సాహిత్య చరిత్రలో కాళోజి దారి…

kaifiyath

కాళోజి – తెలంగాణ రచయితల సంఘం1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపనతో తెలంగాణలో సాంస్కృతిక పునర్వికాసానికి పునాది పడింది.  హైదరాబాద్‌లో ఈ నిలయ స్థాపనలో రావిచెట్టు రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు, రాజనాయని వెంకటరంగారావులు కీలక భూమిక పోషించారు. వీరు కేవలం దాన్ని ఒక సంస్థగా కాకుండా ఒక సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దారు. గ్రంథాలయానికి అనుబంధంగా విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాలను ఏర్పాటు చేసి శాస్త్ర, చరిత్ర, సాహిత్య పుస్తకాలను వెలువరించారు. ఒక్క గురజాడను(?) మినహాయిస్తే ఆధునిక కాలంలోని తెలుగుసాహితీ ఉద్ధండులందరూ ఇక్కడ సన్మానం పొందినవారే. తమ సాహితీ ప్రతిభను ప్రదర్శించినవారే! తర్వాతి కాలంలో అణా, దేశోద్ధారకతో సహా అనేక గ్రంథమాలలు, నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం, వర్తక సంఘాలు, ఆంధ్రమహాసభ, నిజాంరాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్‌ ఇలా ఎన్నో సంస్థలు భాషానిలయం స్ఫూర్తితో ఏర్పాటయ్యాయి. అందుకే ఈ గ్రంథాలయం తెలంగాణ పునర్వికాసానికి పునాదిలా ఉండిరది అని చెప్పడం. నిజాం పాలనలో తెలుగువారి అస్తిత్వం, ప్రతిభకు పట్టం కట్టడానికి కొమర్రాజు, నాయని వెంకటరంగారావు, మాడపాటి హనుమంతరావు, సురవరం, బూర్గుల తదితరులు కృషి చేసిండ్రు. వీరి కృషికి కొనసాగింపుగా హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం అరుణశ్రీ గ్రంథమాల, రాజశ్రీ సాహిత్య కళాపీఠమ్‌, నవ్య కళాసమితి, ఆంద్రచంద్రిక, విజ్ఞానచంద్రికా గ్రంథమాల, సుజాత, భాగ్యనగర్‌, శోభ లాంటి పత్రికలు స్థాపితమయ్యాయి. సాయుధ పోరాటం విరమించడం వల్ల కూడా సాహితీవేత్తలకూ పూర్తిస్థాయిలో రచయితల సంఘానికి సమయం వెచ్చించడం సాధ్యమైంది.
హైదరాబాద్‌పై పోలీసుచర్య అనంతరం తెలంగాణలో తెలుగువారి అస్తిత్వాన్ని నిలబెట్టడానికి, ప్రతిభను ప్రోత్సహించడానికి, విస్మృత సాహిత్యాన్ని వెలుగులోకి తేవడానికి, వైతాళికుల స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశ్యంతో 1951 సెప్టెంబర్‌ ఆరున తెలంగాణ రచయితల సంఘం ఏర్పడిరది. తెలంగాణ భాష, సంస్కృతి, చరిత్ర, సాహిత్యాన్ని రక్షించడం దీని ప్రధాన లక్ష్యం. సంఘం తొలి అధ్యక్షుడు దాశరథి. కార్యదర్శి సి.నారాయణరెడ్డి. ఈ సంఘంలో మొదటి నుండి కీలక పాత్ర పోషించింది బిరుదురాజు రామరాజు, పి.మాణిక్యరెడ్డి, యశోదారెడ్డి, కాళోజి నారాయణరావు తదితరులు. తర్వాతి కాలంలో ఆళ్వారుస్వామి కూడా ఇందులో పాలుపంచుకున్నాడు. తెలంగాణ సాహిత్య సమాజం తరపున ప్రభుత్వంతో వివిధ విషయాలపై మాట్లాడేందుకు ఈ సంఘం ఒక వేదికలా పనిచేసింది. అప్పటి వరకూ ప్రజా ఉద్యమంలో ముందుండిన దాశరథి, కాళోజీలు సంఘ నిర్వహణలో కూడా ప్రధాన పాత్ర పోషించారు.
