ఒక మాదిగ ఎగరేసిన బతుకు జెండా : “మా నాయిన బాలయ్య”

  (వై.బి.సత్యనారాయణ రాసిన My Father Balayya పుస్తకానికి సత్యవతి గారి తెలుగు అనువాదం “మా నాయన బాలయ్య” ఆవిష్కరణ సందర్భంగా ….

ఆ పుస్తకానికి    ఎస్ .ఆర్.శంకరన్ రాసిన ముందు మాట)

ఆవిష్కరణ : 22 జూన్ 2013
వేదిక: బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్
సమయం: సాయంత్రం 5:30

 

 ఎస్ .ఆర్.శంకరన్

ఎస్ .ఆర్.శంకరన్

సమాజపు అట్టడుగునుంచీ బయల్దేరి ఉన్నత స్థాయికి చేరుకోడానికి ఒక తెలంగాణా దళిత మాదిగ కుటుంబం చేసిన పోరాటాన్ని విశదంగా కళ్లముందుకు తెచ్చిన జీవిత చరిత్ర ఇది. ఆర్థిక సామాజిక ఆంక్షలనూ, అడ్డంకులనూ వీరోచితంగా ఎదుర్కొని విజయంసాధించిన యెలుకటి కుటుంబ చరిత్ర ఇది.  దాదాపు రెండు శతాబ్దాలపాటు , మూడు తరాల జీవితకాలంలో సమాజంలో వచ్చిన మార్పుల్నీ ఇంకా రాకుండా వుండిపోయిన మార్పులనూ కూడా ఈ పుస్తకం  మన కళ్ళముందుంచుతుంది.ఇది కేవలం ఒక కుటుంబ చరిత్రేకాదు. వివిధ ప్రాంతాల్లొ వివిధ నేపథ్యాలలొ, విభిన్న పరిస్థితుల్లో కొన్ని దశాబ్దాలపాటు మాదిగ కులస్థుల అనుభవాలనుకూడా వర్ణించిన సామాజిక చరిత్ర ఇది.

“ మా నాయిన బాలయ్య” అస్పృశ్యుల జీవితాలలోని వివిధ దశలచిత్రణ,  సమాజం విధించిన అనుల్లంఘనీయమైన ఆంక్షలమధ్య , జీవితం కొనసాగిస్తున్న వారి సాంఘిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులు, వారిలో వారికున్న పరస్పర అవగాహనా ,సంబంధబాంధవ్యాలూ , జీవన విధానాలూ, వృత్తులూ , ఆశలూ , అడియాశలూ పోరాటాలూ రాజీలూ, ఔన్నత్యాలూ లోపాలూ  మొదలైన అనేక విషయాలను తడిమిన రచన ఇది…అణిచివేతే ధ్యేయంగా నిర్మితమైన ,నిచ్చెనమెట్ల వర్ణవ్యవస్థలో అప్పటి , భూస్వామ్య సమాజంలో  అనేక వివక్షలనూ, అవమానాలనూ అవహేళనలనూ ఎదుర్కుంటూ అస్పృశ్యులుగా పరగణింపబడిన ఒక సామాజిక వర్గం చేసిన అలుపులేని పోరాట చరిత్ర ఇది. అస్పృశ్యతలోని అమానవీయత, కులవ్యవస్థలోని  కౄరత్వం, వాటిని నిస్సహాయంగా జీర్ణించుకుని అంతర్గతంచేసుకోవడం ఆనాటి పరిస్థితి. అయితే అప్పడుకూడా కొంతమంది ఇతర కులస్థులు,ముఖ్యంగా ఉపాధ్యాయులు చూపిన  సహానుభూతి సహకార వాత్సల్యాలను  కూడా రచయిత  ప్రస్తావించారు.

