అస్తిత్వానికి ఆనవాళ్ళు తొలి తెలంగాణ కథలు

సంగిశెట్టి శ్రీనివాస్‌

సంగిశెట్టి శ్రీనివాస్‌

నిజాం పాలనలో హైదరాబాద్‌ రాజ్యంలో ముఖ్యంగా హైదరాబాద్‌/సికింద్రాబాద్‌ నగరాల్లో కాస్మోపాలిటన్‌ కల్చర్‌ వెల్లి విరిసింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారితో పాటు అటు ఇరాన్‌ నుంచి ఇటు ఫ్రాన్స్‌ ఇంకా అనేక దేశాల నుంచి వలస వచ్చిన వారు హైదరాబాద్‌ని తమ శాశ్వత ఆవాసంగా మార్చుకున్నారు. అంతకు ముందరి కుతుబ్‌షాహీల పాలన కూడా విదేశీ పర్యాటకుల పొగడ్తలతోపాటు, దేశీయుల మన్ననలందుకుంది.

ఇబ్రహీం కులీ కుతుబ్‌షాను కవులు మల్కిభరాముడు అని కొనియాడిండ్రు.  హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించిన మొహమ్మద్‌ కులీకుతుబ్‌షా చంచల్‌గూడా బిడ్డ భాగమతిని వివాహమాడిండు. భాగమతి ` కుతుబ్‌షాహీ ఖాందాన్‌లో వీరమాతగా, వీరపత్నిగా వెలుగొందారు. తారామతి, ప్రేమావతిలు గోల్కొండ కోటలో నృత్య ప్రతిభతో దేశదేశాల్లో పేరు పొందిండ్రు. అక్కన్న మాదన్నలు కుతుబ్‌షాహీల సేవలో తరించారు. ఉన్నత పదవుల్ని అధిష్టించారు.  ఖైరున్నీసా బేగమ్‌ని పెళ్ళి చేసుకొని బ్రిటీష్‌ రెసిడెంట్‌ కిర్క్‌ పాట్రిక్‌ చరిత్రలో నిలిచి పోయాడు. స్వాతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్‌లో చైనీస్‌ రెస్టారెంట్స్‌ ఉండేవి. కరాచీ బేకరీ ఇప్పటికీ ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన సైనిక యోధుడు రేమండ్‌ సమాధి హైదరాబాద్‌ ఆస్మాన్‌ఘడ్‌లో ఇప్పటికీ ఉంది. బ్రిటీష్‌ ప్రధాని చర్చిల్‌ తాను సైన్యంలో ఉన్నప్పుడు సికింద్రాబాద్‌లో నివాసమున్నాడు.   ఆయన కూడా హైదరాబాద్‌లో సర్వేయర్‌గా పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాత కవి టేలర్‌ ఇక్కడుండి కవిత్వం రాసిండు. తెలుగులో నవలలు రాకముందే హైదరాబాద్‌ నగర జీవితం ఇంగ్లీషు నవలల్లో రికార్డయింది.

బ్రిటీష్‌ రెసిడెంట్‌ హాలండ్‌ బంధువు వాల్టర్‌ స్కాట్‌ ఈ నవల రాసిండు. ఇలా ఎంతో మంది హైదరాబాద్‌ ‘షాన్‌’, ‘నిషాన్‌’ని విశ్వవ్యాప్తం చేసిండ్రు. తమ స్వీయ ‘అస్తిత్వా’న్ని ‘పోలీస్‌ యాక్షన్‌’ వరకూ ఇక్కడి ప్రజలు కాపాడుకున్నారు. ఈ కాపాడుకున్న అస్తిత్వం కథా సాహిత్యంలో కూడా ప్రతిఫలించింది. మాజీ మంత్రి, 1969 ఉద్యమ నేత టి.ఎన్‌. సదాలక్ష్మి మామ నిజాం మిలిటరీలో పనిచేస్తూ మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్‌లో పర్యటించాడు. ఆఫ్రికన్‌ కావల్రీ గార్డ్స్‌లో పనిచేసేందుకు అఫ్ఘనిస్తాన్‌, ఈజిప్ట్‌, గల్ఫ్‌, ఇథియోపియాల నుంచి సిద్దీలు, పఠాన్‌లు ఇంకా ఎంతోమంది తమ జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిండ్రు. ఇలా వచ్చిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. వీరిలో ట్రెంచ్‌, టస్కర్‌లతో పాటు అనేక మంది యూరోపియన్‌ అధికారులూ ఉన్నారు. అలాగే సరోజిని నాయుడు, డాక్టర్‌ మల్లన్న తదితరులు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ నుంచి యూరోప్‌కు వెళ్ళిండ్రు.

హైదరాబాద్‌ నుంచి చదువుకునేందుకు ఇంగ్లండ్‌ వెళ్ళిన సంస్కర్త రాయె బాలకిషన్‌ విదేశాల్లో గదర్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. కొన్ని వేల మంది హైదరాబాదీలు విదేశాల్లో చదువుకున్నారు. హైదరాబాద్‌ ఉప ప్రధాని పింగళి వెంకటరామారెడ్డి కుమారుడు యూరోప్‌లో జరిగిన బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ పోటీల సందర్భంగానే దెబ్బలు తగలడంతో బాక్సింగ్‌ రింగ్‌లోనే ప్రాణాలు వదిలాడు. ఇదంతా హైదరాబాద్‌ ప్రజలకు ప్రపంచం చేరువైన తీరు. మిగతా తెలుగు వాళ్లందరికన్నా ముందుగానే బాహ్య ప్రపంచం పరిచయమైందనే వాస్తవాన్ని తెలియజేస్తుంది. ఈ పరిచయం, చైతన్యం, భాషా విశేషాలు, భావాల మేలు కలయిక, కోర్టుల్లో వాడే ఇంగ్లీషు, ఉర్దూ భాషలు అన్నీ కలగలిసి తెలుగులో ఆనాడు కథలు రాసిన వారిపై గాఢమైన ప్రభావాన్నే వేశాయి. అందుకే నందగిరి వెంకటరావు లాంటి వారు తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో 1930కి ముందే కథలు రాసిండ్రు. భాస్కరభట్ల కృష్ణారావు ఆరేడు భాషల్లో నిష్ణాతుడు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు, ఉర్దూ, ఫార్సీల్లో సమాన ప్రతిభ కలవాడు. వీరందరూ ఆనాడు సాహితీ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకుండ్రు.

