అనగనగా పర్షియా దేశం లో అబ్దుల్ కరీం అనే పేదవాడు ఉండేవాడు. అతనికి జెబా అనే భార్య, యూసఫ్, ఫాతిమా అని ఇద్దరు పిల్లలు. కొండలమధ్యన ఉన్న లోయలో వాళ్ళ పల్లెటూరు . కొండల మీదంతా చక్కని పళ్ళతోటలు- వాటిలో పీచ్, మల్ బెర్రీ , ద్రాక్ష లాంటి పళ్ళు విరగకాసేవి.
కరీం ఒక ధనవంతు డి పొలం లో పని చేసేవాడు. అతనికీ కుటుంబానికీ సరిపడా తిండీ బట్టా తప్పించి అతనికి డబ్బుగా జీతమేమీ వచ్చేది కాదు.డబ్బు పేరు వినటమేగాని ఎన్నడూ చూసి ఎరగడు.
ఇలా ఉండగా ఒక రోజున యజమాని కి కరీం చేసేపని బాగా నచ్చి పది రియాల్ లు [ వెండి నాణాలు ] అతని చేతికి ఇచ్చాడు. ఎలా కావలిస్తే అలాగ ఖర్చు పెట్టుకోవచ్చని చెప్పాడు.కరీం కి అది చాలా ఎక్కువ డబ్బు అని తోచింది. ఇంటికి వెళుతూనే ఆ నాణాలని భోజనాల బల్ల మీద పరిచి- ” జెబా, చూడు ! నిధి దొరికింది మనకి ” అని సంతోషంగా అరిచాడు. భార్యా పిల్లలూ చాలా మురిసిపోయారు. కరీం వాళ్ళతో అన్నాడు – ” చెప్పండి మరి, వీటితో ఏం చేద్దాం ? మషాద్ నగరం ఇక్కడికి ఇరవై మైళ్ళే కదా, అక్కడి ఇమాం రజా సమాధి మీద రెండు నాణాలు సమర్పించి ఆ తర్వాత బజారుకి వెళతాను. అక్కడ మీకేంకావాలంటే అది కొనుక్కొస్తాను ”
” నాకొక పట్టుతాను కావాలి, కొత్త దుస్తుల కోసం ” – భార్య అడిగింది.
” నాకొక మంచి గుర్రమూ కత్తీ ” యూసఫ్ అడిగాడు. అతను బాగా చిన్నపిల్లవాడు .
” నాకొక కాశ్మీరు శాలువా, జలతారు చెప్పులు ” వయసు వస్తూన్న కూతురు ఫాతిమా అడిగింది.
” ఓ.తప్పకుండా. రేపు రాత్రికల్లా మీరు కోరినవన్నీ వచ్చేస్తాయి ” అని ధీమాగా చెప్పేసి కరీం నగరానికి బయలుదేరాడు.
కొండలు దిగి మైదానం లోంచి నడిచి అతను మషాద్ నగరం చేరాడు. ఆ నగరపు వైభవాన్నీ , ఎత్తైన భవనాలనీ , ధగధగమనే మసీదుల గోపురాలనీ చూసి బోలెడంత ఆశ్చర్యం వేసింది అతనికి. ముందు ఇమాం రజా సమాధి ఉన్న పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు. వాకిట్లో ఉన్న పెద్దాయనని ” నేను లోపలికి వెళ్ళచ్చా ?” అని అడిగాడు. ” అలాగే , వెళ్ళునాయనా ! నీకు ఉన్నదానిలోంచి ఇవ్వగలిగినంత అక్కడ అర్పించు. అల్లా నిన్ను చల్లగా చూస్తాడు ” అని బదులిచ్చాడు ఆయన.కరీం లోపలికి వెళ్ళాడు. ఆసియా ఖండం మొత్తం నుంచీ అక్కడికి భక్తులు వస్తుంటారు. వాళ్ళు ఇచ్చిన కానుకలతో ఆ క్షేత్రం కళకళలాడుతూ ఉంటుంది. బంగారు, వెండి నగలూ పాత్రలూ ఖరీదైన తివాసీలూ కుప్పలు పోసి ఉన్నాయి అక్కడ. కరీం అవన్నీ నోరు తెరుచుకుని చూసి, రెండు వెండి నాణాలని బెరుకు బెరుకుగా సమాధి మీద ఉంచి వెనక్కి తిరిగాడు. ఇప్పుడు అతని దగ్గర ఎనిమిది నాణాలు మటుకే ఉన్నాయి.
