ఓ త్రికోణ ప్రణయ కథ

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

వాడి మయూఖముల్ గలుగువా డపరాంబుధి గ్రుంకె, ధేనువుల్

నేడిట వచ్చె నేకతమ, నిష్ఠమెయిన్ భవ దగ్నిహోత్రముల్

పోడిగ వేల్వగాబడియె, బ్రొద్దును పోయె, గచుండు నేనియున్

రాడు, వనంబులోన మృగ రాక్షస పన్నగ బాధ నొందెనో!            

                                                            -నన్నయ

 (శ్రీ మదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

వాడి కిరణాలు కలిగిన సూర్యుడు పశ్చిమసముద్రంలో మునిగాడు. గోవులు ఒంటిగా ఇంటికి చేరాయి. నిష్ఠతో నీ అగ్నిహోత్రాలు వేల్చబడ్డాయి. పొద్దు కూడా పోయింది. అయినా కచుడింకా రాలేదు. అడవిలో మృగాలు, రాక్షసులు, పాములవల్ల అతనికి హాని కలిగిందో, ఏమో!

రాక్షసుల గురువు శుక్రాచార్యునితో అతని కూతురు దేవయాని ఈ మాటలు అంటుంది…

                 ***

kachadevyani (1024x742)

క్షమించాలి, నా ప్రణాళిక మరోసారి దారి తప్పుతోంది. నిజానికి నేనిప్పుడు కోసల, మగధరాజుల కాలానికి వెళ్ళాలి. కానీ కిందటి వ్యాసంలో, గణనిర్బంధాల నుంచి బయటపడడం గురించిన ప్రస్తావన వచ్చింది. క్షత్రియుల కన్నా ముందు బ్రాహ్మణులు గణ నిర్బంధాలనుంచి బయటపడ్డారని కూడా అన్నాను. అనుకోకుండా జరిగిన ఈ ప్రస్తావన, నాకు ఎంతో ఇష్టమైన కథలలో ఒకటైన యయాతి-దేవయాని-శర్మిష్టల కథవైపు నా మనసును అయస్కాంతంలా గుంజేసింది. ఫలితమే ఈ ప్రణాళికాభంగం.

ఇదో త్రికోణ ప్రణయ కథ. పై ముగ్గురిలోనూ శర్మిష్ట పాత్ర నన్ను విశేషంగా ఆకర్షిస్తుంది, ఆ పేరుతో సహా! శర్మిష్ట గురించి తలపోసేటప్పుడు నాకు తెనాలి రామకృష్ణుని పాండురంగమాహాత్మ్యంలోని నిగమశర్మ గుర్తొస్తాడు. అయితే, ఆ పోలిక కేవలం మితభాషిత్వం దగ్గర మాత్రమే. నిగమశర్మ అంత కాకపోయినా శర్మిష్ట కూడా మితభాషిగానే రూపుగడుతుంది. తెనాలి రామకృష్ణుడు నిగమశర్మ చెడు తిరుగుళ్ళ గురించీ,  చుక్క తెగి పడినట్టు అతనో రోజున ఇంటికి వచ్చినప్పుడు అతని అక్క (ఆమె నిగమశర్మ అక్క, అంతే… పేరు లేదు) అతని శరీరానికీ, బుద్ధికీ కూడా ‘తలంటడం’ గురించీ, అంతా విని ఆ ప్రబుద్ధుడు అక్కగారి ముక్కెరతో సహా ఇంట్లోని నగా నట్రా మూటగట్టుకుని ఉడాయించడం గురించీ, కాపుకోడల్ని లేవదీసుకుపోవడం గురించీ ఓ ఇంటింటి కథలా ఎంతో సహజంగా హాస్యస్ఫోరకంగా చిత్రించుకుంటూ వెడతాడు తప్ప, నిగమశర్మ నోట ఒక్క మాట కూడా పలికించడు. కాపు కోడలి తర్వాత ఇంకో ‘కడజాతి’ స్త్రీతో కాపురం చేసి పిల్లల్ని కన్న నిగమశర్మ, ఆమె చనిపోయిన తర్వాత ఆమెను తలచుకుని శోకిస్తూ మొదటిసారి నోరువిప్పుతాడు. ఆ పద్యం కూడా నాకు ఇష్టం:

