మూసలకు లొంగని కవి ఇస్మాయిల్

ismayil painting rainbow

ఎందుకో చెప్పలేను గానీ, నాకు కాలేజీ రోజులనుండీ “బెల్ కర్వ్ (నార్మల్ డిస్ట్రిబూషన్)” అంటే మహా ఇష్టం. బహుశా నా ఆలోచనలు అలా ఏకీకృతం(పోలరైజ్డ్) అయిపోవడం వల్లనో ఏమో గానీ, నాకు ఒక కవి కవిత్వం తీసుకున్నా, కొంతమంది కవులని తీసుకున్నా, వాళ్ళ కవిత్వంలో ఇదే ధోరణి కనిపిస్తుంటుంది. మనిషి జ్ఞానం పరిధి విస్తృతమవుతున్నకొద్దీ అతని ఆలోచనల సారం మన పూర్వీకులూ (దేశకాలపరిధులతో నిమిత్తం లేకుండా), ముందుతరాల మేధావులూ, అందించిన జీవనసారానికి సమీపంగా అతని ఆలోచనలు ప్రయాణిస్తాయని నా నమ్మకం. దీన్ని ఎప్పటికప్పుడు బేరీజువేసుకుంటూంటాను కూడా. అలాంటి నా ప్రగాఢమైన నమ్మకానికి మరింత దోహదం చేసిన కవుల్లో ఇస్మాయిల్ ఒకరు.

ఇస్మాయిల్ కవిత్వం గురించి చాలామంది చాలా విశదంగానే రాసేరు. అతనిది అనుభూతివాద కవిత్వం అని ఒక ముద్రకూడా ఉంది. నాకు ఈ ముద్రలపట్ల నమ్మకం లేదు. అందులోనూ సమకాలీన కవుల్నీ, కథకుల్నీ ఒక మూసలోకి నెట్టి ఊహించుకోవడం నాకు అంతగా నచ్చని విషయం (ఆ కవులూ, రచయితలూ వాళ్ళ దృక్పథాల మేనిఫెస్టోలు చెప్పుకున్నప్పటికీ). ఎందుకంటే, ఒక రచయిత తన ఆదర్శాల సరాసరికి రాయగా రాయగా చేరుకుంటాడు తప్ప రాసిందంతా దాన్నే ప్రతిఫలించదన్నది నా మరో నమ్మకం. వయసూ, అనుభవంతో పాటే, రాస్తూ రాస్తూ కవిగాని రచయితగాని తన ఆలోచనల, విశ్వాసాల సమాహారంనుండి నెమ్మది నెమ్మదిగా తన తార్కికచింతనని రూపుదిద్దుకుంటాడు. మొదటిరచనలోనూ, చివరిరచనలోనూ ఒక్కలాగే ఉంటే రచయితలో పరిణతి లేదని నాకు అనిపిస్తుంది. నిజానికి ఒక కవిని అతని సమకాలీనులకంటే, తర్వాతి తరాలే, నిష్పక్షపాతంగా బేరీజు వేస్తాయి. వాళ్ళకి ఏ రకమైన ప్రలోభాలూ, నిర్భందాలూ ఉండవుగనుక.

ఇస్మాయిల్ లో నాకు నచ్చిన అంశం అతను ఏ భావపరంపర మూసకూ లొంగకపోవడం. కవి అచ్చం గాజుపట్టకంలా ఉండాలి. ఎవరు ఎటునుంచిచూసినా ఏదో ఒక అందం, రంగు కనిపించగలగాలి. ఏకీకృతఆలోచనలుగల కవులకి అది సాధ్యపడదు.

