కన్యాత్వం: మరో రెండు కథలు

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

మహాభారతంలో ఉన్నదే నేను రాస్తున్నాను. అది అలా ఎందుకు ఉంది, ఫలానా పాత్రలు ఫలానా విధంగా ఎందుకు ప్రవర్తించాయంటూ తప్పొప్పులు ఎంచడం నా పరిధి కాదు. నాకు దాని మీద ఆసక్తి కూడా లేదు. కాలగమనంలో మనిషి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, అనేక ఘట్టాలను దాటుతూ, అనేక పరిమితులకు లొంగుతూ, అప్పటి జీవన పరిస్థితులను బట్టి, అనివార్యతలను బట్టి నైతికతను నిర్వచించుకుంటూ, వ్యూహాలను రచించుకుంటూ ముందుకు సాగాడు…

ఇది కొన్ని వేల సంవత్సరాల కాలగమనం గురించి. ఇప్పటి విషయానికే వస్తే, కేవలం రెండు మూడు తరాలకే నైతికతను, విలువలను తిరగరాసే పరిస్థితిని చూస్తున్నాం. ఒక్క ఉదాహరణే చెప్పుకోవాలంటే, ఇంతవరకూ అగ్నిసాక్షిగా జరిగిన వివాహం ఒక అనుల్లంఘనీయమైన విలువ. కానీ ఇప్పుడు అలాంటి వివాహంతో పనిలేని ‘సహజీవ’నాన్ని న్యాయస్థానాలు కూడా గుర్తిస్తున్నాయి. ఇలాంటివే ఇంకా అనేకానేక ఉదాహరణలు…

ఇలాంటి విషయాలలో వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఎలాగైనా ఉండవచ్చు. ఈ వ్యాసపరంపరకు సంబంధించినంతవరకు ఒకరి ఇష్టాన్ని సమర్థించడం, ఇంకొకరి ఇష్టాన్ని వ్యతిరేకించడం అన్న పనిని నేను పెట్టుకోలేదు. నేను ఇక్కడ గతాన్ని కేవలం తటస్థదృష్టితో మాత్రమే చూస్తున్నాను. అంతే తప్ప, మంచిచెడుల గురించి తీర్పు చెప్పే పనిని తలకెత్తు కోవడం లేదు. ఎవరి సంగతి ఏమైనా, అలా తీర్పు చెప్పే స్థాయి కూడా నాకు లేదని నేను నమ్ముతున్నాను. మన తీర్పు కోసం ఆగకుండా లోకంలో, ప్రకృతిలో అనేక పరిణామాలు జరిగిపోతూ ఉంటాయి. మన పుట్టుక మన తీర్పుతో, ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే జరిగిపోతుంది. మనం మరొకరికి జన్మనివ్వడం కూడా మన తీర్పుతోనూ, ఇష్టాయిష్టాలతోనూ సంబంధం లేకుండానే జరిగిపోతుంది.

మనం గడిచివచ్చిన కాలానికి కూడా ఇదే సూత్రాన్ని వర్తింపచేస్తే…

***

250px-Ravi_Varma-Shantanu_and_Satyavati

మత్స్యగంధి అంది కదా…ఓ పుణ్యాత్ముడా! నేను చేపల కంపు కొట్టే జాలరిదాన్ని, పైగా కన్యను, నా కన్యాత్వం అంతరిస్తే నా తండ్రి గడప ఎలా తొక్కను, నాకు ఆ దోషం అంటకుండా అనుగ్రహించూ…అని.

పరాశరుడు ఆ మాటకు సంతోషించాడు. నా కోరిక తీర్చినందువల్ల నీ కన్యాత్వానికి భంగం కలగదన్నాడు. ఆపైన, నువ్వు వసురాజు వీర్యం వల్ల జన్మించినదానివి తప్ప శూద్రకులంలో పుట్టినదానివి కావన్నాడు. అప్పటికప్పుడు ఆమె చేపల కంపు పోగొట్టి యోజన దూరం వ్యాపించే సుగంధాన్ని ఇచ్చాడు. అంతేకాక, ఆమెకు దివ్యవస్త్రాలను, ఆభరణాలను ఇచ్చాడు.

