పిడికెడు పక్షి..విశాలాకాశం

417671_580561545289734_1052452842_n

పిడికెడు పక్షి.

తలపైకెత్తి చూచింది.యాభైరెండు ఫీట్ల ఎత్తైన దేవదారు వృక్షం పైనున్న తొర్రలోని తన గూడునుండి.విశాలమైన ఆకాశం నీలంగా..నిర్మలంగా కనబడింది.

కొత్తగా మొలచిన రెక్కలు.ఎంకా ఎగరడం తెలియని ఉత్సుకత.లోపల ఏదో తెలియని ఉద్వేగం.

చిన్ని కళ్ళతో తల్లిముఖంలోకి చూచింది.

తల్లి పక్షి కళ్ళనిండా శూన్యం.అభావం నిండిన ఒట్టి ఖాళీ.

తల్లిపక్షి కిందికి చూచింది.చాలా కింద,నేలపైన మగపక్షి సిద్ధంగా ఉంది.మెత్తని ఈకలు,పీచు,గడ్డి,ఆకులు..అన్నీ అమర్చి ఎదురుచూస్తోంది.పిల్లపక్షి ఒకవేళ ఎగరలేక కిందపడితే గాయపడకుండా ఉండడానికి.

తల్లి బిడ్డపక్షి ముక్కులోకి తన ముక్కును జొనిపి ముద్దాడింది.

రెండురకాల కిచకిచల ధ్వని.ఎడబాటు..వియోగం..బాధ..దుఃఖం..అన్నీ ఆ చిరుధ్వనిలో.

తల్లి తన స్వరసంకేతంతో కింద ఉన్న మగపక్షిని హెచ్చరించి అకస్మాత్తుగా పిల్లపక్షిని కిందికి నెట్టేసింది.

శిశుపక్షి కిందికి జారుతూ..ఉక్కిరిబిక్కిరౌతూ..పల్టీలుగొడ్తూ..అప్రయత్నంగానే అప్పటిదాకా మొలిచిన నునురెక్కలను విప్పి..చాచి..రిక్కించి.,

ఎగిరింది. మొట్టమొదటిసారిగా.

pidikedu

ఆశ్చర్యపోయిందది.తనింకా కిందికి జారిపోవడంలేదు.కాగా,పైకిలేస్తోంది.పైకి..ఇంకా పైపైకి.గాలిలో తేలిపోతూ.చెట్ల గుంపుల్లోనుండి,అడవిలోనుండి,నదులపైనుండి..విశాలనీలాకాశంలోకి.

చుట్టూ చూచింది.అన్నీ మేఘాలే.నీలిరంగు.చల్లగా.బంగారురంగు కాంతి.ఎటుచూచినా అనంతమైన నీలి.నిర్మలంగా.

పులకించిపోయింది పిడికెడంత పక్షిపిల్ల.

శిశుపక్షి సువిశాల అనంతాకాశాన్ని ఈదుకుంటూ పరుగెత్తుతోంది..మహానందంగా..పులకిస్తూ..గగనాన్ని జయిస్తూ.

తల్లిపక్షి అలా శూన్యంగా చూస్తూనేఉంది ఎగిరిపోతున్న బిడ్డ కనబడుతున్నంతసేపు.కనుమరుగయ్యేదాకా.

రెక్కలు రావడం..అందర్నీ విడిచి ఎగిరిపోవడం..జీవపరిణామంలో ఒక అతి సహజభాగంగా గుర్తిస్తూ.,

తల్లిపక్షి చెట్టు గూడులో మిగిలి.,

 

*                                                 *                                                                  *

 

తల్లిదండ్రులు లేని పిల్లలను అనాధలంటారుగదా.

