ప్రతి గజల్ ఒక ఆత్మ కథే!

jag1

గజల్ రారాజు జగ్జిత్ సింగ్ గురించి నేను ఎపుడూ ఒకటి అనుకుంటా.. “గంధర్వులు అప్పుడప్పుడు శాపగ్రస్థులయి భూమి పై జన్మిస్తారని” ఒక ప్రతీతి. అలాంటి వారే జగ్జిత్ అనిపిస్తుంటుంది. మన అదృష్ట వశాత్తు తన సంగీతం తో, గానం తో మనల్ని అలరించటానికే తను ఈ జన్మ తీస్కున్నరేమో..!

స్కూల్ లో ఉన్నప్పుడు మా నాన్న గారి వల్ల జగ్జిత్ గజల్స్ తో పరిచయం ఏర్పడింది. మొదట్లో పాటల్లోని సాహిత్యం అర్థం అవకున్నా, గానం లోని మాధుర్యం కట్టిపడేసేది. తరువాత తరువాత సాహిత్యాన్ని అర్థం చేసుకుంటూ వింటూంటే జగ్జిత్ కి, తన గజల్స్ కి బానిసని అయిపోయా.

దాదాపు 10 సంవత్సరాల క్రితం 2004 లో మెల్బోర్న్ (ఆస్ట్రేలియా) లో  జగ్జిత్ సింగ్ సంగీత కచేరి కి వెళ్ళే మహద్భాగ్యం కలిగింది. దాదాపు 3 గంటల పాటు సాగింది ఆ సంగీత కచేరి. ప్రేక్షకుల కోరిక మేరకు 2-3 పాటల్ని మళ్ళీ మళ్ళీ పాడారు. ఆ కచేరీ లో ఉన్నంతసేపు ఇది నిజమేనా? అనిపించింది. ఏదో తెలియని లోకాలకు ప్రయాణం చేసినట్టు గా అనిపించింది. ఆ ట్రాన్స్ లోంచి బయటకు రావడానికి చాల సమయం పట్టింది..!

జగ్జిత్ పాటల్లో “ఆత్మకథలు” ఉంటాయి. ఎలాంటి భేషజాలు లేని స్వచ్చమయిన ఆత్మ కథలు. అవి మన అందరి కథలు . అందుకే అవి మన ఆత్మ లోతుల్ని తడతాయి. గతం తాలుకా అనుభవాల్ని, అనుభూతుల్ని, మదిలోని గాయాల్ని మెల్లిగా తడుతుంది తన పాట..తన శ్రోతలకి తన పాటలనే “ఆత్మ బంధువుల్లా” పంపిస్తారు జగ్జిత్, అవి మనతో జీవితాంతం ప్రయాణిస్తాయి.

జగ్జిత్ తన స్వస్థలం లో పండిట్ చగన్ లాల్ శర్మ దగ్గర రెండు సంవత్సరాలు సంగీతం నేర్చుకున్నారు. తరువాత “సైనియా ఘరానా” కి చెందిన ఉస్తాద్ జమాల్ ఖాన్ వద్ద ఆరు సంవత్సరాలు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు.పంజాబ్ మరియు కురుక్షేత్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, లేట్ ప్రొఫెసర్ సూరజ్ భాన్ సంగీతంలో అతనిని ఎంతగానో ప్రోత్సహించాడు. 1965 లో ముంబై వచ్చినేపథ్య గాయకుడు గా మారాడు జగ్జిత్ . మొదట్లో పెళ్ళిళ్ళలో, వేడుకల్లో, ప్రకటనలకి  పాడుతూ తన సంగీత ప్రస్థానం మొదలు పెట్టాడు. ఇదే సమయం లో తన జీవిత భాగస్వామి చిత్ర ని కలిసాడు , ఆ తరువాత రెండు సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నారు.

1976 లో వచ్చిన ఆల్బం “ది అన్ ఫర్గేటబుల్స్” తో తన దశ తిరిగింది. అతి పెద్ద హిట్ ఆల్బం గా రికార్డులు సొంతం చేసుకుంది. ఆ ఆల్బం గజల్ సంగీతాన్ని సమూలంగా మార్చేసింది. అందులోని “బాత్  నిక్లేగి  తో  ఫిర్  దూర్  తలక్  జాయేగీ” తను పాడిన మొదటి పాట.

