదగవు. ఆ ఒదగనితనమే వాటికి మరింత సౌందర్యాన్ని చేకూరుస్తుంది. ఆ ఒదగని తనమే మూస సరిహద్దుల్ని చెరిపేసి, హద్దులు గీస్తున్న వారి చెంప ఛెళ్లు మనిపిస్తుంది. అలా ఏ చట్రాల్లోనూ ఒదగని వీరుడు రవి. సానపట్టుకున్నా కొద్దీ మరింతగా మెరిసే పదును రవి సొంతం.
ఈ కథల వెనుక దాగిన తాత్వికపునాది గురించి కొంత చర్చించాలి. ఆ కోణంలో లోతుల్లోకి దిగితే` ముగిసిపోయిందనుకున్నదేది ముగిసిపోవడం లేదు.. మళ్ళీ మళ్ళీ బిగుసు కుంటున్నది. ఈ బిగింపు మళ్ళీ మొదటికొస్తున్నది. పోరాటం చేస్తున్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టాల్సి వస్తున్నది. దాటి వచ్చినామనుకుంటున్న చైతన్యాన్ని అనుభవిస్తున్నది పై వర్గాలవాళ్ళే ` బ్రాహ్మణీయవాదులే. లేదంటే వాళ్ల కనుసన్నల్లో మెలిగే, వాళ్ల మార్గంలో పయనిస్తున్న ఇతర వర్గాలు మాత్రమే. ఈ దౌర్భాగ్యస్థితికి ఎంతగా కుంగదీసే బల ముంటుందో అనుభవిస్తున్న వాళ్లకు ఎరుక. ఎప్పటికప్పుడు అలాంటి స్థితిని జయిస్తూ వస్తున్న వాళ్లల్లోంచి ఒకడు మా రవి.
మార్గదర్శులు వేసుకొస్తున్న ప్రతి కొత్త దారి కొన్నాళ్లకే పాతబడిపోతుండటం, కొత్త సిద్ధాంతాలు కొద్ది కాలంలోనే గానుగలుగా మారిపోతుండడం.. చుట్టూ వలయాలు వలయాలుగా సరికొత్త చట్రాలు బిగుసు కుంటుండడం.. ఒక్క కష్టం కాదు ` ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుంటూ రచనలు కొనసాగించడం ఆధిపత్య వర్గాలకున్నంత సులువు కాదు. వాళ్లు రాస్తే ఆహా ఓహో అనడానికి అండదండలెన్నో ఉన్నాయి. రవిలాంటివాళ్లు రాస్తే అంత ఈజీగా ప్రచారం లభించదు. దళితవాదం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఉన్న వాతావరణం ఇప్పుడు లేదు. అప్పుడున్న మద్దతుదారులూ ఇప్పుడు లేరు. ఎప్పటికప్పుడు మళ్లీ మద్దతుదారులను వెతుక్కోవాల్సిన పరిస్థితి అట్టడుగువర్గాలది. బ్రాహ్మణుల నుంచి అప్పర్‌ శూద్ర వరకు వచ్చిన సామాజిక ఎదుగుదల బీసీ, ఎస్సీ, మైనారిటీల వరకు రావాలంటే ఇంకా చాలాకాలం పట్టేలా ఉంది. ఈ లోపు సాహిత్యకారులు, సామాజిక కార్యకర్తల పోరాటం ఎడతెరిపి లేకుండా నడుస్తూ ఉండాల్సిందే. అలాంటి పోరాటం చేయగల శక్తి పుష్కలంగా ఉన్నవాడు రవి.