Ma father balaiah cover

నేను ఇండియన్ ఎడ్మినిస్ట్రేటివ్ (IAS) సర్వీస్ లో ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నప్పుడు నిరుపేదల మధ్య ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల ,తెగలవారి మధ్య పనిచేసే అదృష్టం కలిగింది. చట్టపరంగా నిషేధింపబడినప్పటికీ అస్పృశ్యత ఎంత పాశవికంగా ఇంకా  అమలవుతున్నదో  కళ్ళారా చూశాను. ఒక దళిత స్త్రీ ఒక చెరువుగట్టున బిందె పెట్టకుని, చెరువునుంచీ నీళ్ళు ముంచిపోసే వాళ్లకోసం నిరీక్షిస్తూ కూచున్న దృశ్యం నేనెప్పటికీ మర్చిపోలేను. ఆమె దళిత మహిళ కనుక చెరువులోనించీ నీళ్ళు ముంచుకోరాదు. వాళ్ళ తక్కువతనాన్ని సూచించడానికి వాళ్లపేర్ల చివర ఎంత అవమానకరమైన పదాలు చేరుస్తారో చూసి, విని నేను అవాక్కయ్యాను. వెట్టిచాకిరి లో వున్న వారి పై జరిగే దోపిడీని ప్రత్యక్షంగా చూశాను. భూస్వాములనుంచీ చిన్నచిన్న మొత్తాల్లో అప్పుతీసుకుని అది తీర్చలేక తరాలుగా వెట్టిచేస్తున్నవారిని చూశాను తెలంగాణాలో ’దొర’లని పిలవబడే పెద్ద భూస్వాముల సమక్షంలోవున్నప్పుడు వాళ్లమొహాల్లో కనపడే భయాన్నీ, ,అదితెలియచెప్పే అణిచివేత స్వభావాన్నీ కూడా చూశాను. “నీ బాంచెన్ కాలు మొక్కుత”అనేది అస్పృశ్యులు భూస్వాములకు చేయవలసిన తప్పనిసరి అభివాదం. యెలుకటి కటుంబ చరిత్ర తో పాటు  అస్పృశ్యులు అనుభవించిన క్షోభా , నిరవధిక  అవమానమూ కూడా చిత్రించారు రచయత.

ఈ రచన నాకు మరింత చేరువగా తోచడానికి మరొక కారణం కూడా వుంది. నా బాల్యంలో నేను కూడా రైల్వే కాలనీల్లో నివసించాను. ఇందులో వర్ణించబడిన రైల్వే కాలనీల్లో, వర్ణవివక్ష అసలే లేదనను కానీ కాస్త సడలించబడడాన్ని నేనుకూడా చూశాను. గ్యాంగ్ మెన్ ,పాయింట్స్ మెన్.షంటర్స్ వంటివారిని చిన్నప్పుడు దగ్గరగా పరిశీలించాను. వీళ్ళంతా దాదాపు తక్కువ కులాలనబడే కులాలనించీనూ, స్టేషన్ మాస్టర్లూ రైల్వే గార్డులూ  అగ్రకులాలనబడే కులాలనుంచీనూ  వుండేవాళ్ళు వ్యక్తిగతంగానూ,అధికారపరంగానూ . వాళ్ళ పరస్పరసంబంధాలు ఎట్లావుండేవో కూడా గమనించాను. ప్లాట్ ఫామ్ మీద ఒకరు ఆకుపచ్చజెండా ఊపుతూ నిలబడగా  , అక్కడ ఆగకుండా దూసుకుపోయే రైళ్లను చూసి ఆశ్చర్యపోయేవాడిని అప్పుడప్పుడూ.  ఆరోజుల్లో ఆగివున్న ఇంజెన్లనుంచీ నీళ్ళు పట్టుకుపోయ స్త్రీలను కూడాచూశాను.  రైల్వే ఉద్యోగుల పిల్లలు టికెట్ లేకుండా ప్రయాణించడంకూడా “చట్టసమ్మతంగా”నే వుండేది అప్పట్లో. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే వరకూ కూడా తమ ఉద్యోగులకోసం రైల్వే చౌకగా సరుకులు సరఫరా చేసేది. గ్రామాల్లో భూస్వాములకింద వుండే జీవితానికీ ఇక్కడ జీవితానికీ కల తేడా చూపించడానకి రచయిత ఈ వివరాలన్నీచెప్పారు. తక్కిన సమాజని కన్న రైల్వే  ఒక భిన్న ప్రపంచం సృష్టించింది వాళ్లకోసం.. అంటారు రచయిత. రచయత తండ్రి బాలయ్యకు రైల్వే అవతలి ప్రపంచం తెలియదు.అందుకని ఆయన  ధ్యేయం తనపిల్లలను చదివించి రైల్వేలో ఆఫీసర్లను చెయ్యడమే!

