1970 ల్లో మరాఠీ సాహిత్యాన్ని, మొత్తం భారతీయ సాహిత్య రంగాన్నే తీవ్ర సంచలనానికి గురిచేసి ఒక్క కుదుపు కుదిపిన ప్రముఖ కవి నామ్ దేవ్ ధాసల్ కనుమూసారు. ఆంగ్లం, జర్మన్ , ఫ్రెంచ్ , ఇటాలియన్ తదితర భాషల్లోకి అనువదింపబడి దళిత అస్తిత్వానికీ , పోరాటాలకూ ప్రతీకకగా నిలిచిన నామ్ దేవ్ ధాసల్ కవిత్వం చాలా పదునైనది. తీవ్రమైన భావవేశంతో, పదజాలంతో, అప్పటి దాకా తన మాటను, ఆలోచననూ, మొత్తంగా మరాఠీ సాహిత్యాన్ని నియంత్రించిన బ్రాహ్మణ మను వాద భావజాలాన్ని, భాషనూ తుత్తునియలు చేసి కొత్త భాష, కొత్త డిక్షన్ , కొత్త ఆలొచనల పద సామగ్రి కనుక్కొన్నారు ధాసల్ .
అమెరికా లో బ్లాక్ పాంథర్స్ ఉద్యమం ప్రేరణతో, మహరాష్ట్రలో 1972 లో దళిత పులుల ఉద్యమాన్ని (dalit panthers movement) ప్రారంభించి, ప్రదాన పాత్ర వహించారు. దళిత పులుల ఉద్యమం రాడికల్ రాజకీయాలని కార్యాచరణనూ సమర్థించి ఆచరించింది. 1973 లో గొల్పిత కవితా సంకలనం తో మరాఠీ సాహిత్యరంగం లో ఒక కెరటమై విరుచుకుపడి , పెను ప్రభంజనమై వీచారు. ఆయన రాసిన ఒక్కో పద్యం ఒక్కో డైనమైటై పేలింది. బ్రాహ్మణ వాద, మను వాద సంప్రదాయాల్ని, సంకెళ్ళనీ , కట్టుబాట్లనీ ధిక్కరించి దళితుల విముక్తి కోసం తన ప్రతి పద్యాన్ని అతి తీవ్రమైన పదజాలంతో, ఆగ్రహ భావావేశాల్తో ఆయుధాల్లా సంధించారు నామ్ దేవ్ ధాసల్. బొంబాయి నగరం లోని అట్టడుగు ప్రజానీకం కోసం నామ్ దేవ్ ధాసల్ తన కవిత్వాన్నీ రాజకీయ కార్యాచరణనూ అంకితం చేసారు.
కామాటిపురా రెడ్ లైట్ ఏరియా లోని వేశ్యల హక్కుల కోసం, జీవితం తమని శపిస్తే రోడ్డు పక్క ఫుట్ పాత్ లపై, రైల్వే స్టేషన్ లలో, చింపేసిన విస్తరాకుల్లా, ఆకలీ, పేదరికమూ, మాదక పదార్థాలకు అలవాటు పడిన బాల్యాన్ని అక్కున చేర్చుకున్నారు. నోరు లేని వారికి నోరిచ్చారు. ఆత్మలు అణచివేయబడి దోచుకోబడ్డ వారికి తన కవిత్వంతో ధిక్కార ఆత్మలనిచ్చారు. మరాఠీ మధ్యతరగతి వెసులుబాటు సుఖలాలసతకు, భద్రలోక జీవితపు విలువలకూ, అభిప్రాయాలకూ పెద్ద షాక్ ట్రీట్ మెంటు ఇచ్చారు నామ్ దేవ్ . మావోయిస్టు భావాలతోనూ కవిత్వం రాసారు. తన కవిత్వంతో దళిత సాహిత్యం లో వినూత్న సంతకం చేసారు. అనేక కవితా సంకలనాలను ప్రచురించారు ఆయన కవిత్వం ఆంగ్లం లో “Poet of the Underworld” అనే పేరు తో ప్రచురితమైంది.
