మాయపొరల్ని ఎప్పటికప్పుడు ఒలుచుకోవాలి!

Kavita 2012 

(మేడే నాడు విజయవాడలో విడుదలయిన ‘కవితా2012’కి ప్రముఖ విమర్శకులు పాపినేని శివశంకర్ రాసిన ముందు మాట)

Every child is an artist, the problem is staying
an artist when you grow up.                                                        Pablo Picasso

 

‘కళ్లుంటే ఉంటే చూసి, వాక్కుంటే వ్రాసీ’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఎవరూ చూడలేనివి చూడగలగటం, ఎవరూ రాయలేనివి రాయగలగటం మనిషిలో సృజనాత్మకతకి సంబంధించినవి. శ్రీజ అనే పాఠశాల చదువరి దేన్ని చూసి, ఏమి వ్రాసిందో చూడండి.

‘అమ్మ తుడుపుతుంది చెడును
పొరపాట్లను తుడుపుతుంది రబ్బరు
నల్లబూడిదను తుడిపి
తెల్లకాంతిని వెలిగిస్తుంది రబ్బరు
రబ్బరు, రబ్బరు, తెల్లని రబ్బరు’

పెద్ద పెద్ద విషయాల మీద గంభీరమైన కవిత్వం వ్రాయటం ఒక రకంగా తేలిక. చిన్న చిన్న సంగతుల మీద రాయటం చాలా కష్టం. ఒకానొక అవధానంలో కలం పాళీ మీద సీసపద్యం చెప్పమన్నప్పుడు తిరుపతి వేంకటకవులంతటి ఆశుకవులే కాస్త ఆలోచించాల్సి వచ్చింది. ఈ చిన్నారి తెల్ల కాగితాన్ని జీవితంతో, దానిమీద తప్పుల నల్లదనాన్ని బ్రతుకులోని చెడుతో అన్వయించింది. ‘మనం చేసే చెడును తుడపడానికి రబ్బరు ఉందా?’ అని ప్రశ్నించుకొని ‘మనం చేసే మంచి పనులే చెడును తుడపడానికి ఉపయోగపడే రబ్బరు’ అని లోతైన చూపుతో ముగించింది. నిసర్గమైన సృజనాత్మకత అది.
ఈ సృజనాత్మకతకి పునాది ఏది? చిరుగాలికి సైతం చిగురుటాకు చలిస్తుంది. కొలను అలలు కూడ మనసులో మల్లెల మాలలూపుతాయి.అదే సహజస్పందన. ప్రకృతి తనలోని చరాచర రూపాల ద్వారా అశేషమైన నమూనాల నిచ్చింది. వాటికి రంగు రూపు, కొలత ఉంటాయి.  కవి  గాని కళాకారుడు గాని ఆ మూలసంపదనుంచే తన మూలకాలు గ్రహిస్తాడు. వాటిని దృశ్యాలుగా, ప్రతీకలుగా, సంకేతాలుగా మలుచుకొంటాడు. అందుకెంతో ఊహాశక్తి ఉండాలి. ఊహే సృజనకి ప్రారంభం అన్నాడు బెర్నార్డ్‌ షా. ఊహని కళగా మలచగలిగే కల్పనాశక్తి కావాలి.  దానికి చక్కని రూపం ఇవ్వటానికి చిక్కని భాష, భావపద చిత్రాలు ఎట్లాగూ అవసరమే.
స్పందనాశీలం ఉన్నప్పుడు రెక్క చిరిగిన సీతాకోక చిలక రాతిమీద  పడినప్పటి ‘నిశ్శబ్ద విషాదధ్వని’ వినగలడు కవి. తనలోని ‘చెట్టు చిగిరింత’ గమనించగలడు. ‘కొండగోగుల రేలపాట’కు చెవియొగ్గగలడు. రామప్ప ‘ఉలి కళ’లోని కళకళ దర్శించగలడు. ఆకలిగొన్న పావురాళ్లకి నాలుగుగింజలు వేస్తున్న పాపలో ఆ స్పందనాశీలమే కదా కదలాడుతున్నది? అదే కదా మగవాళ్ల ‘మృగ ` తృష్ణ’ని ప్రశ్నిస్తున్నది?
సృజనశీలికి ‘కల్లోల కడలిలో అలల కవాతు’ కనపడుతుంది. ‘ఎండ కూడా పండువెన్నెలే’ అవుతుంది. పాట ‘ప్రాణప్రవాహ’మవుతుంది. ‘విరబూసే కలలకు అలసట’ లేదని ఒక ప్రాకృతిక భావుకురాలు భావిస్తే, ‘విత్తనాలవుతున్న మనుషుల్ని, మనుషులవుతున్న విత్తనాల్ని’ ఒక విప్లవ సృజనకారుడు గుర్తిస్తాడు. కలం యోధుడిలో ‘ఉద్యమ నెలరేడు’ను కనుగొంటాడు. ఆ స్పందనకి, సృజనకి ఈ సంకలనం ఒక అద్దం.

ఈ తరళత్వాన్ని, సృజన తత్వాన్ని మొద్దుబార్చే పరిస్థితుల మధ్య ఇవాళ కవి నిలబడి ఉన్నాడు. పికాసో అన్నట్టు శ్రీజ బాల్యంలోని సృజనాత్మకత నిండు జవ్వనంలోను మిగిలిఉంటుందా అన్నదే సమస్య. యాంత్రికమైన చదువులు, ఆందోళన నిండిన ఉద్యోగాలు, ఆర్థికదాహాలు, వ్యక్తులు హోదాలుగా మారిపోవటాలు, అధికార దర్పాలు, అమానవీయతని అలవాటు చేస్తున్న మొరటు దృశ్యమాధ్యమాలు మొదలైనవెన్నో మనిషిలోని సున్నితమైన స్పందనాతంత్రుల్ని తెంచివేస్తున్నాయి. సృజనపుష్పాన్ని చిదిమేస్తున్నాయి. ఆ మాయపొరల్ని ఎప్పటికప్పుడు ఒలుచుకోవాలి. వంచనావిద్యని అవిద్య చెయ్యాలి. కలలతో, కళలతో జీవితమృదుత్వం కాపాడుకోవాలి.

