తాత కన్ను మూసి రెండు నెల్లవుతున్నా, బాధ నుండి తేరుకోలేక పోతున్నాను.
పిన్ని, బాబాయి, రాములు బేషరుతుగా నన్ను ఆదరించారు. ఎవ్వరూ నా మీద కోపతాపాలు చూపించలేదు. చంద్రం పిన్ని, బాబాయి నా విషయాలన్నింటా సాయం చేస్తున్నారు. రోజుకోసారన్న కొట్టాంకి వచ్చి నా బాగోగులు చూస్తుంటుంది పిన్ని.
నాకు తోడుగా నాకోసం కొట్టాంలోనే ఉంటున్న రాములు కళ్ళల్లో, చేష్టల్లో నాకు కాస్త ఓదార్పు దొరికింది. నా పట్ల అదే మునపటి చనువుతో ప్రేమగా మసులుతుంది ఆమె.
**
‘పాలెం వచ్చిన కాడినుండి, నా మనస్తాపాల్లోనే సమయం గడిచింది. ఏనాడూ రాములు మంచిచెడ్డలు కనుక్కోలేదు’ అనిపించింది.
తాత ఆఖరి శ్వాసవరకు అన్ని విషయాల్లో – తాతకి తోడుగా ఉంది రాములే నని చెప్పింది పిన్ని. ఇప్పుడు గుళ్ళో కూడా ఎన్నో పనులు చక్కబెడుతూ, అజమాయిషీ చేసేది కూడా రాములేనట.
నిద్రబోయే ముందు, కొట్టాం తలుపు వేసొస్తున్న రాముల్ని పిలిచి పక్కన కూచోమన్నాను.
కృతజ్ఞతా భావంతో నా కళ్ళు చమర్చాయి. ఆమె రెండు చేతులు నా చేతుల్లోకి తీసుకున్నాను.
‘తాతకి నీవు దగ్గిరుండి సేవ చేసినందుకే కాదు, ఇప్పుడు నాకు తోడుగా ఉంటున్నందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని సైగలతో తెలియజెప్పాను రాములుకి.
“పిచ్చిపిల్లా, నువ్వింకా చిన్నదానివే గాయత్రీ. పెద్ద మాటలు ఎందుకులేరా?
అయినా అట్టాగంటే, మరి సత్యమన్న నాకు చేసిన మేలుకి నేనేమనాలి? ఎన్నో తడవలు నన్నాదుకున్నాడు. ఆ రుణమే నేను తీర్చుకుంటున్నా అనుకో,” అంది రాములు.
‘ఇంతకీ నీ జీవనం ఎలా సాగింది? కోవెల్లో మళ్ళీ కొలువు ఎప్పటినుండి చేస్తున్నావు?’ అడిగాను రాములుని.
ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది రాములు.
“ఏమనాలిరా గాయత్రీ, అంతా నా తల రాత. నా మామకి ఆరోగ్యం బాగోక నేను అప్పట్లో ఊరెళ్ళిన ఇషయం నీక్కూడా తెలుసుగా.
రెండున్నరేళ్ళకి పైగానే దగ్గరుండి పసిపిల్లాడికిమల్లే సేవ చేసినా, మామని కాపాడుకోలేక పోయాను. రోగం ముదిరి నా చేతుల్లోనే చనిపోయాడు మామ.
ఆ బాధ ఓ ఎత్తైతే, భరణం ఇవ్వలేదన్న కోపంతో వాడిని నేనే చంపానని నింద మోపి పోలీసు కేసు పెట్టింది నా సవితి,” ఓ క్షణం మౌనంగా ఉండిపోయింది.
“సత్యమయ్య, పూజారయ్య తంటాలు పడి వకీలు సాయంతో నా సమస్యని ఓ కొలిక్కి తెచ్చారు. ఈడ కొలువులో పెట్టారు. నాకు డబ్బు సాయం కూడా చేసి నిలబెట్టారనుకో,” అని వివరించింది.
రాములు కూడా తన జీవితంలో ఎంతగానో నష్టపోయిందని, ఆమె మాటల్లోనే తెలిసింది.
