మొగుని రోగం !

పూరింట్లో తలుపుకడ్డంగా నీల్ల బాన , నవారు మంచం పెట్టేసి కుట్టుమిసను పట్టుకోని, బలంగా ఈడస్తా, యాడస్తా వుండాది  మల్లిక . ‘ముండాకొడుకు …ఆ పాడు సారాయి తాక్కుండా వుంటే ఎంత మరేదగా వుంటాడో … తాగినాడంటే అంత ఎదవై పోతాడు’ . పెండ్లైన మూడేండ్లు తాగేసొచ్చి దినామూ కొడ్తే గూడా యాపొద్దూ మల్లిక అడ్డం జెప్పలా . మత్తంతా దిగినాక మొగుడొచ్చి అడుక్కొంటే మూతి ముప్పై సొట్లు దిప్పి, నెత్తిన రెండు మొట్టి … నెత్తిన బెట్టుకునిందే గానీ, ఈదినానికి గూడా…వోన్ని ఒగ  మాట అనింది  ల్యా . సుట్టుపక్కలోల్లు మద్దెలో వొచ్చి మద్దిస్తానికి  కుచ్చుంటే గూడా మొగుడన్నేక  కొట్టడా … తిట్టడా  అని మరేదగా పొమ్మనే సిండాది  శానా తూర్లు . ఇప్పుడు యౌర్నన్నా పిల్సినా వోల్లింటి కల్లా తిరిగిమల్లి గూడా సూడరు . మీసావు మీరు సావండని తుపుక్కున మూసేసి పోతారు.

రెండ్నెల్ల నించి మొగుడ్నుంచి వొల్లు కాపాడుకోవాలంటే సచ్చేసావుగా వుండాది. ఎవురికన్నా సెప్పుకోవాలంటే మానంబోతా వుండాది. మొగుడూ పెళ్ళాలు కలిసేటప్పుడు జాగర్తగా వుండాలని పెద్ద డాకట్రు జెప్పినాడు. ఈడికేమో మందు లోపలికిబోతే వొళ్ళూ పై దెలవదు. బద్రంగా  లేకపోతే మొగుడికుండే  రోగం మల్లిగ్గూడ వొస్తుందని ఇవరంగా సెప్పినారు. అదేవన్నా సిన్నరోగమా. దుడ్డులేనోల్ల పాణం తీసేరోగం. మొగుడు కాలందీరిపోతే వుండే వొక బిడ్డిని ఎట్ట సమాలించాలో తెలీక అల్లాడిపోతా వుంది మల్లి. ఇంత మనేదలో వుంటే రాజుగాడికి ఈ వుపద్రం బట్టింది. సారాయితాక్క పోతే ఏ కబురైనా గెట్టిగా సెప్తే ఇంటాడు. తాగేస్తే ఇగ అంతే. నోరిప్పితే కొట్టనొస్తాడు.  మొగుడంటే యిష్టం లేగ్గాదు. బతుకంటే బయిం బట్టుకునింది మల్లికి. ఈపూట వోడ్ని పక్కలోకి రానీను గాక రానీనని వోట్టేసుకొని, బొళువుగా  వుండే మిసన్ని తలుపుకడ్డంగా ఈడ్సి పైటకొంగు తో కారే సెమటని తుడ్సుకుంట కింద కుచ్చోని అట్టా కన్నుమూసింది మల్లి.

 ***

సమర్తైనాక  రెండేండ్లు గూడా మల్లిక అమ్మగారింట్లో ల్యా . ఆబిడ్ని మల్లయ్య మావ కొడుక్కిచ్చి  ఉండూర్లోనే  పెండ్లి జేసేసినారు . రాజు దిట్టంగా ఉంటాడు . ముగ్గురి తిండి  వొకడే తింటాడు … ముగ్గురి పనీ వొకడే జేసేస్తాడు. కాలు కొంచెం అవుడు. కుంటోన్ని నేను జేసుకోనని మల్లి మొండికేస్తే ,  “గుడ్డి పోగోర్తాది..కుంటి రాగోర్తాది” అని బలవంతాన మల్లిని పెండ్లికి వొప్పించినారు. అవుడైతే ఆస్తులు కూడబెడ్తాడని పెండ్లైన ఆర్నెల్లు  మొగుడు మల్లిని వొదిలి పక్కకుబోలా. కడుపులో కొడుకు పడ్నాకనే మళ్ళీ రాజు పనికిబోయిండేది. ఈతూరి సేద్దిగం వొదిలేసి శానా దుడ్డు వొస్తాదని లారీ పనికిబొయ్ నాడు. వొగ తూరి  లారీ  ఎక్కితే మల్లీ రెండ్నెల్లు ఐనాంకనే పెడ్లాం బిడ్లను జూసేది.