హిందూత్వ, బ్రాహ్మణీయ భావజాలం పర్సెంటేజీల తేడాలతో ఎటూ చాలా మందిలో ఉంటుంది. దాంతో మనకు సీరియస్‌ అనిపించేవి, వారికి క్యాజువల్‌గా కనిపిస్తుంటాయి. మనకు గాయాలుగా తగిలేవి, వారిని తాకనైనా తాకవు. వారు ప్రోగ్రెసివ్‌ మొఖంతోనే లోలోన మనకు ఎంతో హానికరమైన పనులు చాలా అలవోకగా చేసేస్తుంటారు. మరి మొత్తంగా బ్రాహ్మణిజపు ప్రభావంలో ఉన్న వారికన్నా వీరు తక్కువా ఎక్కువా అంటే తేల్చుకోవడం కష్టమే. ఎందుకంటే ఎక్కువ మొత్తంగా సమాజం బ్రాహ్మణిజపు ప్రభావంలోనే ఉన్నప్పుడు ఆ కాస్త వెసులుబాటుతో మనల్ని దరిచేరనిచ్చే ఆ కొందరు ఏ మేరకు బహుజనులకు ఉపయోగపడుతుంటారో అంచనా వేసుపౖగా ఇక్కడ మరో ముఖ్యమైన సమస్య ఉంది.

ఒక్కో కులం, ఒక్కో మత సమూహానికి కొన్ని ప్రత్యేక సమస్యలున్నాయి. ఒక సమూహం సమాజం పట్ల, రాజ్యంపట్ల తీసుకునే స్టాండ్‌ మరొక సమూహం తీసుకోలేకపోవచ్చు. ఒక సమూహానికి ఉండే దీర్ఘకాలిక లక్ష్యం మరో సమూహానికి ఆ సమయానికి అడ్డంకిగా మారొచ్చు. పైగా పోరాట పంథాలు వేరు కావొచ్చు. ఒకరికి అసలైన శత్రువు మరొకరికి ఇమిడి యేట్‌ శత్రువు కాకపోవచ్చు. ఈ ప్రాసెస్‌లో ఉద్యమ కార్యాచరణలో పట్టూ విడుపు లుండాలి. అంతిమ లక్ష్యంపట్ల అందరికీ స్పష్టత ఉండాలి. లక్ష్యం సుదూరంగా  ఉన్నప్పుడు తక్షణ ఫలితాల మెట్లనూ ఎక్కుతూ పోవాలి. అలా కాదని కొండపైనే దృష్టి నిలిపి పరుగెడుతుంటే లోయలూ అగాధాలు మనల్ని కబళించవచ్చు.
ఒక మెజారిటీ భావజాలం మనల్ని లోబరుచుకుంటుంది. బాధితస్పృహ ఉన్నవాడికి కనిపించిన గాయం, మెజారిటీ భావజాలానికి లోనవుతున్న అణగారిన జాతివాడికి ` బహుజనుడికి లేకపోవచ్చు. స్పృహ కలిగినవాడు ప్రశ్నించే దాకా వీడు ఆ స్పృహలోకి రాడు. ఒక రకంగా స్పర్శాజ్ఞానం కోల్పోవడంలాంటి ప్రక్రియ అది. అట్లా మన చుట్టూ ఉన్న దళితులు, బీసీలు, ఆదివాసీలూ, ముస్లింలు, మహిళలూ ఇతర మైనారిటీల నుంచి ఎదిగొచ్చినవారు కూడా మెజారిటీ భావజాలానికి లోనై శత్రు శిబిరంలో చేరిపోతున్నారు. వాళ్లను ముల్లుగర్రతో అదిలించి మలుపుకోవడం పెద్ద శ్రమైపోయింది బహుజన చైతున్యులకు. అది నిరంతరం జరగాల్సిందే. పెద్ద ఎత్తున జరగాల్సిందే.