ఉద్యమ కవిగానే అందరికి పరిచయమున్న కాళోజి మంచి కార్యకర్త, కార్య నిర్వాహకుడు కూడా! 1934లో హైదరాబాద్‌లో మిత్రులు వెల్దుర్తి మాణిక్యరావు, వెంకటరాజన్న అవధానిలతో కలిసి ‘వైతాళిక సమితి’ నిర్వహించాడు. ఈ సమితి ద్వారా ప్రజల్ని చైతన్య పరిచే సభలు, సమావేశాలు, పత్రికా రచనలు చేసేవారు. హైదరాబాద్‌ నుంచి హన్మకొండకు వచ్చిన తర్వాత వివిధ ప్రజా సంఘాలతో కలిసి పనిచేశాడు. ఇందులో వరంగల్‌లో ఆంధ్రసారస్వత పరిషత్‌ సభల నిర్వహణ ఆయన కార్యాచరణకు నిదర్శనం. కాళోజి కార్యచరణ గిట్టనివాళ్లు సభను అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. ప్రభుత్వం నుంచి సభ నిర్వహణకు అనుమతి లభించలేదు. అంతేగాదు అర్ధరాత్రి సభ కోసం ఏర్పాటు చేసిన వేదికను దుండగులు తగలబెట్టారు. అయినప్పటికీ వీటన్నింటిని అధిగమించి వరంగల్‌లో ‘ఆంధ్రసారస్వత సభ’ని నిర్వహించారు. ఇది 1947(?)నాటి ముచ్చట. కాళోజి పట్టుదలకు ఇది నిదర్శనం.
kaloji
తెలంగాణ రచయితల సంఘం సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాలు, కథకుల సమావేశాలు, తెలంగాణలోని వివిధ ప్రదేశాల్లో నిర్వహించి ఆయా ప్రాంతాల్లో సాహిత్యాభిరుచిని పెంపొందించింది. ఖమ్మంలో ఊటుకూరు రంగారావు, డోకిపర్తి రామలింగం, హీరాలాల్‌ మోరియాలు మొదలు సిరిసిల్లలో గూడూరి సీతారామ్‌, జనగామలో గఱ్ఱేపల్లి సత్యనారాయణ రాజు వరకు ఎందరో ఈ సంఘం నిర్వహణలో పాలుపంచుకున్నారు.
1953లో ఆలంపురంలో గడియారం రామకృష్ణశర్మ సాహిత్య సభలు నిర్వహించారు. ఈ సభలకు ఆంధ్రప్రాంతం నుండి శ్రీశ్రీ, శ్రీపాదతో సహా అనేక మంది కవి పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజాత పత్రిక ప్రత్యేక సంచికను వెలువరించింది. దీంట్లో ఆంధ్ర ప్రాంతం వారి రచనలు కూడా విరివిగా చోటు చేసుకున్నాయి. నాయనికృష్ణకుమారి, పాలగుమ్మి పద్మరాజు లాంటి వారి రచనలు ఇందులో ఉన్నాయి. ఈ సభల్లోనే వట్టికోట ఆళ్వారుస్వామి దేశోద్ధారక గ్రంథమాల తరపున కాళోజి రాసిన ‘నా గొడవ’ను మొదటి సారిగా ప్రచురించాడు. దీన్ని ఆలంపురం సభల్లో అర్ధరాత్రి పూట శ్రీశ్రీ ఆవిష్కరించాడు. (పగటి పూట సభల్లో ఈ పుస్తకావిష్కరణకు సమయం కేటాయించలేదు) బహుశా ఈ సభలే ‘ఆంధ్రప్రదేశ్‌’ అవతరణకు సాహిత్య రంగంలో సానుకూలతను తీసుకొచ్చాయి. ఇదే కాలంలో హైదరాబాద్‌లో అఖిల భారత గ్రంథాలయ మహసభలు జరిగాయి. అలాగే శ్రీకృష్ణదేవరాయాంధ్ర స్వర్ణోత్సవాలు కూడా ఈ సంవత్సరమే జరిగాయి. స్వర్ణోత్సవాలకు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగానే కాకుండా అధ్యక్షుడి హోదాలో పాల్గొన్నారు. అప్పుడే ముల్కీ ఉద్యమం ఉధృతంగా ఉండడంతో విద్యార్థులు ఆయన రాకను నిరసించారు కూడా. ఈ ఉత్సవాలను బిరుదురాజు రామరాజు కార్యదర్శిగా ఉండి నిర్వహించారు. బిరుదురాజుతో పాటు, కాళోజి, దాశరథి, సి.నారాయణరెడ్డి తదితర తెలంగాణ రచయితల సంఘం వారంతా చురుగ్గా పాల్గొని సభల్ని విజయవంతంగా నిర్వహించారు.
