హిందూ-ముస్లిం ఉమ్మడి వారసత్వ సంపద ఉర్దూ

సంగిశెట్టి శ్రీనివాస్‌

సంగిశెట్టి శ్రీనివాస్‌

 సీమాంధ్ర ఆధిపత్యవాదులు, వారి తాబేదార్లు కొందరు తమ రచనల్లో కొత్తగా ఇటీవల ‘తెలంగాణాంధ్ర’ అనే పదాన్ని విరివిగా వాడుతున్నారు. ఇది పూర్తిగా తెలంగాణ తెహజీబ్‌కు వ్యతిరేకమైన పదం. తెలంగాణ ప్రాంతాన్ని సంబోధించడానికి ‘తెలంగాణాంధ్ర’ అనే పదాన్ని వాడినట్లయితే ఉర్దూ మాతృభాషగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న 60లక్షల మందికి పైగా ముస్లింలను అవమానించడమే! వారిని తెలంగాణ నుంచి వేరు చేసి చూడడమే!

కాస్మోపాలిటన్‌ కల్చర్‌తో పారిస్‌, లండన్‌, ఇస్తాంబుల్‌లతో సమానస్థాయిలో విలసిల్లిన హైదరాబాద్‌ ఆత్మను అగౌరవ పరచడమే! నిజానికి హైదరాబాద్‌ సంస్కృతిలో ఎన్నడూ పరాయివారిని, పరాయివారి భాషను కించపరచాలనే భావన ఏ కోశానా ఉండదు. మంచి ఎవరు చెప్పినా ఆచరించడం, అభినందించడం ఆనవాయితీ. కాని ఇప్పటి టీవీల్లో, పత్రికల్లో, సినిమాల్లో వాడే ‘తెలుగు’ భాష కచ్చితంగా తెలంగాణ తనాన్ని కించపరిచేదే! ఛానళ్లలో అలవోకగా ఆరి ‘భడవా’ మాదిరిగా వందలాది పదాలు ఎలాంటి జంకు గొంకు లేకుండా వాడుతున్నారు. ‘భడవా’ అంటే తెలుగులో ‘తార్పుడుగాడు’ అని అర్థం. ఇలా భాష తెలియకుండానే దాని అర్థం తెలియకుండానే సీమాంధ్ర ‘మేధావులు’ వాడేస్తున్నారు.

 

హైదరాబాద్‌ రాజ్య అస్తిత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మింగేయడం మూలంగా తెలంగాణ తెలుగుకు ముఖ్యంగా హిందూ`ముస్లిం ఉమ్మడి సంస్కృతి, వారసత్వానికి ప్రతీక అయిన ఉర్దూకు జరిగిన నష్టం ఎన్నటికీ పూడ్చలేనిది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనీసం కొంతలో కొంతమేరకైనా దీనికి అడ్డుకట్ట పడుతుంది. తెలంగాణ తెలుగు, ఉర్దూ రెండిరటిని సమాధి చేసిన సమైక్య రాష్ట్రంలో ఈనాటికీ అబద్దాలే రాజ్యం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశాడనీ, తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని చెబుతున్నారు. నిజానికి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టింది ఆంధ్ర రాష్ట్రం కోసం ఇంకా కచ్చితంగా చెప్పాలంటే మద్రాసు నగరం కోసం. రెండోది తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం 1935లో ఏర్పడ్డ ఒరిస్సా. ఇవన్నీ మరిచి అబద్ధాలనే ఆధిపత్యాంధ్రులు ప్రచారంలో పెడుతున్నారు.
1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడంతో తెలంగాణ ప్రజల బహుభాషా ప్రావీణ్యానికి గండి పడిరది. ఉర్దూ, తెలుగు, మరాఠీ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని అదే హైదరాబాదియత్‌ని కలిగి ఉన్న ఈ ప్రాంతాన్ని ముక్కలు చేయడం ద్వారా సమున్నతమైన సహజీవనానికి తెరపడిరది. భాషోన్మాదం మూలంగా హైదరాబాద్‌ రాజ్యంలోని తెలుగు ప్రజలు కేవలం తెలుగు భాషకు అదీ తమది కాని భాషలో విద్యాభ్యాసం చేయాల్సి వచ్చింది. విద్యార్థులు ఇంట్లో మాట్లాడే భాష ఒకటి, పాఠశాలల్లో పంతుళ్లు బోధించే భాష మరో యాసలో, చివరికి విద్యార్థి అర్థం చేసుకొని రాసిన భాష, జవాబు పత్రాన్ని దిద్దేవారికి అర్థంగాని గందరగోళ పరిస్థితి. వెరసి తెలంగాణ విద్యార్థికి జీవితకాల నష్టం.
1950కి ముందు హైదరాబాద్‌ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కచ్చితంగా మూడిరటికన్నా ఎక్కువ భాషలు మాట్లాడేవారు. చదువకుకున్న వారయితే వాటికి అదనంగా ఇంగ్లీషు, ఫారసీ, అరబ్బీ కూడా తోడయ్యేది. దైరతుల్‌ మారిఫ్‌ లాంటి హైదరాబాద్‌లోని తర్జుమా సంస్థ మొత్తం ప్రపంచంలోని ఏ భాషలో ప్రచురితమైన సాంకేతిక పరిజ్ఞానం సహా సమాచారమంతా ఉర్దూ మాధ్యమంలోకి అనువదించేది. అయితే హైదరాబాద్‌పై పోలీసు చర్య తర్వాత క్రమంగా మార్పు వచ్చింది. పోలీసు చర్యతో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సైనికాధికారులు ఇంగ్లీషు భాషతో మమేకమయ్యారు. వారి అధికారిక భాష కూడా ఆంగ్లమే. వీరికి సహాయకులుగా పనిచేయడానికి మదరాసు రాష్ట్రం నుంచి తెలుగు అధికారులు వచ్చారు.