విని బాధపడ్డాను.
కాని మనిషి మాటతీరులో, నడవడిలో, వేషభాషల్లో మార్పు తెలుస్తుంది. మునుపు లేని పెద్దరికం వచ్చేసింది….
**
పొలం కౌలుకిప్పించాడు రాంబాబాయి. తాత పింఛను రాడం మొదలైంది. కొట్టాంలో చాలా మటుకు అన్ని పనులు నేనే చేసుకుంటున్నా, మనిషి సాయం ఉండాలంటూ రాగిణి అనే ఆయాని పనిలో పెట్టింది పిన్ని.
నా మటుకు నాకు ఏదైనా చదువో, కొలువో ఉండాలనిపిస్తుంది.
ఉమమ్మని, పూజారయ్యని జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళని చూడాలని ఉన్నా, నా అంతట నేను వెళ్ళడానికి ఎందుకో ధైర్యం చాలడం లేదు.
‘ఉమమ్మ నన్ను రమ్మని పిలిస్తే బాగుణ్ణు’ అనుకున్నాను మనస్సులో. కబురంపినా చాలు, ధైర్యం వస్తుంది. నా పావురాళ్ళని చూడాలనుంది.
‘నా చదువు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది’ అనుకున్నాను.
**
కోవెల నుండి తెచ్చిన ప్రసాదాలు కంచంలో పెట్టి నా పక్కనొచ్చి కూచుంది రాములు.
కోవెల ఊసులు చెప్పసాగింది…..
ఇంతలో, “గాయత్రీ,” అంటూ కొట్టాం తలుపు తీసుకొని పిన్ని లోనికొచ్చింది.
ఆమె కూచోడానికి తన పక్కనే పీట వేసి, తెచ్చిన ప్రసాదం కాస్త పిన్నికి కూడా పెట్టింది రాములు.
ప్రసాదం తింటూ, “నీకోసమే వచ్చా రాములు. పొద్దున్న నీ స్నేహితురాళ్ళు కలిశారు. వాళ్ళు చెప్పిన పెళ్లి సంబంధం సంగతి ఆలోచించావా? అడిగింది పిన్ని.
“అతన్ని, నేనూ చూసాను. అన్ని విధాల మంచి సంబంధం అంటున్నారు.
నువ్వు కలుస్తానంటే మనింటికైనా వస్తాన్నాడంట పెళ్ళికొడుకు. కలిసి మాట్లాడు. నచ్చితే పెళ్లి చేసుకుని హాయిగా బతికేయచ్చు కదా. మరి ఏమంటావ్?” అడిగింది పిన్ని రాముల్ని.
“చూద్దాములే చంద్రమ్మా, నాక్కాస్త సమయం కావాలి,” అంది రాములు తలొంచుకుని.
“దేనికి సమయం? మరీ ఆలస్యం చేయకు. త్వరగా ఆలోచన కానీయ్. నీకు నెల రోజులు సమయం ఇస్తున్నాం,” నవ్వింది పిన్ని.
వాళ్ళ మధ్య స్నేహభావం మెండుగా ఉందని అర్ధమయ్యి బాగనిపించింది. ఎంత కాలంగానో ఒకరికొకరు తెలిసినా, ఈ మధ్య తాత అనారోగ్య విషయంగానే వీళ్ళిద్దరూ దగ్గరయ్యారనిపించింది.
సుబ్బీ, మాణిక్యం, చంద్రం పిన్ని కూడా రాములు పెళ్ళి ప్రయత్నాల్లో ఉన్నారని అర్ధమయ్యింది.
‘అయితే, రాములు పునర్వివాహం కూడా మంచి పరిణామమే’ అనిపించింది…..
**
రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి.
వెంట తెచ్చిన పుస్తకాలు దులిపి తిరగేస్తున్నాను.
గోవిందు అప్పట్లో నాకు తెచ్చిచ్చిన తెలుగు నవల చదువుతూ, వాకిట్లో కూచున్నాను.
