అనగనగా ఒక రోజు రెండు రాష్ట్రాల సరిహద్దు దగ్గర అనగనగా ఒక రైతు పురుగుల మందు తాగి చనిపోయాడు. బతికున్న రైతు కంటె చనిపోయిన రైతే రెండు రాష్ట్రాలనూ వణికించే వార్తగా మారిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. తెల్లారక ముందే ఈ వార్త సరిహద్దుకు ఒకవైపు పాలకపక్ష నాయకుడి చెవిలో పడింది. చాలా తర్జనభర్జనలే జరిగాయి. శవం ఒంటి మీద బట్టల్నిబట్టి.. రెప్పలు తెరిచే వున్న శవం కంటి కొసన వేలాడుతున్న దీనత్వాన్ని బట్టి.. వోవరాల్ గా శవం నుండి కొడుతున్న మట్టివాసన బట్టి అది తప్పనిసరిగా ఒక రైతు శవమే అని తేల్చుకున్నారు.
కొంపదీసి ఏ గాలికో రైతు శవం మనవైపు కొట్టుకువస్తే చాలా ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్ అనుకుని, వెంటనే సదరు నాయకులవారు తన ఏలుబడిలో ఇలాంటివి జరగితే ఇంకేమైనా వుందా చాలా ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్ అని గొణుక్కుంటూ పలుకుబడినంతా ఉపయోగించి పక్కా ప్లాన్ వేశాడు. ఆ శవాన్ని సరిహద్దుకి అవతల వైపు పడేసే ఏర్పాటు చేశాడు. క్షణాల్లో రైతు శవం సరిహద్దు మార్చుకుంది. అటువైపు కూడా అధికార పక్షం నాయకుడొకరికి ఈ వార్త చెవిని సోకింది. ఆ చెవి నుంచి ఇంకో చెవికి అది ప్రయాణం చేసేంత టైమ్ కూడా ఇవ్వకుండా ఆ లీడర్ సారు ఆర్డర్ పాస్ చేశారు. మళ్ళీ రైతు శవం సరిహద్దు మారింది. అందరినీ వణికించే చలిరాత్రి ఈసారి మాత్రం తానే గజగజలాడిపోతూ నెత్తీనోరూ బాదుకుంటూ సరిహద్దు రేఖకి ఆవలా ఈవలా వలవలా ఏడ్చింది. సరే తెల్లారింది కూడా.
ఎవరెవరో జనం వస్తున్నారు. వాళ్లు పార్టీలు వారీగా చీలిపోయి వున్నారు. అటూ ఇటూ అందరికీ అది రైతు శవమేనన్నది కర్ణాకర్ఱిగా రూఢి అయిపోయింది. కొందరు రైతు ఆనవాళ్ళకోసం వెదికారు. కొందరు రైతు కులం కోసం చూశారు. కొందరు రైతు మతం ఏంటో ఆరా తీశారు. కొందరు రైతు అక్కడివాడా ఇక్కడివాడా అన్న మీమాంసలో మీసాలు పీక్కున్నారు. సరిహద్దుకి అవతలా ఇవతలా జనం పోగయ్యారు. మీ వాడంటే మీ వాడని శవాన్ని బంతిలా అటూ ఇటూ చాలా సేపు విసురుకున్నారు. అలసిపోయాక శవాన్ని సరిగ్గా ఇరువైపులా గొడవ లేకుండా సరిహద్దులో వుంచారు.
ఇదంతా చూసిన రైతు ఆత్మకు చాలా చికాకు మొదలైంది. జనం మీద జాలికూడా కలిగింది. ఎప్పుడూ ఎవరి మీదా కోపం రాని రైతుకు అప్పుడు కూడా ఆ జనం మీద కోపం రాకపోవడం విశేషమేం కాదు. కాని జనాన్ని తనివితీరా తిట్టాలని రైతు ఆత్మ విశ్వప్రయత్నమే చేసింది. వీలు కాలేదు. అక్కడి నుంచి గాల్లో ఎటైనా ఎగిరిపోవాలనుకుంది. అంతలోనే ఒక సందేహం దేహం లేని ఆత్మను చుట్టుముట్టింది. వీళ్ళంతా కలిసి తనను ఏ రాష్ట్రానికి చెందిన వాడిగా ముద్ర వేస్తారో కదా అన్నదే ఆ సందేహం. అయితే వీళ్ళ గొడవ తేలే లోగా ఏం చేయాలబ్బా అని తల గోక్కుంది. వచ్చింది..వచ్చేసిందో ఐడియా. తను చూడాల్సిన కొన్ని ప్రదేశాలు..తను పలకరించాల్సిన కొందరు మనుషులు..తను వినాల్సిన కొందరి మాటలు..తను అర్థం చేసుకోవాల్సిన కొన్ని స్పందనలు వున్నాయి. ఈ లోగా ఆ పని ముగించుకువద్దామని రైతు అనుకున్నాడు. అదేనండి రైతు ఆత్మ అనుకుంది.