లారీ పనికి బొయ్ నాక  మొదల్తూరి వొచ్చినప్పుడు బాగనే వుణ్ణాడు. దుడ్డు తెచ్చిచ్చి అంగిడికి  బొయ్యి ఒగ కోక దెచ్చుకో మన్నాడు . లారీ పని బాగుండా దని మల్లి గూడా సత్తెమ్మకు పొంగిలి బెట్టుకోనొచ్చి వూరంతా పెసాదం తలారొంత ఇచ్చి మొగుడుణ్ణె  పదైదు దినాలూ పండగ జేసింది . వోడు మల్లీ పనికిబోతాంటే దొక్కలోనుంచి దుక్కమోస్తాంటే గూడా యిన్ని నీల్లు బోసుకోని మింగేసి, బద్దరంగా పొయ్యిరమ్మని  లారీ యెక్కించి ఉత్త సేతుల్తో  ఇంటికొచ్చేసింది.

నిండునెల్లు  వొచ్చేటప్పిటికి మొగుని మాట వొదిలేసి సీమంతం  జేసుకొని అమ్మగారింటికి ఎలబారి పొయ్యింది. అటక మిందుండే కొయ్య వుయ్యాల దింపిచ్చింది . నూలుకోకలన్నీ జవిరి వైరుబుట్టిలో ఎత్తి పెట్టింది. పెద్దిల్లు పేడతో అలికిచ్చి, సుబ్బరంగా తెల్లసున్నం పుయిపిచ్చింది. మొగబిడ్డి పుడ్తిందో … ఆడబిడ్డి పుడ్తిందో అనుకుంటా నొప్పులకోసరం ఎదురుసూస్కుంటా కుచ్చునింది .

ఆరోజు మల్లిక్కి బాగా గెవనం వుండాది. తెల్లార్తో నుండి కొంచిం వొంట్లో నలతగా వుణ్ణిన్ది . సగించకుంటే గూడా కడుపులో బిడ్డి కోసరం కొంచిం వుప్పిండి దినేసి గడపమింద కుచ్చోని ఎగదీసుకుంటా వుణ్ణిన్ది. కడుపులో నొప్పి మొదులయ్యే టప్పిటికి  మంత్రసాన్ని తొడుకోనొచ్చింది వోళ్ళమ్మ. దీపం గూడులో కాయితం కింద ఎత్తిపెట్టిన బ్లేడు, ఉడుకు నీళ్ళు, పాత నూలుకోకలు మంత్రసానికి ఎత్తిచ్చింది. తొలి కానుపాయ…ఒగ రాత్రి ఒగ పొగులు అల్లాడిపొయ్యింది నొప్పుల్తో. ఆస్పిటల్ కి పోదారంటే మొగుడింట్లో లేకపాయె. మాలపల్లంతా ఒగచేతి మింద కానుపులు జేసిండే మంత్రసానిగ్గూడా బిడ్డి అడ్డం దిరిగి పోయిన్దేవోనని కాల్లూ సేతులూ ఆళ్లా. ధనియాల కసాయం దాపిచ్చి…కడుపుకు ఆందెం రుద్ది ఎట్టో వొగట్ట పువ్వాలుండే మొగబిడ్డిని బయటకు దీసేసింది. ‘నాబట్ట బిడ్డె …ఎంత ఏడిపిచ్చినాడు వోల్లమ్మను అనేసి ..మేయ్…ఇప్పుడే నీకొడుకు ఇట్ట ఏడిపిస్తావుండాడు …పెద్దయితే ఇంగేం జేస్తాడో’ అంటా వక్కాకు లో బెట్టిచ్చిన నూర్రూపాయలు దీసుకొని మంత్రసాని నవ్వుమొగం తో ఎలబారిపొయ్యింది.

ఇంత జరిగినా మొగునికి ఇవేమీ దెలీలా… పురిటికి గూడా రాలా.  ఇంత కస్టంలో మొగుడు పక్కన లేడని మల్లి శానా తూర్లు ఎవురికీ దెలీకుండా ఏడ్సుకునింది. పక్కలో బిడ్ను జూసుకుని మొగుని మింద కలవరాన్ని తగ్గిచ్చుకునింది. మల్లెప్పుడో ఒగనెలకు వొచ్చినాడు రాజుగాడు.  వొల్లంతా కాలిపోతా వుంది. వారం దినాల్నుంచి జొరమని జెప్పినాడు. ఏం దిన్నా వాంతులు ..బేదులు. లారీ పనికి బొయ్యేది మొదులు బెట్నాక గొంతుదాక సారాయి దాగే పని బట్నాడు. వొళ్ళు వూనమైపోతే గూడా సారాయి అంగిడికి బొయ్యేది ఇసిపెట్లా.  పక్కన పెద్ద పల్లిలో వుండే అరెమ్పీ డాకట్ర దెగ్గిరికి పొయ్యి సూదేసుకొని వొస్తే కొంచిం కుదురుకునింది వొల్లు.

