గరిమెళ్ళ నాగేశ్వరరావు ప్రపంచాక్షరి కవితా సంపుటి 1997 నుండి 2008 ల మధ్య దశాబ్ద కాలములో వ్రాసిన 51 కవితల సమాహారం. ప్రపంచాక్షరి అన్న పేరుతోనే వినూత్నంగా విశ్వమానవ కళ్యానానికి శ్రీకారం చుట్టిన ఈ కవి దృక్కోణం గురించి పూర్తిగా ఆశ్చర్యం నుండి తేరుకోకముందే, కవితలకు ముందూ వెనుకా ఉన్న పేజీలలో పొందుపరచిన అవార్డులు స్వీకరిస్తున్న ఫోటోలు, పురస్కారాల వివరాలు ,పెద్దలు వ్రాసిన మాటలు ఇవన్నీ కలిసి ఈ మాస్టారి అప్రతిహత బహుముఖ ప్రజ్ఞ ‘రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకునే వరకూ’ సాగి ఇంకా అదే వేగం తో పరుగెడుతోందని తెలిసి మరెంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
కవి స్వయంగా రూపొందించిన ముఖచిత్రం ఈ కవితా సంపుటి శీర్షికకు తగ్గట్టూ శాంతి (పావురం), వీణ (కళ), బాలిక (స్త్రీ హిత), బిడ్డను పొదవుకున్న మైనర్ తల్లి ( అవాజ్య ప్రేమ) దీన బాలుడు (అన్నార్తుల వేదన) ప్రతీకలు సృజించి లోపలి కవితా వస్తువుల గురించి చెప్పకనే చెబుతుంది .
కవిత్వాన్ని ఒక రైలు బండిలా మార్చుకుని నేల నలుచెరగులా దాన్ని కవి నడిపించడమే కాకుండా, పట్టాలు తప్పే ప్రమాదమున్న సందర్భాలను ముందే అంచనా వేసి తదనుగుణంగా హెచ్చరికలు చేసి, ఆగే ప్రతి స్టేషన్ గురించి కూలంకషంగా చెబుతూ, ఎక్కే దిగే ప్రయాణికుల భద్రతను కాంక్షిస్తూ, వారి గాధలని ఆలపిస్తూ కవి చేసిన చైతన్య ప్రయాణమే ప్రపంచాక్షరి. ముల్లు మొదలు తల వరకూ బొంగరానికి తాడుని పకడ్బందీగా చుట్టి, గచ్చు నేల మీదికి లాఘవంగా విసిరి తాడు లాగి ఆ బొంగరం చేసే గింగిరాల వీరంగాన్ని వీక్షిస్తే ఆ ఫోకస్ (తదేకత) లో ఎంత సంతృప్తి కనబడుతుందో… ప్రతి కవితలో కూడా అంతే చక్కటి ఫోకస్ ని దట్టించి పాఠకుడి మనోఫలకం మీద తిప్పగలగటం గొప్పగా గోచరిస్తుంది. అందుకే ఈ పుస్తకాన్ని ఊసుపోనప్పుడో, నిద్రపోవడానికి ముందో చదవాలనుకునే కన్నా, రోజంతా శ్రమలో మునిగి తేలిన రాత్రి ఎనిమిదిగంటల పాటూ నిద్ర పోయి మర్నాడు ఉదయం లేచిన తరువాత తిరిగి చైతన్యానికి శ్రీకారం చుట్టే సమయాలలో చదివితే చాలా బాగుంటుందనిపిస్తుంది.
ప్రారంభం లోనే స్వాగతం పలికే ‘ప్రపంచాక్షరి’శీర్హిక కవిత, కవి అతని కవిత్వం విస్తృత పరమార్ధాన్ని, విశాల భావజాలాన్ని, వస్తు సందర్శనాన్ని బలీయంగా చెబుతుంది. “బండరాళ్ళ… మొండి శిలల మీద వాక్యాలు జల్లి కన్నీరు చెమర్చడం నేర్పాను.… అక్షర మూర్తిని, నేను కవిని” అని తనను గురించి పరిచయం చేసుకుంటూనే కదన రంగం లో ఆయుధాన్ని పూనిన సైనికుని ఆత్మవిశ్వాసం మాదిరిగా ఉత్సాహం తో కవిత్వాన్ని చెబుతారు.నెల్సన్ మండేలా, రెండు జర్మనీల మధ్య కూలిన అడ్డుగోడ, సోమాలియా ఆకలి, హిరోషిమా బూడిద వగైరా చారిత్రక సందర్భాలను ఆయా వస్తు నేపధ్యాల ప్రయాణంతో కవితను ఆవిష్కరించిన తీరు అబ్బురపరుస్తుంది. అందులో …
నదీ తీర తవ్వకాలలో బయల్పడిన
నాగరికతల ముఖాల మీద
