నేల మీద నమ్మకం వుంటే ఈ పుస్తకం చదవండి తప్పక!

samvedana logo copy(1)

గతం స్వర్ణయుగం కాదని తెలిసిన వారికి కూడా ఒళ్లు జలదరించే నివేదికలవి. బిడ్డలను 6 నుంచి 12 దినార్‌లకు అమ్మివేయడం దగ్గర్నుంచి బిడ్డల్నే చంపి తినేదాకా చరిత్ర పొడవునా దారుణమైన కరువులు. గుర్రాలు, ఏనుగుల మలంలో ధాన్యం కోసం వెతుక్కునే దగ్గర నుంచి కోటలోంచి ఒక గాడిద బయటకు వస్తే దానిమీద తోడేళ్ల మందవలెపడి కండరకండరాన్ని పీక్కుతినే ఉదంతాల దాకా ఎన్నో భరింప శక్యం కాని ఉదాహరణలిచ్చారు. ఉత్పత్తి అంతంతమాత్రంగా ఉండి కరువు కాటకాల సమయంలో బయటినుంచి ధాన్యం వచ్చే రవాణా ఏర్పాట్లు లేని రోజున ఈ సమాజం ఎలా ఉండిందో సామాజిక చలనాల గురించి తెలిసినవారు ఊహించగలిగిన విషయాలే. నిన్న కాక మొన్న బెంగాల్లో చూసిందే. చరిత్ర తెలుగు సినిమా కాదు. ఇది అర్థభూస్వామ్య అర్థ వలస సమాజమనే విశ్లేషణను పూర్వపక్షం చేశారు విద్యాసాగర్‌. పెట్టుబడి దానితో పాటే లాభాలపోటీ ఎట్లా విస్తరిస్తున్నాయో స్వేచ్చగా శ్రమను అమ్ముకునే అవకాశాలు ఎలా పెరిగాయో వివరించారు. రోలు, మిక్సీ పక్కపక్కనే ఉండే స్థితిని చూపించి పెట్టుబడి భూస్వామ్యంతో మిలాఖత్ అయ్యిందని గాలిపటాలెగరేయలేదు. దానికి భిన్నంగా ఆదిమ సమాజం నాటి కంక నుంచి ఇవాల్టి ట్రాక్టర్‌ దాకా అన్నీ ఉనికిలో ఉండి కూడా పెట్టుబడిదారీ సంబంధాలు సాధ్యమేనని ఉదాహరణలతో చాటారు.మతాన్ని కులాన్ని ముందుపెట్టి పెట్టుబడి వాటితో సహజీవనం చేస్తున్నది కదా అని కూడా కొందరు అంటుంటారు. పెట్టుబడిదారీ సమాజంలో మతం- కులం ఉండవని ఎవరు చెప్పారో ఎందుకలాంటి అపోహ ఏర్పడిందో తెలీదు. మనలాంటి దేశాల్లో పెట్టుబడికి పురోగామి స్వభావం ఉండదని ఇంకొంతమంది మిత్రులు వాదిస్తూ ఉంటారు. ఇక్కడ బూర్జువా ప్రజాతంత్ర విప్లవం ఏదీ రాలేదని అందువల్ల పెట్టుబడికి సానుకూల స్వభావమేదీ లేకుండా పోయిందని చెపుతూ ఉంటారు.

నేడే చదవండి.పల్లె బతుకు లోతుల్ని తవ్వి తీసిన విద్యాసాగర్ అపురూపమైన అక్షర చిత్రం పల్లెను మింగిన పెట్టుబడి. మాయా లేదు, మర్మం లేదు. గాలిమేడలు కట్టడం అసలే లేదు.నిద్రలో ఉన్నవారిని, నిద్రనటించేవారిని మేల్కొలిపే రాత యిది. ఈ నేల గురించి ఈ నేలను నమ్ముకున్న మనుషుల గురించి  ప్రేమ ఉన్న వారు, వారికోసం ఏమైనాచేయాలనుకునే వారు తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం ఇది. మా రోజుల్లో అనే తలపోతల నుంచి, పల్లెలు కూడా చెడిపోతున్నాయి అనే వలపోతల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపకరించే సాధనం ఈ పుస్తకం. పట్నవాసపు సౌఖ్యాలను అందుకుంటూ పల్లెగురించి తెలిసీ తెలీని రాతలు రాసే రచయితల వల్ల వ్యాపించిన రోమాంటిసిజమ్ అనే వ్యాధిని నయం చేసే కషాయం ఈ పుస్తకం. గ్రామీణ సమాజం,వ్యవసాయం,వృత్తులు,వలస, పెట్టుబడి, వాటి అంతస్సంబంధాల గురించి అధ్యయనం చేయాలనుకునే వారు అవశ్యం పఠించాల్సిన గ్రంధం. తిరోగామి వాదాన్ని పురోగామివాదంగా విప్లవకరంగా ప్రచారం చేస్తూ చరిత్రను, సామాజిక చలనాల్ని తలకిందులుగా చూపిస్తున్న మేధావులను సరిచేసి నిటారుగా నిలబెట్టే శక్తి కలిగిన అక్షరాయుధం. వామపక్ష రాజకీయాల్లో ఇటీవల తీవ్రస్థాయిలో సాగుతున్న  మోడ్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ డిబేట్‌ని ప్రభావితం చేయగలిగిన సత్తా ఉన్న పుస్తకం. సాధారణ కార్యకర్తలకు సైతం సులభంగా ఆ అంశాలను వివరించగలిగిన పుస్తకం. ఆ రకంగా  సామాజిక రాజకీయ రంగాలకు విద్యాసాగర్‌ చేర్పుగా దీన్ని చెప్పుకోవచ్చు.

 

పుస్తక రచయిత విద్యాసాగర్

పుస్తక రచయిత విద్యాసాగర్

విద్యాసాగర్‌ ఏం చెప్పారు? గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌ అనే పరమ చెత్తను మోసుకు తిరుగుతున్న వారి బండారాన్ని బయటపెట్టారు. గ్రామీణ సమాజంలో స్వర్ణయుగం అనేది ఏదీ లేదని అది కొందరి స్వకపోల కల్పితమని ఆధారాలతో సహా చూపించారు.శ్రీకాకుళం జిల్లాను నమూనాగా తీసుకుని ఊరూరూ తిరిగి గొడ్డుచాకిరీ చేసి మరీ నిరూపించారు. గతంలో సుందరయ్య లాంటి వారు చేసిన సర్వేల కంటే విసృతమైనది ఇది. ఉత్పత్తి, రవాణా మెరుగుపడని సమాజాల్లో జీవనం ఎంత దుర్భరంగా ఉండేదో నివేదికల సాక్ష్యంగా చూపించారు విద్యాసాగర్‌. గతం స్వర్ణయుగం కాదని తెలిసిన వారికి కూడా ఒళ్లు జలదరించే నివేదికలవి. బిడ్డలను 6 నుంచి 12 దినార్‌లకు అమ్మివేయడం దగ్గర్నుంచి బిడ్డల్నే చంపి తినేదాకా చరిత్ర పొడవునా దారుణమైన కరువులు. గుర్రాలు, ఏనుగుల మలంలో ధాన్యం కోసం వెతుక్కునే దగ్గర నుంచి కోటలోంచి ఒక గాడిద బయటకు వస్తే దానిమీద తోడేళ్ల మందవలెపడి కండరకండరాన్ని పీక్కుతినే ఉదంతాల దాకా ఎన్నో భరింప శక్యం కాని ఉదాహరణలిచ్చారు. ఉత్పత్తి అంతంతమాత్రంగా ఉండి కరువు కాటకాల సమయంలో బయటినుంచి ధాన్యం వచ్చే రవాణా ఏర్పాట్లు లేని రోజున ఈ సమాజం ఎలా ఉండిందో సామాజిక చలనాల గురించి తెలిసినవారు ఊహించగలిగిన విషయాలే. నిన్న కాక మొన్న బెంగాల్లో చూసిందే. చరిత్ర తెలుగు సినిమా కాదు. ఇది అర్థభూస్వామ్య అర్థ వలస సమాజమనే విశ్లేషణను పూర్వపక్షం చేశారు విద్యాసాగర్‌. పెట్టుబడి దానితో పాటే లాభాలపోటీ ఎట్లా విస్తరిస్తున్నాయో స్వేచ్చగా శ్రమను అమ్ముకునే అవకాశాలు ఎలా పెరిగాయో వివరించారు. రోలు, మిక్సీ పక్కపక్కనే ఉండే స్థితిని చూపించి పెట్టుబడి భూస్వామ్యంతో మిలాఖత్ అయ్యిందని గాలిపటాలెగరేయలేదు. దానికి భిన్నంగా ఆదిమ సమాజం నాటి కంక నుంచి ఇవాల్టి ట్రాక్టర్‌ దాకా అన్నీ ఉనికిలో ఉండి కూడా పెట్టుబడిదారీ సంబంధాలు సాధ్యమేనని ఉదాహరణలతో చాటారు.మతాన్ని కులాన్ని ముందుపెట్టి  పెట్టుబడి వాటితో సహజీవనం చేస్తున్నది కదా అని కూడా కొందరు అంటుంటారు. పెట్టుబడిదారీ సమాజంలో మతం- కులం ఉండవని ఎవరు చెప్పారో ఎందుకలాంటి అపోహ ఏర్పడిందో తెలీదు. మనలాంటి దేశాల్లో పెట్టుబడికి పురోగామి స్వభావం ఉండదని ఇంకొంతమంది మిత్రులు వాదిస్తూ ఉంటారు. ఇక్కడ బూర్జువా ప్రజాతంత్ర విప్లవం ఏదీ రాలేదని అందువల్ల పెట్టుబడికి సానుకూల స్వభావమేదీ లేకుండా పోయిందని చెపుతూ ఉంటారు. రైలు అనే ఒక సాధారణ రవాణా సాధనం తెచ్చిన మార్పుల గురించి తెలిసి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చక్రానికే అంత శక్తి ఉంటే శాటిలైట్‌కి ఎంత ఉండాలి!  పెట్టుబడికి ఒక స్వభావముంది. బూర్జువా ప్రజాతంత్ర విప్లవం షరతు ఏమీ కాదు. షరతుగా చెప్పడమంటే ఉత్పత్తి సంబంధాలకు మనిషి చైతన్యానికి మధ్య సంబంధాన్ని తిరస్కరించడం. పాత సంబంధాలను ధ్వంసం చేయకుండా పెట్టుబడి పురోగమించలేదని విద్యాసాగర్‌ తేల్చిచెప్పారు. పెట్టుబడి తనతో పాటు తీసుకువచ్చే సాంకేతికత  ఫ్యూడల్‌ సంబంధాలను నాశనం చేయడానికి ఎలా ఉపయోగ పడుతుందో చూపించారు. వాడిపడేసే ప్లాస్టిక్‌ గ్లాసులు రావడం రెండు గ్లాసుల విధానం పోవడానికి ఎలా దారితీసిందో చిన్న ఉదాహరణతో సంకేతాత్మకంగా చెప్పారు. ఇది చదువుతుంటే ఉత్తరాదిన నాగళ్లు పోయి ట్రాక్టర్లు రావడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కుల అణచివేతకు సంబంధించిన కొన్ని రూపాలు ఎలా అంతరించాయో చెప్పే అధ్యయనాలు గుర్తొచ్చాయి. గతంలో అనూరాధాగాంధీ లాంటివారు గ్రామీణ-కుల సంబంధాలను మార్చడంలో పెట్టుబడి పాత్ర గురించి ప్రస్తావించినా దాని ప్రాధాన్యాన్ని పట్టించుకోలేదు. వృత్తికార్మికులకు సంబంధించిన వివరణలో ట్రాప్డ్‌ అనే పదాన్ని ఉపయోగించినా దాన్ని చాలా పరిమితమైన అర్థంలో పాసింగ్‌గా వాడారు. విద్యాసాగర్‌ ఆ  ఖాళీని పూరించారు.

14844_front_cover

మెరుగైనా రవాణా సౌకర్యాలు ఏర్పడడం కూలీరేట్లు పెరగడానికి ఏ విధంగా దోహదం చేసిందో రచయిత వివరించారు. ”కులవృత్తుల విధ్వంసం అనేది పెట్టుబడి చొరబాటుకు మౌలిక అవసరం. గ్రామీణ ధనిక రైతాంగానికి అర్థబానిస రూపంలో దీర్ఘకాలం కట్టివేయబడిన ఈ కులవృత్తుల సమాజం స్వేచ్ఛగా శ్రమను అమ్ముకునే కూలీలుగా మారారు” అని తేల్చారు. వృత్తులు కొనసాగాలని కోరుకోవడమంటే మనుధర్మాన్ని కొనసాగించాలని కోరుకోవడమేనని, వామపక్ష మేధావులు కూడా అ పాట పాడడం అన్యాయమని చెప్పారు. ఎన్ని సాకులు చెప్పి ఏ రూపంలో వివరించినా అది తిరోగమనమేనని నిర్మొహమాటంగా చెప్పారు. భారత దేశంలో పురోగామివాదులు ప్రధానంగా మార్క్స్‌ అనుయాయులు. లేదంటే అంబేద్కర్‌ అనుయాయలు. ఇద్దరి లోంచి అవసరమైనవి తీసుకోవాలని భావించేవారు కూడా ఉండొచ్చు. ఆ ఇద్దరూ వృత్తులు ధ్వంసం కావాలనే కోరుకున్నారు. వృత్తులు కొనసాగాలని కోరుకున్నది గాంధీ. ఆర్థిక రంగానికి సంబంధించి ఆయన ప్రవచించిన విషయాలు ఆచరణ సాధ్యం కానివి. సమాజాన్ని వెనక్కు తీసికెళ్లేవి. కానీ విచిత్రంగా మార్క్సిస్టులని చెప్పుకునేవారు కూడా రకరకాల వాదనలతో వృత్తులను ఆరాధించడం  చూస్తూ ఉంటాం. సమాజాన్ని మార్చాలనే బాధ్యతను భుజాన  వేసుకున్న వారెవరైనా వ్యూహాలు-ఎత్తుగడలకు సంబంధించిన గాంధీ నాయకత్వ పటిమనుంచి స్ఫూర్తి పొందొచ్చు. ఆయన వాదంనుంచి కాదు.  వ్యక్తిగా ఆయన మహానాయకుడు. ఆయన జీవితం ప్రతి కార్యకర్త తప్పనిసరిగా చదివి తీరాల్సిన పాఠం. కానీ మన దగ్గర దానికి భిన్నంగా జరుగుతోంది. వ్యక్తిగతంగా ఆయన్ను దూషించడం, భావజాలంలో ఆయనను అనుసరించడం వంటి విచిత్రాలు మనం చాలాకాలంగా చూస్తున్నాం. అందుకే ఈ రచయిత మీరెటువైపు, మనువు-గాంధీవైపా, మార్క్స్‌-అంబేద్కర్‌ వైపా అనేరీతిలో అడగాల్సిన ప్రశ్నే అడిగారు.

22vzgss03-book__23_1594038e

విద్యాసాగర్‌ ఇంకా ఏం చెప్పారు? వ్యవసాయ సంక్షోభం ఏటికేడు ఎందుకు తీవ్రమవుతున్నదో వివరించారు. ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ సంక్షోభం పెరగడం వెనుక కారణాలను సరిగా పట్టుకున్నారు. ప్రధానంగా అది చెల్లింపుల సంక్షోభం అని తేల్చారు. వ్యవసాయం వ్యాపారంగా మారిపోయిందని విస్పష్టంగా వివరించారు. సేద్యంలోకి ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం దగ్గర్నుంచి రైతాంగం జీవనశైలి మార్పుల దాకా అనేకానేక అంశాలను చర్చించారు. పిల్లల చదువులకు ఎక్కువ ఖర్చుపెట్లాల్సిన స్థితితో పాటు బర్త్‌డే పార్టీల్లాంటివి పెరిగిపోవడం లిక్కర్‌ వాడుక పెరిగిపోవడం లాంటి అంశాలను మన ముందుంచారు. “తక్కువ ఖర్చుతో జీవితం గడిచినప్పటికీ అతితక్కువ ఆదాయం ఉండడంతో ఫ్యూడల్‌ సమాజం ఒకరకం సంక్షోభం సృష్టిస్తే పెరిగిన ఆదాయాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఖర్చులు పెంచి పెట్టుబడి మరో రకం సంక్షోభం సృష్టిస్తోంది” అని   ప్రకటించారు. వాస్తవానికి ఒకనాడు గ్రామీణ సమాజంలో ఖర్చు అంటే ప్రధానంగా తిండి ఖర్చే. ఇవాళ పట్టణాల మాదిరే ఇతర ఖర్చులు తిండి ఖర్చును మించిపోయాయి. ఈ మార్పు సమాజం ఒక దశ నుంచి ఇంకో దశకు వెళ్లిందనేదానికి సంకేతం. ఇవాళ గ్రామాలంటూ ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు, అవి పట్టణాల ఎక్స్‌టెన్షన్స్‌ మాత్రమే అని చక్కని మాట చెప్పారు. ఇళ్లలో పాల చుక్కవాడకుండా అన్నీ పాలకేంద్రాలకే పోస్తున్న ధోరణి గురించి రచయిత ఒక చోట ప్రస్తావించారు. గ్రామాల్లో పెట్టుబడి తెచ్చిన విషాదం ఇక్కడుంది. ఒకనాడు ఎదురింటి రైతుకు కుడితి నీళ్లు పోస్తే పెరుగో మజ్జిగో పోసేవారు. కూలీపని నుంచి వస్తూ వస్తూ ఏదో ఒక పొలంలో పిడికెడు గోంగూర పెరక్కొచ్చుకుని ఏదో ఒక రొట్టె చేసుకుంటే పూటగడిచేది. ఒక వీధిలో చిక్కుడు పాదుకు కాయలు కాస్తే ఆ ఆవీధిలోని ఇళ్లన్నింటా ఆ రోజు చిక్కుడు గుభాలించేది. ఏదీ లేని నాడు ఊరికే పడిఉండే మునగచెట్లనుంచి నాలుగు ఆకులు దూసి ఉడికేసుకుంటే పూటగడిచేది. అమ్మడం-కొనడం జీవితాన్ని ముంచెత్తని  దశ కావడం వల్ల ఇరుగు పొరుగు సహకార జీవనం ఒకటి ఉండేది. ఒకే సాంఘిక హోదా కలిగిన కుటుంబాల మధ్య ఆర్థిక అంతరాలతో నిమిత్తం లేకుండా ఇలాంటి ఆదాన ప్రదానాలుండేవి. అన్నీ సరుకులుగా మారి మార్కెట్‌కు వెళ్లడం వల్ల  ఇవాళ పల్లెల్లో కూడా ఈ రకమైన జీవనం కనిపించడం లేదు. గుంపు జీవనంలో ఉన్న అణచివేత తగ్గడం వంటి సానుకూల పరిణామాలతో పాటు అదే జీవనంలో కొంతవరకు అంతర్భాగంగా ఉండే  సహకార ధోరణి పోయి వ్యక్తి ఒంటరవుతున్న దృశ్యం కనిపిస్తోంది.

గ్రామీణ సమాజం సంవత్సరమంతా మట్టిగడ్డలను కౌగిలించుకుని, అర్థబానిస తరహా శ్రమను చేస్తూ పండించిన ఉత్పత్తిని మార్కెట్‌కు ‘విలువ తక్కువ’ ఉత్పత్తులుగా  ఎగుమతి చేస్తోంది. తిరిగిన తనకు అవసరం ఉన్నా లేకపోయినా ‘విలువ ఎక్కువైన’ పారిశ్రామిక ఉత్పత్తులను దిగుమతి చేసుకునే స్థితిని మార్కెట్‌ కల్పించింది. ఈ చెల్లింపుల సంక్షోభమే నేటి రైతు సంక్షోభం” అని విద్యాసాగర్‌ వివరించారు.  వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం గురించిన ప్రస్తావన ఒక చోట చేశారు. తాను కొనుగోలు చేసే వస్తువుల రూపంలో పన్నుభారం, వ్యవసాయంపై మదుపు భారం అనే  ” ఈ రెండు పర్వతాలను మోస్తున్న భారతీయ రైతాంగం ఆ భారాన్ని వదిలించుకోవడానికి పట్టణ శ్రామిక వర్గంగా మారుతోంది.” అని చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు లోపించడం వల్ల తలెత్తుతున్న సమస్యలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదేమో అనిపిస్తుంది. చాలా దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర ఉత్ప్తత్తి ఇంకా ఎందుకు దారుణంగా ఉంటోంది? చైనాలో హెక్టార్‌కు ఆరు టన్నులకు మించి వరి పండిస్తూ ఉంటే మనం మూడు టన్నులు కూడా ఎందుకు చేరలేకపోతున్నాం అనేది ఆలోచించాలేమో! ఒక సీజన్‌లో కిలో యాభై రూపాయలు పలికే ఉల్లి, టమోటా, ఆలూ మరో సీజన్‌లో రోడ్డుమీద పారేయాల్సిన స్థితికి ఎలా వెడుతుందనే ప్రశ్నకు కూడా సమాధానం వెతుక్కోవాలేమో!  వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల గురించి అతిగా మాట్లాడే ప్రభుత్వాలు ఆచరణలో దుర్మార్గమైన నిర్ల్యక్షం చూపడాన్ని కచ్చితంగా ప్రశ్చించాలి. కోళ్లకు దాణాగా ఉన్న మొక్కజొన్న శ్రీకాకుళం జిల్లాలో 8500 ఎకరాల నుంచి 20 వేల ఎకరాలకు పెరగడాన్ని ప్రస్తావిస్తూ”మనుషులు తినే ఆహారం కోసం విదేశాలవైపుకు కోళ్ల ఆహారం కోసం దేశీయ పొలాలకు అనే వ్యూహం ఏ న్యాయసూత్రాల ప్రకారం సరైనదో ఆలోచించాలి” అన్నారు. ఇక్కడ రచయిత ఒక విషయం మర్చిపోయారు. కోళ్లు కూడా మనుషులు తినే ఆహారమే. ఈ దేశంలో ఎక్కువ జనాభా తినే ఆహారం. ఒకనాడు పండక్కో పబ్బానికో లేక ఇంటికి బంధువొచ్చినపుడో మాత్రమే తినగలిగే ఆహారం ఇవాళ బ్రాయిలర్‌ కోళ్ల వెల్లువ వల్ల తరచుగా తినే ఆహారంగా మారింది. ఇది సానుకూలంగా చూడాల్సిన పరిణామమే. రచయిత చెప్పిన అర్థంలో అయినా మనుషులు తినే ఆహార ఉత్పత్తిలో మనమేం వెనుకబడిలేం. ఏటా కోట్ల టన్నుల ధాన్యం గోడౌన్లలో మగ్గిపోతోంది. ఆహారపంటల వైశాల్యం తగ్గిపోతోందని ఆందోళన పడాల్సిన అవసరమేమీ ఇవాళ లేదు. ఇలాంటి చిన్న చిన్న వివరాల విషయం పక్కనబెడితే మౌలిక మైన విషయాలన్నింటా రచయిత పూర్తిగా శాస్ర్తీయమైన దృక్పధాన్ని పాటించారు.