urdu1

మొదట వచ్చిన వెల్లోడి ప్రజాస్వామిక భారతదేశంలో హైదరాబాద్‌ రాజ్య తొలి ముఖ్యమంత్రి. ఈయన తన పరిపాలనా సౌలభ్యం కోసం ఇంగ్లీషుని పాలన భాషగా ఏర్పాటు చేసుకొన్నారు. ఇంగ్లీషు భాష తెలిసిన వారు తెలంగాణలో చాలా మంది ఉన్నప్పటికీ వారిని ఉన్నత స్థానల్లో కొనసాగించినట్లయితే హైదరాబాద్‌ రాజ్యంలో వేర్పాటువాదానికి ఊతం దొరుకుతుందనే ఉద్దేశ్యంతో ఇంగ్లీషు తెలిసిన ప్రాంతేతరులకు ఉద్యోగలిచ్చారు. ఇలా ఉద్యోగం పొందిన వారు ఎక్కువ శాతం మంది ఆంధ్రులే కావడం విశేషం. వీళ్ళు స్థానికభాషలో ప్రజలకు అర్థమయ్యే భాషలో పాలన పేరిట తెలుగుని పరిపాలనలో అమల్లోకి తెచ్చారు. ఇలా తెలుగుని అధికారిక భాషగా చేయడంతో అప్పటి వరకూ అసఫ్‌జాహీ ప్రభుత్వ బోధనా భాషగా కొనసాగిన ఉర్దూని బలవంతంగా తొలిగించారు. ఇలా ఉర్దూని తొలగిండమంటే ఉర్దూ తెలిసిన ఉద్యోగుల్ని తొలగించడమే! ఇలా తొలగించబడిన వారిలో అత్యధికులు ముస్లింలు ఉన్నప్పటికీ ఉర్దూ మాత్రమే తెలిసిన హిందువులు కూడా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారి స్థానంలో ప్రాంతేతరులైన తెలుగువారికి ఉద్యోగాలు దక్కాయి. స్థానికంగా ఉన్నత ఉద్యోగాల్లో తిష్ట వేసిన ఆంధ్రప్రాంత అధికారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ముల్కీ సర్టిఫికెట్లు జారీ చేసి గైర్‌ముల్కీలకు ఉద్యోగాలిచ్చారు.
1952 నాటికి హైదరాబాద్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిరది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. ఈయన స్వతహాగా సాహిత్య జీవి. ఉర్దూ, పారసీ భాషపై మంచి పట్టున్న వాడు. ఆ భాషా చరిత్రలను తెలుగు పాఠకులకు అందించాడు. అలాంటి వ్యక్తి మాతృభాషలో విద్యా బోధన పేరిట పాఠశాలల్లో తెలుగులో బోధన చేయించాలని ఉత్తర్వులు జారీచేసిండు. అప్పటి వరకూ ఉర్దూ మాధ్యమంలో టీచర్‌ ట్రెయినీలను తయారు చేసిన హైదరాబాద్‌ ఇన్సిట్యూషన్స్‌, సంస్థలు తెలుగు మాధ్యమంలో బోధించే టీచర్లకు శిక్షణా సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి. హైదరాబాద్‌ ప్రభుత్వం తెలుగులో బోధన తప్పనిసరి జేయడంతో ఆ మాధ్యమంలో బోధించే టీచర్ల కొరత ఏర్పడిరది. అదే ఆంధ్రప్రాంతంలో చాలామంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. ఆంధ్రాప్రాంతం వారికోసమే ఉద్యోగలన్నట్లుగా తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో లెక్కకు మించి, ముల్కీ నిబంధనలకు తిలోదకాలిచ్చి కొన్ని వేలమంది ఆంధ్రప్రాంత టీచర్లకు తెలంగాణలో ఉద్యోగాలిచ్చారు.

