అత్తా-కోడళ్ళ వారసత్వం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ఇంకో కోణం నుంచి చూద్దాం…

ద్రౌపది పాండవులు అయిదుగురినీ పెళ్లి చేసుకోవాలా, వద్దా అనేది నిర్ణయించవలసింది ఎవరు?

స్వయంవరంలో ద్రౌపది వరించిన అర్జునుడా? కాదు. పాండవ జ్యేష్ఠుడు ధర్మరాజా? కాదు. ద్రౌపది తండ్రి ద్రుపదుడా? కాదు. వ్యాసుడా? కానే కాదు…

ఆ నిర్ణయం తీసుకోవలసింది నిజానికి ఇటు కుంతి! అటు ద్రౌపది!

కథకుడు ఏంచేస్తున్నాడంటే, నిజంగా నిర్ణయాధికారం ఉన్న వీరిద్దరినీ పక్కకు తప్పిస్తున్నాడు. మౌనమూర్తులుగా నిలబెడుతున్నాడు. ఏవిధంగానూ నిర్ణయాధికారం లేని పాత్రల చేతికి ఆ అధికారాన్ని అప్పగిస్తున్నాడు. అందుకు సంబంధించిన ధర్మమీమాంసలో వారిని భాగస్వాములను చేస్తున్నాడు. ఈ వివాహానికి వారిచేత ఆమోదముద్ర వేయిస్తున్నాడు. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే, స్త్రీ చేతిలో ఉన్న అధికారాన్ని పురుషుడికి అప్పజెబుతున్నాడు. అనగా, వ్యవస్థనే ఉద్దేశపూర్వకంగానూ, వ్యూహాత్మకంగానూ తలకిందులు చేస్తున్నాడు.

అయితే, ఇంతకుముందు అనేకసార్లు చెప్పుకున్నట్టు వ్యవస్థను తలకిందులు చేయడం అనే ఈ పనిని అతడు రాతితో గోడకట్టినట్టుగా చేయడం లేదు. వదులు వదులుగా చేస్తున్నాడు. తను వ్యవస్థను తలకిందులు చేస్తున్న సంగతి తెలిసిపోయేలా మధ్య మధ్య క్లూలు విడిచిపెడుతూ చేస్తున్నాడు. అది కథానిర్మాణ దక్షత పలచబారడం వల్ల కావచ్చు, లేదా వెనకటి వ్యవస్థ గురించిన అవశేషాలను సూచించడం అనివార్యమయ్యీ కావచ్చు…

అసలు ‘స్వయంవరం’ అనే మాటే చూడండి. ఆ మాటను వాస్తవికార్థంలో తీసుకుంటే ఒక స్త్రీ, పురుషుణ్ణి తనకు తానుగా వరించడం గురించి చెబుతుంది. అంటే, ఎవరిని భర్తగా వరించాలన్నది స్త్రీకి గల సంపూర్ణ స్వయంనిర్ణయాధికారం. ఇందులో ఇతర పురుషులకు ఎలాంటి పాత్రా లేదు. మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్న ఐరిష్ కథలో ఈ స్వయంవర లక్షణం మరింత స్పష్టార్థంలో కనిపిస్తుంది. ఆ కథలో మీవే అనే రాచకూతురు అయిలిల్ అనే రాకుమారుని స్వయంవరంలో తనే వరించింది తప్ప అతడు ఆమెను వరించలేదు. ఆ విషయం మీవే అతనితో స్పష్టంగా అంటుంది కూడా. అంతేకాదు, ఇంకా అనేక విషయాలలో మీవే తన మాతృస్వామిక హక్కును, స్వేచ్ఛను నొక్కి చెబుతుంది.

అయితే, ప్రస్తుత సందర్భంలో కథకుడు ‘స్వయంవరం’ అంటూనే ద్రౌపదిని ఒక మరబొమ్మగా మార్చిన సంగతి తెలిసిపోతూనే ఉంది. ఆమెతో అర్జునుని మెడలో దండవేయించి, ఆ తర్వాత ఆమె పాత్ర ఏమీ లేనట్టు పక్కన పెట్టేశాడు. అలాగే, పాండవులు అయిదుగురినీ పెళ్లాడాలా వద్దా అనే విషయంలో ఆమెకు గల నిర్ణయాధికారాన్ని కాస్తా తీసుకెళ్లి ధర్మరాజు, ద్రుపదుడు, వ్యాసుల చేతుల్లో పెట్టాడు.