తెలుగు నేలమీద వలస వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతున్నది. బలవంతపు వలసలను వ్యతిరేకించవచ్చు. పేదరికాన్ని ఆసరా చేసుకుని భూములు తక్కువకు కొనుగోలు చేసే దోపిడీని వ్యతిరేకించవచ్చు. ”కుండా సట్టి మూటనుగట్టి ఉండా బిడ్డల చంకనబెట్టి మాసం మాసం గాసం కోసం దేశం దేశం తిరిగే పేదల” బతుకుల గురించి ఆందోళన తోనూ ఆర్తితోనూ చర్చించొచ్చు. కానీ మొత్తంగానే వలస అనేపదాన్ని బూతుపదంగా మార్చకూడదు. ఇక్కడ రచయిత సరైన వైఖరి తీసుకున్నారు. వలస  తెచ్చిన సానుకూల పరిణామాలను చూపారు. కూలీ రేట్లలో వేతనాల్లో వచ్చిన మార్పులను చూపారు. మెరుగైన రవాణా సౌకర్యాలతో కూలీలు తమకిష్టమైన చోట శ్రమను అమ్ముకునే వెసులుబాటు కలిగిన తీరును చూపారు. తలదాచుకోవడానికి గ్రామం-శ్రమను అమ్ముకోవడానికి బస్తీ అనే పరిణామాన్ని పట్టుకున్నారు. మద్రాస్‌ పోయిన దళిత కూలీలు తమ గ్రామాల్లో రైతులకు డబ్బులు అప్పు ఇచ్చే స్థితికి చేరిన విధానాన్ని వివరించారు. “మనిషి తన వృత్తిని మార్చుకోగలగడమే అతని మనుగడకు పునాదిగా ఉందని గుర్తించాలి. అలా గుర్తించకపోతే మనిషి రాకాసి బల్లి అయ్యే ప్రమాదముంది” అని చక్కని మాట చెప్పారు. అప్పుల విధానంలో వచ్చిన మార్పుల గురించి చెపుతూ ఫాయిదాలు, ముందస్తు ధర ఖండన ,అప్పులిచ్చిన షావుకారికి పంటను అమ్మాలనే షరతులు రద్దయ్యాయి. ఆ స్థానంలో సరళమైన వడ్డీరేట్లతో అప్పులు దొరికే స్థితికి శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాలు చేరుకున్నాయి” అని  మంచి మాట చెప్పారు. సరళమైన అప్పులైనా మన వ్యవసాయ రంగంలో ఉరిత్రాడే. కాదనలేం. కాకపోతే సామాజిక సంబంధాల పరంగా చూసినపుడు గ్రామీణ వడ్డీవ్యాపారికి ముందస్తు ధరకు పంట అమ్మడం లాంటి బానిసత్వం నుంచి విముక్తి పొందడం అనేది ముఖ్యమైన పరిణామం. ”ఏ దేశంలో అయినా ఫ్యూడల్‌ వ్యవస్థను ధ్వంసం చేసేది పెట్టుబడే. ఆ పని భారతదేశంలో దాదాపుగా పూర్తయ్యింది”. అని మనం ఏ సమాజంలో బతుకుతున్నామో ఈ సమాజం స్వరూపస్వభావాలేమిటో చెప్పకనే చెప్పారు. సామాజిక సంబంధాల విషయంలో నిశిత పరిశీలన వల్ల  వాస్తవాలను వాస్తవంగా చూపే వీలు కల్పించింది. ముఖ్యంగా రచయిత  శ్రామికుల- శ్రామిక కులాల దృక్కోణం నుంచి సమాజాన్ని పరిశీలించారు. సాధారణంగా గ్రామీణ సంబంధాల్లో మార్పులను పైనించి చూసేవారికి కోల్పోయిన దర్జా గుర్తొస్తుంది. కింది నుంచి చూసేవారికి వదిలించుకున్న బానిసత్వం గుర్తొస్తుంది.  పాలేర్ల వ్యవస్థ పోవడంతో పశుసంపద అంతరిస్తున్న వైనాన్ని సాగర్‌ బాగా చెప్పారు. రైతుకు-పశుసంపదకు తల్లీ బిడ్డ సంబంధమని అదనీ ఇదనీ మనదగ్గర పురోగామివాదులనుకునే వారు సైతం బోలెడు సెంటిమెంట్లు గుమ్మరిస్తుంటారు. అనుబంధం ఉండే మాట వాస్తవమేగాని అది తన జీవికను మించి కాదు. పశుమాంసం ఎగుమతిలో మన దేశం ఇవాళ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందన్న విషయం గుర్తు చేసుకుంటే మన పశువులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరు వాటిని తరలిస్తున్నారో అర్థం అవుతుంది. గతంలో దళితులు నికర ఉద్యోగంగా లభించే పాలేరు వృత్తి దొరకడమే అదృష్టంగా భావించేవారని ఆ స్థితి ఇవాళ పోయి కాస్త మెరుగైన ఉపాధి దొరుకుతున్నదని సానుకూల పరిణామాన్ని రచయిత వివరించారు. ”గ్రామీణ ప్రాంతాల్లో వాళ్లకు వృత్తిని ఉపాధిని కల్పించిన అర్థబానిస వ్యవస్థ అయిన పాలేరు వృత్తి నుంచే కాక, అర్థాకలితో మాడ్చి చంపిన వ్యవసాయ కూలీ రంగం నుంచి కూడా దళితులు నిష్ర్కమిస్తున్నారు” అని గతాన్ని వర్తమానాన్ని కలిపి వివరించారు. “స్వతంత్ర జీవనం సాగించడానికి పట్టణాల్లో ఉపాధి దొరకడం, సాంఘిక గౌరవం లభించడం” అనేవి పాలేరు వ్యవస్థ పోవడానికి కారణాలుగా దళితుల మాటల్లోనే చూపారు. సాంఘిక గౌరవమనగానే పట్నాల్లో కులం లేదా అని దీర్ఘాలు తీయనక్కర్లేదు. పల్లెల్లో కులానికి పట్నాల్లో కులానికి తేడా ఉంటుంది. ఈ మార్పు కేవలం పరిమాణాత్మకంగా మాత్రమే కొందరికి కనిపించొచ్చు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే అది గుణాత్మకమార్పుగా మారుతున్నదని అర్థమవుతుంది. యాంత్రీకరణ జరిగితే ఉపాధి పోతుందని ‘సర్‌ప్లస్‌ పీపుల్‌’ పెరుగుతారని గాంధీలాగే చాలామంది ఇప్పటికి కూడా భావిస్తుంటారు. ట్రాక్టర్లు వచ్చాక కూలీలు గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణబాట పట్టారని దీనితో కూలీల కొరత తీవ్రమై కూలీరేట్లు పెరిగాయని వాస్తవ స్థితిని రచయిత వర్ణించారు.

అయితే ఏమిటి? ఇంతకుముందున్నది నరకమూ, ఇప్పటిది స్వర్గమూనా అనొచ్చు. కానే కాదు. రచయితకు స్పష్టత ఉంది. విద్యాసాగర్‌ కమ్యూనిస్టు. ఎంత కమ్యూనిస్టు అంటే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం గురించి రాయాల్సి వచ్చినపుడు మహాత్మాగాంధీకి కోట్స్‌ పెట్టే అంత కమ్యూనిస్టు. కాట్‌స్కీని ఎక్కువగా కోట్‌ చేస్తే తనమీద రెనగేడ్‌ ముద్ర పడే ప్రమాదముందని తెలిసీ సదాశయం కోసం తెగింపుతో ముందుకెళ్లిన కమ్యూనిస్టు. పెట్టుబడిదారీ వ్యవస్థ దుర్మార్గమైనదే. లాభం తప్ప మరేమీ పట్టని ఈ వ్యవస్థను, మనిషిని యంత్రంగా మార్చే ఈ వ్యవస్థను, మనిషికి మనిషిని నిరంతరం పోటీ పెట్టే ఈ వ్యవస్థలోని దుర్మార్గాన్ని ఎదుర్కోవాల్సిందే. కాకపోతే దానికోసం ఇంతకంటే దుర్మార్గమైన గతాన్ని ఆశ్రయించరాదు అని రచయిత చెప్పారు. ఇది పాతవ్యవస్థ కాదు. దానిని తలదన్ని ఏర్పాటైన కొత్త వ్యవస్థ. కొత్త వ్యవస్థ వల్ల కొన్ని  మార్పులున్నాయి. అవి  మౌలిక మైనవి కావు. పెట్టుబడికి అవసరమైన మార్పులు మాత్రమే. అసమానతలు పోగొట్టే మౌలిక మైన మార్పుల కోసం పోరాటం సాగాల్సిందే. కాకపోతే దానికి పాత మాటలు, పాత సాధనాలు పనిచేయవు అని కూడా రచయిత చెప్పకుండానే చెప్పినట్టుగా అనిపించింది.

జి ఎస్‌ రామ్మోహన్‌

 

Download PDF

91 Comments

  • ఈ పుస్తకం నేనూ చదివాను. రచయిత కేవలం స్టాటిసిక్స్ తో ముగించిన విషయానికి (ఎక్కువ శాతం కామెంట్ చేయకుండా) మీ భాష్యం మీరు చెప్పారు. (బహుశ రచయిత భాష్యం కూడ అదేనేమో నాకు తెలియదు).

    1. వ్యవసాయంలో పెట్టుబడీ ప్రవేశించిందంటే అందరు ఒప్పుకొంటారు కాని, పూర్తిగా పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చిందని చెప్పటం విడ్డూరమే. దానికి బూర్జవా ప్రజాతంత్రవిప్లవం షరతు కాదని అనటం సాహసమే. మరయితే ఇంకా గ్రామాలో డెబ్భై శాతం పైగా ప్రజలు ఎందుకు జీవిస్తున్నారు?

    2. అన్ని గ్రామాలు పట్టణాలకు ఎక్స్ టెన్షన్స్ యే అని చెప్పటం కూడ పాక్షిక సత్యం మాత్రమే.

    3. వామపక్షవాదులు వృత్తులు నశిస్తున్నందుకు కన్నీరు కార్చలేదనుకొంటాను. ఆ వృత్తులకు ముడిపడి ఉన్న జీవితాలు ధ్వంసం అవుతున్నందుకు బాధపడుతున్నారు. ధ్వంసమైన జీవితాలు పోగా గట్టెక్కిన వారి గురించి మీరు (రచయిత కూడ) మాట్లాడుతున్నారు.

    4. చివరిగా వ్యవస్థ మారటానికి పాత మాటలు, సాధనాలు పని చేయవని మీరు అన్నారు. ( రచయిత ఈ వ్యాఖ్యానం ఎక్కడ చేయలేదు.) బహుశ విప్లవం అవసరం లేదని మీ ఉద్దేశ్యమ్ అని ఉంటుంది. దానికి అల్టర్ నేటివ్ గా మీరు ప్రపోజ్ చేస్తున్న సాధనాలు, మాటలు ఏమిటో తెలుసుకోవచ్చా? బలప్రయోగం లేకుండ వ్యవస్థలు మారిపోయే కొత్త విధానాలు మాకు తెలియచేస్తే సంతోషిస్తాము.

    • CHITRA says:

      రామా సుందరి సర్ నమస్తే వ్యవసాయం లో పెట్టుబడి ప్రవేశించిందని బ్రిటిష్ చరిత్ర కారులె రాసారు ఇప్పుడు అంగీకరించే వాళ్ళు అప్పట్లో ఉన్నట్టు . సరి అయిన అధ్యయనం లేకపోతె నిజాలు విడ్డురం గానే కనబడతాయి .ఫ్లోగిస్టన్ సిద్ధాంతం తెలుసు కదా సరే గాని అమెరికా జర్మనీ ఇంగ్లాండ్ లలో గ్రామాలు లేవంటారా .”వామపక్ష వాదులు ” ఎవరి గురించి బాధ పడితే మనకేందుకు గాని విద్యాసాగర్ గట్టెక్కిన వాళ్ళ గురించి మాట్లాడారు అనడం విడ్డూరాతి విచిత్రం అసలు ఎవరూ ఒద్దేక్కరు మహాప్రబో అని కదా అతని బాధ . పాత మాటలు అంటే విప్లవం అని మీరు భావించడం మహా మహా విడ్డురం .దయచేసి మరొక్కసారి పుస్తకం చదవండి మీకు దణ్ణం పెడతాను పాత మాటలు పనికి రావంటే అర్థం బూర్జువ విప్లవం అయ్యిందనీ రావలసినది కార్మిక వర్గం నాయకత్వం లో సోషలిస్ట్ విప్లవం అనీ

      • చిత్రగారు, నమస్తే. నా పేరు రమాసుందరి. మీరన్నది నిజమే. సరి ఐన కళ్ళతో అధ్యయనం చేయక పోతే నిజాలు తల్లక్రిందులుగానే కనబడతాయి. మీరన్నట్లుగానే భారత దేశంలో బూర్జవా ప్రజాతంత్ర విప్లవం బలప్రయోగం లేకుండానే పూర్తయి ఉన్నట్లయితే, మీరు చెబుతున్నసోషలిష్టు విప్లవం కూడ అదే వచ్చేస్తుంది. (బహుశ ఎన్నికల ద్వారా కూడ కావచ్చు). కొద్దిరోజులు ఓపిక పడదాం. ఇక నేను పుస్తకం సరిగ్గా చదివానో లేదో నాకే వదిలేయండి.

      • Thirupalu says:

        బాగా చెప్పరు. అదేగదా నెహ్రు సోషలిజం చెప్పేది. మరి ఎవరంత వాళ్లు కూర్చుంటె అన్ని వచ్చెట్లు అయితే మరెందుకు ఆర్బాటాలు.

      • CHITRA says:

        రమా సుందరి గారు నమస్తే నాది తల కిందులు చదువని మీరు భావిస్తే నేను ఈ వేదిక ద్వారా అంగీకరిస్తున్నాను . అవును నాకు మీకు తెలిసినవి ఏవీ తెలీవు . నాది వానా కాలం చదువు ఎవరూ చెప్పరు. మళ్ళీ అంగీకరిస్తున్నాను
        అవునూ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ?

  • కెక్యూబ్ వర్మ says:

    విద్యాసాగార్ గారిని పరిచయం చేసే ముందు ఆయన శ్రీకాకుళ పోరాట నాయకుడు ఆదిభట్ల కైలాసం మాస్టారి మనుమడు అని చెప్పి వుంటే బాగుండేది. ఎందుకంటే నెత్తుటి త్యాగాలతో ఎఱబారిన శ్రీకాకుళ కొండలు మైదాన ప్రాంతాలలో నేడు వస్తున్న మార్పులను గుణాత్మక మార్పులుగా ఓ పెద్ద గెంతుగా ఈయన తీసుకోవడంలోనే ఈయన తను వచ్చిన వారసత్వాన్ని విడిచి పెట్టారని అర్థమయి వుండేది. వలస అన్నది బూతు మాట అని ఎవరూ అనడంలేదు. వలస వెళ్తున్నవాళ్ళు అప్పులిస్తున్నారన్నది అబద్ధం. ఇందిరమ్మ ఇల్లు కట్టి అప్పులయిన వాళ్ళు అవి తీర్చుకోవడానికి చెన్నై హైదరాబాదు నగరాలు పోతూ తాము సంపాదించిన దానికంటే అనేక రెట్లు జబ్బులతో వస్తున్న నిజాన్ని దాయడమే. పల్లెల్లో నేడు ఎయిడ్స్ వ్యాధిన పడిన మరణాలు అధికమయినాయన్న నిజం దాగదు. తను చూసిన ఒక కంటి సత్యాన్నే సత్యం కైలాసంల వారసుడు చెప్తే మీరు బలపర్చడం ఆశ్చర్యం కాదు. యిదంతా ఎన్. జీ. వో.లు చూపించే క్యుములేటివ్ ఫిగర్ లా వుంది. వ్యవస్థను కూలదోసే విప్లవానికి ప్రత్యామ్నాయంగా వీళ్ళు చెప్పే వాల్ స్ట్రీట్ ముట్టడులు విఫల యత్నమయ్యాననది సత్యం. యిలాంటి పరిశోధనా గ్రంధాలు కొంత మేర గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న పైపై మార్పులను తెలుసుకొనేందుకు ఉపయుక్తం కావచ్చు కానీ కమ్యూనిస్ట్ ముసుగులో ఏదో కొత్తగా చెప్పేసారు అన్నది పాక్షిక సత్యమూ, సామాజిక ద్రోహమూ.

    • CHITRA says:

      రాజు గారూ . సూర్య వంశం లో పుట్టబట్టే రాముడు గొప్ప వాడు అయాడు అన్నట్టుగా మొదలైన మీ స్పందన ఆవేశం తో నిండి ఉండే బదులు మీ సహజ ఆలోచనా శక్తీ తో ఉంటె ఎంత మంచి చర్చ సాగేది ఆయన తన తాతకి ఏరోజూ వారసుడుగా లేదన్న విషయాన్ని మీరు మరుగున పరచడం ఒక ఎత్తుగడ గా సరిపెట్టుకో వచ్చు గానీ అన్నీ తెలిసి పుస్తక విషయం లోని విషయం మీద చర్చ కి అవసరం లేని విషయాన్ని గోడ మీదకి తీసుకు రావడం “బిలో ది బెల్ట్ ” యుద్ధ్హమే గొప్పతనం అమరుల సంఖ్యలో లేదని అందరికీ తెలుసు పుస్తకం లో విషయానికి వాల్ స్ట్రీట్ ముట్టడికి ఉన్న పోలికలు దయ చేసి ఒక్కటైనా చెప్పరా ? తిట్లు పిల్లి శాపాలు పక్కన పెట్టి శ్రద్ధ గా పుస్తకం లోని విషయాల గురించి మాట్లాడు కుందాం సర్ . విభేదించండి చర్చించండి ఓడించండి కాని పాత కాలం ప్రభువుల లాగ తిట్లు ఎందుకు ? మీరు మేధావులు హుందాగా ఎక్కడ ఎక్కడ తప్పులు ఉన్నాయి చెప్పండి సర్
      గ్రామాల్లో ఫైనాన్సు పెట్టుబడి ప్రవేశం లో ఒక రూపం అయన చెపితే శ్రామికులని మీరు వ్యభిచారులని చెయ్య కండి సర్ మీకు దణ్ణం పెడతా

  • కెక్యూబ్ వర్మ says:

    నా పేరు చూసి నన్ను రాజు గారూ అని వ్యంగ్యంగా సంబోధించడంలోనే మీ వెటకారం అర్థమయింది. ఏ నేపథ్యమూ లేకుండా అది కుటుంబపరంగానో లేక తను బతికే పరిసరాల్లో జరిగే ఉద్యమాలో ఏదో ఒక ప్రభావం లేకుండా యెవరూ సామాజిక ఉద్యమాలలోకి ఆకాశంలోంచి ఊడీపడి రారు. అది ఆయనా మీరు దాచినా దాగనిది.

    ఇంక మీరడిగిన వాల్ స్ట్రీట్ ఉదాహరణ ఎందుకంటే ఈ దేశంలోనే కాదు ఇంక్కెక్కడా రష్యా చైనా లాంటి విప్లవాలు రావు అంతా అయిపోయింది నో ఆల్టెర్నేట్ టు కేపిటల్ అన్న ప్రచారానికి దోహదపడే వ్యాసంగా మాత్రమే. పెట్టుబడి ప్రవేశించ లేదని ఏ మార్క్సిస్టు చెప్పలేదు. ప్రవేశించిన పెట్టుబడి దాని రూపం బ్రిటిష్ వాడి అవశేషంగా నేడు అమెరికా సామ్రాజ్యవాద కుట్రలో భాగంగా అర్థవలస అర్థ భూస్వామ్మ వలస వాద పెట్టుబడిగా వుందని అది నేరుగా కాకుండా దొంగ చాటుగా మన మూలాల్లోకి ప్రవేశిస్తూ మధ్యతరగతి దిగువస్థాయి మధ్యతరగతి జీవితాలుగా మారుస్తూ పోరాట స్వభావానికి దూరంగా నెడుతూ ఇక్కడి ఈ దేశ నేల మాళిగలను దోచుకుంటూ శ్రమ జీవుల రక్త మాంసాలను హరిస్తూ కొత్తగా కార్పొరేట్ దళారీ వ్యవస్థను ముందుకు చూపుతూ విధ్వంసకర అభివృద్ధిని అమలు చేస్తూంది. ఉద్యోగాలు రాని ఇంజనీరింగ్ చదువులతో యువతను ఎందుకూ కొరగాని వారుగా మారుస్తూంది. లేనిపోని రంగుల కలలను చూపుతూ జనాన్ని నిజం తెలుసుకోకుండా సామాజిక సమస్యల పట్ల స్పందించే గుణానికి దూరం చేస్తూ తాత్కాళిక భ్రమలలోకి నెడుతూ తన పబ్బం గడుపుకుంటోంది.

    గ్రామీణ జీవితాలలోని వృత్తి కుటుంబాల నాశనం వలస పాలననుండి మొదలయి అది నేడు సంపూర్ణం కావస్తూంది. ఆయా కుల వృత్తులు అలాగే వుండాలని ఏ మార్క్సిస్టే కాదు మనిషన్నవాడెవడూ అనుకోడు. కానీ ఆ కోల్పోయిన మనుషులకు బతికే మార్గంగా వుండాలని కోరుకుంటాడు. అందుకే ఆ వృత్తులు అలా కోల్పోయిన వాళ్ళని గురించి కవులు కథకులు రాస్తున్నారు. ఇది ఆవేదనతో కూడినదే. ఈ మార్పు ఇక్కడేదో భారీ పారిశ్రామిక విప్లవానికి దారి తీయాలి కదా మీరన్నట్టుగా. అదేమీ జరగడం లేదే?

    యింక ఈ పరిచయంలో పశు సంపద అంతా కబేళాలకు తరలిపోయి విదేశీ మారక ద్రవ్యం తీసుకురావచ్చు. కానీ దీని వెనక గ్రామీణ వ్యవసాయ రంగం నాశనమవుతుండడమే కారణం కాదా? ఇక్కడ అదనపు వ్యవసాయ ఉత్పత్తులు రావచ్చు కానీ ఇక్కడి పాలక వర్గం సుప్రీం కోర్టు ఆదేశించినా గొడౌన్లలో ముక్కిపోయిన ధాన్యాన్ని సముద్రంలో కలిపేందుకు చూస్తోంది కానీ ప్రజలకు అందించే ఏర్పాటు లేదు. ఇంకా ఇక్కడి పంట భూములన్నీ సెజ్ లకు ధారపోస్తూ భారీ ప్రాజెక్టుల కింద ముంచి పెడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అనుకూలంగ మారుస్తూ నడమంత్రపు సిరి వర్గాన్ని ప్రోత్సహిస్తోంది. భూములు కోల్పోయిన రైతుల చితికి పోయిన బతుకులు మన కళ్ళెదుటే కనిపిస్తున్నాయి. రైతుకు గిట్టుబాటు ధర లేక ఒకవైపు పెరిగిన అప్పులతో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే అది కొంతమందికి పరిహారం కోసమో లేక అప్పులబారినుండి తప్పించుకోవడం కోసమో చేసుకునే పిరికి వాడి చర్యలా కనిపించడం విషాదం.