చాలా రద్దీగా, హడావిడిగా ఉన్నాయి అక్కడి బజార్లు. ఒక్కొక్క వస్తువు అమ్మేందుకుఒక ప్రత్యేకమైన బజారు ఉంది. పళ్ళకి ఒకటి, పాత్రలకి ఒకటి, నగలకి ఒకటి, రొట్టెలకి ఒకటి – ఇలాగ. అన్నీ దాటుకుని చివరికి పట్టు వస్త్రాలు అమ్మే చోటికి వచ్చాడు.
ఒక దుకాణం లో ప్రవేశించి అవీ ఇవీ తిరగేసి ఆఖర్న జరీ పని చేసిన వంగపండు రంగు పట్టు తానుని ఎంచుకున్నాడు. ” ఇది తీసుకుంటాను, వెల ఎంత ? ” అని దుకాణదారుని అడిగాడు.
” మామూలుగా నాలుగు వందల వెండినాణాలు అండీ. మీరు కొత్తగా ఇక్కడ అడుగుపెట్టారు కనుక మీకు రెండువందలకే ఇస్తాను, తీసుకోండి ” దుకాణం అతను చెప్పాడు.
” ఏమిటీ, రెండు వందలా? మీరేదో పొరబడినట్లున్నారు. చూడండి- ఇటువంటి నాణాలేనా, రెండు వందలు ? ” తన దగ్గర ఉన్న రియాల్ ని చూపించి అడిగాడు కరీం.
” ఆ, కాక ఇంకేమిటనుకుంటున్నారు ? రెండువందలు దీనికి చాలా సరసమైన ధర ” అని దుకాణం అతను జవాబు ఇచ్చాడు. కరీం దగ్గర ఎనిమిది నాణాలే ఉన్నాయనీ వాటితోనే అతను పట్టు తానూ కత్తీ గుర్రమూ కాశ్మీరు శాలువా జరీచెప్పులూ అన్నిటినీ కొనదలచుకున్నాడనీ విని కరీం ని బయటికి గెంటాడు. ” అడ్డమైన ప్రతివాడూ వచ్చి నా పట్టు తానులు ముట్టుకునేవాడే ” అని తిట్టాడు.
నిరాశ తో ఈసారి గుర్రాలు అమ్మే చోటికి వెళ్ళాడు కరీం. బాగా చవకైన గుర్రానికి రెండువందల యాభై నాణాలు ఇవ్వాలని తెలిసింది. కరీం దగ్గర ఉన్న డబ్బు ఎంతో విన్న అక్కడివాళ్ళు దానికి గాడిదలో పదహారోవంతు కూడా రాదని వెక్కిరించారు. కత్తి ధర కనీసం ముప్ఫై నాణాలు, జరీ చెప్పులది యాభై , కాశ్మీరు శాలువాలలో బాగా నాసిరకం దానికి పన్నెండు నాణాలు చెల్లించాలి.
దేన్నీ కొనలేనన్న బాధతో, అలసటగా , కరీం ఊరికి ప్రయాణం అయాడు. దారిలో ఒక బిచ్చగాడు ఎదురై ” అయ్యా, ధర్మం చేయండి. రేపు శుక్ర వారం, పవిత్రమైన రోజు. బీదవాడికి ఇస్తే భగవంతుడికి ఇచ్చినట్లే, అల్లా మీకు వందరెట్లు వెనక్కి ఇస్తాడు ” అని అడుక్కుంటున్నాడు.
కరీం కి ఆపాటికి డబ్బు మీద విసుగుపుట్టి ఉంది. ” నా దగ్గర ఉన్నదాంతో తృప్తి పడగలవాడివి నువ్వొక్కడివే ” అని బిచ్చగాడితో అంటూ తన ఎనిమిది నాణాలనీ అతనికి ఇచ్చే సి వట్టి చేతులతో వెనక్కి వెళ్ళాడు
వాళ్ళ ఇంటి ముంగిట్లోనే ఎదురు చూస్తూ ఉన్న కొడుకు యూసఫ్ పరిగెత్తుకుంటూ వచ్చి ” నాన్నా, కత్తీ గుర్రమూ ఏవీ ? ” అని అడిగాడు. ఆ వెంటనే వచ్చిన భార్యా కూతురూ కూడా తమ వస్తువుల కోసం అడిగారు. అంతా విన్నాక భార్య జెబా మండిపడింది. ఎనిమిది నాణాలు బిచ్చగాడికి ఇచ్చాడని యజమానికి ఫిర్యాదు చేసింది.