అయితే దళిత పులుల ఉద్యమం యెక్కువ రోజులు కొనసాగలేకపోయింది.. 1980 ల కల్లా దళిత పులుల ఉద్యమంలో పగుళ్ళు ప్రారంభమైనయి. నామ్ దేవ్ దళిత ఉద్యమాన్ని ఇంకా విశాలం చేసి పీడిత ప్రజలందరినీ అందులో భాగస్వామ్యం చేయాలని ఆశించాడు. తన రాజకీయ కార్యాచరణ అట్లా ప్రకటించాడు కానీ అది మిగతా వారికి నచ్చలేదు. తమ ఉద్యమం కేవలం దళితులకే పరిమితం చేయాలి అని పట్టు బట్టారు. రాజకీయంగా చైతన్యమై విప్లవాత్మక ధిక్కారం ప్రకటించిన దళితులని మనువాద బ్రాహ్మణవాద పార్టీలు అనేక ప్రలోభాలకు లోను చేసినయి. ఒక తాత్విక, రాజకీయ యేక సూత్రత లేని దళిత పులుల ఉద్యమకారులు రాజకీయ పార్టీల అనేక కుట్రలకు బలై పోయారు. చెట్టుకొకరూ పుట్ట కొకరూ అయి పోయారు. నామ్ దేవ్ క్రమంగా మద్యానికి అలవాటు పడ్డాడు. ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. 1990 ల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ నామ్ దేవ్ కరుడు గట్టిన మనువాద బ్రాహ్మణ వాద పార్టే శివసేన లో చేరాడు. అందులోనూ ఇమడలేదు. అయితే యెప్పటికప్పుడు తన రాజకీయ తప్పిదాలను , మెరుపుల్లాంటి తన కవిత్వంతో , పిడుగుల్లాంటి తన రాతలతో మరిపించే వాడు. క్రమంగా అనారోగ్యం బారిన పడ్డాడు. 2007 లో చికిత్సకైన ఖర్చు భరించడానికి ఇల్లు అమ్మబోతే సినీ నటులు అమితాబ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ నిధులు సమకూర్చి నామ్ దేవ్ కు సాయపడ్డారు. . చివరి రోజుల్లో కాన్సర్ తొ బాధ పడుతూ ఆసుపత్రిలో కనుమూసారు.
రాజకీయంగా కొన్ని తప్పిదాలుగా చేసినా నామ్ దేవ్ సాహిత్యంలో చేసిన కృషీ , సాధించిన విజయాలూ అసమానమైనవి. కరుడు గట్టిన బ్రాహ్మణవాద మనువాద చాందస భావజాలాన్ని, దుర్మార్గాలని , సంకెళ్ళని సవాలు చేస్తూ ధికరిస్తూ అవి చిరకాలం నిలిచే ఉంటాయి. దళితుల విముక్తి కోసం నిరంతరం కలలు గని దళిత అస్తిత్వం కొరకు పోరాడిన గొప్ప విప్లవకవి నామ్ దేవ్ చిరస్మరణీయుడు! శ్రీ శ్రీ గురించి కాళోజీ “నువు రాసి పారేసిన కవితలు గుబాళిస్తుంటే నువు తాగి పారేసిన సారా సీసాల కంపు మాకెందుకు” అని అన్నారు. అది ఈ రోజు నామ్ దేవ్ ధాసల్ కి సరిగ్గా సరిపోతుంది.
పంజరమంత బలంగా యేమీ లేదు.
పంజరం లో పిట్ట ఆశ కోల్పోయి
ఆలోచనల్లో మునిగిపోయింది.
బయట గుంపులోంచి ఒక పావురం
పంజరంలోని పిట్టతో అందిలా ..
” మేము నిన్ను తప్పక చెర విడిపిస్తాం.
విధిలిఖితం అని చింతించకు
యెన్నడైనా విధి బందీ ఐన వారిని విడిపించిందా?
సిద్దంగా ఉండు –
నీ రెక్కలకు తుప్పు పట్టనీయకు
రేపు అనంతాకాశంలో అంతెత్తున రివ్వున యెగరాలి నువ్వు!”
