చేరాగారి చివరి పాఠమేమిటి..?

10534397_326754877475156_564669077665495274_n

10534397_326754877475156_564669077665495274_n

భుజాన నల్ల సంచీ, దాన్నిండా కిక్కిరిసిన పుస్తకాలు, గాలికి కదిలే తెల్లజుట్టూ ఆహార్యాలుగా వున్నాగానీ ,దాదాపు ఆరడుగుల వెలుతురు రూపం మన చేరా మాస్టారు. ఎప్పుడూ  పరధ్యానంగా , ఏదో ఆలోచిస్తూ వుంటారు. మొదటిసారి మాట్లాడుతున్నవాళ్ళకయినా సరే ఆయన ఖచ్చితంగా ప్రొఫెసరే అయివుంటాడనిపిస్తుంది తప్ప రియల్ ఎస్టేట్ దారుడో, ఎల్.ఐ.సి ఉద్యోగో మాత్రం కానేకాదు అనిపిస్తుంది. మాట్లాడ్డం మొదలుపెడితే మాత్రం ఆ ఆప్యాయత ఉరవడిలో ఆయన హోదా ఏమిటో గుర్తురాదు. అంత బాగా జన సామాన్యంతో కలిసిపోయే వ్యక్తిత్వం చాలా తక్కువ మందికే వుంటుంది. ఒక ప్రక్రియలోనే తల పండి అలసిపోయామనుకున్నవారికి మాస్టారి బహుముఖ ప్రజ్ణా, నిరాడంబర వ్యక్తిత్వం నిదానంగా మాత్రమే అర్ధమవుతాయి.

చేరా గురించి నాకున్నన్ని జ్నాపకాలు మా నాన్నతో కూడా వున్నాయో లేదో.

దాదాపు పాతికేళ్ళ క్రితం రంజని ఆఫీసు వాళ్ళు కవి సమ్మేళనం పెట్టి నప్పుడు చదివిన లేబర్ రూమ్ కవిత విని మాస్టారు చాలా మెచ్చుకున్నారు. అప్పటికి అదే కవిత అశ్లీలంగా వున్న కారణంగా ఆంద్ర జ్యోతి వారి చెత్తబుట్టకు చేరువలో వుంది. కాబట్టీ ఆ ప్రోత్సాహం నాకు తెరిపిగా అనిపించింది. చేరా అ0టే చేరాతల రచయిత అని మాత్రమే తెలిసిన నాకు, భాషాశాస్త్రంలో ఆయనకి వున్న ప్రతిభా, వ్యాకరణ , వాక్య నిర్మాణ విన్యాసం, కృషి తెలుసుకున్నాక గర్వంగా అనిపించింది. అప్పటికి నేను రాసిన సందిగ్ధ సంధ్య సంకలనాన్ని సమీక్ష కోసం మాస్టారు ఇచ్చిన చిరునామా కి చాలా భయపడుతూ పంపించాను.  అందులో కొన్ని మాత్రమే బావున్నాయని, కొన్ని అనవసర వాక్యల పొడిగింపు వల్ల నిస్సారంగా వున్నాయని చెబుతూ ఒక ఉత్తరం రాశారు.. సాహిత్య రచనకి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహమూ , వాతావరణము లేని నాకు అది మొదటి పాఠం. రాసినదాన్ని గట్టిగా చదివి చూసుకునే అలవాటు రేడియో కాంపీరింగు వల్ల చాతనయితే , ఎన్నిసార్లు అయినా తిరిగి రాసుకోవడం, సొంత అక్షరాల పట్ల వీలయినంత నిర్మమకారంగా వుండటం మాస్టారి వల్ల సాధ్యమయింది. .