ఇవేకాక మన మీద మావోయిస్టు, మార్క్సిస్టు ప్రభావాలు ఆవరించి ఉన్నాయి. ఈ ప్రభావాలు ఒక్కోసారి అస్తిత్వ ఉద్యమకారులకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ఒక్కో విజయాన్ని అందుకొని ముందుకెళ్లడానికి ఏ మాత్రం అంగీకరించని ఆ ప్రభావాలు మొత్తంగా మన లక్ష్యాన్ని మరింత దూరంగా నెట్టేస్తున్నాయి. నిజానికి ఆ ప్రభావితుల్లోని క్రమశిక్షణ, నిబద్ధత, అధ్యయనశీలత, త్యాగం లాంటి మంచి లక్షణాలను స్వీకరిస్తూనే, వారిలోని వ్యక్తి ఆరాధన, మతంగా మారేతత్వం, మూస ధోరణి, వదలని కుల జాఢ్యంలాంటి చెడును విసర్జించాల్సిన అవసరముంది. ఇలా జరగకుండా అణగారినతనంలోంచి వచ్చే కసి, ఆకలి, పైసాను ` హోదాను చూడనితనం కొందరు అస్తిత్వ ఉద్యమకారులను చాలా తొందరగా లంగదీసు కుంటున్నాయి. వాటికి ఏ కాస్త లంగినట్టు కనిపించినా మావోయిస్టు, మార్క్సిస్టు భావజాలాలు దాడి చేస్తున్నాయి. దాంతో అతలాకుతలమైన అస్తిత్వ భావజాలకుల చరిష్మా మసకబారిపోతున్నది. ఇలా లేకుండా నిక్కచ్చిగా కనిపించే కొంతమంది అస్తిత్వవాదులు మావోయిస్టు, మార్క్సిస్టు భావజాలాల ప్రభావంవల్ల రిజిడ్‌గా బిగదీసుకుపోతున్నారు. తాము చేయలేకపోతున్న పనులు చేస్తున్న వాళ్ల మీద రాళ్లేస్తున్నారు. ప్రతీ పనిలో తప్పులు మాత్రమే వెతికే వీర విప్లవవాదుల్లాగే వీర దళితవాదులు, వీర బహుజనవాదులు తయారవుతున్నారు. వీటన్నింటి గ్రహింపుతో ఈ జాఢ్యాలన్నింటినీ వదులుకొని ముందుకెళ్లినప్పుడే అస్తిత్వ వాదుల చైతన్యం లక్ష్యాన్ని చేరుకునే అవకాశముంది. రవిలో ఈ వెసులుబాటు కనిపిస్తున్నది. ఆ దిశగా రవి తన రచనలో, కార్యాచరణలో కేంద్రబిందువయ్యే అవకాశముందని ఆశపడుతున్నాను.

ఆధిపత్య భావజాలాలే కాక ముఖ్యంగా మీడియా రచయితల్ని నియంత్రిస్తూ వస్తోంది. యాజమాన్యాల కులం, ప్రాంతం కొత్త రచయితల్ని చెప్పకనే నియం త్రిస్తున్నాయి. రవి, నేను రాస్తున్నది తెలంగాణ మధ్యతరగతి భాషే అయినప్పటికీ ఆంధ్రా పత్రికలవారికి అది తెలంగాణ మాండలికంలా కనిపిస్తోంది. ఆ విషయంలో మాకే ఆవేశం ఆగదు. మరి తెలంగాణ మాదిగ భాషలో రచనలు చేస్తున్న వేముల ఎల్లయ్య లాంటి వారు ఎలా తమ ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటూ వస్తున్నారో తెలియదు. ఈ మధ్య జూపాక సుభద్ర, గోగు శ్యామల కథల సంపుటాలు వచ్చాయి. ఆ కథల్ని వేసుకునే మనసు, ఉద్దేశం ఆంధ్ర పత్రికలకు లేదు. అలాంటి పత్రికలు తెలంగాణ వారికి ఏ మేరకు అవసరం? తెలంగాణ పత్రికలు మరికొన్ని రావలసిన అవసరం  ఉంది. అందులోనూ అట్టడుగు జాతుల నుంచి మీడియా ఎదిగొచ్చిన రోజునే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది.
ఇప్పటిదాకా రవి, నేను చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటూ వస్తున్నాం. ఆంధ్రా పత్రికకు కథ ఇవ్వాలంటే ఒక భాషలో, నమస్తే తెలంగాణ పత్రికకు ఇవ్వాలంటే ఒక భాషలో కథలు రాస్తున్నాం. ఇదొక యాతన. కథ రాయడమే చాలా ఓపికతో కూడుకున్న పని. అలాంటిది మళ్లీ అందులో ఇట్లాంటి ప్రయోగాలు, ప్రయాసలు మరెంతగా మమ్మల్ని పరేశాన్‌ చేస్తున్నాయో చూడండ్రి.
