బొమ్మను ప్రేమించిన అమ్మాయి

MythiliScaled

 

అనగనగా ఇటలీ లో ఒక ధనవంతుడైన వర్తకుడు. అతనికి బెట్టా అని ఒక్కతే కూతురు. ఆమెకి పెళ్ళి వయసు వచ్చింది. తండ్రి ఎన్ని సంబంధాలు చూసినా తనకి ఒక్కటీ నచ్చలేదు. ఇలా అన్నిటినీ వద్దనుకుంటూ పోతే ఇక తనకి పెళ్ళి కాదేమోనని వర్తకుడు దిగులుపడిపోయాడు, కాని కూతురిని బలవంతపెట్టాలని అనుకోలేదు.

ఒక రోజు అతను నగరం లో జరగబోయే పెద్ద సంతకి బయల్దేరుతున్నాడు. అక్కడినుచి ఏమైనా కావాలా అని కూతుర్ని అడిగాడు. బెట్టా అంది- ” నాన్నా ! ఒక బస్తా మేలిరకం చక్కెర , రెండు బస్తాల తీపి బాదం పప్పు, నాలుగైదు సీసాల పన్నీరు, కొంచెం కస్తూరి, ఇంకొంచెం సాంబ్రాణి, నలభై ముత్యాలు, రెండు ఇంద్రనీలమణులు, గుప్పెడేసి కెంపులూ పుష్యరాగాలూ , బంగారుజరీ దారపు చుట్ట, వీటన్నిటితోబాటు ఒక పెద్ద వెండి గిన్నే చిన్న వెండి తాపీ- ఇవన్నీ కావాలి ” .ఇవన్నీ ఎందుకా అని తండ్రికి ఆశ్చర్యం వేసింది. అన్నీ కలిపితే చాలా ఖరీదవుతాయి కూడా. అయినా , మారుమాట్లాడకుండా వచ్చేప్పుడు వాటన్నిటినీ పట్టుకొచ్చి కూతురికి ఇచ్చాడు.

pinto 1

బెట్టా అన్నీ తీసుకుపోయి తన గదిలో గడియ వేసుకుంది. బాదం పప్పుల పొడిలో చక్కెర , కస్తూరి, సాంబ్రాణి -వెండిగిన్నెలో కలిపి పన్నీరు పోసి ముద్ద చేసి దానితో అపురూపమైన అందం గల యువకుడి నిలువెత్తు బొమ్మని తయారు చేసింది. వెండి తాపీతో ముఖాన్ని తీర్చిదిద్దింది . తెల్లటి పుష్యరాగాలూ ఇంద్రనీలాలూ కళ్ళుగానూ, కెంపులను పెదవులుగానూ ముత్యాలను పలువరుసగానూ అమర్చింది. బంగారు జరీదారాన్ని మెత్తని చిక్కని పోగులుగా పేని జుట్టుగా పెట్టింది. ప్రాణం ఒకటీ లేదేగాని అద్భుతంగా ఉన్నాడు . బెట్టా ఆ బొమ్మయువకుడిని ప్రేమించింది. అతను మనిషిగా మారితే బావుండుననుకుంది.ఒకప్పుడు సైప్రస్ రాజు ప్రార్థిస్తే బొమ్మకి దేవతలు ప్రాణం పోశారని వినిఉంది. ప్రేమ దేవతని భక్తిగా శ్రద్ధగా వేడుకుంది, కొన్ని రోజులపాటు. దేవత కరుణించింది- బొమ్మ యువకుడు మెల్లిగా ఊపిరి తీసుకుని వదలటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పెదవులు కదిపి బెట్టా ని పలకరించాడు. చివరిగా కాళ్ళూ చేతులూ విదిలించి కదిలించి నడిచేశాడు కూడా. బెట్టాని చూస్తూనే అతనికిచాలా ఇష్టం వచ్చింది. అతనికోసమే అప్పటిదాకా బ్రతికిఉన్నానని బెట్టాకి అనిపించింది .