    ఇంకో మాట గ్రామీణ ఉపాధి హామీ పథకం వలన రైతు కూలీలు దొరకని పరిస్థితిని ప్రభుత్వం దొంగ చాటుగా ప్రవేశ పెట్టి సన్న చిన్నకారు రైతులను వ్యవసాయంనుండి దూరం చేస్తూ సోమరి జనాన్ని తయారు చేస్తూంది. ఇది కూడా కాదంటారా? అలా అని కూలీలు ఆ చాలీ చాలని సంపాదనతో వలసలు పోకుండాను ఆగిపోవడంలేదు. ఇక్కడే నా మాటకు వివరణ శ్రామికులను వ్యభిచారులుగా చిత్రించడం లేదు చిత్ర గారూ. ఈ వలసల ప్రభావం వలన బయటకు పోతున్న జనం వ్యసనాల బారిన పడి ఆరోగ్యంగా వున్న పల్లె వాతావరణం నేడు కునారిల్లుతున్నదన్నది మీరు పెట్టుబడి అభివృద్ధి ముసుగులో దాచేస్తే దాగని సత్యం. మా గవర్నమెంట్ ఆసుపత్రిలో లెక్కకు మించి అమాయక అమ్మాయిలు గర్భిణులుగా పరీక్షలకు వచ్చినపుడు చేసిన టెస్టులలో వచ్చిన ఫలితం చూసి. తాము చేయని తప్పుకు ఈ మహమ్మారి బారిన పడి చావుకు ఎదురు చూస్తున్నవారి గురించి నాకు తెలుసు. వాళ్ళ మగవాళ్ళు చేస్తున్న తప్పుకు వీళ్ళు బలవుతున్నారు. అరచేతిలో బూతు స్వర్గం చూపిస్తుంది నేటి సెల్ ఫోన్ రాజ్యం. ఈ అతలాకుతలమవుతున్న జీవితాల పట్ల సానుభూతితోనే నేనా మాట రాసింది. కార్పొరేట్ వర్గం ఎన్ జీ వో సంస్థలు చూపిస్తున్న అభివృద్ది అభివృద్ధి కాదన్నది నిజం.

    యింక నేనా వ్యాఖ్యలో ఎవరినీ తిట్ట లెదు. మరొక మారు తాపీగా చదువుకోండి మాస్టారు.

    • లక్ష్మణరావు says:

      మిత్రలు వర్మగారు…మీ వివరణాత్మక వ్యాసం ఆసాంతం చదివాను. తొలుత గ్రంథ రచయత విద్యాసాగర్ గారు ఆధిభట్ల కైలాసం గారి తమ్ముడు కొడుకు అని నాకు తెలుసు. ఒక సారి పరిశీలించగలరు. సామాజిక మార్పులు ఒక గెంతు తీసుకోలేదని చెప్పారు. ఆ గెంతు ఎలా ఉంటుంది. ఎలా ఉండాలి. ఆ గెంతు ఎలా ఉంటే పెట్టుబడి దారీ సమాజం అవుతుందో కాస్త వివరించండి. మీరు రాసిన వ్యాసం నేను గత కొద్ది కాలంగా వింటుందే. చదువుతున్నదే. కాని ఇంతకీ ఆ గెంతుకు మాత్రం సరైన వివరణ మాత్రం నేను ఇప్పటి వరకూ మీలాంటి కవులు, రచయతులు, వ్యాసకర్తలు రాసిన వ్యాసంలో చదవలేదు. కనీసం ఇప్పటికైనా ఆ గెంతు గురించి వివరణ ఇస్తారని ఆశిస్తున్నాను. మరో సందేహం. రోగగ్రస్తులుగా పల్లెలకు వస్తున్నారని అన్నారు. అంటే పల్లె పట్టణదారి పట్టిందని చెప్పడంలో మీకు పేచీ లేదని భావించవచ్చుననుకుంటాను. ఇక పుస్తకంలో రచయత పట్టణదారి పట్టిన పల్లె జనం స్కోడాలోనో, స్కార్పియాలోనో కన్నఊరికి వస్తారని ఎక్కడా చెప్పలేదు. ఎ.సి. రూంలో పడుకుని సేదతీరుతారని ఏ పేజీలోనూ ఉటంకించలేదు. కుల వృత్తులు ఉండాలని ఎవరూ కోరుకోలేదని అంటున్నారు. అదే సమయంలో బతికేమార్గం లేదుకాబట్టి కుల వృత్తులు కోల్పోయిన వారి కోసం ఆవేదన చెందుతామంటున్నారు. ఇక్కడ మీ తాత్వికత నాకు అర్ధం కావడం లేదు. నాబోటి మెదడుకి తట్టిన మేరకు కుల వృత్తులను ఉండకూడదని భావించేవారెవరైనా రోడ్డున పడ్డ అనే కన్నా పట్టణదారి పడ్డ వారిని సమీకరించి, వారికి మెరుగైన జీవితాల కోసం పోరాడాలి. అంతేగాని బయట బతుకులేదు కాబట్టి పాలేరుగా బతకమని పరోక్షంగా చెప్పినా ప్రత్యక్షంగా చెప్పినా తప్పే అవుతుందని నా ప్రాధమిక జ్ఝానం చెబుతోంది. వాస్తవానికి మన కథలు, కవిత్తవాలు వాళ్లు గురించి ఏడుస్తున్నాయి గాని పల్లెలో జీవితం లేదని తెలుసుకుని పట్టణాలలో కడుగో గెంజో తాగి బతుకుదామని బయులెళ్లిపోయారు. అక్కడ వారు పడుతున్న కష్టాల గురించి, వారు ఎదుర్కొంటున్న నష్టాల గురించి, అందుకు రాజ్యం పడాల్సిన పూచీ గురించి పూచికపుల్లంత కూడా మెజార్టీ రచయతలు రాయడం లేదు. ఏమిసార్ అంటే పల్లెని వీడిపోవడం వలనే వారికీ ఈ బతుకు అని నిష్టూరాలకు పోతున్నారు ప్రైవేట్ సంభాషణల్లో. ఒక్కోసారి అక్షర రూపంలో కూడా. ఇక రెండో సందేహం. మన జిల్లాలో ఉపాధి కూలీలు ఎందురు, వారిలో సంవత్సరానికి ఎంతమందికి ఉపాధి లభిస్తుందన్నది పరిశీలిస్తే బాగుంటుంది. మీరు సంధించిన ప్రశ్నలో మీలో మార్క్సిస్టు కన్నా మధ్యతరగతి వ్యక్తి వాదనగానూ, భూములు ఉన్న వారు పడుతున్న యాతనగానూ కనిపిస్తుంది. పత్రికలు, బూర్జవా పార్టీలు చేస్తున్న ప్రచారం ఎంత లోపబూయిష్టమో పుస్తక రచయత తన పుస్తకంలో సవివరంగా తెలియజేశారు. నాలాంటి అతి సామాన్యులకు కూడా రైతు సంక్షోభంలో ఎందులో ఉందో ఇట్టే అవగతమయ్యింది. మరి మీరు ఆ విషయాన్ని ఎలా విస్మరించారో అర్ధం కావడం లేదు. దయచేసి సోమరిజనాన్ని ఉపాధి కూలీ సృష్టించిందన్న విషయాన్ని ఉపసంహరించుకోగలరు. లేదా ఆ జనశాతాన్ని వ్యక్తపరిచి సమర్ధింకోగలరు. చిత్రగారు సూచించిన మేరకు వ్యభిచారలు అవుతున్నారన్న విషయాన్ని మీరు ఉపసంహరించుకోవడం వలన తప్పు ఉండదని భావిస్తున్నాను. మీ ఆసుపత్రికి వచ్చే అమ్మాయలు పట్టణం నుంచి గర్భిణీలుగా తిరుగురావడానికి గల కారణం, ఆ విష సంస్కృతివలయంలో చిక్కుకుని పోవడానికి కారణం పల్లెలో జీవితం లేకపోవడమే అన్నది సారాంశంగా భావిస్తే ఆరోగ్యకరంగా ఉండే పల్లె జీవితం వదిలి అనారోగ్యకర పట్టణ జీవితానికి లాక్కొని వెళ్లిపోతుంది ఎవరో, ఆ అదృశ్య శక్తి ఎవరో చెప్పగలరా? అరచేతిలో బూతల స్వర్గాన్ని ఉంచిన ఆ సెల్ రాజ్యమే మీలాంటి వారి చేతిలో మీ అనుభూతులను,మీ ఆగ్రహాలను, మీ సంశయాలను, మీ ఆనందాలను కవిత్వ రూపంలో ా పదిమందికి పంచిపెడుతున్న విషయాన్ని విస్మరిస్తే ఎలా గురూ.

      • CHITRA says:

        సర్ “కవిత్తవాలు ” బావుంది “కతోలు ” అంటే కూడా బావుంటుంది .మీ స్పందన పరిపుష్టం గా ఉంది . బావుంది . గెలుపు కోరుకునే వాళ్ళు మిత్రులని పోగొట్టుకుంటారు అది వారు గుర్తించే నాటికి అశోకుడి స్థితి లోకి వెళ్లి పోతారు పుస్తకం లోని విషయానికి కట్టుబడి చర్చ సాగాలని నేను కోరుకుంటాను. కాని ……..
        మీ ప్రకటనా విధానం బావుంది . OVER TO YOU

  • రాఘవ says:

    నేను ఈ పుస్తకం ఇంకా చదవలేదు.అంత కమ్యూనిస్టు పరిఙ్నానమూ లేదు.ఐనా ఈ వ్యాసం చదివిన మీదట వచ్చిన కొన్ని సందేహాలను ఇక్కడ ప్రస్తావించాలనిపిస్తున్నది(తెలిసిన,అధ్యయనం చేసిన మిత్రులెవరైనా వివరిస్తారనే ఆశ వల్ల).

    *ప్లాస్టిక్ గ్లాసులు రావడం తో ’రెండు గ్లాసుల పద్ధతి’ పోయింది ..’అందరికీ ఆ కొన్ని గ్లాసులే వాడాల్సిన స్థితి’ కి కాలం చెల్లి ’ఎవరి గ్లాసు వాళ్ళకే’ పద్ధతి వొచ్చింది.. ఐతే ఇది పెద్ద,చిన్న కులాలు రెంటినీ నొప్పించని ఒక చిట్కా నే అవుతుంది తప్ప’కుల వివక్ష’ కు సంబంధించిన ,ఏ ఫ్యూడల్ సంబంధమో నాశనమైందనడానికి ఉదాహరణ ఎలా అవుతుంది?…
    *ప్రస్తుతమున్న విప్లవ సంస్థల పోరాట వ్యూహాలకు, ఈ పుస్తక రచయిత లేదా ఈయన పరిశోధన వెలుగులోంచి చూడాలని అంటోన్న వాళ్ళు గానీ ప్రతిపాదిస్తున్న పోరాట వ్యూహాలకు గల నిర్దిష్టమైన తేడాలేమిటి?

    *”ఫ్యూడల్ వ్యవస్థ ను ధ్వంసం చేయడం భారత్ లో పూర్తయిపోయింది”-నిజమేనా? పూర్తిగా ధ్వంసమై పోయిందా?
    *కులవృత్తులు అలాగే ఉండిపోవాలనీ,చెప్పులు కుట్టుకునేవాళ్ళు,పారిశుధ్య పనులు చేసే వాళ్ళు మొదలైన వాళ్ళు ఎప్పటికీ అవే పనుల్లో కొనసాగాలనీ ఏ ప్రగతిశీల రచయితా కోరుకోడు గదా. పెట్టుబడి ప్రవేశం తో వృత్తులు ధ్వంసమౌతున్నాయ్,మంచిదే..అయితే ఎంతమందికి కొత్త జీవనోపాధులు దొరుకుతున్నాయ్? పాత ఆధారం పోయి,కొత్తదీ దొరక్కనో,దొరికింది చాలకనో నానాయాతనలు పడుతోన్న వాళ్ళ సంగతేమిటి?వాళ్ళ బాధల్నీ,బతుకు పోరాటాల్నీ నమోదు చేయాల్సిన,విశ్లేషించాల్సిన బాధ్యత రచయితలకు లేదా?అలా చేయడం వృత్తులుండాలని కోరుకోవడమా? ఇది కమ్యూనిస్ట్ కవులూ,రచయితలపై అన్యాయమైన ఆరోపణ చేయడమవదా?
    —మరొక్క మాట.చర్చించుకుందాం అంటూనే వ్యంగ్యాన్ని ప్రదర్సిస్తున్నారు చిత్ర గారు.(బ్రిటిష్ కాలంలోనే ఉన్నట్టు, దణ్ణం పెడతా, రాజుగారు వగైరా….).ఎందుకు సార్ చిత్ర గారూ ఇలా?

    • moida srinivasarao says:

      రాఘవ గారు పరిజ్ఞానం లేదంటూనే మంచి ప్రశ్నలను సందించారు. మీ ప్రశ్నలకు సమాధానాలన్నీ ఆ పుస్తకంలో తప్పక దొరుకుతాయి. చదవగలరు. సాగర్ గారు కులవృత్తులు ద్వంసమవుతున్నాయని చెప్పారు గమనించగలరు. కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి ఇలాంటి ఎదుగూబొదుగూ లేని, రైతుపై ఆధారపడి, గ్రామాలలో వారసత్వంగా సంక్రమించే వృత్తులు నాసనమవుతుంటే రచయతలు, కవులు కలిసికట్టుగా ఏడ్వాలంటారా?

    • లక్షణరావు says:

      రాఘవ గారు…మీరు వేసే ప్రశ్నలకు పల్లెను మింగిన పెట్టుబడి పుస్తకంలో కొన్ని సమాధానాలు దొరకవచ్చు. పుస్తకం చదివిన తరువాత, మీ పరిశీలనతో ఆ పుస్తకాంశాలను వాస్తవికంగా విశ్లేషించాలని నేను కోరుకుంటున్నాను. నా ఎరుక మేరకు పోరాటాలు అనేవి మనం అనుకునేవి కావు. మనం రూపొందించుకున్నంత మాత్రాన పోరాటాలు జరిగిపోవు. నిర్ధిష్ట పరిస్థితులకు అనుగుణంగానే నిర్ధిష్ట కర్తవ్యాలు ఉంటాయనుకుంటాను. అందుకు సామాజిక చలనం ఎటువైపు అన్న పరిశీలన కీలకమని అనుకుంటున్నాను. ఈ గ్రంథరచయత ఎటువంటి ప్రయత్నాన్నైతే సాగించి, ఒక నిర్ణయాన్ని ప్రకటించారో, మనం కూడా అటువంటి ప్రయత్నం చేసి తగిన జవాబులు వెతుక్కోవడం వలన మనకి తగినంత సాధికారిక సమాధానాలు లభించవచ్చునని నేను భావిస్తున్నాను.

    • CHITRA says:

      సర్ నమస్కారం బావుంది ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేసే వాళ్ళని ఏమిటంటారు భూస్వాములా పెట్టుబడి దారులా ?
      ఫ్యూడల్ వ్యవస్థ ఇంకా బలంగా ఉందని మీకు అనిపించిన కారణాలు రెండు చెప్పరూ ప్లీజ్
      మీ దగ్గర ప్రశ్నలు చాల ఉన్నాయి జవాబులు మార్క్స్ లో దొరుకుతాయి ఎంగెల్స్ లో దొరుకుతాయి
      కాపిటల్ లోని కాపిటలిస్ట్ ప్రొడక్షన్ అనే చాప్టర్ లో దొరుకుతాయి ఆయన రాసుకున్న ప్రీ కాపిటలిస్ట్ ఫారము ళేటీఓణ్శ్ అనే నోట్స్ లో దొరుకుతాయి ఫ్రాన్స్ ఇటలీ ఇంగ్లాండ్ చరిత్రల లో దొరుకుతాయి
      1789 తరువాతి ఫ్రాన్స్ చరిత్ర ఉపయోగపడుతుంది
      ఏ పని దొరకని వాడు దొరికిన పనికి తగిన కూలీ దొరకని వాడు తిరగబడతాడు
      దానికి మనం ఎం చెయ్యాలి అన్నదే విషయం WHAT IS TO BE DONE>

  • moida srinivasarao says:

    రామ్మోహన్ గారు మీ వ్యాసం చాలా బావుంది. ‘వృత్తికార్మికులకు సంబంధించిన వివరణలో ట్రాప్డ్‌ అనే పదాన్ని ఉపయోగించినా దాన్ని చాలా పరిమితమైన అర్థంలో పాసింగ్‌గా వాడారు.’ ఈ వాక్యం అర్ధం కాలేదు కాస్తా వివరించగలరు. అదేవిధంగా ఈ వ్యాసంలో ‘గొడ్డుచాకిరి’ అనే పదం ఎందుకో సందర్బోచితంగా లేదనిపించింది. వీలైనంత మేరకు పుస్తకంలోని ప్రదానంశాలను వ్యాస రూపంలో అందించినందుకు ధన్యవాదాలు.

  • mosuru santhamani says:

    నేల మీద ప్రేమ అందరికంటే కార్పొరేట్ సంస్థలకు ఎక్కువ.అందుకనే దేశమంటే మట్టి కాదు,దేశమంటే మనుషులన్నారు గురజాడ గారు .ఇపుదంతా ఇసిత్రమైన పదబంధాలు,అర్ధాలు.సంబంధాలు.ఎవురి కోసం ఏమి చేప్తన్నం,ఏమి రాస్తాన్నం ,అన్నది ఎవరు ఆలోచించటం లేదు.రావిశాస్త్రి అందికీ ‘నీ రాతలు ఏ మంచికి హానీ,ఏ చెడ్డకి మేలు చేస్తాన్నాయో చుసుకోవలన్నారు…వామ పక్ష భావాల పై విమర్శ కాదు దాడి చేయడం గొప్ప హాయిగా,ఆనందంగా,కొందోకచోట కొంత మెరుగు జీవుల ఆమోదంగా వుంది…పత్రికలూ,ప్రసార సాధనాలు వీటికి ప్రాధాన్యత ఇచి,నాల్రోజులు సందడి చేయడం…ఏ నాటినుంచో చూస్తున్నదే .ఒకప్పుడు సామాజికస్ప్రుహ అనే పదం బూతు అయ్యింది .సామాజికస్ప్రుహాగాలు అని వెతకరించే వాళ్ళు. ఇపుడు పెట్టుబడి ,భూస్వామ్య దుర్మార్గాలకు విరుగుడు కాదు,అభివృధి రూపంలో విధ్వంసం చేస్తోందంటే బూతు అవుతోంది.ఉరుము ఉరిమి మంగళం మీద పదినట్టని ఎండుకనేవరో గానీ … పల్లెను మింగిన పెట్టుబడి అని పుస్తకము,దాన్ని రాసిన రచయిత కూడా అంటే …ఎవరైనా పెట్టుబడిని నిరసించాలి,దుషించాలి,పల్లెని మింగిందని కోపించాలి,, గాని మధ్యలో పేదల గురించి వారి కష్టాల గురించి వాటి నించి విముక్తి గురించి అంకితమయ్యే కమునిస్తుల మీద నిరసనలు వెటకారాలు …వారివి వలపోతలనీ తలపోతలనీ దుషించాదాలు చదువుతుంటే ఆ సామెత ఇందుకా అని బోధపడింది..చిత్ర గారు,లక్ష్మనరావు గారు ఎందుకండీ అంత వెటకారం?అదీగాక ,మధ్యలో రచయితల మీద కవుల మీద విసుర్లేన్డుకండీ?కవులు,రచయితలు ఇప్పటిదాకా ప్రజల నోటిలో నినాదాలను వినిపించారు గాని పెట్టుబడిదారుల గానాన్ని అందుకోలేదు కదండీ?రాయనివి వుంటే,ముందు ముందు రాస్తారు,లేదా మీలాంటి విగ్మ్యులు రాస్తారు.పాపం సీరియస్ రచియితలు… ఏదో మేరకు రాస్తూనే వున్నారు.పల్లె నుంచి రెక్కలతో పట్నం వెళ్లి రెక్కలు తెగి పడుతోన్న మనుషులు గురించి …రాస్తున్నారు…ఎక్కువగా లేకపోవచు,లేదా మీ దృష్టికి పడక పొవచు.ఒద్దండి,నిన్ననే శ్రీ రమణ సామాజిక స్పృహ మీద కధవేదిక నెల్లూరు లో వెతకరించారు….అలా మీరు తయారు కావద్దు.చర్చ అనగా మీ అభిప్రాయాలకు ఆమోదం తెలపడమే కాదు కదండీ?ఎవర్నీ మాతదనివ్వరా ?(రామ్ )మొహనరాగమే తప్ప మరో ధ్వని రానివ్వర?రా నివ్వండి,అభిప్రాయాలను చెప్పనివ్వండి.అన్నింటికీ మీరే జడ్జిమెంట్ ఇచెస్తి,ఎలాగండీ?చివరగా ఒక మాట….తప్పులు అందరు చేస్తారు..త్యాగాలు కొందరే చేస్తారు….త్యాగాలమీద ఉమ్మి వేయడం సూర్యుడి మీద……లాటిది….

    • CHITRA says:

      అమ్మా నమస్కారం పుస్తకం గురించి గానీ వ్యాసం గురించి ఏమైనా మాట్లాడు కుందామా ? త్యాగం అంటే ఏమిటి ? అది ఎవరు చేస్తారు ?

      • kcube varma says:

        chitragaru meru power of attorney rammohanka vidyasagarka tesukunnaru.. maataadaneyandi saar andarni mee anta kaakapoyina

      • CHITRA says:

        సర్ నమస్కారం నాది కూడా అదే మాట

    • లక్షణరావు says:

      మేడం గారు. మీ సూచనలకి కృతజ్ఞతులు. కెక్యూబ్ వర్మగారు కవి అన్న విషయం మీకు తెలుసు అనుకుంటున్నాను. కేవలం సరదా కోసమో, ఆనందాన్ని పంచుకునేందుకు కవిత్వం రాసే కవి కాదు. సీరియస్ గా సామాజిక సమస్యల పట్ల మార్క్సిస్టు దృక్పథంతో కవిత్వీకరించే కవి ఆయన. కాని, అటువంటి కవి కూడా ఉపాధి హామీ పథకం వలన సోమరులు పెరిగిపోయారని వ్యాఖ్యానించడాన్ని ఎలా చూడాలంటారు. ఈ పదం సరిగ్గా మా ప్రాంతంలో జూట్ పరిశ్రమల యజమానులు, భూస్వాములు పదేపదే అంటున్నారు. తమ సంక్షోభం ఎందులోనో తెలుసుకోలేని సన్న, చిన్న కారు రైతులు కూడా పైవారితోనే గొంతుకలుపుతున్నారు. ఆ సంక్షోభాన్ని శాస్త్రీయ పరిశీలన చేసి అత్యధికులైన చిన్న రైతులను చైతన్యవంతులను చేయాల్సిన గురతరమైన కర్తవ్యాన్ని విస్మరించి, మా వర్మలాంటి కొంత మంది రచయతలు తెలుసో తెలియకో వాటినే తలకెత్తుకోవడాన్ని ఏ విధంగా సమర్ధించాలో మీరే చెప్పండి. మరో మాట ఇక్కడెవరూ ఒకరి అభిప్రాయాలను మరొకరు అడ్డుకోలేరు. ఒకరి గొంతును మరొకరు నొక్కేయలేరు. అందుకు ఈ చర్చే నిదర్శనం. ఈ చర్చ పొడుగునా ఎక్కడైనా మేము తీర్పు ఇచ్చేశాం కాబట్టి ఇక చర్చకు అవకాశం లేదని చెప్పామా ? తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు. ఇక్కడ కొనసాగుతున్నది చర్చేనన్నది నా భావన. మాట్లాడనివ్వండి…మాట్లాడనివ్వండి అంటూనే మీరు మమ్మల్ని మాట్లాడవద్దని పరోక్షంగా చెప్పడం అన్యాయం కాదా మేడం. నూరు పూలు వికసించాలంటే వెయ్యి ఆలోచనలు సంఘర్షించాలి కదా మేడం. అందుకే… నా బుద్ది వికాసానికే ఈ ప్రయత్నం. మీ సూచనలకి కృతజ్ఞతులు మరోసారి చెబుతూనే పుస్తకం మీదకి మీలాంటి వారు చర్చని నడిపిస్తే బాగుంటుందని నా కోరిక.