ఇన్నాళ్లు మా మీద రుద్దబడిన కోస్తాంధ్ర ప్రామాణిక (కో.ప్రా) భాష మమ్మల్ని నరక యాతన పెట్టింది. కథా సమయంలో ఉన్నప్పుడు విషయం, భావం, ఫ్లో ఎక్కడ పోతాయోనని స్పీడ్‌గా రాసేస్తుంటాం. అలా రాస్తున్నప్పుడు మాదైన తెలంగాణ భాష రాకుండా కో.ప్రా భాష వచ్చేస్తుంటుంది. ఏదో ఒకటి అని ముందు రాసేసి తర్వాత మళ్లీ మళ్లీ మా భాషలోకి అనువాదం చేసుకోవడం పెద్ద ప్రయాసై పోయింది. నిజానికి మా భాషలోనే ముందుగా రాసుకుంటే వచ్చే వాక్యనిర్మాణం, కో.ప్రా. భాషలో రాసేసినంక రావడం కష్టమే. ఆ ఎరుకతోనూ మా అనువాదాలు కొనసాగుతున్నై. జరిగే నష్టమేమిటంటే, ఒక్కోసారి కో.ప్రా.భాషలోని వాక్యనిర్మాణంలోనే తెలంగాణ భాష వాడడం జరిగిపోతుంటుంది. ఆ ఎరుకలోంచి మా భాషలోనే ముందుగా రాసి అవసరమైనప్పుడు మాత్రమే కో.ప్రా. భాషలోకి మార్చి ఇవ్వడమే సరైందనినిర్ణయించుకున్నాం. ఇలా భాష విషయంలో రవికి, నాకు చాలానే చర్చ జరుగుతూ వచ్చింది. ఈ విషయంలో తెలంగాణ ప్రామాణిక భాష అవసరం గురించి అందులోనూ బహుజనులకు ఆ భాష విషయంలో వచ్చే ఇబ్బందుల గురించి చర్చ జరగవలసే     ఉంది.
రవి కథా సంపుటి వేసుకోవాలనుకున్నంక మా ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో మొత్తంగా కథలను తన భాషలోకి మార్చుకోవాల్సిందేనని నిర్ణయించాం. ఆ పనిలో ఇంకా ఎక్కువ కష్టం పడాల్సివచ్చింది రవి. మరెంతో సమయం వెచ్చించాల్సి వచ్చింది. కథ అచ్చయింది అచ్చయినట్టే వెయ్యాలి కాని మళ్లీ మార్చుకోవడమేమిటి అని కొందరు దోస్తులు అన్నప్పటికీ మా కొత్తతరం క్రియేటివ్‌ రైటర్స్‌ జెన్యూనిటీ మీకు అర్థం కాదులే అని మేమనుకున్నాం.
మా యీ సంఘర్షణల్లోంచి ‘తెలంగాణ బహుజన కథకుల కచ్చీరు’ అని రెండు రోజుల సదస్సు పెట్టుకొని అనేక చర్చలు, గొడవలు పడ్డాం. కొమురం భీం నేలకొరిగిన జోడేఘాట్‌లో రెండో సమావేశం నిర్వహించుకొని తాలూ, గట్టీ, అగ్రవర్ణ ప్రామాణికతల ఆధిపత్యాలను చర్చించుకున్నాం. అలా బహుజన కొత్త తొవ్వలు వెతుక్కున్నాం. ఇంకా ఆ దారిలోనే మరింత గట్టి పడటానికి తాలును బహుజన చాటలతో చెరుగుతున్నాం. అగ్రవర్ణ విమర్శకులు మా కథలను శైలీ, శిల్పాల కళ్లద్దాల లోంచి మాత్రమే చూసే ప్రయత్నం చేయబోతే అవన్నీ కుదరవని చెప్పకనే చెబుతూ వస్తున్నాం. మా ప్రత్యేక రాతలే మాకు శైలీ,శిల్పాలను ఏర్పరచగలవనే ఆత్మవిశ్వాసం మాకుంది.