సంతోషంగా యువకుడి చేయిపట్టుకుని తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి – ” నాన్నా, నాకు పెళ్ళి చేయాలనే కదా మీ కోరిక ? ఇడుగో, ఇతన్ని ఎంచుకున్నాను ” అని చెప్పింది. కూతురి గదిలోకి ఎవరూ వెళ్ళలేదు, ఇతను ఎలా బయటికి వచ్చాడో తండ్రికి అర్థం కాలేదు. కాని ఎవరూ ఎప్పుడూ ఎక్కడా చూసిఉండనంత అందం గా ఉన్న ఆ యువకుడిని చూసి చాలా ఆనందించాడు.యువకుడికి పింటో స్మాల్టో అని పేరుపెట్టారు.   త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్ళి ఏర్పాటైంది. పెద్ద విందు చేసి ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళలో ఒక దూరరాజ్యపు రాణి కూడా ఉంది. ఆ ఊళ్ళో ఆమె బంధువులు ఉన్నారు, వాళ్ళని బెట్టా తండ్రి విందుకి పిలిచాడు. ఆమె కూడా వాళ్ళతో అక్కడికి వచ్చింది. ఆమెకి పింటో చాలా చాలా నచ్చేశాడు అతని పెళ్ళి విందుకి వచ్చింది కాస్తా అతన్ని తనే పెళ్ళిచేసుకోవాలనుకుంది.పింటో కొత్తగా ప్రపంచం లోకి వచ్చాడు కనుక ఎవరితో ఎలా ప్రవర్తించాలో బెట్టా అతనికి చెప్పి నేర్పించింది. అయితే అతను పసిపాప అంత నిర్మలమైనవాడు, రాణి చెడుబుద్ధి అతనికి తెలియలేదు. అందరికీ ఇచ్చినట్లే రాణికీ వీడ్కోలు చెప్పేందుకు ఆమె కూడా వెళ్ళాడు. బెట్టా తక్కిన అతిథులతో ఇంటిలోపలే ఉండిపోయింది . రాణి అతని చేయి పట్టుకుని తన రథం లో ఎక్కించుకుని తన రాజ్యానికి ప్రయాణమైంది. ఆ రథానికి కట్టిన గుర్రాలు చాలా వేగంగా పరుగెత్తగలవు – అందుకని కన్నుమూసి తెరిచేలోపు రథం   వెళ్ళిపోయింది.

pinto 2

పింటో కోసం బెట్టా చాలాసేపు చూసింది. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండిపోయాడేమో నని కాసేపు, చల్లగాలికి బయటికి వెళ్ళాడేమోనని కాసేపు అనుకుని ఊరుకుంది. వచ్చినవాళ్ళంతా ఒక్కొక్కరూ వెళ్ళిపోయారు. చివరికి వెళ్ళి చుట్టుపక్కలంతా వెదికింది. ఎక్కడా లేడు పింటో. అతన్ని ఎవరో ఎత్తుకుపోయిఉంటారని అప్పటికి బెట్టాకి అర్థమైంది. వర్తకుడు సేవకులని పిలిచి అందినంతమేరా గాలించమని ఆజ్ఞాపించాడు. ఏమీ లాభం లేకపోయింది. బెట్టా ఏడ్చి ఏడ్చి చివరికి ఒకరోజున ధైర్యం తెచ్చుకుని తనే పింటో ని వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. తండ్రికి తెలియకుండా , పేదపిల్లలాగా వేషం వేసుకుని, కావలసినవి తీసుకుని బయల్దేరింది.అన్ని ఊళ్ళూ తిరుగుతూ   కొన్ని నెలలపాటు వెతుకుతూనే ఉంది. అప్పుడు ఒక ఊళ్ళో ఒక పెద్దావిడ కలిసింది. ఆవిడ చాలా దయగలది. బెట్టా కథ అంతా విని జాలిపడింది. బెట్టా కి మూడు మంత్రాల వంటివి నేర్పింది. మొదటిది- ” ట్రిషే వర్లాషే – ఇల్లు కురుస్తోంది ” రెండోది – ” అనోలా ట్రనోలా – ఏరు పొంగుతోంది ” మూడోది – ” స్కటోలా మటోలా – సూర్యుడు వెలుగుతున్నాడు ”. బెట్టా కి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ మాటలు మూడుసార్లుగా పలికితే మేలు జరుగుతుందని హామీ ఇచ్చింది.