ఈరోజున మనకు బాగా అర్థమయ్యే ఒక పోలికతో ఈ పరిస్థితిని చెప్పుకుందాం. నేటి ప్రజాస్వామిక భారత రాజ్యాంగం ఎన్నికలలో దళితుల వంటి బలహీనవర్గాలకు, స్త్రీలకు కొన్ని స్థానాలు రిజర్వు చేసింది. ఒక మహిళ, గ్రామ సర్పంచి కావచ్చు; ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నిక కావచ్చు; మంత్రిగా నియమితురాలు కావచ్చు. అయితే ఈ పదవులూ, నియామకాలు చాలా సందర్భాలలో కేవలం సాంకేతికంగా మారి, వారు ఉత్సవవిగ్రహాలుగా మిగిలిపోతారు. గ్రామంలోని మోతుబరులో, ఇతర సందర్భాలలో భర్తో ఆమెను కీలుబొమ్మగా మార్చి వ్యవహారాలను తామే చక్కబెడుతూ ఉంటారు.

ద్రౌపది విషయంలో కూడా మనకు ఇదే కనిపిస్తుంది. స్వయంవరం అనేది వెనకటి వ్యవస్థకు చెందిన ఒక ప్రక్రియ. ఒక దశలో అది లాంఛనంగా మారిపోయింది. కనుక ఆ లాంఛనాన్ని పాటిస్తూ ద్రౌపదికి స్వయంవర హక్కును, అంటే, తన వివాహం విషయంలో స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చినట్టే ఇవ్వాలి, మళ్ళీ ఆ హక్కును ఆమె నుంచి తీసేసుకుని పురుషుడికి అప్పగించాలి!

ఇక్కడ కథకుడు చేసింది అదే.

కుంతి విషయానికి వద్దాం. తన కొడుకులు అయిదుగురూ ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలా, వద్దా అనే విషయంలో సంపూర్ణ నిర్ణయాధికారం ఆమెదే! అది ఆమె అత్తగారు అంబాలిక(పాండురాజు తల్లి)నుంచి, తన అత్తకు అత్త అయిన సత్యవతి నుంచి సంక్రమించిన మాతృస్వామిక హక్కు. ద్రౌపదికి అత్తగా తనూ, కోడలిగా ద్రౌపదీ కూడబలుక్కుని అమలు చేయవలసిన స్త్రీహక్కు. ఇందులో పాండవులకు, ద్రుపదుడికి, వ్యాసుడికి ఎలాంటి నిర్ణయాధికారమూ లేదు.

mbx_xtra_draupadi_by_nisachar-d56baz1

సత్యవతి తన మాతృస్వామిక హక్కును కోడళ్ళు అయిన అంబిక, అంబాలికాలతో ఎలా అమలు చేయించిందో తెలిసినదే. కొడుకైన విచిత్రవీర్యుడు చనిపోయి, కురువంశం నిర్వంశమయ్యే పరిస్థితిలో ఆమె తన మాతృస్వామిక నిర్ణయాధికారాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. అప్పుడే, తమ్ముడి భార్యలైన అంబిక, అంబాలికలను చేపట్టి వారితో సంతానం కనమని తన సవతి కొడుకు భీష్మునితో చెప్పింది. భీష్ముడు నిరాకరించడంతో పరాశరునివల్ల తనకు కలిగిన వ్యాసుని అందుకు నియోగించింది. ఆ సందర్భంలో,‘కొడుకును ఆదేశించే అధికారం తండ్రికి ఎలా ఉంటుందో తల్లికీ అలాగే ఉంటుం’దని కూడా నొక్కి చెప్పి తన హక్కును స్థాపించుకోడానికి ప్రయత్నించింది.

సత్యవతి…అంబిక, అంబాలిక…కుంతి…ద్రౌపది..! ఇదీ వరుసక్రమం!