బ్రిటిష్ ప్రభుత్వం సైన్యంలోనూ , ఓడరేవుల్లోనూ,రైలు మార్గాలలోనూ గనులలోనూ మిల్లులలోనూ కొత్త ఉద్యోగాలను సృష్టించింది.  ఇవి అస్పృశ్యులకు కొత్త అవకాశాలయినాయి..ఈ ఉద్యోగాలు అగ్రవర్ణాలనబడేవారికి నచ్చకపోవడం కూడా వీరికి దక్కడానికి ఒకకారణం. ఎందుకంటే ఈ పన్లు ప్రమాద భరితమైనవి. కష్టసాధ్యమైనవికూడా. అంతకంటే  మైలపడతామన్న భయంకూడా! బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా  మహు అనే స్టేషన్లో  ఒక సైనిక కుటుంబంలో జన్మించాడని చెప్పుకోడం ఇక్కడ అప్రస్తుతం కాదనుకుంటాను. రమాబాయ్ అంబేడ్కర్ కూడా అటువంటి కుటుంబంలోనే జన్మించారు.

రచయిత చెప్పినట్లు గ్రామాలలోని భూస్వామ్య అణచివేతలనుంచీ దళితులకువిముక్తి కలిగించే కొత్త ద్వారాలు తెరిచింది రైల్వేశాఖ.. .ఆ పన్లు కష్టమైనవైనా, ప్రమాదభరితమైనవైనా తక్కువ స్థాయికి చెందినవైనాగాని ! అట్లా వాళ్ళు రైల్వే లో ప్రవేశించారు. రైల్వే క్వార్టర్స్ లో తక్కిన కులాలవారి పక్కన నివసించడం ఒక కొత్త అనుభవం.తమను అంటరాని వాళ్ళుగా చూసి వేరుపెట్టి న గ్రామాలనుంచీ విముక్తి కలిగింది.వీళ్లకు బొగ్గుగనులలో కూడా ఇటువంటి పనులు లభించాయి.

నర్సయ్య జీవితం ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ జిల్లా వంగపల్లి గ్రామంలో ప్రారంభమైంది. ఒకసారి హైదరాబాద్ నిజామ్ వంగపల్లి మీదనుంచీ పోతూండగా నర్సయ్య తండ్రి (ఆయన పేరుకూడా నర్సయ్యే) ఆయనకు దూడచర్మం తో  కుట్టిన మృదువైన చెప్పులజత బహూకరించాడు. అవి చూసి ఆయన ఎంతో ముచ్చటపడి అప్పటికప్పుడు నర్సయ్యకి యాభై ఎకరాల పొలం ఈనామ్ గా ప్రకటించాడు. ఆయన ఈ పుస్తక రచయితకు ముత్తాత. అయితే సాక్షాత్తూ నిజామ్ ఇచ్చినా సరే అతను ఆ పొలాన్ని అనుభవించడానికి వీల్లేదు ,అప్పటి దొరల అధికారం అటువంటిది.ఆపొలం అంతా లాక్కుని రెండెకరాలు మాత్రం నర్సయ్యకిచ్చాడు దొర,. అట్లా చేసినందుకు నర్సయ్యకు బాధగానీ కోపంగానీ కలుగకపోగా దొర కోపానికీ దెబ్బలకీ బలికానందుకు సంతోషించాడు అటువంటి పరస్థితులు ఇంకా కొన్ని గ్రామాలలో వున్నాయి ..షెడ్యూల్డ్ కులాలకు ప్రభుత్వం భూమి ఇచ్చినప్పటికీ వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకుని సాగుచేసుకోనివ్వవు స్థానిక రాజకీయాలు.