585_luther_1
హైదరాబాద్‌పై పోలీసుచర్యకు పూర్వం అంటే 1948 సెప్టెంబర్‌ 13 కన్నా ముందు రాసిన తెలంగాణ` తెలుగు కథల్లో ప్రముఖంగా చోటు చేసుకున్న అంశం ఇక్కడి తెహజీబ్‌. హిందూ`ముస్లిం సోదరుల్లా కలిసిపోయిన సంస్కృతి. దాదాపు ఆనాటి తెలంగాణ కథకులందరూ తెలుగు`ముస్లిం జీవితాలను తమ కథల్లో నిక్షిప్తం జేసిండ్రు. నందగిరి వెంకటరావు, సురవరం ప్రతాపరెడ్డి, భాస్కరభట్ల కృష్ణారావు, నెల్లూరి కేశవస్వామి, వట్టికోట ఆళ్వారుస్వామి, వెల్దుర్తి మాణిక్యరావు, కాంచనపల్లి చినవెంకటరామారావు, నందగిరి ఇందిరాదేవి ఇంకా చాలా మంది ఈ జీవితాలకు తమ కథల ద్వారా శాశ్వతత్వాన్ని కల్పించిండ్రు.

ముస్లింల అబ్బాయిలతో తెలుగమ్మాయిలు, తెలుగువారితో ముడిపడ్డ ముస్లిం అమ్మాయిల జీవితాలు, ఉద్యోగాలు, కలివిడితనం, విద్య, సంస్కరణ, ఆత్మగౌరవం ఇవన్నీ ఈ కథల్లో ప్రతిఫలించాయి. గంగా జమునా తెహజీబ్‌తో పాటు 1945 తర్వాత మూడేళ్ళ కాలంలో నిజాం ప్రభుత్వ అసహాయ వైఖరిని కూడా తమ కథల్లో ఎత్తి చూపిండ్రు. దొరలు, పాలకులు చేస్తున్న దగా, దోపిడీ,  మోసాలను నిలదీసిండ్రు. రైతుల దీనావస్థను కళ్ళకు కట్టిండ్రు. ఆంధ్రమహాసభ కార్యక్రమాలు తీసుకొచ్చిన చైతన్యంతో కొంతమంది కథకులు గ్రంథాలయోద్యమం, పత్రికోద్యమం, పుస్తక పఠనం, వెట్టి చాకిరి, రాజకీయ చైతన్యాన్ని తమ కథల్లో వస్తువుగా తీసుకున్నారు. కనుమరుగౌతున్న భాష పట్ల అవగాహన కల్పించే విధంగా కథలల్లిండ్రు. ఈ దశలో తెలంగాణ కథల్లో అనివార్యంగా జైలుకు సంబంధించిన జీవితాలు, పోరాటాలు చోటు చేసుకున్నాయి. పొట్లపల్లి రామారావు ‘జైలు’. వట్టికోట ఆళ్వారుస్వామి’ ‘జైలు లోపల’తో పాటు కాంచనపల్లి వెంకటరామారావు, ఆవుల పిచ్చయ్య తదితరుల కథలే దానికి సాక్ష్యం.
తొలి తెలుగు కథ రాసిన భండారు అచ్చమాంబ మొదలు 1948లో కథలు రాసిన నందగిరి ఇందిరాదేవి వరకూ 25మందికి పైగా రచయితలు తమ కథల్లో తెలంగాణ/హైదరాబాద్‌ రాజ్య అస్తిత్వాన్ని రికార్డు చేసిండ్రు.   1899 నాటికే తెలుగులో తొలి కథలు రాసిన భండారు అచ్చమాంబ హైదరాబాద్‌లో అందరికీ ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ (ఆంధ్రలో) బతుకలేని పరిస్థితి వస్తే హైదరాబాద్‌కు వలస వెళ్ళయినా జీవితాన్ని వెళ్ళదీయొచ్చు అని ‘సతాప్రత్రదానము’ (1902) కథలో చెప్పారు. అచ్చమాంబ బాల్యము ఒకప్పటి మునగాల, దేవరకొండలో గడిచింది. వివాహానంతరం మహారాష్ట్రలో గడిపింది. అందుకే ‘ధనత్రయోదశి’ ‘బీద కుటుంబం’ కథలో బొంబాయి, మహారాష్ట్ర ప్రజల జీవితాన్ని రికార్డు చేసింది. ఆనాడు హైదరాబాద్‌ రాజ్యంలో మరాఠీలు కూడా భాగమే. హైదరాబాద్‌లో మెరుగైన జీవన స్థితిగతులు ఉన్నందువల్లనే ఆమె తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావు, మునగాల జమిందార్‌ రాజా నాయని వెంకటరంగారావు హైదరాబాద్‌ ఆవాసంగా చేసుకొని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం (1901`హైదరాబాద్‌) తో పాటు అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వంహించారు.
అచ్చమాంబ తర్వాత తెలంగాణ జీవితాల్ని ప్రతిఫలించే విధంగా కథలు రాసింది మాడపాటి హనుమంతరావు. ఆయన ‘హృదయశల్యము’ కథలో కాకతీయుల చారిత్రక మహిళ ‘రుద్రమదేవి’ గురించి రాసిండు. ఈయన రాసిన ‘నేనే’ కథలో కృష్ణాథియేటర్‌కు రమ్మని హీరోయిన్‌ హైమవతి తానెవరో చెప్పకుండా న్యాయవాది గణపతిరావుకు లేఖ రాస్తుంది. షోకుగా తయారై వెళ్ళిన రావుకు అక్కడ తన భార్య కనబడడంతో తమాయించుకొని ‘ఈ కొంటె తనము చేసింది నువ్వేనా?’ అని అడుగుతాడు. దానికి ఆమె ‘నేనే’ అని జవాబు చెబుతుంది. ఆనాటికి ఈనాటికి కృష్ణా థియేటర్‌ చార్మినార్‌ దగ్గర చరిత్రకు సాక్ష్యంగా నిలబడి ఇంకా సజీవంగా ఉంది. ‘నేనే’ కథ పురుషుల బలహీనతల్ని చెబుతుంది. ఇది ఆనాటి సమాజంలో వ్యాప్తిలో ఉన్న విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ఆ లౌల్యానికి సాహిత్యంలో స్థానం దక్కింది. ఇదే కాలంలో బడారు శ్రీనివాసరావు అనే మహబూబ్‌నగర్‌కు చెందిన జర్నలిస్టు, ఆయుర్వేద వైద్యుడు, నాటకకర్త తాను వెలువరించిన ‘హితబోధిని’ (1913`15) పత్రికలో కథలు వెలువరించాడు. రాజయ్య సోమయాజులు, విషాదము, మృత్యువు దాని జ్ఞాపకము అనే కథలు వెలువరించాడు. ఇందులో మృత్యువు దాని జ్ఞాపకము మ్యూజింగ్స్‌ మాదిరిగా ఉంటుంది. ఈ కథలో దొరతనము గురించీ, దానికి గ్రామంలోని కరణాలు, ఆయుర్వేద వైద్యులు తమ స్వలాభం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేసే జీవితాల్ని, దాసిరాండ్రని వాడుకునే స్థితిని, ఆనాటి పాలమూరు జిల్లా సంఘటనల్ని రికార్డు చేసిండు.
1921లో ప్రారంభమైన నీలగిరి, తెనుగు పత్రికల్లో కథకుల పేర్లు లేకుండా తెలంగాణ జీవితాల్ని ప్రతిబింబించే విధంగా అనేక కథలు వెలువడ్డాయి. నీలగిరిలో నైజగుణము, సాతాని జియ్యర్‌, కాపు, దురాశ తదితర కథలు అచ్చయ్యాయి. ఇందులోని పాత్రలన్నీ హైదరాబాద్‌, వరంగల్‌, తెలంగాణ జీవితాలనే ప్రతిబింబించాయి. అలాగే తెనుగు పత్రికలో ఒద్దిరాజు సోదరులు తమ పేరు లేకుండానే స్థానిక అంశాలపై అన్యాపదేశంగా కథనాలు వెలువరించారు. ఇవి విషయాల్ని కథలుగా చెప్పాయి. ఇదే పత్రికలో ఇతరుల కథలు కూడా అచ్చయ్యాయి. 1927`30 మధ్యకాలంలో హైదరాబాద్‌ నుంచి సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడ్డ ‘సుజాత’ పత్రికలో వీరి రచనలు చాలా వెలువడ్డాయి.
భారతి పత్రికలో మొట్టమొదటిసారిగా ఒక తెలంగాణ వాడి కథలు అచ్చుకావడమనేది వాసుదేవరావుతో ప్రారంభమయింది. పక్కా హైదరాబాదీ అయిన వాసుదేవరావు తొలి కథ ఆగస్టు,1924 భారతి సంచికలో ‘నేను జొన్నరొట్టె’ శీర్షికన అచ్చయింది. 1924`33 మధ్య కాలంలో డజనుకు పైగా కథలు అచ్చయ్యాయి. ఇందులో ఒకటి రెండు కథలు ప్రేమ్‌చంద్‌ కథలకు అనుసరణలు కాగా మిగతావన్నీ పక్కా హైదరాబాద్‌ ఠీవిని, ఆహార్యాన్ని, ఆహారపు అలవాట్లని పట్టిచ్చాయి. ‘ఆలోచన’, ‘ప్రయాణం’, ‘వివాహం’ సీక్వెల్‌ కథలు.