నవ్విన సంతకాన్ని నేను
జైలు గోడల మధ్య సూర్యోదయమయిన
నెల్సన్ మండేలా బిగిపిడికిలి విప్పిన చప్పుడులో
వినిపించిన విజయధ్వానాన్ని
కల్పనా చావ్లా రెప్పల వెనుక చేజారిన స్వప్నాన్ని
సునీత కళ్లతో నేలకు చేర్చినప్పుడు
మురిసి పోయిన తారకల్లో మెరిసింది నేనే
అంతరిక్షం నుండి పాతాళం వరకూ
… శాంతి కోరి తపిస్తూ జపించే …ప్రపంచాక్షరి ఇది
మరొక కవిత ‘సైబర్ కూలీ స్వగతం’ లో డాలర్ల దాహంతో పరాయి దేశానికి అంగలార్చిన సాఫ్ట్ -వేర్ ఇంజనీర్ దైనందిన జీవితం ఎంత యాంత్రికంగా సాగుతుందో వివరంగా చెప్పారు. “ అత్యాధునిక శ్రామికుణ్ణి..కీ బోర్డు దేహాన్ని మీటుతూ కొత్త సృష్టికి ఊపిరి పోసే కృత్రిమ బ్రహ్మని..” అని అతని లోకి పరకాయ ప్రవేశం చేసి స్వగతంగా పూర్తిగా చెప్పాక,దూరాన అతను కోల్పోతున్న దగ్గర వారి గురించి టార్చ్-లైట్ వేసి మరీ చూపించి అతను తిరిగి తనవారి మధ్య కు వచ్చి అదే వృత్తిని కొనసాగించే వీలు ఎంత సాధ్యమో “అవును ప్రపంచం పల్లెటూరయ్యాక పొలిమేరలు దాటాల్సిన పనేముంది?” అని ప్రశ్నిస్తూ చెబుతారు.
డౌన్-లోడ్ చేసిన ఫైల్లో … పెరటి చింతచెట్టు
కొత్తగా చిగురించినట్టు కనిపిస్తోంది
ప్రేమ ఫైల్ ఓపెన్ చేసేందుకు
పాస్వర్డ్ ఎక్కడా దొరకడం లేదు
అభిమానం ఆచూకీ రీసైకిల్ బిన్ లోనైనా
రీస్టొర్ చేసేందుకు అందదు
అని కంప్యూటర్ పదాల పరిభాషలో యాంత్రికత్వాన్ని నిరసించి, ద్వేషించి బాధపడి… పొలిమేరలు దాటాల్సిన పనేముంది?” అని తనకి తాను పూర్తిగా సమాధానపడటం ప్రశ్నతో ముగుస్తుంది.
ఈ రెండు కవితలలోనూ కదిలించిన చరిత్ర, కదులుతున్న వర్తమానం అంశాలుగా కవి చేసిన ప్రయాణం అతని తపననీ, జ్ఞానాన్ని మనముందు రంగరించి పోస్తాయి.
అనంత జీవన యానంలో శిధిలమైపోతున్న రంగుల స్వప్నాలని ప్రస్తావించి మానవత్వపు మేడొకటి నిర్మించాలని సూచించిన “ మా విద్వి షాహహై ” అనే కవితా, తడారిపోతోన్న మట్టి పొరలల్లోంచి ప్రపంచానికి పట్టెడన్నం పెట్టడానికి రూపాయి చూపులను మరోసారి మట్టిదారి పట్టించాలని చెప్పే “ మట్టిదారిలో మరోసారి..” లాంటి ప్రతి కవిత లో సమస్యలను ఎత్తి చూపించడమే కాకుండా పరిష్కార మార్గాలనూ సూచించారు.
‘ ప్రశ్నలు ‘ లో ఇరాక్ మీద అగ్ర రాజ్యం దాడినీ, ‘ గుండెలోతుల్లోంచి ’ లో మన విలాస స్వార్ధాలకు ప్రకృతిలో కోతీ, పామూ, ఆవు, కప్ప, ఉడుత, తూనీగ లాంటి జీవుల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా, నిర్లజ్జగా ఆహుతి చేస్తున్న తీరునీ చదివాక, చుట్టూ పేరుకున్న హింసలో కలిసిపోయి బతికేస్తున్న మనకి గగుర్పాటు కంపరం కలుగుతుంది.
అమ్మ, మాస్టారుకో పద్యం, పండగ, మొదలైన జ్ఞాపకాలలో సౌమ్యంగా ఉన్నత మూర్తులకు చేసిన సన్మానాలను చూడొచ్చును.
ఓటు వజ్రాయుధాన్ని సరిగ్గా ఎక్కు పెట్టమని నిర్దేశం చేసిన ఆ కలం తోనే, పిచ్చుకల లాంటి అంతరించి పోతున్న పక్షుల మీద కాలుష్యపు వజ్రాయుధాల్ని ఎక్కుపెట్టొద్దని చెప్పి కట్టడి చేశారు.