    • లక్షణరావు says:

      మేడం గారు. మీ సూచనలకి కృతజ్ఞతులు. కెక్యూబ్ వర్మగారు కవి అన్న విషయం మీకు తెలుసు అనుకుంటున్నాను. కేవలం సరదా కోసమో, ఆనందాన్ని పంచుకునేందుకు కవిత్వం రాసే కవి కాదు. సీరియస్ గా సామాజిక సమస్యల పట్ల మార్క్సిస్టు దృక్పథంతో కవిత్వీకరించే కవి ఆయన. కాని, అటువంటి కవి కూడా ఉపాధి హామీ పథకం వలన సోమరులు పెరిగిపోయారని వ్యాఖ్యానించడాన్ని ఎలా చూడాలంటారు. ఈ పదం సరిగ్గా మా ప్రాంతంలో జూట్ పరిశ్రమల యజమానులు, కౌలుదారులు పదేపదే అంటున్నారు. తమ సంక్షోభం ఎందులోనో తెలుసుకోలేని సన్న, చిన్న కారు రైతులు కూడా పైవారితోనే గొంతుకలుపుతున్నారు. ఆ సంక్షోభాన్ని శాస్త్రీయ పరిశీలన చేసి అత్యధికులైన చిన్న రైతులను చైతన్యవంతులను చేయాల్సిన గురతరమైన కర్తవ్యాన్ని విస్మరించి, మా వర్మలాంటి కొంత మంది రచయతలు తెలుసో తెలియకో వాటినే తలకెత్తుకోవడాన్ని ఏ విధంగా సమర్ధించాలో మీరే చెప్పండి. మరో మాట ఇక్కడెవరూ ఒకరి అభిప్రాయాలను మరొకరు అడ్డుకోలేరు. ఒకరి గొంతును మరొకరు నొక్కేయలేరు. అందుకు ఈ చర్చే నిదర్శనం. ఈ చర్చ పొడుగునా ఎక్కడైనా మేము తీర్పు ఇచ్చేశాం కాబట్టి ఇక చర్చకు అవకాశం లేదని చెప్పామా ? తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు. ఇక్కడ కొనసాగుతున్నది చర్చేనన్నది నా భావన. మాట్లాడనివ్వండి…మాట్లాడనివ్వండి అంటూనే మీరు మమ్మల్ని మాట్లాడవద్దని పరోక్షంగా చెప్పడం అన్యాయం కాదా మేడం. నూరు పూలు వికసించాలంటే వెయ్యి ఆలోచనలు సంఘర్షించాలి కదా మేడం. అందుకే… నా బుద్ది వికాసానికే ఈ ప్రయత్నం. మీ సూచనలకి కృతజ్ఞతులు మరోసారి చెబుతూనే పుస్తకం మీదకి మీలాంటి వారు చర్చని నడిపిస్తే బాగుంటుందని నా కోరిక.

    • లక్షణరావు says:

      మేడం గారు. మీ సూచనలకి కృతజ్ఞతులు. కెక్యూబ్ వర్మగారు కవి అన్న విషయం మీకు తెలుసు అనుకుంటున్నాను. కేవలం సరదా కోసమో, ఆనందాన్ని పంచుకునేందుకు కవిత్వం రాసే కవి కాదు. సీరియస్ గా సామాజిక సమస్యల పట్ల మార్క్సిస్టు దృక్పథంతో కవిత్వీకరించే కవి ఆయన. కాని, అటువంటి కవి కూడా ఉపాధి హామీ పథకం వలన సోమరులు పెరిగిపోయారని వ్యాఖ్యానించడాన్ని ఎలా చూడాలంటారు. ఈ పదం సరిగ్గా మా ప్రాంతంలో జూట్ పరిశ్రమల యజమానులు పదేపదే అంటున్నారు. తమ సంక్షోభం ఎందులోనో తెలుసుకోలేని సన్న, చిన్న కారు రైతులు,కౌలుదారులు కూడా పైవారితోనే గొంతుకలుపుతున్నారు. ఆ సంక్షోభాన్ని శాస్త్రీయ పరిశీలన చేసి అత్యధికులైన చిన్న రైతులను చైతన్యవంతులను చేయాల్సిన గురతరమైన కర్తవ్యాన్ని విస్మరించి, మా వర్మలాంటి కొంత మంది రచయతలు తెలుసో తెలియకో వాటినే తలకెత్తుకోవడాన్ని ఏ విధంగా సమర్ధించాలో మీరే చెప్పండి. మరో మాట ఇక్కడెవరూ ఒకరి అభిప్రాయాలను మరొకరు అడ్డుకోలేరు. ఒకరి గొంతును మరొకరు నొక్కేయలేరు. అందుకు ఈ చర్చే నిదర్శనం. ఈ చర్చ పొడుగునా ఎక్కడైనా మేము తీర్పు ఇచ్చేశాం కాబట్టి ఇక చర్చకు అవకాశం లేదని చెప్పామా ? తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు. ఇక్కడ కొనసాగుతున్నది చర్చేనన్నది నా భావన. మాట్లాడనివ్వండి…మాట్లాడనివ్వండి అంటూనే మీరు మమ్మల్ని మాట్లాడవద్దని పరోక్షంగా చెప్పడం అన్యాయం కాదా మేడం. నూరు పూలు వికసించాలంటే వెయ్యి ఆలోచనలు సంఘర్షించాలి కదా మేడం. అందుకే… నా బుద్ది వికాసానికే ఈ ప్రయత్నం. మీ సూచనలకి కృతజ్ఞతులు మరోసారి చెబుతూనే పుస్తకం మీదకి మీలాంటి వారు చర్చని నడిపిస్తే బాగుంటుందని నా కోరిక.

  • balasudhakarmouli says:

    శాస్త్రీయమైన చర్చ జరగాలి. ఏదైనా వొక ప్రగతిబద్ధ పుస్తకం బయటకు వొచ్చిందటే.. వొక అపూర్వమైన పని జరిగినట్టే. ఇప్పుడు చర్చల్లో నలుగుతుంది.. నిజంగా చర్చ జరగాల్సిన పుస్తకమే. బుద్ధిజీవులు పరివ్యాప్తమవ్వాల్సిన విషయాన్ని ప్రవాహంగా తీసుకుపోవాలి. అసలే మన దేశంలో సైద్ధాంతిక మూలాల మీద నిలబడి లోకాన్ని చూసేవాళ్లు తక్కువ.. వున్న వాళ్ల నిబద్ధత ఎంత ? మళ్లీ ఎదురుపడుతూ ప్రశ్న !
    తప్పదు ప్రశ్నలను ఛేదించుకెళ్లాలి.
    వొక మంచి పుస్తకంపై మంచి చర్చే జరగాలి. చాలా వైషమ్యాలు వస్తాయి. వైషమ్యాలను ఎదుర్కోవడమే మన పని.
    పుస్తకంలో ప్రాక్టికల్ అంశాలను తీసుకోవడం అవసరం.
    తీసుకుందాం.
    ఏ చర్చకైనా ప్రజాస్వామ్యతే ప్రధానం.
    ముఖేముఖి చర్చ జరిగితే మరింత ఉపయోగం వుంటుందనుకుంటున్నాను. సూటిగానూ వుంటుంది. ముఖ్యంగా అభిప్రాయాలను అద్భుతంగా ప్రసరణ చేసుకోవొచ్చు.

    • CHITRA says:

      సర్ నమస్కారం బావుంది థాంక్స్ . చర్చ కోసం చర్చ వద్దు ఇది పబ్లిక్ డొమైన్ పుస్తకం వచ్చింది వ్యాసం వచ్చింది వాటి గురించి మాట్లాడ వలసిన అవసరం ఉన్నది మీ సూచన చాల మంచిది

  • లక్షణరావు says:

    మౌళీ గారు. చర్చ అంటేనే ఇచ్చిపుచ్చుకోవడం. ఇక్కడ వైషమ్యాలకు తావులేదు. జరుగుతున్నదంతా ఒకరితో మరొకరి భావ సంఘర్షణే. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు.

  • CHITRA says:

    రామ్మోహన్ గారు నమస్కారం మనుషులు తినే ఆహార ఉత్పత్తి లో మనం వెనుక బడి లేము ఈ వాక్యం ఇంత స్పష్టం గా రాసినందుకు ధన్యవాదాలు కడుపులో ఉన్నది ఇలా చిన్న మాటల్లో క్లుప్తం గా చెప్పలేక ఎవరూ వినక నేను గడిపిన నిద్ర లేని రాత్రులని గుర్తు చేసుకుని నాకు ఎంత దుఖం వచిందో వేల వేల థాంక్స్ నా ఆయుషు కూడా పోసుకుని 150 ఏళ్ళు బతకండి

  • gsrammohan says:

    స్పందించిన మిత్రులందరికీ ధన్యావాదాలు. వ్యాసాన్ని సరైన స్ఫూర్తితో అర్థం చేసుకున్నవారు కొందరు. అపార్థం చేసుకున్న వారు మరికొందరు. విప్లవం వద్దని ఇందులో ఎక్కడా చెప్పలేదు. సాయుధ పోరాటం అవసరం లేదని అసలే చెప్పలేదు. పెట్టుబడికి ఒక స్వభావ ముంటుందని, బూర్జువా ప్రజాతంత్ర విప్లవం మనం అనుకున్న రీతిలో జరగనంత మాత్రాన దానికి ఆ స్వభావం లేకుండా పోదని చెప్పాను. అంతే. దాన్ని తీసుకుని నేను విప్లవం వద్దన్నట్టుగానూ, సాయుధపోరాటం అవసరం లేదంటున్నట్టుగానూ రమాసుందరి గారు అర్థం చేసుకున్నారు. గట్టెక్కిన వారిగురించి మాట్లాడుతున్నట్టు మరో అన్యాయమైన అన్వయం చేశారు. గ్రామీణ సమాజంలో వృత్తి కార్మికులు ఒక రకమైన బానిస చట్రంలో ఇరుక్కుపోయి ఉన్నారని వారిని ఆ చట్రంనుంచి బయటపడేయకపోతే విముక్తిలేదని మార్క్సిజాన్ని శాస్ర్తీయంగా అర్థం చేసుకున్నవారెవరికైనా అనిపిస్తుంది. అర్థం చేసుకోవడం వదిలేసి ఉక్రోశపడితే ఎలాగండీ! ఇంతకాలం అతివాద దుస్సాహసిక పంథాగా కనిపించిన లైన్‌పై మీకిప్పుడు కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది కాబట్టి మీరిలాగా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదని నేను అనొచ్చు.కానీ అనను. వృత్తులను రద్దుచేయడం, వ్యవసాయాన్ని మెకనైజ్‌ చేయడం విప్లవకారుల ప్రధాన లక్ష్యాల్లో భాగంగా ఉండాలని అనూరాధాగాంధీ చాలాకాలం క్రితమే రాశారని, ఆమె జీవితాన్ని సాయుధపోరాటానికి అంకితం చేసిన మనిషని గుర్తుచేయొచ్చు. కానీ ఇలాంటి అడ్డదారుల్లో మిమ్మల్ని ఒప్పించాల్సిన అవసరమేమీ లేదు. అది సరైన పద్ధతి కూడా కాదు. నిజాయితీతో నిబద్ధతతో పనిచేయడం అనే మంచి లక్షణాలతో పాటు ఎదుటివ్యక్తికి లేని ఉద్దేశ్యాలు ఆపాదించి ముద్రలువేయడం కూడా వామపక్షాల్లో వారసత్వ లక్షణాలుగా వస్తూ ఉన్నాయి. ఆ రెండోది మనం ఎంత తగ్గించుకోగలిగితే అంత ఆరోగ్యం. వామపక్షవాదులు వృత్తుల రక్షణ గురించి మాట్లాడడం లేదన్నట్టు, నేనే అపార్థం చేసుకున్నట్టు రాశారు. నా అనుభవం చెపుతున్నది వేరు. వృత్తులను రక్షించుకోవడం విప్లవకరమైనదని ఆవేశంతో వాదించిన వారే నాకు ఎక్కువగా కనిపించారు. అది కళ అని దాన్ని రక్షించుకోవడం మన విప్లవ కర్తవ్యమని ఏవేవో పదబంధాలతో మాట్లాడినవారినే ఎక్కువగా చూశాను. నాది ప్రత్యేకమైన అనుభవం కాదని చాలామంది మిత్రుల అనుభవాలను పంచుకున్నపుడు అర్థమైంది. రమా సుందరిగారి అనుభవాలు ఏం చెపుతున్నాయో నాకైతే తెలీదు.
    రాఘవగారూ, జీవనోపాధి కోల్పోయిన వారి గురించి రాయొద్దని ఎవరన్నారో నాకు తెలీదు. అలా నేనెక్కడా రాయలేదు. జీవనోపాధి కోల్పోయిన వారి గురించి రాయడం వేరు. వృత్తులను ఆరాధించడం, పాతవన్నీ అలాగే కొనసాగాలనుకోవడం వేరు. రెండో దాని గురించే నేను మాట్లాడాను. ఆ ధోరణి కూడా సాహిత్యంలో బోలెడంత ఉన్నది. లంబాడామె చీరకట్టుకుంటే కూడా బోలెడంత బాధపడిపోయి కవిత్వం రాసిన మిత్రులు నాకు తెలుసు. చెట్టుపాయె,చెట్టుమీద పిట్టబాయె,చెట్టుకింద రెట్టబాయె తరహాలో ఎన్నెన్ని ఫేక్‌ ఏడుపులు సాహిత్యంలో ఉన్నాయో మనకు తెలుసు. గ్రామాలను పిక్నిక్‌ స్పాట్ల మాదిరి చూస్తూ రోమాంటిసైజ్‌ చేసే ఎలీట్‌ ధోరణి పురోగామి సాహిత్యం పేరుతో ప్రచారంలో ఉన్నది. వివరంగా వేరే సందర్భంలో మాట్లాడుకుందాం. రెండు గ్లాసులు ఉండడం అన్నది కుల వివక్ష రూపం అని మీరొప్పుకుంటే అది పోవడమంటే ఆ కులవివక్ష రూపం పోవడమేనని నేను ప్రత్యేకంగా చెప్పనక్లర్లేదు. ఇక భూస్వామ్య సంబంధాలు దెబ్బతినడం గురించి సాగర్‌ వివరంగానే చర్చించి ఉన్నారు. గతంలోనూ దీనికి సంబంధించి బోలెడన్న అధ్యయనాలున్నాయి. ఆ చర్చకు ఇక్కడ స్పేస్‌ సరిపోదు.
    మొయిద గారూ, గొడ్డుచాకిరి అనేది ఒక ఎక్స్‌ప్రెషన్‌. అన్ని గ్రామాలను తిరిగి అన్ని విషయాలు సేకరించడం కష్టమైన పని అనే అర్థంలో పాజిటివ్‌గానే వాడాను. అనూరాధాగాంధీ వృత్తికార్మికుల గురించి మాట్లాడిన సందర్భం గురించి వివరణ కోరారు. కేస్ట్‌ క్వచ్చన్‌ ఇన్‌ ఇండియా అని గూగుల్‌లో కొడితే ఆమె వ్యాసం వస్తుంది. మూడు భాగాలుగా ఉంటుంది. మన దేశంలో గ్రామీణ సమాజంలో వస్తున్న మార్పుల గురించి కులం గురించి అధ్యయనం చేయాలనుకునేవారెవరైనా కచ్చితంగా చదవాల్సిన వ్యాసం.
    కె క్యూబ్‌ వర్మ గారు, మొరుసు శాంతామణిగారు ఏం మాట్లాడారో ఎందుకు మాట్లాడారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ శాంతామణి గారు చాలా శాపనార్థాలు పెట్టారు. త్యాగాలు అనీ అవనీ ఇవనీ ఏవేవో మాట్టాడారు. సూర్యుని మీద ఉమ్మివేయడం దాకా వెళ్లారు. నాకు తెలిసి సాగర్‌ తన పుస్తకంలో త్యాగాలను విప్లవకారుల కృషిని ఎక్కడా తక్కువ చేయలేదు. నేనూ ఎక్కడా చేయలేదు. మరి ఆ ప్రస్తావన ఎందుకొచ్చిందో తెలీదు. వైఎస్‌ చనిపోతే కూడా వేయి మంది ఉసురు తీసుకునే చోట నిలబడి ఎవరైనా రాజకీయాలు మాట్లాడకుండా ఊరికే త్యాగాల గురించి మాట్లాడితే అనుమానం వస్తుంది. సాధారణంగా శవాల మీద చిల్లర ఏరుకునే వారుంటారు. తమను తాము పీఠం మీద కూర్చోబెట్టుకోవడానికి అవతలివారిని అవమానించడానికి ఇంకెవరో చనిపోయినవారి నెత్తుటిని పెట్టుబడిగా మార్చుకున్నారంటే వీరు జలగలేమో అని అనుమానం వస్తుంది. అయితే అనుమాన ప్రమాణంతో అంతటి మాట అనలేను. బహుశా ఉద్యమాలమీద కన్సర్న్‌ ఉన్న మనిషేమో అని కూడా ఎక్కడో అనుమానం. కన్సర్న్‌తో మాట్లాడి ఉంటే వారెంత మాట అన్నా పరుషంగా సమాధానం ఇవ్వక్కర్లేదు. అవతలి వ్యక్తి కనీసం “గుర్రం మీంచి పూలను చూసే” వ్యక్తి అయినా మిత్రుల కిందే లెక్క. అయితే మిత్రులకు కూడా కచ్చితంగా చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. శాంతామణిగారూ, ఈ వ్యాసం త్యాగాలమీద ఉమ్మివేయడంగా మీకు అర్థమైంది అంటే మీరు సైక్రియాట్రిస్టుకు చూపించుకోవాల్సిన టైం వచ్చింది అని అర్థం. ప్లీజ్‌!

    • moida srinivasarao says:

      రామ్మోహన్ గారు అనురాధా గాంధి గారి వ్యాసాన్ని సూచించినందుకు ధన్యవాదాలు.

  • santhamani says:

    chitranga maatadatharandee…peruku taggattu.pustakam gurinchigaka mee bhagotham matadana?tyagamante meeku,naku,teliyadulendi.manakadi patyapu padardham.vetakaram dayachesi vaddi.raasina rachayithanee,vyasakartanee minchi andari prasnalaku meeru javabulu cheptunte…chitram kada?meeru mee varaku abhiprayalu cheppandi.memu maa abhiprayalu cheptam.maa abhiprayalu tappanee,maa prasnalaku meeru javabulu cheppestunte..laxmanarao garu meeku idi vartistundi…matada nivvandante patakulni,mee laga vakalta puchukunnavallani kadu..raghavagaro,ramasundarigaro,varmagaro neno…vyasam meeda,pustakam meeda abhiprayalu,prasnalu vesam.vaaririvuru cheptaru.mee varaku mee abhiprayalu cheppi aagandi.vaadana veru,charcha veru.varma upadhi koolila paina ala anatam tappe,antha matrana aa thappuni yetti chupali thappa,andaru rachayithalanu drushti lopistulanatam…andulo serious rachayithalanu…sababa?Sriramana vanti rachayithala matalanu,bhavalanu khandinchandi.vaallanemee anaru meeru,vamapaksha rachayithale meeku chulakana…vamapaksha vaakyala paina avathala varikee chulakane…mee mill proprieters laga.

    • లక్ష్మణఱావు says:

      మేడం గారు. మా మిత్రుడు వర్మ రాసిన అభిప్రాయం మీద నా సందేహాలను వ్యక్తం చేశాను, నా అభిప్రాయాలను చెప్పాను. లోపాలనే ఎత్తిచూపాను. వాటిని ఉపసంహరించుకోమనే సూచించాను. ఎవరూ వాదులాటకి దిగలేదండి. ఒకసారి గమనించగలరు. నేను ఎక్కడా కూడా మీరు వేసిన ప్రశ్నలకు బదులు చెప్పలేదు. రాఘవగారికి కూడా సాగర్ గారు సాగించిన గ్రామ పరిశీలన ప్రయత్నాన్ని చేపట్టి వాస్తవాలను తెలుసుకుని మనం కూడా విశ్లేషణలు చేద్దామని అన్నాను. అదెలా తప్పు అవుతుందో అర్ధం కావడం లేదు. ఉపాధి కూలీలను సోమరలు అనడడం తప్పేనని అంగీకరించిన మీరు వారిని చులకన చేసి మాట్లాడుతున్నామని అనడం బాధను కలిగిస్తుంది. శ్రమ చేసే వారిని తెలిసో, తెలియకో హేలనతో మాట్లాడితే అది అడగడం చులకన చేయడమవదేమోనని నా అభిప్రాయం. ఇంతకుముందు నేను పోస్టు చేసినట్లగానే ఈ పుస్తకం మీద, అందులో విషయాల మీద చర్చ జరిగేటట్లు చూడగలరు.

      • కెక్యూబ్ వర్మ says:

        లక్ష్మణ రావు గారు శాంతామణిగారూ ఉపాధి కూలీలను గూర్చి నేనన్నమాటకు కట్టుబడే వున్నా. ఉపాధి హామీ పథకం వచ్చాక గ్రామాలలో వ్యవసాయ ఉత్పత్తి పనులకు కూలీలు దొరక్క పంట పొలాలు పడావు పడ్డ వాటిని చూస్తున్నాం. పెరిగిన కూలీ రేట్లు ఇచ్చుకోలేక వచ్చిన వారు సరిగా పనిచేయక వ్యవసాయం చేయలేక చిన్నా చితకా రైతులు పల్లెలను వీడి పట్టణాల బాట పట్టడం అభివృద్ధి చిహ్నమా? ఈ పథకం వెనక కుట్ర దాగి వుంది. అలాగంటే లక్షణ గారు పాలేళ్ళ వ్యవస్థ ఉండాలా అంటారు. అందరికీ ట్రాక్టర్ లతో అధునాతన యంత్రాలతో పనులు చేసుకునే స్తోమత ఉండదు కదా. ఇది పరోక్షంగా భూమినుండి వ్యవసాయదారున్ని దూరం చేయడమే కదా? ఇది బడా రైతులకో రియల్ ఎస్టేట్ వ్యాపారులకో అమ్ముకొని శ్రమ నుండి దూరమై వీరన్నట్టుగా పట్టణాలలో చేరి అపార్ట్ మెంట్ల దగ్గర సెక్యూరిటీ గార్డు యూనిఫాంలలో అడుక్కునే దొరతనం కావాలా?

      • CHITRA says:

        అయ్యా కూలి వెధవలని తన్ని పని చేయించక పొతే వాళ్ళు సరిగా చెయ్యరని వేదాల్లోనే ఉన్నదండి బాబూ బహు బాగా చెప్పారు ఈ గవేర్ మెంటుంది చూసారూ ! ఎబ్బే కూలి వాళ్ళు ఎలా చెబితే అలా చెస్తుందండి. మా అగ్రహారాలు అన్నీపోయి నాయంటే వీళ్ళే కారణం . మళ్ళీ రైతు రాజ్యం రావాలండి . రైతే రాజు అని గ్రహించే నేను అలా అన్నానండి. సేలవండి

    • లక్ష్మణఱావు says:

      మేడం గారూ…మా మిత్రుడు వర్మ ఉపాధి కూలీల విషయంలో తన మాటకి తాను కట్టుబడి ఉన్నానని అంటున్నారు. మీరేమో అది తప్పు అని అంటున్నారు. కాబట్టి, ఈ విషయంలో మీరు వివరిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే నేను వామపక్ష రచయతులను చులకన చేశానని అన్నారు. ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగిఉండడాన్ని వేలెత్తి చూపడం చులకన అవుతుందని మీ ద్వారా నేను తెలుసుకున్నాను. అందుకే ఈ విషయంలో ఏమీ మాట్లాడాలని అనుకోవడం లేదు. కాని, తాజాగా మా మిత్రుడు పోస్టు చేసిన అభిప్రాయం మీద ఇప్పటికే “ఉపాధి’ కూలీల మీద వర్మగారిది తప్పు అని చెప్పి ఉన్నారు. అందువలన మీరే మా మిత్రుడుకి అదెలా తప్పో వివరిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రాధమిక స్థాయిలో ఉన్న మాలాంటి వారికి ఇలాంటి అంశాల పట్ల ఏ విధంగా చర్చించాలో తెలుస్తుందన్న ఆలోచనతోనే మిమ్మల్ని కోరుతున్నాను.