మూడిరటిలోనూ పెళ్ళిచూపులు, పెళ్ళి ఇతివృత్తం. ఒక దాంట్లో పెళ్ళి చూపులకు ఆంధ్ర ప్రాంతంలోని తన మామయ్య ఇంటికి వెళ్ళాలని నిశ్చయం, రెండో దాంట్లో అందుకోసం చేసిన ప్రయాణంలో జరిగిన సంఘటనలని, మూడో దాంట్లో పెళ్ళికి సంబంధించిన విషయాల్ని రికార్డు చేసిండు. బి.ఎ. పూర్తి చేసిన కథానాయకుడు ఇంగ్లండ్‌ వెళ్ళి ఎం.ఎ. చదవాలనుకుంటాడు. అలాగే హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసెస్‌లో ఉద్యోగం సంపాదించిన తర్వాత పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు.
సూటూ, బూటు నీటుగా టై వేసుకోవడం, విదేశీ అధికారుల మాదిరిగా తయారు కావడం, ఆంగ్ల భాషాభిమానం, ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ సంస్కరణపట్ల ఆసక్తి, వితంతువివాహాలు, రజస్వాలానంతర వివాహాలకు సంబంధించిన విషయాలు ఈ కథల్లో ప్రస్తావనకు వస్తాయి. హైదరాబాద్‌ అస్తిత్వాన్ని, సంస్కృతిని, మాట తీరుని, భాషని, వ్యంగ్యాన్ని చాలా హృద్యంగా వాసుదేవరావు ‘‘నేనా? నేనా? నేను హైదరాబాదు `దక్కనీ! నా హృదయం వేరే. వాళ్ళ హృదయం వేరే. నేనూ వాళ్ళవంటి వాణ్ణే అయితే అయిదు కాదు పదేను వేలిస్తే గాని పెళ్ళి చేసుకోనని పట్టుబట్టి కూర్చుందును. పెద్ద పెద్ద సభలలో వేదికల మీద నెక్కి సంఘసంస్కర్తలని పేరు పెట్టుకొని, సంస్కార విషయాలు పెద్ద పెద్ద లెక్చర్లిచ్చి (బహిరంగంగా) లోలోపల, వందలు వేలు కట్నాలు పుచ్చుకొనే ఆంధ్ర బ్రాహ్మణులెక్కడ? నేనెక్కడ ఈ వ్యత్యాసం నీకు కనబడలేదామ్మా?’’ అంటూ హైదరాబాద్‌(దీ) ఔన్నత్యాన్ని ‘ఆలోచన’ కథలో చాటి చెప్పిండు.