నీ కన్యాత్వానికి భంగం కలగదన్న వెంటనే ఇవన్నీ జరిగినట్టు చెప్పడం ద్వారా పరాశరుడు ఎంతో మహిమోపేతుడని కథకుడు సూచిస్తున్నాడన్నమాట. ఆవిధంగా, కన్యాత్వానికి భంగం కలగదని అనడం కూడా ఆయన మహిమలో భాగమేనని చెబుతున్నాడు. అంటే, కన్యాత్వానికి భంగం కలగకుండా చేయగల మహిమ పరాశరుడి లాంటి మహర్షికి తప్ప, ఇంకెవరికీ ఉండదని అందులోని ధ్వని.

ఈ కన్యాత్వంతో ముడిపడిన మరో రెండు ఉదంతాలు ఈ సందర్భంలో చటుక్కున గుర్తొస్తున్నాయి. వాటిలో మొదటిది బాగా ప్రసిద్ధమైన కుంతి కథ. రెండోది అంతగా ప్రసిద్ధం కాని మాధవి కథ.

కుంతి కథ

ఆదిపర్వం, పంచమాశ్వాసంలోని కుంతి కథ ఇలా సాగుతుంది….

శూరుడు యాదవకులానికి పెద్ద. అతని పెద్ద కూతురు పృథ. ఆమె వసుదేవునికి చెల్లెలు కూడా. తన మేనత్త కొడుకైన కుంతిభోజునికి సంతానం లేకపోవడంతో పృథను శూరుడు అతనికి దత్తు ఇచ్చాడు (ఆ విధంగా ఆమె కుంతి అయిందన్నమాట). కుంతి దత్తత తండ్రి ఇంట్లో ఉంటూ అతని ఆదేశం ప్రకారం ఇంటికొచ్చిన బ్రాహ్మణులకు రుచికరంగా వండి పెడుతూ, దానాలు, సేవలు చేస్తూ ఉండేది.

అలా ఉండగా, ఒకరోజున దూర్వాసుడనే సిద్ధముని అతిథిగా వచ్చాడు. కుంతి అతనికి ఇష్టమృష్టాన్న భోజనం పెట్టింది. అతను చాలా సంతోషించి ఆమెకొక దివ్యమంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించినా ఆ దేవుడు నువ్వు కోరుకున్న లక్షణాలు కలిగిన కొడుకును ఇస్తాడని చెప్పి వెళ్లిపోయాడు.

కుంతి ఒక రోజున ఆ మంత్రశక్తిని పరీక్షించాలనుకుంది. ఏకాంతంగా గంగ ఒడ్డుకు వెళ్లింది. కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుంది. దూర్వాసుడు ఇచ్చిన మంత్రాన్ని హృదయంలో నిలుపుకుని, సూర్యుడికి అర్ఘ్యమిచ్చింది. నీలాంటి కొడుకునిమ్మని చేతులు జోడించి అడిగింది.

సూర్యుడు తన తీవ్రతను ఉపసంహరించుకుని లేలేత కాంతితో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. కుంతి ఆ తేజోరూపం చూసి ఆశ్చర్యాన్ని, భయాన్ని, తత్తరపాటును పొంది అక్కడినుంచి పారిపోదామని చూసింది. సూర్యుడు ఆమెను భయపడవద్దని చెబుతూ, నువ్వు కోరిన వరం ఇవ్వడానికి వచ్చానన్నాడు.

అప్పుడు కుంతి సిగ్గుతో తలవంచుకుని,‘ఒక బ్రాహ్మణుడు నా మీద కరుణతో ఈ మంత్రాన్ని ఉపదేశించాడు, ఆ మంత్రశక్తిని తెలుసుకోవాలనిపించి అజ్ఞానంతో నిన్ను రప్పించాను, నా తప్పును క్షమించు. ఆడవాళ్లు అజ్ఞానంతో ఎప్పుడూ తప్పులే చేస్తూ ఉంటారు, అయినాసరే అందరూ దయతో వాళ్ళను కాపాడుతూనే ఉంటారు’ అంది.