అనాధలుకాని పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నదేమిటి.సంరక్షణ.ఆలనాపాలనా.ఇలా జీవించు.ఇలా ఆలోచించు.ఇవి విలువలు.ఇవి కావు.ఇది తప్పు.ఇది సరియైంది.ఇది నైతికం..ఇది కాదు.ఈ  దారిలోవెళ్తే బాగుపడ్తావు..ఈ దారిలోవెళ్తే జారిపడ్తావు.ఇవన్నీ చెప్పేవాళ్ళు తల్లిడండ్రులుగదా.పిల్లలకు ఇవేవీ చెప్పనివాళ్ళుకూడా తల్లిదండ్రులేనా.బాధ్యతారాహిత్యంతో పిల్లలను బలాదూర్ గా జన్నెకిడిచిపెట్టే తల్లిదండ్రులను సమాజం ఎలా అర్థంచేసుకోవాలి.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వమంటే ఒక కుటుంబానికి తల్లిదండ్రులవంటిదికదా.కుటుంబంలో పిల్లలు ఏమి చదవాలి.ఎక్కడ చదవాలి.ఎలా చదవాలి.ఏ వృత్తిలో స్థిరపడ్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది..ఇవన్నింటినీ   మార్గదర్శనం చేస్తూ తన ప్రజలను సరియైన దిశలో నడిపిస్తూ ప్రగతిపథంలో ముందుకు తీసుకుపోవలసిన గురుతర బాధ్యత ప్రభుత్వాలదేగదా.

కాని ఏం జరుగుతోందిక్కడ.

అసలు ప్రజలను పట్టించునే నాధుడున్నాడా.కనీస ప్రజావసరాలేమిటి.విద్య,వైద్య,ఉపాధి వంటి కీలక రంగాల్లోనైనా కనీస శ్రద్ద ఉందా ఏ నాయకుడికైనా.లక్షలకు లక్షలమంది యువకులు ఒట్టిగా బేవార్స్ గా రోడ్లవెంట తిరుగుతూ మెలమెల్లగా అసాంఘికశక్తులుగా మారుతూంటే చూచి పట్టించుకునే వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఉందా.అసలు ప్రజాసంక్షేమ దృష్టితో ఆలోచించి జనాన్ని కన్నబిడ్దలవలె కనీసవసతులతో అభివృద్దిచేయాలనే సంకల్పం ఉందా ఏ ఒక్కరికైనా.పూర్తిగా నీతిహీనమైపోతున్న ఈ వర్తమాన రాజకీయ వ్యనస్థను ఎవరు ఎలా సరిచేయాలి.

ప్రజలు అనాధలౌతూ,పాలకులు కోట్లకు పడగలెత్తుతూ,ఎల్లెడలా బాధ్యతారాహిత్యం విషవలయమై ఆవరించిఉన్న ఈ ప్రస్తుత సంక్లిష్ట సందర్భంలో తమతమ విధులను నిర్వర్తించవలసిన వాళ్ళు నిర్వర్తించనపుడు..ఏంచేయాలి.

pidikedu-image

     ఎవరోఒకరు..ఇపుడే ఇపుడు అని చొచ్చుకురాకుంటే ఈ అరాచక విధానం ఇలాగే కొనసాగుతుందిగదా.

ప్రతి ప్రజాప్రతినిధీ ఒక వ్యాపారి.ప్రతి అధికారీ ఎవరో ఒకరికి భృత్యుడు.ప్రతి పౌరుడూ ఒక పరాన్నభుక్కు.ఎవరికందిందివాడు ఎగబడి ఎగబడి దోచుకుతినడమే.అంతా నిస్సిగ్గు ప్రవర్తన.నిర్భయమైన విచ్చలవిడి దోపిడీ.అంతా బహిరంగ దురాక్రమణలే.అన్నీ మాఫియాలు.భూ మాఫియాలు.ఇసుక మాఫియాలు.విద్యారంగ మాఫియాలు.మీడియా మాఫియాలు.మెడికల్ మాఫియాలు.వెరసి ప్రజాజీవన రంగాలన్నీ మాఫియాలే.  ప్రజలేమో ఏది ఉచితంగా ఇస్తే దాన్ని ఎగబడి తీసుకునేందుకు సంసిద్ధులౌతూ..కలర్ టి వి లు,లాప్ టాప్ లు,గ్రైండర్లు,మిక్సీలు,ఉచిత బియ్యం.ఉచిత విద్యుత్..ఏదైనా.