ముందుగా ఒక వైపు రాష్ట్రం అసెంబ్లీలోకి ప్రవేశించింది. అక్కడ వాడివాడిగా తన మీదే చర్చ జరుగుతోంది.
“ అధ్యక్షా ఇది మన పొరుగు రాష్ట్రం వారి కుట్ర. అక్కడ రైతు శవాన్ని కావాలనే మన రాష్ట్రంలో పడేయడానికి అన్ని పన్నాగాలు పన్నారు అధ్యక్షా! ఈ విషయంలో మాకు పక్కా సమాచారం వుంది. అయినా సరే రైతు పూర్వాపరాలు తేల్చడానికి ఒక నిజనిర్ధారణ కమిటీని ర్పాటు చేశాము అధ్యక్షా!”
ఈ మాటలు విన్న వెంటనే ప్రతిపక్షాలు తటాలున లేచాయి. “ఇది తమ బాధ్యత నుంచి తప్పించుకోడానికి పాలకపక్షం పన్నుతున్న కుట్రే గాని మరొకటి కాదు అధ్యక్షా”అని వివపక్షాలు గగ్గోలు పెట్టాయి.
అధికార పక్షం మాత్రం తక్కువ తిందా. కౌంటర్ హంటర్లు ఝళిపించింది.
“అధ్యక్షా రైతు ఇక్కడే చనిపోయాడని అనుకుందాం. కాని అప్పుల బాధతో కదా ఆత్మహత్యకు పాల్పడేది? కొత్త ప్రభుత్వానికి పాత అప్పులతో సంబంధం ఏంటో గౌరవ ప్రతిపక్ష సభ్యులు తేల్చి చెప్పాలి. ఇదంతా పాత ప్రభుత్వాల పాపఫలితమే కదా అధ్యక్షా!”
“అవును! అవును!”అని సర్కారీ పక్షం నుంచి బల్లల మోత మోగింది.
“అబద్ధం! అబద్ధం!” అని విపక్షం నుంచి ఇంకా మోత.
“అధ్యక్షా వేరే రాష్ట్రాల్లో ఇంత కంటె ఎక్కువ మంది చనిపోతున్నారు. గౌరవ సభ్యులు గణాంకాలు తెలుసుకోవాలి. మీకు ఓపిక లేకపోతే మా మంత్రివర్యులు సదరు వివరాలు అందిస్తారు విని తరించండి” అని పాలకపక్ష ప్రతినిధి సెలవిచ్చారు. మంత్రి గారు లేచి నిలబడి వివరాల చిట్టా తీశారు. విపక్షం రణగొణ ధ్వని మధ్య ఆయనలా చదువుతూనే వున్నారు. ఏ రాష్ట్రంలో ఎందరు రైతులు చనిపోయారు, గతంలో ఏ సంవత్సరంలో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, తమ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన మరణాలెన్ని? అసలు ఆత్మహత్యలెన్ని సహజమరణాలెన్ని, ఎన్ని సహజమరణాలను ఆత్మహత్యలుగా విపక్షాలు చిత్రీకరించాయి.. ఇలా సాగిన మంత్రిగారి గణాంకాల చిట్టా ఆంజనేయుడి తోకలా చుట్టుకుంటూ సభా భవనం మిద్దెను గుద్దుకుంది.