రచయిత ఒక గ్రామ నిర్మాణం ఎలావుంటుందో ఈ విధంగా వర్ణిస్తారు

“అప్పటికీ ఇప్పటికీ భారతదేశంలోని గ్రామాల నిర్మాణంలో పెద్ద మార్పు ఏమీ లేదు. గ్రామాలన్నీ దాదాపు మనువు సూత్రీకరించినట్టే నిర్మింపబడి వుంటాయి. గ్రామం వూరుగా(సవర్ణులకు), వాడగా(అవర్ణులకు) చీలి వుంటుంది మధ్యనొక సరిహద్దో లేకపోతే అవసరమైనంత ఖాళీ స్థలమో వుంటుంది.

అవర్ణులు లేక అస్పృశ్యులు అని పిలవబడే వారి మీదనించీ వచ్చే  కలుషిత గాలి  తమమీద వీయకుండా గ్రామంలోని వివిధ కులాల  గృహ నిర్మాణం వుంటుంది..అంటే గాలి బ్రాహ్మణుల ఇళ్లమీదనుంచి ఇతర కులాల ఇళ్లమీదకు వీచే విధంగా గ్రామంలో వివిధ కులాల ఇళ్ళు వుంటాయి. సాధారణంగా గాలి పశ్చిమంనుంచీ తూర్పుకు వీస్తుంది కనుక, ముందు పశ్చిమంలో బ్రాహ్మణుల ఇళ్ళుంటాయి. అస్పృశ్యుల ఇళ్ళు తూర్పున వుంటాయి. గ్రామంలో ప్రధాన వీధులన్నీ పశ్చిమంలో వుంటాయి .నిచ్చెన మెట్ల వర్ణ వ్యవస్థ తూర్పునించీ మొదలౌతుంది…శూద్రులు,వైశ్యులు,క్షత్రియులు ,బ్రాహ్మణులు ,అట్లా ….ఉత్పత్తి రంగంలో వుండే శూద్ర వర్ణాలన్నీ ఒక చోట గుంపుగా వుంటాయి. ఆఖరున గ్రామ ముఖ ద్వారంలో బ్రాహ్మణుల ఇళ్ళుంటాయి.”

ఈ వాక్యాలు డాక్టర్ అంబేడ్కర్ మాటల్ని తలపింపచేస్తాయి.ఆయన కూడా భారతదేశంలోని గ్రామాల నిర్మాణాన్ని తీవ్రంగా విమర్శించారు.భారతీయ గ్రామాలను అత్యంత భావుకతతో వర్ణించడాన్ని అంబేడ్కర్ ఖండించారు

“ భారతీయ గ్రామాలు గణతంత్రం రాజ్యం అనే భావాన్ని అభావం చెయ్యడంలా వుంటాయి.అవి నిజంగా గణతంత్ర రాజ్యాలే అయితే అవి సవర్ణులకోసం సవర్ణలచేత పాలింపబడే గణతంత్రాలు . అవర్ణులకు అక్కడే హక్కులూ లేవు.వాళ్ళ సేవచెయ్యడానికీ నిరీక్షించడానికీ, అణిగివుండడానకీ మాత్రమే వున్నారు .అక్కడ స్వేచ్ఛకి తావులేదు.సమానత్వానికి తావులేదు.సహోదరత్వానికి తావులేదు”

అన్ని సామాజిక ,మతపరమైన వ్యతిరేకతల మధ్య యెలుకటి కుటుంబంలోకి విద్య ప్రవేశించింది. కొన్ని శతాబ్దాలుగా,ఆ సామాజిక వర్గానికీ   ఆ కుటుంబానికీ  అందకుండా వుంచిన విద్యా సంపదకు విత్తు నాటింది ఒక ముస్లిమ్ ఉపాధ్యాయుడు .ఆ తొలి గురువైన.ఆలీ సాహెబ్ కు  యెలుకటి కుటుంబంలో భవిషత్తు తరాలన్నీ ఋణపడి వుంటాయని రచయిత ఎంతో గౌరవభావంతోనూ కృతజ్ఞతతోనూ చెప్పినప్పుడు మన మనసు ఆర్థ్రత తో నిండిపోతుంది.