ఈ అత్తా-కోడళ్ళ క్రమాన్ని ఒకసారి కళ్ళముందు నిలుపుకుని చూడండి. చూసినప్పుడు వీరి మధ్య మీకు ఎన్నో సారూప్యాలు, సమానధర్మాలు కనిపిస్తాయి. ఒక స్పష్టమైన, తమవైన హక్కులు కలిగిన ఒక అత్తా-కోడళ్ళ వారసత్వక్రమం కనిపిస్తుంది. ఒక అవిచ్ఛిన్న మాతృస్వామిక వారసత్వానికి వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి అర్థమవుతుంది. అయితే అలా అర్థమవడం కథకుని ప్రయోజనాలకు పనికొచ్చేది కాదు. కనుక ఈ వారసత్వ క్రమంవైపు మన చూపు మళ్ళకుండా అతడు యథాశక్తి ప్రయత్నిస్తాడు. వీరిమధ్య పురుషస్వామ్యం తాలూకు విలువలను, పురుషుల పాత్రలను తెచ్చిపెట్టి, చర్చను వాళ్ళ మధ్యనే కేంద్రీకృతం చేసి విషయాన్ని కలగాపులగం చేస్తాడు. గంద్రగోళం సృష్టిస్తాడు. మన కళ్ళముందు గారడీ చేస్తాడు. అయితే, విచిత్రం, అది తగినంత శిక్షణ లోపించిన గారడీగా పరిణమిస్తుంది.

పాండవులు అయిదుగురూ ద్రౌపదిని వివాహమాడే విషయంలో నిర్ణయాధికారం కుంతిదేననీ ఒకవైపు కథకుడు సూచిస్తూనే ఉన్నాడు. భిక్ష తెచ్చామని భీమార్జునులు అనగానే, దానిని అయిదుగురూ ఉపయోగించుకోండని కుంతి ఏమాత్రం తడుముకోకుండా వెంటనే అనేసింది. అంటే అప్పటికప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించేసిందన్నమాట.

ఆ తర్వాత, అంతమంది పురుషులూ కలసి ధర్మనిర్ణయం పేరుతో తలబద్దలు కొట్టుకోవలసిన అవసరమే లేదు. కానీ కథకుడు ఆ విధంగా మాతృస్వామిక అవశేషమైన ఆ నిర్ణయాన్ని కుంతి నోటితో ప్రకటింపజేస్తూనే, ఆ తర్వాత తన పని మొదలుపెడుతున్నాడు. అదేమిటంటే, కుంతి మాటల్లో కనిపిస్తున్న మాతృస్వామ్య అవశేషం మన దృష్టికి రాకుండా చేయడం, ద్రౌపది వివాహాన్ని పురుషస్వామ్యానికి అనుకూలంగా మలచడం! ఆ ప్రయత్నంలో భాగంగానే, భీమార్జునులు ద్రౌపదిని తెచ్చిన సంగతి తెలియక, రోజూలానే ఆహారాన్ని యాచించి తెచ్చారనుకుని పొరబడి కుంతి అలా అన్నట్టు చిత్రిస్తున్నాడు. ఆ చిత్రణ ఇసుకగూడులా ఎలా పరిణమించిందో ఇంతకు ముందు చెప్పుకున్నాం.

కిందటి వ్యాసంలో ఇంకో ముఖ్యమైన వివరం నా చూపుల్ని తప్పించుకుంది. పాండవులు ద్రౌపది స్వయమవరానికి వెడతారనే కాదు, ఆ అయిదుగురూ ద్రౌపదిని పెళ్లాడతారని కూడా కుంతికి తెలుసు. వ్యాసుడు పాండవులకు ఎదురై చెప్పిన ద్రౌపది జన్మవృత్తాంతంలో ఆ సూచన ఉంది, చూడండి.

