ఒక నవల – తొమ్మిది అనువాదాలు

ఈ పరామర్శను ఒక వాస్తవిక ఉటంకింపుతోనే మొదలుపెట్టాలి. కథా, నవల ప్రక్రియల్లో పెద్దింటి ఏమిటి అని విగడించుకున్నప్పడు అతనికే చెందే కొన్ని గుణ విశేషాల్ని  ప్రత్యేకతల్ని చెప్పుకోక తప్పదు. కథానికని ప్రక్రియా గౌరవాన్ని పాటిస్తూ కథానికగానే రాయగలడాయన. నవల విషయంలోను ఇది అన్వయిస్తుంది. వస్తు పరిధిలోపల రకరకాల భావజాలాలు అయోమయాన్ని గుప్పించి  పిచ్చిగీతలు గీయడు. ఇతి వృత్తం వెంట 360 డిగ్రీల నుంచి గీసిన ఏ రేఖ అయినా ఉద్దిష్ఠ ప్రయోజనం అనే కేంద్రకానికి సూటిగా చేరుకుంటుంది. వస్తువు పరమ నవీనం సమకాలీనం సామాజికం అయి ఉంటుంది. విలక్షణం అయి తీరుతుంది. అప్పటి వరకు ఆ వస్తువుని ఏ కొందరు రచయితలో సృజించినా అశోక్‌ కూర్చుకున్నంత ఘాడమైన సాంధ్రమైన సాధికారమైన పరిజ్ఞాన భరితమైన ఇతి వృత్తాన్ని ఇతరులెవరూ కూర్చుకోలేక పోయారు అంటే అతని దృష్టి కోణంలోని నైశిత్యం కథా వస్తు గ్రహణంలో అసాధారణత్వం Pinning of the Plot లో అనుభవ విస్తృతి  ప్రత్యేకమైనవి. అతనికి మాత్రమే సాంతమైనవి. శిల్ప పరంగా ఏ సన్నివేశాన్ని ఎలా వర్ణించాలి?  ఏ సంఘటనని ఎలా జరిపించాలి  ఏ పాత్ర తనంత తానుగా ఎంతగా ఎదగనివ్వాలి వంటి రస విద్యతో పాటు విజ్ఞత ఆయనకు కరతలామలకం. ఆ శైలి తెలంగాణ మాండలిక సొబగుతో పరిమళంతో అమృత సేతనాన్ని ఇస్తుంది. చదువరికి రచనని ఆద్యంతము ఒకే బిగిని చదివింపచేయగల శక్తి ఆ శైలికి ఉన్నదని గ్రహింపుకు వస్తుంది.

నవల సంగతికి వస్తే మూస ఇతి వృత్తానికి విభిన్నంగా ప్రాపంచిక దృక్పథ ప్రతిఫలనంతో సామాజిక వాస్తవికతతో ఒకే అపూర్వమైన అనన్య సామాన్యమైన రచనా శిల్పాన్ని మలిచి తన ప్రతిభా వ్యుత్పత్తుల్ని  గుమ్మరిస్తూ జిగిరి నవలని మన ముందుంచారు అశోక్‌ కుమార్‌.

గుడ్దెలుగు ఒక క్రూర జంతువు. అడవి నుంచి ఊరికి వచ్చి మృగ లక్షణాలను పోగొట్టుకుని సాధువయి పోతుంది. కాని సాధువులా వుండాల్సిన మనిషి  మృగమయి పోతాడు. వస్తువు మూల పదార్థం, ఇతివ్రుత్తం వలయం- రెంటిని స్ధూలంగా స్పర్శిస్తుందీ విషయం. వివరాలను చూద్దాం.

ఊరిచివరి గుడిసె ఆ నలుగురి నివాసం. ఇమాం యజమాని. జంతువు వెంట తిరిగే జంతువులాంటి మనిషి. బీబమ్మ ఇమాం భార్య. వీళ్ల కొడుకు చాంద్‌. ఈ ముగ్గురి దోస్త్‌ అంతకంటే జీవనాధారం షాదుల్‌. ఇది ఒక ఎలుగు. షాదుల్‌ తో ఈ ముగ్గురిది ఇరవయి యేండ్ల సోపతి. బీబమ్మ షాదుల్‌ ను మురిపెంగా చూసుకునేది. తనకు ఇద్దరు కొడుకులని అనందించేది. ఇమామ్‌ షాదుల్‌ అవిభక్త ప్రాణులు. షాదుల్‌ ను అడవిలోంచి తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడ్దారు దంపతులు. దాని అలవాట్లు మార్చి ఆటా పాటా నేర్పడానికి నానా అవస్థలు పడ్డారు.