అట్ట వొచ్చినోడు మూడ్నెల్లు ఇల్లు వొదల్లా.. కొడుకుతో ఆట్లాడుకుంటా వుండిపోయినాడు. మొగుడుంటే వొగపక్క సంతోసంగుంటే గూడా వోని తాగుడు జూస్తావుంటే మల్లిక్కు బయంగా వుండాది. సంపాయిచ్చుకొని వొచ్చిందంతా ఈమారి తాగేస్తా వుండాడే అని మనేద బట్టుకునింది. దాంతో బాటు రాత్రయ్యిందంటే వొల్లు బాగాలేదంటే గూడా యినకుండా పక్కకు రమ్మని ఒకటే సతాయిస్తావుండాడు. రెండో నెలకే ఈతూరి కడుపు నిలిచిపొయ్యింది. సంకలో బిడ్డి సంకలో ఉండంగానే కడుపులో ఇంగోటి. లారీ వోనరు పిలస్తావుండాడని కబురొచ్చినాక  వొదల్లేక వొదల్లేక యలబార్నాడు రాజుగోడు. బిన్నా వొస్తానని చెపేసి పొయ్ నాడు. వోడు పోతే సాలని సూసిన మల్లి కంట్లో నీల్లు రాలా ఈతూరి. మొగుడు అట్టబోగానే పక్కూర్లో వుండే ఆరెమ్పీ డాకట్రు దగ్గిరికిబొయ్యి కడుపుదీయించుకొని వొచ్చేసింది. మొగుడికివేమీ జెప్పలా.

పొయ్ నోడు …పొయ్ నోడు ఈ తూరి పదైదు దినాలు గూడా గాకనే తిరుక్కో నొచ్చేసినాడు. మళ్ళీ వొల్లు బాగలా. ఇట్ట మూడుదినాలకోసారి  పడవబడి పోయ్యేవోడి తో పనికి పంచేటని వోనరు ఇంగోసారి పనికి రావొద్దని ఇంటికొచ్చి ఎచ్చరించి  పొయినాడు. సారాయి  దాగేది నిలిపైమని ,  ఆ దరిద్దరపు తాగుడే వొల్లు పాడుజేసేస్తా ఉండాదని మల్లి రంపు బెట్టుకునింది. పనికి బొయ్యేదాని గురించి రాజుగానికిప్పుడు మనేదే లేదు. తెల్లారి లేస్తే వంక కాడుందే సారాయి అంగిడికి బొయ్యేది…తాగేసొచ్చి నోటికి ఎంత మాటొస్తే అంత మాటా అనేది… బండ మాట్లన్నీ మాట్టాడుకుంటా అరుగుమింద గుచ్చోనుండేది …మత్తు దిగిపోయినాక మల్లీ సందేళ కాడ ఇంగోతూరి సారాయంగిడికి బొయ్యొచ్చేది…వూరంతా రాజుగాడి మొకాన కారిమూస్తే గూడా వాడికి లెక్కలేకుండా వుండాది.  దీనికితోడు మూడూమూడ్రోజులకు జొరమొకటి. కొడుకుని అమ్మగారింటి దగ్గిర వొదిలేసి కూలికి బోతావుంది మల్లి.

శనారం మద్దేనం పినపెద్ద ఇచ్చిండే ఆర్నూరు రూపాయిలు దీస్కోని, మొగున్ని దొడుకోని తిరప్తి లో వుండే రుయాస్పత్రికి ఎలబారింది. వొల్లు కొంచిం కుదురుకుంటే ఎట్టోకట్ట పనిలో బెట్టేయాలని జూస్తావుంది మల్లి. ఆసుపత్రిలో రగతం పరీచ్చజేసేస్తే ఏం రోగమొచ్చిందో తెల్సిపోతుందని  డాకట్రు జెప్పినాడు. అట్నే అని రగతం ఇచ్చేసి, రెండ్రోజులు ఆసుపత్రి లోనే వుండిపోయినారు. మంగలారం కాయితాలు జూసి డాకట్రు జెప్పిన మాట ఇన్నాక మల్లికి నోట్లో మాట రాలా. అట్నే యాడస్తా కూలబడి పొయ్యింది. రాజుగాడు మాత్తరం ‘ యాడవద్దు మే … ఏం గాదులే. ఎప్పుడో ఒగప్పుడు పోవాల్సిందే గదా .. నా టయుము ఐపోయిందనుకో..పైకి లెయ్ ‘ అంటా జబ్బ బట్టుకోని మల్లిని పైకి లేపినాడు. వోల్లిచ్చిన మందులు తీసుకొని నెత్తీనోరూ కొట్టుకుంటా….నా బతుకు ఎందుకిట్టా అగ్గిబడి పోయిందాని యాడస్తా ఇంటికొచ్చింది . అందురూ… “ఆస్పత్రికి పొయ్యి వోచ్చినారు గదా? ఏవిజెప్పినార”ని అడగతా వుంటే సెప్పలేక మల్లికి బేజారుగా వుండాది.  నా మొగుడికి ఎయిడ్సని ఎట్ట జెప్పుకునేది. సెప్తే కడుపుకిన్ని నీల్లుబోస్తారా ఎవురైనా?