యజమానికీ చాలా కోపం వచ్చింది. కరీం ని పిలిచి తెగ చీవాట్లు పెట్టాడు. ” నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావోయ్ ? పెద్ద జమీందారువా నువ్వు ? బిచ్చగాడికి నేనే ఒక్క రాగినాణెం ఇస్తుంటాను , నువ్వు ఎనిమిది వెండినాణాలు ఇవ్వవచ్చావా ? ” అని కోప్పడి, శిక్షగా అక్కడికి కొంతదూరం లో ఉన్న ఎడారికి పొమ్మన్నాడు. అందులో యజమానికి కొంత భూమి ఉంది . అక్కడ మండుటెండలో పనిచేసి , నీళ్ళు పడేదాకా తవ్వి అప్పుడు తిరిగి రమ్మన్నాడు.
కరీం అలాగే వెళ్ళి రోజులతరబడి తవ్వుతూ పోయాడు. చివరికి నీరు పడింది, దాంతోబాటు ఒక ఇత్తడి బిందె కూడా దొరికింది. దాని మీదంతా నగిషీలు చెక్కి ఉన్నాయి. నిండుగా వజ్రాలూ వైఢూర్యాలూ. అవేమిటో కరీం కి తెలియలేదు. కాని మషాద్ నగరపు బజార్లలో అటువంటివి అమ్మటం చూసిఉన్నాడు. వీలు కుదరగానే వెళ్ళి తనూ అమ్మగలిగితే కాస్త డబ్బు వచ్చి భార్య కోపం తగ్గుతుందని అనుకున్నాడు.
ఎడారిలో నీరు పడటం వల్ల యజమానికి ఆనందం కలిగింది. కరీం కష్టానికి జాలిపడి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమన్నాడు. మరుసటిరోజు కరీం జేబునిండా వజ్రాలు నింపుకుని నగరానికి వెళ్ళాడు. ఒక నగలదుకాణం లో అద్దాల కిటికీ లో అటువంటి రాళ్ళు ఉండటం గమనించి వెళ్ళి దుకాణదారుని అడిగాడు ” ఇటువంటి రాళ్ళు అమ్మితే కొంటారా ? ”
కరీం ని చూస్తే వజ్రాలు అమ్మగలిగేవాడు గా కనిపించలేదు. దుకాణం అతను వెటకారంగా ” ఏం ఉన్నాయేమిటి నీ దగ్గర ? ” అన్నాడు.
” ఇదిగో ” అని ఒకటి చూపించాడు కరీం. ” నా జేబునిండా ఉన్నాయి తెలుసా ” అనీ చెప్పేశాడు.
దుకాణం అతను ఆశ్చర్యపోయాడు. కరీం వాటిని దొంగిలించి ఉంటాడని నిర్ణయించుకుని అతన్ని మాటల్లో పెట్టి , నౌకరుతో రక్షక భటులకి కబురు చేశాడు. వాళ్ళు అడిగితే కరీం అంతా చెప్పుకొచ్చాడు. భూమిలో దొరికిన సొత్తు ఏదైనా సుల్తాన్ కి చెందుతుంది కనుక కరీం మీద నేరాన్ని మోపి అతన్నీ కుటుంబాన్నీ చెరలో పెట్టి ఇత్తడిబిందెను స్వాధీనం చేసుకుని ఖజానాకి పంపారు. కరీం కి ఆ బిందె సుల్తాన్ ది అవుతుందనే సంగతి తెలియదు.
ఇదంతా జరిగిపోవటం సుల్తాన్ వరకూ వెళ్ళలేదు. కాని అతనికి ఒకే కల పదే పదే రావటం మొదలైంది. కలలో ఒక గొంతు ” అల్లా స్నేహితుడిని విడిపించు ” అంటూ ఉంది. ముందు పట్టించుకోకపోయినా, ఒక రాత్రి కలలోనే సుల్తాన్ ఎవరినని అడిగాడు. ఎంతో పేదవాడై ఉండీ తనకున్నదానిలో అయిదోవంతు ను పుణ్యక్షేత్రానికీ మిగిలినది బిచ్చగాడికీ ఇచ్చేసిన కరీం అల్లా కి స్నేహితుడని ఆ గొంతు చెప్పింది. అతన్ని చెరలో పెట్టిన వివరం కూడా రాజుకి తెలియజేసింది.