అప్పుడు సూర్యుడు,‘నీకు దూర్వాసుడు ఇచ్చిన వరం గురించి, మంత్రశక్తి గురించి నాకు తెలుసు, నా దర్శనం వృథా కాదు, నీ కోరిక తీరుస్తాను’ అన్నాడు.

‘నేను మంత్రశక్తి తెలియక కోరాను, గర్భవతిని అయితే నా తల్లిదండ్రులు, చుట్టాలు నవ్వరా?’ అని కుంతి అంది.

‘’నీకు సద్యోగర్భం(అంటే నవమాసాలు మోయనవసరం లేకుండా అప్పటికప్పుడు)లో కొడుకు పుడతాడు. నీ కన్యాత్వం కూడా చెడదు’ అని సూర్యుడు వరమిచ్చి వెళ్లిపోయాడు.

అప్పుడు కుంతికి సహజకవచకుండలాలతో ‘కానీను’ (కన్యగా ఉన్నప్పుడు కన్న సంతానాన్ని కానీన శబ్దంతో సూచిస్తారు)డిగా కర్ణుడు పుట్టాడు. ఆశ్చర్యపోయిన కుంతికి ఏం చేయాలో తోచలేదు. ఈ లోకాపవాదం నుంచి ఎలా బయటపడతాను, ఈ విషయం జనానికి తెలియకుండా ఎలా ఉంటుంది, ఈ బాలుని తీసుకుని ఇంటికి ఎలా వెళ్లను అని ఆందోళన చెందింది. అప్పుడు రత్నాలు, బంగారం నింపిన ఒక పెట్టె సూర్యుని ప్రేరణతో నదిలో తేలుతూ ఆమె దగ్గరికి వచ్చింది. కొడుకును ఆ పెట్టెలో ఉంచి నదిలో విడిచిపెట్టి కుంతి త్వర త్వరగా ఇంటికి వెళ్లిపోయింది.

ఆ పెట్టె, రాధ అనే ఆమెకు భర్త అయిన ఒక సూతుడికి దొరికింది. అతడు అందులోని శిశువును భార్యకు ఇచ్చాడు. ఆమె సంతోషంతో ఆ శిశువుకు స్తన్యమిచ్చింది. వసువు(బంగారం)తోపాటు దొరికాడు కనుక అతనిని వసుషేణుడనే పేరుతో ఆ దంపతులు పెంచి పెద్దచేశారు. రాధ పెంచిన కారణంగా అతడు ‘రాధేయు’డిగా కూడా గుర్తింపు పొందాడు.

***

kunti-and-surya

ఇది నన్నయ భారతంలోని కథ. సంస్కృత భారతంలో కొంత తేడా కనిపిస్తుంది. కర్ణుని పుట్టుక గురించి కుంతి ఆశ్రమవాసపర్వంలో వ్యాసుడికి వివరిస్తుంది. ఆ సమయంలో పశ్చాత్తాపం కూడా ప్రకటిస్తుంది. ఆ వృత్తాంతం ప్రకారం, కుంతి గంగ ఒడ్డుకు వెళ్ళి మంత్రశక్తిని పరీక్షించలేదు. తన మేడమీద నిలబడి ఉదయభానుని చూస్తూ మంత్రం పఠించింది. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంచుమించు పైన చెప్పిన విధంగానే వారిమధ్య సంభాషణ సాగింది. సూర్యుడు,‘నా రాక వృథా కావడానికి వీల్లేదు, వృథా అయితే నీకూ, ఆ దూర్వాసునికీ కూడా హాని కలిగిస్తాను’ అన్నాడు. సూర్యుని శాపం నుంచి దూర్వాసుని కాపాడాలనుకున్న కుంతి, చేసేదిలేక ‘నీ లాంటి కొడుకును ఇవ్వు’ అని అడిగింది. అప్పుడు సూర్యుడు తన తేజస్సుతో ఆమెను ఆవహించి, మోహపరవశురాలిని చేసి, కొడుకు పుడతాడని చెప్పి వెళ్లిపోయాడు. ఆమె అంతఃపురంలోనే రహస్యంగా కొడుకును ప్రసవించింది. ‘పితృమర్యాద’ను కాపాడడం కోసం అతన్ని నీళ్ళలో విడిచిపెట్టింది.