ఎన్ని ఉత్తరాలు రాసుకునేవాళ్లమో , ఒక్కొక్కటి ఒక్కో ఆత్మీయ , సాహిత్య, సామాజిక అక్షర శిల్పం. ఆగాకర కాయ కూర దగ్గరనుంచీ అన్నమయ్యదాకా ఏ విషయం మీదయినా ఆయనదొక భిన్నమైన అభిరుచి ప్రకటన. రె౦డు రెళ్ళు నాలుగు అనేది సంఖ్యా శాస్త్రం . అయిదు, ఆరు,, ఏడు   కూడా ఎందుకు అవుతాయో నిరూపీంచడం భాషా శాస్త్రం. ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఇన్ని భాషల, నుడికారాల మధ్యా ఇదే సరి అయినది అని చెప్పడం పిడి వాదం అనేవారాయన. మాస్టారులో వున్న సరళీకృత విధానానికి, నూతన ఆవిష్కరణల పట్ల అనుకూలతకు అదొక గుర్తు.

. మాస్టారులో వున్న నిబ్బరానికి హాస్య ప్రియత్వానికి చాలా ఉదాహరణలున్నాయి. వాక్యంలో బడు ప్రయోగం చర్చ జరుగుతున్న రోజుల్లో ఒకసారి ఖమ్మం నించి ఇటు తిరువూరు వచ్చారు. టిఫినూ కాఫీ అయ్యాక స్నానం చెయ్యడానికి సూట్కేసు తెరిస్తే అందులో పెద్దవాళ్ళు కట్టుకునే జారీ నేత చీరలూ , పగడాల గౌలుసులూ లాంటివి కనబడ్డాయి. ఆయనతో బాటు మేం కూడా  తెల్లబోయా౦. విషయం ఏమిటంటే బస్సులో సూట్కేసు తారుమారయింది. ఏ బస్సులో వచ్చారో ఆ ఆ నంబరు గుర్తులేదు. కనకదుర్గా ట్రావెల్ సర్వీసెస్ అని మాత్రం చెప్పగలిగారు. ఎంత చిన్న వూరు అయినాకానీ భద్రాచలం, మళ్ళీ అక్కడ్నించీ హైద్రాబాదు వెళ్ళి వచ్చిన ఆ బస్సులో ఎవరితోనో దిగిపోయిన సూట్కేసు పట్టుకోవడానికి మూద్రోజులు పట్టి౦ది.. అది దొరికేవరకూ మేం పడ్డ హడావిడి , ఆందోళన అన్నీ మాకే వదిలి తను మాత్ర౦ ఇంట్లో వున్న ఒక రెడీమేడ్ టీషర్ట్, లుంగీ కట్టుకుని, అక్కడి గెస్ట్ హౌసులో కూచుని హాయిగా పేపర్   రాసుకున్నారు. పైగా,

“ ఎందుకంత కంగారు పడతారు. నా పెట్టెలో పుస్తకాలు తప్ప ఖరీదయినవేవీ వుండవు. అవి ఎవరు పట్టుకుపోయి చదువుకున్నా సంతోషమే, నేనెలాగూ అన్నీ పారేసుకూంటాను కాబట్టి మా ఆవిడ ఎలాగూ పాత దుప్పట్లు తువ్వాళ్ళు పెడ్తుంది, ఏమీ పారేసుకోకుండా ఇంటికేడితే మళ్ళీ ఆవన్నీ ఇ౦ట్లో సర్ధడ౦ ఆవిడకే చిరాకు, “ అన్నారు గట్టిగా నవ్వుతూ.

ఒకసారి బెంగుళూరులో జరిగిన ప్రపంచ మహాసభల్లో కవిత్వం చదవడానికి నేనూ, యాకూబ్, అఫ్సరు, శిఖామణీ, దేవీ ప్రియ ఇంకా కొ౦దరు కలిసి వెడుతుంటే రైల్లో ముత్యాల సరాలు పాఠం చెప్పారు. ఆ రాత్రి కదిలే రైల్లో మాస్టారు మంద్రస్వరంతో చెప్పిన ముత్యాలు కిటికీలో పొంచి చూస్తున్న చందమామ ఎత్తుకుపోకుండా కాపలా కాయడం కష్టమయింది. అదే ఛందస్సులో మేమంతా ఎవరికివారం మనసులోనే కవిత్వం మాల అల్లుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. వీళ్ళంతా నా శిష్యులు అనుకోవడంలో మాస్టారికెంతో సంతృప్తి వుండేది.