భీమార్జునులు ద్రౌపది అనే భిక్ష తెచ్చామని అనగానే కుంతి అయిదుగురినీ ఉపయోగించుకోమని అందంటే, ఊరికే అనలేదు. ఈ మాటను కేవలం తల్లి మాటను కొడుకులు గౌరవించాలనే సాధారణార్థంలో తీసుకోకూడదు. వాస్తవంగా ఈ మాట ద్వారా కుంతి కొడుకులను ఆదేశించే తన మాతృస్వామిక అధికారాన్ని చెలాయిస్తోంది. ఇది శాస్త్రనిబంధన లాంటిదే. ఎందుకంటే, పాండవులకు కుంతి తల్లి మాత్రమే కాదు, యజమానురాలు కూడా. తండ్రి కుటుంబానికి ఎలా యజమానో అలా అన్నమాట. తండ్రి మాటను కొడుకులు ఎలా పాటించాలో ఇక్కడ తల్లి మాటను అలాగే పాటించితీరవలసిందే.

ఒక ఉదాహరణ చూడండి…ఏకచక్రపురంలోని తమ ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు ద్రౌపది స్వయంవరం గురించి చెప్పినప్పుడు, ద్రుపదనగరానికి వెళ్లాలన్న నిర్ణయాన్ని పెద్దకొడుకుగా ధర్మరాజు తీసుకోలేదు. కొడుకుల అభిప్రాయాన్ని గమనించి, ద్రుపదనగరానికి వెడదామని కుంతే అంది. అప్పుడు ‘నువ్వు ఆదేశించినట్టే చేద్దా’మని పాండవులు అని తల్లితో కలసి ద్రుపదనగరానికి బయలుదేరారు. భిక్ష తెచ్చామని అనగానే అయిదుగురినీ ఉపయోగించుకోమని అనడం కూడా అలాంటిదే. ఆ తర్వాత ద్రౌపది వివాహంపై ద్రుపద, వ్యాసులతో జరిగిన చర్చలో ‘గురువులలోనే పరమ గురువు అయిన మా తల్లి చెప్పింది కనుక’ ద్రౌపదిని మేము అయిదుగురమూ పెళ్లాడవలసిందే’ నని ధర్మరాజు నొక్కి చెప్పాడు.

కనుక ఆ ఇంటికి యజమాని ధర్మరాజు కాదు, కుంతి! ద్రౌపది వివాహాన్ని ఎంతగా పురుషస్వామ్యానికి నప్పించడానికి ప్రయత్నించినా, కుంతే ఆ కుటుంబానికి యజమానురాలన్న మాతృస్వామిక ధర్మాన్ని కథకుడు దాచలేకపోయాడు. ఇక్కడ తల్లీ-కొడుకుల సంబంధాన్ని సాధారణార్థంలో(తల్లి పెద్దరికం, పూజనీయత వగైరా) తీసుకున్నారంటే పొరబడినట్టే. ఎందుకంటే, ఆ కుటుంబానికి ధర్మరాజు యజమాని కాకపోవడం, కుంతి యజమానురాలు కావడం పైకి కనిపించేటంత ఆషామాషీ విషయం కాదు. అది ఒకవిధంగా శాస్త్రసంబంధమైన నిష్కర్ష!

కుటుంబ సంబంధాలు గీత గీసినట్టు సప్రామాణికంగా ఉండవలసిన ఆనాటి దశ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాటిలో ఆషామాషీని, అమాయకత్వాన్ని ఊహించడమే అసాధ్యం. కుటుంబ యాజమాన్యంపై తల్లీ-కొడుకుల మధ్య పోటీ ముగిసి, యాజమాన్యం కొడుకుకి బదిలీ అయిన పురుషస్వామ్యం తాలూకు నిబంధనలనుంచి చూస్తే ఈ విషయం మనకు బాగా అర్థమవుతుంది. పురుషస్వామ్యాన్ని నొక్కి చెప్పడమే ఒకానొక ముఖ్య లక్ష్యంగా అవతరించిన రామాయణాన్నే తీసుకోండి. యాజమాన్య కోణం నుంచే చూసినప్పుడు, రామాయణ కథ మొత్తానికి ‘పితృవాక్య పరిపాలనే’ కీలకం. అలాగే, తండ్రి తర్వాత పెద్ద కొడుకే యజమాని. రాముడు-ఆయన సోదరుల సంబంధంలో అదే కనిపిస్తుంది.