రైతు ఆత్మ అదిరిపడి ఇక్కడిక లాభం లేదని పొరుగు సోదర రాష్ట్రంలో అసెంబ్లీని సందర్శిద్దామని బయల్దేరింది. వెళుతూ వెళుతూ ఒక్కసారి అసెంబ్లీనంతా కలయజూసింది. ఆకాశంలో నక్షత్రమేదో కుప్పకూలినప్పుడు మనకు కనిపించే వెలగుతో పోలిన సన్నటి పొరలాంటి వస్త్రం సభ్యుల మొహాలను రాసుకుంటూ పోయింది. అందరూ అవాక్కయ్యారు. ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని, అధికార పక్షం విపక్షాలను ఏదో కుట్ర జరిగిందన్నట్టు పరస్పరం అనుమానంగా చూసుకుని అంతలోనే సర్దుకుని రొటీన్ చర్చకు రెడీ అయ్యాయి.
పొరుగు రాష్ట్రంలోకి వెళుతూ వెళుతూ తనకి అప్పులు పెట్టిన షావుకారుగారు ఎలా వున్నారో చూసిపోదామని అనుకుంది. షావుకారు హాయిగా నిద్రపోతున్నాడు. ఆయన చుట్టూ కాగితాల కట్టల గుట్టలున్నాయి. రోజంతా మనం రెక్కలు ముక్కలు చేసుకుని పొలం పనుల్లో మునిగిపోతాం. మనలాంటివాళ్ళను ఆదుకోడానికి ఆయన ఇంకెంత కష్టపడుతున్నాడో కదా అని రైతు ఆత్మకు జాలేసింది. తనకు అప్పుపెట్టడమే కాదు..తాను అదిగో ఇదిగో అని అప్పు కట్టకుండా గడిపేస్తుంటే ఎందుకూ కొరగాని తన పొలాన్ని ఆయన పేర రాయించుకోడానికి ఎంత బాధపడ్డాడో కదా షావుకారు అని రైతు ఆత్మ కన్నీళ్ళు.
అంతెందుకు పెళ్ళాం పుస్తెల తాడు తెచ్చినప్పుడు అది తీసుకోడానికి ఆయన చేతులెంత తడబడ్డాయో ఇంకా రైతుకు గుర్తే వుంది మరి. కొంతైనా వడ్డీ డబ్బులు చెల్లించడానికి మిగిలిన కాడెద్దుల్ని అమ్మేయాలని సంతకు తీసుకు వెళుతంటే షావుకారు వూరి కొసదాకా వచ్చి సాగనంపి జేబులో కొన్ని డబ్బులు కుక్కి ఆకలేస్తే కాఫీ తాగరా అని కండువాతో షావుకారు కన్నీరు తుడుచుకున్న దృశ్యం రైతు ఆత్మ తలచుకుని తలచుకుని కుమిలిపోయింది.
పడుకున్న రైతు చుట్టూ కాసేపు ప్రదక్షిణలు చేసింది. కమ్మర కొలిమి దగ్గర గాలి తిత్తు పైకీ కిందికీ కదులుతున్నట్టు వూగుతున్న షావుకారు పొట్ట మీద కాసేపు కూర్చుంది రైతు ఆత్మ. ఈయన రుణం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించి ఆలోచించి పుణ్యాత్ముడు తనలాంటి వాళ్లకి ఎందరికో ఇలాగే ఆయన అప్పులు పెట్టి ఆదుకోవాలని..అంతటి ధర్మాత్ముణ్ణి దేవుడా నువ్వే కాపాడాలని భగవంతుణ్ణి ప్రార్థించింది. వెళుతూ వెళుతూ షావుకారు ఇంట్లో ఒక మూలన పడివున్న ఎరువులను, మందులనూ చూసింది. పంటకు పట్టిన పురుగుల్ని చంపలేని మందు కనీసం తననైనా చంపి రుణం తీర్చుకుందని ఒక ఎండ్రిన్ డబ్బాను చేతుల్లోకి తీసుకుని వాసన చూసి ఆహా బతుకు వాసన ఎలా వుంటుందో ఇన్నాళ్ళకి తెలిసింది కదా అనుకుని అక్కడి నుండి కదిలింది.