సాయంత్రం ఎనిమిదింటికి ఇల్లు చేరుతూనే నాకు కమ్మని కబురందించింది రాములు.
పూజారయ్య, ఉమమ్మ నా గురించి అడిగారని. నన్ను వచ్చి కలవమన్నారని చెప్పింది.
తాత పోయిన ఆరు నెలలకి, నేను ఎదురు చూసిన ఆ పిలుపు ఆఖరికి రానే వచ్చింది.
అంటే సరిగ్గా నేను తిరిగి తాత గూడు చేరిన ఆరు నెలలకి నన్ను కోవెలకి రమ్మన్నారు పూజారయ్య, ఉమమ్మ. చాల సంతోషమైంది.
“మన కోవెల ఎంతలా అభివృద్ధి పొందిందో చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. నువ్వు వచ్చినప్పుడు చుస్తావుగా! రేపే బయలుదేరు. మనం పొద్దున్నే వెళితే నీ వెంటే ఉండడానికి నాకు సమయముంటుంది,” అంది రాములు ఉషారుగా…
పరితప్త హృదయంతో, తల్లివొడి చేరబోయే బిడ్డలా ‘శ్రీ గాయత్రీ కోవెల’ లో అడుగు పెట్టబోతున్న ఆనందంతో నిద్రే పట్టలేదు ఆ రాత్రి…
**
మరునాడు పెందరాళే, చిన్నప్పటిలా తలార స్నానం చేసి, తడి జుట్టు ముడేసి కోవెలకి తయారయ్యాను.
తాత పటానికి దణ్ణం పెట్టుకున్నాను.
చంద్రం పిన్నికి చెప్పి రాములుతో బయలుదేరాను.
**
మేము వెళ్ళేప్పటికి, అమ్మవారి అభిషేకం ముగించుకొని గుడి మెట్ల మీద కూచునున్నారు పూజారయ్య, ఉమమ్మ. దగ్గరగా వెళ్ళి పూజారయ్య పాదాలంటి నమస్కరించాను. వారికాడ నా దుఃఖం ఆగలేదు. ఉమమ్మ నన్ను దగ్గరికి తీసుకుని సముదాయించింది.
“బాధపడకమ్మా గాయత్రీ, మీ తాత ఆపరేషనదీ అయిన కొంత కాలానికి కోలుకొని బాగానే ఉన్నాడు. రోజంతా గుళ్ళోనే గడిపేవాడు. వద్దని వారించినా ఎంతో పని చేసేవాడు. నీ గురించే ఆలోచించి, ఆవేదన చెందేవాడు. వాడి మనస్సుని కాస్త వేదాంతం వైపుగా మళ్ళించాలని ప్రయత్నించాను,” అని పూజారయ్య ఓదార్పుగా మాట్లాడారు.
నా భుజం మీద చేయి వేసింది ఉమమ్మ. “ఏయ్ గాయత్రి, బాధపడకు.
నువ్వు మాకు ఎప్పటికీ మా చిన్న గాయత్రివే. మూడేళ్లలో ఎంతో జీవితాన్ని చూశావు. కాస్త ఎదిగావు. ‘చక్కనమ్మ చిక్కినా’ అన్న సామెతగా కొండపల్లి బొమ్మలా ఉన్నావు,” అంది ప్రేమగా.
ఆమె ఆప్యాయతకి నా కళ్ళల్లో నీళ్ళు నిండాయి.
“ఇక్కడ నీ కోసం అదే స్థానం, అదే అరుగు, అదే కొలువు అలాగే ఉన్నాయి. కోవెల్లో అన్ని సదుపాయాలు ఇంకా మెరుగయ్యాయి. కాకపోతే అప్పట్లో ఇక్కడ నువ్వు చేసింది స్వచ్చంద సేవే.
ఇకముందు కోవెల సిబ్బందితో పాటుగా జీతం పుచ్చుకునే ఓ కార్మికురాలువి,” అంటూ నన్నాట పట్టించింది ఉమమ్మ.
నా మనస్సు కృతజ్ఞతతో నిండిపోయింది.