ప్రజలకు ఏది అవసరమో అది చెప్పక,ఏది అవసరమో అది చేయక,ఏవి అవసరంలేదో వాటినిమాత్రం చేయిచాపితే అందేంతదూరంలో ఉంచి..చుట్టూ ఒక మాయ.ఒక ఉచ్చు.ఒక మత్తు.

ప్రతి ఇంట్లో ఒక దీర్ఘచతురస్రాకార రూపంలో ఒక ఉరిత్రాడు.అది టి.వి.జనాల్ని బానిసల్ని చేసి ముఖ్యంగా ఆడవాళ్ళ పని గంటల్ని బుగ్గిపాలు చేసేది.మనుషుల్ని పశువులవలె కోట్లక్కోట్లకు వేలంవేసి కొని ‘క్రికెట్’ పేరుతో లక్షలమంది యువజనాన్ని అనుత్పాదక శక్తులుగా మారుస్తూ ఒక నిరంతర విషక్రీడను ఈ దేశప్రజలపై రుద్దుతూ ప్రభుత్వాలే జూద వ్యసనాన్ని నల్లమందు వాడకాన్ని అలవాటు చేసినట్టు అందిస్తూ,ఏ టి వి చానెల్ ను చూసినా ఒంటిపై బట్టలతో రతిక్రీడ సలుపుతున్న నీచ భంగిమలతో..జుగుప్సాకరమైన శృంగార ప్రసారాలతో..దిక్కుమాలిన నిరంతర రాజకీయ చర్చలతో,ప్రసారాలతో..నీతిహీనమైన రాజకీయ వ్యభిచార ప్రస్తావనలతో..ప్రజలను తప్పుతోవపట్టించే తాయెత్తుల,రుద్రాక్షల,కేశాల,దేవతుల వ్యాపార ప్రకటనలతో..డబ్బిస్తేచాలు ఏ ప్రకటననైనా ప్రసారం చేస్తాం అన్న బాధ్యతలేని దుర్మార్గ చానెల్స్..ఇవన్నీ అవసరమా అసలు ఈ ఎనభైశాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన జనమున్న దేశంలో.

అన్ని రంగాల్లోనూ అతి.మనుషులకు అతి స్వేచ్ఛ..అతి ప్రవర్తన..అతి విశృంఖలత్వం..పిల్లలపై అతి గారాబం.అతి సంపాదన దాహం..అతి అధికార దాహం.అతి విజృంభణ..ఈ దేశంలో..ఎక్కడో ఏదో పట్టాలు తప్పుతున్న స్పృహ.శ్రీశ్రీ చెప్పినట్టు ‘కొంతమంది యువకులు పుట్టుకతో వృద్దులౌతున్నట్టు ‘ అనుభవాలు.పూర్తిగా మృగ్యమౌతున్న దేశ స్పృహ..దేశభక్తి..పౌర,సామాజిక బాధ్యతల చింతన.అసలు ఏ ఒక్కరిలోనూ కానరాని ‘అందరికోసం ఒక్కడు..ఒక్కరికోసం అందరు ‘భావన.ఎలా.?

ఎవరో ఒకరు ముందుకు రావాలి.ధైర్యంగా ముందుకు దూకి పరిస్థితుల్ని చక్కదిద్ది ఒక నూతన ఉజ్జ్వల నాయకత్వంతో మళ్ళీ కొత్త సమీకరణాలను రూపొందించి కొత్తదారిని వేయాలి.

అందుకే..ఈ సమావేశం.సరికొత్త ప్రయోగం.తప్పుచేస్తున్న మనిషిని నిలదీసి సమాజమే ప్రశ్నించడం ప్రారంభిస్తున్న ఒక కొత్త దిశ.

రాజరాజనరేంద్రాంధ్ర గ్రంథాలయం.కుర్చీలో నారాయణ.పద్మభూషణ్.కవి.తన కవిత్వంతో గత నలభయ్యేళ్ళుగా ప్రజలను సమీకృతం చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రజాకవి.ఒకనాటి స్వాతంత్ర్య సమరయోధుడు.ప్రక్కన అటు..ఇటూ ఇంకో ఐదుగురు సచ్ఛీలతను కలిగిన నిష్కలంక రచయితలు.అందరికీ ఆదర్శనీయులు .తనకంటూ స్వంత ఆస్తి ఏదీ లేనివారు  .