సమయం మించిపోతోందని అక్కణ్ణించి తటాలున ఎగిరి పొరుగురాష్ట్రం అసెంబ్లీలో వాలింది. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీటవుతోంది. తన మీదే చర్చ జరుగుతోందని తెలుసుకుని రైతు ఆత్మ కొంచెం సంబరపడింది. కాని రాష్ట్రాలు వేరైనా డైలాగులు.. కొట్లాటలు..వాదోపవాదాలు..ఎత్తు
వెంటనే తన మృతదేహం పడివున్న చోటుకు బయల్దేరింది. ఇరు రాష్ట్రాల ప్రజలు తన గురించి గొడవ పడకుండా లెక్కలు తేల్చుకున్నారో లేదో ఒకసారి చూసొద్దామని అటు ప్రయాణం కట్టింది. వెళుతూ వెళుతూ ఎండిన తన పొలాన్ని పలకరిద్దామని అక్కడ కాసేపు వాలింది. బీటలు వారిన పొలంలో కూర్చుని, తన కోసం శూన్యంగా చూస్తున్న తన భార్య కూడా కనిపించింది. ఒంటికి అంటిన మట్టిని స్నానం చేసి వదిలించుకోవచ్చు. జీవితం చుట్టూ గుండె చుట్టూ అంటిన మట్టి బంధాన్ని ఎలా వదిలించుకోవాలి? అదేమో కాని ఒక్క వేలిముద్రతో పొలం జంజాటం వదిలించుకున్నాడు. కాని ఒక్క పసుపుతాడుతో ఒంట్లోని నరాలనన్నీ తన చుట్టూ చుట్టేసుకున్న పెళ్ళాన్ని ఎలా వదిలి పోవాలో రైతుకు అర్థం కాక ఎంత సతమతమయ్యాడో. అయినా తప్పలేదు. తననే నమ్ముకున్న భార్యను ఒంటరిగానే వదిలేసి ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు భార్యను పొలంలో ఒంటరిగా చూస్తే రైతు ఆత్మకు బోరున ఏడవాలనిపించింది. భార్య ఖాళీ ఖాళీ కళ్ళలోకి..అక్కడి నుండి ఆమె గుండెల్లోకి..అక్కడి నుండి ఆమె శరీరం లోపలా బయటా అంతటా ఓసారి రైతు ఆత్మ కలతిరిగింది. ఎక్కడా ఏమీ తగల్లేదు. ఒకటే శూన్యం. వచ్చే జన్మలోనైనా ఒక గొప్ప ధనవంతుడైన రైతుని ఆమెకు భర్తగా ప్రసాదించమని రైతు భగవంతుణ్ణి వేడుకున్నాడు.
తిరుగు ప్రయాణం కడుతూ ఒక సారి కలయజూసింది. ఎండిన బోరు కనిపించింది. అందులోకి చొరబడి బోరులో అడుగుకంటా వెళ్ళింది. అడుగున నీళ్ళు వుండే వుంటాయని, తనకే నీళ్ళందలేదని రైతు నమ్మకం. కనీసం ఆ నీళ్ళను కళ్ళ చూద్దామని రైతు ఆశ. ఆత్మ లోపల్లోపలకి..ఇంకా లోపలికి వెళుతూనే వుంది. భూమి అడుగు పొరల్లో కూడా ఎండమావులుంటాయా అని రైతుఆత్మ ఆశ్చర్యపోయింది. నీళ్ళు కనపడుతూనే వున్నాయి కాని తనకి తడి తగలటం లేదు. అయినా తనిప్పుడు చనిపోయింది కదా..బహుశా నీళ్ళ తడి తనను తాకదేమో అనుకుని పైకి వచ్చేసింది. అటూ ఇటూ దిక్కులు చూస్తే కరెంటు స్తంభం, దాన్నుంచి ఒక వైరు పొడవుగా సాగి పొలం దగ్గరున్న చిన్న కరెంటు మీటర్ దాకా వచ్చింది. మీటర్ దగ్గరకు వెళ్ళింది. మీటరు జోరుగా తిరుగుతోంది. ఆశ్చర్యంగా వుంది. కరెంటు కళ్ళజూడ్డమే గగనమైన రోజులు తాను గడిపాడు.