“అసలు మన కోవెల ఎంతగా మారిందో అంతటా తిరిగి చూడు,” అంది ఆమె మళ్ళీ..
“రేపు మంచి రోజే, పదింటి వరకు శుభఘడియలున్నాయి. పొద్దున్నే మన కోవెల పుస్తకాలయానికి పనికి వచ్చేయమ్మా, గాయత్రి,” అన్నారు పూజారయ్య.
“కోవెలకి కలిసొచ్చిన కొత్త భూములు, తోటల నుండి మొదలెట్టి చుట్టూ చూపిస్తాను ఉమమ్మా,” అని నా చేయందుకుంది రాములు.
**
అమ్మవారి కోవెల్లో నుండి ఆవరణలోకి అడుగు పెట్టిన నాకు రాములు అన్నట్టుగానే ఎన్నో మార్పులు – చేర్పులు తోచాయి.
రావి చెట్టు కింద పూజసామాను, పుస్తకాల అమ్మకాలకి చక్కగా అలమారాలు అమర్చారు. అరుగుని మరింత విస్తరించి…విశాలమైన అరుగు ఎత్తుమీద, రావిచెట్టు చుట్టూరా ఓ అద్దాల స్టాల్లా తయారు చేసారు. ఇప్పుడు దాన్ని ‘శ్రీ గాయత్రి పుస్తకాలయం’ అంటారు. లోపల కూడా దీపాలతో వెలిగిపోతుంది.
పొద్దున్న తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటలవరకు వస్తువుల అమ్మకాలు జరుగుతాయి. రాములు అజమాయిషీలోనే ఉంది అక్కడి వ్యవహారం. ఓ పెద్దాయన మాత్రం పుస్తకాలయం అమ్మకాలు, లెక్కల విషయాల్లో సాయంగా ఉన్నాడు. పొద్దున్నే స్టాల్, గుడి ఆఫీస్ తలుపులు తెరిచి, ఆఫీసు పని, మళ్ళీ రాత్రి క్లోజింగ్ వరకు ఆయనే చేస్తాడట..
అరుగులకి పక్కగా పావురాళ్ళకి ప్రత్యేకంగా స్థలం కేటాయించి చుట్టూ జల్లి అమర్చారు. అందులో ఓ పక్కగా గింజలకి, నీళ్ళకి కూడా ఏర్పాటు చేశారు.
ఎప్పటిలా రెండు సార్లు వచ్చి గింజలు తిని, కాసేపు తచ్చట్లాడి దూసుకొని పోతాయట పావురాళ్ళు. కోవెల్లోకి వాటి రాక, వాటి ఉనికే ఆలయానికి గొప్ప మేలు చేసిందని జనం అంటున్నారంట.
తోటలో ఇప్పుడు మరెన్నో రకరకాల పువ్వులు పూయిస్తున్నారు. పూల దిగుబడి కూడా రెట్టింపయ్యిందంట. పూల విషయంలో సాయం చేయడానికి రమణమ్మ ఉందంట. దండలు అందంగా కడుతుందంట.
గుడిలోని దేవుని మూర్తులకి ఇవ్వంగా మిగిలిన వాటిని కర్వేపాకు, కొబ్బరిచెక్కలతో పాటు కోవెల బడ్డీలో, అమ్మకాలకి పెడుతుందంట….
నాయుడన్న కూడా కనపడ్డాడు. ఎంతో ఆప్యాయంగా నా కాడికి వచ్చి పలకరించాడు. యోగక్షేమాలు అడిగి కనుక్కున్నాడు.
పంతులుగారికి పని సాయం చేసే కృష్ణ కనబడ్డాడు. కాస్త పెద్దవాడయ్యాడు. ఇప్పుడు పదవ తరగతి చదువుతూ, పంతులుగారి కాడ పౌరోహిత్యం చేస్తున్నాడంట.