ఎల్లరు నెల్లచో ధనములిచ్చి మృగాక్షుల గొండ్రు గాని యో

పల్లవపాణి యే బరమపావనవంశము నిచ్చికొంటి నీ

నల్లని రూపు నిక్కమని నమ్మి! ధ్రువంబది గాక నేడు వి      

ద్యుల్లతికాధికాభినయ ధూర్వహమౌట నెరుంగ నింతయున్

విశేషమేమిటంటే, కవి ఈ పద్యంలో కరుణ, హాస్యాలను రెండింటినీ మేళవిస్తాడు. అంతా డబ్బిచ్చి అందమైన స్త్రీలను కొనుక్కుంటారు కానీ నేను నా పరమపావనమైన బ్రాహ్మణవంశాన్ని వెలగా చెల్లించి నిన్ను కొనుక్కున్నానని నిగమశర్మ అంటాడు. ఇందులో కులాతిశయం ఉన్నమాట నిజమే కానీ, నిగమశర్మకు ఆమెపై ఉన్న గాఢమైన అనురక్తీ, ఆమె మృతి కలిగించే దుఃఖతీవ్రతా ఆ కులాతిశయాన్ని కప్పేస్తున్నాయి. ఇక ‘నీ నల్లని రూపు నిజమని నమ్మాను తప్ప మెరుపు తీగ అవుతుందని తెలుసుకోలేకపోయా’ ననడంలో కవిత్వమూ + వికటత్వమూ రెండూ ఉన్నట్టున్నాయి.

నిగమశర్మతో శర్మిష్టను పోల్చడంలోని అనౌచిత్యం ఇప్పటికీ నా మనసును పీకుతూనే ఉంది. ఆ పోలిక కేవలం మితభాషిత్వంలో మాత్రమే సుమా అని మరోసారి సంజాయిషీ ఇచ్చుకుంటున్నాను.

శర్మిష్ట మితభాషిత్వం నిగమశర్మ మితభాషిత్వం లాంటిది కాదు. అది సమాజం, ఇంకాస్త వివరంగా చెప్పాలంటే పితృస్వామ్య సమాజం ఆమెపై రుద్దిన మితభాషిత్వం. నిజానికి పితృస్వామ్యసమాజంలో స్త్రీ అతిభాషిత్వమూ, మితభాషిత్వమూ రెండూ ఒకలాంటివే. ఆమె మాటకీ మౌనానికీ ఒకే విలువ ఉంటుంది. రేకు డబ్బాలో గులకరాళ్ళు చప్పుడు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. విలువ మారదు. పితృస్వామ్యం స్త్రీకి తనదైన భాష లేకుండా చేసింది. పితృస్వామ్యంలో స్త్రీ పురుషుడి భాష మాట్లాడుతుంది, పురుషుడిలా ఆలోచిస్తుంది, పురుషుడి హృదయంతో స్పందిస్తుంది.

ఈ మాటలు అంటున్నప్పుడు, నాకు ఎంతో ఇష్టుడైన ఒక కథకుడూ, ఆయన రాసిన ఒక కథా గుర్తుకొస్తున్నా(రు-యి). ఆ కథకుడు, చెఖోవ్…ఆ కథ పేరు, The Lady.

పురుషస్వామ్యంలో స్త్రీకి సొంత గొంతు లేదు, సొంత సమస్యలు లేవు; ఆమె పురుషుడి గొంతునూ, పురుషుడి సమస్యలనూ వినిపించే సౌండ్ బాక్స్ మాత్రమే నన్న సత్యాన్ని ఇంత గొప్పగా చెప్పిన మరో రచన ప్రపంచసాహిత్యంలో  ఉందని నేను అనుకోను. నా ప్రపంచసాహిత్య పరిచయం ఏమంత గొప్పది కాదనుకుంటే, కనీసం వేళ్ళ మీద లెక్కించదగిన అలాంటి రచనల్లో ఇదొకటి అంటాను. ఆ కథ ఇదీ:

భార్యా, భర్త… భర్త ఒక నాటకశాలను నడుపుతూ ఉంటాడు. రోజూ సక్రమంగా నాటకశాల నిండితేనే అతనికి ఆదాయం. కానీ నాటకాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. నాటకశాల నిర్వహణ ఇబ్బందిగా మారుతుంది. భర్త తన సమస్యలను భార్య దగ్గర వెళ్లబోసుకుంటాడు. జనంలో కళాభిరుచి తగ్గిపోతోందని బాధపడతాడు. భర్త ఆవేదనలో భార్య పాలు పంచుకుంటుంది. అవును నిజమే, జనంలో ఎంతసేపూ సంపాదన యావే తప్ప; ఓ నాటకం, ఓ వినోదం అంటూ ఏమీ లేకుండా పోయాయనుకుంటుంది. భర్త వినిపించే సమస్యలనే పరిచయస్తుల దగ్గర తనూ వల్లిస్తూ  ఉంటుంది.

అలా ఉండగా, కొంతకాలానికి భర్త చనిపోతాడు. ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. అతడు ఓ కిరాణాకొట్టు యజమాని.  కొట్టు నిర్వహణలో ఆమె భర్తకు సాయపడుతూ ఉంటుంది. ఆ వ్యాపారంలో ఉండే సమస్యలు ఆ వ్యాపారంలోనూ ఉన్నాయి. భర్త వాటిని ఏకరువు పెడుతుంటే, అవును కదా అనుకుంటూ సానుభూతి చూపిస్తుంది. తను కూడా పూర్తిగా కొట్టుకే అంకితమైపోతుంది. పరిచయస్తులెవరైనా కొట్టుకు వచ్చినప్పుడు యథావిధిగా భర్త సమస్యలనే వాళ్ళతో పంచుకుంటూ ఉంటుంది. ‘ఏమమ్మా, ఎంతసేపూ కొట్టును పట్టుకుని వేళ్లాడడమేనా?  ఓ వినోదమూ, వేడుకా ఉండద్దా? ఏ నాటకానికైనా వెళ్లచ్చు కదా!’ అని ఎవరైనా అంటే, ‘నాటకాలకు వెళ్ళేలానే ఉంది నా పరిస్థితి… మీకేం మీరేమైనా చెబుతారు. కొట్టు నడపడం మాటలు కాదు. ఎన్ని సమస్యలో!’ అంటుంది.

రెండో భర్త కూడా చనిపోతాడు. ఆమె మరో పెళ్లి చేసుకోదు. తోడుంటారని ఓ యువజంటకు తన ఇంట్లో వాటా అద్దెకిస్తుంది. వాళ్ళకొక కొడుకు. ఇక ఆమెకు ఆ అబ్బాయే లోకం అయిపోతాడు. నీళ్ళు పోయడం, అన్నం తినిపించడం, దుస్తులు వేయడం, స్కూల్లో దింపడం వగైరాలన్నీ ఆమే చేస్తుంది.  ఆ అబ్బాయి సమస్యలన్నీ ఆమె సమస్యలే అయిపోతాయి. ఆ కుర్రాడు బండెడు పుస్తకాలు మోసుకెళ్ళడం చూసి ఆమె కడుపు తరుక్కుపోతుంది. ‘స్కూలు వాళ్ళకు బుద్ధి లేదు, పసివాడి చేత ఇన్ని పుస్తకాలు మోయిస్తారా?!’ అనుకుంటుంది. కనిపించినవాళ్లు అందరితోనూ అంటుంది.

కథ అయిపోతుంది… జ్ఞాపకం మీద ఆధారపడి రాసిన ఈ కథాసంగ్రహంలో కొన్ని వివరాలు లోపిస్తే లోపించవచ్చు.