  • santhamani says:

    రామ్మోహన్గారికి నా స్పందన అర్ధం కాక పోయినా కోపమోచిందంటే అతను ముందుగా సైక్రియత్రిస్త్కిచూపించుకోవాలి. మాటలు ,అక్షరాలు మాత్రమె దేశాన్ని మార్చ లేవు.,సాగర్ గారి పుస్తకం పట్టుకొని మీరూ ,చిత్రంగా మీ తరపున చిత్ర గారు,లక్ష్మన్రవూ మాతాదతున్నధీ …ఏమిటండీ ?ఇదంతా విప్లవం కోసమే?మీ వ్యాసం ఎవరిని ఎత్తి పొడిచింది?పెట్టుబడి మీద పొడవండి ,ఆ ఎరుక మీ వ్యాసం ఇచిందా?ఇవ్వకే,చిత్ర సైన్యం మీ తరపు దిగింది.నా స్పందన అర్ధం కాకపోతే వోదిలేయండి,గాని సైక్రియత్రిస్త్కి మాత్రం కలవండి..ఇంతటితో సెలవిక ఈ చర్చకు కాదు రచ్చకు .

  • ఎన్ వేణుగోపాల్ says:

    చర్చ జరుగుతున్న తీరు దీనిలో పాల్గొనాలనే కోరికను చంపేసింది. ఇది చర్చలో భాగం పంచుకోవడం కాదు. జి ఎస్ రామమోహన్ గారు మొదట వ్యాసంలోనూ, ఆ తర్వాత వ్యాఖ్యలకు స్పందనలోనూ అనూరాధా గాంధీ పేరు ఉటంకించారు గనుక ఒక మాట చెప్పాలని అనిపిస్తున్నది. జి ఎస్ రామమోహన్ గారు తన అభిప్రాయాలేవైనా చెప్పుకోవచ్చు గాని వాటికీ అనూరాధ గాంధీ అభిప్రాయాలకూ సంబంధం లేదు. ఆయన రెండు చోట్లా తాను చెపుతున్నదీ అనూరాధ గాంధీ చెప్పిందీ ఒకటేనని అనిపించేట్టు రాశారు. అలా అపోహ పడడానికి కూడ ఆయనకు హక్కు ఉంది. కాని ఆయన పస్తావించిన అనూరాధ గాంధీ వ్యాసం (ఇతర వ్యాసాలు కూడ) అచ్చయి ఉంది/ఉన్నాయి. ఆయన కూడ కోరినట్టుగా ఎవరైనా ఆ వ్యాసాన్నితప్పకుండా చదవాలి. కాని ఆయన చేసినలాంటి నిర్ధారణలు చేయడానికి ఆ వ్యాసాలలో అవకాశం లేదు. పైగా ఈ చర్చకు మూలమైన పుస్తక రచయితా, వ్యాఖ్యాతా చెపుతున్న అభిప్రాయాలకు పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలే అనూరాధ గాంధీ రచనల్లో కనబడతాయి. ఆమె పెట్టుబడి ప్రవేశపు పాత్ర గురించి చెప్పారు గాని, అన్ని రచనల్లోనూ ఇది అర్ధవలస, అర్ధభూస్వామ్య సమాజం అనే అవగాహనతోనే విశ్లేషించారు. ఆ దృక్పథపు ఆచరణలోనే మరణించారు. ఆమె వ్యాసంలో “వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం” గురించీ, “ఇండస్ట్రియలైజ్ చేయడం” గురించీ “కింది కులాల, చేతివృత్తుల బృందాల సాంకేతిక పరిజ్ఞానాన్నీ నైపుణ్యాన్నీ మెరుగుపరచడం” గురించీ మాట్లాడారని చదివాను గాని రామమోహన్ అంటున్నట్టుగా “వృత్తులను రద్దు చేయాలనీ, వ్యవసాయాన్నీ మెకనైజ్ చేయాలనీ” ఎక్కడ అన్నారో కనబడలేదు.

  • gsrammohan says:

    వేణుగారూ, ఇవి అనూరాధాగాంధీ వ్యాసంలోని వాక్యాలే. నావి కావు.
    In the rural sector, caste based occupations shall be abol­ished and alternate employment given by teaching new methods and techniques.
    Agriculture shall be developed and industrialized and indus­try shall be based on agriculture.

  • ఎన్ వేణుగోపాల్ says:

    వృత్తులకు ఆధారంగా కులాలు ఉండడాన్ని (కుల-ఆధార వృత్తులను – కాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్స్) రద్దు చేయాలనడానికీ, వృత్తులనే రద్దు చేయాలనడానికీ తేడా మీకు చెప్పనక్కర లేదనుకుంటాను. ఆమె అన్నది మొదటి మాట, మీరు అంటున్నది రెండో మాట. అలాగే ఆమె ఇండస్ట్రియలైజ్ అనే మాట వాడారని నేను కూడ ఉటంకించాను. ఇప్పుడు చాలమంది వాడుతున్న “మెకనైజ్” అనే మాటకూ ఆమె గాని, అటువంటి ఆలోచనలు చేసినవారు గాని వాడిన ఇండస్ట్రియలైజ్ అనే మాటకూ తేడా ఉందని నా అనుమానం.

  • HARITHA DEVI says:

    రామ్మోహన్ గారి వ్యాసం కనబడగానే ఒక్క పదం కూడా వదల కుండా ఆనందాన్ని అనుభవిస్తూ చదివేదాన్ని. ఈ వ్యాసం రామ్మోహన్ అంటే ఇతనా అని ఒక్కసారి వులిక్కిపడ్డట్టు చేసింది.చర్చలోకి పోవాలంటే భయంగా వుంది. నాకంత మానసిక స్థైర్యం లేదు. చిత్రాగారు చర్చ సాగాలి అంటూనే ,వుక్రోషంగా అనాగరికంగా అవతలి వారి నోరుమూపించే కార్యక్రమం తీసుకున్నట్టు వుంది.రామోహన్ గారు ఈ చర్చకు ఇచ్చిన సమాధానం ,వ్యక్తిగత దాడులకి దిగటం దురదృష్టకరం.

    • CHITRA says:

      అమ్మా నమస్కారం మాది చిన్న పల్లె మరి నాగరికుడిని ఎలా అవుతాను నాకు ROAD CROSSING కూడా రాదు నాకు రోషమే లేదు ఇంకా ఉక్రోషమా సరే కానీ నా మాటల్లో అనాగరికత అనిపించే పదాలు వాక్యాలు వ్యక్తీకరణ రెండైనా చెప్పండి ప్లీజ్

  • gsrammohan says:

    వేణుగారూ,
    కేస్ట్‌బేస్డ్‌ ఆక్యుపేషన్స్‌ రద్దు చేయాలి అంటే వృత్తులకు ఆధారంగా కులం ఉండడాన్ని రద్దుచేయాలనా! అంటే ఏమిటి? అర్థం కాలే! అదెలా చేస్తారు? కులవృత్తులు రద్దుచేయాలి అని స్పష్టంగానే ఉంది కదా! మీరు వ్యక్తం చేసిన మూడు అభ్యంతరాలలో మొదటిది దీనితో తీరిపోయినట్టే. రెండోది, వ్యవసాయాన్ని ఇండస్ర్టియలైజ్‌ చేయాలన్నారామె. నేను మెకనైజ్‌ అనే పదం వాడాను. మిత్రుల ప్రశ్నలకు జవాబు రాస్తున్నపుడు నాకు అలాగే గుర్తొచ్చింది. అందులో భాష పరంగా సాంకేతికపరమైన తేడా తప్ప స్ఫూర్తి పరంగా రెండూ ఒకటే అని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ ఇండస్ర్టియలైజ్‌కి మెకనైజ్‌కి తేడా ఉందని మీరు భావిస్తే చర్చించొచ్చు. కానీ అది ఆమె అభిప్రాయాలను డిస్టార్ట్‌ చేసినట్టు అయితే కాదు కదా. ఇక మూడోది పుస్తకంలోని సాగర్‌ అభిప్రాయాలతోనో దానిమీద నేను రాసిన అభిప్రాయాలతోనో ఆమె అభిప్రాయాలను కలగలిపి ఏకాభిప్రాయం ఉన్నట్టు అర్థం వచ్చేలా రాశాననేది. అలాంటి ఉద్దేశ్యం ఏ మాత్రం లేదు. ఆమె మీద ఆమె వ్యాసం మీద గౌరవం కొద్దీ ప్రస్తావించాలనిపించి ఒకే ఒక వాక్యం రాశాను. అందులోనూ ఆమె రాసిన విషయాన్ని మాత్రమే చెప్పి అందులో పరిమితి ఉందని ఆ ఖాళీని ఇపుడు తన పరిశోధనతో విద్యాసాగర్‌ పూరించారని రాశాను. అందులో డిస్టార్షన్‌ ఏమీ లేదు. అదొక అభిప్రాయం అంతే. మీరు విభేదించొచ్చు కానీ నాకు ఆమె అభిప్రాయాలను డిస్టార్ట్‌ చేసే ఉద్దేశ్యమైతే ఎంత మాత్రం లేదు. ఒక మిత్రురాలికి సమాధానంలో ప్రస్తావించాల్సి వచ్చింది. ఇంకో మిత్రుడు నిర్దిష్టంగా ఆ విషయం గురించే ప్రశ్నించాడు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. పీపుల్స్‌వార్‌ నాయకురాలి గురించి రాస్తున్నపుడు ఆమెది అర్థవలస అర్థభూస్వామ్య అవగాహన అని ప్రత్యేకంగా చెప్పాలా! రామ్‌ మోహన్‌- గారు ఎప్పుడయ్యారో తెలీదు. ఇది కొంచెం బాధించింది.

  • gsrammohan says:

    హరితగారూ,
    నేనెవరి నోరూ మూయించాలని ప్రయత్నించలేదు. కాకపోతే విషయాన్ని విషయంగా చర్చించకుండా ఉద్దేశ్యాలు ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎవరికైనా బాధకలుగుతుంది. త్యాగాలమీద ఉమ్మేయడం ఏమిటండీ! అదెంత దుర్మార్గమైన మాట. ఈ పుస్తకంలో గానీ దానిమీద నేను రాసిన వ్యాసంలో గానీ అలాంటిది అణుమాత్రమైనా ఉందా! మీకు అది న్యాయంగా కనిపిస్తున్నదా! దాన్నలా వదిలేయాలా! అంత అహంకారమైతే ఎలా! సెన్సిబిలిటీస్‌ అందరికీ ఉంటాయి. నేను ఇచ్చిన సమాధానంలో ఒక్క రమాసుందరిగారి విషయంలోనే ఒక వాక్యం అనవసరంగా రాశాననుకుంటాను. వాస్తవానికి అది ఆమెకు సంబంధించిన విషయం కూడా కాదు. సంస్థలకు సంబంధించిన పాత గొడవలు, చదివిన విషయాలు ఏవో గుర్తుకొచ్చి ఆ వాక్యం అలా వచ్చేసింది. మిగిలిన విషయాల్లో నేను సమీక్షించుకోవాల్సింది ఏమీ లేదనే అనుకుంటున్నాను. ఆ మాత్రం ఆత్మగౌరవం కాపాడుకోకపోతే కష్టం కదండీ! వ్యాసంలో మిమ్మల్ని ఉలిక్కిపడేట్టు చేసిన అంశమేదో చెప్పి ఉంటే ఉపయోగకరంగా ఉండేది.

  • raghu says:

    voice is infinitive push and pull

  • 1. విద్యాసాగర్ గారు చెల్లింపుల సంక్షోభం గురించి చెప్పిన మాటలు కొత్తవి కావు. చాలా కాలం నుండి విప్లవకారులు చెబుతున్న విషయాలే. అయితే భారతదేశం పెట్టుబడీ దారీ దేశంగా మారిపోయిందనే ఆయన చేసిన కంక్లూజన్ తోనే ఈ ప్రశ్నలు వస్తున్నాయి. చెల్లింపుల సంక్షోభం వ్యవసాయంలో పెట్టుబడి ప్రవేశించక ముందు నుండే ఉంది. (స్తానిక వడ్డీ, వ్యాపార పెట్టుబడుల రూపంలో.) ఉత్పత్తి పెరిగినా కూడ రైతు నోటికి అందని పరిస్థితులకు ఈ సంక్షోభాలే కారణం. అయితే ఉత్పత్తి విధానం అంతటిని పెట్టుబడి (పంటలు పండించటం దగ్గర నుండీ మార్కటీకరణ వరకు) కబళించకుండా ఆ సమాజాన్ని పెట్టుబడిదారీ సమాజం అనటం గురించే ఆక్షేపణ.
    2. భారతదేశంలోఇంకా ప్రధాన ఉత్పత్తి సాధనం అయిన భూమి ఇంకా కమేడిటీ (సరుకు) కాలేదు. రైతుకూలీలు తమ శ్రమను స్వేచ్చగా అమ్ముకోవటంలేదు. వీరిలో ఎక్కువ మంది కౌలుదారులుగా(స్టాటిస్టిక్స్ లో కనబడక పోవచ్చు. భూపరిమితి చట్టాలు అందుకు అడ్డం అవుతున్నాయి) భూమిని అంటి పెట్టుకోనే ఉన్నారు.
    3. పెట్టుబడీదారీ అభివృద్దికి బలమైన అంశాలు ఉన్నప్పటికీ ఈ మార్పు దీర్ఘకాలం తీసుకొంటుంది అని యూరప్ చరిత్ర తెలియచేసింది.
    4. ఉత్పత్తి, ఉత్పత్తి క్రమమూ వ్యక్తిగత స్థాయి నుండి సామాజిక స్థాయికి మార్పు చెందాల్సిన క్రమం మిగిలి ఉండగా భారతదేశం పెట్టుబడిదారీ సమాజంగా మారిందని చెప్పటం తొందరపాటు చర్య అవుతుంది.
    5. “దున్నేవాడికే భూమి నినాదం” సరైనది కాదు అనటం కూడ వీరు చేసిన పై కంక్లూజన్స్ వలన జరిగిందే. భూమి సామాజికం చేయాలనే డిమాండ్ ఇప్పటి పరిస్థితులకు అన్వయించదు.

    • CHITRA says:

      రామా సుందరి గారూ నమస్కారం చర్చ ని భూమార్గం పట్టించి నందుకు ధన్యవాదాలు . ఒక్కొక్కటి గా చూద్దాం ముందుగా ఆఖరి విషయం చూద్ద్దాం అది కీలకమే . భూమిని జాతీయం చెయ్యాలన్న డిమాండ్ మనం పెట్టక పొతే మనకి మిగిలేది దున్నే వారికే భూమి అనే నినాదం . వాస్తవమైన లెక్కల లోకి వెళితే POCKET BOOK ఆన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ 2013 లోని అంకెల ప్రకారం చూస్తె 1951 లో 29.86 కోట్లు ఉన్న మన గ్రామీణ జనాభా 2011 నాటికి 83.35 కోట్లకి పెరిగింది వాటిలో వ్యవసాయ కూలీల సంఖ్యా 1951 లో 2.73 కోట్లు ఉంటె అది 2011 నాటికి 14.43 కోట్లకి పెరిగింది అంటే ఈ 14 కోట్ల మందికీ భూమి పంచాల్సి వుంటుంది . లెక్కలు వేస్తె ఒక్కొక్క కుటుంబానికి ఎంత వస్తుంది ? ఇంట మంది భూమి లేకుండా ఉండగానే , 2013 నాటికి సంనకమతాలు గా మనం పిలిచే 2.5 ఎకరాల లోపు కమతాల సరాసరి విస్తీర్ణం 1951 లో 0.40 హెచ్తర్ ల నించి 2011 నాటికి 0.38 హెక్టర్ లకు వచ్చింది . మొత్తం గా అన్ని కమతాలు నీ కలిపి ఛ్ఃఓఓఓశీణాఆ సరాసరి విస్తీర్ణం 1.33 హెక్టర్ నుంచి 1.16 లకు పడిపోయింది. భూస్వాములు ధనిక రైతులు వగయిరా మనం పిలిచే కమతాల సరాసరి విస్తీర్ణం కూడా కేవలం 17.37 హెక్టార్లు మాత్రమె. మీ ఆసక్తి కోసం అమెరికా లో తెడ్ టర్నర్ అనే ఆయన విషయం చూడండి ఈయన మీడియా టైకూన్ కూడా. సరే ఈ ప్రకారం గా చూస్తె దున్నేవారు , అంటే , శ్రమ శక్తి అమ్ముకునే వాళ్ళు అందరికి భూమి పంచుతం అని చెపితే ఒక్కరికీ ఎంత భూమి వస్తుంది అన్నది మానం ఒక కనీస అవగాహన కి రావలసి ఉంటుంది ఇక ఒకసారి ఈ పంపకం ప్రచారం గురించి కనీసపు నమ్మకం కుదరితే పట్టణాలు నుంచి వలసలు మొదలు అవుతాయి. ఇవన్నీ ఆలోచించి ఒక కనీసపు నమ్మకం మనకి మనం కుదుర్చుకుని అప్పుడు మాట్లాడడం నిజాయితీకి కొంతైన దగ్గరగా ఉంటుంది . సరే ప్రాధమికం గా అది ఒక అర ఎకరం అనుకుందాం మన భూములలో మొత్తం పంట వేసిన విస్తీర్ణం 1951 లో 131.8 మిలియన్ హెక్టారు అయితే అది 2011 నాటికి 198.97 మిలియన్ హెక్టర్ లకు చేరింది కాని వీటిలో నీటి వసతి కలిగినవి 1951 లో 20.85 మిలియన్ హెక్టర్ అయితే అది 2011 లో 63.60 మిలియన్ హెక్టర్ లు . మనకి తెలిసిన కారణాల వల్లనే ఈ నీటి వసతి లెక్కలు కొంత పచ్చ గానే రాయబడ తాయి . అది కాసేపు అంగీకరించినా హెక్టర్ కి దిగుబడి వారి విషయం లో 2003-04 లో 2078 కేజీ లు వుండగా అదే వరి దిగుబడి 2011 నాటికి హెక్టర్ కి 2462 కేజీ లు ఉన్నది గోధుమ దిగుబడి 2013 నాటికి హెక్టర్ కి 3119 కేజీ లు ఉన్నది . నీటి వసతి కేవలం 50 శాతం భూమికే ఉన్నప్పుడు భూసారం విషయం ఎన్నో తేడాలు ఉన్న మన దేశం లో మనం పంచిన అర ఎకరం భూమి లో వారికి పండేది ఎంత మిగిలేది ఎంత దాని కోసం వారు పడే శ్రమ ఎంత . ఈ విషయాలను గురించి కనీసం మనకి ఒక అవగాహన కావాలి . ఆ అవగాహన నాకు విద్య సాగర్ గారి పుస్తకం లోని బలగా (/) గ్రామం కండి వెంకట నాయుడు విషయం లో తెలిసింది మెలుకువ గా ఉన్నంత సేపూ తను తన భార్య పని చేసి ఆయన ఎలా ఉన్నారు . బానిస కంటే ఎలా బాగున్నారు ? అందుకే భూమిని పంచడం అంటే బానిసలని తయారు చెయ్యడమే అని నాకు అర్థం అయ్యింది చిన్న కమతాలు కూలి పోవడం తప్పదనీ వాటిని నిలబెదతం అని చెప్పడం సరి కాదనీ పెద్దలు రాసిన విషయాన్ని వెంకట నాయుడు కన్ఫోరం చేసారు . పెట్టుబడి ఉధృతం కి ఎదురుగా చిన్న కమతాలను కాపాడాలనే ప్రయత్నం ఎలా ఉంటుందో చెప్పండి . దయ చేసి ఈ కింది లింక్ మీద క్లిక్ చెయ్యండి . ఇది తేలాక మరోటి చూద్దాం
      https://redpolemique.wordpress.com/category/the-semi-feudal-semi-colonial-orthodoxy/

      .https://redpolemique.wordpress.com/category/the-semi-feudal-semi-colonial-orthodoxy/

      • saaralachi says:

        భూమిని జాతీయం చేయకూడదని ఏ మార్క్సిస్ట్లు చెప్పారండి?దున్నే వారికి భూమి నినాదం వొక దశకు చెందిన నినాదమండీ.ఏమో లెండి,నేను ఈ దేశ కమూనిస్ట్ ఆచరణల చరిత్ర ద్వారా తెలుసుకున్నది,మీ లాగ ఇంగ్లీష్ గ్రంధాల ద్వార నేర్చుకున్నది కాదు.ఇంతకీ,చిరాకు పదనంటే వొక మాట చిత్ర గారు…సాగర్ గారి పుస్తకం ,రామ్మోహన్ గారి వ్యాసం చెప్పదలుచు కున్నది…మూడు నాలుగు పాయింట్స్ చెప్పరా…నా సందేహాలన్నీ తీరిపోతాయి..ప్లీజ్…

      • saaralachi says:

        భూమి జాతీయం చేయడం ఇప్పటి పరిస్తితులకు కుదరదని రమాసుందరి గారు అన్నారు.అంతేగద .ఈ దశలో దున్నే వానికి భూమి నినాదమే ,అయిన చిత్ర గారు నా రిక్వెస్ట్ పట్టించుకోలే.మూడు నాలుగు పాయింట్లు సాగర్,రామ్మోహన్ గార్ల రచనల సారం చెప్పమని రిక్వెస్ట్ చేసాను.ఎందుకంటె మీరు వారి (కంటే శ్రద్దగా )రచనల సారం బాగా చెప్పా గలుగు తున్నారు…నా సందేహాలు తీర్చి పుణ్యం మూట కట్టుకోరు.

      • CHITRA says:

        సారలచ్చి గారు నమస్కారం . సాగర్ రామ్ మోహన్ ల రచనల సారం అడిగారు . నేను చిన్న కరపత్రం రాసాను 30 పేజీల్లో మీ చిరునామా ఇస్తే పంపగలను

  • ఈ పుస్తకం చర్చలో పాల్గొంటూ చదివాను. ఇది చాలా వరకు చంద్రబాబు నాయుడు విజన్ 2020 కి దగ్గర దారిలోది. వ్యవసాయం శుద్ధ దండగ ఇంక ఏ ఇజమూ లేదు టూరిజమే అన్న దానికి వత్తాసుగా ఉంది. ప్రభుత్వ కాకి లెక్కలు, ప్రపంచ బ్యాంక్ నివేదికలకు తోడుగా వామపక్షం వారికి తనేదో కొత్త దారి చూపెట్టానని కళ్ళకు గంతలు కట్టడానికి మార్క్స్ కేపిటల్ ఉదాహరణలను తీసుకోవడం సంక్షోభాలన్నిటికి పరిష్కారం వలస పోవడమే అన్నదే నినాదంగా సాగింది. రచయితలూ కవులు నోస్టాల్జియాలో ఏడుస్తూ ఉంటే వీళ్ళే జనాన్ని వలసల ద్వారా పట్టణ పరిష్కారం చూపుతూ ముందుకు తీసుకుపోతున్నారు. జయహో కామ్రేడ్స్.