**
పోతే, కోవెల పరిధిలోకి ఓ ముఖ్యమైన చేరిక ‘సమాజ సంక్షేమ సేవ’ అని అర్ధమయ్యింది. అందుకోసం ఆవరణలో ప్రభత్వం వారి సహకారంతో ‘స్త్రీ సంక్షేమ సంస్థ’కి గాను ఓ కట్టడం, దానికి ఆనుకొని మరో చిన్న ‘ఫలహార శాల’ నిర్మించబడ్డాయి. సంస్థ హాల్లో కనీసం వంద మంది జనం పడతారు. గుడికి సంబంధం లేకుండా దాని ద్వారం రోడ్డు వైపుకే ఉంది.
ఉమమ్మ ఆధ్వర్యంలో జరిగే ఆ సంస్థ కార్యక్రమాల బాధ్యతలు రాములు, కృష్ణ కూడా పంచుకుంటారంట.
ఏడాదికి రెండు సార్లు అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, బీదవారికి ఉచిత వైద్యచికిత్స చేస్తుందట ఆ సంస్థ.
**
అంతటా తిరిగి చూసాక, మేము అరుగుల మీద పుస్తకాలయం కాడ కూచున్నాము.
“ఇక నీ పావురాలని చూసి, పంతులుగారిని కలిస్తే పనయినట్టే. రేపటినుంచి ఎలాగూ ఇక్కడే ఉంటావుగా,” అని రాములు అంటుండగానే, బారులు తీరిన పావురాలు దూసుకొచ్చి మమ్మల్ని దాటుకొని వెళ్లాయి. మేము వాటిని అనుసరించాము.
తిన్నగా వాటికని కేటాయించిన స్థలంలో కాసేపు విహరించి, గింజలు తినేసి, వాటినే గమనిస్తున్న మా మీదగా ఆకాశంలోకి ఎగిసిపోయాయి.
నా చిన్నతనంలో ఆ పావురాల రాకపోకలు నాకెంత ఆనందాన్నిచ్చేవో గుర్తొచ్చింది.
నాకు పక్కగా వచ్చి నా భుజం మీద తట్టింది రాములు.
“నా ప్రకారంగా నువ్వూ ఓ పావురానివే గాయత్రీ. అమాయకురాలివి. ఏదో బాధతో గూడు వీడినా, నీ తాత ఆశీర్వాదం, దేవుని దయ వల్ల ఓ శాంతి పావురంలా తిరిగి నీ గూడు చేరడం నాకు సంతోషంగా ఉందిరా,” అంటూ కళ్ళు తుడుచుకొంది, రాములు.
నిజమే అన్నట్టు తలూపాను.
**
“ఏమ్మా గాయత్రి,” అన్న పంతులుగారి పిలుపుకి ఇద్దరం వెను తిరిగాము. “పూజ ముగించి, నువ్వు వచ్చావని తెలిసి ఇటుగా వచ్చాను. ఏమంటున్నాయి నీ పావురాలు? అడిగాడాయన నవ్వుతూ.
చేతులు జోడించి నమస్కరించాను.
“బాగున్నావా తల్లీ?” అని అడిగాడాయన ఆప్యాయంగా.
“ఇప్పటికీ తాత పోయిన దుఃఖంలో ఉన్నావు. మనస్సుని కుదుట పరుచుకో తల్లీ. అంతా దైవేచ్ఛ,” , “నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి,” అన్నాడు పంతులుగారు.
తాత మాట వింటూనే నా కళ్ళల్లో నీళ్ళు నిండడం గమనించి, మాట మార్చాడాయన. మాతో పాటు పుస్తకాలయం దిశగా నడిచాడు.
“నీవు ఇక్కడ కొలువు చేయబోతావని విన్నాను. చాలా సంతోషం గాయత్రి,” అన్నాడాయన. “చూశావా? ఉమమ్మ అదృష్టరేఖే మన కోవెల వృద్ధికి ఎలా కారణమయిందో. ఆమె ఎంచుకున్న చదువులు, సరోజినీ గారి చేయూత, వారి ప్రోత్సాహం అన్నీ కలిసొచ్చాయనుకో.