—————————
ఆట
చూసాను అతన్ని
యెన్నో సార్లు తిరస్కరించాను
ఊరూరా తిరిగే నా శవం
ఈ సాయంత్రం వెలుగులో నిశ్చలంగా ఎదిరిచూస్తోంది
యెవడో తాగుబోతు దేవునికి ఫోన్ చేస్తున్నాడు
కుళ్ళి కృశించే జాలీ సానుభూతీ చూపకు నాపైన
బహుశా మన సంబంధం ముగిసిపోయిందేమో
బుజాల్ని విదిలించేయి దాన్ని వదిలించుకో
అట్లైనా,
ఈ నీళ్ళని
గొడ్డలి తో నరకగలుగుతావేమో!
—————————
ఒక నిశాచర ముళ్ళపంది విశ్రమిస్తోందిక్కడ
ప్రలోభపెట్టే బూడిద పుష్పగుచ్చం లా!
వంటినిండా శతాబ్దాల సిఫిలిస్ పొక్కులతో …
తన కలల్లో తానే కోల్పోయి
కాలాన్ని క్రూరంగా తరిమేస్తుంది.
మనిషి నోటి మాట పడిపోయింది.
తన దేవుడు బేదులు పెట్టిన అస్తిపంజరం.
ఈ శూన్యానికో గొంతు దొరుకుతుందా ,
ఒక మాటవుతుందా ఎప్పుడైనా?
నీక్కావాలనిపిస్తే దానిమీద ఒక ఇనుప కన్ను వేసి చూడు
దానిలో కన్నీటి చుక్క ఉంటే దాన్ని గడ్డకట్టించు! కాపాడు!!
దాని చూపులు నిన్ను సమ్మోహనం చేసి
పిచ్చి ఉన్మాదం లోకి నెట్టేస్తాయి
ముళ్ళపంది హఠాత్తుగా నిద్రలేచి
నిన్ను యెక్కుపెట్టిన పదునైన ముళ్ళతో వెంటాడి
వొళ్ళంతా తూట్లు పొడిచి గాయపరుస్తుంది.
రాత్రి తన పెళ్ళికొడుకు కోసం సిద్ధమవుతూంటే
గాయాలు పుష్పిస్తాయి
అనంత పుష్ప సముద్రాలు పొంగిపొర్లుతాయి
నెమళ్ళు నాట్యం చేస్తాయి
ఇది నరకం
ఇది సుళ్ళు తిరిగే భయంకర మృత్యుగుండం
ఇది వికారమైన వేదన
ఇది గజ్జెలు కట్టి నాట్యమాడే నొప్పి.
నీ చర్మాన్ని వదిలేయి.
వేర్ల నుండీ నీ చర్మాన్ని వలిచేయి.
ఈ విషపూరితమైన శాశ్వత గర్భాలు విచ్చిన్నం కానీ!
ఈ స్పర్శ కోల్పోయిన మాంసపు ముద్దకు అంగాల్ని మొలకెత్తనీకు!!
ఇదిగో దీన్ని రుచి చూడు
పొటాస్సియమ్ సయనైడ్ !
నువ్వు మరణిస్తున్నప్పటు క్షణంలో
వెయ్యోవంతు లిప్తలో
పాతాళంలోకి కుంగిపొతున్న నీ ప్రాణపు రుచిని రాయి!
రాండ్రి!
మృత్య్వుని రుచి చూడాలనుకున్న వాళ్ళంతా
విషపు రుచి ఉప్పనో పుల్లనో తెలుసుకోవడాని
ఇక్కడ క్యూ కట్టుండ్రి!
మృత్యువు ఆవృతమౌతుందిక్కడ
కవిత్వపు పదాల్లాగే …..
కొంచెం సేపట్లో కుంభవృష్టి కుర్వబోతోంది!
ఓ కామాటిపురా!
అన్ని రుతువులని నీ చంకలో బంధించి
బురదలో
కూలబడి ఉంటావలా!
నా వ్యభిచారాల సుఖాల్నన్నింటినీ దాటి
యెదిరిచూస్తాను
ఈ బురదలో
నీ పద్మం వికసించడం కోసం!
–నారాయణ స్వామి వెంకట యోగి
మీరు రాసిన వ్యాసం బాగా నచ్చింది.నామదేవ్ ను గురించి తెలుసుకుంటూ ఉంటే నాకు కలెకూరి ప్రసాద్ గుర్తుకొచ్చాడు .