ప్రేమ పేరుతో స్వైర విహారం చేస్తున్న ప్రేమ-చిరుతల పట్ల మిక్కిలి జాగురూకతతో వ్యవహరించాలని ‘లేడీ (ఆడ)’ పిల్లలను కవి హెచ్చరించిన తీరు ‘ప్రేమ-చిరుత’ కవితలో సమగ్రంగా ఉంది. ఇది ఇప్పటి కాలానికి…అందరు ఆడపిల్లలకూ తప్పని సరి పాఠం. ఈ కవితను రెండు తెలుగు రాష్ట్రాలు ఇంటర్మీడియట్ లేదా పదవ తరగతి తెలుగు వాచకములలో చేరిస్తే బాగుంటుంది.
‘నగరంలో ఇప్పుడు…
ప్రేమ చిరుతలు తిరుగుతున్నాయి
“లేడీ” పిల్లల్లారా….జాగ్రత్త!’
అని ప్రారంభమవుతుంది ‘ప్రేమ-చిరుత’ కవిత.
‘ ప్రేమంటే వెంబడించిన వాడి వెంట
అడుగేసి గుడ్డిగా నడుస్తూ…
దారి తప్పిపోవడం కాదు కదా?!’
ప్రాణాలు తియ్యడం, తీసుకుంటామని భయపించడం ,యాసిడ్ దాడులు చెయ్యడం, ఇంట్లో వారినీ, బంధు మిత్రులనీ, చుట్టు పక్కల వారినీ భయభ్రాంతులని చేసి మరీ అడ్డూ అదుపూ లేకుండా సాగిపోయే పైశాచిక ప్రేమల గురించి ఆడపిల్లలు తప్పని సరిగా అలెర్ట్ కావాలి.
మొదట ‘ప్రపంచాక్షరి’ కవిత లో కవిత్వ పరమార్ధాన్ని చెప్పి, అఖరున ‘ కలాన్ని మోసే వాడు ‘ కవితలో ” మిత్రమా కలాన్ని మోయడం కాలాన్ని మోసినంత సులువు కాదు” అనడం చదివాక ఈ రెండు కవితలూ అటూఇటూలుగా మిగిలిన కవితలతో చక్కగా అల్లిన దండ ప్రపంచాక్షరి కవితా సంకలనమని అవగతమౌతుంది.
చీకటికి ఆనవాలమవుతున్న అనైతికత, నిర్లక్ష్యం, స్వార్ధం, అవకాశ ధోరణులు; వెలుగు దివిటీలు పట్టుకు తిరిగిన నాయకులు, కవులు… ఇంకా వెలుతురు మయం గావించాల్సిన మూల మూలల్లోని విషయాలు; కూలగొట్టవలసిన అడ్డుగోడలు; వేయ వలసిన వంతెనలూ; కట్టాల్సిన ఆనకట్టలూ, నిర్మాణాలు వీటన్నీంటి గురించి ప్రపంచాక్షరి కవితలు అనేక విషయాలను చెప్పకనే చెబుతాయి.
“చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా “ అని కవి గరిమెళ్ళ నాగేశ్వర రావు గారు పిలిచి చూపించిన విషయాలు, వెలుతురు ప్రసరించిన దారులూ, కొనియాడి అధిరోహింప జేసిన ఆదర్శవంతమైన శిఖరాలు బహుదా ప్రశంసనీయం, సర్వదా అభినందనీయం.
కవి తపన, తదేకత, మమేకత ,సంస్కరణాభిలాష,వస్తుగతజ్ఞానము మొదలైన అనేక విషయాలను ఈ కవితా సంపుటి ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తుంది. విలువలు ప్రాతిపదికగా కవిత్వాన్ని ఆస్వాదించి అనుభూతించి ఆ మార్గాలను అనుసరించాలనుకునే ప్రతి ఒక్కరి దగ్గరా తప్పక ఉండాల్సిన పుస్తకం ఈ‘ ప్రపంచాక్షరి ‘.
ప్రతులకు సంప్రదించండి.
Email: gvsnrao08@gmail.com
-నారాయణ గరిమెళ్ళ.
ధన్య వాదాలు నారాయణ గారికి..మంచి సమీక్షని అందించినందుకు
నారాయణగారూ మీ సమీక్ష బాగుంది.
“చీకటికి ఆనవాలమవుతున్న అనైతికత, నిర్లక్ష్యం, స్వార్ధం, అవకాశ ధోరణులు; వెలుగు దివిటీలు పట్టుకు తిరిగిన నాయకులు, కవులు… ఇంకా వెలుతురు మయం గావించాల్సిన మూల మూలల్లోని విషయాలు; కూలగొట్టవలసిన అడ్డుగోడలు; వేయ వలసిన వంతెనలూ; కట్టాల్సిన ఆనకట్టలూ, నిర్మాణాలు వీటన్నీంటి గురించి ప్రపంచాక్షరి కవితలు అనేక విషయాలను చెప్పకనే చెబుతాయి.”
కవిత్వం చేయవలసిన పని లేదా కవి యొక్క బాధ్యతా అదే అని నేనూ భావిస్తాను. అభినందనలు.కవికి,మీకు ..
మీ అభినందనలకు కృతజ్ఞతలు.
నారాయణ.