తెల్లవారుతూనే సుల్తాన్ ఆఘమేఘాల మీద చెరసాలకి వెళ్ళాడు. కరీం ని కలుసుకుని అతని సంకెళ్ళు తన చేతులతో స్వయంగా విడిపించాడు. కరీం చెంపల మీద కన్నీళ్ళు కారిపోతూ, ” నన్ను బంధించండి, వాళ్ళని విడిపించండి. వాళ్ళకి ఏ పాపమూ తెలియదు ” అని భార్యనీ పిల్లలనీ చూపించి వేడుకున్నాడు. ” అందరినీ విడిపిస్తాను ” అని సుల్తా న్ ధైర్యం చెప్పాడు. ” మీరంతా రాజభవనం లో భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. నాకు అల్లా పంపిన అతిథులు మీరు ” అని వాళ్ళని గౌరవించి ఆ ఇత్తడిబిందెలో దొరికిన వజ్రాల విలువ మొత్తమూ వెండినాణాలుగా కరీం కి ఇచ్చాడు. వాటిని ఎలా ఉపయోగించాలో కరీం కి ఇప్పుడు తెలుసు గనుక యూసఫ్ తో కలిసి బజారుకి వెళ్ళి ఇదివరకు కొనలేనివన్నీ ఇప్పుడు భార్యకీ పిల్లలకీ కొనిపెట్టాడు. తక్కినదానితో ఏం చేయాలో అతని ఊహకి అందలేదు. భార్య జెబా ఆ బాధ్యత తీసుకుని యజమాని సాయం తో వాళ్ళ ఊర్లో చాలా పొలం కొని, మంచి ఇల్లు కట్టింది. కరీం బీదవాళ్ళకి దానం చేస్తూ ఉండేందుకూ , మసీదులో ఇచ్చుకునేందుకూ అతని జేబులో రోజూ కొన్ని నాణాలు పెట్టేది .
అలా తను ధర్మం చేసినది ఎన్నో వందలరెట్లుగా తిరిగి వచ్చింది. అయితే అదేమీ కరీం మనసుకి పట్టలేదు. భార్యా పిల్లలూ సంతోషంగా ఉండటం అతనికీ సంతోషాన్ని ఇచ్చింది.
- పర్షియన్ జానపదకథ
మీ కలానికి ఒక సొంత భాష వుంది మైథిలీ Mam , అందులో మంచిని మాత్రమే పరిమళించే ఒక సౌరభామూ వుంది , అది పసి పిల్లలకు అందేంత ఎత్తులో వున్న ఆకాశం లాంటిది . ఈ కధ చాలా చాలా నచ్చింది . తప్పక చదివిన వారి మనసులో , సరళంగా సౌమ్యంగా ఒక మంచి ముద్ర అవుతుంది ! థాంక్యూ Mam
ధన్యవాదాలు రేఖా
Namasthe madam . Chakkani katha . Devuni nammi, beedala Patla vudaarathayho vunde ni swaartha jeevi ki devude sahaayam chethaadane nammakaaniki mallee jeevam poosina katha. Saralamgaa andinchinanduku dhanyavaadaalu… Rajendra Prasad M
ధన్యవాదాలు రాజేంద్ర ప్రసాద్ గారూ
ఎత్తుగడ,ముగింపు…పిల్లలకు అందేభాష.. చక్కనివర్ణనలు..ఇంకేమికావాలి? కథనుసజీవంగా నిలపడానికి… మంచికథను అందించినదుకు క్రుతజ్ఞతలు….
చాలా సంతోషం ఆనంద్ గారూ
చక్కని కథని అందించినదుకు ధన్యవాదాలు మైధిలి గారూ.. మా పిల్లలకి మంచి కథలు వెదికే శ్రమ లేకుండానే దొరుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
అంతకన్నా నాకు ఇంకేం కావాలి మాధవి గారూ.. ధన్యవాదాలు