మీడియా మాటున భేడియాలు

sangisetti- bharath bhushan photo
    తెలంగాణ ప్రజాప్రతినిధుల, వాళ్లను ఎన్నుకున్న ప్రజల గుండెల్ని కోసి కారంబెట్టి ఇప్పుడు ఉఫ్‌ ఉఫ్‌ అంటూ మంటల్ని సల్లార్పెతందుకు పక్షపాత మీడియా ‘సారీ’ చెబుతోంది. (ఉఫ్‌ ఉఫ్‌ అని ఊదుకుంటనే మంటను ఎక్కువ జేస్తుండ్రనే ప్రచారం కూడా ఉంది) హేయమైన తమ చర్యలను సమర్ధించుకోవడం కోసం వందిమాగధులైన జర్నలిస్టు, రాజకీయ నాయకుల మద్ధతు తీసుకుంటుండ్రు. ఫాసిస్టు చర్య, అప్రజాస్వామికం అంటూ తప్పుంటే చట్టప్రకారం చర్య తీసుకోండి అని నీతులు చెబుతున్నారు.

అయితే వాళ్లు తమ అప్రజస్వామికతను, వివక్షను, దురహంకారపు దాడిని తమ  అవసరానుగుణంగా మరిచి పోతున్నరు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే ప్రసారాలను ఆపేస్తారా? ‘ప్రజాస్వామ్య తెలంగాణ ఇదేనా?’ అంటూ ‘అక్షరాన్ని ఆయుధం’గా మార్చి కేసీఆర్‌పైకి, నవజాత శిశువు తెలంగాణపై సంధించిండ్రు. ‘మెరుగైన సమాజం’ నిర్మించే వాళ్లు ఇప్పుడు తమ తెలంగాణ ఉద్యోగుల్ని రాయబేరాలకు పంపుతున్నరు. మీడియా మాటున భేడియాలుగా (తోడేళ్ళు) ప్రవర్తిస్తుండ్రు. మీడియా ముసుగేసుకొని ఏం చేసినా, ఎట్ల చేసిన చెల్లుతుంది అనుకునే వారికి ఎమ్మెస్‌వోలు షాక్‌ ఇచ్చిండ్రు. నిజానికి ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష కూడా!
టీవి9, ఎబిఎన్‌ల ప్రసారాలు ఆపింది ఎమ్మెస్‌వోలు. కానీ ‘కొత్తపలుకు’ ఆయన మాత్రం ఎమ్మెస్‌వోలకు ఆదేశం ఇచ్చిందెవరు? ఎవరి వ్యక్తిగత విద్వేషం ఇందుకు దారి తీసింది? ఆంధ్రజ్యోతి సంస్థలపై విషం చిమ్మిన కేసీఆర్‌! అని చులుకన పలుకులు చెబుతుండు. బట్టగాల్శి మీదేసుడంటే గిదే! వ్యక్తిత్వ హననం అంటే ఇదే! రైతుల రుణమాఫీపై గందరగోళాన్ని సృష్టించి వారిని ఆత్మహత్యలకు పురిగొల్పడమే గాకుండా ‘ఏపీ నుంచా ఏసెయ్‌ పన్ను’ అని హెడ్డింగ్‌లు పెడ్తిరి. ‘మా అక్షరం మీ ఆయుధం’ అంటివి. కానీ ఈ ఆయుధాలన్నీ తెలంగాణ బిడ్డలపైనే ఎందుకు  ప్రయోగించబడుతున్నవో అర్థంగాదు. గాలి వార్తలు అచ్చేసి గాయి గాయి చేస్తూ ఇది అసమర్ధ ప్రభుత్వం అని ముద్రవేయాలని ప్రయత్నించిండ్రు.

ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని గగ్గోలు పెట్టే ఈ మీడియా నిండు అసెంబ్లీలో కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఏంజేసుకుంటరో చేస్కోండి అన్నప్పుడు అది అప్రజాస్వామికమని అనిపించలేదు. పత్రిక పేరే ‘‘ఆంధ్ర’జ్యోతి’. తెలంగాణకు చీకటి, ఆంధ్రకు వెలుగులు పంచే ఈ పత్రిక ‘మీడియా స్వేచ్ఛ’ పేరిట తాము ఏది చెప్పినా, రాసినా ఇన్నేండ్ల మాదిరిగానే ‘తెలంగాణ రాష్ట్రం’లో కూడా చెల్లాలని మొండిగా వాదిస్తోంది. తమ ఆధిపత్యాన్ని తెలంగాణలో అప్రతిహతంగా కొనసాగించడమే గాకుండా తమ సామాజిక వర్గం వారి నేతృత్వంలో సీమాంధ్రలో ఏర్పడే ప్రభుత్వాన్ని హీరోగా నిలబెట్టడం దీని ఉద్దేశ్యం. తెలంగాణతో పోల్చి ‘ఆంధ్ర ప్రభుత్వమే బేషుగ్గా పనిచేస్తోంది’ అనే ఒక అభిప్రాయాన్ని కూడగట్టడానికి ‘స్టోరీ’లు రాసింది. దీంతో పత్రిక ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరిని అప్రతిష్టపాల్జేసేందుకు పనిజేస్తుందో తెలంగాణ ప్రజలు తెలుసుకున్నరు. అందుకే ‘వి రిపోర్ట్‌ యూ డిసైడ్‌’ అని మీరు చెప్పినట్లుగానే నిర్ణయం తీసుకుండ్రు. ఇప్పుడు ఎమ్మెస్‌వోలకు ప్రజలు బాసటగా నిలిచిండ్రు. ఒక సామాజిక వర్గం ఆధిపత్యాన్ని కూలగొట్టేందుకు సిద్ధమయ్యిండ్రు.
‘కులం అడ్డు గోడలు కూలగొట్టండి’ అని బాకాలూదే ఈ మీడియాకూ కులముంది. ప్రాంతము కూడా ఉంది. వీటన్నింటికి అతీతంగా, నిష్పక్షపాతంగా భిన్న ప్రజాభిప్రాయాల వేదికగా నిలువాల్సిన మీడియా ఇవ్వాళ ‘కమ్మోళ్ల’ ప్రయోజనాలు కాపాడే, పెంపొందించే వాహికగా మారింది. డెల్టాంధ్ర పెట్టుబడిదారుల కొమ్ముగాసే తాబేదారుగా రూపాంతరం చెందింది. అలా కానట్లయితే ‘నేను తెలంగాణలో పుట్టిన’ ‘నన్ను ఆంధ్రోడు’ అని అంటుండ్రు అంటూ వాపోయే వేమూరి రాధాకృష్ణ ఇక్కడి ప్రజల పక్షాన ఎన్నడైనా నిలబడ్డారా? ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలె. నల్లగొండ ఫ్లోరైడ్‌ బాధితులకోసం వీళ్లు ఏ నిధులు సేకరించలేదు. కనీసం తాను పుట్టాను అని చెప్పుకుంటున్న నిజామాబాద్‌ నుంచి గల్ఫ్‌కు వలసెల్లిన వారి కోసంగానీ, అక్కడి బీడీ కార్మికుల కోసం గానీ ఏ నిధిని, ట్రస్ట్‌ని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న బిడ్డల కుటుంబాలను ఆదుకుందామనే ఆలోచన కూడా ఆయనకు రాలేదు. ఇదీ ఆయన ప్రాంతీయ నిబద్ధత. అయితే ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని కోసం నిధులు సేకరించడానికి నడుం కట్టాడు. లైవ్‌షోలు పెట్టిండు. దీని వెనుక పూర్తిగా కులం, ప్రాంతము తప్ప మరేమి లేదు. రాజధాని అనే కన్నా దీన్ని ‘క్యాపిటల్‌’ అనడమే సబబు. కేవలం పెట్టుబడిదారులకు అండగా నిలబడేందుకే ఈ ‘రాజధాని విరాళాలు’. రాజధాని కృష్ణా`గుంటూరు మధ్యలో గాకుండా రెడ్ల ప్రాబల్యం ఉండే ప్రకాశం జిల్లాలో వస్తదంటే ఈ విరాళాల ప్రచారం చేపట్టేవారే కాదు. ఈ ‘క్యాపిటల్‌’ పెట్టుబడిదారులు అంతా కమ్మ సామాజిక వర్గం వారే కావడం యాధృచ్ఛికం గాదు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లో కలిపి, ఎంత లిబరల్‌గా లెక్కేసినా ‘కమ్మోళ్ల’ జనాభా ఐదు శాతం మించదు. