నిలకడగా వుండనివ్వని ‘అప్రజ్ఞాతం’

నిర్వహణ: రమా సుందరి బత్తుల

 

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

ఋతువులతో పాటు రూపు మారే పొలాలు .. ‘బాయల్స్ లా’, ‘న్యూటన్స్ లా’ లతో కొంత సైన్సు .. మానవుని  కోర్కెలు అనంతాలు, శ్రమ నశ్వరము లాంటి పదాలతో అర్థశాస్త్రం .. డెబిట్లు, క్రెడిట్లు, లాభనష్టాల ఖాతాలతో గణకశాస్త్రం .. “మానేజ్ మెంట్ అంటే మిగతావారితో పని పూర్తి చేయించుకోవడం” వంటి నిర్వచనాలతో మానేజ్ మెంట్ చదువులు… తద్వారా ఉద్యోగంలో కుదురుకున్నా, అంతరంగం కుదుటపడలేదు. కుదరని రకరకాల చదువుల మధ్య సమన్వయం, జీవితానికి వీటితో అన్వయం.. ఇవి పూరింపబడని ఖాళీలుగా ఉండిపోయాయి.

అటువంటి స్థితిలో ‘అప్రజ్ఞాతం’ కథ చదవటం జరిగింది. చదివాక అది నిలకడగా కూర్చోనివ్వలేదు. ఏదో హాంటింగు.. ఒక స్లైస్ ఆఫ్ లైఫ్.. జీవితంలో పూర్తిగా జరగటానికి వీలున్న ఒక సంఘటన నా కళ్ళముందు జరిగినట్టు.. ఆ సంఘటనలో నేనూ పాలుపంచుకున్నట్టు.. అదీ ఒక పాత్రగా కాకుండా, పలు పాత్రలతో ఐడెంటిఫై ఔతూ.. కొంత సేపు అభిమన్యుడులా అందరి మధ్య చిక్కుకున్న ‘సుదర్శనం’లా, ఇద్దరు రైతులు ‘బుచ్చిలింగం’ ఇంకా ‘బైరాగి’ లను కలిపేసి రెండుగా విభజిస్తే వచ్చే పాత్రలా కాసేపు. నాకు తెలిసిన అనేకమంది నా పక్కన కూర్చుని ఉంటారు. నాకు తెలిసిన మాటలే వాళ్ళు మాట్లాడతారు. అవే అనుమానాలు వ్యక్తం చేస్తారు. తమ పట్ల సానుభూతి వ్యక్తం చేసే వారినే వేళాకోళం చేస్తారు. నాకు తెలిసిన షావుకార్లు ఇద్దరు ‘సూరప్పడు’ రూపంలో గుళ్ళోకి వస్తారు.

మళ్ళీ చూస్తే మానేజ్ మెంటు డెవలప్ మెంట్ ప్రోగ్రాములో ఇచ్చిన కేసు స్టడీ పేపర్లా కనిపిస్తుంది.

రూపాయి బిళ్ళగా ఘనీభవించిన చెమట దొర్లుకుంటూ ఏ ఏ మజిలీలు చేసుకుంటూ చివరకు ఎక్కడికి చేరుతుందో చూశాను. ఉత్పత్తి కారకాలు శ్రమ, భూమి, పెట్టుబడి, నిర్వహణలు తమ కంట్రిబ్యూషన్ కు ప్రతిఫలంగా వేతనాలు, రెంటు, వడ్డీ, లాభాలుగా పంచుకుంటాయని ఎకనామిక్స్ లో బోధిస్తారు. ఐతే నిజ జీవితంలో ఈ పంపకం, ప్రత్యేకంగా వ్యవసాయంలో 40/50 సంవత్సరాల క్రితం ఎలా ఉందో అర్ధమైంది. జరిగే ఈ ప్రక్రియకు సాంఘికామోదం ఉండటం/ఉండేటట్టు చేయడం సిస్టం గొప్పదనం.