ప్రజలచే ఎన్నుకోబడని శాసకుడు రచయిత..అని ప్రవచించే శుద్దమానవుడు.

వారంక్రితం ఒక ప్రజా సంఘటనను ఏర్పాటు చేశాడు  నారాయణ .పదిమంది రచయితలు..ఐదారుగురు ప్రముఖ పత్రికా విలేఖరులు..మూడు శక్తివంతమైన టి వి చానళ్ళు..ముందు విజ్ఞులైన ప్రజలు.ప్రత్యేక ఆహ్వానితులుగా కలెక్టర్.ఎస్పీ.ఇప్పుడు విచారించే సమస్య తాలూకు ప్రభుత్వ అధికారులు.ఎస్ ఇ రోడ్స్ అండ్ బిల్డింగ్స్..క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్..మొదలైనవాళ్ళు.

రెండురోజుల క్రితం చింతలపల్లి దగ్గర కడుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అకస్మాత్తుగా కుప్పకూలి అప్పుడు ఆ దారిలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అప్పటికప్పుడే మరణించారు.  ఆగ్రహోదగ్రులైన ప్రజలు గుమిగూడి చేతికేది అందితే దాంతో విధ్వంసం సృష్టించారు.అక్కడున్న కాంట్రాక్టర్ తాలూకు యంత్రాలన్నింటినీ నాశనం చేశారు.వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేసి..తర్వాత అంతా మామూలే.కాంట్రాక్టర్ తానే పోలీసులకు లొంగిపోవుట..కోర్ట్ కేసు.రిమాండ్..పత్రికల్లో సంతాప వార్తలు.లోకల్ రాజకీయ నాయకుల సందర్శనలు.ఎక్స్ గ్రేషియా హామీలు..విచార ప్రకటనలు.

ఒక వారం తర్వాత అందరూ..అంతా మరచిపోయి..ఎవరిపనుల్లో వాళ్ళు.ఎవరి పరుగుల్లో వాళ్ళు.

సద్దు మణిగినతర్వాత..కాంట్రాక్టర్ మెల్లగా కలుగులోనుండి ఎలుకవలె..బెయిల్ పై విడుదలై.,

అప్పుడందింది ప్రజాకవి నారాయణ పంపిన ‘ప్రజావేదిక ‘పిలుపు కాంట్రాక్టర్ దేవసహాయానికి.

ప్రజావేదిక..పిలుపంటే జనశాసనంగా రూపొందించాడు నారాయణ.ఎలా అంటే..పిలుస్తున్నవాళ్ళు రవ్వంతకూడా మచ్చలేని నిఖార్సయిన మనుషులు.రచయితలు.రచయితలంటే ఒట్టి ఆదర్శాలు రాసి మరిచిపోయి ఆచరణలో ఎక్కడికో పారిపోయే దుర్మార్గులుకారనీ,మానవత్వానికి ఒక నమూనాగా నిలువవలసిన ఆదర్శమానవులనీ,అక్షరసేనానులనీ నిర్వచించి కూర్చాడు నారాయణ అటువంటి వ్యక్తులను ప్రత్యేకంగా ఎంపికచేసి.వాళ్ళందరికీ వాళ్ళకున్న నైతిక వ్యక్తిత్వమే ఎనలేని బలం.వాళ్ళకు తోడుగా శక్తివంతమైన మీడియా.ప్రెస్.పిలుస్తే రాకుంటే మర్నాడు ప్రజళ్ళోకి ఈ ఉల్లంఘనను నేరంకింద పరిగణించబడి నిందితుడు దోషిగా ఋజువగుట.మీడియాద్వారా సమాజంలో ఇజ్జత్ పోవుట.పరువు పోతుందని భయం.

నారాయణకు తెలుసు మనిషిని లొంగతీసే శక్తి కేవలం భయానికే ఉందని.