ఆ మధ్య ‘ఇప్పపూలు’ ‘గిరిజన సంచార తెగల కథలు’ పేర ఒక సంకలనం వచ్చింది. అందులో ఓ నలుగురు తప్ప మిగితా వారంతా గిరిజనేతరులే. ‘వతన్‌’ముస్లిం కథా సంకలనం లాగా, ‘నల్లపొద్దు’ దళిత రచయిత్రుల సంకలనం లాగా అచ్చంగా ఆ జాతుల రచనల తొలి సంకలనాలు రావాలి. కాని ఇతర రచయితలతో తొలి సంకనాలు వేయడం వల్ల వారి మూసలో విషయం, జీవితం, ప్రతీకలు రికార్డు చేయబడతాయి. వారి మూసలోకే ఆయా సమూహాల కొత్త రచయితల్ని డ్రైవ్‌ చేసినట్లవుతుంది. వారి వారి ప్రత్యేక శైలిలో వ్యక్తీకరణలో వారి జీవితంలోని ప్రతీకలతో, ద్ణుఖంతో, పరిష్కార మార్గాలతో రచనలు రావాలి. కాని ఆధిపత్య వర్గాల, భావజాలాల వారు నడిపిస్తే నడిచే రచనలు తీవ్ర నష్టం చేస్తాయి. ఈ జ్ఞానం బహుజన రచయితలకు అత్యంత అవసరం. ఇతర రచయితలు వేసేవి సంఫీుభావ సంకలనాలు అవుతాయి. వాటి అవసరమూ చాలా ఉంది. అయితే ఈ స్పష్టత మాత్రం ఉండాల్సిందే.
విమర్శకులంటే అధ్యయనశీలురై మాత్రమే ఉండాలనే ఒక గుడ్డి నమ్మిక మన మధ్య సంచరిస్తున్నది. తెలుగు సాహిత్యంలో ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చదువుకున్నవారే గట్టి విమర్శకులని భావించే వాతావరణమున్నది. వీరు కొన్ని తప్పుడు సూత్రీకరణలు చేస్తూ అట్టడుగు వర్గాల సాహిత్యాన్ని అవమానపరుస్తున్నారు. ఇది సరైంది కాదు. కాళ్లకింది నేలను వదిలి పరాయి నేల నుంచి అరువు తెచ్చుకున్న చైతన్యం మా మీద రుద్దాలనే విమర్శకుల ధోరణి మా రచనలకు ఆటంకంగా తయారయింది. ఇందుకు బెస్ట్‌ ఎగ్జాంపులే టెక్నిక్‌ అనే గొడవ. చెత్త విషయాన్నైనా కొత్త టెక్నిక్‌తో చెబితే చాలు, ఆహా ఓహో అంటున్నారు సంకలనకర్తలు, అగ్రవర్ణ ఆధిపత్య వర్గాల విమర్శకులు. వెనుకబడేయబడ్డ జీవితంలోంచి కళ్ళు ధారలు కట్టి రచనలు వచ్చినా వీరి కరడుగట్టిన మనసులు కరగవు. అలాగని టెక్నిక్‌ని పూర్తిగా పక్కన పెట్టమని అనడం లేదు. అంతస్సూత్రాన్ని పట్టుకునే విమర్శకుల్ని లెక్కచేయని వాతావరణం ఇంకా మన మధ్య ఉంది. అందుకే బహుజనులు తమ బతుకుల్లోని కొత్త టెక్నిక్స్‌ని పట్టి ఇవ్వాలి. వాటికోసం తమ జీవనాన్ని జల్లెడ పట్టాలి.