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వీరి జనాభా దాదాపు 20శాతం ఉంటది. అంతేగాదు ఆ రెండు జిల్లాల్లోని సాగునీటి వసతి ఉన్న సారవంతమైన వ్యవసాయ భూముల్లో 80శాతం ‘కమ్మోళ్ల’ చేతుల్లోనే ఉన్నయి. వీరి ప్రయోజనం కోసమే ‘క్యాపిటల్‌’ నిర్మాణానికి ఈయన ముగ్గు పోస్తుండు. ఇంకా చెప్పాలంటే వీరికి రాయలసీమ, ఉత్తరాంధ్ర రెండూ పరాయి ప్రాంతాలే!
మీడియాకు ముఖ్యంగా తెలుగు మీడియాకు కులముంది. మీడియాలో దృశ్యం, శ్రవణం, అక్షరం మూడూ వస్తాయి. సినిమాల్లో 95శాతం కమ్మసామాజిక వర్గమే రాజ్యమేలుతోంది. నిర్మాణం గానీ, థియేటర్లు గానీ, హీరోలు, డైరెక్టర్లు అంతా వాళ్లే. ఇక తెలుగులో దాదాపు ఒక వంద ఛానళ్ళు పనిజేస్తే అందులో 90 ఛానళ్ళ యాజమాన్యం కమ్మసామాజిక వర్గం వారిదే! న్యూస్‌ ఛానళ్లలో ఇదే పరిస్థితి. ఎఫ్‌ఎం రేడియోల పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. పత్రికలు కూడా దాదాపు అన్నీ వారివే! అందుకే వారు ఆడిరది ఆటగా పాడిరది పాటగా ఇన్నాళ్లు చలామణి అయింది. అహంకారానికి, అధికారం తోడు కావడంతో కనీస మీడియా విలువలు కూడా పాటించకుండా తమకు ఎదురులేదని విర్రవీగిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో దానికి గండి పడిరది. తెలంగాణపై వీరి దాడి ఇవ్వాళ కొత్తగా షురువయ్యింది కాదు. ఎనుకటి నుంచి ఇదే తంతు. ఇక్కడ కొంత చరిత్ర చెప్పుకోవాలె!
తెలంగాణలో మొట్టమొదటి ప్రాంతేతర పత్రిక ‘తెలుగుదేశం’. హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం 1949లో సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి (1914-2010) ఈ పత్రికను ప్రారంభించారు. బాపట్లకు చెందిన ఈమె ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికయింది. కమ్మసామాజిక వర్గం వారు తెలంగాణ పత్రికారంగంలో అలా అడుగు పెట్టిండ్రు. ఆ తరువాత రాజ్యలక్ష్మితో కలిసి వల్లూరి బసవరాజు తదితరులు ఆంధ్రజనత దిన పత్రికను 1955 ఆ ప్రాంతంలో ప్రారంభించారు. దీంతో ఆంధ్రప్రాంతం నుంచి జర్నలిస్టుల రాక ముమ్మరమైంది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ అనంతరం ఆ ప్రభుత్వం పక్షపాత, కక్షపూరిత వైఖరి మూలంగా ‘గోలకొండ’ పత్రిక 1966లో మూతపడిరది. నలభై యేండ్లు తెలంగాణ సమాజానికి ఎనలేని సేవ చేసిన గోలకొండ పత్రికకు అడ్వర్టయిజ్‌మెంట్లు ఇవ్వడంలోనూ, న్యూస్‌ప్రింట్‌ కేటాయింపులోనూ అన్యాయం జరిగింది. అలాగే 1938లో స్థాపించబడ్డ ‘దక్కన్‌ క్రానికల్‌’ పత్రికను 1976లో ‘తిక్కవరపు’ కుటుంబం కొనుగోలు చేసింది.