సామాజిక నేరాలను చేస్తూ,కోట్లకొద్ది ప్రజా ధనాన్ని స్వాహాచేస్తూ నేరస్థులు తప్పించుకు తిరుగుతున్నారంటే దానిక్కారణం ఆ నేరస్థున్ని ప్రజలమధ్య ఋజువుల్తోసహా నిలబెట్టి పశ్చాత్తాపపడేట్టు చేయకపోవడమే.ఈ దేశంలో ఒక్క నేరస్తుణ్ణి పట్టుకుని నిలదీస్తే వానితోపాటు ఇంకో పదిమంది నేరస్థులు బయటపడ్తారు.దాన్ని ఒక్కసారి ధైర్యంగా బట్టబయలు చేయగల్గుతే పరువు భయంతో ప్రతివాడూ తన నడవడిలో మార్పుతెచ్చుకుంటాడు.అదీ నారాయణ చేయదల్చుకున్న చికిత్స.

కాగా..ప్రజావేదిక పిలిచిన తర్వాత ఏ అధికారైనా హాజరుకాలేదంటే..అతనిక్కూడా ఏదో పాత్ర ఉందని జనమనుకుంటారని భయం.వణుకు.ఆ స్థితిని సృష్టించాడు నారాయణ.

ప్రజావేదిక ఏ శిక్షా వేయదు.కేవలం నేరాన్ని అంగీకరింపజేసి తలవంచుకునేలా చేసి బుద్ది చెబుతుందంతే.ఒక్కసారి ప్రజావేదికపైకెక్కినవాడు వీపుపై ‘దోషి ‘ ముద్రను వేయించుకున్నట్టే.ఎదురుతిరిగితే పత్రికలూ,మీడియా ఏకి పారేస్తాయి.దానికితోడు ‘సమాచార హక్కు ‘చట్టం కింద సంపాదించిపెట్టుకున్న వివరాలు ప్రశ్నించబడే మనిషిని గుక్కతిప్పుకోకుండా పరేషాన్ చేసి వదుల్తాయి.మనిషిని ‘పరువు ‘అనే సున్నితమైన శిక్షతో పరివర్తింపజేయుట.

ప్రజావేదిక..స్థాపనప్పుడే చెప్పాడు నారాయణ..తమ సంస్థ లక్ష్యం ప్రజాహక్కులకూ,ప్రజాధనానికి కాపలాకుక్కలా ఉండడమేనని.

కుక్క దొంగను చూడగానే మొరుగుతుంది.కండను పట్టి  చెండాడుతుంది. అంతే.

*                       *                          *

“దేవసహాయంగారూ చెప్పండి..ఎందుకిలా..పదిహేను కోట్ల ఫ్లైఓవర్ ప్రాజెక్ట్..పూర్తికాకముందే కూలిపోవుట..ఇద్దరు వ్యక్తుల నిండు ప్రాణాలు పోవుట.తప్పు చేసినందుకు మీకేమైనా పశ్చాత్తాపముందా..మీ ప్రాజెక్ట్ తాలూకు వివరాలన్నీ సమాచార హక్కు చట్టం కింద సేకరించినవి..ఇవిగో..ఇక్కడున్నాయ్.చెప్పండి.”

దేవసహాయం మౌనంగా తలవంచుకుని నిలబడ్డాడు.

చుట్టూ మూడు టి వి చానళ్ళ కెమరాలు రికార్డ్ చేస్తున్నాయి.విలేఖర్లు రాసుకుంటున్నారు.

అప్పటికే ‘ప్రజావేదిక ‘విచారణంటే ప్రజల్లో ఒక సంచలనాత్మక ఆసక్తి స్థిరపడింది.

“సర్..నేను సహజంగా నేరస్వభావమున్న మనిషిని కాదు.ఆ మాటకొస్తే ఈ సమాజంలో ఎవరూ సహజంగా నేరస్థులు కారు.డబ్బు సంపాదించాలనే కక్కుర్తి అందరికీ ఉంటుంది.ఐతే అవకాశాలు అందరికీ రావు.సుళువైన మార్గాలు ముందు పరుచుకుని ఉన్నపుడు ఏ మనిషైనా తప్పుచేస్తాడు.నా విషయంగాకూడా అదే జరిగింది.నిజానికి నేనిప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను.నా దుఃఖాన్ని బహిరంగంగా నిజాయితీగా పంచుకోవాలనుకుంటున్నాను.దయచేసి వినండి.”