    • లక్ష్మణరావు says:

      మిత్రమా…టూరిజానికి వత్తాసుగా ఉందని ఈ పుస్తకం ఉందని చెప్పారు. అదెలా సూత్రీకరించారో ఆ పుస్తకంలో ఉన్న అంశాలను ఉదహరిస్తూ రాస్తే బాగుంటుంది. పట్టణానికి వెళ్లిపోండని చెప్పారా లేక పల్లె పట్టణదారి పట్టిందని చూపారా ఒకసారి సాధికారికంగా చెప్పగలరు. ఏ అంశాల ఆధారంగా చంద్రబాబు విజన్ 2020కి దగ్గరలో ఉందని నిర్ణయ ప్రకటన చేయగలిగారు. వీటిని వివరించి వ్యాఖ్యలు చేయడం మంచిది. మార్క్స్ “క్యాపిటల్” అంశాల ఆధారంగా సమాజంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను, మార్పులను విశ్లేషించారా లేక తప్పుగా ఉదహరించారా అన్నది కూడా మీరు తగిన ఆధారాలతో చెప్పాల్సి ఉంటుంది. వ్యవసాయం దండుగ అన్నట్లు స్పృహ కలిగించే అంశం ఏ పేజీలో మీ భూతద్దాలకి కనిపించిందో ఉదహరిస్తే మేము కూడా చదివి తరిస్తాం. మీ నుంచి ఆ తరహా వ్యాసం ఈ చర్చలో వస్తుందని భావిస్తున్నాను. ఆశిస్తున్నాను. ఇక పోతే గతంలో మీరు పోస్టు చేసిన ఉపాధి కూలీలు సోమరలు అన్న మాటకి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ విషయమై చిత్రగారు చాలా సంక్షిప్తంగా మీ కవిహృదయానికి అర్ధమయ్యే విధంగానే చెప్పారని అనుకుంటున్నాను. మిత్రమా..మీరు కవి, అందునా విప్లవ కవిగా మా అందరికీ సుపరిచుతులు. శ్రమ చేసిన వారి పట్ల ఉండాల్సిన దృష్టి ఏమిటో మార్క్సిజం గురించి ప్రాధమిక పాఠాలు చదివితే అవగతమవుతుంది. వ్యక్తిగత విమర్శ అనుకోకుండా ఉంటే ఒక మాట సర్కారీ వారీ జీతాలు అందుకుని వచ్చే మీలాంటి వాళ్లు అంబలి బుట్ట నెత్తిన పెట్టుకుని రాజుగోరి కళ్లాల్లో గొడ్డి చాకరీ చేస్తే అప్పుడు అర్ధమవుతుంది కూలీ బతుకు చిత్రం. మీ ఆలోచన ఎలా ఉందంటే ఇంటిల్లపాది కష్టపడినా అయిదేళ్లు నోట్లోికి వెళ్లలేని పరిస్థితి నుంచి తనని, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు తన రెక్కలను నమ్ముుకుని పట్టణానికి వలసపోతుండడం పట్ల కనీస స్థాయిలో ఆవేదన లేకుండా, వారి దైనీయ పరిస్థితి పట్ల కనీసంగా నైనా ఆందోళన చెందకుండా , వారు వెళ్లిపోవడం వలన భూమి అనే స్థిరాస్తి కలిగిన రైతు ఆర్ధికంగా నష్టపోతున్నాడంటూ వాపోతున్నట్లుగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఆవేదన అంతా ఆస్తిపరవర్గాల కోసం అన్నట్లుగానే ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇటీవల కె.వి.ఆర్. జూట్ యాజమాన్యం చేస్తున్న వాదనలా ఉంది. మీరు విప్లవ కవి అంటూ శ్రమ చేసిన వారి పట్ల అంత చులకనగా మాట్లాడడం ఎంతమాత్రం క్షమించరానిదే. దయచేసి ఒకసారి మీరు చదివి పడేసిన మార్క్సిసిజం పుస్తకాల దుమ్ము దులిపి ఇటువంటి వాటి పట్ల వారు ఏమన్నారో తెలుసుకుని వ్యాఖ్యలు చేయడం మంచిది. అంతేగాని మార్క్సిస్టులమన్న ముసుగులో ఆస్తిపరవర్గాల వాదనను వినిపించే ప్రయత్నం చేయడం మనల్ని నమ్మి, మనల్ని ఫాలో అయ్యే వారిని మోసగించడమే అవుతుంది. దయచేసి తెలుసొో తెలియకో, ప్రచారమాధ్యమాల ప్రభావానికి లోనయ్యో …చేసిన సోమరలు వంటి వ్యాఖ్యలు ఇప్పటికైనా ఉపసంహరించుకోవడం మంచిది. లేకుంటే మీరు ఇటు నుంచి మాట్లాడినా అటువైపే అన్న ఆరోపణకు గురికావల్సి ఉంటుంది. మా మిత్రుడైన మీరు అటువంటి విమర్శలకు గురికావడం నాకు ఎంత మాత్రం నచ్చడం లేదు. వాస్తవానికి నిన్నటి రోజునే మీకు నా విజ్జప్తిని చేద్దామని అనుకున్నాను. కాని, ఈ విషయానికి శాంతామణిగారు స్పష్టతను ఇస్తారని ఆశించాను. అందువలనే వేచి చూశాను. కాని, ఎందుకనో ఆమె స్పంధించలేకపోయారు. ఖచ్చితంగా మీ పోస్టు మీద ఆమె స్పంధిస్తారని అనుకుంటున్నాను.

      • kcube varma says:

        mitramaa meeku mudo netram leka batiki battakadutunnattundi.. RS Rao gari abhovruddhi velugu needalu laanti pustakaalu kooda chadive prayatnam cheyandi meeku dorikina kundeluku moodu kaallante nyaayam kaadu kada naa vrutthi pravrutthila patla meeku inta prema yenduku cheppandi. mee vetakaralu sapanaardhaalu charcha anna maataku navvu teppistunnayi. selavinka..

      • లక్ష్మణరావు says:

        మిత్రమా…ఆర్.ఎస్.రావుగారి కొత్త చూపు పుస్తకం మీద, విద్యాసాగర్ గారు రాసిన పుస్తకం మీద మీరు చర్చావేదికను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే మీరు ఆ రెండు పుస్తకాలను చదివారు కాబట్టి ఆ రెంటి మీద మీకు ఒక స్పష్టమైన సైద్ధాంతిక అవగాహన ఉన్నందున చర్చను ఏర్పాటుచేయడం అందరికీ ప్రయోజనకరం. తేదీ, స్థలం మీరు నిర్ణయించడం మంచిదని సూచన. మనం విశ్వసించే మార్క్సు, ఏంగెల్స్ ల రచనల వెలుగులోనే వాటిని సమీక్షించుకుందాం. ఇందుకు మీరు సిద్ధమేనని భావిస్తున్నాను. మీ స్పందన కోసం ఎదురుచూస్తూ…

  • CHITRA says:

    దయ చేసి ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి https://redpolemique.wordpress.com/category/the-semi-feudal-semi-colonial-orthodoxy/

  • CHITRA says:

    ఒక్క సారి http://www.marxists.org/archive/lagman/works/psr.htmఈ లింక్ కూడా చదవండి

  • balasudhakarmouli says:

    పుస్తకాల కన్నా ముందుగా మనుషుల అంతరంగప్రపంచాలను చదువుకోవాలి.. మనం… ! మనుషుల లోలోపల యింకా తడిగానే వున్నా అద్భుత అరణ్యాలను వీక్షించే నైపుణ్యతను అలవరుచుకోవాలి.. మనం !
    చివరకు నూతన మానవ పుష్పాలుగా వికసించాలి.. మనం !

    మనం ‘అజేయం’ !

    • SAHITI says:

      శతాయుష్మాన్ భవ.

      • Raaji says:

        // శతాయుష్మాన్ భవ.// ప్యూడల్ భావం. ఇక్కడ పనికి రాదు.

      • Thirupalu says:

        // శతాయుష్మాన్ భవ.// ప్యూడల్ భావం ఇక్కడ పనికి రాదు.

      • raamaswami says:

        నూరేళ్ళు చల్లగా వర్ధిల్లమని కోరుకోవడానికి,ఏభావజాలమైతే ఏమిటి చెప్పండి.కమ్యూనిష్టు భావజాలంలో ఆశీర్వచనాలుంటాయా సార్..

    • moida srinivasarao says:

      మౌళి గారు చర్చలో సైతం మీ ప్రతి వాక్యం కవితాత్మకంగా వుంటుంది. కాకపొతే మాబోటి వారికి అర్ధంకావడమే కష్టంగా వుంది. మీరైనా, మీ కవితా వాక్యాలైనా!

      • balasudhakarmouli says:

        అర్థం కాకపోవడానికి అందులో ఏం లేదు ! నాలో కూడా !
        వొకరిని వొకరు ఏమాత్రం నొప్పించుకోకుండా.. వొకరి మీద వొకరు సెటయిరికల్ గా మాట్లాడుకోకుండా కేవలం విషయం మీదే చూపు నిలిపి నగ్నంగా, స్నేహపూరిత వాతావరణంలో ఏ చర్చైనా జరగగాలని నా ఆలోచన. నేను దానినే కోరుకుంటాను. చర్చలో మాట్లాడుతున్న వాళ్లు ప్రగతిశీల ఆలోచనాశీలురు. అలాంటప్పుడు వాదులాట ఎందుకు ? .. అని అనిపిస్తుంది. నేను యిప్పుడిప్పుడే మార్క్సిస్ట్ ఆలోచనా తీరును సాధన చేస్తూ… నా బడి పిల్లలకూ నా శక్తి మేరకు అవగాహన పరుస్తున్నాను.
        స్కూల్లో.. తరగతి గదిలో… వర్తమాన ప్రాపంచిక విషయాల మీద చర్చ పెడుతుంటాను.
        ఈ ప్రపంచం మీద, దాని తీరు మీద మనుసులకు కొన్ని ఆలోచనలూ, ఊహలూ, స్వప్నాలూ వుంటాయి కదా…. ఆ ఊహల నుంచే.. ఆ స్వప్నాల నుంచే.. ఆ ఆలోచనల నుంచే… మాట్లాడితే వాక్యాలు కవితాత్మకం అయ్యుంటాయి. మనల్ని మనం నిర్వచించుకోవాలి కదా !
        మిత్రమా…. మొయిద శ్రీనివాస్….

      • moida srinivasarao says:

        మిత్రమా…మౌళి! ఇప్పుడర్ధమయ్యింది. కాసింత ఆవేశమోస్తే గాని ఎవరిలోనైనా స్పష్టత రాదేమో?

      • balasudhakarmouli says:

        స్పష్టత రావాలంటే ఆవేశం అవసరం లేదు. ఆవేశంతో వొక్కోసారి ఉన్నది చెడుతది.

      • moida srinivasarao says:

        మిత్రమా! మంచిగా చెప్పావు.

  • E sambukudu says:

    “పల్లెను మింగిన పెట్టుబడి ” పుస్తకంపై చర్చ జరగడం కాస్త ఆలస్యంగా చూసినందుకు విచారిస్తున్నాను.
    ఎన్నెన్ని అద్భుత విషయలు చర్చలో కొచ్చాయో చూసి చాలా ఆశ్చర్య పడుతున్నాను.

    ఈ పుస్తకం చంద్రబాబు విజన్ 2020 కి దగ్గరి దారని కనిపెట్టిన వర్మగారి అద్భుత విశ్లేషణ చూసి చలించి పోయాను.దురదృష్టవశాత్తు నేనూ ఆపుస్తకన్ని చదివాను.కాని నా మట్టి బుర్రకి యిన్ని విషయాలు తట్టనే లేదు.కమ్మ్యూనిష్టుల కళ్లకు గంతలు కట్టడానికి మార్క్స్ కేపిటల్ కూడా పనికొస్తుందని నాకింతవరకూ నిజంగా ఎంతమాత్రమూ తెలియదు.
    “సంక్షోభాలన్నిటికి పరిష్కారం వలస పోవడమే అన్నదే నినాదంగా సాగింది”అన్నారు.అబ్బా ఎన్ని ప్రవచనాలు మిస్సయ్యనో కదా!,ఈ పుస్తక రచయిత యిలా రాయబట్టే గ్రామీనులు వలసపోతున్నారని రాయలేదు.అందుకు విచారంగా వుంది.

    నాకొక్క- సందేహం వర్మగారి లాంటి వారుచెపితే వినాలనుంది. వలసలు లేని కాలమేదైనా వుందా చరిత్రలో…నాకు తెలిసినంతవరకు ఆదిమ మానవుడి నుండి నేటి అధునాతన మానవుడి వరకు మనిషి నిరంతరం వలస పోతూనే వున్నాడు.అడవినించి గ్రామానికి ,గ్రామం నుంచి పట్టణానికి ,పట్టణం నుంచి నగరాలకు మహానగరాలనుంచి విదేశాలకు..యిలా నిరంతరం వలససాగుతునే వుంది.ఎక్కడ మెరుగైన జీవితం లభిస్తుందంటే అక్కడకు ప్రజలు వలస వెళుతూనే వుంటారు.పట్టణంలొ అంతకు పూర్వమున్న బ్రతుకు కంటే మెరుగు కనిపించకపోతె వలసల క్రమం సాగేదేనా,

    • SAHITI says:

      మౌళి గారూ నమస్కారం బావుంది చర్చ లో ఉండండి ప్లీజ్

    • saaralachi says:

      ఏవండోయ్, మీరు ఆగండి,నీను జలకడిగెస్తాను.వర్మ కాదు గద అతగాని బాబు కూడా ఒప్పుకు తీరతాడు ,అలాగ అడుగుతాను ,మీరు ఒల్లకోన్డి.ఏమండీ, ఎందుకండి ఒప్పుకోరు?పల్లెని ,పట్నం మింగిందని అంటున్నారు గానీ మీ భూమిని మింగిందనలేదు కదా ?యెమన్నారూ ?మీ కసలు భూమే లేదా?బతికారు .భూమి గల రైతయితే మీరు దోపిడీ దారుడి కింద లెక్క.మీరు కూలీలని ,అందలోకీ వడ్రంగి,కమ్మరి,కుమ్మరి,చాకలి ,మంగలి ఒకరేమిటి ,సకల వృత్తుల వారినీ దోచుకున్న వారి కింద లెక్క.వాళ్ళని ,మీతో పాటు మట్టిలో మట్టిని చేసిన వారికింద లెక్క.అలాగే,పంటల మీద అప్పులు వాడి ,వాటిని తీర్చకుండా సావుకార్లను, బ్యాంకులను మోసగించి,వారికి అప్పు ఎగ్గొట్టి, డబ్బు దాచుకున్నట్టు లెక్క.అసలు ,మీ వలన ,ఇటు వ్రుత్తి జీవులు,అటు గవర్నమెంట్ దోపిడీకి గురయి నష్టపోవదమయినట్టు లెక్క.ఒక్క మాటలో చెప్పాలంటే ,పల్లెలోన మీరు ,పసిరికి పాములు లాగ కన్పించే కొండచిలువలు. ఇంతకు ముందు,బామ్మర్లు ,కర్నాలు ,రాజులు అడ్డమైన పెద్దల్లాగా పల్లెను తిని బతికిన పాలకులు.ఏమంటారు?పాలించ బడటమే తప్పా ,పాలించ లేదా? ఒంటి మీద నాగలి గావంచ తప్ప మరేమీ రైతుకి మిగుల లేదంటారా ?మీకెందుకండీ?పంటని బజారులోన,సర్కారు ఖజానాలోన పోసేసి గడ్డి తింటున్నాడా ?మీకెందుకండీ?అతగాడికి మిగల్లేదు.అదిగో అతగాడికి వత్తాసు రావడమే ,మీరు రైతనుకొని ,రైతు పక్కన నిలబడినోడనుకొని మావాళ్ళంతా అపార్ధం చేసు కున్నారు.హమ్మయ్య,రైతులు కారుగదా ?మరేమండీ ,ఒప్పుకొండీ, ఏటి మీ భూమి పట్నామెలిపోతాద?ఎల్తే మీరు ఎల్తారు.పట్నామెల్లండీ.మీ వూరి పేదలకి చెప్పండి, పట్నంలో స్వేచ్చగా ,శ్రమని అమ్ముకొవచ్చనీ,(ఒకోసారి ,పని దొరకదు,జంక్షన్ లోన నిలబడ మని చెప్పండి ..నిలబడి,నిలబడి కాలు పీకినవనుకోండి,ఎంతకో కొంతకి ,ఎవడు పిలిస్తే వాడికి వెల్ల మని చెప్పండి)తాపీ మేస్త్రీ దగ్గర కూలి కంటే ఏదైనా ఆఫీసు లోన,సినిమాల్లోన,టీవీల్లోన పనికి కుదురుకుంటే ఓహొ ఎంత దబ్బనుకున్నరు?అసలు ,ఇన్నాళ్ళు పల్లెలోకి పెట్టుబడి రాక,రైతులు,బుగతలు,బామ్మర్లు ,ఆల్లూ ,వీళ్ళు ఊరిని పాలించి,పాడు చేస్సారు.పెట్టుబడి ఒచ్చింది,చుడండి ఎంతమంది ముందుకి ఎల్తాన్నారో?పెట్టుబడి రావడం వల్లనే భూములికి ధరలు,కూలీలకి పనులు…మరేమో, కుల వివక్ష పోయింది. ఎంచక్కా,బాపనొల్లూ మాలా మాదిగొల్లూ పెళ్ళీ పేరంటాళ్ళు చేసుకున్తన్నారు?బాపనోలికి మించి మాల మాదిగ సంపాదన చేస్తన్నారు.పెట్టుబడి తల్లీ ,మా వూరు రా,అని పిలండీ.అభివ్రుధిని అవ్హానిన్చండీ.ఏమండీ, ఇంకా చెప్పలండీ?s

    • saaralachi says:

      sambukudugaaru baaga adiganu kadandi? okela ఇంకా అడగమంటే అడుగు తానండి.మీరు శ్రమ పడకండి.పెట్టుబడి వొచ్చి ధర్మల్ విద్యుత్ లాంటివీ,మందుల కంపెనీల వంటివీ ,ఇంకేమో కొండల్ని దోలిచేసే కంపెనీల లాంటివీ వొస్తే…ఇంకా సముద్రాన్ని తోడేసి,చేపల్నీ,సముద్ర తీర మ్మీద ఇసుకనీ వూర్చెసె కంపెనీలు వస్తే మత్స్యకారులు,ఆదివాసులు,మున్డుకేల్దురు కదండీ.ఆదివాసులు ఆడవారు రంగు రంగు కోకలు,మగ వాళ్ళు ఫాషన్ బట్టలు వేసుకొని పట్నాల్లోన తిరుగుతారు కదండీ.అసలకి ,మన పూర్వులు ఈస్ట్ ఇండియా కంపెనీని,దాని పెట్టుబదినీ తగిలీసారు గాని,ఎపుడో మన దేశం మున్డుకేలిపోయున్ను కదండీ.పోన్లెండి,ఇపుడికైన,మీ అందరి పుణ్యాన పెట్టుబడి మీద ప్రేమ కలుగుతాది లెండి.వర్మ లాంటి వాళ్ళు,మా.లే.లూ ,వాళ్ళ రాతలు,ఆచరణలు పనికొచ్చేవి కాదని తెలుసు కుంటారు లెండి.పెట్టుబడికి అభివ్రుది మీద ఉండే ప్రేమ ఎంత గొప్పదో గ్రహిస్తారు లెండి…ఉంటానండే…

      • E sambukudu says:

        అమ్మా?అయ్యా !, saaralachi (మీపేరేటోగాని నాకు నోరు తిరక్కయిలా వుంచేసాను,మరేటీ అనుకోమాకండి) గారూ దండాలండి,
        మీరింత కష్టపడిన తరవాత అదీ రాత్రి రెండుఝాములప్పుడు..చ్చో..చ్చో
        ఎంతమాట నానీంకేటైనా అంతానా! అనగల్నా..!

        కానీ ఒక్కమాట దైర్నం సేసి అడగతన్నాను,మీకొవులు సెప్పీనారో,నేప్పోతే మీరెక్కడ సదివీనారో గానండి,ఓ… గనమైన మాట సెప్పీనారండి తమరు గోరు. నిజమేసుమండీ పెట్టుబడి వొచ్చీ మాల మాదిగల సంపాదనపెరిగిపొయి యిళ్లు బూములు కొనీసి మాలగ్గురోరాలు,మాదిగ అగ్గురోరాలు కట్టేత్తే బాగున్నండి కానీ అలా క్కుదరదట కదండీ.నాకూ మాసేనా యిదైపోనాదంటే నమ్మండీ.

        యిక పెళ్లిళ్లంతారా పెట్టుబడికి మరి పెళ్లి మంతరాలు వొచ్చో రావో,సాగరు గోర్ని అడగాలండీ.వమిరికాలో వాఫ్రికాలో పెట్టుబడి ఎవరెవరికి… నల్లోలికి తెల్లోలికి పెళ్లిసేసిందో నేదో నాకైతే తెల్దు గానండి ఈపాలి కనబడితే (
        అదే ఆ బావు) నిలబెట్టి అడిగేత్తానండి.ఏటిలాటి పద్దుకు మాలిన రాతలు రాసీసినావూ అని.

        నాకుతెలిసి ఏటంతే పెట్టుబడి పూరాగా వొచ్చినాక ఆదివాసీలు,మత్స్యకారులు పూర్వం లాగా వుండ్రండి.ఒకపిసర ఎగబాకురుతారూ ,రెండుపిసర్లు దిగజారిపోతారుకూడానండి.ఐతేటీ.. మనం రమ్మంతే అది రాదండి,ఒద్దంతే పోదండి.మా..మొండిదండి ఈపెట్టుబడి.సాగరు బావు వొచ్చింది సూడర్రా అన్నాడండి ,మాకూ అవుపడతంది బావూ అంతన్నా మండి.
        మీకు అవుపడప్పోతే పోనీయండి.వదెప్పుడో రాజుగారి కత సదివినాను ఆవస్త్రాలు తెలివైనవోలికే కనపడీవట,యిది అంతా తిరకాసుదండీ ఈ పెట్టుబడి నాబోటి పద్దుకు మాలినోడికి కనపడతంది గానీ మీబోటి గొప్పోలికి కనపడకుంతందండీ.
        పోనీయండి.
        సివరాకరగా ఒక్కమాట
        మీకట్టం సూత్తే నాకు జాలేత్తంది.రాత్తుర్లు నిద్దరమానీకండి.అమ్మమ్మా..
        రేపు పొద్దుగాలప్పుడు మాట్లాడుకుందుముగానీ..