కథానాయకుడి డ్రెస్సింగ్‌ చూసి అతను యూరోపియనా? అనే అనుమానం కలిగిందంటే ఆనాటి హైదరాబాదీ ఆహార్యాన్ని అర్థం చేసుకోవచ్చు. బడాయి కూడా అలానే ఉండేదని తల్లి పాత్ర ద్వారా వాసుదేవరావు చెప్పిస్తాడు. ఇవి గాకుండా ‘నేను జొన్నరొట్టె’, ‘పిశాచం’, ‘ఇదియేనా పునర్వివాహం’, మాటీలు, సుప్రభాతము, ముద్దుటుంగరము, అనర్థం, సంశయం తదితర కథలు హైదరబాదీ హృదయంతో వెలువడ్డాయి. వాసుదేవరావు లాగానే పక్కా హైదరాబాదీ తర్వాతి కాలంలో జడ్జిగా పనిచేసిన నందగిరి వెంకటరావు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కథానికలు రాసిండు.
నందగిరి వెంకటరావు (1909`1985)  తెలంగాణ తొలితరం కథకుల్లో అగ్రగణ్యుడు. 1926`35 సంవత్సరాల మధ్యకాలంలో 50కి పైగా కథలు రాసిన ఈయన రచనలేవి పుస్తక రూపంలో రాకపోవడంతో వాటికి తగిన గుర్తింపు దక్కలేదు. ‘గిరి’ అనే కలం పేరుతో భారతి, ఉదయిని, కృష్ణాపత్రిక, సమదర్శిని, సుజాత, గోలకొండ పత్రికల్లో ఈ కథలు అచ్చయ్యాయి. 1935లోనే ప్రథమ అఖిలాంధ్ర కథకుల సమ్మేళనాన్ని హైదరాబాద్‌లో నిర్వహించిన వెంకటరావు భార్య నందగిరి ఇందిరాదేవి కూడా చాలా కథలు రాసింది.