పెద్దింటి అశోక్ కుమార్

పెద్దింటి అశోక్ కుమార్

ఈగాథనంతా పాటకులకు  వాస్తవికంగా అందించడానికి  అశోక్‌  అత్యంత సాధికారమయిన సమాచార సేకరణా వివరాలూ సాధించాడు. ఆ వివరాలు చదువుతుంటే  దిగ్బ్రమకి లోనవుతాం. ఎలుగును వేటాడి పట్టుకునే పద్దతులు, దాని జీవన పద్దతులు, స్పందన ప్రతి స్పందనలు , తిండి, రోగానికి మందులు-ఇలా అతి సూక్ష్మమయిన అంశాలన్నింటిని ఎంతో చిత్తశుద్దితో కథాగతం చేస్తాడు రచయిత. వీరి మధ్య నెలకొన్న అన్యోన్యానుబందాన్ని , ఆనంద విషాదాల కలబోతని , మురిపాల ముచ్చట్లను,  దృశ్యం వెంట దృశ్యం తరుముకొని వచ్చేలా – స్క్రీన్‌ప్లేలాగా కనిపింపజేసాడు రచయిత.

ఒక సందర్భంలో బీబమ్మ తన స్తన్యాన్ని షాదుల్‌కి అందజేసే ఘటన  కరుణ ప్లావితమయి చదువరి కన్నుల్ని చెమరింప జేయడమేకాదు – గుండె బిగిసేట్టు చేస్తుంది. వెన్ను జలలదరింప జేస్తుంది. ఇక చాంద్‌ షాదుల్‌తో ఆడుకునేవాడు. వాళ్లిద్దరు చిన్నపిల్లలయిపోయేవారు. ఎలుగు కుటుంబంలో మనిషయిపోయింది. వారిది విడదీయరాని బంధం.

ఈ నవల ప్రారంభమయ్యే సందర్భంలో ఒక దురదృష్టకరమయిన అవసరం ఏర్పడింది. కారణం గ్రామాల్లో ఎలుగును ఆడించకూడదు. ఇది ప్రభుత్వ నిర్ణయం, రూలు. ఇది ఒకటి. ఎలుగు లేకపోతే వారి జీవనాధారం పోతుంది  కనుక ఆ కుటుంబానికి రెండెకరాల భూమిని పట్టా చేస్తుంది  ప్రభుత్వం – ఇది రెండు. ఈ రెంటిని కలిపి ఆలోచించినప్పుడు దురదృష్టకరమయిన అవసరం ఏర్పడింది. చాంద్‌ ఇప్పుడు ఇరవయి ఏళ్ల యువకుడు. అతనికి భూమిని పొందాలని రయితు కావాలని కోరిక. భూమి కావాలంటే షాదుల్‌ ఉండకూడదు. నిజం చెబితే ఏమవుతుందోనని లేదని అబద్దమాడుతాడు. కనుక భూమి కోసం షాదుల్‌ను ఉండనీయకూడదు. చాంద్‌ బలవంతం వలన అతని భవిష్యత్తు మీది ఆరాటం వలన భీబమ్మ అతని దిక్కు చేరిపోతుంది. అప్పుడు మొదలవుతుంది ఘర్షణ. నవల చివర చూస్తే ముగింపు పేరాలను – కళ్లొత్తుకుంటూ ముక్కు పుటాలు అదురుతుండగా మళ్లీ మళ్లీ చదువుతుంటే నా నోట మరోవాక్యం అప్రయత్నంగా నవలని పూర్తి చేసింది. ఆవాక్య మేమిటంటే – అతనిక రాడు !!!

