ఈ తృతీయ సహస్రపు గుమ్మంలో నిలబడి మనం, గడిచిన రెండు వేల ఏళ్ల మానవ చరిత్ర లో లెక్కకు అందుతున్న, కనీసం వెయ్యేళ్ళ తెలుగు భాషా వికాస చరిత్ర ను క్రమబద్ధీకరించుకోవలసిన అవసరం ఉన్నది. గడిచిన శతాబ్దాల భాషా వికాసం, సంస్కృతి సాహిత్యం లోనే లభ్యమవుతుంది. అందువల్ల ఈ వెయ్యేళ్లలో తెలుగు భాష ఎటువంటి వికాసాన్ని పొందుతూ వచ్చిందో, పరిశోధనల ద్వారా నమోదు చేస్తూ ఒక బృహత్కోశాన్ని మనం తయారు చేసుకోవడానికి కావలసినంత కాలమూ గడిచింది. తగ్గ వనరులు కూడా ప్రభుత్వ శాఖల వద్ద ఇప్పుడు ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలలో వున్న ఒక భావన ఏమిటంటే తగు సూచనలు, ప్రణాళికలు ప్రతిపాదనలు గా రావడం లేదన్నది , వస్తే గనక భాష విషయంలో లోతైన పరిశోధనలకు మద్దతు, నిధుల కొరత లేదు అని సంబంధిత అధికారులు తెలియచేస్తూ ఉన్నారు.
అనేక తత్సమ పదాలతో కలిసి, ఆఛ్చిక పదాలుగా తెలుగు పదాలు,మొదటి నుంచీ ప్రతి కవి వాడుకలోనూ వున్నాయి. ఇందుకు నన్నయ నుంచి, నన్నెచోడుడి నుంచి మొదలు పెట్టి, ఈ ఇరవయ్యో శతాబ్దం దాకా తెలుగు ఎలా వికాస పరిణామాలు చెందిందో ఒక పెద్ద ప్రాజెక్టును మన తెలుగు సాహిత్య, భాషా పరిశోధక సమాజం రూపకల్పన చేసుకుని ఆచరణలోకి తీసుకురావలిసిన అవసరం వున్నది.
ఇప్పుడు ఇటువంటి కృషి ప్రధాన కార్య క్షేత్రం గా, ఇంతకు ముందు లేనటువంటి సంస్థలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రాచీన భాష ప్రాతిపదికన మైసూరు లో ఏర్పడిన ప్రాచీన భాషా విశిష్ట అధ్యయన కేంద్రం ఒకటి. ఇది తెలుగుకు ప్రాచీన భాష హోదా ప్రకటించాక ఫలస్వరూపం గా ఏర్పడిన సంస్థ. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఏర్పడి ఉన్న సందిగ్ధతల దృష్ట్యా కూడా ఈ సంస్థ “సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్”, మైసూరు, ఆధ్వర్యం లో పనిచేస్తున్నది. ఈ ప్రాచీన హోదా వల్ల తెలుగు భాష వికాస పరిశోధనలకు కావలిసిన నిధులను కూడా ఈ సంస్థ ద్వారా మనం పొందగలము. ఆలాగే కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ, నిర్వహించే భాషా అభివృద్ది సంఘం లో తెలుగు భాష తరపున ఇప్పుడు ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
ఒకప్పుడు ఈ ప్రాచీన భాషా హోదాలు, దాని వల్ల ప్రత్యేక కేటాయింపులుగా నిధులు, వనరులు, వసతులు అందుబాటులో లేవు. ఇవాళ ఇవి ఏర్పడ్డాక, మన తెలుగు సాహిత్య, విద్యావంత సమాజం తగు లక్ష్యాలను ఏర్పరచుకుని ఈ సంస్థల ద్వారా నిధులు పొంది, తగు కృషి చేయగలిగిన మంచి సందర్భం ఇది. ఇందుకై మనం ఒక బృహత్ ప్రణాళిక గా ఈ వెయ్యేళ్ళ తెలుగు భాషా వికాస స్వరూపాలు ప్రాజెక్టును ఈ సంస్థల ఆమోదం తో, పలు విశ్వవిద్యాలయాలలోఆయా శాఖల ద్వారా, తదితర సాహిత్య రంగ పరిశోధకులకు గ్రాంటులు గా నిధులు కేటాయింపులు పొందడం ద్వారా పెద్ద యెత్తున మొదలు పెట్టాలిసిన అవసరం, సందర్భం కూడా ఇప్పుడు ఉన్నాయి.
ఈ బృహత్కోశం పని మూడు భాగాలుగా మూడు దశలలో జరగవలిసి వుంటుంది. ప్రతీ కవి తన రచనలో భాగం గా ఎన్నో కొన్ని ( కొద్దిగానో, ఎక్కువ గానో) తెలుగు పదాలను వాడి వుంటాడు అనేది ఒక స్పష్టమైన అంశం. ఆ పదాలు ఆనాటి సమాజంలో వాడుకలో వుండడానికి ఎన్నో కారణాలు వుంటాయి. ఈ వెయ్యేళ్ళ కాలాన్ని, తలా వంద ఏళ్లుగా కాల విభజనలు చేసి కవి పరంగా, కావ్య పరంగా ఈ తెలుగు మాటలు ఎలా కాల ప్రవాహంలో సాహిత్య రూపేణా నమోదు అవుతూ వచ్చాయో గమనిస్తూ పరిశీలనలు, పరిశోధనలు చేయడం ఒక భాగం కావాలి.