ప్రస్తుతానికి వస్తే, యయాతి-దేవయాని-శర్మిష్టల కథలో దేవయాని చాలా ఎక్కువగా మాట్లాడుతుంది, సాధికారంగా కూడా మాట్లాడుతుంది. శర్మిష్ట చాలా తక్కువగా మాట్లాడుతుంది. వారిరువురి సామాజిక నేపథ్యాలలోనూ, సామాజిక దశలలోనూ ఉన్న తేడాయే అందుకు కారణం. బ్రాహ్మణులు అప్పటికి గణనిర్బంధాలనుంచి బయటపడ్డారు. తమ గణం వెలుపల ఎవరికైనా వారు పురోహితులు కావడం, ఎవరినుంచైనా దక్షిణలు తీసుకోవడం ఇందుకు సూచన అని కోశాంబీ అంటాడు. అలాగే, వృత్తి జీవనులుగా బ్రాహ్మణులకు సంచారజీవనమూ ఎక్కువ. ఆవిధంగా వారు నాలుగు ప్రదేశాలు చూస్తారు, ఎక్కువ లోకజ్ఞానాన్ని పొందుతారు. దేవయాని బ్రాహ్మణకన్య కనుక శర్మిష్టతో పోల్చితే ఆమెకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, తెలివి ఎక్కువ. అవి కలిగించే ఆత్మవిశ్వాసం, అహంకారాల పాలు కూడా ఎక్కువే. శర్మిష్ట అలా కాదు, ఆమె రాచకన్య, తండ్రి చాటు బిడ్డ, గణం కట్టుబాట్లకు బందీ, అవసరమైతే తండ్రి రాజకీయ ప్రయోజనాలకు పావుగా మారక తప్పదు. నగరంలో పుట్టి పెరిగి, చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయికీ, పల్లెటూరిలో పుట్టి పెరిగిన అమ్మాయికీ ఉన్న తేడా లాంటిదే దేవయానికీ, శర్మిష్టకీ ఉన్న తేడా.

కథలోకి వెడుతున్న కొద్దీ ఈ వ్యత్యాసాలు మరింత స్పష్టంగా అర్థమవుతాయి.

శుక్రుడు దైత్యదానవ గణాలకు ఆచార్యుడిగా ఉన్నాడు. అతని దగ్గర మృతసంజీవిని అనే విద్య ఉంది. దేవతలతో జరిగే యుద్ధంలో చనిపోతున్న రాక్షసులను ఆ విద్యతో అతను బతికిస్తున్నాడు. దాంతో దేవతల పక్షంలో చావులూ, ఓటమీ సంభవిస్తున్నాయి. దేవతలు బృహస్పతి కొడుకైన కచుని దగ్గరకు వెళ్ళి, నువ్వు ఎలాగైనా శుక్రుని  మెప్పించి మృతసంజీవినీ విద్యను సాధించాలని కోరారు. శుక్రునికి, కూతురైన దేవయానిపై మమకారం ఎక్కువ, నువ్వు ఆమె మనసు గెలుచుకుంటే నీ పని తేలికవుతుందని కూడా చెప్పారు. కచుడు అంగీకరించి శుక్రుని దగ్గరకు వెళ్ళాడు. శుక్రుడు అతనిని శిష్యునిగా స్వీకరించడమేకాక, అతనికి ఆతిథ్యం ఇవ్వడం స్వయంగా బృహస్పతికి ఆతిథ్యం ఇవ్వడమే ననుకుని సంతోషించాడు. శత్రువైనాసరే, ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం ఆనాటి మర్యాద.

శిష్యులు గురువుగారి గోవులను కాచడంతో సహా ఇంటిపనులు చక్కబెట్టడం ఆనాటి గురు-శిష్య సంబంధంలో భాగం. కచుడు ఇంటి పనులు చేస్తూ అటు శుక్రునీ; పువ్వులూ, ఫలాలూ తెస్తూ ఇటు దేవయానినీ మెప్పిస్తూ వచ్చాడు.  కచుడు తమ విరోధులైన దేవతల గురువు బృహస్పతికి కొడుకు కనుక, అతడు ఇలా శుక్రుని ఇంట్లో పాగా వేయడంలో  రాజకీయమైన కుట్రను రాక్షసులు పసిగట్టడం సహజమే. ఓ రోజు కచుడు గోవులను తోలుకుని అడవికి వెళ్లినప్పుడు రాక్షసులు అతన్ని చంపేసి, మృతదేహాన్ని ఓ చెట్టుకు కట్టేసి వెళ్ళిపోయారు. కచుడు వెంట లేకుండా గోవులు ఒంటిగా ఇంటికి చేరుకోవడం చూసి, దేవయాని కీడు శంకించింది. అప్పుడు తండ్రితో అన్న మాటలే పై పద్యం.