తెలంగాణ రచయితల సంఘం తొలి మహాసభలు 1953లో రెడ్డి హాస్టల్‌ ఆవరణలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు ఖాయమైన తర్వాత 1956 సెప్టెంబర్‌లో ‘తెలంగాణ రచయితల సంఘం’ ద్వితీయ మహాసభలు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో మూడ్రోజుల పాటు వైభవంగా జరిగాయి. ఈ సభలకే గాకుండా సంఘానికి కూడా కాళోజి నారాయణరావు అధ్యక్షుడయ్యాడు. సెప్టెంబర్‌ 17వ తేదీనాడు సభ ముగింపు సమావేశంలో కాళోజి చేసిన ప్రసంగం సాహితీ రంగంలో విశిష్టమైనది.
భాష విషయంలో కాళోజికి కచ్చితమైన అభిప్రాయముండేది. అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల వారి భాషను సాహిత్యంలో ప్రతిఫలించాలి అని భావించేవాడు. పత్రికలు, పుస్తకాల్లో వచ్చిన భాషే ప్రామాణికమని నిర్ధారించడం పొరపాటు అని కూడా చెప్పాడు. తెలుగు వారి కోసం తెలుగులోనే తెలుగులోనే రాయాలి. సంస్కృతం, ఇంగ్లీషు పదాల్ని అనవసరంగా వాడటం ద్వారా  అవి అందరికీ అర్థం కాకపోవొచ్చు. తాము రాసినం కాబట్టి అందరూ అదే చదువుకోవాలనడం తప్పని చెప్పాడు. సమాజంలో సహజంగా వృద్ధిలోకి వస్తున్న లేదా రూపొందుతున్న భాషే సరైనదిగా భావించాలనేది కాళోజి అభిప్రాయం. ఇదే విషయాన్ని తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా చేసిన ఉపన్యాసంలో పేర్కొన్నాడు.
‘‘నేటి తెలుగు సాహిత్యం, దాని నిర్మాణానికి ఉపయోగపడుతున్న భాష విషయమై, ఎన్నో తర్జన భర్జనలు జరుగుతున్నవి. భాషలోని శబ్దాలకు, తత్సమమని, తద్భవమని, దేశ్యమని, గ్రామ్యమని కులాలు అంటగట్టి, భావ ప్రకటనకు (అంటే సాహిత్య నిర్మాణానికి) ఫలాన తెగకు చెందిన మాటలే పనికివస్తాయి, ఫలాని తెగకు చెందిన మాటలు పలకటానికి పనికిరావు, వ్రాతకు అసలే తగవు అని సిద్ధాంతీకరించడమే ఈ తగాదాకు మూల కారణం. సంస్కరణ పేరిట వర్ణాంతర వివాహాలను సమ్మతించే మహాశయులు, భాషా ఛాందసంలో మిశ్రమ సమాసాన్ని ఒప్పుకోరు. అన్ని కులాల వారు కలిసి భోజనం చేయడం ఒప్పుకుంటారు. కాని పైన చెప్పిన నాలుగు విధాల మాటల కూర్పుకు ఒప్పుకోరు. భార్య ఒళ్లు, తాతగారి రంగూ, మేనమామ కోపం, చిన్నాయన బుద్ధి ఉన్నవని చెప్పుకొని మురిసిపోయ్యే, పండిత ప్రకాండులు మునిమనమనిలో, ఎటూ పోల్చుకోలేని రూపు చూచి ‘‘ఛీ, ఛీ’’ అన్న మాత్రాన వాడు మునిమనుమడు కాకుండా పోతాడా? రూపంలో ముత్తాత పోలీకులు లేనంత మాత్రాన వాడు మానవుడు కాదంటే అన్యాయం కాదా? తర తరాలలో సంతానం యొక్క రూపం కూడా మారుతూ వుంటుంది. రచనలో వాడిన మాటల రూపు రేఖలెట్లావున్నా ఇబ్బంది లేదు. ముఖ్యమైనది సాహిత్య నిర్మాణశక్తి. అది ప్రకటితం కావడానికి, మాటలేవైనా సాహిత్యం యొక్క విలువ తగ్గదు.’’ (విశాలాంధ్ర, సెప్టెంబర్‌, 1956)
తాను ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు సానుకూలంగా ఉన్నప్పటికీ ఆంధ్ర`తెలంగాణల్లోని భాషలు భిన్నమైనవి ఆ ‘పలుకుబడుల’ భాష అలాగే కొనసాగాలని కాళోజి ఆశించారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు తెరవెనుక ఉండి కపిల కాశీపతి లాంటి వారు దాశరథి లాంటి వారిపై ప్రభావం చూపించి రచయితలుగా, రచయితల సంఘంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు సానుకూల వాతావరణాన్ని సృష్టించారు.