Mogani Rogam katha illustration

రోగం ఏందో తెలిసిపోయ్యినాక పదైద్దినాల నుంచి రాజుగాడు గొమ్మునే వుంటా వుండాడు. అప్పుడప్పుడు మల్లితో, కొడుకుతో కుచ్చోని యాడస్తా ‘నేను బోతే ఎట్ట బతకతారో!’ అంటా కుమల్తా ఉంటాడు.   మాయదారి జబ్బు రానన్నా వొచ్చింది… మనిషి మారిపొయ్యినాడులే అనుకునేలోపల వాడికి ఇంకో రోగం బట్టుకునింది. ‘నేను సచ్చిపోతే నాపెళ్ళాo ఎందుకు బతకల్ల? ఆ బిడ్డె ఇంగ ఎవుర్నన్నా పెండ్లి జేసుకునేస్తిందా? నేను లేనప్పుడు  వాల్లెందుకు వుండల్ల?’ మల్లి నీల్లు పట్టకచ్చే దానికి కొళాయి కాడికి పొయ్యినా, ‘ఎవుడితో ఏం మాట్లాడేస్తా వుందో’ అని బయిపడతా ఆబిడ్డికి కాపలా గాస్తా వుండాడు. ఎవుర్తో మాట్లాడ్నా,’ వాల్తో నీకేం పని?’ అని మల్లిని తిడ్తా కొడ్తా వుండాడు.

రోగం యాడ అంటుకునేస్తిందో అని రాత్తిరైతే దూరదూరంగా తిరగతా వుండే మల్లిని జూస్తే వాడి కోపమింకా ఎక్కువైపోతా వుండాది. మామూలుగా ఉండేప్పుడు కొడ్తే ఊరంతా వొగిటై పోతిందని బయిపడి, తాగేసొచ్చి కొడ్తా వుండాడు. ఈరోజెట్టయినా మల్లిని లొంగదీసు కోవాలని వాడుగూడా వొట్టేసుకున్నాడు.

తలుపులు కొట్టీ కొట్టీ రాజుగాడి బలం సచ్చిపోతా వుండాది. దాలముందరం కాడనే నిద్దర బొయ్యినాడు. తెల్లార్నీ … మొగుడి కతేందో జూద్దారని మల్లి గూడా నడిజాముకాడ నిద్దరబొయ్యింది.

  టయిము నాలుగైంటింది. ఈపు మింద ఎవురో కొట్టినట్టు నిద్దర మత్తు వొదిలిపోయ్యింది రాజుగాడికి. మెల్లిగా పైకి లేసి తలుపుసందులో నుంచి ఇంట్లోకి తొంగి సూసినాడు. మల్లి మంచి నిద్దర్లో ఉండాది. గెడేసేసి తలుపుకడ్డంగా సామాన్లు పెట్టేసిండాది. సిన్నంగా తలుపు పక్కన్నే ఉండే గూట్లో కాలుబెట్టి గుడిసె పైకి ఎక్కినాడు. మెల్లిగా మనిసి పట్టేంత బోద ఎత్తి పక్కన పెట్టేసి, ఇంట్లోకి దిగి మల్లిమింద పడ్నాడు. మల్లి తప్పించుకునేదానికి వోడు సందీలా. వాడ్నించి కాపాడుకోను తలుపుకడ్డంగా పెట్టిన సామాన్లన్నీ ఆరోజు మల్లి పాణం మీదికి తెచ్చినాయి. వోడ్ని కొట్టి, తిట్టి, సాపనార్తాలు బెట్టినా లొంగిపోక తప్పలా మల్లికి.

***

ఇంత జరిగిపోయ్యినాక బతికేం జెయ్యాలని గన్నేరు పప్పు తినేసి సచ్చిపోదారని జూస్తే కొడుకుని జూసన్నా దైర్నంగా ఉండమని వోల్లమ్మ పోరుబెట్టుకునింది. ఇప్పుడు రాత్తిరైతే మల్లికి బయిం లేదు.  మొగోడంటేనే కడుపుగాల్తా వుండాది. మొగుడ్నే గాదు…కొడుకుని జూస్తే గూడా. ఇట్టాంటి కొంపలో పెద్దోడై వాడెంత మంది కొంపలు కూలస్తాడో అని. మొగోడు కనిపిస్తే సాలు, దొరికిండే రాయి ఎత్తుకొని పిచ్చిదాన్లా తరుమ్కుంటా వుండాది.

ఇంగోపక్క ఆరోజు రాత్తిరి నించీ రాజుగాడికి నెత్తినుండే మూటబొళువు దిగిపోయినట్టుగా వుండాది. వొంట్లో ఉండే రోగం అప్పుటికప్పుడు మానిపోయినట్టు తేలిగ్గా వుండాది. ‘ఇప్పుడు నాపెళ్ళాం యాడికి బోతింది, ఎవుర్తో తిరిగితిందో జూస్తా…నేనెన్ని దినాలు బతికితే అన్ని దినాలు అది గూడా నాతో వుంటింది. నేను సస్తే నాతోగూడా సస్తింది. పిల్లోడిని  వోల్లవ్వ మొగోన్ని జేస్తింది’ అనుకుంటా వుండాడు. ఇన్నిదినాలూ వోడికుండే రోగాన్ని దాసిపెట్టుకొన్నోడు ఇప్పుడు పెళ్ళాం కొచ్చిన రోగం గురించి తోటి ఈడోల్లందరికీ జెప్పుకుంటా వుండాడు.

