అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవి అంచున చిన్న గుడిసెలో ఒక కట్టెలుకొట్టుకునేవాడు తన భార్యా ముగ్గురు కూతుళ్ళతో ఉంటుండేవాడు. ఒక రోజు పొద్దున్నే అతను అడవిలో ఎక్కువ దూరం ఎండుకట్టెల కోసం వెళ్ళాల్సివచ్చింది. వెళ్తూ వెళ్తూ భార్యతో చెప్పాడు ” ఇవాళ మన పెద్దమ్మాయితో నాకు భోజనం పంపించు. తను దారి తప్పకుండా గుప్పెడు జొన్నలు తీసుకుని దోవంతా జల్లుకుంటూ వెళతాను ”
బాగా ఎండెక్కాక అలాగే ఆ అమ్మాయి తండ్రికి భోజనం తీసుకుని బయల్దేరింది. అయితే వాళ్ళ నాన్న జల్లిన జొన్నలన్నీ పిట్టలు తినేశాయి. దారి తెలియలేదు. అలా అడవిలో నడుచుకుని పోగా పోగా చీకటి పడిపోయింది, చలేస్తోంది. అమ్మాయికి భయం వేసింది. అంతలో చెట్లమధ్యలోంచి మినుకు మినుకు మంటూ దూరంగా ఒక దీపం వెలుతురు కనిపించింది. తనకి ప్రాణం లేచివచ్చి అటువైపు పరుగెత్తింది. నిజంగానే అక్కడొక పాత పెంకుటిల్లు , కిటికీలనిండా దీపాలు. తలుపు తట్టింది ” లోపలికి రా ” ఒక బొంగురుగొంతు పలికింది. వెళ్తే అక్కడ ఒక బల్ల మీద చేతుల్లో మొహం దాచుకుని ముసలివాడు ఒకడు . అతని జుట్టంతా నెరిసిపోయింది. పొడుగాటి గడ్డం నేలదాకా పాకుతోంది. వెచ్చగా ఉన్న పొయ్యి పక్కనే ఒక కోడి పెట్ట, కోడిపుంజు, ఒక మచ్చల ఆవు.
అమ్మాయి తన కథంతా చెప్పి ఆ రాత్రికి ఉండనిమ్మని అడిగింది. అతను ఆ మూడు ప్రాణులనీ అడిగాడు ” ఏం చేద్దాం ? ” అని. అవి అన్నాయి కదా, ” మాకిష్టమే ” అని. అతను చెప్పాడు , ” సరేనమ్మాయ్. వెనకాలే వంటిల్లుంది. నిండుగా సరుకులున్నాయి ”
ఆమె చక్కగా వంట చేసి రెండు కంచాలలో ముసలివాడికీ తనకూ వడ్డించింది. మూడు ప్రాణుల గురించి ఆలోచించనేలేదు. ఆకలి తీరేవరకూ తినేసి ” ఎక్కడ పడుకోను ? ” అని అడిగింది. అతను ” మేడమీద పడక గది ఉంది. ఆ మంచాన్ని బాగా కదిపి ఉతికిన దుప్పట్లు వేసుకో, నిద్రపో ” అన్నాడు. అమ్మాయి అలాగే చేసింది. ఆమె నిద్రపోయాక ముసలివాడు ఒక కొవ్వొత్తి తీసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ వెలుగులో ఆమె మొహం ఒకసారి చూశాడు. ” ఊహూ ” అనుకుని మంచం కింద రహస్యంగా అమర్చిన తలుపు తెరిచాడు. ఆమె మంచంతో సహా నేలమాళిగలోకి పడిపోయింది.
ఇక్కడ కట్టెలుకొట్టేవాడు బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చి తనకి రోజంతా తిండి లేనందుకు భార్యని చీవాట్లు పెట్టాడు. ఆమె అసలు సంగతి చెప్పింది. ఇంకా అమ్మాయి ఇంటికి రాలేదే అని ఇద్దరూ కాసేపు బాధపడి ” అడవిలో దారి తప్పి ఉంటుంది , తెల్లారగానే వచ్చేస్తుందిలే ” అనుకున్నారు.
తెల్లారింది. ఈసారి రెండో కూతురుని పంపించమనీ, దోవంతా కందిపప్పు జల్లుతూ వెళాతాననీ తండ్రి చెప్పాడు. రెండో పిల్ల బయల్దేరేసరికి ముందురోజులానే పప్పులన్నీ పిట్టలు తినేశాయి. తనూ దారి తప్పి అదే ఇంటికి వచ్చింది. అలాగే రాత్రికి ఉంటానని అడిగింది. ముసలివాడు మూడు ప్రాణులనీ అడిగి అలాగేనన్నాడు. తన అక్కలాగే తనూ ప్రాణుల గురించి పట్టించుకోలేదు. వంటా, భోజనం, పడకా- ఆ తర్వాత అతను ఈ పిల్లనీ నేలమాళిగలోకి పడేశాడు.