బెట్టాకి పెద్దగా నమ్మకమేమీ కలగలేదు. సరే, గుర్తుంచుకుంటే పోయేదేముందనుకుని పెద్దావిడకి ధన్యవాదాలు చెప్పి మళ్ళీ తనదారిన తను వెళ్తూ ఉంది. పోగా పోగా రౌండ్ మౌంట్ అనే నగరం వచ్చింది. మధ్యలో పెద్ద రాజభవనం. బెట్టా కి ఎందుకో పింటో అక్కడే ఉంటాడనిపించింది. దొడ్డిదారిన వెళ్ళి అక్కడి గుర్రపుసాలలో ఆ రాత్రికి తలదాచుకునేందుకు చోటు అడిగింది. గుర్రాలసాల ను చూసుకునేది ఒక ముసలివాడు. అతను చాలా మంచివాడు. బెట్టాని చూస్తే తన కూతురులాగా అనిపించి సాల పక్కనే ఉన్న తన చిన్న ఇంట్లో ఉండచ్చు, రమ్మని ఆహ్వానించాడు. బెట్టా అనుకున్నట్లే మరుసటి రోజే పింటో రాజభవనపు తోటలోదూరం నుంచి కనిపించాడు. ఏదో కలలో నడుస్తున్నట్లు దేన్నీ పట్టించుకోకుండా ఉన్నాడు అతను . జరిగిందేమిటంటే, పింటో నీ తీసుకొచ్చేశాక రాణి అతన్ని పెళ్ళిచేసుకోమని అడిగింది. పింటో తనకి పెళ్ళైపోయిందనీ బెట్టా దగ్గరికి వెళ్ళిపోతాననీ మొండికేశాడు.

అతన్ని ఒప్పించలేక రాణి ఒక మంత్రగత్తె ని సలహా అడిగింది. ఆమె ఒక మూలిక ఇచ్చి సంవత్సరం పాటు రోజూ అతనికి ఇస్తే జరిగిన దం తా మరచిపోతాడంది. రోజూ పింటోకి ఇచ్చే ఆహారం లో రాణి ఆ మూలిక కలుపుతూ వస్తోంది. పింటో జ్ఞాపకశక్తి చాలావరకు పోయింది. ఇంకా రాణిని పెళ్ళాడేందుకు ఒప్పుకోవటం లేదుకాని, కొద్ది రోజుల్లో సంవత్సరం పూర్తయిపోతుంది. పింటో తన ఇష్టం ప్రకారం అక్కడ ఉండిఉండడని బెట్టా కి తెలుసు, ఎలా అతన్ని అక్కడనుంచి తప్పించాలో తెలియలేదు. పెద్దావిడ చెప్పిన మొదటి మంత్రాన్ని మూడుసార్లు పైకి పలికింది. ” టిషే వర్లాషే- ఇల్లు కురుస్తోంది ” ఆ వెంటనే అక్కడొక చిన్న బంగారురథం ప్రత్యక్షమైంది. దాని మీదంతా రత్నాలు పొదిగి ఉన్నాయి. రథం దానంతట అదే ఆ తోట చుట్టూ ఉన్న కాలిబాట లో తిరగటం మొదలుపెట్టింది.

pinto3చూసినవాళ్ళంతా ఆశ్చర్యపడిపోయారు. అందరూ చూశాక బెట్టా దాన్ని పట్టుకుపోయి తన గదిలో పెట్టేసుకుంది. ఈ సంగతి రాణికి తెలిసింది.రాణికి అందమైన వస్తువులమీద చాలా వ్యామోహం, అవి ఎవరివైనా సరే. గుర్రాలసాల అతని ఇంటికి, బెట్టా గదిలోకి వచ్చి – ఆ బంగారు రథాన్ని తనకు అమ్మమని అడిగింది. బెట్టా అంది ” నేను బీదదాన్నేనండీ, కాని ఎంత డబ్బూ బంగారమూ ఇచ్చినా దీన్ని అమ్మను. ఒకటే కావాలి నాకు – ఇందాక ఒక అందమైన అబ్బాయి మీ భవనం లోకి వెళ్ళటం చూశాను, అతని గది తలుపు ముందు ఒక రాత్రంతా నన్ను గడపనిస్తే మీకిది ఇచ్చేస్తాను ” . ఈ పేదపిల్ల డబ్బూ బంగారమూ వద్దని ఇలా అడిగిందేమిటా అని రాణి విస్తుపోయింది . ” ఉట్టినే ఆ గదిముందు పడుకుంటాననే కదా అడిగింది.. అయినా పింటో ని పలకరిస్తుందో ఏమో, అతనికి నిద్రపోయే మందు ఇచ్చి పడుకోబెట్టేస్తే సరి, ఈమె ఎంత పిలిచినా జవాబు ఇవ్వడు ” అని పథకం వేసుకుంది.