ఇలా ఉద్యోగాలు పొందిన వారు మీకు చదువు రాదు కాబట్టి మేం చదువు నేర్పించడానికి వచ్చాం. మీరు నేర్చుకునే వాళ్ళు, మేం చెప్పే వాళ్ళం’ అని అహంభావంతో వ్యవహరించేవారు. ఈ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ 1952 ఆగస్టులో ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయమేంటంటే బహుబాషా ప్రవీణులైన హైదరాబాదీయులని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కేవలం ఏకభాషీయులుగా కుదించింది. తమది కాని భాషని బలవంతంగా నేర్చుకునేలా తప్పనిసరి స్థితిని కల్పించింది.

నిజానికి మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు 14 భాషల్లో ప్రజ్ఞకలవాడు. బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజి, బిరుదురాజు రామరాజు ఇలా కొన్ని వందల మంది రాజకీయ నాయకులు, సాహితీవేత్తలు ఈ బహుభాషా సంస్కృతికి అద్దం. హైదరాబాద్‌  రాజ్య ప్రజల ఉమ్మడి భాష అయిన ఉర్దూని క్రమంగా తొలగించడమనేది కేవలం ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చే గైర్‌ ముల్కీలకు మేలు చేకూర్చేందుకు చేసిన పనిగానే భావించాలి. అనుసంధాన భాషగా రాజ్యాంగంలో ఎక్కడా జాతీయ భాష హోదాలేని హిందీని అంగీకరించారు. కానీ రోజు స్థానికంగా మాట్లాడ్డమే గాకుండా విశ్వవ్యాప్తమైన స్థానిక భాష ఉర్దూని తెలంగాణ ప్రజలకు దూరం చేసిండ్రు.
నిజాం ప్రభుత్వంలో ఉద్యోగం చేయడానికి హైదరాబాద్‌ వచ్చిన బ్రిటీష్‌ రచయిత విలియమ్‌ పిక్తాల్‌ ముస్లిం ప్రజల పవిత్ర గ్రంథం ఖురాన్‌ని ఇంగ్లీషులోకి అనువదించడమే గాకుండా మతం మార్చుకొని మహమ్మద్‌ పిక్తాల్‌గా మారిండు. బ్రిటీష్‌ రెసిడెంట్‌ కోఠీలో రెసిడెన్సీని కట్టించిన కిర్క్‌పాట్రిక్‌ హైదరాబాద్‌ వనిత ఖైరున్నీసాను ప్రేమించి పెండ్లాడి హైదరాబాదీలకు ప్రేమాస్పదుడయ్యాడు. ఇలా హైదరాబాద్‌ ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చిన వారిని ఆదరించింది. వారి నుంచి ఎంతో నేర్చుకున్నది. అంతకన్నా ఎక్కువగా నేర్పించింది.
అయితంరాజు కొండలరావు, బిరుదురాజు రామరాజు, కె.గోపాలకృష్ణారావు తదితరులు తెలుగు`ఉర్దూ నిఘంటువులు తయారు చేసి రెండు భాషల్ని సుసంపన్నం జేసిండ్రు. అలాగే కొన్ని వందల మంది ముస్లిమేతర హైదరాబాదీలు ఉర్దూ మాధ్యమంలో చదువుకోవడమే గాకుండా ఆ భాషలో రచనలు చేసిండ్రు. రాఘవేంద్రరావు జజ్బ్‌, రాజ నర్సింగరాజ్‌ సక్సేనా, కిషన్‌పర్‌షాద్‌, కాళోజి రామేశ్వరరావు ఇట్లా కొన్ని వందలమంది ఉర్దూలో చిరస్థాయిగా నిలిచిపోయే సాహిత్యాన్ని సృజించారు. ఖమ్మం జిల్లా గురించి రాస్తూ ఆకాశం ఆంధ్ర నేల