హోమర్ చెప్పిన ‘నరు’ని కథ

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)తమాషా ఏమిటంటే, బృహదశ్వుడనే ఆ ముని నలదమయంతుల కథంతా చెప్పి ధర్మరాజుకు అక్షహృదయాన్ని ఉపదేశిస్తాడు. అప్పటికే జూదమాడి రాజ్యం కోల్పోయి అడవుల పాలైన ధర్మరాజు ఇప్పుడా విద్యను ఏం చేసుకుంటాడు? పోనీ నలునిలా జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడా అంటే అదీ లేదు. యుద్ధంలో గెలుచుకున్నాడు.

అలాగే, నలదమయంతులది ఎంతో తెలివిగా, ఒడుపుగా అల్లిన కథ అనుకున్నామా…తీరా చూస్తే కథకుడు ఒకచోట కాస్త పరాకు పడ్డట్టున్నాడు. ఇంద్రాదుల మహిమతో అదృశ్యంగా ఉండి దమయంతి దగ్గరకు నేరుగా వెళ్ళిన నలుడు, ఆమె చెలికత్తెలకు ఎలా కనబడినట్టు?

సరే, విషయానికి వస్తే; నలదమయంతుల కథను నాలుగు పొరల్లో అన్వయించుకోడానికి అవకాశం ఉంది:

మొదటి పొర

ఇది మామూలుగా అందరికీ అర్థమైపోయే పొర. ఎటువంటి దేవతారోపాలూ లేని నలుడు-దమయంతి అనే సాధారణ మానవమాత్రుల జంట ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నలుడికి జూదమనే వ్యసనముంది. అతను జూదంలో రాజ్యంతోపాటు మొత్తం సంపదను అంతా కోల్పోయి భార్యతో సహా కట్టు బట్టలతో అడవుల పాలయ్యాడు. ఆ తర్వాత ఇద్దరికీ వియోగం సంభవించింది. ఇద్దరూ అష్టకష్టాలు పడ్డారు. చివరికి ఇద్దరూ మళ్ళీ ఒకటయ్యారు. తిరిగి అతనికి రాజ్యం లభించింది.

స్థూలంగా ఈ పొర మానవజీవితంలోనూ, సంసారంలోనూ ఎదురయ్యే ఒడిదుడుకుల గురించి, మానవసంకల్పానికి వ్యతిరేకంగా విధి ఆడే ఆట గురించి, కష్టాలను వెన్నంటే సుఖాలూ ఉండడం గురించి, పురుషప్రయత్నంతో కష్టాల నుంచి గట్టెక్కడం గురించి చెబుతుంది.

ఇది పూర్తిగా ఇద్దరు మానవమాత్రుల గురించి చెబుతున్న కథ అన్నది, ఈ పొరలో మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన వివరం.

రెండవ పొర

అదనంగా ఈ పొరలో ప్రధానంగా రెండు విషయాలలో కథకుడు అడుగుపెడుతున్నాడు. ఈ కథాచిత్రణ వెనుక తన ఉద్దేశాన్ని లేదా తన దృక్కోణాన్ని వెల్లడిస్తున్నాడు. మొదటిది, యాగాలు మొదలైన పుణ్యకార్యాలు చేయడం, శౌచం ఎంత ముఖ్యమో చెప్పడం. నలుని ఆవహించడం కలికి మొదట్లో సాధ్యం కాలేదు. ఎందుకంటే, అతడు పుణ్యకార్యాలు చాలా చేశాడు కనుక. కానీ, ఒకరోజు అతను మూత్రవిసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదు కనుక వెంటనే కలి ఆవహించాడు. అంటే శౌచం ఎంత ప్రధానమో కథకుడు చెబుతున్నాడు. అయితే, అదే కలి నలుని పాచికలలోకి తన బంటును అవలీలగా ప్రవేశపెట్టగలిగాడు. కారణం, జూదం అనేది ఎలాగూ చెడ్డ వ్యసనమే కనుక.