 

రాత్రయింది. నక్షత్రాలు ఆకాశం మీదికీ మిణుగురులు నేల మీదికీ వచ్చాయి. రాణి రోజూ ఇచ్చే మూలికతోబాటు ,ఘాటైన నిద్రమందుని పాలలో కలిపి పింటో చేత తాగించింది. అతను పక్క మీద వాలగానే ఒళ్ళెరగకుండా నిద్రపోయాడు. అప్పుడు బెట్టా ఆ గదిముందుకు వచ్చింది. అతన్ని పిలిచింది, గట్టిగా అరిచింది, ఏడ్చింది- తన బాధనంతా వివరించి చెప్పుకుంది. అతను మాత్రం కళ్ళు విప్పనేలేదు . చూస్తుండగానే తెల్లారిపోయింది. రాణి వచ్చి బెట్టా ని రెక్క పట్టుకు లేపి ” చాలు కదా, ఇక వెళ్ళు ” అని పంపించేసింది. బెట్టా కోపంగా గొణుక్కుంది – ” నీకూ ఎప్పటికీ ఇదే చాలు, పింటో నిన్ను ప్రేమించనే ప్రేమించడు ”- అప్పటికిక చేసేదేమీలేక వెళ్ళిపోయింది.

 

మరుసటిరోజు బెట్టా రెండో మంత్రాన్ని మూడుసార్లు పలికింది – ” అనోలా ట్రనోలా- ఏరు పొంగింది ” . ఈసారి మణులు చెక్కిన బంగారుపంజరం లో ముద్దొచ్చే పక్షి ఒకటి ప్రత్యక్షమైంది. అది కోయిలకన్నా తీయగా పాడుతోంది. విషయం తెలుసుకున్న రాణి మళ్ళీ వచ్చి బెట్టా ని పక్షిని అమ్మమని అడిగింది. బెట్టా నిన్నటిలాగే కోరింది. ఇవాళైనా పింటో కి తన మాటలు వినిపించవా అని ఆమె ఆశ. రాణికి ఇంకాస్త అనుమానం వచ్చింది. పింటోకి రెట్టింపు మోతాదులో నిద్రమందు ఇచ్చింది. ఆ తర్వాత కథంతా నిన్నటిలాగే జరిగింది. అయితే, ఆ గది పక్కనే ఉన్న వసారాలో దర్జీ అతనొకడు పనిచేసుకుంటున్నాడు. అతను ఎవరూలేని ఒంటరివాడు . సంవత్సరం పూర్తవుతూనేజరగబోయే తమ పెళ్ళిబట్టలు కుట్టటం కోసం రాణి అతన్ని అక్కడే ఉంచి రాత్రింబవళ్ళు పనిచేయిస్తోంది. అతను బెట్టా మాటలన్నీ విన్నాడు. పూర్తిగా అర్థం కాకపోయినా బెట్టా కీ పింటోకీ పెళ్ళయిందనీ అతను భార్యని వదిలేసివచ్చాడనీ తెలిసింది. రాణి మీద దర్జీ అతనికి మంచి అభిప్రాయమేమీ అదివరకే లేదు, ఇప్పుడు ఈ సంగతి తెలిసి కోపం కూడా వచ్చింది.

pinto4

 

మూడోరోజు పొద్దునే పింటో కి కుట్టే బట్టలకోసం కొలతలు తీసుకోవాలని కబురు చేశాడు. కొలతలు సరిగ్గా రావాలంటే పింటో తనని ఒంటరిగా కలవాలనీ చెప్పి పంపాడు. రాణి ఒప్పుకుని పింటోని పంపింది. దర్జీ తను విన్నదంతా పింటోకి చెప్పేశాడు. పింటోకి అంతా గుర్తొచ్చీ రానట్లుంది. ఎప్పటినుంచీ ఆపుకోలేనంత నిద్రవస్తోందో అడిగి తెలుసుకున్న దర్జీ ఆ రాత్రి పాలు తాగకుండా ఉండమని సలహా ఇచ్చాడు.