      • లక్ష్మణఱావు says:

        సారలచి గారికి నమస్కారం. విద్యాసాగర్ గారుగాని, రామ్మోహనరావు గారు గాని…. రండి..బాబు రండి పెట్టుబడి వచ్చింది…సౌభాగ్యం తెచ్చింది. ఆలస్యం చేసినా ఆశాభంగమని వారివారి పత్రాల ద్వారా సకుటుంబ సమేతానికి ఆహ్వానం పలికినట్లు కనిపించలేదు.మీలా కాకుండా వర్మగారు సూటిగా ఆ మాట అంటే ఆ పేజీ ఏమిటో, ఆ వ్యాఖ్య ఎక్కడో చూపించమని కోరాం. కాని, ఆయన ఇప్పటికీ ఆ విషయాన్ని తేల్చలేదు. కనీసం మీరైనా ఆ సమాచారాన్ని వాటిల్లోంచి చూపిస్తారని ఆశిస్తున్నాను. పైగా పోరాడే శక్తులకు పరోక్షంగా మన ఇళ్లల్లో తిష్టవేసిన పెట్టుబడి మీద పోరాటాన్ని ఎక్కుపెట్టండని ప్రబోధ చేసినట్లుగా అనిపించింది. అవునో, కాదో మీరే చెప్పాలి. ఇక పోతే, నాదొక సందేహం. ఒకరు పిలిచారని, మరొకరు ఆహ్వానించారని పల్లె ప్రజలు పట్టణదారి పడుతున్నారా? పల్లెలో బతుకు లేక పట్టణదారి పడుతున్నారా ? కాస్త వివరించగలరు. ఎందుకంటే మా ప్రాంత రచయతలైన అట్టాడ అప్పలనాయుడు గారు గాని, గంటేడ గౌరునాయుడు గారు గాని వారి వారి కథల్లో “గోదారి” పెట్టబడి ఈ ప్రాంతాన్ని ఎలా కుమ్మేసిందో కళ్లకు కట్టినట్లు చెప్పారు. దాని పర్యవసానమే బక్క రైతులు, దిక్కులేని కూలీలు పట్టణాలకు వలసపోతున్నారని విడమరిచి చెప్పారు. అంటే పెట్టుబడి ప్రవేశమే వలసకి కారణమని సారాంశంగా తేల్చారు. ఈ కోణంలో చూసినప్పుడు ఆత్మహత్యలు చేసుకోకుండా బలుసాకు తినైనా బతుకుదామని పట్టణదారి పట్టాడని అవగతమవుతోంది. అంటే కొద్దిపాటి మెరుగైన పరిస్థితి కోసం వెతుకులాడుకున్నట్లుగా స్పష్టమవుతోంది. ఆ మెరుగైన పరిస్థితిని ఏమంటారా మీరే చెప్పాలి. మీరన్నట్లుగానే పల్లె నుంచి బయలుదేరిన వాళ్లు మా విజయనగరంలో అయితే కోట జంక్షన్ లో నిలబడతారు. వారికి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే అక్కడ పనికి కుదురుతారు. స్వేచ్చగా తమ శ్రమను అమ్ముకుంటున్నారు. కావాలంటే ఉదయం 8 గంటలకు ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించగలరు. దీనిని ఎలా వ్యాఖ్యానించాలో చెప్పాలి. అయితే, ఇది దీర్ఘకాలం కొనసాగుతుందన్న భ్రమ గ్రంథకర్తకు గాని, వ్యాసకర్తకుగాని లేదని వారి రాతలే స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలో బళ్లల మీద కూర్చొనే వారు, విజయనగరం కోట జంక‌్షన్ లో నిలబడే వారు ఇద్దరూ ఒకటే అనుకుంటున్నాను. ఇలా బూర్జవా వర్గం గ్రామ సీమలను పట్టణాల కిందకు తీసుకుని రావడం ద్వారా జనాభాలో గణనీయమైన భాగాన్ని గ్రామ జీవితపు మూఢత్వం నుంచి రక్షించిందని అంటూనే ఇలా నిలబడిన వారినే మార్క్స్, ఏంగెల్స్ అనే ఉపాధ్యాయులు రిజర్వు ఫోర్స్ అని (తెలుగులో అచ్చైన) కమ్యూనిస్టు ప్రణాళిక, ఇంగ్లాండులో కార్మిక వర్గ స్థితిగతులలో విశదపరిచారు. ఆ రిజర్వు ఫోర్స్ రేపటి వర్గ పోరాట సైన్యమన్నారు. వారిని సంఘటితం చేయాలని కర్తవ్యబోధ చేశారు. సందేహముంటే ఆ పుస్తకాలను చదవగలరు. వర్మగారు అన్నట్లు రాజకీయ వేదికలు పెట్టే శక్తి నాకు లేకపోయినా 70 పేజీల “ప్రణాళిక”లో నా చిన్న బుర్రకి తట్టిన రెండు విషయాలను మీ ముందు ఉంచాను. సమసమాజం స్థాపనకు ఈ పరిణామం అనివార్యమని నా ప్రాధమిక జ్ఈ నాంతో అభిప్రాయపడుతున్నాను. అలా కాకుండా మరేమైనా ఉంటే మీరు చెప్పగలరు.

      • E Sambukudu says:

        లక్ష్మణరావు గారూ,బాగుందండి.నేను చెప్పాల్సి వుండికూడా చెప్పకుండా దాటి పోయినవిషయం మీరు చెప్పారు.ధన్యవాదాలు.

        ఈఫోర్సునే saaralachi గారు మరోవిధంగా అర్ధంచేసుకుంటున్నారు.మీ విజయనగరంలో కోట జంక్షన్ లోనో మరో పట్నంలో బజారు సెంటర్లలోనో యిలా పనికోసం నిలబడటం అనేదానిని మధ్య తరగతి లేదా రైతు దృక్పధంతో చూస్తూ గౌరవం తక్కువ పనిగానూ మరియు పనికోసం పడే వెంపర్లాట అనే భావంతోనూ చూస్తున్నారు. వారు వ్యంగ్యంగా అన్న మాటలు చూడండి.

        “నిజంగా పెట్టుబడి కనబడతందండీ,దాని వలన కులవివక్ష పోవడం,ఉపాధి దొరకడం,వ్రుత్తి జీవులు పట్నాల్లంట ఉపాధులు సంపాయించి ముందుకు పోవడం ఏ జంక్షన్ చూసినా కనబడతాది”.కనుక వారీ విషయంలో ఇంకేమి అనే అవకాశం కనపడటం లేదు.

        మన కామ్రేడ్స్ మాత్రం,యింకొక మాట కూడా చెప్పారండి.ఈస్థితి అనివార్యమని కూడా చెప్పారు.ఎందుకంటే వర్గసమాజంలో అంతిమ దశ పెట్టుబడిదారి దశ అన్నారు.పెట్టుబడితో యుద్ధం చేసేది ఈ ఫోర్సే అన్నారు.రైతుగా,వ్యవసాయకూలీగా వున్నప్పుడు చేయలేని పోరాటం వేతనం పై ఆధారపడ్డ కార్మికులుగా మారినపుడు మాత్రమే చేయగలరన్నారు.

  • కెక్యూబ్ వర్మ says:

    అయ్యా లక్ష్మణ రావు గారూ మీరు ఓ మోదీలానో ఓ కెసిఆర్ లానో సవాల్ విసిరి చర్చకు రమ్మని ఆహ్వానించడం బాగుంది, కానీ నాకు అంత తీరికా ఓపికా లేవు. మీరు మీ సైద్ధాంతిక వెలుగులో ఈ జాతి అణగారిన వర్గాలకోసం అహరహం కృషి చేసేందుకు మీ బృందంతో ఓ సరికొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని నడిపించి భారత దేశ శ్రామిక విప్లవ విజయానికి ఉద్యమించి విముక్తిని ప్రసాదించగలరు.

    నాకు నా ఉద్యోగం చేసుకునే సదవకాసాన్నివ్వండి. మీ మీ మేధస్సులను ఇంకా పదును పెట్టి మరిన్ని సర్వేలు జరిపి మరిన్ని పుస్తకాలు ప్రచురించి ఈ దేశ అభివృద్ధిని ఎలుగెత్తి వేనోళ్ళ పొగడండి. నాకేమీ అభ్యంతరం లేదు. నన్ను ఇలా వదిలేయండి. నేనెక్కడా మార్క్సిస్టు మేధావిననో రచయితననో ప్రకటించలేదు. నాకంత జ్నానమూ మార్క్సిస్టు కొలమాన పరిజ్నానమూ లేదు. సామాన్య మధ్యతరగతి ఉద్యోగి దృక్కోణమే తప్ప. మీరు మీ జర్నలిస్టు మూడో కన్నుతో దూసుకుపోండి.. సెలవింక.

    • లక్ష్మణరావు says:

      మిత్రమా..అంత అసహనం పనికి రాదు. పుస్తక రచయత గాని, ఈ పుస్తకం మీద వ్యాసం రాసిన రామ్మోహన్ గారు గాని, నేను గాని ఎక్కడైనా ఈ వలసలు అభివృద్ధి అని వాదించామా పరిశీలించగలరు. కచ్చితంగా మీరిచ్చిన ప్రోత్సాహంతో దూసుకుపోతాం. అందులో మీరేమీ సంశయించనక్కర్లేదు. నేనేమీ మీకు సవాల్ విసరలేదు. గుర్తించగలరు. నేను అన్నది సాగర్ గారు పుస్తకం చంద్రబాబు విజన్ 2020కి దగ్గరిగా ఉందని సెలవిచ్చారు. మాకు మీకున్నంత పరిజ్జానం లేక గుర్తించలేకపోయాం. మీరు ఒక చర్చా వేదికను ఏర్పాటు చేసినట్లయితే ఆ విషయాలు తెలుసుకునే సదావకాశం దొరుకుతుందని ఆశపడ్డాను తప్పా మరొకటి కాదు. తీరిక లేదని తప్పించుకోవడం సాహిత్యకారుడుగా సరికాదు. పుస్తకాన్ని వడపోసి దాని సారం ఇది అని నిగ్గుతేల్చిన అంశాల పట్ల చర్చకు వెనకడుగు వేయడం సమంజసం అనిపించుకోదు. భావసంఘర్షణ జరిగితేనే కదా వికాసం జరిగేది. తప్పులను సరిదిద్దుకునేది. ఒకసారి పరిశీలించండి.

  • CHITRA says:

    SAARALACHI గారు నమస్కారం రమాసుందరి గారి స్పందన లోని 5 వ పాయింట్ చూడండి స్పష్టం గా ఆమె చెప్పారు భూమి జాతీయం చెయ్యడం ఇప్పుడు అడగకూడదని . దానికే నా అభిప్రాయం చెప్పాను. దయ చేసి మరొక్క సారి చూడండి . ఇక మీద ఇంగ్లీష్ పుస్తకాలు చదవనని , కేవలం తెలుగు కథలు చదివి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. వాస్తవం ఏమిటంటే నిజంగానే నేను డిగ్రీ కూడా చదవలేదు వానాకాలం చదువు పొట్ట కూటి బతుకు. ఇక వుంటాను సర్ . అందరికీ నమస్కారం.

  • saaralachi says:

    శంబూకుడుగారండి ,అది మీ దేశం వేళ కాదు లెండి,అయినా నిద్రకేమిలెండి,మీ బోటి వాళ్ళు గొప్పగొప్ప సత్యాలు చెప్తుంటే .మీరు మిమ్మల్ని చిన్నబుచ్చుకుంటున్నారు గానీ,గోప్పవాల్లండీ మీరు.మీరు వర్మ గారిని ప్రస్నిస్తుంటే నాకూ అలాంటివె గుర్తుకు వచ్చి అడిగేశాను.నిజంగా పెట్టుబడి కనబడతందండీ,దాని వలన కులవివక్ష పోవడం,ఉపాధి దొరకడం,వ్రుత్తి జీవులు పట్నాల్లంట ఉపాధులు సంపాయించి ముందుకు పోవడం ఏ జంక్షన్ చూసినా కనబడతాది.వర్మకీ,వారి పార్టీలకే కనబడదు.అదే గదా మీరు చెప్తున్నది.మీ తరపున వర్మకి నేను చెప్పాను .

    • E sambukudu says:

      హమ్మయ్య, saaralachiగారూ,మీది మాది ఒకదేశమేనేమో నని బాధపడిపొనానండి.కాదు గదండీ,ఐతే పరవానేదండి,
      యికపోతే వరం గారికి సెప్పానన్నారు సానా సంతోసమండి.ఆవరం గారుగానీ,అతగాని పార్టీ సంగతి గానీ నానెరగనండి.

      మీరు”నిజంగా పెట్టుబడి కనబడతందండీ,దాని వలన కులవివక్ష పోవడం,ఉపాధి దొరకడం,వ్రుత్తి జీవులు పట్నాల్లంట ఉపాధులు సంపాయించి ముందుకు పోవడం ఏ జంక్షన్ చూసినా కనబడతాది”.అన్నారు.చూసారా నిన్నటికీ నేటికి తేడా,నిన్న కనపడంది నేడు కనపడతంది.అంతే నండి అంతా మాయ.డబ్బుసేసేమాయండి. మనం సూడాలని దీచ్చగా సూడాలే గానీ మాదేశం మీదేశం అని తేడానేదండి,యివాల అన్నిదేశాలు ఒకనాగే ఉ న్నాయండి.అర్జంటుగా కులం పోదుగానండి ఉపాధి దొరుకుతాదండి.కసింత గౌరవం దొరుకుతాదండి.ఆత్మవిశ్వాసం పెరుగుతాదండి.దానికోసమే వలసలండి.

      అయినా ముందుముందు మీకే తెలుత్తాయి సూత్తారు గదండి.దండాలండి.సెలవామరండి. సిత్తం.

      • saaralachi says:

        మీకు అలా అర్ధం అయ్యిందా ?మంచిదండే.నాకు,నిన్న,ఈరొజూ ఒకలానే కనబడిన దండీ.మీరు చూపించిన్దె వర్మ గారికీ,వారి పార్టీ వారికీ మీ బదులు చూపించానండీ.మీకు సంతోషమే కదండే.సరేనండీ…సంతోషంగా పెట్టుబడిని ఆవ్హానిస్తా ఆడుతా,పాడుతా వుండండి,సేలవండి,మరింక,మరో సారి,మరో విషయం ఏదైనా మాటాడిస్తే…మాట ఆడదాం …ఇదికా ఓడిలేద్దమండే…

  • CHITRA says:

    SARALACHI గారు నమస్కారం సవాళ్ళు ప్రతిసవాళ్ళు స్నేహితులని పెంచ వని నా అభిప్రాయం సరే నేను మళ్ళీ ఇటు వైపు వచ్చే పరిస్థితి లేదు కానీ , సాగర్ గారి పుస్తకం మీద ఐదు వాక్యాలు రాసే ఓపిక లేదు . ఒక్క మాట చెప్తాను ఆయన చెప్పింది “ఎలుగుబంటి ఎలిపోచ్చింది తేనెటీగల ని లేపే పనిలో పదండి ” అని ఉంటాను మిగతా విషయాలు ముఖస్తం గానే మాట్లాడుకుందాం

    • saaralachi says:

      చిత్ర గారికీ,లక్ష్మణరావు గారికీ…విగ్యప్తి,శంబుకుడుగారికి ఈ విషయం ఇక వోదిలేస్తున్నానని చెప్పను,కాని,మీరేవో అడిగారు,ఆఖరి మాట మీకూ చెప్పి,వుంటానండి.ఏమంటే,రామ్మోహన్ గారు స్పష్టంగా పెట్టుబడి రాకతో శ్రమజీవులు స్వేచ్చగా శ్రమను అమ్ముకోగాలుగుతున్నట్టు రాసారండి.అది పాక్షిక సత్యమండీ.శ్రమజీవులు పల్లె నుండి రెక్కలతో పట్నం వెళ్లి,అక్కడ చవకగా (పోటీ వలన)శ్రమ అమ్ముకున్తున్నారండీ.ఒకోసారి వారికి అమ్ముకొందమన్నాకొనే వాళ్ళు లేక ఖాళీ చేతులతో ఇళ్ళకు వెళ్తున్నారండీ.పెట్టుబడి శ్రమజీవుల కోసం రాదండీ…ఇది నేను అంగీకరించని విషయం.అలాగే పెట్టుబడి వలన కులవివక్ష పోతోందని కూదా రామ్మోహన్ రాసారండీ,ఇది కూదా అంగీకరించలేని విషయమండీ,యురోపియన్ దేశాలలో కులం లేదండీ,భారత్ లో వేరండీ,పెట్టుబడిని మనువాదులు,మనువాదుల్నిపెట్టుబడీ కౌగిలించు కుంతయండీ.పెట్టుబడి రాకతో యేవో లాభాలూ,అభివ్రుదీ కలుగుతాదని రామ్మొహనూ,అతనిని సమర్ధిస్తూ మీరూ రాస్తున్నారండి,మీ రాతలు చూడండి.సాగర్ గారు తన పరిశీలనలో గ్రామాల్లోకి పెట్టుబడి వచ్చిందనీ,పల్లెల్ని మింగిందనీ పెట్టుబడికి నెగటివ్ గా రాసారండీ.వ్యాఖ్యాతలే రాయని విషయాల్ని ప్రాజెక్ట్ చెస్తూ ,మిత్రులతో యుదానికి దిగారు.పెట్టుబడిని పట్టించుకోవాల్సినంత సీరియస్ గా కమునిస్టులు,విప్లవకారులు పట్టించుకోలేదని సాగర్ గారి టోన్,అని నా వరకు అర్ధమయిన విషయం.సాగర్ గారు ఎక్కడా కమ్యునిస్తులకు వ్యతిరేకంగా ఒక పదము కూదా రాయలేదు,గానీ వ్యఖ్యాతలే రామ్మోహన్ నుండి మీ వరకూ చేసింది ఇందుకు భిన్నం.మార్క్సిసం మీకు మాత్రమె తెలుసు అన్నట్టుగా మీ రాతలున్నాయి,చదవండి మళ్ళీ.బహుశా మా కంటే మీకు ఎక్కువ తెలిసుండొచ్చు,ఆ అభిజాత్యం మిమ్మల్ని ఆ పని చేయించి వుంటుంది.ఇప్పటికైనా మిత్రులతో ఎలా ,శత్రువులతో ఎలా ఘర్శించాలో అన్ని తెలిసిన మీకు చెప్పాలా…ఇక ఉంటానండీ…

      • లక్ష్మణరావు says:

        సారాలచి గారు. ఆరోపణ చేసిన తరువాత మేము చెప్పుకునేందుకు అవకాశం కూడా ఇవ్వాలి కదా. మీరు చెప్పినట్లుగానే ఖరీదుకో, చవకగానో శ్రమని అమ్ముకోవడమైతే జరుగుతుందని అనడంలో మీకు పేచీ లేదని స్పష్టమవుతుంది. అమ్ముకోవడం అంటేనే శ్రామికునికి స్వేచ్ఛ లభించినట్లు కాదా. ఒకసారి పరిశీలించగలరు. ఇక రెండో విషయం. మీరేమో ” .అలాగే పెట్టుబడి వలన కులవివక్ష పోతోందని కూదా రామ్మోహన్ రాసారండీ,ఇది కూదా అంగీకరించలేని విషయమండీ” అని మీరంటున్నారు. రామ్మోహన్ గారేమో ఆయన వ్యాసంలో ఇలా రాశారు “మతాన్ని కులాన్ని ముందుపెట్టి పెట్టుబడి వాటితో సహజీవనం చేస్తున్నది కదా అని కూడా కొందరు అంటుంటారు. పెట్టుబడిదారీ సమాజంలో మతం- కులం ఉండవని ఎవరు చెప్పారో ఎందుకలాంటి అపోహ ఏర్పడిందో తెలీదు.” అని ఆయన అంటున్నారు. మరొకసారి వ్యాసాన్ని కూడా పరిశీించగలరు. ఇక మూడో విషయం. మిత్రుడు వర్మ చేసిన వ్యాఖ్యలిివి.”ఇంకో మాట గ్రామీణ ఉపాధి హామీ పథకం వలన రైతు కూలీలు దొరకని పరిస్థితిని ప్రభుత్వం దొంగ చాటుగా ప్రవేశ పెట్టి సన్న చిన్నకారు రైతులను వ్యవసాయంనుండి దూరం చేస్తూ సోమరి జనాన్ని తయారు చేస్తూంది. ఇది కూడా కాదంటారా?”,”ఈ వలసల ప్రభావం వలన బయటకు పోతున్న జనం వ్యసనాల బారిన పడి ఆరోగ్యంగా వున్న పల్లె వాతావరణం నేడు కునారిల్లుతున్నదన్నది మీరు పెట్టుబడి అభివృద్ధి ముసుగులో దాచేస్తే దాగని సత్యం. మా గవర్నమెంట్ ఆసుపత్రిలో లెక్కకు మించి అమాయక అమ్మాయిలు గర్భిణులుగా పరీక్షలకు వచ్చినపుడు చేసిన టెస్టులలో వచ్చిన ఫలితం చూసి. తాము చేయని తప్పుకు ఈ మహమ్మారి బారిన పడి చావుకు ఎదురు చూస్తున్నవారి గురించి నాకు తెలుసు” ఈ వ్యాఖ్యల పట్ల మీరైతే ఎలా స్పందిస్తారో చెబితే బాగుంటుంది. అంతేకాదు పుస్తకం చదవకుండానే ఏప్రిల్ పదవ తేదీన వర్మ గారు ఈ పుస్తకం మీద చేసిన వ్యాఖ్య ఇది “కొంత మేర గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న పైపై మార్పులను తెలుసుకొనేందుకు ఉపయుక్తం కావచ్చు కానీ కమ్యూనిస్ట్ ముసుగులో ఏదో కొత్తగా చెప్పేసారు అన్నది పాక్షిక సత్యమూ, సామాజిక ద్రోహమూ.” పుస్లకం చదివిన తరువాత ఏప్రిల్ 18వ తేదీన “ఈ పుస్తకం చర్చలో పాల్గొంటూ చదివాను. ఇది చాలా వరకు చంద్రబాబు నాయుడు విజన్ 2020 కి దగ్గర దారిలోది. వ్యవసాయం శుద్ధ దండగ ఇంక ఏ ఇజమూ లేదు టూరిజమే అన్న దానికి వత్తాసుగా ఉంది. ప్రభుత్వ కాకి లెక్కలు, ప్రపంచ బ్యాంక్ నివేదికలకు తోడుగా వామపక్షం వారికి తనేదో కొత్త దారి చూపెట్టానని కళ్ళకు గంతలు కట్టడానికి మార్క్స్ కేపిటల్ ఉదాహరణలను తీసుకోవడం సంక్షోభాలన్నిటికి పరిష్కారం వలస పోవడమే అన్నదే నినాదంగా సాగింది” ఈ వ్యాఖ్యల పట్ల మీరు స్పంధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సాగర్ ఆ పుస్తకం ఏ టోన్ తో రాశారో మీకైతే స్పష్టమైన అవగాహన ఉందని, ఆ విషయంతో మీకేమీ అభ్యంతరం లేదని మీరు చెప్పిన మాటల వలన అర్ధం చేసుకుంటున్నాను. ఖచ్చితంగా వర్మ వ్యాఖ్యల పట్ల మిత్ర వ్యాఖ్యానం ఎలా చేయాలో మీరు పోస్టు చేస్తే బాగుంటుంది. వ్యాఖ్యానమో, లేక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమో ఏదైనా గాని మీరు చేస్తారని ఆశపడుతూ..

  • kcubevarma says:

    లక్ష్మణరావు గారు మీరు నా పట్ల మిత్ర వాక్యం పలకనక్కరలేదు. అందుకోసం నేనేమీ ఇక్కడ దేబిరించలేదు. నాకు అర్థమైనది నేను చెప్పాను. మొదటగా నేను స్పందించింది ఈ పరిచయంలోని కంటెంట్ మీదనే. ఇది చదివాక మీ మీ అతి స్పందనలు చూసాక పుస్తకం చదివా. నా అభిప్రాయం రాసాను.

    మీ మీ మేధస్సులతో ఈ వ్యవస్థను బాగు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగాలన్నదే నా అభిమతం. పెట్టుబడే మింగిందో సామ్రాజ్యవాదమే మింగుతుందో మింగినదంతా మనుషులనే కాబట్టి ఆ మనుషుల పట్ల స్పందించే వారిని రచయితలు కవులు వారి వారి శక్తి మేర రాసే వారి పట్ల, ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలర్పించిన అమరుల పట్ల మీ మీ హేళన వ్యాఖ్యలపై నాకున్న నిరసనను వ్యక్తం చేసాను.