ఆంధ్రమహాసభ నాయకుడిగా, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో జైలుకెళ్లిన స్వాతంత్య్ర యోధుడిగా, జడ్జిగా, గ్రంథాలయోద్యమ కార్యకర్తగా, స్త్రీవిద్య ప్రచారకుడిగా నందగిరి వెంకటరావు చేసిన కృషి చిరస్మరణీయమైనది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కథా సాహిత్యాన్ని సృజించిన అరుదైన ప్రతిభాశాలి నందగిరి వెంకటరావు.
తెలుగు సాహిత్యం ముఖ్యంగా కథానికా సాహిత్యం దేదీప్యమానంగా వెలుగడానికి చమురునెంతో సరఫరా చేసిన వాడు నందగిరి. కథానికా సాహిత్యంలో తనకంటూ ఒక శైలిని ఏర్పర్చుకొని లో చూపుతో విశ్లేషించి, మానవ సంబంధాల్ని మానవీయ కోణంలో సున్నితంగా సృజించి జీవితాల్ని చిన్న కాన్వాస్‌పై ‘కథ’గా చిత్రీకరించిన అక్షర పెయింటర్‌ నందగిరి. హైదరాబాద్‌ హిందూ`ముస్లిం సంస్క ృతి, తెలంగాణ జీవితాల్ని కథలుగా మలిచిండు. 1935కు ముందే హైదరాబాద్‌ కేంద్రంగా జరిగే జాతీయ ఉద్యమాల్ని తన కథల ద్వారా అక్షర రూపమిచ్చిండు.
హైదరాబాద్‌ తెహజీబ్‌, హిందూ`ముస్లిం పండుగలు, సంస్కృతి, మతాలకతీతమైన రొమాన్స్‌, హిందూ`ముస్లిం ప్రజల సంబంధాల్ని, జీవన విధానాన్ని నందగిరి చిత్రికగట్టినంత సున్నితంగా ఇంకెవ్వరూ రాయలేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతిఫలం, నూర్జహాన్‌, తప్పేమి, జరిగిన కథ మొదలైన కథల్లో హైదరాబాదీ ముస్లిం జీవితం, సంస్కృతి వ్యక్తమయ్యింది. నందగిరి అటు ఆంద్రమహాసభ ఉద్యమంలోనూ, గ్రంథాలయోద్యమంలోనూ, పత్రికోద్యమంలోనూ చురుగ్దా పాల్గొన్న వాడు కావడంతో ఆయన రచనలు అందరికన్నా ఒక అడుగు ముందున్నాయి. చలంతో పోటీపడి తెలంగాణ నుంచి కథలు రాసి యావత్తెలుగు ప్రజల్ని మెప్పించిన కథకుడు నందగిరి వెంకటరావు.
తెలంగాణ సాయుధపోరాటారంభానికి 15 యేండ్ల ముందే దొరల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ‘పటేలుగారి ప్రతాపం’ పేరిట కథ రాసిండు. గ్రామ పటేలు తన మాట వినని రామయ్య అనే రైతును కొట్టడమే గాకుండా వితంతువైన ఆయన సోదరిని అల్లరి చేయడం. దీనికి పటేలు తల్లి కూడా మద్దతుగా ఉండి నీ తండ్రి కాలంలో  ఎదురు తిరిగి మాట్లాడిన వాడు లేడు అని కొడుకుని రెచ్చగొట్టడం, అడ్డు వచ్చిన వారిని బెదిరించడం జరిగింది. దాదాపు ఇలాంటి ఘటనే సాయుధ పోరాట కాలంలో జరిగింది. ఈ కాలంలో విసునూరి దొరలు ఇలాగే దౌష్ట్యానికి దిగారు. విసునూరి ‘బాబుదొర’ను ప్రజలు చంపేసినట్లుగానే ఈ కథలో కూడా ప్రజలు దొరను చంపేస్తారు. అయితే వాస్తవానికి జరిగిన సంఘటనకన్నా 15 యేండ్లకు ముందే నందగిరి వెంకటరావు పటేలుగారి ప్రతాపంలో ఇవే సంఘటలను చిత్రీకరిస్తూ ప్రజలు తిరుగుబాటు చేయాలని పరోక్షంగా చెప్పిండు. చిత్రచోరులు కథలో ఒక అంశాన్ని భిన్న కోణాల్లో చూసే తెలంగాణ`ఆంధ్రవారిని గురించి రాసిండు.
తెనుగు పత్రికలో డిటెక్టివ్‌ కథలు కూడా అచ్చయ్యాయి. హైదరాబాద్‌ అమ్మాయి సినిమాల పట్ల వ్యామోహంతో ఆనాడే బొంబాయికి వెళ్ళి ఆ మాయలో చిక్కుకు పోయిన విషాదాన్ని నందగిరి వెంకటరావు తన కథల్లో చెప్పిండు. ఇదే కాలంలో ఒద్దిరాజు సోదరులు వివిధ పత్రికల్లో తమ రచనలు వెలువరించారు. వీరి కథలు ఎక్కువగా వారు వెలువరించిన తెనుగు పత్రికతో పాటు ‘సుజాత’ పత్రికలో అచ్చయ్యాయి. ఒద్దిరాజు సీతారామచంద్రరావు తెలుగులో తొలిసారిగా వైజ్ఞానిక కథలు రాసిన వాడిగా ప్రసిద్ధుడు. దీనికి నిదర్శనం ‘అదృశ్యవ్యక్తి’ కథానిక. ‘నటి’ కథలో జమీందారి కుటుంబానికి చెందిన నళినీకాంతుడు నటి తారాదేవితో సాన్నిహిత్యంగా ఉంటాడు. నళినీకాంతుడి సోదరులు తారాదేవిని వదిలిపెట్టాలని వత్తిడి తీసుకొస్తారు. కొంతమంది యూరోపియన్‌ మిత్రులు పెళ్ళి చేసుకొమ్మని సలహా ఇస్తారు. దాంతో పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమవుతాడు, అయితే తార పశ్చాత్తాపంతో నళినీకాంతుడికి ఉత్తరం రాస్తుంది. ప్రేమానుభవం కంటే ప్రేమ స్మృతి గొప్పదని అదే అధిక మాధుర్యం కలదిగా తోస్తుందని, వివాహమాడి భార్యతో సుఖంగా ఉండమని రాస్తుంది. హితబోద చేసినట్టుగా కథ ముగుస్తుంది. ఈయన కథలపై బెంగాళీ రచనల ప్రభావముంది. ఇక సీతారామచంద్రరావు సోదరుడు రాఘవరంగారావు తెలంగాణలో దేశ్‌ముఖ్‌ల, జమీందారుల జీవితాల్ని కథల్లోకి తెచ్చిండు. ‘లండన్‌ విద్యార్థి’ కథలో దేశ్‌ముఖ్‌ల సోమరితనం, విలాసాలు, మరో వైపు ఇంగ్లండ్‌లో విద్యాభ్యాసంపై మోజుని చెప్పిండు.
భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్‌లో పుట్టి పెరిగినవాడు. అంబేద్కర్‌ కన్నా ముందు మొత్తం జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నాయకుడు. ఈయన హైదరాబాద్‌ నుంచి ‘భాగ్యనగర్‌’ అనే పత్రిక తీసుకొచ్చాడు. ఇందులో వెట్టిమాదిగ పేరిట ఆనాటి సమాజంలో ఉన్నటువంటి దళితుల దుర్భర జీవితాన్ని తెలియజెప్పిండు. రామిరెడ్డి దురహంకారానికి బలయిన వంతు మాదిగ మల్లయ్య గురించి ఇందులో వివరించిండు. దీనికి కొనసాగింపుగా సురవరం ప్రతాపరెడ్డి అనేక కథలు రాసిండు. ప్రతాపరెడ్డి కథలు ముఖ్యంగా ‘సంఘాల పంతులు’ కథలో పంతులు ఊరి మాదిగలను, కోమట్లను కూడగట్టి వెట్టిచాకిరి, సప్లయిలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాడు. సంఘం అంటే కమ్యూనిస్టు సంఘమనే భావనలోనే ఆ పదాన్ని సురవరం వాడారు. తెలంగాణ వాతావరణ నేపథ్యంతో పాటు, పదాలు, తెలంగాణ ఆత్మని పట్టిస్తాయి. ఈయన మొగలాయి కథలు కూడా ఆయన విశిష్టతను చాటి చెబుతాయి. కరీంనగర్‌ జిల్లా మంథనికి చెందిన వెంకట రాజన్న అవధాని ‘తిరుగుబాటు’ కథలో స్త్రీ విద్య, సంస్కరణ గురించి రాసిండు. ఖమ్మంకు చెందిన దాశరథి కవిత్వంతో పాటు కథలు కూడా రాసిండు.
వీరితో పాటు మాడపాటి రామచంద్రుడు, జి.రాములు, జమలాపురం వెంకటేశ్వర్లు, శేషభట్టర్‌ వెంకట రామానుజాచార్యులు, జమలాపురం వెంకటేశ్వర్లు, తదితరులు ఖమ్మం, కరీంనగర్‌, నల్లగొండ ప్రాంతాల్లోని జీవితాలను రికార్డు చేసిండ్రు. నల్లగొండకు చెందిన బోయనేపల్లి రంగారావు, గం. గోపాలరెడ్డి తదితరులు కూడా ఆనాడు తెలంగాణ తనాన్ని కథల్లో చిత్రించారు. వీరిలో కథకుడు జి.రాములు మాజీ జడ్జి జీవన్‌ రెడ్డి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి, ఎన్నో వర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేసిన జి. రాంరెడ్డిలకు విద్యా గురువు. ఈయన పెరటి చెట్టు, బ్రహ్మపుత్ర భక్త సమాజం, ఆత్మఘోష, పిచ్చి శాయన్న, కొత్తదాసి కనకం తదితర కథలు బహుజన దృక్కోణం నుంచి తెలంగాణను ఆవిష్కరించాయి. పెరటిచెట్టు కథలో గౌడ కులస్థుల జీవన వ్యథల్ని చెప్పిండు. ఇందులో దున్నేవాడిదే భూమి అన్నట్టు గీసేవాడిదే చెట్టు అని సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
1943లో ఆంధ్రప్రాంతంలో ఆరంభమయిన అభ్యుదయ రచయితల సంఘం సమావేశాలకు తెలంగాణ నుంచి ఏకైక ప్రతినిధిగా వట్టికోట ఆళ్వారుస్వామి హజరయ్యిండు. ఆ తర్వాత ఆంధ్రలో జరిగిన ప్రతిసమావేశానికీ విధిగా ఆళ్వారుస్వామి హాజరయ్యిండు. 1944 నాటి భువనగిరి ఆంధ్రమహాసభల్లో కమ్యూనిస్టులు`కాగ్రెస్‌ వారికి సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు జేసిండు. కాంగ్రెస్‌లో కమ్యూనిస్టుగా, కమ్యూనిస్టుల్లో కాంగ్రెస్‌ ఆలోచనాపరుడిగా సంఘసంస్కరణకు పాటుపడే విమర్శకుడిగా, కార్యశీలిగా ఆళ్వారుస్వామి గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్రంథాలయోద్యమం, పత్రికోద్యమం, సత్యాగ్రహాల్లో విశిష్ట భూమిక పోషించిండు. పౌరహక్కుల కోసం పోరాడిరడు. జైల్లో దాశరథితోపాటు ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిండు.