శెప్తేనే గదా పెళ్ళాం గురించి అందురికీ తెల్సేది…ఎవురూ దాని జోలికి రాకుండా వుండేది! అది సచ్చిపోయినా, పిచ్చిదై పొయ్ నా సరే… దానికి నా తర్వాత, నేను లేని బతుకక్కరలేదు.

jhansi papudesi    —ఝాన్సీ పాపుదేశి

(జర్నలిజం చదివి, తిరుపతి రిపోర్టరుగా ఆంధ్రజ్యోతి దిన పత్రికలో పనిచేస్తూ చివరిదాకా ఇదే నా వృత్తి అనుకున్న సమయంలో అనుకోకుండా  రిపోర్టరు ఉద్యోగాన్నే కాకుండా, సొంత రాష్ట్రాన్ని కూడా వొదిలి బెంగుళూరులో స్థిరపడాల్సి వచ్చింది.  వృత్తి ఏదైనా ప్రతి రచనకో ఆత్మ సంతృప్తిని పొందుతూ,  రాయడం ఆపకూడదన్న పట్టుదలతో రాస్తున్నా. బ్లాగుల్లో రాసుకుంటున్న నేను కొందరు మిత్రుల ప్రోత్సాహంతో ఇంటర్నెట్ పత్రికలకు పంపడం మొదలుపెట్టా. నా స్వస్థలం చిత్తూరు జిల్లా అరగొండ గొల్లపల్లె. మాండలికాలు మర్చిపోయి పుస్తక భాషకు మారిపోతున్న సమయంలో చిత్తూరు మాండలికంలో రాయాలన్న ఆలోచన వచ్చింది. అచ్చంగా నా వూరి భాషలో రాస్తున్నా. మహిళగా పుట్టినందుకు తోటి మహిళల జీవితాల్ని అందరితో పంచుకోవాలని అనుకున్నా. తొలి కథ “దేవుడమ్మ” సారంగ లోనే వచ్చింది.

email : papudesijc @gmail.com)

 

Download PDF

17 Comments

  • Sayilakshmi says:

    సారంగకు, ఝాన్సీ గారికి,

    అనేక రకముల మాండలీకములలో కధలు ప్రచురిస్తున్నారు, వ్రాస్తున్నారు. ఎవరు చదవటానికి? తెలుగు రాని వారు అంటే చదువుకోని వారు మాండలికములో చదువుతారా! చదవగలరా! తెలుగును పెంపొందించండి అని అంటూ మాండలికం నేర్చుకోవాలా? ‘దేశ భాష లందు తెలుగు లెస్స’ అన్న నానుడిని ‘దేశ భాషలందు తెలుగు తెగులు లెస్స’ యని వ్రాయాలేమో!
    పాఠశాల చదువులతో చక్కటి తెలుగు మాట్లాడు తున్నామని గర్విం చాలే కానీ నా పల్లె, నా ఊరు, నా వృత్తి అంటూ మాండలికానికి అక్షర రూపము ఇవ్వాలా ! దాని వలన ప్రయోజనము ఉందా! భాష మనిషిని బట్టి , ప్రాంతాన్ని బట్టి కొన్ని మార్పులు జనావళి సంభాషణలలో ఉన్నప్పటికి ఒక పద్ధతిలో పుస్తక బాషను పాఠ శాలలలో ప్రవేశపెట్టారు. ఆ భాషను గౌరవిస్తూ భావానికి అక్షర రూపము ఇవ్వాలి కదా! కొన్ని ఏండ్ల క్రితము ఉన్న పుస్తక (తెలుగు పండితుల బాష ) సామాన్యుడికి చదవటానికి అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ రోజుల్లో ఈ తరము వారికి కనీసపు తెలుగు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఇంక చదవడము సరేసరి. అటువంటప్పుడు చిత్తూరు బాష, సింగరాయకొండ భాష అంటూ వ్రాయాలా? ప్రతివారు చదివేటట్లు ఉండాలి కానీ ఎదో కొత్త బాష గా ఉండ కూడదు. ప్రకృతి వికృతి గా మారినపుడు సరిదిద్దాలి కదా! కాదు ఆ వెల్లువ లో కొట్టుకు కు పోవాలా?
    ‘కత్తి’ వ్రాసిన సినిమా విమర్శ విదేశి రంపపు మొనలతో నిండి ఉంది. తెలుగులో ఇంగ్లీషు, హింది, Urdu కలిపి
    మాట్లాడితే, వ్రాస్తే తెలుగు తల్లి ఏడవదా? మా తెలుగు తల్లికి మల్లె పూదండ …………

    ఝాన్సీ వ్రాసిన కధ సామాన్యముగా ఉంది. మాండలికం తప్పితే.
    మనస్సు కష్ట పెట్టుకోకండి. ఆలోచించి …….. చించి పార వేయకండి……. “సాయిలక్ష్మి”