untitled

ఇక రెండవది, కష్టమైనా, సుఖమైనా; భర్త తప్పు చేసినా, ఒప్పుచేసినా అతనిని వెన్నంటి ఉండడమే భార్య ధర్మమనీ, ఆమే పతివ్రత అనీ దమయంతి పాత్ర ద్వారా చెప్పడం మీద కథకునికి ఆసక్తి. దమయంతి పతివ్రత కనుకనే తనను కామించిన కిరాతకుని శపించి చంపగలిగింది. అయితే, పునస్స్వయంవరానికి సిద్ధపడడంతో ఆమె పతివ్రతాగుణంపై నలునికి సందేహం కలిగింది. కేవలం అతనిని తన దగ్గరికి రప్పించే ఉద్దేశంతో ఒక్క ఋతుపర్ణునికి మాత్రమే పునస్స్వయంవరం గురించి వర్తమానం పంపించానని ఆమె చెప్పడంతో అతని సందేహం తీరిపోయింది.

అదే సమయంలో, భర్త ఏ కారణం చేతనైనా భార్యకు చాలాకాలంపాటు దూరంగా ఉన్నప్పుడు ఆమె పునర్వివాహం చేసుకోవచ్చునన్న ఒకనాటి సామాజికనీతినీ ఈ పునస్స్వయంవరం ప్రస్తావన వెల్లడిస్తూ ఉండచ్చు.

మూడవ పొర

ప్రకృతి లేదా స్త్రీ క్రియాశీల, పురుషుడు ఉదాసీనుడన్న సూత్రాన్ని ఈ పొరలో అన్వయించడానికి అవకాశం ఉంది. ఈ కథ నలుని ముఖంగానే చెప్పినట్టు, నలుని పాత్రే ఎక్కువ కొట్టొచ్చేలా ఉన్నట్టు పైకి అనిపిస్తుంది. కథకుడు పురుషప్రాధాన్యవాది అన్న విషయాన్ని ఇతర అంశాలు కూడా ద్రువీకరిస్తూనే ఉన్నాయి. కానీ కొంచెం నిశితంగా చూడండి…తమ ఇద్దరి సంబంధం విషయంలో దమయంతే ఎక్కువ చొరవ తీసుకున్నట్టు, నలుని తన వద్దకు రప్పించుకోవడంలో ఆమే ఎక్కువ క్రియాశీలంగా వ్యవహరించినట్టు స్పష్టమవుతుంది.

దమయంతి మీద నలుడు మనసు పడినా తొలి చొరవ దమయంతిదే. ఆమె నలుని కోసం తపిస్తూ శుష్కించడం తెలిసి తండ్రి నలుని రప్పించడానికే ఆమెకు స్వయంవరం ప్రకటించాడు. నలుడు స్వయంవరానికి బయలుదేరడమైతే బయలుదేరాడు కానీ, ఇంద్రాదులు ఎదురై తమ తరపున దూతగా వెళ్ళి తమలో ఒకరిని పెళ్లాడమని దమయంతికి చెప్పవలసిందిగా కోరినప్పుడు అతను వారి కోరిక తీర్చడానికి దమయంతిని వదలుకోడానికి సిద్ధపడ్డాడు. ఆడిన మాట తప్పవని తెలిసే నిన్ను ఈ కోరిక కోరామని ఇంద్రుడు అనేసరికి తన ప్రతిష్టను కాపాడుకోడానికి దమయంతినే త్యాగం చేయడానికి మొగ్గుచూపాడు. దమయంతిని కలసి ఇంద్రాదుల కోరిక చెప్పి, దేవతల ఆగ్రహం నుంచి తనను రక్షించమని నలుడు కోరడంలో దమయంతిపై వలపుమీద స్వార్థానిదే పై చేయి అయింది.