తెలుగుతల్లి పత్రిక ప్రచురణ ద్వారా హైదరాబాద్‌లో అడివిబాపిరాజు, రాంభట్ల కృష్ణమూర్తి, భాస్కరభట్ల కృష్ణారావు తదితరులతో కలిసి నగరంలో అభ్యుదయ రచయితల సంఘానికి ప్రాణం పోయడమే గాకుండా, ఆంధ్రప్రాంతంలో కూడా అరసంకు ఆసరాగా నిలిచిండు. ఈ సమయంలోనే వరంగల్‌లో జరిగిన మజ్లిస్‌ సభల్లో బహదూర్‌ యార్జంగ్‌ తన ఆవేశ పూరిత ప్రసంగంలో ‘‘హైదరాబాద్‌ రాజ్యం ఆలాహజ్రత్‌ సొంత జాగీరు కాదు. ఈ రాజ్యం ఏ ఒకరిదో అనుకుంటే అందుకు బలికావాడానికి నేను సిద్ధంగాలేను. ఇది ముస్లిం ప్రజలందరి ఆస్తి’’ అని చెప్పిండు. ఆ తరువాతి సంవత్సరం నిజాం ఇచ్చిన విందులో హుక్కా పీల్చి అనుమానాస్పద స్థితిలో చనిపోయిండు. అనంతరం మజ్లిస్‌ పగ్గాలు కాసీంరజ్వీ చేతుల్లోకి వెళ్ళాయి. ఆయనే రజాకార్ల ఉద్యమాన్ని లేవదీసిండు. మత పరమైన ఉద్రిక్తతలు ఒకవైపూ, అరసం కార్యకలాపాలు మరోవైపూ హైదరాబాద్‌లో కార్యక్రమాలు నిర్వహించాయి.
1946లో సాయుధ రూపం తీసుకున్న ‘రైతాంగ పోరాటం’, 1948లో ‘పోలీస్‌ యాక్షన్‌’, 1951లో పోరాట విరమణ, 1952లో మిలిటరీ పాలన, ఎన్నికలు, మిత్రుడు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పాలన, ముల్కీ ఉద్యమం, 1953లో ఆలంపూరులో అఖిలాంధ్ర సారస్వత సభ, 1955లో ఆంధ్రలో ఎన్నికలు, 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు 46 ఏండ్ల ఆళ్వారుస్వామి జీవితంపై ప్రభావం చూపిన అంశాలు. ఇవి ఎన్నో గుణపాఠాలు నేర్పాయి. అలాగే రెండు విడతలుగా జైలుశిక్ష, కమ్యూనిస్టుల ఏకపక్ష ధోరణి, బాధ్యతారాహిత్యం అన్నీ కలగలిసి ఆళ్వారుస్వామిని చివరి పదేళ్ళు పుస్తక ప్రచురణ, రచనా రంగానికే పరిమితం చేశాయి. ఈ కాలంలోనే ఆళ్వారుస్వామి తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రవేసే, ఉన్నత విలువల్ని ప్రతిష్టించే రచనలు చేసిండు.
‘తెలంగాణ మంటల్లో’ అనే కథా సంకలనాన్ని 1948లోనే వెలువరించిన అడ్లూరి అయోధ్యరామకవి స్వతహాగా కవి, గాయకుడు, జర్నలిస్టు. ‘నైజాం ప్రజావిజయం’ అనే బుర్రకథ, ఘంటారావంతో పాటు అనేక ఖండికలను రాసిన ఈయన బాంబుల భయం, కాలాన్ని తేవాలి, తల్లి ప్రేమ, చీకటి రాజ్యం, జనానా రజాకార్‌, అమరలోక యాత్రికులు అనే కథలు రాసిండు. ఇందులో ‘బాంబుల భయం’ కథలో సాయుధ పోరాట సమయంలో గ్రామ రక్షణ దళాలు సిరిపురం పై రజాకార్ల దాడిని అడ్డుకున్న అంశాన్ని చిత్రించాడు. సాయుధ పోరాట కాలంలో కాంగ్రెసు కార్యకర్తగా, దాశరథి కృష్ణమాచార్యతో కలిసి ప్రచారకుడిగా పనిచేసిన అడ్లూరి కథలన్నీ ఆనాటి పోరాటాన్ని చిత్రీకరించాయి.

కమ్యూనిస్టులు, ప్రజలు, కాంగ్రెస్‌, రజాకార్లు, దొరలు, గడీలు, సాయుధ పోరాటం, జైలు అన్నీ ఈయన కథాంశాలయ్యాయి. ఈయనతో పాటు కాళోజి నారాయణరావు కూడా సాయుధ పోరాట సమయంలో కథలు రాసిండు. కాళోజి రాసిన లంకాదహనం ఉద్యమానంతర పరిస్థితుల్ని రికార్డు చేశాయి. ఆశించిన ఫలితాలు అందకుండా పోయిన స్థితిని ఇందులో కాళోజి రికార్డు చేసిండు.
సాయుధ పోరాటం కన్నా ముందు నుంచే గోలకొండ పత్రికలో కథలు రాసిన వారిలో అగ్రగణ్యుడు భాస్కరభట్ల కృష్ణారావు. 1939 నుంచీ కథలు రాస్తూ వచ్చిన భాస్కరభట్ల మూడు కథా సంపుటాలు ప్రచురించాడు. మొదటి సంపుటం 1955లో ‘కృష్ణారావు కథలు’ పేరిట, తర్వాత ‘చంద్రలోకానికి ప్రయాణం’, ‘వెన్నెల రాత్రి’ పేరిట మిగతా రెండు సంపుటాలు ప్రచురితమయ్యాయి. ఈయన మొత్తం తెలంగాణ కథకుల్లో ముందు వరుసలో నిలబడాల్సిన వాడు. జన్మత: తెలంగాణ వాడు కావడంతో ఆయన కథల్లో తెలంగాణ మట్టి వాసన కనబడుతుంది. ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, బాధలు, సంతోషాలు అందులో కనిపిస్తాయి.