తనకొడుకును గ్రామంలో వెట్టి చాకిరి నుంచీ రక్షించాలనుకున్నాడు నర్సయ్య. అగ్రకులస్థుల నిరంతర వేధింపులు భరించలేక అతను తన పూర్వీకులగ్రామాన్ని వదిలి రావడం నర్సయ్యనే కాక తరువాతి తరాలను కూడా బంధవిముక్తులను చేసింది. ఆత్మగౌరవమూ కృషీ  మనుషులకు శక్తినీ ఆత్మవిశ్వాసాన్నీ గుర్తంపునీ ఇస్తాయనేది బాలయ్య నమ్మకం. ఆనమ్మకమే తన బిడ్దలను విద్యావంతులను  చెయ్యాలనే  జీవిత ధ్యేయాన్ని కలుగచేసింది నగరానికి వలస రావడం రైల్వేలో నౌకరి సంపాదించడం . భూస్వాముల ఆగడాలకు దూరంగా కొంత అజ్ఞాతంగా వుండడానికి కూడా దోహదం  చేసింది. అయితే కుల వ్యవస్థా, దానితో వచ్చిన అవమానమూ దళితులను అన్నిచోట్లా వెంటాడుతూనే వుంటాయని ఈ జీవిత కథ చెబుతుంది. విద్యాలయాల్లోనూ ఇళ్ళు అద్దెకు తీసుకునేటప్పుడూ ఒక్కొక్కసారి కులందాచిపెట్టుకునే అవసరాన్ని కూడా పరిస్థితులు కల్పిస్తాయి. సామాజంలో మార్పుకు విద్యకీలకమైన పాత్ర పోషిస్తుందనీ ,అది ఒక ఆయుధంవలె పని చేస్తుందనీ ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. చదువుకునే క్రమంలో కొన్ని సామాజిక బృందాలలో ప్రత్యేకమైన  చైతన్యం వికసిస్తుందనీ,ఆ సామర్థ్యం విద్యకున్నదని కూడా చెబుతుంది..చదువు కేవలం జీవిక కోసమే కాదనీ దళితుల విముక్తికి అదొక శక్తివంతమైన సాధనం అనీ ,వారిపట్ల అమలయ్యే అన్యాయానికీ అవమానానికీ విరుద్ధంగా పోరాడే శక్తి ఇస్తుందనీ అంబేడ్కర్ కూడా చెప్పి వున్నాడు.

జీవితంలోని అనేక అంశాలలో వచ్చిన మార్పులనూ పరిణామాలనూ కూడా ఈ రచనలో చూడవచ్చు. యెలుకటి కటుంబానికి చెందిన మూడుతరాల వ్యక్తులు రైల్వేలో పనిచేశారు. దశాబ్దాలుగా రైల్వేలో వచ్చిన పరిణామాలకు వారు ప్రత్యక్ష  సాక్షులు. గర్జిస్తూ వచ్చే ఆవిరి ఇంజన్లనుంచీ నిశ్శబ్దంగా వచ్చే ఎలెక్ట్రికల్ ఇంజన్లవరకూ, మనుషులు ఇచ్చే సిగ్నల్స్ నుంచీ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ వరకూ ,టెలిగ్రాఫిక్ సందేశాలనుంచీ కంఫ్యూటర్ ప్రోగ్రామింగ్ వరకూ చూశారు.అట్లాగే యెలుకటి కుటుంబపు జీవన విధానంలోనూ ఆహారపు అలవాట్లలోన వచ్చిన పరిణామాలుకూడా చూడొచ్చు.వంటకు మట్టికుండలు పిడతల నంచీ అల్యూమినియం పాత్రలలోకి ,జొన్న రొట్టెనుంచీ గోధుమ చపాతీలోకి ,ఉమ్మడికుటుంబంనుంచీ వ్యష్టి కుటుంబాలలోకి నిరక్షరాశ్యతనుంచీ  ఉత్తమ శ్రేణి సంస్థలలో ఉన్నత విద్యలోకి..,విదేశాలలో సదస్సులలో పాల్గొనడానికి..

కిరోసిన్ లాంతరు మసక వెలుగులో చదువుకుని మెట్రిక్యులేషన్ తరువాత , రైల్వేలో మామూలు సిగ్నలర్ గా ఉద్యోగం ప్రారంభించి ,మళ్ళీ చదువుకుని  ఉస్మానియా యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసిన డాక్టర్ అబ్బసాయిలకు ఈ పుస్తకం ఒక ప్రశంస.