తాను పోయిన తర్వాతైనా కరెంటుకు తన మీద జాలికలిగిందన్న మాట అనుకుని నీళ్ళకోసం ఏర్పాటు చేసిన మోటరు స్విచ్చి నొక్కింది. కాని పంపునుండి ఒక్క బొట్టు కూడా పడలేదు. ఏందబ్బా అనుకుని కరెంటు తీగ పట్టుకుని వేళ్ళాడింది. అయినా తనకేమీ షాక్ కొట్టలేదు. ఏమో తనిప్పుడు చనిపోయిన వ్యక్తికదా తనకంతా ఇలాగే వుంటుందేమో అనుకుని అక్కడి నుండి రైతు ఆత్మ సర్రున బయల్దేరి గాల్లో ఎగురుతూ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. భార్య కళ్ళలో ఇప్పుడు సుళ్ళు తిరిగిన నీళ్ళు కనిపించి నిట్టూర్చింది. యథాప్రకారం తన మృతదేహం దగ్గరకు వెళ్ళి అందులోకి దూరి జనం మాటలు వింటోంది. అక్కడ విషయం ఒక కొలిక్కి రాలేదు. సరిహద్దుకి ఆవలా ఈవలా రాష్ట్రస్థాయి నాయకులు, స్థానిక నాయకులు శవం మాది కాదంటే మాది కాదని కొట్టుకుంటూనే వున్నారు. రైతు ఆత్మ వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నవ్వుకుంటూనే వుంది.
జర్నలిస్టుల హడావుడి ఇక అంతా ఇంతా కాదు. శవం ఎటు పక్కదో తెలిస్తే గబగబా వార్తలు అందించ వచ్చని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. శవం అటుదని తేలితే ఒక వార్త..ఇటుదని తేలితే ఒక వార్త ముందే రాసి వుంచుకున్నారు. ప్రస్తుతానికి శవం మూలాలు ఇంకా తెలియటం లేదన్న బ్రేకింగ్ న్యూస్ మాత్రం అప్ డేట్ చేసి పంపిస్తున్నారు. కొన్ని ఛానళ్ళయితే స్టూడియోల్లో వైద్య నిపుణుల్ని..డి.ఎన్.ఏ. పరీక్షల నిపుణుల్ని కూర్చోబెట్టి చర్చోపచర్చలు కొనసాగిస్తున్నాయి. మనిషి శవాన్ని బట్టి అతను ఏ ప్రాంతం వాడో తెలియజేసే డి.ఎన్.ఏ. పరీక్షలు ఇంకా అందుబాటులోకి రాలేదని నిపుణులు వాపోతున్నారు.
ఉత్కంఠను అలాగే కొనసాగించడానికి యాంకర్లు అష్టవంకర్లు తిరుగుతూ నానా యాతనా పడుతున్నారు. హృదయ స్పందనకు కూడా ఒక ప్రాంతం అంటూ వుంటుందా అన్నది పాపం అమాయక రైతు ఆత్మకు అర్థం కాలేదు. చనిపోయిన రైతు అంటే వార్తాహరులకు ఇంత మమకారమా అని రైతు ఆత్మ ఎంతగానో మురిసిపోయింది. ఒక రైతు గురించి ఇంతగా తపనపడుతున్న వీరందరినీ చల్లగా చూడమని దేవుణ్ణి ప్రార్థించింది.
ఇంతలో రైతు ఆత్మకు ఒక చెట్టు పక్కన ఒక మనిషి కన్నీరు మున్నీరై ఏడుస్తున్నట్టు కనిపించి అయ్యో తన కోసం ఇంతగా రోదిస్తున్న అమాయకుడు ఎవరా అని పరిశీలించింది. వినగా వినగా అర్థమైంది ఏమంటే అతనో గాయకుడు. ప్రజల ఈతిబాధలే తన పాటలుగా మలిచే ప్రజాకవి. శవం అటు పక్కదని తేలితే ఎంతో గొప్పగా రాయొచ్చని, కాని ఖర్మకాలి ఇటుపక్కదని తేలితే ఏమీ రాయలేం కదా అని, అటా ఇటా తన పాట ఎటని తేల్చుకోలేక తెగని ఉత్కంఠను తట్టుకోలేక బోరుమని విలపిస్తున్నాడు.