భాస్కరభట్లకు బాగా పేరు తీసుకు వచ్చిన కథ ‘ఇజ్జత్‌’. ఇందులో కౌలుకు తీసుకున్న భూమిలో పంటలు సరిగా పండక పోవడంతో మల్లయ్య అనే రైతుల కౌలు చెల్లించ లేక పోతాడు. ఇందుకు అతనికి ‘శిక్ష’ వేస్తారు. ఆ అవమానాన్ని భరించలేక ఉరిబెట్టుకున్న రైతు కథను ఇందులో చిత్రీకరించాడు. భూసంస్కరణల అమలు చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో  పేద రైతు దీనస్థితిని ఈ కథలో భాస్కరభట్ల కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఈ కథ 1944లో మీజాన్‌ పత్రికలో అచ్చయ్యింది. మల్లయ్య అనే రౌతు రంగారావు పొలం కౌలుకి తీసుకొని క్రమం తప్పకుండా కౌలు గింజలు చెల్లిస్తూ ఉండేవాడు. అయితే కాలం సరిగా కాకపోవడంతో, కుంటకు గండిపడడం లాంటి ఇబ్బందులకు తోడుగా ఈ మధ్యనే కూతురు పెళ్ళి చేశాడు. దీంతో ఖర్చులో పడ్డాడు. అందువల్ల కౌలు గింజలు ఇవ్వలేక పోయాడు. గండి పూడ్చగల తాహతు మల్లయ్యకు లేదు. పైగా భూసంస్కరణల చట్టం ఒకటి వచ్చి పడుతోంది. ఈ పరిస్థితిలో తన కౌలుగింజల బకాయి రాబట్టుకోవడానికి రంగారావు గట్టి ప్రయత్నం చేస్తాడు. మల్లయ్య ఎంత ప్రాధేయపడినా ఫలితం లేక పోయింది. అతనికి శిక్ష వేస్తారు. వంగబెట్టి వీపుమీద బండ పెట్టించారు.

కొంత సేపటికి మల్లయ్య స్పృహ తప్పి పడిపోయాడు. సేదదీర్చి ఎవరో పుణ్యం గట్టుకున్నారు. అతని భార్య గొల్లున ఏడుస్తూ వస్తుంది. ఆమెతో ‘ఇజ్జత్‌’ పోయిందే పిల్లా అని చెబుతూ పరువు పోవడంతో బతకడం కష్టమని తలంచి ఇంట్లో దూలానికి ఉరివేసుకొని చనిపోతాడు. ఇందులో రైతుల కష్టపడే గుణాన్ని, కౌలుదారీ విధానం గురించి కథకుడు చెబుతాడు. ఆఖరికి ఆత్మాభిమానం మెండుగా గల రౌతు ఆత్మహత్య చేసుకోవడంతో కథ ముగుస్తుంది. ఇది 1944నాటి తెలంగాణ రైతుల స్థితిగతుల్ని లెక్కగడుతుంది.    మీజాన్‌ పత్రికలోనే 1945లో వెలువడ్డ మరో కథ ‘మార్పు’. ఇందులో దేవుడి మొక్కును వాయిదా వేసుకునేందుకు సాకులు వెతికే భర్త గురించి చెప్పాడు. చివరికి ఖైరతాబాద్‌లోని ఆంజనేయ గుడికి వచ్చి మొక్కు చెల్లించుకునేలా భర్తని మార్చిన భార్య గురించి చెప్పాడు. ఖైరతాబాద్‌లో ఆంజనేయ స్వామి గుడి ఇప్పటికీ ప్రతి శనివారం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది.

అలాగే మరో కథ ‘సానుభూతి’, ‘హృదయ పరివర్తనం’ కథల్లో మధ్యతరగతి ప్రజల్లోని అవకతవకలను ఎత్తి చూపిస్తూ వాటి నుంచి విముక్తులు కావాలని హెచ్చరిస్తాడు. ‘అవమానం’అనే కథలో స్వార్థపరుల నీచత్వాన్ని నగ్నంగా చూపించి, ఆత్మవంచన చేసుకునే వారికి గుణపాఠం చెప్పాడు.
హైదరాబాద్‌ నగర జీవన విధానం, రాజకీయ పరిస్థితులు, సామాజిక, సాంస్కృతికరంగాలు, హిందూ`ముస్లిం దోస్తానా దానితో పాటే మజ్లిస్‌ మతవిద్వేషం, జమీందార్లలో కూడా మంచీ చెడూ రెండూ ఉంటాయని భాస్కరభట్ల చెప్పిండు. ఆధునిక స్త్రీ స్వయం నిర్ణయాధికారం కోసం తండ్రిని సైతం ఎదిరించడం, విద్యా ప్రాధాన్యత ఈ నవలల్లో, కథల్లో ప్రధానంగా చోటు చేసుకున్నాయి. ‘యుగసంధి’ నవల్లో రుక్మిణి, రమణ, పద్మల పాత్రల ద్వారా ఆనాటి స్రీల ఆలోచనాసరళిని వారి తెగింపుని, కట్టుబాట్లకు లొంగని తిరుగుబాటు దోరణిని చదువుకున్న, ఆధునిక భావాలు గల స్త్రీల మనోభావాల్ని రికార్డు చేసి నవలకు సమగ్రత కల్పించిండు. నిరుద్యోగం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం కూడా ఇందులో అంతర్లీనంగా చోటు చేసుకున్నాయి. భాస్కరభట్ల  మీద ఉన్న ప్రేమతో నెల్లూరి కేశవస్వామి తన ‘పసిడి బొమ్మ’ కథా సంపుటిని అంకితమిచ్చాడు.
నెల్లూరి కేశవస్వామి కూడా పక్కా హైదరాబాదీ. ఈయన కథల్లో హిందూ`ముస్లింల మైత్రి, ప్రేమ, ఆచార వ్యవహారాలు, అంతర్లీనంగా నవాబుల పోకడలు అన్నీ ప్రతిఫలిస్తాయి. ‘పోలీసుచర్య’కు పూర్వం హైదరబాద్‌ నగరంలో ఉన్న జీవన స్థితిగతుల్ని ముఖ్యంగా ముస్లింల జీవితాలని నెల్లూరి కేశవస్వామి హృద్యంగా చిత్రీకరించాడు. ‘యుగాంతం’ అనే పెద్ద కథలో పోలీసుచర్య నాటి జీవన విధ్వంసాన్ని చిత్రించాడు. ‘చార్మినార్‌’, ‘పసిడి బొమ్మ’ పేరిట కథా సంపుటాలను వెలువరించాడు. సంపుటాల్లో చేరని కథలు ఇంకా చాలా ఉన్నాయి.
వీరితో బాటుగా వరంగల్‌కు చెందిన పెండ్యాల చినరాఘవరావు, ఖమ్మంకు చెందిన బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి, హీరాలాల్‌ మోరియా, ఊటుకూరి రంగారావు, కవిరాజమూర్తి, దాశరథి తదితరులు తెలంగాణ జీవితాల్ని తమ కథల్లో నిక్షిప్తం జేసిండ్రు. వీరందరూ ఉర్దూలో కూడా నిష్ణాతులే కావడం విశేషం. బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి స్వయంగా కథలు రాయడమే గాకుండా ఉర్దూ కథల్ని తెలుగులోకి అనువదించారు. హీరాలాల్‌ మోరియా ఎక్కువగా ఉర్దూలో కథలు రాసిండు. వీటిని ఊటుకూరి రంగారావు తెలుగులోకి అనువదించేవారు. ఈయన స్వయంగా కథకుడు కూడా. ఇక కవిరాజమూర్తి అయితే ఏకంగా ఉర్దూలో నవలలే రాసిండు. ఇవి కూడా ఉర్దూ నుంచి తెలుగులోకి తర్జుమా  చేయబడ్డాయి.
హైదరాబాద్‌లో మొదటి నుంచీ పంచభాషా సంస్కృతి ఉండేది. హైదరబాదీయులందరికీ గతంలో ఐదు భాషలు అవలీలగా వచ్చేవి. తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడం, ఇంగ్లీషు భాషలు హైదరాబాద్‌లో నివాసముండే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాట్లాడగలిగేవారు. నిజాం ప్రభుత్వం విధిగా తమ కార్యకలాపాలన్నింటినీ ఈ ఐదు భాషల్లో నిర్వహించేది. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నందగిరి వెంకటరావు, నెల్లూరి కేశవస్వామి, భాస్కరభట్ల కృష్ణారావు, కాళోజి నారాయణరావు, పొట్లపల్లి రామారావు, బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి, కవిరాజమూర్తి, ఊటుకూరి రంగారావు, హీరాలాల్‌ మోరియా, బూర్గుల రంగనాథరావు, వట్టికోట ఆళ్వారుస్వామి,  కాంచనపల్లి చినవెంకటరామారావు ఇంకా అనేకమంది తెలుగుతో పాటుగా ఉర్దూలో కూడా రచనలు చేయదగ్గ సమర్ధులు. నందగిరి వెంకటరావు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కథలు రాసిండు. కవిరాజమూర్తి, పొట్లపల్లి రామారావులు తెలుగుకన్నా ఎక్కువగా ఉర్దూలో తమ రచనలు వెలువరించిండ్రు.