శుక్రుడు దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుని మృతసంజీవినీ విద్యను కచుని వద్దకు పంపించి అతన్ని బతికించాడు. కచుడు ఇంటికి వచ్చాడు. కొన్ని రోజులు గడిచాయి. మరోసారి రాక్షసులు అడవిలో కచుణ్ణి పట్టుకుని చంపేసారు. ఈసారి అతన్ని బతికించే అవకాశం ఇవ్వకూడదనుకుని మృతదేహాన్ని కాల్చి బూడిద చేసి, దానిని సురలో కలిపి శుక్రునికి ఇచ్చారు. శుక్రుడు ఆ సురను తాగేశాడు.

కచుడు ఇంటికి రాకపోయేసరికి రాక్షసులే అతన్ని చంపేసి ఉంటారని దేవయాని ఊహించింది. శోకించడం ప్రారంభించింది. అప్పుడు శుక్రుడు, ‘రాక్షసులు అతని మీద పగబట్టారు. ఎలాగైనా అతన్ని చంపేస్తారు. అతనికి ఉత్తమలోకాలు కలుగుతాయి. ఎందుకు దుఃఖించడం?’ అన్నాడు.  ఆ మాటకు దేవయాని తండ్రిపై తాచులా లేచింది. ‘మహానుభావా, నువ్వూ ధర్మం తెలిసినవాడివే కదా; ఎంతో బుద్ధిశాలి అయిన అంగిరసుని మనవడు, నీకు ఆశ్రితుడు, నీ శిష్యుడు, బృహస్పతికి కొడుకు, అందగాడు, బ్రహ్మచారి అయిన కచుణ్ణి రాక్షసులు అన్యాయంగా చంపేస్తే, నేను దుఃఖించకుండా ఎలా ఉంటాను? అతను నా కంట పడితే తప్ప నేను అన్నం తిన’ నని, ఎత్తిపొడుపూ, ఏడుపూ, మొండితనమూ దట్టిస్తూ తండ్రిపై మాటల మేకులు చెక్కింది.

ఇక్కడ తండ్రీ, కూతుళ్ల మధ్య అనుభవంలోనూ, పరిణతిలోనూ ఉన్న వ్యత్యాసాన్ని పౌరాణికుడు అద్భుతంగా సూచిస్తాడు. కచుని మరణానికి దేవయాని భావోద్వేగంతో స్పందిస్తే; శుక్రుడు రాజకీయ వివేకంతో స్పందిస్తాడు. కచుణ్ణి రాక్షసులు బతకనివ్వరని అతను అప్పటికే గ్రహించాడు. అది రాజకీయంలో భాగం. దాని వెనుక రాక్షసరాజు వృషపర్వుని ఆదేశం తప్పనిసరిగా ఉంటుంది. ఒక హద్దును మించి తను అందులో జోక్యం చేసుకోలేడు. చేసుకోకూడదు కూడా. చేసుకుంటే తన స్థానం ప్రమాదంలో పడడం అలా ఉంచి, నీతి కూడా కాదు. రాక్షసుల గురువుగా వారి రాజకీయ వ్యూహాలకు, ప్రయోజనాలకు తను కలసి రావలసిందే. మరి కచుని శిష్యునిగా ఎలా స్వీకరించాడన్న ప్రశ్న వస్తుంది. దానికి జవాబు ముందే చెప్పుకున్నాం. శత్రువైనా సరే, దేనినైనా కోరి, అతిథిగా వచ్చినప్పుడు అన్నివిధాలా ఆదరించడం వ్యక్తిగత స్థాయిలో అనుసరించవలసిన ధర్మమూ, మర్యాదా. అతిథి మర్యాద గురించి ఆ కాలంలో ఉన్న పట్టింపును సూచించే కథలు చాలా ఉన్నాయి. అలాగే, కచునిపై తన కూతురు మనసు పడుతోందనీ శుక్రునికి తెలుసు. అయితే, అది ధర్మబద్ధం కాదనో, లేక పొసగదనో భావన అతనికి ఉన్నట్టు కథాగమనం సూచిస్తుంది.

అయితే, శుక్రునిలో కూతురిపై  ఉన్న మమకారం వీటన్నిటినీ మించినది. అది అతనిలోని రాజకీయ వివేకంతో పోటీపడుతోంది. ఎట్టకేలకు మెత్తబడ్డాడు…

 

 

 

 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)