అంటే ఏమిటన్న మాట? మాతృస్వామిక వ్యవస్థలో యజమానురాలైన కుంతి ఆదేశాన్ని శిరసావహించి పాండవులు అయిదుగురూ ద్రౌపదిని వివాహమాడారు! పితృస్వామిక వ్యవస్థలో యజమాని అయిన తండ్రి దశరథుని ఆదేశాన్ని శిరసావహించి రాముడు అడవికి వెళ్ళాడు! ఈ రెండు ఉదాహరణాలూ వ్యవస్థలు ఎలా తలకిందులయ్యాయో సూత్రప్రాయంగా చెబుతాయి.

ఇంకా కావాలంటే పితృస్వామిక వ్యవస్థలో స్త్రీ స్థానం ఏమిటో సందేహాతీతంగా చెబుతున్న మనుస్మృతిలోని మాటలే చూడండి. మనుస్మృతిలోని పంచమాధ్యాయంలో ‘స్త్రీధర్మములు’ అనే శీర్షిక కింద ఉన్న రెండు శ్లోకాలు ఇలా చెబుతున్నాయి:

బాలయా వా యువత్యా వా వృద్ధయా వాzపి యోషితా

న స్వాతంత్ర్యేణ కర్తవ్యం కించిత్కార్యం గృహేష్వపి

బాల అయినా, యువతి అయినా, వృద్ధ అయినా స్త్రీ యింటిలో స్వతంత్రంగా ఏ కార్యాన్నీ చేయతగదు.

బాల్యే పితుర్వశే తిష్ఠే త్పాణిగ్రాహస్య యౌవనే

పుత్రాణాం భర్తరి ప్రేతే న భజేత్ స్త్రీ స్వతంత్రతామ్

స్త్రీ బాల్యంలో తండ్రి అధీనం లోను, యవ్వనంలో భర్త అధీనంలోను, భర్త మరణించిన తరువాత పుత్రుల అధీనంలోనూ ఉండాలి. కాని ఎప్పుడూ స్వతంత్రంగా ఉండటానికి వీలులేదు.

[మనుధర్మశాస్త్రము (మనుస్మృతి), తెలుగు రచన: కె.వై.ఎల్. నరసింహారావు]    

ఇంకా విశేషమేమిటంటే, స్త్రీ స్వాతంత్ర్యాన్ని కట్టడి చేసి, పురుషస్వామ్యాన్ని స్థాపించే ప్రయత్నం ఒక దశలో ప్రపంచ స్థాయిలో జరిగింది. కనుక మూస పోసినట్టు పురుషస్వామ్యం ప్రపంచంలో ఎక్కడైనా ఒక్కలానే ఉంటుంది. మన మనుస్మృతి లాంటి స్మృతులను ప్రపంచవ్యాప్తంగా అనేక సమాజాలు సృష్టించుకున్నాయి. మగపిల్లవాడికి ఒక వయసు వచ్చాక, అతనిని బాధ్యతాయుతుడైన కుటుంబ యజమానిగా, అంటే పురుషస్వామ్య ప్రతినిధిగా మలిచే ఒకానొక ప్రక్రియను ప్రతి సమాజమూ కల్పించుకుంది. తల్లితో సహా స్త్రీల ప్రభావం నుంచి ఉద్దేశపూర్వకంగా పక్కకు తప్పించడం అందులో భాగం. ఆ ప్రక్రియ అతనికి ‘రెండో జన్మ’ నిస్తుంది. ఆ ప్రక్రియనే మన సంప్రదాయం ఉపనయనం గానూ, ఉపనయన సంస్కారం పొందిన వాడిని ‘ద్విజన్ము’డి గానూ పేర్కొంది. పురాతనసమాజాలు అన్నిటా ఇది అందరికీ అమలు చేసిన ప్రక్రియ అయినా మన వ్యవస్థలో మాత్రం కొన్ని కులాలకే పరిమితమైంది.