తెలంగాణ అని సెటైర్లు వేస్తుంటారు. అయినప్పటికీ ఇక్కడి నుంచి నవలాకారుడు కవిరాజమూర్తి, కథలు, కవిత్వం ఇబ్బడి ముబ్బడిగా రాసిన హీరాలాల్‌ మోరియాలు పుట్టుకొచ్చారు. వీరిద్దరూ ఉర్దూలో అత్యున్నత స్థాయి రచనలు చేసిండ్రు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి లాంటి వాండ్లు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నారు. ఇలాంటి వారందరికీ దక్కిన ఉర్దూ నేర్చుకునే భాగ్యం నేటి తరానికి దూరమయింది.
20 మార్కులకే పాస్‌ చేసే హిందీ స్థానంలో ఉర్దూని బోధించనట్లయితే తెలంగాణ ప్రజలందరికీ ఉపయోగకారిగా ఉండేది. ఉర్దూని పాఠశాల స్థాయి నుంచి బోధించక పోవడం మూలంగా గత 60యేండ్లుగా తెలంగాణ తరాలకు జరిగిన అన్యాయం వెలగట్టలేనిది. ఉర్దూ భాష తెలియడం వల్ల మత సామరస్యం పెరగడమే గాకుండా గంగా`జమునా తెహజీబ్‌ పరిఢవిల్లుతుంది.
sky1 ఈ గంగా జమున తెహజీబ్‌ ఇటీవల హైదరాబాద్‌లో మళ్ళీ మొగ్గ తొడిగింది. గతంలో కొత్త వంతెన పేరిట కొంత కవిత్వాన్ని తెలుగు`ఉర్దూ భాషల్లో ఒకే పుస్తకంగా అచ్చేయడం జరిగింది. అలాంటి ప్రయత్నమే మిత్రుడు స్కైబాబ, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వున్న మరో కవి ఖుతుబ్‌ సర్‌షార్‌తో కలిసి ‘రజ్మియా’ పేరిట తెలంగాణ ముస్లింల కవితా సంకలనాన్ని తెలుగు`ఉర్దూ భాషలో తీసుకొస్తున్నారు. తురుకోళ్లు, తెలుగోళ్లు కలిసి వేదికలు నిర్మించుకునే, కవిత్వం చదువుకునే రోజులు హైదరాబాద్‌ రాష్ట్రం ఉన్నంత వరకూ కొనసాగాయి.
హైదరాబాద్‌ రాష్ట్రం అంటేనే దేశవ్యాప్తంగా ఉర్దూ పోషణకు ప్రసిద్ధి. ఉత్తర భారతం నుంచి అనేక మంది సృజనకారులు మహబూబ్‌ అలీఖాన్‌, ఉస్మానలీఖాన్‌ దగ్గర కొలువులు పొందిండ్రు. తమ ప్రతిభ ద్వారా హైదరాబాద్‌కూ గుర్తింపు తెచ్చిండ్రు. అలాగే తెలంగాణ సంస్థానాల పాలకులు సీమాంధ్ర ప్రాంతంలోని పండితులను పోషించారు. ఘనంగా సత్కరించారు. వారి ప్రతిభకు పట్టం గట్టిండ్రు. 1952లో దాశరథి కృష్ణమాచార్యులు అధ్యక్షులుగా ఉన్నటువంటి ‘తెలంగాణ రచయితల సంఘం’ హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో రాత్రి తొమ్మిది నుంచి తెల్లవారు ఝాము నాలుగ్గంటల వరకూ ముషాయిరా, కవి సమ్మేళనాన్ని నిర్వహించింది. ఇలాంటి ప్రయత్నమే ‘సింగిడి’ తెలంగాణ రచయితల పూనిక మేరకు ఇటీవల హైదరాబాద్‌లోని ఆంధ్రసారస్వత పరిషత్తు హాలులో ఒక రోజంతా జరిగింది. ఈ సమావేశంలో ఉర్దూ కవి సమ్మేళనాన్ని ప్రత్యేకంగా నిర్వహించి, తెలంగాణ ఉద్యమానికి తమ వంతు తోడ్పాటు నందించారు. ఈ పరంపర భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ….