‘‘ఆంధ్రావని ఏకమై మహాంధ్ర స్వరూపం ఏర్పడి ఆంధ్రప్రదేశం అవతరించు శుభముహూర్తం సమీపించుచున్నది. ఏ జాతి ఉన్నతికి గాని పురోగమనమునకు గాని ఆ జాతి సాహిత్యం మార్గదర్శకము. అట్టి సాహితీ సంపత్తిలో తెలుగుదేశం ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. పూర్వ, మధ్య, ఆధునిక యుగాలలో వాగానుశాసనుడు మొదలు వర్తమాన కాలం వారు తెలుగు రచనా వ్యాసాగం నవ్య రీతులలో నడుసూతనే ఉన్నది. ఆంధ్రులు సామ్రాజ్యములు ఏలిన కాలంలో ఆంధ్రభాషామతల్లిని మహారాజులు పోషించినారు. ఒకనాడు తెనుగుతేట కర్నాట కస్తూరీతో కలిసి దేశభాషలందు తెలుగు లెస్స అన్న బిరుదాన్ని పొందినంది.
ఆ రోజులు మారినవి. ఆరాజులు ఈనాడు లేరు. ప్రజలే భాషాపోషకులు. ఇన్నాళ్లుగా మూడు చెరగులైన ముక్కోటి తెలుగుల సమిష్టి సాహిత్య కృషికి పొలిమేర లాటంకమైనవి. ఈనాడు తెలుగుదేశం ఒక మేరjైునది. ఇట్టి తరుణంలో తెలుగదు సాహిత్య సంపద ఇంటనే గాక బైట కూడా ప్రచారం చేయవలసనిన అవసరమేర్పడినది. అట్టి అవసరాన్ని గర్తించియే ఆంధ్ర సాహిత్యాభిమానులు కొందరు అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తు సంస్థాపన చేయ ప్రయత్నాన్ని ప్రారంభించానరు. అలా(ం)టి ప్రయత్నాన్ని ప్రజాభిప్రాయ మాశీర్వదించింది. పత్రికలు బలపరచినవి. తెలంగాణ రచయితల సంఘ వేదికపై ఈ రెండు మూడు దినాలు ఆ ప్రయత్నానికి మరి కొంత బలం చిక్కింది. ఆంధ్ర, హైదరాబాదు ముఖ్యమంత్రులు ఆ ప్రయత్నాన్ని కొనసాగించవలెనని ఉద్ఘాటించారు. తెలంగాణ రచయితల సంఘం కార్యవర్గం ఈ వరకే ఈ ఆశయాన్ని ఆహ్వానించింది. అట్టి సంస్థను రూపొందించిడంలో వివిధ సాహితీ సంస్థల, ప్రసిద్ధ రచయితల, ప్రాంతీయ ప్రభుత్వముల, విశ్వవిద్యాలయముల ప్రాతినిధ్యం ఉండవలెనని ఈ సర్వ సభ్యసమావేశం అభిప్రాయపడుతున్నది. ఈ విషయంలో తగు ప్రయత్నాలు చేయడానికి సంఘాధ్యక్షులకు (కాళోజి నారాయణరావుకు) సర్వాధికారాలు ఇస్తున్నది’’ అంటూ తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షులు దాశరథి కృష్ణమాచార్య తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. (ఆంధ్రప్రభ, సెప్టెంబర్‌, 23, 1856).