గుంటూరు 25 ఏప్రిల్‌ 2012

తొమ్మిదేళ్ళ అనుబంధం : సాహితీ మిత్రులు

మనిషిని పరిపూర్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే అనివార్యంగా మనం కవిత్వాన్ని ఆశ్రయించవలసి వుంటుంది.

మనిషిలోని మానుషత్వం కవిత్వంలో ప్రకటితమవుతుంది. కవిత్వం ద్వారా పరిపుష్టమవుతుంది. యుగయుగాలు, దేశదేశాల మనుషుల సుఖదుఃఖాలు, జయాపజయాలు, ఆరాట పోరాటాలు, అంతస్సంఘర్షణలు, ఉత్థానపతనాలను కవిత్వం కళ్ళకు కట్టినట్టు చిత్రిస్తుంది. నిజానికి మనిషిలోని మానుషత్వపు చరిత్రే కవిత్వ చరిత్ర. మానవ జీవన సారాన్నీ, రూపాన్నీ వివిధ స్థాయిల్లో అత్యంత శక్తివంతంగా అభివ్యక్తం చేయగలిగింది ఒక్క కవిత్వం మాత్రమేనని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

ఏ దేశానికి చెందిన వాడయినా, ఏ కాలానికి చెందిన వాడయినా మానవ సంవేదనని మనం కేవలం కవిత్వం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. ప్రపంచంలోని ఏ జాతి జనుల హృదయనాళ స్పందననయినా ఆ జాతి సృష్టించిన కవిత్వంలో మాత్రమే మనం స్పష్టంగా గుర్తించగలం. కవిత్వంతో మనం అనుబంధాన్ని కొనసాగించటమంటే మొత్తంగా మనం మానవత్వంతో అనుబంధాన్ని పెంచుకోవడమే.

మిగిలిన అన్ని సాహితీ రూపాలకన్నా కవిత్వం అత్యంత ప్రాచీనం. ఇది అందరూ ఆమోదిస్తున్న ఒక వాస్తవం. అయితే ఒక్క కథని మాత్రమే కుడీ ఎడంగా కవిత్వమంత ప్రాచీనమయినదిగా భావించవచ్చు. వందల వేల సంవత్సరాలు ఈ రెండు ప్రక్రియలు కలిసి కొనసాగాయి. అయితే కవిత్వం మన మాతృభాష అంత సహజంగా వుంటుంది. అమితమయిన ఆనందంలోనూ, భరింపశక్యం కాని దుఃఖంలోనూ మనిషి తన మాతృభాషనీ, కవిత్వాన్నీ సమీపిస్తాడు. అనగా మానవీయ భావనల అభివ్యక్తికి అత్యంత ఆత్మీయమయిన మాధ్యమం కవిత్వం.

మహాకవి శ్రీశ్రీ స్ఫూర్తితో రూపం దాల్చిన సాహితీమిత్రులు, విజయవాడ అందుకే ఈ రంగాన్ని తన కార్యక్షేత్రంగా ఎంచుకుంది. అవాంతరాలు ఎన్ని ఎదురయినా అవిచ్ఛిన్నంగా ముందుకు సాగిపోతున్నది. క్రమం తప్పకుండా కవితా వార్షికలను ప్రచురిస్తున్నది. ఇది సాహితీమిత్రులు సగౌరవంగా, సవినయంగా సమర్పిస్తున్న తొమ్మిదో కవితా సంపుటం. ఇది ఒక మహా సంకల్పం. సహృదయులయిన మీ అందరి ఆశీస్సులు, చేయూతా నిరంతరం మాకు అవసరం.

కవులకు అధ్యయనం అవసరం. మరీ ముఖ్యంగా ఇతర కవుల రచనల్ని కొనుక్కుని మరీ భద్రపరచుకోవటం కవితాప్రియులందరూ తప్పనిసరిగా ఆచరించవలసిన సత్సంప్రదాయం. ఇది యేదో వ్యాపార ప్రయోజనం కోసం అంటున్నది కాదు. కవిత్వాన్ని కలకాలం కాపాడుకోవటం కోసం, అనుభవ పూర్వకంగా చెబుతూన్న కఠిన వాస్తవం. తెలుగు కవితా సంపుటాల్ని కొనండి ` తెలుగు కవిత్వానికి జీవం పోయండి. ఇది మా నినాదం. మా మనసు లోతుల్లోంచి వస్తూన్న వినతి.

ఎప్పటిలాగే, ఈ యేడాది కూడా ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ‘కవిత`2012’ వెలువరించటానికి సహకరించిన సంపాదక ద్వయం డాక్టర్‌ పాపినేని శివశంకర్‌, దర్భశయనం శ్రీనివాసాచార్యలకు కృతజ్ఞతలు కేవలం లాంఛనం కోసమే. వాళ్ళిద్దరూ వాస్తవానికి సాహితీమిత్రులు, విజయవాడ నుంచి విడదీయలేని విశిష్ట భాగస్వాములు.


అలాగే ఈ ఏడాది ‘కవిత`2012’ కు ఎంపికయిన కవులందరికీ మా కృతజ్ఞతలు..

శుభాకాంక్షలతో…

విశ్వేశ్వర రావు, సాహితీ మిత్రులు

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)