-సంగిశెట్టి శ్రీనివాస్‌

Download PDF

6 Comments

  • pavan santhosh surampudi says:

    బహుభాషలను నేర్చుకునే సంస్కృతీ ఆంగ్లం, హింది వంటి భాషలను అనుసంధాన మాధ్యమంగా వాడే అలవాటు వల్ల కోల్పోయాము. బహుశా తెలంగాణకు ఈ వలసవాద ఆధునికతా లక్షణం ఎలాగైనా వచ్చే ఉండేది. ఆంధ్రప్రదేశ్ లో నైజాం విలీనం కాకున్నా ఆ పద్ధతికి బాగా అలవాటుపడిపోయిన భారత రాజ్య వ్యవస్థ అనివార్యంగా పైన చెప్పిన పరిణామాలను చేసి ఉండేది. భవిష్యత్తులో తెలంగాణా వస్తే వివిధ భాషల సమ్మిశ్ర సంస్కృతి వస్తే సంతోషమే.
    ఐతే //అలవోకగా ఆరి ‘భడవా’ మాదిరిగా వందలాది పదాలు ఎలాంటి జంకు గొంకు లేకుండా వాడుతున్నారు. ‘భడవా’ అంటే తెలుగులో ‘తార్పుడుగాడు’ అని అర్థం// అన్న వాక్యంతోనే సమస్య ఉంది. ఎందుకంటే భాష ఒక జీవనది. అందులో ఏ అర్థమూ మార్పులేకుండా అలా నిలబడదు. ఉదాహరణకు కృషి అన్న పదానికి సంస్కృతంలోనూ మొదట్లో తెలుగు వాడుకలోను agriculture అనే అర్థంతోనే ప్రయోగించెవారు, ఇప్పుడది ఆ అర్థాన్ని కోల్పోయింది. వ్యవసాయం అంటే కష్టపడి పనిచేయడం అనే అర్థం మొదట్లో సాగేది. ఇప్పుడు agriculture అనే అర్థాన్ని పొందింది. వాడుకలో కృషి వ్యవసాయంగానూ, వ్యవసాయం కృషిగానూ మారాయి. ఇటువంటివి పుంఖానుపుంఖాలుగా ఉన్నాయి ప్రతి భాషలో. నిఘంటువులైనా ప్రజల వ్యవహారాన్ని అనుసరించాలి తప్ప ప్రజలు నిఘంటు అర్థాల అనుగుణంగా ఎప్పుడు ఎక్కడా మాట్లాడరు. అది సముద్రంలో పుట్టిన నది శిఖరం వరకు ప్రయాణించడం లాంటిది.
    బూదరాజు రాధాకృష్ణ వంటివారు పై విధంగా నిఘంటువులు కూర్చినప్పుడున్న అర్థాన్ని కోల్పోయి వేరే అర్థాన్ని సంతరించుకున్న ఎన్నో పదాలతో పుస్తకాలు రాసారు. ఐతే ఆయన కూడా మీరు రాసిన ధోరణిలోనే జన వ్యవహారాన్ని విమర్శిస్తూ, ఇంకా చెప్పాలంటే చక్కదిద్దాలని ప్రయత్నిస్తూ రాస్తారు. కానీ నాకెందుకో అది అసహజమనిపిస్తుంది.
    ఎంతైనా కవిని ప్రజలు, ప్రజని కవులు అనుసరించడమే తప్ప నిఘంటువులు ముందు నడిస్తే ఆ నిరంకుశులు అనుసరించారు కదా.