ఈ రెండు పాఠాలలోనూ కొన్ని తేడాలే కాకుండా గమనించవలసిన కొన్ని విశేషాలు ఉన్నాయి. మొదటిది, కర్ణుడు ఎవరికైతే దొరికాడో ఆ సూతుడి పేరు చెప్పలేదు. సూతుడనే మాట అతని కులాన్ని మాత్రమే చెబుతుంది. అతడు ‘రాధఅనే ఆమెకు భర్త’ మాత్రమే. కుంతి కొడుకులు ‘కౌంతేయులు’ గా కూడా ప్రసిద్ధులైనట్టే; పెంచిన తల్లి పేరిట కర్ణుడు కూడా ‘రాధేయుడు’ గా ప్రసిద్ధుడయ్యాడు. కుంతి కొడుకులను తండ్రి పేరిట పాండవులు అన్నట్టే, కర్ణుని కూడా ‘సూతపుత్రు’డన్నారు, అది వేరే విషయం. ఇక్కడ తల్లి పేరిట ప్రసిద్ధులు కావడమే గమనించవలసిన విషయం.

దూర్వాసుని సంబంధంతోనే కుంతి గర్భవతి అయినట్టు, రహస్యంగా కొడుకును కన్న తర్వాత అతన్ని పెంచమని తనే రాధకు ఇచ్చినట్టు ఎస్.ఎల్. భైరప్ప ‘పర్వ’ నవలలో చిత్రించారు. అదలా ఉంచితే, కర్ణుడు సహజ కవచ, కుండలాలతోనూ, రత్నాలతోనూ, బంగారంతోనూ దొరికాడన్న వివరాన్ని మనం స్థూలంగా ఇలా కూడా అన్వయించుకోవచ్చు:

రాధకు తన కొడుకును పెంపకానికి ఇస్తూనే, అందుకు అవసరమైన ధన సంపత్తిని కూడా కుంతి ముందే ఇచ్చింది. దాంతోపాటు అతనికి కవచ, కుండలాలు కూడా ఇచ్చింది. అవి రాచరిక చిహ్నాలు కావచ్చు. అతన్ని తమ స్థాయికి తగినట్టు రాచరిక హోదాలో పెంచమని చెప్పడం కుంతి ఉద్దేశం కావచ్చు. సరిగ్గా యుద్ధానికి ముందే ఇంద్రుడు బ్రాహ్మణవేషంలో కర్ణుడి దగ్గరకు వచ్చి కవచకుండలాలను యాచించి తీసుకువెళ్లిపోతాడు. అవి రాచరికానికి ప్రతీకలు అనుకుంటే, వాటిని అతనికి దూరం చేయడం రాచరిక హోదాను నిరాకరించడమే. సరిగ్గా యుద్ధానికి ముందే అది జరగడంలో ఉద్దేశం, యుద్ధంలో రాజన్యుల సాయం కర్ణునికి లేకుండా చేయడమే. శల్యసారథ్యం తెలిసినదే.