ఎలెక్స్ హేలీ ‘రూట్స్’ నవలలో కథానాయకుడైన కుంటా కింటేను ‘పురుషు’డిగా మలచే ప్రక్రియ గురించి సుదీర్ఘంగా రాస్తాడు. అది నాలుగు నెలలపాటు సాగే కష్టసాధ్యమైన ప్రక్రియ. ఓ రోజున అయిదారుగురు వ్యక్తులు పెద్దగా కేకలు పెడుతూ, ఈటెలతో బెదిరిస్తూ ఊరి మీదికి వచ్చి పడతారు. ఒక్కొక్క ఇంట్లోకే చొరబడి, పది పదకొండేళ్ళ కుర్రాళ్లను బయటకు లాగి, వాళ్ళ ముఖాలకు ముసుగులు కప్పి ఒక అజ్ఞాత ప్రదేశానికి తీసుకుపోతారు. వారిలోని భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని, నిబ్బరాన్ని, సమయస్ఫూర్తిని పెంచే అనేక క్లిష్టమైన శారీరక, మానసిక పరీక్షలకు గురిచేస్తారు. ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కోగల విధంగా వారిని తీర్చిదిద్దుతారు. ఆ పరీక్షలలో విఫలమైతే అంతకన్నా సిగ్గుచేటు ఉండదన్న అభిప్రాయాన్ని వారిలో నూరిపోస్తారు. చివరిగా వారికి ‘సుంతీ’ కూడా జరుగుతుంది. ఆ నాలుగు నెలల తర్వాతా వారు సంపూర్ణ ‘పురుషుడు’గా మారి ఇంటికి తిరిగివస్తారు. అక్కడినుంచి వారికి పూర్తిగా కొత్తజీవితం ప్రారంభమవుతుంది. ఇక వారు తల్లిదండ్రుల ఇంట్లో ఉండరు. వారికి ప్రత్యేకంగా తమదైన నివాసం ఏర్పడుతుంది. గ్రామ పెద్దలు వారికి కొద్దిపాటి పొలంతోపాటు, ఊరికి సంబంధించిన కొన్ని బాధ్యతలు అప్పజెబుతారు.

మగపిల్లవాడిని ‘ద్విజన్ము’డిగా మార్చే ఈ ప్రక్రియలో తల్లి ప్రభావాలనుంచి అతణ్ణి దూరం చేయడం, తల్లికీ, తనకూ మధ్య ఎడం పాటింపజేయడం కూడా భాగం. శిక్షణ ముగించుకుని కుంటా కింటే తిరిగి ఊళ్ళోకి అడుగుపెట్టిన ఘట్టాన్ని, తల్లి పట్ల అతని దృక్పథంలో వచ్చిన మార్పును రచయిత ఇలా చిత్రిస్తాడు:

“తెల తెల వార్తూండగా ఊళ్ళో అడుగుపెట్టిన కుర్రవాళ్ళకి జనం నవ్వుతూ, తుళ్లుతూ, నాట్యం చేస్తూ, చప్పట్లు చరుస్తూ స్వాగతమిచ్చారు. ఆడవాళ్ళు ‘ఏయ్! ఓయ్!’ అని పట్టరాని సంతోషంతో పగలబడి నవ్వుతూ కేకలు వేశారు. కుర్రవాళ్లు తెచ్చిపెట్టుకున్న హుందాతనంతో నెమ్మదిగా నడిచారు. మొట్టమొదట వాళ్ళ పెదాల మీంచి చిరునవ్వులు చిందలేదు; నోట్లోంచి మాట ముత్యాలు రాల్లేదు. గంభీరంగా ఉండిపోయారు.

తల్లి తనకేసి ఆపుకోలేని ప్రేమతో పరుగెత్తుకుని వస్తున్నప్పుడు కుంటాకి తను కూడా అట్లాగే ఆమెవైపు ఉరుకెత్తి వాటేసుకోవాలనిపించింది. కానీ నిగ్రహించుకున్నాడు. మొహం మాత్రం సంతోషంతో వెలిగిపోతోంది. బింటా కొడుకు మెడ చుట్టూ చేతులు వేసింది. చెంపల్ని చేతుల్తో తడిమింది. కళ్ళవెంట సంతోషబాష్పాలు కారుతుంటే, “కుంటా, కుంటా” అని నెమ్మదిగా గొణిగింది. కుంటాకి తనిప్పుడు పురుషుణ్ణని స్ఫురణకొచ్చి వెనక్కి తప్పుకున్నాడు. ఆమె వీపుకి వేళ్ళాడే ఉయ్యాలలో ఏడుపు మొదలెట్టిన పసిగుడ్డుని స్పష్టంగా చూసే మిషతో తల్లి నుంచి వెనక్కి తప్పుకున్నట్టు నటించాడు. ఉయ్యాల్లోకి చేతులు దోపి రెండు చేతులతో చిట్టి తమ్ముణ్ణి పైకెత్తుకున్నాడు.