 

బెట్టా ఆ రోజున ఆఖరిప్రయత్నం చేయాలనుకుంది. మూడో మంత్రాన్ని మూడుసార్లు పలికింది – ” స్కటోలా మటోలా-సూర్యుడు వెలుగుతున్నాడు ”. ఈసారి చిన్న బంగారపు ఉగ్గుగిన్నె వచ్చింది. అందులోంచి రంగురంగుల , సుతిమెత్తని పట్టుబట్టలు, సన్ననిముత్యాలు కుట్టినవి బయటికి వచ్చాయి. వాటిని మడిస్తే అన్నీ ఆ ఉగ్గుగిన్నెలో పట్టేస్తున్నాయి, అంత పల్చటివి. రాణి అవీ కావాలంది, బెట్టా ఇదివరకులాగే అడిగింది. రెండు రాత్రులూ ఏమి కాలేదు కదా, ఇప్పుడింకేం ముంచుకొస్తుందిలెమ్మని రాణి సరేనంది. ఆ రాత్రి రాణి ఇచ్చిన పాలని పింటో ఆమె చూడకుండా పారబోశాడు. బెట్టా వచ్చి గదివాకిలిలో కూర్చుంది. ఆమెకేమీ ఆశ మిగల్లేదు. పింటోకి చెబుతున్నట్లు కాకుండా గడిచిందంతా తలుచుకుంటోంది. ”అద్భుతమైనవన్నీ కలిపి అత్యద్భుతమైన అతన్ని మలిచాను. ప్రేమదేవిని అడిగి ప్రాణం తెచ్చాను. అంతా అయాక కోల్పోయాను, అతను తిరిగి కనబడినా నా మాటలు వినబడటం లేదు…ఇదే చివరి రాత్రి   ” మేలుకునే ఉన్న పింటోకి అంతా వినిపించింది, గుర్తొచ్చింది.గబగబావెళ్ళి , బెట్టా ని కలుసుకున్నాడు. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుని ఆనందం పట్టలేక ఏడ్చారు. రాణి , బెట్టా నుంచి సంపాదించిన వస్తువులు తీసేసుకుని ఇద్దరూ రాత్రికి   రాత్రి బయల్దేరి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. దర్జీ ని కూడా లేపి తమతో తీసుకుపోయారు. వీళ్ళని చూసి , బెట్టా తండ్రి సంతోషంతో చిన్నపిల్లవాడిలాగా గంతులు వేశాడు. అంతా సుఖంగా ఉన్నారు.

 

  • ఇటాలియన్ జానపదకథ , by Giambattista Baile      
  •  
  •                                                            [ from Pentamerone ]
Download PDF

10 Comments

  • బెట్టా విలువైన వస్తువులతో తయారుచేసిన అందమైన బొమ్మలానే ఉంది ఈ కథ!

  • alluri gouri lakshmi says:

    అబ్బ ! ఎంత బావుందో కధ ! మా ఊర్లోకి , చిన్నప్పటి లోకంలోకి వెళ్ళిపోయా !

    Thanku ! Thanku !Thanku !మైథిలి గారూ !

  • Suresh says:

    “ఒక బస్తా మేలిరకం చక్కెర , రెండు బస్తాల తీపి బాదం పప్పు, నాలుగైదు సీసాల పన్నీరు, కొంచెం కస్తూరి, ఇంకొంచెం సాంబ్రాణి, నలభై ముత్యాలు, రెండు ఇంద్రనీలమణులు, గుప్పెడేసి కెంపులూ పుష్యరాగాలూ , బంగారుజరీ దారపు చుట్ట, వీటన్నిటితోబాటు ఒక పెద్ద వెండి గిన్నే చిన్న వెండి తాపీ”— ఆ వస్తువుల పేర్లు చదువుతుండగానే… ఏదో హాయి. నిజంగా ఇలా ఈ వస్తువులకి ప్రాణం పోసి, ప్రేమ నింపితే ఎలా ఉంటుందో అన్న ఊహల్లోకి వెళ్ళిపోయాను. చాలా చాలా బాగుంది మామ్

  • Rekha Jyothi says:

    బోలెడన్ని ఊహలకు రూపమిచ్చి , ప్రాణం పోసి ఇక ఏ మాయ అడ్డొచ్చినా చేజారి పోనివ్వని ప్రియమైన సంకల్పం ‘ బొమ్మను ప్రేమించిన అమ్మాయి ‘ – ప్రతీ వాక్యంలో చిన్న ఉద్వేగం భలే ఉంది మామ్ ! అద్దం పట్టిన పెయింటింగ్స్ భలే వున్నాయి. థాంక్ యూ అగైన్ Mam! :)

  • Mythili Abbaraju says:

    థాంక్ యు ఆల్వేస్ రేఖా

  • kanchiraju veerraju says:

    గుడ్

  • Mythili Abbaraju says:

    థాంక్ యూ వీర్రాజు గారూ

Leave a Reply to Sivarama Krishna Rao Vankayala Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)