జగ్జిత్ సినిమాలలో పాడిన పాటలు తక్కువే కానీ, పాడిన పాటలన్నీ అధ్బుతాలే.

మహేష్ భట్ కి జగ్జిత్ తో తన సినిమా కి సంగీత దర్శకత్వం చేయించాలన్న  ఆలోచన రావటం దాన్ని అమలు పరచటం  “అర్థ్” సినిమా కోసం జరిగింది. “అర్థ్” సినిమా కి “ఆత్మ” కథ అయితే “అంతరాత్మ” జగ్జిత్ పాట. పాటలకి “ప్రాణ ప్రతిష్ట” చేసాడు జగ్జిత్. ఆ సినిమా లోని పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. “అర్థ్” సినిమా మహేష్ భట్ “ఆత్మకథ” (సెమి ఆటో బయోగ్రఫీ). (సినిమా కోసం కొన్ని సంఘటనలని మార్చటం జరిగింది). అంతలా తను ఇష్టపడి ప్రాణం పెట్టిన కథ కి జగ్జిత్ ని సంగీత దర్శకుడిగా, గాయకుడిగా నిర్ణయించుకోవటం తోనే మహేష్ భట్ సగం విజయం సాదించాడు . రాజ్ కిరణ్ (హీరో) పాడుతుంటే, ఆ పాటలోని “సాహిత్యాన్ని”, ఆ పాత్రలోని “మానసిక సంఘర్షణ” ని జగ్జిత్ ఎంతగా అనుభవించి పాడారో తెలుస్తుంది.

“తుమ్ ఇత్నా జో ముస్కురారహేహో క్యా గమ్ హై జిస్కో చుపా రహేహో “…”ఇంతలా ఎందుకు నవ్వుతున్నావు? ఏ విషాదాన్ని దాస్తున్నావు?” అంటాడు.

జగ్జిత్ గురించి మహేష్ భట్ అంటాడు ..”బొంబాయి మెట్రో సినిమా లో “అర్థ్” సినిమా రిలీజ్ ఆయినరోజు, “ఝుకీ ఝుకీ సీ నజర్” పాట మొదలయింది.పాట అయిపోగానే హాల్ మొత్తం “వన్స్ మోర్” అన్నారు. ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. ఒక సినిమా పాట ని హాల్ మొత్తం, ప్రేక్షకులంతా  ఏక కంఠం తో “వన్స్ మోర్ ” అనటం నా జీవితం లో ఎప్పుడూ చూడలేదు” .
కైఫీ ఆజ్మి సాహిత్యాన్నిజగ్జిత్  “ఉచ్చాస” లా లోపలి స్వీకరించి, తన “నిశ్వాస”లో సంగీతాన్ని ఇచ్చాడు అంటాడు మహేష్ భట్  “అర్థ్” సినిమా సంగీతం గురించి చెబుతూ..

కొందరికి జగ్జిత్ పాటల్లోని విషాదం , నకారత్మకం గా అనిపించవచ్చు. కాని అవి గాయపడిన మనసుకి సాంత్వన ని ఇచ్చే మందు గుళికలు.అలా అని అన్నీ విషాద గీతాలే పాడలేదు. చిత్ర తో కలిసి ఎన్నో ప్రణయ గీతాలూ పాడాడు. మరెన్నో హుషారు గా ఉండే గీతాలు, భక్తి గీతాలు, ఇలా  అన్ని రకాలయన పాటలూ పాడాడు.

ప్రతీ వ్యక్తి  తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించిన వేదనే జగ్జిత్ తన పాటలతో స్పృశిస్తాడు.