కుంతి యాదవుల ఆడబడుచు కదా, యాదవులకు రాజ్యార్హత ఉందా అన్న సందేహం రావచ్చు. రాంభట్ల కృష్ణమూర్తిగారి(జనకథ)ప్రకారం, యాదవులలో పశులకాపరులు పెద్ద యాదవులు, వారికి రాజ్యార్హత ఉంది. భోజకులు అలాంటివారే. కుంతి దత్తత తండ్రి కుంతిభోజుడు భోజకుడు. కనుక అతనికి రాజ్యార్హత ఉంది. యాదవులలో వృష్ణికులు గొర్రెల కాపరులు, కనుక చిన్న యాదవులు. వారికి రాజ్యార్హత లేదు. కృష్ణుడు వృష్ణియాదవుడు. మరి అతను గోవుల కాపరి కాలేదా అనచ్చు. బహుశా అప్పటికి వృష్ణి యాదవుల సామాజిక హోదా ఊర్ధ్వ చలనానికి లోనవుతూ ఉండవచ్చు.

కర్ణుని పుట్టుక విషయానికి మరోసారి వెడితే, పరాశరుని శాపభయానికి మత్స్యగంధి లొంగిపోయినట్టే, సూర్యుని శాపభయానికి కుంతి కూడా లొంగి పోవడం గుర్తించదగిన ఒక పోలిక. అలాగే తెలుగు భారతంలో రెండు ఉదంతాలలోనూ ‘సద్యోగర్భం’లో కొడుకులు(వ్యాసుడు, కర్ణుడు) కలిగినట్టు ఉంది. కానీ కర్ణుడికి సంబంధించి పైన చెప్పిన సంస్కృత పాఠంలో సద్యోగర్భ ప్రస్తావన లేదు. సహజగతిలోనే అతడు కుంతికి పుట్టాడన్న భావన ఈ పాఠం కలిగిస్తోంది. ఇదే పాఠంలో ‘సూర్యుడు తన తేజస్సుతో ఆమెను ఆవహించి మోహపరవశురాలిని చేశా’డనడం కూడా సాధారణ స్త్రీ-పురుష సంబంధాన్నే సూచిస్తూ ఉండచ్చు. ఈ వివరం తెలుగు భారతంలో లేదు.

ఇంకొక తేడా ఏమిటంటే,(పైన చెప్పిన) సంస్కృత పాఠంలో సద్యోగర్భ ప్రస్తావన లేనట్టే, కొడుకును కన్నా నీ కన్యాత్వం చెడదని దూర్వాసుడు కానీ, సూర్యుడు కానీ అన్నట్టు లేదు. ‘సూర్యుని ప్రభావం వల్ల మళ్ళీ నాకు కన్యాత్వం ప్రాప్తించిందనీ, దూర్వాసుడు చెప్పినట్టే జరిగిందనీ’ కుంతే వ్యాసునితో అంటుంది.

ఇక రెండో కథ చూద్దాం.

మాధవి కథ

images

ఉద్యోగపర్వం, తృతీయాశ్వాసంలోని కథ ఇది. పాండవులతో శత్రుత్వం మానుకుని, సంధి చేసుకోమని కృష్ణుడితోపాటే కణ్వుడు, నారదుడు మొదలైన మునులు కూడా దుర్యోధనుడికి బోధిస్తారు. మొండికెత్తితే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసుకో మంటూ నారదుడు గాలవుని గురించి చెబుతాడు.

గాలవుడు విశ్వామిత్రుని శిష్యుడు. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత గురుదక్షిణ ఏమివ్వమంటారని గురువును అడిగాడు. ఏమీ వద్దని గురువు అన్నాడు. అయినా వినకుండా, మీరు అడిగితీరవలసిందే నంటూ నిర్బంధించాడు. విశ్వామిత్రుడు విసిగిపోయాడు. ‘అయితే సరే, మొత్తం శరీరమంతా తెలుపు రంగులో ఉండి, ఒక్క చెవి మాత్రం నీలవర్ణంలో ఉండే ఎనిమిదివందల ఉత్తమ జాతి గుర్రాలను తెచ్చి ఇవ్వు’ అన్నాడు.