    • సాయి లక్షి గారు,
      ప్రామాణికమనుకుంటున్న “వ్యావహారిక” తెలుగులో రాస్తే సౌలభ్యంగా ఉంటుంది అనేది అంగీకరించదగ్గ ప్రతిపాదనే అయినా, ‘ఇది మా వ్యావహారికం’ అనే అస్తిత్వ ఉద్యమాల నేపధ్యంలో విబేధించదగ్గది కూడా అనే నిజాన్ని గుర్తించడం అవసరం. వాదాలు,ఉద్యమాల సంగతి పక్కనపెడితే కథలోని విషయం, భాషని ఎన్నుకుంటుంది అనే సాధారణ ప్రాతిపదికని ఈ కథని చుద్దాం. ఒక గ్రామీణ మహిళ తన గోడు చెప్పుకుంటున్న విధానంలో ఉన్న నెరెటివ్ లో “నాగరీకమైన” భాషా ప్రయోగం యొక్క ఔచిత్యం ఎంత వరకూ ఉంటుంది? భాషని సంస్కరించుకుంటూ పోతే భావహననం కాదా?. ఇక్కడ రచయిత్రి ఉద్దేశం నిజాయితీగా వ్యక్తీకరించడం. అదే కథలో ఉన్న బలం. మీరు చాలా సాధారణం అనుకుంటున్న కథ ప్రాముఖ్యత సంతరించుకునేది అక్కడే. నామిని అయినా, ఝాన్సీ తమ ప్రత్యేకత చాటుకునేది అక్కడే.

      ఇక నేను రాసిన వ్యాసంలో ఇంగ్లీషు పదాల గుప్పించడం నేను మాట్లాడుతున్నట్టు రాయడమే తప్ప, నా ఆంగ్లభాషా పాండిత్యం చూపించడానికైతే కాదు. ఎందుకంటే ఆ శైలి చైతన్యస్రవంతికి దగ్గరగా ఉన్న శైలి. ర్యాంబ్లింగ్స్ లాగా ఉంటుంది. నా ర్యాంబ్లింగ్స్(వాగుడు) కొంచెం ఇంగ్లీషు, హిందీ, తెలుగు (వీలైతే తమిళం, కన్నడం,మళయాళం, బెంగాలీ కూడా) కలగలిపే ఉంటుంది. నా బలహీనత అది.

    • వెల్లంపల్లి అవినాష్ says:

      @సాయిలక్ష్మి గారూ
      మాండలిక రచనలను ఎందరో చదువుతున్నారు కాబట్టే, ఆ రచనలు చాలా విరివిగా రాస్తున్నారు, ప్రచురిస్తున్నారు.

      తెలుగు అంటే “పాఠశాల చదువులోని తెలుగు మాత్రమే” అని అత్యంత సంకుచితమైన పరిధిలో అర్థం చెప్పడం తప్పు. ఆ పాఠశాల తెలుగునే అందరూ రచనల్లో వాడాలి అనడం మూర్ఖత్వం. అన్ని ప్రాంతీయ మాండలికాలనూ, అన్ని సామాజిక మాండలికాలనూ కలిపే “తెలుగు భాష” అంటారు.

      పాత్రోచితమైన భాషను వాడడం వల్ల రచనలకు సహజత్వం వస్తుంది. చిత్తూరు నేపథ్యంలో వచ్చిన కథలోని చిత్తూరు పాత్రలు కృష్ణా గోదావరి జిల్లాల మాండలికం మాట్లాడుతుంటే పరమ చండాలంగా ఉంటుంది. ఒక పల్లెటూర్లోని చదువుకోని కూలీ మనిషి నగరపు శిష్టవ్యావహారికం మాట్లాడుతుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. దీని వల్ల ఒనగూరే లాభం లేకపోగా కథ అసలు ప్రయోజనం దెబ్బ తింటుంది.

      ప్రాచీన కావ్యాల్లో కూడా ఎందరో కవులు పాత్రోచిత భాషను వాడారు. పాత్రోచితమైన భాషను వాడితేనే సహజత్వం వస్తుందని భరతుడు “నాట్య శాస్త్రం”లో క్రీస్తుపూర్వమే చెప్పాడు. నన్నయ, తిక్కనాదుల రచనల్లో కూడా మాండలిక ప్రయోగాలూ, పాత్రోచిత భాషాప్రయోగాలూ ఉన్నాయి. ఇదేదో ఇప్పుడు కొత్తగా మొదలైన పద్ధతి కాదు, భ్రష్టత్వం అసలే కాదు.

      సాటి మనుషుల మాండలికాలనూ, సంస్కృతులనూ తెలుసుకోవడం ద్వారా తెలుగుజాతిలో మరింత సమైక్యతా, సోదరభావమూ ఏర్పడతాయి. మాండలికాలు అంతరించిపోతే, ఎన్నో అచ్చతెలుగు పదాలూ, ప్రయోగాలూ అంతరించిపోతాయి. మాండలిక రచనలు ఈ ప్రమాదం నుంచి భాషను రక్షిస్తాయి. భాషను రక్షించుకోవడంలో “మాండలికాలను రక్షించుకోవడం” కూడా ఒక భాగమే!