    ఈ సరలాచి ఎవరో ఎరుకలేదు నాకు. ఇక్కడేదో సిగపట్లు పడితే ఏదో సాధించేసాం అన్న అపోహలో లేను. మీ మీ మేధ, శ్రమ సమాజాన్ని ఉద్ధరించాలని ఆశిస్తూ నన్ను మీ వ్యాఖ్యలలోకి లాగి ఏదో పొడిచేసాం అన్న భ్రాంతి వీడాలని కోరుకుంటూ..

    నాదిప్పటికీ ఒకటే మాట

    ఈ విప్లవాగ్నులు ఎచటివని అడిగితే
    శ్రీకాకుళం వైపు చూడమని చెప్పాలి…

  • E sambukudu says:

    లక్ష్మణ రావు గారూ ,
    ఒక రకంగా ముగిసిపోయినదనిపించిన చర్చను తిరిగి రేపినట్తుగా వుంది మీ పోస్ట్.ఎవరి అభిప్రాయాలు వాళ్ళు కలిగి వుండటం తప్పుకాదు కదా .తమనమ్మకాలకు విరుద్దమైన భావాలు కనిపిస్తున్నప్పుడు ఘర్షణ వుంటుంది. వారిని ఆలోచించుకోనివ్వన్ది.తక్షణం వాళ్లు అంగీకరించాలనే ఆతృత మీకెందుకు చెప్పండి.మితృల మధ్య అగాధం పెరిగిపోతుంది తప్ప. .అందుకు ఉదాహరణ మీ మితృడైన వర్మ గారి అసహనం చూసారా , ఎవరమైన చేతులేత్తేసినాక చంకలో గిల్లటం భావ్యం కాదు. అని నాకనిపిస్తోంది. వేరే ఎవరైనా కొత్త వాదనతో లేదా ఒక కొత్త పోయింట్తో వస్తే చర్చిద్దామ్.
    ఆరోగ్యకరమైన చర్చకు ఎప్పుడూ ఆహ్వానం పలుకుదాం..మీరయిన నేనైనా మరొకరైనా చెయ్యాల్సింది యిదే
    అని నా అభిప్రాయం .

  • లక్ష్మణరావు says:

    మిత్రమా మీ కోపానికి నేను చింతిస్తున్నాను. మిమ్మల్ని బాధపెట్టే విధంగా ఏమైనా వ్యాఖ్యలు చేశానని భావిస్తే క్షమించమని అడగడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే మనం మిత్రులం కాబట్టి. ఒకరిని మరొకరు సరిదిద్దుకునే చనువు ఉన్నందున మాత్రమే నేను మీరు పోస్టు చేసిన అంశాల పట్ల స్పందించాను. అంతమాత్రానే “దేబురించడం లేదు” అని అనడం నన్ను ఎంతగానో బాధపెట్టింది. సారాలచి గారిని కూడా నేను అడిగింది. ఇలాంటి అంశాల పట్ల సున్నితంగా మాట్లాడడం ఎలా అన్న విషయాలను తెలుసుకుని భవిష్యత్ లో మరింత జాగృకతతో వ్యవహరించే అవకాశం ఉంటుందని ఆలోచనతోనే కోరాను తప్పా. మరో ఉద్దేశం లేదు. మీరు చేసిన రెండు వ్యాఖ్యలు ఒక విధంగా ఆగ్రహాన్ని తెప్పించేవే అయినప్పటికీ నన్ను నేను ఎంతగానో నిబాయించుకుని బదులివ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే దేశ విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన వాళ్లు పట్ల అవహేళనగా ఎవరు మాట్లాడారు. ఒక వేళ నేను అలా మాట్లాడితే వాటిని కోట్ చేయాలనిి కోరుతున్నాను. లేకుంటే ఈ మాట విరమించుకోవాలని నిలదీస్తున్నాను. ఏదో పొడిచేశామన్న భ్రాంతి వీడాలని అన్నారు. విద్యాసాగర్ గారు పుస్తకం చదివిన తరువాత మీరు చేసిన వ్యాఖ్యలు చూసిన తరువాత మిమ్మల్ని ఏదో పొడిచేస్తామన్న భ్రాంతి నాకు ఏమీ లేదు. అయినా ఇటువంటి పదాల మన మధ్య రావడం, ఆ విధంగా వాదులాడుకోవడం నన్ను ఎంతగానో కలిచివేస్తోంది. నేను ఇప్పటికీ బలంగా నమ్ముతున్నాను. ఉపాధి కూలీలను సోమరులుగా, వలస పోయిన వారిని రోగగ్రస్తులగా చూపే మీ మాటలు…మీరిచ్చిన నినాద స్పూర్తికే విరుద్ధం. మన విశ్వాసాల వెలుగులోంచి పరిశీలించినా కూడా తీరని ద్రోహపూరిత వ్యాఖ్యలివి. కావాలంటే సమీక్షించుకుందాం. అంతేగాని, వాటిని వేలెత్తి చూపామన్న అక్కసుతో అమరులను హేళన చేశామన్న పేరిట తప్పుడు రాగాలు తీయడం, వారి పేరిట మీది ప్రజావాణి అని సమర్ధించుకోవడం సబబు కాదు. సహేతుకం అంతకన్నా కాదు. దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు భవిష్యత్ లో కూడా మన మధ్య రాకూడదని ఆశిస్తున్నాను. సిగపట్లు పడితే సాధించేస్తామని నేను కూడా అనుకోవడం లేదు. అలా అని ఏమి సాధించలేమని మాట్లాడకుండా కూడా కూర్చోకూడదన్నది వివిధ సందర్భాల్లో మీ కవితా స్పందనల నుంచి పొందిన స్పూర్తితో మాత్రమే నేను మాట్లాడాను. అంతేగాని, ఈ చర్చతోనే అన్నీ జరిగిపోతాయన్న భ్రమగాని, అతి అంచనా గాని మీలానే నాకు కూడా లేదు.

  • saaralachi says:

    లక్ష్మనరావు గారు,చర్చ అనేది అంత వేగంగా తేలుతుందని నాకు నమ్మకం లేదు.కొంత చర్చ,కొంత ఆచరణా నుంచి ఎవరికైనా అభిప్రాయాలు మారే అవకాశం ఉండొచ్చు.కానీ,ఈ పుస్తకం పై వ్యాసమే పుస్తకంలో లేనివి ,రచయిత తనకు తానుగా సయ్యమనం(బహుశ )పాటించి ,చెప్పకుండానే అర్ధమవుతాయనీ వొదిలేసిన వ్యాఖ్యానాలను రామ్మోహన్ రాయటం (మీరు ఇపుడు కోటే చేసిన మతమూ ,కులమూ పెట్టుబడిలో ఉండవని ఎవరు చెప్పారంటూ అన్న వ్యాఖ్యానం కావచ్చు,ఇంకా అలాంటి విసుర్లు …)అవి బాధ పెట్టె రాతలు.మన రాతలు పెట్టుబడికి వ్యతిరేఖంగా ఎక్కు బెట్టాలి,పెట్టుబడి భూతాన్ని( చిత్ర గారన్నట్టు ఏనుగుని )చూడాల్సినంత చూడని మిత్రుల్ని మిత్ర పూర్వక హెచ్చరికలూ ,సలహాలు ఇచ్చేట్టు మన రాతలున్డాలి.బహుశా ఈ దురుసు రాతలతో వర్మ గారు ఇరిటేట్ అయ్యారు.ఇప్పటికీ శంబుకుడు చూసారా చేతులెత్తేసిన వారి చంకలో ,,, అంటూ ఎగతాళి చేసారు.చిత్ర గారు అలాగే,ఆరంభం లోనే వేటకరించారు.వర్మ గారు తోలిలో ఆ స్పందన అలా వుండడం తప్పే,అలాగే ఉపాధి కూలీల పట్ల ఆ మాట అనడము తప్పే అని నేననుకుంటున్నాను.కాకపోతే ,ప్రభుత్వాలు ప్రజలను సోమరులుగా,దొంగలుగా తయారు చేసే ప్రయత్నం చేస్తుందనీ,వాస్తవంగా ప్రజలు సోమరులో,దొంగలో కారనీ నేను నమ్ముతాను.ఇక,అమ్ముకోవడంలో స్వేచ్చ ఉంది అంటే,వేతనం నిర్ణయం చేసే స్వేచ్చ ఉందంటే నేను అంగీకరించలేను.నగరాలలో తక్కువ వేతనానికి శ్రమను అమ్ముకొని ,రోడ్ల మీద వంటలు చేసుకొని,రోడ్ల మీద పడుకొని ఎందరో వలస కూలీలు కన్పిస్తారు.వారిని చుస్తే దుఖం వస్తోంది.కుల వివక్ష పట్ల కూడా మీవి,రామ్మోహన్వీ పాక్షిక దర్శనాలని నా భావం.ఇంకేమి చెప్పమంటారు.నా కైతే చర్చవెతకారాలతో,విసుర్లతో తప్పుడు దిశకు వేలిపోయిందని..భావన.ఇక నేను మాతాదదలచుకోలేదు…వుంటాను…

    • లక్ష్మణరావు says:

      సారాలచి గారు. మీరెక్కడ ఉంటారో చెబితే అవకాశం ఉన్నప్పుడు కలిసి మనం చర్చించుకోవచ్చు. తద్వారా నాకు మరింత సమాచారం లభిస్తుందని ఆశిస్తున్నాను. ఆ అవకాశం కల్పిస్తారని భావిస్తున్నాను. మీ సూచనలు భవిష్యత్ లో నాకు ఎంతగానో ఉపకరిస్తుందని అనుకుంటున్నాను. ఇ శంభూకుడి గారికి కూడా కృతజ్ఇతులు. మా మిత్రుడు వర్మ స్పందన చూసిన తరువాత నాకు కూడా అలానే అనిపించింది. తన రియాక్షన్ చూసి ఎంతగానో బాధపడ్డాను. మీకొక వివరణ. నేను ఎవరినీ తక్షణం నా ఆలోచనలతో అంగీకరించాలని నేను కోరుకోవడం లేదు. అలా కోరుకోవడం అప్రజాస్వామికం కూడా. స్వయంగా అధ్యయనం, ఆచరణ ద్వారా తెలుసుకోవడం వలనే సమాజానికి మేలు. వ్యక్తిగతంగా కూడా ఎవరికైనా మేలు. ఇలా చర్చించుకోవడం వలన మనకి తెలియకుండా చేసే పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మరొకసారి పునస్సమీక్ష చేసుకునే వీలు చిక్కుతుంది. కొత్త కోణంలో వస్తువును చూసే అవకాశం కూడా ఉంటుంది. నా ప్రయత్నం అంతే తప్పా వేరెవ్వరినీ బాధపెట్టాలని నా ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు. విషయాన్ని విషయంగా చూడకుండా వ్యక్తిగతంగా స్వీకరించి ఎవరినైనా బాధపడితే వారికి క్షమాపణ చెప్పడానికి నాకేమీ అభ్యంతరం కూడా లేదు. చిన్నతనం అంతకన్నా కాదు. మీ సూచనలకు మరోసారి కృతజ్ఇతులు.

      • kcubevarma says:

        లక్ష్మణరావు గారు “గొప్పతనం అమరుల సంఖ్యలో లేదని అందరికీ తెలుసు” ఈ వ్యాఖ్య మీ చిత్ర (వేలూరి రామారావు) గారు నా మొదటి వ్యాఖ్య దగ్గర చేసారు. ఇంకా నా వ్యాఖ్యలో ఏవో పిల్లి శాపాలు అంటూ కూడా తమ వెటకారహంకారంతో కాలరెగరేసారు. అయినా నేను మామూలుగానే మాటాడాను. ఎందుకంటే నాకు మీ అంతటి సైద్ధాంతిక మేధో శక్తి లేదు. ఆచరణలోనో కొద్ది పాటి అధ్యయనం ద్వారా తెలుసుకున్న నా మిడి మిడి జ్నానంతో ఇక్కడి జాంబవంతులతో మాటాడే ప్రయత్నం చేసా. అంతే కానీ శంబూకుడు గారన్నట్టు మీరు చేతులెత్తితే గిల్లికజ్జాలు పెట్టుకోవాలన్నంత తహ తహ లేదు. మీరేమీ క్షమాపణలు కోరనక్కరలేదు. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారు. నేను సెలవింక అన్న తరువాత కూడా మీరు మీ వ్యాఖ్యలలో నన్ను లాగారు. అందుకే నా అజ్నానాన్ని తెలియజేస్తూ స్పందించాల్సి వచ్చింది.

        ఇక్కడ స్టాలిన్ అరాచక వాదమా? సోషలిజమా? అన్న వ్యాసంలో చెప్పినదాన్ని ఉటంకిస్తూ ” మార్క్సిజం, అరాచకవాదం రెండూ సోషలిజం గొడుగుకిందకు వచ్చే వే అయినా యీ రెంటి ప్రాతిపదిక వేరు. అరాచకవాదానికి వ్యక్తి మూలం. ఆ వ్యక్తిని విముక్తి చేస్తే సమాజం విముక్తి చెందుతుంది. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వ్యక్తి విముక్తి సాధించనిదే సమాజ విముక్తి సాధ్యం కాదు. అందువల్ల అంతా వ్యక్తికే అని చాటిచెబుతారు వాళ్ళు. ‘మార్క్సిజానికి మూలం ప్రజలు’. ప్రజా విముక్తిలోనే వ్యక్తి విముక్తి ఇమిడి వుందని మార్క్సిజం చెబుతుంది. ప్రజలు విముక్తి చెందకుండా వ్యక్తి విముక్తి కావడం సాధ్యం కాదని నమ్ముతుంది మార్క్సిజం> (మంది విముక్తిలోనే మనిషి విముక్తి వున్నది) అందుకని అంతా ప్రజలకే అని చాటి చెబుతుంది మార్క్సిజం అన్నారు.

        ఏది జరిగిన సమాజం పురోగామి కొరకే కదా. దానికి మీరంతా సాయశక్తులా కృషి చేయగలరని ఆశిస్తూ మరొక్క మారు సెలవు.

  • suresh says:

    వర్మ గారు మీకు ఎమీ తెలయదంటూనే చాలా విషయాలు చెప్పేశారు. మేదావులంతేనేమో! ఇన్ని తెలిసిన మీరు ‘సమాజ పురోగామి కొరకు మీ శాయిశక్తులా కృషి చేయండి’ అంటూ తోటి మిత్రులకు బాద్యతలను అప్పగించి మీరు పక్కకు తప్పుకోవడం సాహిత్యకారుల లక్షణం కాదేమో! అందునా మీరు కాసింత గుర్తింపు పొందిన కవి కూడా. ఇంతకీ మీది మార్క్సిజమా? అరాచకవాదమా?

  • బి. రామానాయుడు says:

    ప్రశ్నలతో ఆగకండి! విమర్శనా వ్యాసాలు రాయండి !

    ‘ పల్లెను మింగిన పెట్టుబడి ‘ పుస్తకంపై జి.ఎస్. రామ్మోహన్ గారు రాసిన విశ్లేషణా వ్యాసం మీద జరుగుతున్న చర్చను చూశాక సి.ఎఫ్.ఐ.ఆర్. చేస్తున్న విజ్ఈప్తి ఇది.
    చర్చలో పాల్గొన్న వారిలో పుస్తకాంశాలతో ఏకీభావం ఉన్న వారు, ఏకీభావం లేని వారు, కొంత అధ్యయనం చేస్తే గాని విషయం అర్ధం చేసుకోలేమనే వారు అనే మూడు పాయులగా ఉన్నారు. పుస్తకాంశాలతో ఏకీభావం ఉన్న వారు పుస్తకాంశాలను

    విమర్శనాత్మకంగా పరిశీలించే వ్యాసాలు రాయమని కోరుతున్నాం. పోతే, పుస్తకాంశాలతో ఏకీభావం లేని వారు వేస్తున్న ప్రశ్నలు ప్రాధమికమైనవే అయినా చర్చకు సజీవత్వాన్ని ఇచ్చాయని చెప్పకతప్పదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రచయత విద్యాసాగర్ కూడా ఇటువంటి ప్రశ్నలతోనే ప్రారంభమై, సమాధానాలను వెతుక్కునే పనిలో భాగంగా ఈ పరిశోధన చేపట్టారు. మీరు ఆ రకమైన ప్రయత్నం చేయడం చాలా అవసరమని భావిస్తున్నాం. ముందుగా ఒక విషయం మీతో పంచుకోవాలి. రచయత ఒక
    వాదననో, ఒక సిద్ధాంతాన్నో రుజువుచేద్దామనే లక్ష్యంతో ఈ పనికి పూనుకోలేదు. అలానే తన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలనే ప్రయత్నమూ చేయలేదు. వాస్తవిక స్థితిగతులను, వాటి డైనమిక్స్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, సిద్ధాంత గ్రంథాలతో దానిని సరిచూడడం అన్న పద్ధతిని పాటించారు. కాబట్టి, ఏకీభావం లేనివారు ప్రశ్నలతో ఆగకుండా, పుస్తకాన్ని మరోసారి నిశితంగా చదివి, రచయత తన పుస్తకంలో ఉదహరించిన లేదా మీ దృష్టిలో ఉన్న సిద్దాంత గ్రంథాలను తొలుత అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు పుస్తకాంశాలను విమర్శనాత్మకంగా చూడగలుగుతారు. అది కూడా రాగద్వేషాలకు అతీతంగా ఆలోచన చేసినప్పుడే పదునైన విమర్శ చేయగలుగుతారు. ఆ దిశగా మీ ప్రయత్నాన్ని చేపట్టాలని మనవి చేస్తున్నాం.
    అసలు రచయత ప్రతిపాదిస్తున్న అంశాలకు మూలం ఏమిటి? వాటిని ఎలా అర్ధంచేసుకోవాలి? రైతు, వ్యవసాయం, గ్రామాలు గురించి మార్క్సిస్టు క్లాసిక్స్ ఏమి మాట్లాడుతున్నాయి? ఒకానొక దశలో ఆసమాజపు ఉత్పత్తి సంబంధాలను ఎలా అర్ధం చేసుకోవాలి ? ఒక ఉత్పత్తి సంబంధం అదృశ్యమై మరో ఉత్పత్తి సంబంధం ముందుకొస్తున్న క్రమాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? ఆస్తిలేని సమాజాన్ని నిర్మించాలనే మార్స్కిస్టు లక్ష్యానికి భిన్నంగా ఆస్తి పరవర్గాలను తయారుచేసే నినాదాలు ఎందుకు
    ఇస్తున్నాం? పుస్తకాంశాలను ప్రశ్నిస్తున్న తమ ప్రశ్నలకున్న ఆధారాలేమిటి? రుజువులేమిటి? ఇలా ప్రశ్నించుకోవడం ద్వారానే మీరు మీపద్ధతిలో విమర్శనాత్మక వ్యాసాలు రాసి ఈ చర్చను ఇంకా అర్ధవంతంగా నిర్వహించడానికి తోడ్పడిన వారవుతారు. ప్రచురణకు అర్హమైన వాటిని సి.ఎఫ్.ఐ.ఆర్. తరుపున ముద్రించాలని మా ఆకాంక్ష. మీలో ఎవరైనా పరిశోధనకు ముందుకొస్తే సి.ఎఫ్.ఐ.ఆర్. తన సహాయ సహకారాలను అందిస్తుంది.
    బి. రామానాయుడు, లండన్
    మేనేజింగ్ ట్రస్టీ, సి.ఎఫ్.ఐ.ఆర్.

  • E sambukudu says:

    రామానాయుడుగారు ,మీ ప్రతిపాదన బాగుంది.అన్నింటా మంచినే చూసారు.అభినందనీయులు . కాని యిక్కడకొందరు జాంబవన్తులున్నట్టు ,వర్మగారిమాటలు బట్టి తెలుస్తోంది.”ఇక్కడి జాంబవంతులతో మాటాడే ప్రయత్నం చేసా”అన్నారు.పోనీయండి.
    ‘మా’ జాంబ వంతులపట్ల మీకు చిన్న చూపు లేనందుకు ధన్యవాదాలు.

  • B. Rama Naidu says:

    డియర్ శంబూకుడు గారు

    ఇందులో మంచి, చెడు అన్న అంశం లేదు. నథింగ్ పర్సనల్. పాల్గొంటున్న వాళ్ళు, ఆందులోను పుస్తకంతో ఏకీభావం లేని వాళ్ళు కేవలం ప్రశ్నలతో సరిపెట్టుకోకుండా అధ్యయనం చేయమని కోరుతున్నాం. క్రిటికల్ అప్రైసల్ అన్న పదానికి సరిఐన తెలుగు పదం నాకు తెలియదు గాని, ప్రశ్నిస్తున్న వాళ్ళు ఈ పుస్తకం మీద గాని మరో పుస్తకం మీద గాని చేయవలసిన పని అది మాత్రమే. ఒక ప్రమాదకరం అయిన విషయం ఏమిటంటే అధ్యయనాన్ని అపహాస్యం చేయడం అనే కల్చర్ వ్యాపించి ఉంది. ఒకవేల ఎవరికేనా ఆది ఉంటె దానినుండి బయటపడి వ్యాసాలు రాయమని అడగడానికే నేను చర్చలో పాల్గొన్నాను. అందుబాటులోకి వచ్చి 7 నెలలు ఆవుతున్నా ఇంతవరకు లెఫ్ట్ గ్రూపుల జర్నల్స్ గాని, సిపిఐ, సిపిఎం డైలీ పేపర్స్ గానీ రివ్యూకు పూనుకోవడం మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది! లెఫ్ట్ గ్రూపుల, పార్టీల మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్తలు, నాయకులూ ముందుకోచ్చి ఈ పుస్తకాన్ని క్రిటికల్ అప్రైసల్ చేయమని సి ఎఫ్ ఐ అర్ విజ్ఞప్తి చేస్తుంది.

    బి. రామానాయుడు, లండన్
    మేనేజింగ్ ట్రస్టీ, సి.ఎఫ్.ఐ.ఆర్.

  • B. Rama Naidu says:

    డియర్ శంబూకుడు గారు

    ఇందులో మంచి, చెడు అన్న అంశం లేదు. నథింగ్ పర్సనల్. పాల్గొంటున్న వాళ్ళు, ఆందులోను పుస్తకంతో ఏకీభావం లేని వాళ్ళు కేవలం ప్రశ్నలతో సరిపెట్టుకోకుండా అధ్యయనం చేయమని కోరుతున్నాం. క్రిటికల్ అప్రైసల్ అన్న పదానికి సరిఐన తెలుగు పదం నాకు తెలియదు గాని, ప్రశ్నిస్తున్న వాళ్ళు ఈ పుస్తకం మీద గాని మరో పుస్తకం మీద గాని చేయవలసిన పని అది మాత్రమే. ఒక ప్రమాదకరం అయిన విషయం ఏమిటంటే అధ్యయనాన్ని అపహాస్యం చేయడం అనే కల్చర్ వ్యాపించి ఉంది. ఒకవేల ఎవరికేనా ఆది ఉంటె దానినుండి బయటపడి వ్యాసాలు రాయమని అడగడానికే నేను చర్చలో పాల్గొన్నాను. అందుబాటులోకి వచ్చి 7 నెలలు ఆవుతున్నా ఇంతవరకు లెఫ్ట్ గ్రూపుల జర్నల్స్ గాని, సిపిఐ, సిపిఎం డైలీ పేపర్స్ గానీ రివ్యూకు పూనుకోవడం మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది! లెఫ్ట్ గ్రూపుల, పార్టీల మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్తలు, నాయకులూ ముందుకోచ్చి ఈ పుస్తకాన్ని క్రిటికల్ అప్రైసల్ చేయమని సి ఎఫ్ ఐ అర్ విజ్ఞప్తి చేస్తుంది.

    బి. రామానాయుడు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)