గాలవుడు అలాంటి గుర్రాల వేటలో పడ్డాడు. ఎక్కడా దొరకలేదు. దాంతో విచారంలో మునిగిపోయాడు. ఆహారం, నిద్ర కూడా వదిలేసి గుర్రాలను వెతుకుతూ మహాపథం వెంట సాగిపోయాడు. ఒక చోట అతనికి గరుడుడు కనిపించాడు. బాల్యమిత్రుడైన అతనికి గాలవుడు తన ప్రయత్నం గురించి చెప్పాడు. అతని మీద జాలిపడిన గరుడుడు, దేవతల దగ్గర తప్ప అలాంటి గుర్రాలు దొరకవని చెప్పి, అతన్ని తన వీపు మీద ఎక్కించుకుని దేవేంద్రుడు ఉన్నవైపు బయలుదేరాడు. మార్గమధ్యంలో గాలవునికి విపరీతమైన దాహం వేయడంతో అతన్ని ఒక కొండ మీద దింపాడు. ఇక ఇతనితో అంత దూరం వెళ్ళడం మంచిది కాదనుకున్నాడు. అక్కడినుంచి ప్రతిష్టానపురాన్ని పాలించే తన మిత్రుడు యయాతి దగ్గరికి అతన్ని తీసుకెళ్ళాడు. యయాతికి విషయం చెప్పాడు.

తన దగ్గర అలాంటి గుర్రాలు లేవని చెప్పిన యయాతి, అందగత్తె అయిన తన కూతురు మాధవిని గాలవునికి అప్పగించాడు. ఒకవేళ ఏ రాజు దగ్గరైనా అలాంటి గుర్రాలు ఉంటే, ఈమెను అతనికి చూపించు, ఈమె కోసం తప్పకుండా గుర్రాలు ఇస్తాడని చెప్పాడు.

గరుడుడు గాలవుని, మాధవిని తీసుకుని అయోధ్యరాజు దగ్గరకు వెళ్ళాడు. నా దగ్గర రెండువందల గుర్రాలు మాత్రమే ఉన్నాయని అతను చెప్పాడు. అప్పుడు మాధవి,‘నాకో మహాభావుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరప్రభావం వల్ల నేను కొడుకును కన్నాసరే, కన్యగానే ఉండిపోతాను. కనుక నన్ను ఈ రాజుకు ఇచ్చి రెండువందల గుర్రాలూ తీసుకో. ఆమేరకు అతనితో ఒప్పందం చేసుకో’ అని సలహా ఇచ్చింది.

కొడుకులు లేని ఆ రాజు మాధవిని తీసుకుని గుర్రాలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆమెవల్ల వసుమనస్సుడనే కొడుకును పొందిన తర్వాత ఆమెను గాలవునికి తిరిగి ఇచ్చేశాడు. ఇలాగే మిగిలిన గుర్రాలు కూడా సంపాదించుకోమని గాలవునికి చెప్పి గరుడుడు వెళ్లిపోయాడు.

ఆ తర్వాత మాధవిని తీసుకుని గాలవుడు కాశీరాజు దగ్గరికి వెళ్ళాడు. కాశీ రాజు తనవద్ద ఉన్న రెండువందల గుర్రాలు ఇచ్చి మాధవితో ప్రవర్ధనుడనే కొడుకును పొందాడు. ఆ తర్వాత భోజపురాన్ని పాలించే రాజువద్దకు వెళ్ళాడు. అతను కూడా తన దగ్గర రెండువందల గుర్రాలే ఉన్నాయని చెప్పి మాధవిని తీసుకుని గుర్రాలు ఇచ్చాడు. మాధవి వల్ల అతనికి శిబి అనే కొడుకు కలిగాడు.

అప్పుడు గరుడుడు మళ్ళీ వచ్చాడు. ‘అలాంటి గుర్రాలు ఈ ముగ్గురి దగ్గరే ఉన్నాయి, ఇక నువ్వు వెతకడం అనవసరం, ఈ ఆరువందల గుర్రాలను, మాధవిని కూడా తీసుకువెళ్లి నీ గురువుకు ఇవ్వు, ఈమెతో ఆయన కూడా కొడుకును కంటాడు’ అని సలహా ఇచ్చాడు. అతనికి తోడుగా తను కూడా విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళి, జరిగినదంతా చెప్పి, ఇతడు బాలుడు, దయతో ఇతన్ని క్షమించి ధన్యుణ్ణి చేయండని ప్రార్థించాడు.