ఈ కుటుంబం వారు దాదాపు అదే కాలంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కాంట్రాక్టర్లుగా వుండ్రిండ్రు. దక్కన్‌ క్రానికల్‌ని తిక్కవరపు చంద్రశేఖరరెడ్డి కొనుగోలు చేసిన సమయంలోనే ఈనాడు పత్రికను రామోజీరావు విశాఖపట్నంలో ప్రారంభించారు. అది తర్వాతి కాలంలో హైదరాబాద్‌ ఎడిషన్‌ కూడా ప్రారంభించింది. అయితే కొద్ది కాలంలోనే యాజమాన్యం వైఖరికి నిరసనగా తెలంగాణ జర్నలిస్టులు పాశం యాదగిరి, రత్నమాల లాంటి వారు ఉద్యమాన్ని లేవదీసిండ్రు. ఉద్వాసనకు గురయ్యిండ్రు. తెలుగుదేశం పార్టీ అవతరణ సమయంలో ‘ఈనాడు’ దాని కరపత్రంగా పనిచేసింది. ఇదే సమయంలో దాసరి నారాయణరావు తెచ్చిన ‘ఉదయం’ పత్రిక మొదట్లో కొత్త వెలుగులు ప్రసరించినా అది కూడా నెల్లూరు రెడ్ల వశమయ్యింది. సినిమా ఇండస్ట్రీ చెన్నయ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తే, అప్పటి వరకు విజయవాడ నుంచి ప్రచురితమైన పత్రికలు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి తమ కేంద్రాన్ని హైదరాబాద్‌కు మార్చుకుంది. ఈ రెండు మాధ్యమాలు తెలుగుదేశం పార్టీ అండతో తెలంగాణపై విషం గక్కాయి.