స్త్రీలకొక వాదం కూడానా అని అహంకరిస్తున్న కాలంలో స్త్రీవాద కవిత్వాన్ని అర్ధం చేసుకునే సూక్ష్మదర్శని అందరికీ ఇచ్చింది రామారావు గారే. నిజానికి అంతక్రితం ఎన్నోఏళ్లనుంచీ ఎన్ని వాద వివాదాల గురించి పరిచయం చేసినా స్త్రీవాద పక్షపాతి గానే మాస్టారు అందరి హర్షానికీ , కొ౦దరి ద్వేషానికీ కారణయ్యారు.  నీలి కవితలు, వార కవితలు, వళ్ళు బలిసిన మధ్య తరగతి ఆడవాళ్ళ రచనలు అని దూషించిన వారికి రచయిత్రులెంత బాగా జవాబు చెప్పారో, విమర్శకులుగా మాస్టారూ అంత బాగా మాకు మద్దత్తు ఇచ్చారు.

చేరాగారు ప్రధానంగా పద్య ప్రేమికులు అయినా వచనాన్ని బాగా ప్రచారం చేశారు. కాబట్టి కవిత్వంలో వచనం వున్నా, వచనంలో కవిత్వం వున్నా అస్సలు సహించలేరు. దేనికది ప్రత్యేక వ్యక్తీకరణ వున్న సాహితీ ప్రక్రియ అని గట్టిగా నమ్మేవారు. నేను పత్రికలకోసం రాసిన రిపోర్టుల్లో కవిత్వ ఛాయలు అండర్ లైన్ చేసి అలా రాయద్దని, ఇలాగైతే ఇక నీకు మంచి వచనం పట్టుబడదని హెచ్చరించేవారు.

నడిచే గాయాలు పుస్తకానికి ఆర్ధిక బాధ్యత తప్ప ముద్రణా, అచ్చుతప్పులు దిద్దడం, కవర్ పేజీ వేయీంచడం అన్నీ చేరాగారే స్వయంగా చూశారు. గోడలు అనే కవిత పత్రికలో వచ్చిన రూపంలో కాక ఇంకాస్త బాగా ఎడిట్ చేసి నేను పంపేలోగా పుస్తకం అచ్చయిపోయింది. అప్పుడు నా నిరుత్సాహం చూళ్ళేక రెండవ వర్షన్ కూడా చివరి పేజీలో వేయించారు. ఎంత చిన్న మనిషినయినా పెద్దగానే పట్టీంచుకోవడం మాస్టారికలవాటు.

చేరా ఉస్మానియా యూనివర్సిటీ డీన్ గా వున్నప్పుడు ఒకసారి నే వెళ్ళేసరికి ఏవో ఆఫీసు లెటర్స్ టైపు చేస్తున్నారు.

“ అదేమిటి మాస్టారూ మీరు చేస్తున్నారేమిటి ఈ పని. మీదగ్గర టైపిస్తులు ఎవరూ వుండరా ?”అని అడిగాను.

“ఎందుకుండరు, వుంటారు. కానీ మూడింటికల్లా పంపించివేస్తాను. ఇక్కడి నుంచి మా టైపిస్టు వాళ్ళీల్లు చాలా దూరంట. ఆ అమ్మాయికేవో కుటుంబ సమస్యలున్నట్టున్నాయి.. చెప్పాలనుకుంటే తానే చెబుతుంది. నేను అడగడమెందుకు. అయినా నా పని నేను చేసుకోవడమే హాయి” అన్నారు. దటీజ్ చేరా. ఎదుటివారి వ్యక్తిగతానికి, వ్యక్తిత్వానికి అ౦త చోటు ఇచ్చే బాస్ లు నేను పనిచేసిన చోట ఎక్కడా దొరకలేదు.