      “ప్రస్తుతం ప్రామాణికమని చెప్తున్న భాషలోనే రచనలు చెయ్యాలి” అని పస లేని పరిమితులు విధించుకోవడం వల్ల సాహిత్యానికి ఎట్లాంటి లాభమూ లేకపోగా చాలా నష్టాలున్నాయి.

      సాటి మాండలికాలను గౌరవించడం చేతకాని వారూ, ఇతర మాండలికాల్లో రచనను సహించలేనివారూ “తెలుగుజాతి తెలుగుభాష” అంటూ గంతులు వెయ్యడం అసహ్యంగా ఉంటుంది.

      వికృతులను సరిచెయ్యాలి అంటూ అసాధ్యమైన పనులు పెట్టుకోకండి. మనం వెళ్ళి “ప్రకృతులే మాట్లాడండి” అని పల్లెల్లో చెప్తే వింటారా? ఇది అసలు సాధ్యమయ్యే పనేనా??

    • సిద్ధార్థ కట్టా says:

      కథ ఎంత ఏడిపించిందో మీ కామెంట్ అంత నవ్వు తెప్పించింది. అవన్నీ కాదు కానీ… తెలుగు తల్లి ఎవరో, తాను ఎక్కడ ఉంటుందో చెప్పరా ప్లీజ్​ …

  • గ్రామీణ మహిళల్లో ఎయిడ్స్ బారిన పడటానికున్న ముఖ్యమైన కారణాలలో భర్త విచ్చలవిడితనం, తాగుడు అనేది ఎన్నో సర్వేలు తెలిపిన నిజం. ఆ నిజాల్ని, స్త్రీల వల్నరబిలిటీనీ ఒక నెరెటివ్ కథరూపంలో, ఒరిజినల్ మాండలీకంలో బలంగా చెప్పిన కథ ఇది. అమాయకమైన మనసుల్ని తెలిపే కథలు మనసుభాషలో ఉంటేనే బాగుంటాయి. సాఫీగా చదవడానికి కొంత మాండలికం ఇబ్బంది కలిగించినా, ఒక గ్రామీణ స్త్రీ తన గోడు చెప్పుకుంటున్నదనే స్పృహతో ఓపికచేస్తే అద్భుతమైన కథనం అనిపించే కథ ఇది.

  • Prasad says:

    ఝాసి గారికి .. చాలా థాంక్స్ … చిన్నపటి మా ఊరికి వెళ్లి వచినట్టు వుంది మే కథ చదివిన తరువాత.

  • వెల్లంపల్లి అవినాష్ says:

    ఝాన్సీ గారూ,

    గ్రామీణ స్త్రీలలో ఎయిడ్స్ కి భర్తలే ఎక్కువశాతం కారణమని very recently The Hindu లో వచ్చింది. ఇంతలోకే మీ కథ!! ఈ తరహా కథావస్తువును identify చెయ్యడం గొప్ప విషయం!

    రాయలసీమ మాండలికం చాలా సహజంగా వాడారు. అక్కడక్కడా కష్టమైన మాండలిక పదాలకు brackets లో అర్థం ఇస్తే ఇతర మాండలికాల వారికి సౌకర్యంగా ఉండేది.
    ఉదాహరణకు – “మద్దిస్తానికి కుచ్చుంటే”, “గెవనం”, “వుప్పిండి”, “బేదులు” తెలంగాణ మాండలికానికి చెందిన నాకు అర్థం కాలేదు.

    కథాకథనం చాలా బాగుంది. తన మరణం తరవాత భార్యకు జీవితం ఉండకూడదని భర్త భావించి, అత్యాచారానికి ఒడికట్టడం – పురుషుల్లో తమకు తెలియకుండానే అప్పుడప్పుడు పుట్టుకొచ్చే పురుషాధిక్య భావనకు అద్దం పట్టింది.

    • Jhansi Papudesi says:

      అవినాష్ గారికి,
      కథ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. మాండలికం చదవడం కాస్త కష్టమే అయినా, చదివి అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీరడిగిన పదాల అర్థాలు చెబుతాను … మద్దిస్తానికి కుచ్చోవడం అంటే …. పంచాయితీ, సెటిల్మెంట్ అని అర్థం. ఉప్పిండి అంటే ఉప్మా , ఇక బేదులు అంటే విరోచనాలు :) గెవనం అంటే జ్ఞప్తి కి తెచ్చుకోవడం. ప్రచురణ కర్తలు అనుమతిస్తే అర్థాలు ఇచ్చే ప్రయత్నం ఇక నుంచి చేస్తాను.
      ఈ కథ రాయడానికి కారణమైన మహిళను నేను కలిసాను. ఆవిడ చెప్పిన చాలావిషయాలు కథలో అసందర్భం అనిపించి వొదిలేశాను.