……….

కుంటా తమ్ముణ్ణి ఎత్తుకుని పాకలోకి వస్తుంటే బింటా కొడుకు ప్రక్కనే నడుస్తూ మురిసిపోయింది…ఇరుగుపొరుగు అమ్మలక్కలు బింటాతో “నీ కొడుకు ఎంత కళకళలాడుతున్నాడమ్మా! మగకళ ఎంత కొట్టొచ్చినట్టు కానొస్తోందే!” అంటూ వ్యాఖ్యానాలు చేస్తోంటే కుంటా వినిపించుకోనట్లే నటించాడు. కానీ, ఆ మాటలతని చెవులకు సంగీతంలా వినిపించాయి.

….ఆనందంతో, గర్వంతో ఉప్పొంగిపోతూ బింటాకి మాటలు కరువయ్యాయి. అమ్మకోసం తను ఎంత తపించిపోయాడో, యింటికి తిరిగివస్తే ఎంత ఆనందంగా ఉందో ఆమెకు చెప్పాలనుకుంటూ ఉవ్విళ్లూరాడు. కానీ నోరు పెగల్లేదు. అమ్మతో సహా యే స్త్రీతోగానీ అటువంటి ముచ్చట్లాడ్డం పురుషలక్షణం కాదని అతనికి తెలుసు.

………

కుంటా ఆ రోజే కొత్త పాకలోకి మారాడు. బింటా కొడుక్కి కావలసిన సమస్త సామగ్రీ అమర్చిపెట్టింది. ఆఖరికి ప్రార్థన చేసుకోటానికి అవసరమైన పట్టా కూడా సమకూర్చిపెట్టింది. తల్లి “నీకిది అవసరమవుతుందిరా, అదవసరమవుతుందిరా” అంటూ రకరకాల పనిముట్లు సామాన్లు చేరుస్తుంటే కుంటా అసంతృప్తిగా గుర్రుమన్నాడు. అదొద్దు, ఇదొద్దు అంటానికి కారణాలు దొరక్క తల గోక్కున్నాడు.

“తలలో పేలు పడ్డట్టున్నై. కుక్కుతా, రారా” అంటూ బింటా ముందుకొచ్చింది.

“వొద్దు” అన్నాడు కుంటా అసహనంగా. బింటా కోపంగా నసుగుతూ వెళ్లిపోయింది.”

                                                                         [ఏడు తరాలు (ROOTS), తెలుగు: సహవాసి]

***

స్త్రీ-పురుష సంబంధాల గురించి, స్త్రీ ‘శీలం’ గురించి మనకిప్పుడు పట్టువిడుపులు లేని, మతవిశ్వాసంతో పోల్చదగిన నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలకు పునాదులు వేసి, కాలగమనంలో వాటిని పటిష్టం చేసుకుంటూ వెళ్లింది మన పూర్వీకులే. అయితే, స్త్రీ-పురుష సంబంధాలు, స్త్రీ శీలం విషయంలో మన అనుభవాలూ, ఆలోచనలకీ; పూర్వీకుల అనుభవాలూ, ఆలోచనలకీ ఒక విచిత్రమైన తేడా ఉంది. వీటి విషయంలో పూర్వీకులు మనకంటే విశాలమైన, వైవిధ్యవంతమైన పరిస్థితితో తలపడ్డారు. మన దగ్గరికి వచ్చేసరికి అది ఇరుకుగానూ, వైవిధ్యరహితంగానూ మారిపోయింది. ఒక్క చిన్న పోలికతో చెప్పుకుంటే, మన పూర్వీకులు ఒక పెద్ద తానును కత్తిరించే పనిలో పడ్డారు. మన దగ్గరకు వచ్చేసరికి అది ఒక చొక్కా గుడ్డ అయింది…

మరికొంత వచ్చేవారం…

 -కల్లూరి భాస్కరం

 

 

 

 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)