ఈ నవల సంచనాత్మకమైనది. ప్రభుత్వ నిబంధనలన వల్ల ఈ దుస్థితి అనే అంశాన్ని ధ్వన్యాత్మకంగా ఎంతో నిర్మోహతతో చిత్రించి తన శిల్ప నిర్వహణని నైపుణ్యంతో ముగించాడు. జరిగిన దురవస్థలో దుర్ఘటనలో రాజ్య ప్రమేయాన్ని ఎక్కడా ఫోకస్‌ చేయలేదు. రాజ్యం పట్ల విద్వేష ప్రదర్శన ద్వారా కథాగత ప్రాణుల పట్ల ఒక సానుభూతిని పెంపొందించాలనే లౌల్యానికి గురికాలేదాయన. రచయితగా ఇది పెద్దింటి విజయాల్లో ఒకటిగా నేను భావిస్తున్నాను. దీనికి కారణాల్ని objectiveగా నవలే ఇచ్చింది. రాజ్యం విషయికంగా రెండు positive points ని చెప్పింది నవల. ఒకటి వన్యప్రాణి రక్షణ. రెండు వాటి ద్వారా బ్రతుకు దెరువును కోల్పోతున్న వారికి రెండెకరాల భూమి నివ్వటం. ఈ రెండింటికి నవలాకారుడు రాజ్య వ్యతిరేక చర్యల కల్పనతో ఉపన్యాసాల నిరసనతో తన దృష్టిని మరల్చుకోలేదు. నిజానికి  ఈనవలలో రాజ్యాన్నో దాని దుష్టత్యాన్నో లాగటం పీకటం రచయిత లక్ష్యం కాదు. ధ్వనిమంతంగా కూడా ఏ ఇతర పాత్రల టోన్‌లో కూడా దీన్ని రానీయలేదు. మనిషికి జంతువుకి మధ్య పుట్టి, పెరిగి, దగ్గరై ప్రాణప్రదమైన సంబంధం చివరికిలా చావులతో ముగియవలసిన పనిని అన్యాపదేశంగా కూడా రాజ్యమేమి ఫోర్స్‌ చేయలేదు. ”షాదుల్‌ ను పట్నంల జంతు ప్రదర్శన శాలకు అప్పజెప్పాలనట. మన ఇంట్లనే ఉండనీయద్దట” అని ఎమ్మార్వో  చెప్పినట్లు చాంద్‌ తండ్రికి చెప్పాడు కనుక ఆ option ఉంది కాని అతను అవసరార్థం అది తమతో లేదని బొంకి నెత్తి మీదికి, కొంప మీదికి తెచ్చుకున్నాడు.

ashok2

అసలు నవలా ధ్యేయం వీటన్నిటికీ అతీతమైనది. మనుషుల పట్లనే కాదు ఈ నాటి సామాజిక సంక్లిష్ఠతలో మానవ సంబంధాల సంకీర్ణతలో జంతువుల పట్ల కూడా మనిషి తన మనిషితనాన్ని మరచి ప్రవర్తిస్తున్నాడు. స్వప్రయోజనాకాంక్ష అనేది అతన్ని అంతటి బలవన్మరణానికి తలపడేటంత దారుణ పరిస్థితికి పురిగొల్చుతుందనే అంశాన్ని శిల్పభరితంగా, నవలా ప్రక్రియ సాధనంగా చదువరులకు ఆర్తితో అందించటం ఆ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చిత్తశుద్దితో, ప్రాపంచిక నిబద్దతతో, రచన పట్ల ఆరాధనాభావంతో నిర్వహించి విజయం సాధించాడు రచయిత.

పాత్ర చిత్రణలో ఆ మనుషులతో వారి భావోద్వేగాలతో తాదాత్యంచెందుతాడు కాని ఆసాంతం తానొక Outsider గానే నిలిచి తన ధర్మం నిర్వహిస్తాడు రచయిత. ఇది ఆయన ప్రజ్ఞ .ఏ పాత్ర పనిని ఆలోచనని ప్రవర్తనని ఆ  ఆపాత్రనే చేయనిస్తాడు. పాత్రల ఉత్ధాన పతనాన్ని వారినే పడనిస్తాడు. వారి మురిపాల్ని ఆక్రోశాల్ని వారినే వెల్లడించనిస్తాడు.  ”ఆనాడు తన ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టిన షాదుల్‌కు ఎర్రి మందు పెడుతున్నందుకు దుఖం వచ్చింది ఇమామ్‌కు” అనే ఘట్టాన్ని చదవండి. ఆ తరువాత దీనికి కొనసాగింపుగా ” ఆలోచించి దంచిన మందును ఆవేశంగా దూరంగా విసిరి కొట్టాడు ఇమామ్‌” అనే ఘట్టాన్ని చదవండి. పాత్రని తన పనిని తాను చేయనీయడమంటే ఎమిటో అర్థం చేసుకుంటాము. అలాగే చాంద్‌ ఉక్రోశము, ఆక్రోశము, యువ రక్తపు పొంగు వీటి తీవ్రతని చల్లార్పుని చూస్తాము.