ఒక తుఫాను భీభత్సాన్ని చెపుతూ “వర్షంలో ఊగే చెట్లు” కవితలో చెట్లని సముద్రం చేసి (సాగరంలా ఊగుతోంది… పారం కనిపించని తోట), సముద్రాన్ని చెట్టు (సాగరవృక్షాగ్రానికి చేరుకుంటాయట ఓడలు) చేస్తాడు. ఇందులో అందమైన పదబంధాలున్నాయి. అయితే, ఆ కవితలో నాకు వేరే అందమైన అంశాలు కనిపిస్తాయి. హుద్ హుద్ లాంటి భౌతికమైన తుఫానులు జీవితంలో ఎన్నో రావు. కానీ, ఇక్కడ చెప్పిన తుఫాను మన మౌలిక విశ్వాసాలని వేళ్ళతో సహా పెకలించివేసే సందర్భం. కొందరికయినా ఇలాంటి తుఫానులు జీవితంలో అనుభవం అయే ఉంటాయి. అటువంటి సందర్భం ఎదురైనపుడు, అది మన విశ్వాసాల మూలాల్ని ప్రశ్నిస్తుంది. శ్రీ శ్రీ చెప్పినట్టు అంతవరకూ కాళ్ళ క్రింద పదిలంగా ఉందనుకున్న మన విశ్వాసాల నేల, పగుళ్ళిచ్చి నమ్మకాల చెట్లు ఒక్కొక్కటే కూకటివేళ్లతో కూలుతున్నప్పుడు, మన వైయక్తికమైన భావపరంపరే, స్వయంగా తర్కించి ఏర్పరచుకున్న విశ్వాసపు విత్తనాలే చివరకి మిగులుతాయి. అవే ఇప్పుడు కురిసిన వర్షంలోంచి ప్రాణప్రదమైన తేమను తీసుకుని కొత్త ఆశలు, కొత్త మార్గనిర్దేశన చేస్తాయి. పక్షులు మళ్ళీ కొత్తపాటలు అందుకుంటాయి.

ఈ భావపరంపర పాతవాళ్లకంటే భిన్నం కాదు. చెప్పే తీరులోనే కవి ప్రత్యేకత. అక్కడే మానవ మేధస్సు సరాసరికి సమీపంగా ప్రయాణం చెయ్యడం. ఈ దృష్టితో ఒకసారి ఆ కవితని మళ్ళీ చదవండి.

వర్షంలో ఊగే చెట్లు

.

సాగరంలా ఊగుతోంది.

భోరున కురిసే వర్షంలో

పారం కనిపించని తోట

అహర్నిశీధులు క్షోభిస్తుందేం?

మహాసముద్రం చోద్యంగా ?

గుండెల్లో నిత్యం వానలు

కురుస్తో ఉంటాయి గావును.

అంత కల్లోలంలోనూ

ఎగిరిపడి కసిరేసే

వృక్షతరంగాల్నే

పక్షులాశ్రయిస్తాయేం?

తూర్పున నల్లటి ఉచ్చులు

తుఫాను పన్నుకుంటూ రాగా

చప్పున సాగరవృక్షాగ్రానికి

తప్పించుకుంటాయిట ఓడలు

మూలాల్ని ప్రశ్నించే గాలికి

కూలుతాయి మహావృక్షాలు,

ఊగుతాయి ఆ శూన్యంలో

ఊడిన వేళ్ళ ప్రశ్నార్థకాలు

చుట్టుకుపోయిన మహాసముద్రాల

అట్టడుగున మిగుల్తాయి

బలిసిన ప్రశ్నార్థకాలతో

కుల్కులలాడే మహానగరాలు.

భుజాలు పతనమైనా

బీజాలూ ద్విజాలూ ప్రసరిస్తాయి

కొత్తనీడల్ని పాతుతాయి

కొత్తపాటల్ని మొలకెత్తుతాయి

జలనిధికీ, ఝంఝ కీ

అలజడి పైకే కానీ

హృదయాలతి ప్రశాంతమట

– అదీ ఇస్మాయిల్ కవిత.
.

-నౌడూరి మూర్తి

murthy gaaru

Download PDF

3 Comments

Leave a Reply to ప్రసూన రవీంద్రన్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)