పరివర్తన..మార్పు..ఆత్మక్షాళన.రియలైజేషన్.

“నేను ఈ ప్రాజెక్ట్ ను తీసుకునేనాటికి..అలాట్మెంట్ ఖర్చులు ప్రభుత్వ సెక్రెటరీలు..మాథ్యూస్ కు పదిహేను లక్షలు.సెక్రెటరీ ఫైనాన్స్ విఠల్ కు పదిహేను లక్షలు.జాయింట్ సెక్రెటరీ అలీహుస్సేన్ కు పదిలక్షలు..ఇంకా చిన్న చిన్న సెక్షన్ ఆఫీసర్లు..అంతా కలిపి పది లక్షలు.మన జిల్లామంత్రి తన గుండాలతో నాపై దాడి చేయించినపుడు భయంతో చేసుకున్న ఒప్పందంప్రకారం ఇచ్చిన మొత్తం ఒక కోటి.మంత్రిగారిపేరు మీకు తెలుసు కోమాకుల రాజేంద్రప్రసాద్. ముగ్గురు ఎమ్మెల్యేలు..రూలింగ్ పార్టీ జయలలితకు ముప్పై లక్షలు.ఇంకో ప్రక్క నియోజకవర్గ శాసన సభ్యుడు రుద్రరాజుకు ఇరవైఐదు లక్షలు.అప్పోజిషన్ పార్టీ ఎమ్మెల్యే రవికిరణ్ కు పన్నెండు లక్షలు.ఎస్ ఈ రామసుబ్బారెడ్డికి పదిహేను లక్షలు.క్వాలిటీ కంట్రోల్ ఇన్స్ పెక్టర్ జాకబ్ కు పది లక్షలు.ఎ ఇ లు బాలక్రిష్ణ,రామలింగం,వి క్టర్..వీళ్ళకు  మనిషికి ఐదు లక్షలు.ఎమ్మెల్యే కొడుకు వాసుకు వాడు తాగివచ్చినప్పుడల్లా ఇచ్చినై పదిహేను లక్షలు.ఇట్ల మొత్తం ఐదుకోట్ల నలభై లక్షలు లంచాలకే పోతే ఇక నేను ఏ ప్రమాణాలతో కట్టగలను ఫ్లైఓవర్ ను.తక్కువ స్టీల్,ఎక్కువ ఇసుక,నాసిరకం ఫినిషింగ్.ఇంప్రాపర్ క్యూరింగ్.నేను తెచ్చిన అప్పులకు కోటి వడ్డీ.మొన్న ఫ్లైఓవర్ కూలిన తర్వాత పోలీస్ డి ఎస్ పి రామచంద్రయ్యకు ఇచ్చింది ఐదు లక్షలు.బెయిల్ గురించి జడ్జ్ పట్టాభిరామయ్యకు ఇచ్చింది పదిహేను లక్షలు.వెరసి నాకున్న అప్పులు ఇప్పుడు..పదహారు కోట్లు.ప్రతినెలా కట్టవలసిన వడ్డీలు ఎనిమిది లక్షలు.ఈ లంచగొండి దేశంలో ఊబిలోకి దిగీ దిగీ..ఇక ఆత్మహత్యే శరణ్యమయ్యే స్థితి దాపురించి..”..దేవసహాయం గొంతు గద్గదమై..ఎక్కెక్కిపడి ఏడుస్తూ..కుప్పకూలిపోయాడు.

హాలంతా నిశ్శబ్దంగా..విషాదంగా.దేవసహాయాన్ని పీల్చుకుతిన్న మనుషుల పేర్లు మంత్రితోసహా..అధికారులపేర్లు..అన్నీ బట్టబయలౌతూ.,గంభీర సానుభూతి.