దమయంతి స్పందన వేరు. ఆమె ఎలాగైనా నలుని పెళ్లాడడానికే నిశ్చయించుకుంది. నలుని ప్రతిపాదనకు మొదట్లో దుఃఖంలో కూరుకుపోయినా వెంటనే తేరుకుని ఈ సమస్య నుంచి గట్టెక్కడం ఎలాగా అని ఆలోచించింది. నలుడు ఆ ప్రయత్నమే చేయలేదు. ‘ఇంద్రాదుల సమక్షంలోనే నిన్ను వరిస్తాను, అప్పుడు నీకు ఆడి తప్పిన దోషం రా’దని ఉపాయం చెప్పింది. నలుడు చేసిందల్లా ఆమె మాటను ఇంద్రాదులకు చేరవేయడమే.

తీరా ఇంద్రాదులు నలుగురూ ఆమె ఎత్తుకు పై ఎత్తు వేసి నలుని రూపంలో ప్రత్యక్షమయ్యేసరికి వారిని ప్రార్థించి ప్రసన్నం చేసుకుని, అసలు నలుని గుర్తించి అతని మెడలో దమయంతి దండ వేసింది. ఈవిధంగా నలుని పెళ్లాడడంలో క్రియాశీల పాత్ర దమయంతిదే కాని నలుడిది కాదు.

ఆ తర్వాత నలుడు జూదంలో సమస్తాన్నీ కోల్పోయి అడవి పాలైనప్పుడు కూడా దమయంతి అతనితోనే ఉంది. అందుకు భిన్నంగా ఆమె నిద్రపోతున్నప్పుడు ఆమెను విడిచేసి వెళ్ళినది నలుడే. అంటే, ఇక్కడ కూడా నలుడు తన మనోభావాలకే ప్రాముఖ్యం ఇవ్వడం ద్వారా స్వార్థాన్నే చాటుకున్నాడన్నమాట.

పుట్టింటికి చేరుకున్న దమయంతి నలుని తన వద్దకు రప్పించుకోవడంలోనూ అడుగడుగునా క్రియాశీలంగా వ్యవహరించింది. తల్లితో తండ్రికి చెప్పించి నలుని వెతకడానికి బ్రాహ్మణులను పంపించే ఏర్పాటు చేసింది. నలుడు అజ్ఞాతంగా ఉంటాడన్న సంగతిని ఆమె ఉహించడమే కాదు; భార్యను వదిలేసి వెళ్ళడం న్యాయమా అని వెళ్ళిన ప్రతిచోటా సభలలో ప్రశ్నించమనీ, దానికి ఎవరు సమాధానం చెబుతారో అతడే నలుడు కావచ్చుననీ బ్రాహ్మణులకు చెప్పి పంపించింది. ఋతుపర్ణుని దగ్గర పనివాడుగా ఉన్న బాహుకుడనే వ్యక్తి తనకు సమాధానం చెప్పాడని తెలపగానే, తనకు ‘రెండు మూడు రోజుల్లో’ పునస్స్వయంవరం జరపబోతున్నట్టు ఋతుపర్ణుడు ఒక్కడికే కబురు అందేలా చూసింది. ‘రెండు మూడు రోజుల్లో’ అని అనిపించడం కూడా నలుని రప్పించే వ్యూహంలో భాగమే. నలుని కంటె వేగంగా రథం తోలగలిగినవారు ఇంకొకరు లేరని ఆమెకు తెలుసు. అంత తక్కువ వ్యవధిలో జరగబోయే పునస్స్వయంవరానికి అయోధ్యనుంచి వందల మైళ్ళ దూరంలో ఉన్న విదర్భకు ఋతుపర్ణుని ఎవరైనా తీసుకురాగలిగితే, అది నలుని గుర్తించడానికి ఒక ముఖ్యమైన ఆధారం అవుతుందని ఆ కబురు పంపేటప్పుడే దమయంతి అనుకుందన్నమాట. ఈవిధంగా దమయంతి క్రియాశీలగానే కాక ఎంతో ఉపాయశాలిగానూ వ్యవహరిస్తుంది. ఇక బాహుకుడే నలుడన్న సంగతిని నిర్ధారణ చేసుకోడానికి అతనితో దమయంతి ఆడిన మైండ్ గేమ్, అందులో విజయం సాధించడం ఆమె బుద్ధికుశలతకు పరాకాష్ట.