గడ్డి పువ్వు గాలికి కందినా గాయపడే హృదయం గలవాడు. ఈయనకెందుకింత కష్టం వచ్చిందిరా భగవంతుడా అని రైతు ఆత్మ దీనంగా మూలిగింది. అలాగే రైతుల మీద కథలు రాసేవారు..రైతు మీద బొమ్మలు గీసే వారు..రైతు మీద వ్యాసాలు రాసేవారు..అక్కడే పక్కపక్కన కూర్చుని ఒకరిని ఒకరు చూసుకుంటూ కలాలను..కాగితాలను పట్టుకుని పనిలోకి ఎప్పుడుదిగుదామా అని రైతు శవం దిశగా చూస్తూనే వున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఏ కళాకారుడికీ ఇంతటి సంకటం రాకుండా చూడమని దేవదేవుడికి నివేదించుకుంది రైతు ఆత్మ.
ఇంకా అక్కడే వుంటే తన శవాన్ని ముక్కముక్కలుగా చేసి మూలాలు వెదికే పనిలో వీళ్ళంతా పడతారని అది తన కళ్ళరా చూసి తట్టుకోలేనని రైతు ఆత్మ భావించి ముందుకు ఎగిరింది. ఇంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టు.. ఎటో చటుక్కున ఎగిరిపోయింది.
రైతు ఆత్మ విమానాశ్రయంలో వాలింది. అక్కడ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కొలువుదీరినట్టు కూర్చున్నారు. ఎవరి వందిమాగదులు వారి చెంత నిలబడ్డారు. వాళ్ళిద్దరూ అక్కడకు రాకముందే రెండుమూడు గంటలపాటు వాస్తునిపుణుల రాకతో పెద్ద కోలాహలమే జరిగింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఏ ప్రదేశంలో కూర్చోవాలి..ఎటు తిరిగి కూర్చోవాలి..వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానాలు ఏ దిశగా ల్యాండవ్వాలి.. అన్నీ కూలంకషంగా వాస్తు నిపుణుల బృందాలు పరిశీలించాయి. ఆ తర్వాతే అక్కడకు ముఖ్యమంత్రుల రాక జరిగింది. వాళ్ళిద్దరూ ఎయిర్ పోర్టులోకి ప్రవేశించేటప్పుడు ఒకరికొకరు ఎదురు పడకుండా..కూర్చొనేటప్పుడు ఒకరికొకరు కనిపించే అవకాశం లేకుండా అన్నీ వాస్తు ప్రకారమే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇద్దరూ చెరో వైపూ నిండుగా కూర్చున్నారు. ఒకరు సింగపూర్ విమానం కోసం, మరొకరు జపాన్ విమానం కోసం వేచి వున్నారు. వారికి పక్కనే కొందరు మంత్రులు..కొందరు అధికారులు ఏవో కాగితాల కట్టలు పట్టుకుని నిలబడ్డారు.
వున్నట్టుండి వారు ముఖ్యమంత్రుల చెవుల్లో ఏదో చిలుకుతున్నారు. విషయం చాలా సీరియస్సే మరి. సింగపూర్ లోనూ జపాన్ లోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారా? చేసుకుంటే ఏ విధానాలు అవలంబిస్తారు? వారి సమస్యను ఆ ప్రభుత్వాలు ఎలా డీల్ చేస్తాయి ? అని పరిశీలించడానికి అత్యున్నత శాసనసభాపక్ష కమితో పాటు ముఖ్యమంత్రులు హుటావుటిన బయల్దేరారు. ఉదయం సభలో గందరగోళం చూసి వెంటవెంటనే నిర్ణయాలు చేసి సాయంత్రం ఫ్లయిట్ కే బయలెల్లారు.
రైతు ఆత్మ విమానాశ్రయంలోకి ఎంటరయ్యిందో లేదో ఒక గొప్ప మెరుపు మెరిసినట్టు..వెంటనే చీకటి అలముకున్నట్టు..ఆ వెంటనే వాన కురిసినట్టు..వెనువెంటనే భూమి కంపించినట్టు..ఆ వెంటనే మంటల మాదిరి ఎండలు కాచినట్టు అక్కడున్న వారందరికీ అనిపించింది. ఎవరికీ అర్థంకాక ఎవరినీ ఏమీ అడగడానికి రాక అలా వుండి పోయారు. అంతలో విమానాలు రెండూ ఒకేసారి రన్ వే మీద చప్పుడు చేసుకుంటూ దిగినట్టు అనిపించి అంతా కాస్త శాంతించారు. రెండు టీముల వారూ రెండు విమానాల్లో ఆసీనులయ్యారు. రైతు ఆత్మ రెండు విమానాల్లోనూ ఒకేసారి ప్రవేశించింది. ఇద్దరు ముఖ్యమంత్రులూ ఒకసారి చుట్టూ పరికించారు గర్వంగా.