తప్పులు జరుగుతున్నాయి.కుక్క నిద్రపోతోందికాబట్టి దొంగతనం జరుగుతోంది.కుక్క దొంగ పెడ్తున్న బిస్కిట్లను తినడానికి అలవాటైంది కాబట్టి..చివరికి కుక్కా,దొంగా కలిసి యజమానినే కరిచి,కండలు పీకి ,చంపి.,

నాలుగేండ్లక్రితం యువ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధి ఒక విస్తృతమైన ప్రజా అధ్యయనం చేస్తూ కనుక్కున్న ఒక పరమసత్యాన్ని ప్రకటించాడు.అదేమిటంటే..”ఈ దేశంలో అవినీతి ఎంత పెరిగిపోయిందంటే..ప్రభుత్వం పేదల అభ్యున్నతికోసం ఒక రూపాయిని అందిస్తే వివిధ మధ్యవర్తి దళారులు తినీ తినీ చివరికి కేవలం ఐదు పైసలను మాత్రమే లబ్దిదారులకు మిగులుస్తున్నారు “అని.

పద్మభూషణ్ నారాయణకు ఆ జ్ఞాపకం ఒక ములుకులా వచ్చి గుండెల్లో దిగినట్టనిపించింది.

కలెక్టర్ వికలమైన మనసుతో హాల్ నుండి బయటికొచ్చాడు.. లోపల ఉక్కపోతగా అనిపించి.

అప్పుడు..బయట దర్వాజా దగ్గర ఒక పదేళ్ళ చిన్న పిల్లాడు ఒక ప్లకార్డ్ పట్టుకుని నిలబడి ఉండడం కనిపించింది.

అట్టపై రాసిఉంది.”దయచేసి మా తరానికికూడా కొద్దిగా మిగల్చండి ప్లీజ్”అని.

ఆసక్తిగా చూస్తున్న కలెక్టర్ వైపు ఎమ్మార్వో రఫీక్ “ఈ కుర్రోడు ఆ పద్మభూషణ్ నారాయణ మనుమడు సతీష్ సర్” అంటున్నాడు.

 

*                           *                               *

సరిగ్గా అప్పుడే పిడికెడు పక్షిపిల్ల తన కొత్తగా మొలిచిన చిన్ని రెక్కలతో విశాల వినీలాకాశాన్ని ఈదుతూ..జయిస్తూ వెళ్తూనేఉంది.

పక్షికి ఒక్క గూడుతప్ప ఏ ఆస్తీ ఉండదు.

దానికి ఒక ఆకాశం..ఒక పచ్చని చెట్టు..చాలు.

 – రామాచంద్రమౌళి

 

 

Download PDF

2 Comments

  • karuna says:

    పక్షికి ఒక్క గూడు తప్ప ఏ ఆస్థి వుండదు . దానికి ఒక ఆకాశం …. ఒక పచ్చని చెట్టు చాలు. .వర్తమాన సమాజం లో మనిషి ఈ విధమైన చింతన చేయగలిగితే రచయిత కోరుకుంటున్నట్లు …….. ఏ ఒక్కరి లోను కానరాని ;” అందరి కోసం ఒక్కడు ..ఒక్కరి కోసం అందరు .” భావన సాధ్యమేమో ..!

  • indira says:

    ఐ రీడ్ ది స్టొరీ విత్ గ్రేట్ ఫస్చినతిఒన్ విత్ ది వే ఇత్ బెగన్…శీర్ పోయెట్రీ తట్ మై హార్ట్ ఎంజొయెద్. ది వే ది లెస్సొన్ ఫ్రొం నేచర్ హస బీన్ మదె ది ప్రొలొగుఎ ఇస్ రేఫ్లేక్టివే అఫ్ దీపెర్ చొంచెర్న్స్ అఫ్ ది స్టొరీ-టెల్లర్…మాన్ ఇస్ నాట్ ఔత్సిదె నేచర్; మాన్ ఇస్ పార్ట్ అఫ్ నేచర్…ది డ్రైవింగ్ ఫోర్సు బెహింద్ ది స్టొరీ హస బీన్ స్తతెద్ ఇన్ సింపుల్ టర్మ్స్. వెన్ విల్ ఏర రెఅలిసె…? ఒన్స్ డన్, విల్ ఠిస్ డే లైట్ రాబరీ కంటిన్యూ…? హౌ కాంప్లెక్స్, హౌ ఫ్రిఘ్తెనింగ్ ఠిస్ ప్రాసెస్ అఫ్ ‘గ్రౌథ్’ …ముచ్ తో పొందర్…

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)