నాలుగవ పొర

ఇది సంక్లిష్టమే కాక, కొంత వివరంగా చెప్పుకోవలసిన పొర. ఇందులో కొన్ని తాత్విక అంశాలు చర్చలోకి వస్తాయి. అవి ఎలాంటివో తెలుసుకోవాలంటే, ఒక గ్రీకు ఇతిహాస కథతో నలదమయంతుల కథకు ఉన్న పోలికల గురించి మొదట చెప్పుకోవాలి. ఆ ఇతిహాసం, హోమర్ (క్రీ. పూ. 85౦) చెప్పిన ‘ఒడిస్సే’(Odissey). హోమర్ ఇలియడ్(Iliad) అనే మరో ప్రసిద్ధ ఇతిహాసాన్ని కూడా చెప్పాడు. అది ట్రాయ్ యుద్ధం గురించి. ఆ యుద్ధంలో పాల్గొన్న ఓడిసస్(Odisseus) అనే యోధుడి కథ ‘ఒడిస్సే’. ఈ రెండూ ప్రతిపాదించే తాత్వికతలలో మౌలికమైన తేడా ఉంది. ముందుగా, జోసెఫ్ క్యాంప్ బెల్ తన Occidental Mythology లో చర్చించిన ఒడిస్సే కథను వీలైనంత క్లుప్తంగా చెప్పుకుందాం.

ఓడిసస్ ఇథకా అనే ప్రాంతానికి చెందినవాడు. అతని భార్య పేరు పెనెలోప్. ఓడిసస్ ట్రాయ్ యుద్ధంలో పాల్గొంటాడు. ఆ యుద్ధం పదేళ్ళపాటు జరుగుతుంది. ఆ పదేళ్లూ అతను భార్యకు దూరమవుతాడు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత అతను సహచరులను వెంటబెట్టుకుని పన్నెండు ఓడలలో సాహసయాత్ర ప్రారంభిస్తాడు. ముందుగా థ్రేసియన్లకు చెందిన ఇస్మారస్ అనే పట్టణంపై దాడి చేసి, జనాన్ని చంపేసి అక్కడి సంపదను, స్త్రీలను పంచుకుంటారు. అక్కడినుంచి తిరిగి యాత్ర ప్రారంభించిన తర్వాత జియస్ అనే దేవుడు పెద్ద తుపాను సృష్టిస్తాడు. ఓడ తెరచాపలు చిరిగి చీలికలు పీలికలైపోతాయి. అందరూ పూర్తిగా అదుపు తప్పి తొమ్మిదిరోజుల పాటు కెరటాలు ఎటు నెడితే అటు కొట్టుకుపోతారు. చివరికి తుపాను వారిని తెలిసిన ప్రపంచపు సరిహద్దులను దాటించి అజ్ఞాత ప్రపంచంలోకి తీసుకు వెడుతుంది.

పదో రోజున తామర పువ్వులు తినే(Lotus Eaters) జనం ఉండే భూమికి చేరుకుంటారు. ఓడిసస్ అనుచరులు తామర పువ్వులను తినగానే తామెవరో మరచిపోయి అక్కడినుంచి రావడానికి నిరాకరిస్తారు. ఓడిసస్ వాళ్ళను బలవంతంగా ఓడల్లోకి లాక్కువెళ్ళి, కట్టిపడేసి తిరిగి ప్రయాణం ప్రారంభిస్తాడు.