కాలం నిరంతర శ్రోతస్విని. మనిషి బ్రతుకు అంతే ఒడ్డుల వొరుసుకుంటూ పొంగుతుంది. మెరక తేలి ఎండిపోతుంది. ఈ జీవ విభిన్నత్వాన్ని నవలలోని పాత్రలకి అన్వయింపజేస్తూ సార్వకాలీనము, సార్వజనీనము అయిన ఒక తాత్విక స్ఫూర్తిని పఠితులకు పంచే మెస్మరిజంను, సృజనాత్మకత కలిగిన  పెద్దింటి వంటి శిల్పనిపుణుడు నిర్వహిస్తాడు. ‘జిగిరి’ లో ఈ విద్యని మరింత ప్రతిభావంతంగా ప్రదర్శించాడు అశోక్‌ కుమార్‌. పాత్రల మనస్తత్వాల్లో, స్వభావాల్లో భేదాల్ని చెప్పగలగడం ఒక ఎత్తు కాగా ఒక పాత్రని మలచడంలోనే ఎత్తుపల్లాల్ని చూపగలగడం మరోక ఎత్తు. ఈ రెండింటిని అద్భుతంగా ఆవిష్కరించాడు అశోక్‌. ఒక ప్రత్యేక పాత్ర చిత్రణ నుంచి ఒక సమూహాన్ని సాధారణీకరణం చేయడం అనేది ఒక సృజనాత్మక కళ. ఈ కళలో ఆరితేరినవాడు ఈ రచయిత.

ప్రస్తుత సాహిత్య సందర్భం వినిర్మాణాల పోస్ట్‌ మోడర్న్‌ కాలం అని చాలా మంది అంటున్నారు. అంటే రచయితలు వాళ్ల వాళ్ల వైయక్తిక అనుభవాల, ఆకాంక్షల అసాధరణతో Fragmented themes తో కాల్పనిక ప్రక్రియల్ని సృష్టిస్తారని అభిప్రాయం. అయితే ఈ జిగిరి నవల ఈ అభిప్రాయాల్ని అధిగమించి సాహిత్య సృజనలో శాశ్వత విలువల ప్రతిపాదనకే పట్టం కడుతుంది. నవలా వస్తువు ద్వారా శిల్పం ద్వారా మనిషి కోల్పోవకూడని మానవీయతని అంతర్లియంగా పటిష్టం చేసింది. సమాజానికి ఏది వాంఛితమో దాన్ని స్పష్టం చేసింది. అయితే ఈ రెండిటింకి భిన్నంగా నవల ముగిసిందేమని అనిపించవచ్చు .అదే కళాత్మక వాస్తవికత మర్మం. చదువరిలో ఒక Purging effect తీసుకురావడానికి ముగింపు అలాగే ఉంటుంది. దాని సారభూతమైన ఉద్ధిష్ఠమైన సందేశం సరిగ్గా ఆ ముగింపుకు వ్వతిరేకమైన ఆలోచనని ఆశిస్తుంది. ప్రవర్తనని ప్రోది చేస్తుంది. అంటే సమాజంలో ఉన్న ఇమామ్‌ లాంటి బడుగులు  అలా తమ  బతుకుని ముగించకూడదు. షాదుల్ కు అలాంటి దుర్మార్గపు దయనీయమైన పరిస్థితి రాకూడదు. జిగిరి ప్రయోజనం విజయమూ కూడా పఠితలో ఆ భావనోల్మీనాన్ని అంతర్ముఖీనంగా అందించండమే. ఇది జిగిరి Pinnacle of Success.

ఈ నవల ఇంతటి ఆకర్షణ శక్తి కాంతివంతమైనది. కాబట్టే ఇంగ్లీష్‌, మైథిలీ, మరాఠీ భాషల్లో పుస్తక రూపంలో హిందీ, ఒరియా, పంజాబీ భాషల్లో మాస ప్రత్రికల్లో  ఒకే సారి నవలగా, కన్నడలో ధారా వాహికంగా ప్రచురించబడడమే కాకుండా బెంగాలీ, గుజరాతీ భాషల్లో ప్రచురణకు పత్రికల్లో సిద్ధంగా ఉంది.

 

    విహారి

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)