నిజానికి కేవలం అధ్యయనంలోంచి కాక జీవితంలోంచి వచ్చే రచనలు స్వచ్ఛంగా సహజంగా ఉంటున్నాయి. మనసు మీద బలమైన ముద్ర వేస్తున్నాయి. ఒక అంతర్‌ జ్వలనాన్ని రేపుతున్నాయి. వీటిలో ఎన్నో ప్రత్యేకతలు, సోకాల్డు నాగరిక సమాజానికి ఆశ్చర్యం కలిగించే వ్యక్తీకరణలు ఉంటున్నాయి. బహుజన కథకుల్ని ఆవరించి ఉన్న సోకాల్డు ప్రామాణిక వాతావరణం కొందరిని అసలు రచనలే చేయకుండా చేస్తున్నది. చేసిన రచనలను సోకాల్డ్‌ సంకలనకర్తలు పట్టించుకోనట్లు నటించడంతో ఎందరో రచయితలుగా హత్య చేయబడ్డారు. భాష విషయంలో, వ్యక్తీకరణ విషయంలో, కథా వస్తువు విషయంలో ఆధిపత్య భావజాల విమర్శకులు, సంకలనకర్తల ప్రభావాల్ని ఛేదించుకొని రాయాలంటే పురిటినొప్పులు పడాల్సి వస్తున్నది. వారు ఎప్పటికప్పుడు బహుజన రచయితల్ని కంట్రోల్‌ చేస్తున్నారు. వారి మెప్పుకోసం తంటాలు పడడంలో బహుజనతనం మాయమవుతున్నది. ఆ ఎరుక ఉన్న రచయితలుగా మేమిప్పుడు ఆ ప్రభావాలు మా మీద పడకుండా, మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు రిఫ్రెష్‌ చేసుకోవాల్సి వస్తున్నది. ఈ ప్రయత్నంలో మా మధ్య ఎన్ని సంఘర్షణలో.. ఎన్ని సందిగ్ధాలో…ఎన్నెన్ని చర్చలో.
ఈ కోణాలన్నింటిలోంచి ఆలోచించినప్పుడు రవి కథల్లో ఈ కొత్త పార్శ్వాలు చూడొచ్చు. రవి ముందు ముందు మరిన్ని మంచి కథల్ని, నవలల్ని అందిస్తాడన్న నమ్మకంతో.. అందుకు ఇంకా ఇంకా శ్రమిస్తాడన్న భరోసాతో… రవికి అలాయి బలాయి. గుండెకు గుండెను కలిపే అలాయి బలాయి.

-స్కైబాబ

(ఈ ఆదివారం విడుదల కానున్న డా.పసునూరి రవీందర్‌ కథా సంపుటి ‘‘అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా’’కు రాసిన ముందుమాట)

Download PDF

1 Comment

  • “ విమర్శకులంటే అధ్యయనశీలురై మాత్రమే ఉండాలనే ఒక గుడ్డి నమ్మిక మన మధ్య సంచరిస్తుంది. తెలుగు సాహిత్యం లో ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నవారే గట్టి విమర్శకులని భావించే వాతావరణమున్నది.” – స్కైబాబా గారు సూటిగా చెప్పారు. ఈ మధ్య ఇంగ్లీష్ లిటరేచర్ తో సాన్నిహిత్యం వున్న కొందరు తెలుగు కథా సంపుటులకు ముందు మాటలూ , కథల సమీక్షలూ వ్రాస్తూ ఇంగ్లీష్ రచయితల సూత్రీకరణలను కొటేషన్లుగా ఇంగ్లీష్ లోనే వ్రాస్తున్నారు. కనీసం వాటికి తెలుగు అనువాదం కూడా వ్రాయరు. ఇవి సందర్భం లేకుండా కూడా వుంటాయి.పాఠకులకు అర్థం కాకపోయినా వారి ధోరణి వదలిపెట్టరు.
    తెలుగు కథలకు తెలుగులోనే సమీక్షలు వాస్తే కథపై పాఠకుల ఆలోచనాపరిధి విస్త్రుతమవడానికి అవకాశం వుంటుంది కదా !

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)