ఇప్పుడు అడుగడుగునా కష్టాలు, పరీక్షలు ఎదురయ్యే ఒక మార్మిక ప్రపంచంలోకి ఓడిసస్, అతని ఓడలు అడుగుపెట్టాయి. మొదట వారు ఒంటి కన్ను రాక్షసులు ఉండే భూమికి చేరుకుంటారు. వాళ్ళలో ఫోలిఫెమెస్ అనేవాడు మరింత భీకరంగా ఉంటాడు. అతను పోసిడన్ అనే దేవుడి కొడుకు. పోసిడస్ సముద్రంలో పెద్ద పెద్ద అలలకు ప్రభువు. మన వరుణదేవుడి లాంటివాడు. తన పొట్టేళ్ళ మందతో కలసి పోలిఫెమెస్ ఒక గుహలో నివసిస్తూ ఉంటాడు. ఓడిసస్ తన సహచరులలోంచి మెరికల్లాంటి వాళ్ళను పన్నెండుమందిని వెంటబెట్టుకుని ఆ గుహలోకి ప్రవేశిస్తాడు. లోపల పుష్కలంగా వెన్న, మీగడ, ;పాలు; గొర్రెల మందలు ఉంటాయి. కాసేపటికి ఒంటికన్ను రాక్షసుడు వస్తాడు. అతణ్ణి చూడగానే భయపడి అంతా దాక్కుంటారు. రాక్షసుడు వాళ్ళను కనిపెట్టి అతిపెద్ద బండరాయితో గుహను మూసేసి వాళ్ళలో ఆరుగురిని తినేస్తాడు. ఓడిసస్ వాడికొన ఉన్న ఒక గుంజను సిద్ధం చేసుకుంటాడు. తర్వాత రాక్షసుడి దగ్గరికి వెళ్లి, తన పేరు నోమన్ అని చెప్పి అతనికి ద్రాక్షసారా ఉన్న ఒక పెద్ద తోలుతిత్తిని ఇస్తాడు. రాక్షసుడు ఆ సారా తాగేసి నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు ఓడిసస్ గుంజతో అతని కన్ను పొడిచేస్తాడు. రాక్షసుడు పెడబొబ్బలు పెడుతూ చేతులతో తడుముకుంటూ వెళ్లి గుహను మూసిన బండరాయిని తొలగించి ప్రవేశమార్గంలో తను కూర్చుంటాడు. ఓడిసస్, మిగిలిన ఆరుగురు భారీ పొట్టేళ్ల కడుపుకు వేల్లాడుతూ బయటపడతారు.

అక్కడినుంచి ఓడలలో బయలుదేరి అయోలస్ అనే వాయుదేవుడి దీవికి చేరుకుంటారు. ఆ దీవిలో అయోలస్ ఆరుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్ళతో నివసిస్తూ ఉంటాడు. కొడుకులకు కూతుళ్ళనే ఇచ్చి పెళ్లి చేస్తాడు. అతను ఓడిసస్ కు తొమ్మిదేళ్ళ వయసున్న ఒక ఎద్దు చర్మంతో చేసిన సంచీలో ప్రయాణానికి తోడ్పడే రకాల వాయువులనుల కట్టి ఇస్తాడు. ఆ తర్వాత బలమైన పడమటి గాలి వీచి ఓడలను వేగంగా ముందుకు తీసుకు వెళ్ళేలా చేశాడు. పదో రోజుకు స్వస్థలానికి దగ్గర అవుతుండగా, ఓడిసస్ నిద్రపోతుండడం చూసి అతని సహచరులు ,అయోలస్ ఇచ్చిన తోలుసంచిలో ఏవో నిధి నిక్షేపాలు ఉంటాయనుకుని దానిని తెరుస్తారు. అంతే, ఒక ప్రచండ వాయువు వీచి ఓడలను అయోలస్ దీవికే తిరిగి తీసుకొస్తుంది. ఈసారి వారికి ఆతిథ్యమివ్వడానికి, సహకరించడానికి అయోలస్ తిరస్కరిస్తాడు.