ప్రభుత్వ దేవాదాయ పరిషత్తు వారు, అభివృద్ధికి మన కోవెలని కూడా ఎన్నుకోబట్టి, ఇదంతా సాధ్యమయింది. లేదంటే, మన కోవెల్లో ఇంత మందికి ఉపాధి కల్పించగలగడం మాటలు కాదుగా! ఇదంతా మనందరి పూర్వజన్మ సుకృతం తల్లీ,” అన్నాడాయన.
నిజమేగా!, ఔనని తలూపాను.
ఆయన కాడ సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాను.
**
పనిలో జేరడానికి పోద్దున్నే కోవెలకి బయలుదేరాను.
‘శ్రీ గాయత్రి పుస్తకాలయం’ లో అడుగుపెట్టగానే ‘నాలుగేళ్ల తరువాత మళ్ళీ ఈ కోవెల్లో నేను’ అని అనుకుంటూ తాతని తలుచుకున్నాను.
తాత ఆత్మకి శాంతి కలిగించే కార్యాలు చేసి, ఆయన ఋణం తీర్చుకోవాలని ఆలోచిస్తూ, కొత్తగా వచ్చిన పూజావస్తువుల డబ్బా విప్పి సర్దడం మొదలెట్టాను.
కాస్త దూరంలోనే వెనుక నుండి ఉమమ్మ మాట వినబడింది. వెను తిరిగి చూసాను. పాలనురుగు లాంటి తెల్లని జరీ అంచు చీర కట్టుకొని ఓ అప్సరలా ఉంది ఉమమ్మ.
కాసేపటికి నా ఎదురుగా వచ్చి, చేతిలోని మల్లెచెండు నాకందిస్తూ, “గాయత్రీ, ఆరువారాల్లోనే నీ ఎనిమిదో తరగతి పరీక్షలు. శ్రద్ధగా చదవాలి మరి,” అని గుర్తు చేసింది.
“ఈ పరీక్షలు పాస్ అయిపోతే, సమయం తీసుకొని పదో తరగతి పబ్లిక్ పరీక్షలకి సిద్ధమవ్వచ్చు,” అంటూ నేను సర్దుతున్న పూజా పుస్తకాల నుండి రెండింటిని చేతిలోకి తీసుకుని బయటకి నడిచింది…
సమయానికి ఉమమ్మ నాకు చదువు విషయం గుర్తు చేసింది. ‘తాతకి నేను చదువుకోడం చాలా ముఖ్యం అని చటక్కున తోచింది. అదే చేస్తా.’ తాత కోసం ఏమి చేయాలా అని అనుకుంటున్న నాకు నా నిర్ణయం సంతోషమనిపించింది.
ఉమమ్మ వెళ్ళిన దిశగా చూస్తే, చేతిలోని పుస్తకం తిరగేస్తూ రాములుతో మాట్లాడుతుంది ఆమె.
నా వంక చూసి, రమ్మని పిలిచింది.
అప్పుడే వచ్చిన గుమస్తా గారికి చెప్పి, రద్దీ ఏమీ లేకపోవడంతో, వెళ్ళి వాళ్ళకి కొద్ది దూరంలో కూచున్నాను.
ఉమమ్మని “పెళ్ళి పనులన్నీ అవుతున్నాయా?” అని సైగలతో అడిగాను.
“ఈ సైగలు కొద్దికాలానికి మాటల్లోకి మారుతాయేమోలే గాయత్రి. ఆ ప్రయత్నంగానే వైద్యుల్ని సంప్రదిస్తున్నానని చెప్పడానికే పిలిచాను. జరపవలసిన వైద్య పరీక్షలన్నీ త్వరలో చేయించుదాము. నీ అవిటితనం పోయి, నీ నోటివెంట వచ్చే మాట వినాలని మీ తాత ఎంత అల్లాడిపోయాడో కదా! అసలు సత్యమయ్య కోసమే ఈ విషయంగా నా గట్టి ప్రయత్నమనుకో, ” అంటూ క్షణం సేపు మౌనంగా ఉండిపోయింది ఉమమ్మ.