కారంచేడు లాంటి సంఘటనలను నిజాయితిగా, నిష్పక్షపాతంగా రిపోర్టు చేసే ధైర్యాన్ని కూడా ఈ పత్రికలు ప్రదర్శించలేక పోయాయి. అంతేగాదు వీటి ఎత్తుగడలకు, కుచ్చితాలకు 85యేండ్లు నిరంతరాయంగా నడిచిన ‘ఆంధ్రపత్రిక’ కూడా మూత పడిరది. తెలంగాణకు చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ ‘సత్య’ న్యూస్‌ ఛానల్‌ పెట్టడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఆదిలోనే చిదిమేసిండ్రు. అలాగే నూకారపు సూర్యప్రకాశరావు ‘సూర్య’ పత్రిక తెచ్చే సమయంలో ఆయనపై ఈ మీడియా ఎంత దాడి చేసిందో కూడా అందరికి తెలుసు. తాము చేస్తే ప్రజాసేవ, వేరేవాళ్లు అదే పని చేస్తే ద్రోహం అన్న విధంగా ప్రచారం చేసిండ్రు. తప్పు ఎవరు చేసినా తప్పే అనే సోయి మాత్రం వీరికి లేదు. ఏమి చేసినా ఎట్లా చేసినా తమ సామాజిక వర్గమే చేయాలనే నిశ్చితాభిప్రాయంతో ఉన్న ఈ మీడియా వర్గం తమ స్వప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారు. అలా దిగజారుడుకు పరాకాష్ఠ ‘మడిశి పెట్టుకోవడం’, ‘తొక్కు పచ్చడి’ ‘తాగుబోతోళ్లు, ‘శిలుం మొకం’ మాటలు.
తమని తీరొక్క తీరుగా తిట్టినా మళ్ళీ అదే మీడియాకు ప్రజాస్వామ్యం ముసుగేసి కొంతమంది బానిసలు బాసటగా నిలుస్తుండ్రు. మీడియా స్వేచ్ఛ ముసుగులో వాళ్లు ఎన్ని యవ్వారాలు చేసినా అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తెలంగాణ సంస్కృతి, చరిత్రను ‘మాకరీ’  చేస్తూ అంగట్ల సరుకులాగా అమ్మాలని చూస్తున్నా వీళ్ళు ఇంకా నిజం తెలుసుకోలేక పోతుండ్రు. బహుశా తెలిసినా తమ బానిస భావజాలాన్ని వదిలించుకోలేక పోతుండ్రు కావొచ్చు. గతంలో ఆంధ్రజ్యోతి అహంభావానికి వ్యతిరేకంగా పత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే గాకుండా ధర్నాకు దిగిన వారు సైతం ఇవ్వాళ తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఎమ్మెస్‌వోలను దుమ్మెత్తి పోస్తుండ్రు. ఊసరవెల్లుల మాదిరిగా రంగులు మార్చే రాజకీయ నాయకులు ఈ పనిచేస్తే అది సహజమే అని సర్దిచెప్పుకోవచ్చు. కానీ జర్నలిస్టు సంఘాల నాయకులు సైతం అప్రజాస్వామికం, ఫాసిస్టు చర్య అంటూ గొంతులు చించుకుంటుండ్రు. మీడియా విలువల వలువలూడదీసే వారికి వీరు జేజేలు పలుకుతుండ్రు.
ఈ గొంతులు చించుకునే వాళ్లు ఒక్క విషయం అర్థం చేసుకోవాలె! వాళ్లకు తెలంగాణ అనేది ఒక అంగడి సరుకు కావచ్చు. కాని నాలుగు కోట్ల మంది ప్రజలకు అది ఒక ఆత్మగౌరవ నినాదం. స్వయంపాలన ఆకాంక్ష. తెలంగాణ చరిత్రను, సంస్క ృతిని, వారసత్వాన్ని, ఔన్నత్యాన్ని పజీత పజీత చేస్తూ ఇజ్జత్‌ పుచ్చుకుంటుంటే ఇదేమని ఈ పదిహేనేండ్లల్ల ఎన్నడూ ఏ జర్నలిస్టు నాయకుడూ తప్పుపట్టలేదు. అంతెందుకు మొన్నటి సంఘటనను కూడా వాళ్లు బహిరంగంగా ఖండిరచలేదు. ‘టీ న్యూస్‌’ ఛానల్‌ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రసారం కాదు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేగాదు మిగతా తెలంగాణ యాజమాన్య ఛానళ్ళని ఆంధ్రలో ఎన్నడో బ్యాన్‌ చేసిండ్రు. అయినా ఈ విషయాల గురించి జర్నలిస్టు సంఘాల నాయకులు ఎన్నడూ స్పందించలేదు. నమస్తే తెలంగాణ ప్రతుల్ని విజయవాడ నడిబొడ్డున తగలబెడ్తుంటే ‘కోనాయి’ అన్నోడు లేడు. చంద్రబాబు ఒంటికంటి సిద్ధాంతానికి వీరి వైఖరికి పెద్దగా తేడా లేదు. మీడియా స్వేచ్ఛ ముసుగులో రెండు రాష్ట్రాల్లో తామే నాయకులుగా చలామణి కావాలనే యావ తప్ప వీరికి తెలంగాణ ఆత్మగౌరవం ప్రధానం కాదు.
ఇప్పటికే ఈటీవి`2, ఈటీవి తెలుగులో 49 శాతం వాటాను, మిగతా ఈటీవి చానళ్ళనన్నింటిని 2600ల కోట్లకు కొనుగోలు చేసిన రిలయన్స్‌ సంస్థ ఇప్పుడు సిఎన్‌ఎన్‌`ఐబిఎన్‌తో సహా అనేక ఛానళ్ళను సొంతం జేసుకుంది. పెట్టుబడిదారుల కింద పనిచేయడానికి నిరాకరించి రాజ్‌దీప్‌ సర్దేశాయి, ఆయన భార్య సాగరికా ఘోష్‌ సంస్థ నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఎంత చెడ్డా ఉత్తరాదిలో మీడియా విలువలను కొంతమేరకైనా పాటిస్తుంటే మన తెలుగువాళ్లు జర్నలిస్టు నాయకులతో సహా అందరూ యాజమాన్యాలకు గులామ్‌లుగా మారి ‘మీడియా స్వేచ్ఛ’ ముసుగులో తెలంగాణ తల్లి బొండిగె పిసికేందుకు సిద్ధమయిండ్రు.
మీడియా స్వేచ్ఛపట్ల వారికొక్కరికే పట్టింపు ఉన్నట్లుగా జర్నలిస్టులు, ఔట్‌డేటేడ్‌ రాజకీయ నాయకులు స్వీయ ప్రచారం కోసం ప్రకటనలు ఇస్తుండ్రు. ప్రజాస్వామ్యంలో ‘ఫోర్త్‌ ఎస్టేట్‌’కు గౌరవం, స్వేచ్ఛ రెండూ దక్కాల్సిందే! అయితే తప్పు చేసిన వారికి శిక్ష లేనట్లయితే తామే రాజ్యాంగ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. చట్టం తమ సుట్టంగా సూస్తరు. ఇప్పటికీ మించి పోయింది లేదు. ఇప్పుడు జర్నలిస్టు సంఘాల నాయకులు రోడ్డు మీదికొచ్చి నెత్తినోరు కొట్టుకోకుండా అటు ఎమ్మెస్‌వోలను, ఇటు ఛానళ్ళ యాజమాన్యాలను కూర్చుండబెట్టి ‘అంబుడ్స్‌మన్‌’ని మధ్యవర్తిగా పెట్టుకొని సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.

భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అనే భరోసాను ఎమ్మెస్‌వోలకు తద్వారా తెలంగాణ ప్రజలకు కల్పించినట్లయితే సమస్య ముమ్మాటికీ పరిష్కారమయ్యే అవకాశముంది. ఇందుకు తప్పుచేసిన వాళ్లు బేషరతుగా ముందుగా క్షమాపణ చెబుతూ, అవి పునరావృతం కావు అని లిఖిత పూర్వకంగా తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి. పంతాలకు, పట్టింపులకు పోయి కేంద్రం నుంచి వత్తిడి తెప్పిద్దాం అనుకుంటే ఏకు మేకై అసలుకే ఎసరొచ్చే ప్రమాదముందని గుర్తించాలి.

                                  -సంగిశెట్టి శ్రీనివాస్‌
Download PDF

5 Comments

  • buchireddy gangula says:

    శ్రీనివాస్ గారు
    చాల వివరంగా — గొప్పగా రా శారు — సాల్యుట్స్
    ఎన్ని సారీ లు చెప్పినా — మల్లి అవే కూతలు —అదే ధో రిని —-
    అవే వేషాలు —??? మార్పు ఉంటుదన్న — నమ్మకం — నా వరకు జీరో —
    కాని — అవకాశం యిచ్చి —యిలాగే కొనసాగితే — బాన్ చేయడం అవసరం —
    రాధకిశేన్ గారికి పది తలలు — పది నాలుకలు —-??మాటల్లో ట్విస్ట్ చేస్తూ —
    కించ పరిచేలా — ప్రశ్నలు అడుగుతూ —-సీమంధ్ర నేతల కు అడుగులకు మడుగులు
    వత్తుతూ —-
    యిక టీవీ 9—-రిపోర్టర్ గారికి ఫుల్ సూట్ అవసరమా —కర్త కర్మ క్రియ లేని
    వాక్యాల తో ప్రశ్నలు అడుగుతూ —తెలంగాణా నేతల ను కించ పరిచేలా —- లేని పోనీ
    సబ్జక్ట్స్ ను తిసుక వస్తూ ——
    టి వి 9– లో కులం ఉంది — పక్షపాతం ఉంది — బలుపు ఉంది
    మార్పు లేకపోతే — తిరుగ బడక తప్పదు —-అ రోజు రాక పోదు —
    ————————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

    • Srinivasa chary says:

      అన్న బాగా చెప్పారు వీళ్ళకు ఇంకా బుద్ది రావడంలేదు పేపరు కూడ బంజేస్తే బాగుంటది

  • శ్రీనివాస్ గారు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు కనపడుతుంది. ఎందుకో ఈ సందర్భంలో నాకు కొ.కు. గారి “ దిబ్బ పుట్టుక ” కథ గుర్తుకొస్తుంది. క్షమించాలి.

  • ఎర్ర బస్ says:

    సింగినాదం… జీలకర్ర !!

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)