“చిట్టీ న కోయి సందేశ్ జానే వొహ్ కౌన్ సా దేశ్ జహాన్ తుమ్ చలేగయే…ఇస్ దిల్పే లగాకే టేస్ జానే వో కౌన్ సా దేశ్ జహాన్ తుమ్ చలేగయే”

ఈ పాట మరణించిన తన సోదరి కోసం కాజల్ ఏడుస్తున్న సందర్భం లో వస్తుంది. (“దుష్మన్” సినిమా నుండి). కాని ఈ పాట ని ఇంకో కోణం లో కూడా చూడొచ్చు. మనకి బాగా ఆత్మీయులయిన వ్యక్తులు- స్నేహితులో, బంధువులో, ప్రేమికులో, మన నుండి దూరమై తిరిగి మళ్ళీ కలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ పాటలోని “పల్లవి” ఆ వ్యక్తి పడే వేదనని ప్రతిబింబిస్తుంది.

“ఒక లేఖయినా,  ఒక సందేశం”  అయినా ఇవ్వకుండా నా హృదయాన్ని గాయపరిచి తెలియని దేశాలకి వెళ్ళిపోయావు ” అంటాడు.

జగ్జిత్ తో పని చేసిన పాటల రచయితలు అందరూ చాలా గొప్ప సాహిత్యాన్ని అందించారు . జగ్జిత్ వారి సాహిత్యాన్ని తన గానం తో చాలా ఉన్నత స్థాయి కి తీసుకెళ్ళాడు.

“గుల్జార్-జగ్జిత్” కాంబినేషన్ లో వచ్చిన “మరాసిం” ఆల్బం లో ప్రతీ పాట గజల్ ప్రపంచం లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎన్ని సార్లు విన్నా, వింటున్న ప్రతి సారి ఏదో కొత్త అర్థం స్పురిస్తుంది,కొత్త అనుభూతి విని(కని)పిస్తుంది.

“శామ్ సే ఆంఖ్ మే నమీ సీ హై ..ఆజ్ ఫిర్ ఆప్ కీ కామీ సీ హై..”

“సాయంకాలం నుండి కళ్ళలో చెమ్మగా ఉంది..ఈ రోజు మళ్ళీ నువ్వు లేని లోటు తెలుస్తూ ఉంది”

“మరాసిం” గురించి గుల్జార్ అంటాడు ” నాకు జగ్జిత్ తో అనుబంధం నా సీరియల్ “మిర్జాఘలిబ్” నాటిది. ఆ సీరియల్ కి జగ్జిత్ సంగీత దర్శకత్వం వహించాడు. ఆ సమయంలో ఛాలా సులువుగా, అలవోకగా ట్యూన్స్ అందించేవాడు. అది చూసి నేను ఆశ్చర్య పోయేవాడ్ని. “గజల్స్ ” కి ఒక ప్రత్యేకమయిన “ఆలాపనా” , “ఉర్దూ” సాహిత్యాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకునే ప్రతిభా అవసరం. ఆ రెండూ జగ్జిత్ లో పుష్కలంగా ఉన్నాయి. అదే సమయం లో “మరాసిం” ఆల్బం సాహిత్యాన్ని తనకి చూపించా. కొన్ని సులువుగా అనిపిస్తాయి కాని ఛాలా సమయం తీసుకుంటాయి. “మరాసిం” ఆల్బం ని పూర్తి చేయడానికి మాకు 6 సంవత్సరాలు పట్టింది”. పరిపూర్ణత కోసం వారు పడ్డ తాపత్రయం చెప్పకనే చెబుతుంది ఈ మాట.

“మీర్జాఘాలిబ్” సీరియల్ ద్వారా ఘాలిబ్ ని ప్రాచుర్యం లోకి తీసుకువచ్చినందుకు గానూ 1998 లో భారత ప్రభుత్వం “సాహిత్య అకాడెమి అవార్డు” ద్వారా జగ్జిత్ ని సత్కరించారు.

మాజీ ప్రధాని వాజ్ పాయి కవితలతో, జగ్జిత్ గానం తో వెలువడ్డ ఆల్బం “సంవేదన”. వాజ్ పాయి గారి కవితలకి జగ్జిత్ ప్రాణం పోసాడు. జీవితం లోని తాత్వికత ఆ పాటల్లో ఉంటుంది.