భగ్నహృదయాలతో అందరూ తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. ఈసారి ఏ వాయువూ వారికి సహకరించదు. ఏడో రోజున నరమాంస భక్షకులు ఉండే ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ నీళ్ళు పట్టుకుంటున్న ఒక అందమైన యువతిని చూసి సమ్మోహితులైపోతారు. ఆమె ఆ దేశపు రాజుగారి కూతురు. వారిని తన ఇంటికి తీసుకెడుతుంది. ఆమె తల్లిదండ్రులు ఒక పర్వతం ఆకారంలో భయంకరంగా ఉంటారు. తండ్రి ఓడిసస్ బృందంలో ఒకడిని పట్టుకుని తినబోతుంటే అందరూ భయపడి ఒడ్డుకు పరుగెడతారు. తండ్రి సింహనాదం చేయగానే అన్ని వైపుల నుంచీ లెక్కలేనంత మంది నరమాంస భక్షకులు వచ్చి వీరి మీద పడతారు. ఎంతో మందిని చంపేస్తారు. ఒక్క ఓడిసస్ ఓడను తప్ప మిగిలిన ఓడలను ధ్వంసం చేసేస్తారు.

Circe_by_cemac

గ్రీకు అప్సరస సిర్సే

 

 

ఓడిసస్ మిగిలిన సహచరులతో కలసి తిరిగి యాత్ర్ర ప్రారంభిస్తాడు. సిర్సే అనే అప్సరస ఉండే దీవికి చేరుకుంటాడు. సిర్సే సూర్యుని వల్ల సముద్రానికి కలిగిన కూతురు. మానవాళికి వెలుగునిచ్చేది ఆమే. ఓడిసస్ పంపించిన మనుషులు అడవిలోకి వెళ్లి నునుపు రాళ్ళతో కట్టిన సిర్సే భవంతిని సమీపిస్తారు. ఆ భవంతికి అన్ని వైపులా తోడేళ్లు, సింహాలు తిరుగుతూ కనిపించాయి. సిర్సే వాటికి ఏదో మందు పెట్టడంతో అవి పూర్తిగా సాధుజంతువులుగా మారిపోయాయి. ఓడిసస్ సహచరులను చూసి అవి పెంపుడు కుక్కలలా తోక ఊపాయి. వారికి లోపలినుంచి తియ్యని గొంతుతో సిర్సే పాడుతున్న పాట వినిపించింది. వారు ఆమెను పిలిచారు. ఆమె బయటికి వచ్చి వాళ్లందరినీ లోపలికి ఆహ్వానించింది. వారంతా మంత్రించినట్టుగా లోపలికి వెళ్లారు. యురిలోకస్ అనే అతనికి మాత్రం ఇందులో ఏదో కుట్ర ఉందన్న అనుమానం కలిగి బయటే ఉండిపోయాడు. సిర్సే ఎత్తైన ఆసనాల మీద అందరినీ కూర్చోబెట్టి మందు కలిపిన ఆహారమూ, మద్యమూ ఇచ్చింది. దాంతో వారు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. సిర్సే వారిని మంత్రదండంతో తాకి పందులుగా మార్చేసి వారి ముందు పందులు తినే ఆహారం వేసింది.

ఇది చూసి భయపడిన యురిలోకస్ వెళ్ళి ఈ సంగతి ఓడిసస్ కు చెప్పాడు. ఓడిసస్ ఒక పెద్ద కంచు ఖడ్గాన్నీ, విల్లమ్ములను తీసుకుని సిర్సే భవంతికి బయలుదేరాడు. హెర్మెస్ అనే దేవుడు ఒక యువకుని రూపంలో, స్వర్ణదండం పట్టుకుని అతనికి ఎదురయ్యాడు. సిర్సే మాంత్రికతనుంచి అతన్ని కాపాడే ఒక దివ్యమైన మూలికను ఇచ్చాడు.