అయితే ఈ బహుభాషా సంస్కృతి హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం అంతరించి పోయింది. పోలీసుచర్య తర్వాత ఏర్పడ్డ పరాయి పాలన, వలసాంధ్రాధిపత్యం, హిందీ ప్రాభవం అన్నీ కలగలిసి పంచభాషా సంస్క ృతిని మట్టుబెట్టాయి. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఉన్నన్ని రోజులు హైదరాబాద్‌ రాజ్యంలో అంతో ఇంతో ఉర్దూ, తెలుగు, కన్నడ, మరాఠీలకు ఆదరణ లభించినప్పటికీ తర్వాత కనుమరుగయ్యాయి.
1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డ తర్వాత తెలుగుని మాత్రమే ముందుకు తీసుకువచ్చి ఆ భాషలోనూ తెలంగాణేతరులు రాసిన రచనలే గొప్పగా ప్రచారం కావడంతో వాటికి మాత్రమే గౌరవం దక్కింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావడం వల్ల తెలంగాణకు జరిగిన పెద్ద నష్టమిది. బహుభాషా సంస్కృతి, కాస్మోపాలిటన్‌ కల్చర్‌కి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గొడ్డలి పెట్టయ్యింది. 1956 కు ముందు ఇంకా చెప్పాలంటే 1948 సెప్టెంబర్‌కు ముందు హైదరాబాద్‌ రాజ్యం నుంచి తెలుగులో వెలువడ్డ కథ, నవల, కవిత్వానికి తర్వాతి కాలంలో సరైన ఆదరణ లభించలేదు. ఇప్పటికైనా ఆనాటి అమూల్యమైన రత్నాలను వెతికి వెలుగులోకి తీసుకొచ్చి మన సాహిత్య చరిత్రను పునర్నిర్మించుకోవాలి. తెగిన తల్లివేరు భాషను బతికించుకోవాలి. ఇవన్నీ ఆనాటి రచనలను ఒక్కొక్కటిగా సంకలనాలుగా వెలువరించడం ద్వారా సాధించవచ్చు.
ఆనాటి రచనలను పునర్ముద్రించుకోవడం ద్వారా కనుమరుగై, గౌరవానికి నోచుకోకుండా పోయినా తెలంగాణ అస్తిత్వానికి చిత్రిక గట్టవచ్చు. మనమూ చరిత్రకెక్కదగిన వారమే, ఎవరికీ ఎందులోనూ తీసిపోము, మీదు మిక్కిలి ఆగమైన మన ఘనమైన చరిత్రను చెక్కిలిపై రాపాడిరచుకోవడానికి, నెత్తిన పెట్టుకొని ఊరేగించడానికి  ఈ అస్తిత్వ కథలు సమగ్ర సంకలనాలుగా వెలువడాల్సిన అవసరముంది.

-సంగిశెట్టి శ్రీనివాస్‌

Download PDF

3 Comments

  • jwalitha says:

    చాల అవసరమైన సందర్భం లో ఎన్నో వివరాలను తెలియచేసింది మీ వ్యాసం
    ఆ కతలన్నీ పునర్ముద్రించాలిసిన అవసర చాలా ఉన్నది ఇప్పుడు
    జ్వలిత

  • Rapolu Satyanarayana says:

    ఏ విషయం తీసికొన్నా పరిశోధించి రాసే గుణం సంగిశెట్టి సద్గుణం!

  • బాలా says:

    తెలంగాణా రచయితలు ఆంధ్రా రచయితల కంటె తక్కువ, తెలంగాణా వాళ్ళు ఆంధ్రావాళ్ళ కంటే తక్కువ అని ఏ ఆంధ్రా రచయితలైనా పేర్కొన్నారా అనేది సోదాహరణముగా తెలియజేయగలరు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)