      • వెల్లంపల్లి అవినాష్ says:

        మాండలికంలో రాస్తే, “చెన్నై లో దోశ”లా నేటివిటీ సహజంగా ఉంటుందనీ, అప్పుడే కథ మరింత బాగుంటుందనీ నా నిశ్చితాభిప్రాయం! మీ నుంచి మరిన్ని మాండలిక కథలను ఆశించవచ్చని నా ఆశ.
        అర్థాలు చెప్పినందుకు ధన్యవాదాలు! :)

  • Radha says:

    ఝాన్సీ గారూ, కథ చదువుతుంటే చాలా బాధ కలిగింది. ఇలాంటి అభాగ్యులు ఎంత మందో పాపం. అభినందనలు

  • ప్రార్ధన says:

    బాధ కలిగించే కథ! అయినా ఈ కథ నిజం, మాండలికం ఏదైతేనేం, ఆ కథ నడుస్తున్న వ్యవస్థకు దర్పణం. ఇలాంటి మొగుళ్ళు కేవలం పేదలలోనే కాదు, అన్ని తరగతుల వారిలో నేను చూసాను, తనకంటుకున్న రోగం అందరికి అంటించి సాధ్యమైనంత వ్యాప్తి చేయాలి అనుకునే సాడిస్టు పురుషులను కూడా చూసాను.

    • Manjari Lakshmi says:

      యమ కూపం(The pit of yama) అనే నవలలో వేశ్య తన దగ్గర కొచ్చే విటుల మీద కసి తీర్చుకోవటానికి
      తన జబ్బు గురించి తెలిసి కూడా, తను చనిపోయే లోపల ఎంతమందికి అంటించ గలిగితే అంత మందికి అంటించాలని చూస్తుంది.

  • aparna says:

    చాలా బావుందండి…కథా…కథలో వాడిన భాషా…మీరెంచుకున్న సబ్జెక్టు అన్ని…!!

  • పంతుల గోపాల కృష్ణ says:

    కథల్లో పాత్రలు వాటికి సహజమైన యాసలోే మాట్లాడకపోతే వాటిల్లో జీవం ఉండదు.ఎవరేమన్నా సరే- చక్కని మాండలికంలో రాసే నేర్పు ఉన్న వారందరూ అలా రాసి తీరాల్సిందే.పల్లెల్లో కూడా ప్రజలు నాజూకు నేర్చుకుని వారి యాసని మరచి పోతున్నారు. కనుక అది రికార్డు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇది భాషకు మేలే చేస్తుంది కాని చెడు చేయదు.వ్యాసాలూ వార్తలూ శిష్ట వ్యావహారికంలో రాసుకుంటూనే ఉన్నాం కద. ఉత్తరాంధ్రకు చెందిన వాడినైనా నాకు రాయల సీమ, తెలంగాణా ప్రాతపు మాండలీకాలంటే కూడా ఎంతో ఇష్టం.ఝాన్సీ గారి ఈ కథ కి భాషే వన్నె తెచ్చింది.

  • దాము says:

    ఝాన్సి గారి కథ నాకు నచ్చ లేదు. నిజంగా జరిగినవాటి గురించి రాసినంత మాత్రాన అది కథ అవదు. నిజానికి తెలుగులో ఇలాంటి topical స్టోరీస్ చాలా ఎక్కువ. ఇది కూడా అలాంటిదే.ఇది ఒక parametric story. వ్యాసాన్ని కథ రూపంలో రాసినట్టుగా ఉంది.ఝన్సీ ఇంతకన్న మెరుగైన కథలు రాయగలదు.. ఆమె దేవుడమ్మ కథా చాలా బాగుంది. అద్భుతమైన భాష, చిత్రణ, వ్యంగ్యం,సూక్ష్మ పరిశీలన ఈమెలో ఉన్నాయి. ఆమెకి కావల్సింది beyond the obvious ని చూడగల లోచూపు..చెప్పడం కోసమో, భోదించడం కోసమో రాయటం మాని , తనకోసం తను రాయటం మొదలు పెట్టాలని నా కోరిక.

    • వెల్లంపల్లి అవినాష్ says:

      “తన కోసం తను రాయడం” అంటే? అర్థం కాలేదండీ! :(

  • JAANSI says:

    మూగుదు ఎలాంటి వాడుఉన బార్య వాడిని తనకి మాత్రమే సొంతం అన్ని అల్లోచిస్తుంది , కానీ వాడికి ఈ జాబు వచ్చింది అంటే అద్ది ఇంకో ఆడదాని వాలే కదా. ఆడవాలకి అడవలె ఖ్సత్రువులు. ఆడవాలు పేల్లియినా మగాడితో నే సంబంధం పెటుకూడానికి చూస్తరు. ఆ థపు ఆ మగడిదే కాదు ఆ ఆడదనిది కూడా. కథలు చల్ల ఈజీ గ ఊహించుకొని రాయచూ కాని రాసేముందు ఆ కడకి మూలం ఎవరు ఉంటారు అన్ని అర్ధం చేస్కువడం చల్లా అవసరం. బెటర్ లక్ నెక్స్ట్ టైం.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)