“సిర్సే నిన్ను మంత్రదండంతో తాకడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే ఆమె మీదికి కత్తి దూయి. అప్పుడామె వెనక్కి తగ్గి తనతో పడక సుఖాన్ని అనుభవించమని కోరుతుంది. అందుకు సందేహించకు. తన అందచందాలతో ఆమె నిన్ను అలరించి సుఖపెడుతుంది. అయితే నీపట్ల ఎలాంటి మోసానికీ పాల్పడనని ముందే దేవుడి సాక్షిగా ఆమె చేత ప్రమాణం చేయించు. ముఖ్యంగా ఆమె నిన్ను పూర్తి నగ్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకు ససేమిరా ఒప్పుకోకు” అన్నాడు.

ఓడిసస్ అతను చెప్పినట్టే చేశాడు. సిర్సే అతనికి లొంగిపోయింది. తను పందులుగా మార్చిన ఓడిసస్ సహచరులను తిరిగి మనుషులుగా మార్చేసింది. వారు వెనకటి కంటే యవ్వనవంతులుగా, అందగాళ్ళుగా మారిపోయారు. ఓడిసస్ సిర్సే పొందులోనే ఎనిమిదేళ్లు గడిపేశాడు. ఆ తర్వాత సిర్సే,

“నువ్విప్పుడు ఇంకో యాత్ర చేయాలి. అధోలోకానికి( అంటే మన పాతాళం అన్నమాట)వెళ్ళాలి. అక్కడ హేడ్స్, భయం గొలిపే పెరెస్ఫోన్ ఉంటారు. భవిష్యత్తును చెప్పే తేబన్ టిరేసియస్ కూడా ఉంటాడు. అతన్ని ప్రసన్నం చేసుకోవాలి. నీకు మేలు జరుగుతుంది.” అని చెప్పి అతనికి మార్గదర్శనం చేసింది.

ఓడిసస్ తిరిగి ఓడలో బయలుదేరి ప్రపంచం అంచులకు పయనించాడు. సిమ్మేరియన్లు ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశం పొగమంచుతోనూ, మేఘాలతోనూ కప్పబడి ఉంది. అక్కడ నిరంతరం రాత్రే కానీ పగలు లేదు. ఓడిసస్ అక్కడ ఒక కందకంలో– అంటే ఊర్ధ్వమార్గంలో కాకుండా– అధోమార్గంలో పితృదేవతలకు తర్పణం విడిచాడు. అన్నివైపుల నుంచి ప్రేతాత్మలు వచ్చి ఆశ్చర్యంతో కేకలు పెట్టాయి. అక్కడ ఓడిసస్ తన తల్లిని, టెరేసియస్ ను, ఫియడ్రాను, అగమెమ్నాన్ ను, యాచిలెస్ ను, క్రీటు రాజు మినోస్ ను, ఇంకా ఎందరో పితృదేవతలను, దండం పుచ్చుకుని మృతులకు శిక్షలు విధించే జియస్ కొడుకును (మన యముడన్న మాట) దర్శించాడు. అయితే, పెరెస్ఫోన్ వల్ల తనకు హాని జరుగుతుందేమోనని భయపడి తిరిగి సిర్సే దగ్గరికి వచ్చాడు. ఆమె నుంచి అంతిమ ఆదేశాలు పొంది తిరిగి యాత్ర ప్రారంభించాడు.

మిగతా కథ, విశేషాలు తర్వాత….

-కల్లూరి భాస్కరం

 

 

 

Download PDF

3 Comments

  • కల్లూరి భాస్కరం says:

    “ఓడిసస్ సిర్సే పొందులోనే ఎనిమిదేళ్లు గడిపేశాడు”.

    ఇక్కడ పొరపాటు దొర్లింది. ఓడిసస్ ఎనిమిదేళ్లు గడిపింది సిర్సేతో కాదు. ముందు రాబోయే కలిప్సో అనే మరో అప్సరసతో! పాఠకులు గమనించగలరు.

  • Dileep says:

    Waiting for Next part.

    • కల్లూరి భాస్కరం says:

      సారీ. ఆలస్యమైంది. రేపు పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)