ఇద్దరు పిల్లలూ ఇంటికి తిరిగి వెళ్ళలేదు. అయినా వాళ్ళ నాన్న మూడోరోజున ఆఖరి కూతురుతో అన్నం పంపించమనే చెప్పాడు . తక్కిన ఇద్దరూ ఇంటికి రాకపోయినా తండ్రి మూడో అమ్మాయిని ఎందుకు పంపించమన్నాడో అతనికే తెలియాలి. ఆమె అక్కలిద్దరినీ వెనక్కి తీసుకు రాగలదని నమ్మకమో ఏమో. వాళ్ళ అమ్మ ఏడ్చింది ” అయ్యో, నా ముద్దులతల్లినీ పోగొట్టుకోవాలా ? ” అని
తండ్రి అన్నాడు ” భయపడకు. ఇది చాలా తెలివిగలది, దారి తప్పదు. ఈసారి బఠానీ గింజలు జల్లుకుంటూ వెళతాను. అవి పెద్దగా ఉంటాయి కాబట్టి బాగా కనిపిస్తాయి ” అయినా లాభం లేకపోయింది. మూడో పిల్ల వెళ్ళేసరికి అక్కడ ఒక్క బఠానీ గింజా మిగలకుండా పిట్టలు ఖాళీ చేశాయి. ఎంత తెలివిగలదైతే మాత్రం ఎటువెళ్ళాలో ఎలా తెలుస్తుంది ? అక్కలలాగే తనూ రాత్రయేసరికి అడవి మధ్య ఇంటికే చేరింది. మూడు ప్రాణులూ ఇదివరకులాగే ముసలివాడు అడగగానే ఆమెకి ఆశ్రయం ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. అమ్మాయికి సంతోషం వేసింది. కోడి పెట్టనీ కోడిపుంజునీ వీపు రాసి ముద్దు చేసి ఆవుని గంగడోలు మీద నిమిరింది. వంటింట్లో ఎప్పటిలాగే బోలెడంత ఆహారం. ఆమె వంట చేస్తూ అనుకుంది ” నా కడుపు నిండితే చాలా ? వాటికీ ఆకలేయదూ పాపం ” దోసిళ్ళనిండా బియ్యపుగింజలు పట్టుకెళ్ళి కోడిపెట్టకీ కోడిపుంజుకీ పెట్టింది. ఆ పక్కనే ఉన్న మోపు విప్పి నుంచి ఆవుకి తాజాగా ఉన్న పచ్చగడ్డి తినిపించింది. అవి తృప్తిగా తిన్నాక వెడల్పాటి పెద్ద గిన్నెలో నీళ్ళు నింపి ఉంచింది. అవన్నీ ముక్కులూ మూతులు ముంచి హాయిగా తాగాయి.
అప్పుడు ముసలివాడూ తనూ కలిసి భోజనం ముగించారు.
” ఎక్కడ పడుకోను ? ” అని అడిగితే మూడు ప్రాణులూ ఒకే గొంతుతో ” మమ్మల్ని బాగా చూసుకున్నావమ్మా. కమ్మగా నిద్రపో ” అన్నాయి.
ఆమె మేడ మీదికి వెళ్ళి పక్కవేసుకుని అర్థరాత్రిదాకా కలత లేకుండా నిద్ర పోయింది. అప్పుడు ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. ఇల్లంతా కూలిపోయేంతగా ఊగిపోయింది. కోళ్ళూ ఆవూ నిద్రలేచి బెదిరిపోయి గోడకేసి తలలు గుద్దుకున్నాయి. కాసే పటికి అంతా సద్దుమణిగింది. అమ్మాయి సర్దుకుని మళ్ళీ నిద్రపోయింది.
ఆమెకి మెలకువ వచ్చేసరికి ఆ గది గొప్ప వైభవంగా కనిపించింది. పాలరాతి గోడలంతా బంగారుపూలు చెక్కి ఉన్నాయి. తను పడుకున్న మంచం వెండితో చేసి ఉంది. మెత్తటి పట్టు దుప్పటి పరచి ఉంది. కిందని ఒక చిన్న పీట మీద ముత్యాలు పొదిగిన చెప్పులు. ఖచ్చితంగా అదంతా కలేననుకుంది తను. చాలా మంచి బట్టలు వేసుకుని ముగ్గురు వచ్చారు ” ఏమి ఆజ్ఞ ? ” అని అడిగారు. ” నాకేమీ వద్దు. వెళ్ళండి, వెళ్ళండి. నేను లేచి వంట చేసి పెద్దాయనకి తినిపించాలి. కోళ్ళకీ ఆవుకీ మేత వేయాలి ” అని హడావిడిగా జవాబు ఇచ్చింది ఆమె.