విశ్వామిత్రుడు సరే నని గుర్రాలను, మాధవిని స్వీకరించాడు. మాధవి వల్ల ఆయనకు అష్టకుడనే కొడుకు పుట్టాడు.

ఆ తర్వాత మాధవి తపస్సుకు వెళ్లిపోయింది.

***

‘నా కోరిక తీరిస్తే నీ కన్యాత్వం చెడ’దని మత్స్యగంధితో పరాశరుడు అన్నాడు. (తెలుగు భారతం ప్రకారం)‘నీకు సద్యోగర్భంలో కొడుకు పుడతాడు, నీ కన్యాత్వం చెడ’దని సూర్యుడు కుంతితో అన్నాడు. ‘ఒక మహానుభావుడు ఇచ్చిన వరప్రభావం వల్ల నేను కొడుకును కన్నా కన్యగానే ఉంటా’నని గాలవునితో మాధవి అంది.

ఇంతకీ అసలు ఈ ‘కన్యాత్వం’ ఏమిటి? నేటి సాధారణ అవగాహనతో చెప్పుకుంటే, కన్య అంటే అవివాహిత. కన్యావస్థలో ఉన్నప్పుడు ఆమె పురుష సంపర్కం పెట్టుకోవడం, సంతానం కనడం తప్పు. అంటే కన్యాత్వం అనేది వివాహం అనే వ్యవస్థతో ముడిపడి ఉందన్న మాట. ఆవిధంగా అది వ్యవస్థ తీసుకొచ్చిన భావనే తప్ప ప్రకృతి సిద్ధంగా వచ్చిన భావన కాదు. ఒక స్త్రీ గర్భం ధరించడానికి ఆమె కన్యా లేక వివాహితా అన్న విచక్షణతో ప్రకృతికి సంబంధం లేదు.

కానీ పైన చెప్పిన మూడు కథలూ ఏం చెబుతున్నాయి? కన్యాత్వం అనేది ఒకటి ప్రకృతి సిద్ధంగా ఉంటుందనీ, కన్య గర్భం ధరిస్తే ఆ కన్యాత్వం పోతుందనీ, కానీ కన్య గర్భం ధరించినా కన్యాత్వం పోకుండా చూడగలిగిన మహిమ కొందరు మహానుభావులకు ఉంటుందనే భావన కలిగిస్తున్నాయి.

కన్యాత్వం అనేది ప్రకృతి నియమం కాదనీ, వ్యవస్థ చేసిన నియమమనీ అనుకుంటే; ఆ వ్యవస్థ చేసిన వారే ఈ కథల్లో ఆ వ్యవస్థ నుంచి పై ముగ్గురినీ మినహాయిస్తున్నారన్న మాట!

కన్యాత్వం గురించి మరిన్ని విశేషాలు చెప్పుకునే ముందు, మత్స్యగంధి-పరాశరుడు; కుంతి-దూర్వాసుడు లేదా సూర్యుల ఉదంతాలలో కన్యాత్వం గురించి సంప్రదాయ పండితుల చర్చ ఎలా సాగిందో చెప్పుకుందాం.

అది వచ్చే వారం…

 

 

 

 

 

 

 

 

Download PDF

2 Comments

  • గాలవుని వృత్తాంతం ద్వారా దుర్యోధనుడికి నారదుడు, మునులు ఏమి చెప్పబోయారు ?

  • కల్లూరి భాస్కరం says:

    అది కథ ప్రారంభంలోనే ఉంది గౌరి లక్ష్మి గారూ…ఏ విషయంలో నైనా మొండిగా వ్యవహరిస్తే గాలవుడిలానే కష్టాలు పడాల్సివస్తుందని దుర్యోధనుడికి చెప్పడం నారదుని ఉద్దేశం.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)