“క్యా ఖోయా క్యా పాయా జగ్ మే ..మిల్తే ఔర్ భిగడ్ తే పగ్ మే”

“జీవితం లో సాధించింది ఏంటి? కోల్పోయేది ఏంటి? కూడళ్ళలో కలుస్తూ విడిపోతుంటాము..ప్రతీ అడుగులో ద్రోహం ఉన్నా, నాకు ఎవరిపయినా ఫిర్యాదు లేదు.గడిచిపోయిన కాలం పైన దృష్టి సారిస్తే మాత్రం జ్ఞాపకాల భాండాగారం కదులుతుంది ”

జగ్జిత్ గానం “బోల్ ప్రధాన్” పద్దతిలో సాగుతుంది. దీని విశిష్టత ఏంటంటే “మాటలని” ఉచ్చరించే పద్ధతి పైన ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది.

“జగ్జిత్ కి ముందూ గజల్ గాయకులు, చాలా గొప్ప హేమా హేమీలు ఎంతోమంది ఉన్నారు. “బేగం అఖ్తర్, మేహది హసన్ ” లాంటి వారూ ఉన్నారు. కానీ వారి గజల్స్ సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేట్టు ఉండేవి కాదు. ఎందుకంటె అవి “శాస్త్రీయ సంగీత” ప్రధానంగా ఉంటాయి.  జగ్జిత్ గజల్స్ “సాహిత్యాన్ని , సంగీతాన్ని” ఎంతగా సరలీకరించారంటే అవి సినిమా పాటల్లా సామాన్య ప్రజానీకానికి చేరువయ్యాయి. జగ్జిత్ గజల్స్ కవితాత్మకంగా ఉంటూనే, సరళంగా మార్చబడి  శ్రోతలని రంజింపజేసాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా జగ్జిత్ కి అభిమానుల్ని సంపాదించి పెట్టింది.  హిందీ, ఉర్దూ మాట్లాడే ప్రజలు ఎక్కడున్నా జగ్జిత్ గజల్స్ కి వీరాభిమానులుగా మారిపోయారు”, అంటారు పాటల రచయిత “జావేద్ అఖ్తర్”

“వొహ్ కౌన్ హాయ్ దునియామె జిసే గమ్ నహి హోతా? ..కిస్ ఘర్ మే ఖుషీ హోతీ హై మాథం నహి హోతా?”

–“ప్రపంచం లో బాధలు లేనిది ఎవరికీ? ఎవరి ఇంట్లో కేవలం సంతోషాలు మాత్రమే ఉంటాయి? మరణం (ఎవరైనా మరణించినప్పుడు కలిగే శోకం) లేకుండా?”

మరణించిన తన  కొడుకు ని తిరిగి బ్రతికించాలని ఒక మహిళ “బుద్ధుడి” వద్దకు వెళుతుంది. అపుడు బుద్ధుడు బ్రతికిస్తాను కానీ, అంటూ ఒక షరతు విధిస్తాడు ” ఇంతవరకూ ఎవరూ మరణించని ఒక ఇంటి నుండి పిడికెడు “ఆవాలు” తీసుకురమ్మని చెపుతాడు.

పరుగు పరుగున ఆ గ్రామం లోని ప్రతి ఇంటికి తిరుగుతుంది ఆ మహిళ, సాయంకాలం వరకూ అలా తిరుగుతూనే ఉంటుంది. వెళ్ళిన ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు మరణించే ఉంటారు. చివరికి తనకి అర్థం అవుతుంది, మరణాన్ని ఎవరూ ఆపలేరు అని. ఆ సత్యాన్ని తెలుసుకోవటానికే బుద్ధుడు తనకి ఈ షరతు పెట్టాడని. చివరికి బుద్ధుడి వద్దకు వెళ్లి తనకి సత్యం అవగతమైంది అని కృతజ్ఞతతో, ఏడుస్తూ వెళ్ళిపోతుంది.

ఈ గజల్ లో సూక్ష్మంగా ఇదే విషయాన్ని చెప్పారనిపిస్తుంది. “జననం-మరణం” ఇవి రెండే జీవితం లో సత్యాలు, మిగతావన్నీ “మిథ్యే ” అంటారు దార్శనికులు. “సంతోషం-దుఃఖం” , “జననం-మరణం” ద్వందాలు కావు, అవి ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్వాలు.