ఉన్నట్టుండి సీట్లన్నీ ఖాళీగా కనిపించి ఉలిక్కిపడ్డారు. తదేకంగా చూశారు. ఖాళీ సీట్లలో ఏదో వెలుగుతో కూడిన నీడలాంటిది మెదలడం కనిపించి చేబుల్లోంచి రుమాళ్లు తీసి చెమటలు పట్టిన ముఖాలు తుడుచుకున్నారు. ఇంతలో ఎయిర్ హోస్టెస్ డ్రైవర్ సీటువైపు నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పసాగింది. ముఖ్యమంత్రులు చెవులు రిక్కించి విన్నారు. ఎంత విన్నా రైతులు..వారి మరణాలు..ఆత్మహత్యలు..జాగ్రత్తలు ఇవే వినపడుతున్నాయి.
అంతలోనే ఎయిర్ హోస్టెస్ కూడా తెల్లని నీడలా మారిపోయింది. ఇద్దరూ భయపడ్డారు. గట్టిగా అరుద్దామనుకున్నారు. కాని నోళ్ళు పెగల్లేదు. రైతు ఆత్మ ఇక వెళదామని నిర్ణయించుకుంది. తన కోసం విదేశాల ప్రయాణం కట్టినవారినందరినీ పేరుపేరునా ఆశీర్వదించింది. ఒక రైతు కోసం ఇంతగా కష్టపడే ఇలాంటి ప్రభువులనే మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వచ్చేట్టు చూడమని దైవానికి మొక్కుకుంది. అప్పుడు విచిత్రంగా రైతు కళ్ళు చెమర్చాయి. విమానాలు, వాటిలో ఆసీనులైన ఏలినవారు ఒకేసారి ఊపిరి పీల్చుకున్నారు.
రైతు పట్ల మాటల్లో అతిప్రేమని కురిపిస్తూ చేతల్లో మొండి చేయి చూపుతున్న ప్రస్తుత ప్రభుత్వాల పని తీరు పై గొప్ప సెటైర్ .. ఈ కథ . చాలా బావుందండీ !
థాంక్యూ వనజ గారు
అన్నా !
కథ ఘాటుగా వుంది ….
ఇట్లాంటి కథల అవసరం చాలా వుంది –
నాకైతే ‘పీప్లి లైవ్ ‘ సినిమా జ్ఞాపకం వొచ్చింది
వ్యవస్థ పైన నీ కసీ – కోపం అంతా కథలో కన్పించింది –
అభినందనలు –
-నీ తమ్ముడు
చాలా థాంక్స్ విజయ్
మోనోలాగ్ కథనంతో కవిత్వఛాయలున్న శైలితో సమకాలీన విషయాన్ని వ్యంగ్యంగా ప్రసాదమూర్తి ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది
పాలక విపక్షాలనే కాక పత్రికలు కవులు మేథావులకు కూడ చురకలంటించిన తీరు సమర్ధనీయం కూడ(పుస్తెల తాడు తాకట్టు పెట్టుకున్న షావుకారు జాలి నటించేసి,రైతు ఎట్టాగో పోయేవాడని తెల్సుకాబట్టి హాయిగాగుర్రు కొడుతున్నాడనుకోవచ్చు)
మంచికథ. ముగింపు విషయంలో పాఠకుడికి ఏదో అసంతృప్తి కలుగుతుంది.ఇక్కడితో ముగించేద్దాంలే అన్నట్టుంది
ప్రమూ మంచికథ రాసావ్ .రైతుఆత్మహత్యలు నివారించటానికి వీళ్ళందరు కళ్ళు తెరవాలన్న విషయాన్ని బాగా చెప్పావు
మంచి పరిశీలన చేసి విశ్లేషించిన ప్రసాద్ కి ధన్యవాదాలు.
తడిఉన్న కథ
thank you sir
బాగా రాసారు .కంగ్రాట్స్
కథ బాగుంది సర్
thank you murthy garu