“ఓహ్, మర్చిపోయాను,” అంటూ తన పర్సు నుండి వెండి కాలి పట్టాలు తీసి, రిపైర్ చేసిమ్మంటూ రాములుకందించి, నా వంక చూసిందామె.
”నా పెళ్ళి పనుల గురించి అడిగావా? అన్నీ బాగానే జరుగుతున్నాయి. మన గుడిలోనేగా పెళ్ళి. అన్ని పనులు నాన్నగారు, మల్లిక్ చూస్తున్నారులే,” అంటూ నవ్వేసింది ఉమమ్మ.
మా మాటలు వింటున్న రాములు గబుక్కున అందుకుంది.
“అయినా అంతా ఉమమ్మ కనుసైగల్లోనే నడుస్తారు. ఆమె ఆడింది ఆట, పాడింది పాటరా గయిత్రీ. మల్లిక్ బాబు మొన్ననే అమెరికా నుండి తిరిగొచ్చాడు.
అంత దూరాన ఉండగానే మన ఉమమ్మంటే నిండా ప్రేమలో పడిపోయాడు. అక్కడినుంచే అన్నీ కుదేర్చేసుకొని ముహూర్తాలు కూడా పెట్టించేశాడనుకో,” అంది నవ్వుతూ రాములు.
ఉమమ్మ ముఖం సిగ్గులతో నిండిపోయింది.
“సరేలే, అతిగా నీ కబుర్లు,” అంటూ కసిరిందామె.
ఇంతలో, మా పావురాలు అందంగా దూసుకొచ్చాయి. పూజాసామాగ్రి కోసం భక్తులు రావడంతో, నేను అటుగా నడిస్తే, దానా డబ్బాతో రాములు, ఉమమ్మ పావురాలని అనుసరించారు…
**
పుస్తకాలయం సర్దుతూ దూరాన్నించే రాములు, ఉమమ్మల్ని గమనించాను కాసేపు.
ఉమమ్మ, తాననుకున్నది సాధించుకొంది. హైదరాబాదుకి కూడా వెళ్లి రెండేళ్లు ‘ప్రత్యేక విద్యావిధానం’ లో ఉత్తీర్ణురాలై ఉపాధ్యాయ పట్టా పొందిందంట. సరోజినీ గారి ప్రోత్సాహంతో, ప్రభుత్వం వారి సహకారంతో, గుడి ఆవరణలోనే ‘మహిళా సంక్షేమ సంస్థ’ ప్రారంభించి, సమాజసేవ చేస్తున్న ఆమెని చుట్టూ గ్రామాల్లోని వారు ఎంతో గౌరవిస్తున్నారట.
ఉమమ్మ పెళ్ళి చూడ్డానికి, ఇప్పుడు ఊరంతా ఎదురు చూస్తుంది. పెళ్లయ్యాక ఉపాధ్యాయినిగా పనిచేస్తూనే ఇక్కడ పాలెంలోని ‘స్త్రీ సంక్షేమ సంస్థ’ కూడా నిర్వహిస్తుందంట.
ఇకపోతే, ఉమమ్మకి కాబోయే భర్త కూడా, మాకు ఆప్తుడైన డాక్టర్. మల్లిక్ గారే. గుంటూరులో ‘శారద సత్య స్పెషాల్టీ హాస్పిటల్ ’ ద్వారా పేదలకి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారంట.
‘ఉమమ్మ నాకు తెలిసినప్పటి నుండి ఇతరులకి సేవ చేయాలన్న తపనతో మసలడం, నా లాంటి వారి అదృష్టమే అనుకుంటాను. ఆమెకి తగిన భర్తని, చక్కటి జీవితాన్ని ప్రసాదించింది ఆ తల్లి గాయత్రి అమ్మవారు.
“మళ్ళీ వస్తాను గాయత్రి. మొదలెట్టి పరీక్షలకి చదువు, మళ్ళీ మళ్ళీ పునరీక్షించు, వింటున్నావా?” అంటూన్న ఉమమ్మ మాటలకి ఆమె వంక చూశాను. ‘అలాగే’ అన్నట్టు తలాడించాను. (ఇంకా ఉంది)