కాళోజి నారాయణరావు ఒక సంధి కాలంలో తెలంగాణ రచయితల సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. తెలుగు సాహితీలోకంలో మెజారిటి కవి పండితులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆహ్వానించారు. స్వయంగా తాను కూడా అదే ఆలోచనతో ఉన్నారు. అందుకు అనుగుణంగా తన మిత్రుడు వట్టికోట ఆళ్వారుస్వామి సంపాదకత్వంలో ‘ఉదయఘంటలు’ కవిత్వాన్ని ప్రచురించారు. ఇందులో ఇరు ప్రాంతాలకు చెందిన కవులకు స్థానం కల్పించారు. తెలుగువారి ఐక్యతకు సూచీగా ఈ సంకలనం వెలువడిరది. అయితే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడంతో 1969నాటికి ప్రభుత్వాన్ని నిలదీసిన, నిరసించిన వారిలో కాళోజి ముందుభాగంలో ఉన్నాడు. సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్‌ అవతరణను సంఘం తరపున ఆహ్వానించారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాళోజి ఒక్కడే సంఘానికి మించి పనిచేసిండు. కాసు బ్రహ్మానందరెడ్డిని మొదలు ఇందిరాగాంధీ వరకు ఎవరినీ వదలకుండా అందరినీ ఎండగట్టిండు.
తొలిదశలో దాశరథి, నారాయణరెడ్డిలతో పాటుగా ఆంుధప్రదేశ్‌ అవతరణను ఆహ్వానించిన కాళోజి నారాయణరావు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరీ ముఖ్యంగా తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అప్పటి వరకున్న భ్రమలన్నీ పటాపంచలయ్యాయి. అందుకే 1959 నాటికే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు వల్ల ఆశించిన ఫలితాలు సమకూరడం లేదని శాసనసభలోనే చెప్పిండు.
తెలంగాణ రచయితల సంఘం తరపున తొలి దశలో దాశరథి, నారాయణరెడ్డిల రచనలు వెలువడ్డాయి. ఆ తర్వాత పల్లా దుర్గయ్యతో పాటుగా ఆంుధప్రాంతానికి చెందిన పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల రచనలు కూడా సంఘం తరపున ప్రచురితమయ్యాయి. తెలంగాణ రచయితల సంఘం వారు అతి తక్కువ కాలంలో నాగార్జున సాగరం, మహాంధ్రోదయం, పాలవెల్లి, గంగిరెద్దు, ఉపహారం, తెలుగుతీరులు, చిరుగజ్జెలు, జానపద గేయములు, ఉదయఘంటలు తదితర రచనలు వెలువరించారు. ఇవి ఆనాటి యువ సాహితీలోకాన్ని స్ఫూర్తిగా నిలిచాయి. సంఘం తరపున మొదట ‘మంజీర’ పత్రిక కొన్ని సంచికలు వెలువడ్డాయి. ఆ తర్వాత జిల్లాల్లో కూడా కొంత ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆంధ్ప్రదేశ్‌ అవతరణ తర్వాత సంఘం ఆంధ్ర రచయితల సంఘంగా మార్పు చెందడమే గాకుండా ఖండవల్లి లక్ష్మీరంజనం లాంటి వారి చేతికి సంఘం బాధ్యతలు చేపట్టారు. దీంతో అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న తెలంగాణ సాహిత్యానికి, ప్రతిభకు అడ్డుకట్ట పడ్డట్టయ్యింది.
తెలంగాణ రచయితల సంఘంకు ఒక రకంగా పాక్షిక కొనసాగింపుగా వరంగల్లులో ‘మిత్రమండలి’ 1959లో ఏర్పాటయ్యింది. మండలి తరపున వివిధ పండితుల సాహీతీ గోష్టులను నిర్వహించారు.
– సంగిశెట్టి శ్రీనివాస్‌
(కాళోజి వర్దంతి సందర్భంగా)
Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)