నిజానికి ఈ సిస్టం బ్రేక్ చేయలేనంత గట్టిదేం కాదు. రైతులు పెట్టుబడి కోసం అప్పు చెయ్యకుండా, స్థిరాస్థి ఐన భూమిని కొంత , చరాస్థి ఐన బంగారాన్ని కానీ పెట్టుబడిగా మర్చుకున్నా సమస్య కొంత తీరుతుంది. సుదర్శనం మాటల్లో “ఒక సామాన్యరైతుకి ఏటా కావలసిన వ్యవసామదుపు నాలుగైదు వందలు. భార్య వంటిని ఆ విలువకు మించిన బంగారం ఉంటుంది. అది తియ్యడు. పాతికసెంట్ల పొలమమ్మినా ఆ మదుపు చేతికొస్తుంది. ఆ పనీ చెయ్యడు.” (మార్కెట్టు, ధర ఇవి కూడా నిజానికి పెట్టుబడితో ప్రభావితమౌతాయి.) ఐతే ఆస్తి, బంగారం కుదువ పెట్టటానికి ఉన్న సోషల్ యాక్సెప్టెన్స్, ఆస్తి అమ్మకానికి లేదు. ఈ ప్రోసెస్ లో రైతు బంగారాన్ని, భూమినీ కూడా పోగొట్టుకుంటాడు.

కథలోనే సమస్యా, పరిష్కారం రెండూ ఉన్నాయి.

దెబ్బతినేవారికి దెబ్బతగిలిన విషయం అర్ధమౌతుంది కాని దెబ్బతగిలే క్రమం తెలియట్లేదు. ఆ క్రమం నాకు ఈ కథ తెలిపింది.

–ముళ్ళపూడి సుబ్బారావు

SRMullapudi

 

 

ముళ్ళపూడి సుబ్బారావు అంటే ‘రెండు నదుల మధ్య’ కధ గుర్తుకు వస్తుంది. 1995 ఆహ్వానం పత్రికలో ప్రచురించబడిన ఈ కధ తరువాత ఋతుపవనాలు, కధ 95, రెండు దశాబ్ధాల కధ సంకలనాలలో వచ్చింది. తరువాత వీరు రాసిన ‘పాలపుంత’ కధ ఆహ్వానం పత్రికలో వచ్చింది. చివరిగా 2011 లో ‘ఋణం’ కధ ఆదివారం అనుబంధంలో వచ్చి కధా 2011 లో ప్రచురితం అయ్యింది. ఇవి కాక సుబ్బారావు అనువాదం చేసిన ఏడు కధలు విపుల, ఆహ్వానం పత్రికల్లో వచ్చాయి. తనను తాను ఎక్కువగా పాఠకుడిగా పరిగణించుకొనే సుబ్బారావు ఒక దశలో ‘వసుంధర’ కధలు ఎక్కువగా చదివారు. తరువాత తిలక్, బుచ్చిబాబు, పాలగుమ్మి పద్మరాజు కధలు, ఆ పై గురజాడ, కాళీపట్నం, రఘోత్తమరెడ్డి కధలు ఇష్టపడ్డారు. సుబ్బారావుకి చార్లెస్ డికెన్స్, టాల్ స్టాయ్ రచనలు చాలా ఇష్టం.

 

వచ్చే వారం: బమ్మిడి జగదీశ్వరరావు  ‘ఆర్తి’ కధ పరిచయం

అప్రజ్ఞాతం కథ ఇక్కడ:

 

Download PDF

2 Comments

  • Narendra kumar says:

    దెబ్బ తినే క్రమం తెలిసినా మనలాటి మధ్య తరగతి జీవులం ఆ
    ఆవ్యవస్తలో భాగంగా వుంటానికె సిద్దమవుతున్నాము . ఆదే ఈ వ్యవస్తకి శ్రీ రామ రక్ష.

  • raghava says:

    బాగా రాశారు సర్..

Leave a Reply to Narendra kumar Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)