ఈ పది శతాబ్దాల తెలుగు భాషా వికాస స్వరూపం గురించి ఒక ప్రాధమిక రూపం ఏర్పాడ్డాక, ఆయా కావ్యాలు , కవుల కాలపు రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిస్థితుల ప్రభావం ఎలా ఈ రచనలలోని పై లేదా కవుల పై పడ్డదో ఒక ప్రత్యేక కృషి గా రెండో దశలో మరో పది విభాగాలు గా విస్తార అధ్యయనాలు జరగాలి.
చివరి భాగం గా ప్రతి కవి, కావ్యం పరంగా తెలుగు భాషకు తన కాలంలో తన రచనలలో పొందు పరుస్తూ వచ్చిన తెలుగు ఆచ్చిక పదాల జాబితా ( ఆఛ్చిక పద కోశం), ఆయా పదాలు తెలుగు భాష లోకి వచ్చి చేరిన క్రమం గురించి వివరణలు కూడా చేరిస్తే ఇదొక సమగ్ర భాషా వికాస స్వరూప గ్రంధంగా తెలుగు వారం తయారు
చేసుకోగలుగుతాము.
కన్నడ దేశంలో ఇన్ఫోసిస్ సంస్థ కు చెందిన నారాయణమూర్తి గారు “ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా” పేరిట భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని అనువాద ప్రచురణలు గా తీసుకొచ్చే ముఖ్యమైన పనిని అంతర్జాతీయ స్థాయిలో చేపట్టారు. ఒక పేజీ లో మూల రచనా పక్క పేజీలో అనువాదం ప్రచురించడం పధ్ధతి గా అనేకమంది మన దేశ, విదేశాల పండితులు భారతీయ సంస్కృతి సాహిత్య రంగాలలో కృషి చేసే వారు ఈ అనువాదాలు, ప్రచురణల ఖరారు చేసే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మనం కూడా ఇవాళ ప్రభుత్వ శాఖలు, రాష్ట్రంలో గల అనేక మండి వ్యక్తులు, సంస్థలు, రామోజీ ఫౌండేషన్ వంటి ఉన్నత వేదికలు అందరం కలిసి, మన వెయ్యేళ్ళ తెలుగు భాషా వికాస స్వరూపాలు, ప్రాజెక్టు కు కొన్నియేళ్ళు పట్టినా సరే ఇప్పుడే ప్రణాళికా బద్ధంగా సంకల్పించడం అవసరం.
దీనికి తగిన ఒక ప్రాధమిక అవగాహనా సదస్సు విశాఖపట్నంలో నిర్వహించడం ఒక ప్రతిపాదన. ఇందుకు తగిన పూర్వ భూమిక ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వున్నది. 1931 లో పండిత రాధాకృష్ణన్ ప్రారంభించిన తెలుగు శాఖ , రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో కెల్లా మొదట గా ఏర్పడ్డది. ఆచార్య తోమాటి దొణప్ప, బూదరాజు రాధాకృష్ణ ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య చేకూరి రామారావు , ఒకప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్ధులే. దొణప్ప ఆరంభించిన
ప్రాజెక్టును ఆచార్య లకంసాని చక్రధరరావు ఒక్కచేత్తో, పూర్తిచేసి ఏడు భాగాల తెలుగు పదాల వ్యుత్పత్తి కోశాన్ని జాతికి అందించారు.
కేంద్ర ప్రభుత్వ భాషాభివృద్ధి సంఘంలో సభ్యులు గా వున్న ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, మన ప్రాతిపదికల మేరకు తీసుకునే చొరవ ఫలించి , మైసూరు లోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆమోద, సహాయ సహకారాలు మన ప్రాజెక్టుకు లభించి , రాష్ట్రంలోని ఇతర పెద్దలు, ఫౌండేషన్ల పూనిక తో, ఇప్పుడు తెలుగు భాషకు ఒక మంత్రిత్వ శాఖ ను కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపధ్యంలో మనం స్పష్టమైన లక్ష్యాలతో, ఒక కార్యాచరణ పత్రంతో, చైతన్యవంతమైన సాహిత్య సాంస్కృతిక సమాజం గా ముందడుగు వేయవలసిన తరుణం ఇది అని గుర్తు చేస్తూ, ఇందుకు అందరు పెద్దల నుంచి ఈ ప్రాజెక్టు సుసాధ్యమయే దిశలో ఆచరణాత్మకమైన సలహాలు, సహాయాలు, మార్గ దర్శకాలు లభిస్తాయని ఆశిస్తున్నాను.
-రామతీర్థ