అంతలో ఇంకో వైపు తలుపు తెరుచుకుని ఒక అందమైన యువకుడు వచ్చి అన్నాడు ” నేనొక రాకుమారుడిని. ఈ అడవి మధ్య ఒక సరస్సూ దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానమూ ఒక ఫెయిరీవి. ఆమె సరదాకి జంతువుల రూపాలను ధరించి తిరుగుతూ ఉండేది. ఇదంతా నాకు అప్పుడు తెలియదు.
ఒక రోజు వేటాడుతూ దూరంగా గడ్డి మేస్తూన్న జింక ను బాణం తో కొట్టబోయాను.నా బాణం తగలకపోగా ఆ జింక ధగ ధగా మెరిసిపోయే అమ్మాయిగా యి ఇలా అంది-
” నువ్వు ఆకలితో, ఆహారం కోసం నన్ను చంపబోలేదు, నేను క్రూరమృగాన్ని కాదు…నీకు ఏ హానీ చేయలేదు, నా చిన్న పొట్టని నింపుకుంటూ ఉన్నాను అంతే ”
నన్నూ నా అనుచరులనూ శపించింది. ముసలివాడుగా అయిపోయాను . అడవిలో నా విశ్రాంతి భవనం ఇది – నువ్వు చూసిన ఇల్లుగా మారిపోయింది. నాతోబాటు ఉన్న ముగ్గురు సేవకులూ శాపం వల్లే కోడిపెట్ట, పుంజు, మచ్చలావు గా నాకు ఇన్ని రోజులూ తోడున్నారు. మనుషులమీద ఉన్నంత దయనీ పశువుల, పక్షుల పట్ల చూపగల అమ్మాయి మాత్రమే మా శాపాన్ని పోగొట్టగలదు. నువ్వే ఆ అమ్మాయివి. మధ్యరాత్రిలో మాకు విముక్తి దొరికింది. నన్ను పెళ్ళి చేసుకుంటావా ? ”
అమ్మాయి ఆనందంగా ఒప్పుకుంది. అంతా రాజధానికి వెళ్ళారు. రాజూ రాణీ కొడుకుని చూసి సంతోషం లో తలమునకలయారు. అతని శాపం విడిపించిన అమ్మాయిని ఆప్యాయంగా చూశారు. సేవకులు వెళ్ళి పిలుచుకొస్తే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నా పెళ్ళి విందుకి వచ్చారు. ” మరి మా అక్కల సంగతి ? ”
” ఇక్కడి పశువులశాలలో, కోళ్ళగూటిలో వాళ్ళు కొన్నాళ్ళు పనిచేయాలి . వాటన్నిటికీ తిండిపెట్టాకే తినాలి. జంతువులకీ ఆకలి వేస్తుందని వాళ్ళకి అర్థం కావాలి కదా . త్వరలో తెలిసివస్తుందిలే. అప్పుడు కనబడదాం ‘’
-జర్మన్ జానపద కథ కి స్వేచ్ఛానువాదం , సేకరణ – Andrew Lang
అనువాదం: మైథిలి అబ్బరాజు
మన చుట్టూ వున్న మనుషుల మీద గౌరవము , శ్రద్ధతో పాటూ మన చుట్టూ ఉన్న పక్షులను , జంతువులను కూడా శ్రద్ధగా చూసుకోవాలి, అదీ మన బాధ్యతే ” అని చిన్న కధ రూపం లో ఇంత అందంగా చెప్పేస్తే ఇక ఎప్పటికీ మరచిపోరు , Very happy to share this story with our near and Dear Mythili Mam ,
థాంక్ యూ రేఖా !
మూగ జీవాల పట్ల కరుణ తో మెలగాలని పిల్లలకు చక్కని సందేశం..కథా..కథనం…బావున్నాయిMythili Abbaraju గారు.
ధన్యవాదాలు పద్మజ గారూ ! మీరు చదువుతూ ఉండటం సంతోషం !!!
chaala Baavundi. Premiste jantuvulu kuda spandistaayi … Ee nijam entamandiki telusu ? Mana chuttu vunde praanula py manam jaali – daya – karuna to paatu premanu kuda panchaalane vishayaanni mee katha chakkaga teliyachestundi.Dhanyavadamulu.
శ్రీనివాస రావు గారూ ధన్యవాదాలండీ
మూగ ప్రాణుల పట్ల దయతో మెలగాలని చెప్పే కథ. మంచి కథ. వీటన్నింటినీ కథల పుస్తకంగా వేయించండి మైథిలి గారూ!
థాంక్ యూ సో మచ్ రాధ గారూ !
భలే ఉన్ దండీ …..పిల్లల కధలంటే నాకు చాలా ఇష్టం …అందుకే THANKS