ఎవరింటికయినా వెడితే ఆ ఒక్క మనిషితోనే మాట్లాడి వచ్చేసే దురలవాటు నాకు వుండేది. మిగిలినవాళ్లని పట్టీంచుకునేదాన్ని కాదు. అది స్థాయికి సంబంధించిన దూరాన్ని తెలియజేస్తుందని , అలా వుండకూడదని మాస్టారు మాయింట్లో వాళ్ళతో కలిసిపోయిన తీరుని చూసి నేర్చుకున్నాను.

చేరాకి మనుషులు కావాలి. అది ద్వారకా హోటలు అయినా, సుప్రభాతమ్ ఆఫీసు అయినా మా ఇల్లు అయినా , ఇంకోటి ఇంకోటి అయినా ఆటో చేసుకుని వచ్చేస్తారు. మనుషుల్ని౦చి దూరం చేసే ఏ హోదా ఆయన పాటీంచేవారు కాదు.

చేరాలాంటి మహాసముద్రాన్ని గురించి నాలాంటి చిన్న మనీషి ఎన్ని దోసిళ్లతో తవ్వి తలపోసుకున్నా తక్కువే అవుతుంది.

కానీ గత రెండేళ్ల నుంచీ ఎందుకోగానీ మాస్టారు సరిగా పలకడంలేదు. ఏ సభలో కలిసినా ముక్తసరిగానే వున్నారు. ఎవరితో పంచుకున్నా ఇదే అనుభవం చెబుతున్నారు. ఎడ్నార్ధం క్రితం నా పుస్తక ఆవిష్కరణకి మాట్లాడారు. తర్వాత మళ్ళీ మొన్న కృష్ణక్క పుస్తక సభలో చూశాను. రోజూ త్యాగరాయ సభకి వెడుతున్నారని తెలిసి అక్కడికి వేడితే అప్పుడే ఇంటికి వెళ్ళారు అన్నారు. ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళినా వుండరని తెలుసుకుని తమాయించుకోవాలి.

మామూలుగా నేను ఎలిజీలు రాయను.. రాయలేను. ఎందుక౦టే మొదటగా జరిగిన సంఘటన జీర్ణించుకుని, మళ్ళీ తేరుకుని, ఆ జ్నాపకాల్నిఆ౦టే బహుశా నిట్టూర్పుల్ని క్రమబద్ధీకరించుకుంటూ రాయాలి.. ఇందుకు సమయం పడుతుంది. కాబట్టి వెంటనే ఆ పని చేయలేకపోతాను. అయితే గత కొన్నాళ్ళుగా చేరా మానసికంగా పాటించిన ఒక మౌనమే మనందరికీ ఒక తాత్త్విక వాతావరణం ఏర్పడేలా చేసింది. బహుశా ఇది కూడా ఒక పాఠమే. చేరా మాస్టారు చెప్పిన చివరి పాఠం. ఈ పాఠం పట్టుబడటం కష్టంగా వుంది చేరాగారూ.

-కొండేపూడి నిర్మల

శనివారం, 26.7.2014

(చిత్రం: రాజు)

Download PDF

2 Comments

  • కానీ గత రెండేళ్ల నుంచీ ఎందుకోగానీ మాస్టారు సరిగా పలకడంలేదు. ఏ సభలో కలిసినా ముక్తసరిగానే వున్నారు. ఎవరితో పంచుకున్నా ఇదే అనుభవం చెబుతున్నారు.
    ఒక మౌనమే నవ్వుతూ…అనుకుంటాను.an

  • bathula vv apparao says:

    జ్నాపకాల్ని=జ్ఞాపకాల్ని

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)