సెప్టెంబర్ 23,2011  న ముంబాయి లో జగ్జిత్ , గులాం అలీ తో సంగీత కచేరి లో పాల్గోవాల్సిన సమయం లో తీవ్ర అస్వస్థత కి గురయ్యారు. “సెరిబ్రల్ హమోరేజ్ “అని తెలిసింది. రెండు వారాలు కోమాలో ఉన్న తరువాత , అక్టోబర్ 11 , 2011 న లీలావతి హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.

జగ్జిత్ విషయం లో “తుది శ్వాస” విడిచారు అనటం సరైంది కాదేమో..ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా తనని అభిమానించే కోట్లాది అభిమానుల గుండెల్లో నిండి , వారి “ఉచ్చ్వాస , నిశ్వాస” ల్లో సంగీతం ఉన్నంతకాలం అమరుడయి, చిరంజీవిలా ఉంటాడు.

జగ్జిత్ సింగ్ కి ఎన్నో పురస్కారాలు లభించాయి. అందులో ముఖ్యమైనవి –

-2012 లో రాజస్థాన్ ప్రభుత్వం “రాజస్థాన్ రత్న” అవార్డు తో సత్కారం (మరణించిన తదుపరి)

-2003 లో భారత ప్రభుత్వం “పద్మ భూషణ్” తో సత్కరించింది.

-1998 లో “మీర్జా గాలిబ్” కి సాహిత్య అకాడమీ అవార్డు (“గాలిబ్ గీతాల్ని” ప్రాచుర్యం లోనికి తీసుకు వచ్చినందుకు)

ఇలా ఎన్నో పురస్కారాలు…మరెన్నో రికార్డులు..!

-“అర్థ్&సాత్ సాత్” కాంబినేషన్ ఆల్బం HMV సంస్థ లో లార్జెస్ట్ సెల్లింగ్ ఆల్బం ఆఫ్ అల్ టైం గా రికార్డు ను సొంతం చేసుకుంది.

-“సజ్దా” ఆల్బం కూడా ఇలాంటి రికార్డు నే సొంతం చేసుకుంది. 1991 లో లతా  మంగేష్కర్ తో చేసిన ఈ ఆల్బం “నాన్-ఫిలిం” కాటగిరి లో  లార్జెస్ట్ సెల్లింగ్ ఆల్బం ఆఫ్ అల్ టైం గా రికార్డు  సాధించింది.

జగ్జిత్ ని తన కొడుకు మరణం బాగా కుంగదీసింది. “విషాదాన్నే” తన “సంతకంగా” మార్చి అభిమానుల హృదయాల్లో ఎన్నటికీ చెరగని ముద్ర వేసాడు. తన భార్య చిత్ర తో కలిసి పాడటం తన కొడుకు మరణం తోనే ఆగిపోయింది. తన ఊపిరి ఆగే వరకు తను ఎక్కువగా విషాదం తో నిండి, హృదయాన్ని ద్రవింపజేసే పాటలే పాడాడు.

జగ్జిత్ అభిమానులకి మాత్రం తను లేరన్న విషయం గుర్తొచ్చినప్పుడు, తన పాటే గుర్తొచ్చి కళ్ళు చెమరుస్తాయి, గుండె బరువెక్కుతుంది.. “శామ్ సే ఆంఖ్ మే నామీ సీ హై..ఆజ్ ఫిర్ ఆప్ కీ కామీ సీ హై” అని…

jsg2

 

Download PDF

3 Comments

  • kv ramana says:

    జగ్జీత్ పాటపై మీ ఆరాధనను, అనుభూతిని మేళవిస్తూ బాగా రాసారు శరత్ కుమార్. అభినందనలు.

  • VIJAYKUMAR KONDAPAKA says:

    వెల్ డాన్ శరత్… జగ్జిత్ సింగ్ గారు అంటే నాక్కూడా ఇష్టం… నిజంగా అయన లేని లోటు పూడ్చలేనిది…

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)