  • MSK Kishore says:

    మీరు వ్యాసం బాగానే రాసారు.. మీకు ఉర్దూ మీద అంట ప్రేమ వుంటే… అన్యాయం జరిగిందని మీకు అనిపిస్తే… మీ పిల్లలకి URDU మీడియం లో జాయిన్ చేయించండి…. అంట ఖర్చు తో కూడిన వ్యవహారం కూడా కాదు లెండి… దక్కను ముస్లిమ్స్ ప్రాంతాన్ని ఆక్రమించు కున్న తర్వాత… తెలుగు అండ్ సంస్కృతం తెలిసిన వారికి బలవంతం గా ఉర్దూ నేర్పించారు కదా.. మరి అప్పుడు జరిగిన అన్యాయం గురించి అప్పుడు చాలామంది తెలుగు సంస్కృతం పన్దితులు ఆంధ్ర ప్రాంతానికి వలస వెళ్లారు….ఆ భాషలు మాత్రమే నేర్చుకున్న పండితుల మరియు వారి కస్టాలు గురించి ప్రస్తావించలేదు…..మీరు… అలా చేసినందుకు ఇలా జరిగింది అంటే…
    ఠన్కింగ్ యు
    మ స కే

  • skybaaba says:

    1. “తురుకోళ్లు, తెలుగోళ్లు కలిసి వేదికలు నిర్మించుకునే, కవిత్వం చదువుకునే రోజులు హైదరాబాద్‌ రాష్ట్రం ఉన్నంత వరకూ కొనసాగాయి.” అని రాసారు సంగిశెట్టి శ్రినివాస్ గారు. తురుకోళ్ళు అనే పదాన్ని మేము (ముస్లింవాదులము) వాడడం లేదు.. ముస్లింలు అని వాడాలి. ఎందుకంటే, టర్కీ నుంచి తురక పదం వొచ్చింది. తెలంగాణ లోని ముస్లింలలోని 97 శాతం మంది వివిధ కులాల వారే వివిధ సందర్భాల్లో ఇస్లాం స్వీకరించి ముస్లింలుగా మారారు. అందులో sc, st, bc ఎక్కువ. కాబట్టి వారిని తురుష్కులు లోంచి వొచ్చిన పదం తో సంబొధించడం సరైంది కాదు.
    2. “1952లో దాశరథి కృష్ణమాచార్యులు అధ్యక్షులుగా ఉన్నటువంటి ‘తెలంగాణ రచయితల సంఘం’ హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో రాత్రి తొమ్మిది నుంచి తెల్లవారు ఝాము నాలుగ్గంటల వరకూ ముషాయిరా, కవి సమ్మేళనాన్ని నిర్వహించింది. ఇలాంటి ప్రయత్నమే ‘సింగిడి’ తెలంగాణ రచయితల పూనిక మేరకు ఇటీవల హైదరాబాద్‌లోని ఆంధ్రసారస్వత పరిషత్తు హాలులో ఒక రోజంతా జరిగింది.” అన్నారు సంగిశెట్టి. ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం’తో పాటు మరొ 31 సంఘాలు కలుపుకొని ఆ పూనిక జరిగింది. అందులో “సింగిడి” వారు ఎక్కువమంది పని చెసిన మాత వాస్తవం.

    • skybaaba says:

      (చివరి వాక్యం తప్పు పడింది, క్షమించాలి) అందులో “సింగిడి” వారు ఎక్కువమంది పని చేసిన మాట వాస్తవం.

    • sangishetty srinivas says:

      సింగిడి’ తెలంగాణ రచయితల పూనిక తో పని జరిగింది అనేది వాస్తవం కాదా? ఇనిశిఎషణ్ తీసుకుంది సింగిడి ఏ kadaa!

  • sangishetty srinivas says:

    కిషోర్ గారు మీ పిల్లల్ని ఉర్దూ మీడియం లో చదివించండి అని సలహా ఇచ్చిండు. సంతోషం. ఆయన తన అజ్ఞానాన్ని ఇంత బాహాటంగా వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు. ఉర్దూ నేర్చుకోవాలంటే ఆ మీడియం లో చదవాలి అనే ఆలోచన కిషోర్ కె చెల్లింది. హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఉర్దూ సోర్సెస్ ను చదవడం తప్పనిసరి. ఈ పనిని విదేశాల నుంచి స్కాలర్స్ వచ్చి ఉర్దూ నేర్చుకున్టుండ్రు. మనం ఎందుకు ఉర్దుని నేర్చుకోలేక పోతున్నాం అనే విషయం ఫై చర్చ జరగాలి.

Leave a Reply to skybaaba Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)