ఈ అద్భుతమైన రచనలో కేవలం వర్తమాన పరిస్థితుల ను గురించిన వివరణతోపాటు అన్ని అడ్డంకులనూ ప్రతికూలతలనూ ఎదుర్కునే   శక్తిసామర్థ్యాలు మనుషులలో  స్వాభావికంగా వుంటాయని కూడా అర్థం  చేసుకుంటాం.ఇటువంటి కథనాలు ఆయాసమాజాలలోని ఇతరులనుకూడా ప్రభావితంచేస్తాయి. సామాజిక ఆర్థిక ప్రతిబంధకాలను తొలిగించుకోడానికి విద్యను ఎట్లా ఉపయోగించుకోవాలో అర్థంచేయిస్తాయి. సామాజపు నిచ్చెన మెట్లు అధిరోహించడం సాధ్యమేననే ఆశను ఉద్దీపింపజేస్తాయి.

హక్కులకోసం పోరాడుతున్న దళితులనుద్దేశిస్తూ 1947 ఆగస్టులో డాక్తర్ అంబేడ్కర్ చేసిన ప్రసంగాన్ని ఉదహరిస్తూ ఈ ముందుమాట ముగిస్తాను

“  నేనిచ్చే సందేశం ఇదే… పోరాడాలి, మరింతగా పోరాడాలి..త్యాగాలు చెయ్యాలి, మరన్ని త్యాగాలు చెయ్యాలి. బాధనూ త్యాగాలనూ లెక్కచెయ్యకండా పోరాడడమే వారికి విముక్తినిస్తుంది. తప్ప మరేదీ ఇవ్వదు

దళితులంతా   ఉన్నతి సాధించడంకోసం   ఒక ఉమ్మడి ఆకాంక్ష ను అభివృద్ధి చేసుకోవాలి.తమ ఆశయానికున్న పవిత్రతను విశ్వసించి దాన్ని సాధించాలనే సమష్టి నిర్ణయం తీసుకోవాలి ఈ కార్యం చాలాగొప్పది.దాని లక్ష్యము చాలా ఉదాత్తమైనది..కనుక అస్పృశ్యులంతా కలిసి ఇట్లా ప్రార్థించండి” తాము ఎవరిమధ్యనైతే జన్మించారో వారి ఉన్నతికోసం పనిచెయ్యడమనే తమ కర్తవ్యాన్ని నిర్వహించేవారు ధన్యులు.బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎవరు తమ కాలాన్నీ, శారీరక ఆత్మిక శక్తుల్ని ధారపోస్తారో వారు ధన్యులు ..మంచి జరిగినా,.చెడు ప్రాప్తించనా, ,సూర్యకిరణాలు ప్రసరించినా తుఫానులు విరుచుకుపడినా గౌరవం దక్కినా , అవమానాల పాలైనా, ,అస్పృశ్యులు తిరిగి తమ మనిషితనాన్ని పొందేవరకూ పోరాటం ఆపేదిలేదనే  ధృడ నిశ్చయంతో వున్నవారు ధన్యులు”

 

అక్టోబర్ 2011                                                                                                                                                                                                                     ఎస్ .ఆర్.శంకరన్

తెలుగు అనువాదం      పి సత్యవతి ( డాక్టర్  వై.బి.సత్యనారాయణగారి సహకారంతో)

 

 

 

Download PDF

2 Comments

  • satyanarayana.v says:

    ఈ పుస్తకం ఇంకా చదవలేదు కానీ, ఇప్పటికే ఎంతో మంది మిత్రుల నుంచి ఈ పుస్తకం గురించి విన్నాను, శంకరన్ గారి ముందుమాటను చదువుతుంటే ఎప్పుడెప్పుడు ఈ పుస్తకాన్ని చదువుతామా అని ఉంది..

  • jyothi aturu says:

    సారంగకి నమస్కారం,, సారంగ లోకి మమ్మల్ని మనసారగ …….. స్వాగతిస్తారని.. ఇ పత్రిక చాల బాగుంది…

Leave a Reply to satyanarayana.v Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)